టంటంట టంటంట టటంట టంటం
https://cherukurammohan.blogspot.com/2016/07/blog-post_74.html
ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా "టంటంట టంటంట టటంట టంటం' అని
కూనిరాగం తీస్తూ సభకు వచ్చినాడట. మంత్రి కేమీ అర్థం కాలేదు రాజా! కవులను కావ్య
గానం చేయమన్నారా?లేక మీరేదయినా సమస్య యిస్తారా? అని అడిగినాడు. రాజు
నవ్వుతూ ఇదే సమస్య "టంటంట టంటంట టటంట టంటం" దీన్ని ఆధారంగా
చేసుకొని మిగతా మూడు పాదాలూ పూరించాలి. సభలో దండి,భవభూతి తో సహా
అందరు కవులూ రాజు కేమైనా పిచ్చి పట్టిందా అని నివ్వెర పోయి చూస్తున్నారు ఒక్క
కాళీదాసు తప్ప. కాళిదాసు మాత్రం ముఖం లో ఏ భావమూ చూపకుండా
కూర్చున్నాడట. రాజు మహాకవీ మీరు కూడా నాకు మతి పోయిందనుకుంటున్నారా?
అని అడిగినాడు. అంత ధైర్యం నాకు లేదు ప్రభూ!సమస్య యింకో మారు వివరించండి
అన్నాడు. కుమార సంభవ కావ్యం లో మీరు రాసిన 'అస్తుత్తరస్యాం దిశి
దేవాతాత్మా"అన్నట్లు యింద్రవజ్ర వృత్తములోని పాదం యిది. ఈ వృత్తం మీకు కొట్టిన
పిండే కదా పూరించండి.అన్నాడు. వెంటనే కాళిదాసు అయిదు క్షణాలు కళ్ళు
మూసుకొని యిలా చెప్పాడు.
'రాజ్యాభిషేకే మద విహ్వాలయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘటః యువత్యాః
సోపాన మార్గేషు కరోతి శబ్దం
టంటంట టంటంట టటంట టంటం"
రాజు ఆశ్చర్యం తో అలా చూస్తూండి పోయాడు. అలా చూస్తారేమి మహారాజా!అర్థం
సులభమే కదా!నేను సభకు అర్థం వివరిస్తాను. రాజు గారికి పరిచారికలు స్నాన ఘట్టం
లో స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మై
మరిచి పోయింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పోయి స్నానఘట్టం మీదు గా
దొర్లుతూ మీరు
చెప్పినట్టు 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది.
మహా కవీ! మీరు ఉదయం స్నాన ఘట్టం దగ్గర
లేరు కదా!మీరెలా చెప్ప గలిగారు?
నేను మీ ఉల్లాసాన్ని,ఉత్సాహాన్నీ చూసి ఊహించి చిన్న శ్లోకం చెప్పినాను. అన్నాడు
కాళిదాసు. భోజ రాజు సింహాసనం మీది నుంచి లేచి వచ్చి కాళిదాసును కౌగలించుకొని అక్షరలక్ష లిచ్చిగౌరవించినాడు.
అందుకే కాళిదాసును మహాకవి అన్నారు. .
.
స్వస్తి.
No comments:
Post a Comment