కాదేదీ కవితకనర్హం
Posted on 29th July 2016 00.55 Pacific Daylight Time
Posted on 29th July 2016 00.55 Pacific Daylight Time
Blog ఏర్పరచుకొన్న పిదప ఇచ్చట చేర్చుట జరిగినది.
'కాదేదీ కవిత కనర్హం' అని అభ్యుదయ కవిత్వమున
అగ్రగణ్యుడైన మహా కవి శ్రీశ్రీ ఏ ఆలోచనతోఏముహూర్తమున అన్నారో కానీ నేడు ఆ మాట
అక్షర సత్యము. వారు ఆమాట అనకుండా వుండియుంటే నాలాంటివారు పలువిధములైన ఉత్త,చెత్త,లోత్త కవితలు ప్రచురించే ధైర్యము
చేసియుండేవారు కాదేమో. వారు ఏ కవితా వస్తువునైనా రసమయము చేసి రసనపై రాసలీల
జరిపించగల దిట్ట. నా లాంటి వారికి ఆయనతో సామ్యమెట్ట. వారి కవితలలో కథావస్తువు
క్రొత్తదైనా అందులో పరిశీలన,రసము,శయ్య,
భావము, అలంకారము, అనుప్రాసము,
పాండితీ ధిషణ అడుగడుగునా అణువణువునా కనిపించుతుంది. మరి నాలాంటి
వారిలోనో? వారికన్నా ఒక అడుగు ముందుకు వేసిన 'దేవరకొండ బాల గంగాధర తిలక్, గారి కవితలు వచన
కవితలేయైనా రసపుష్టి కలిగినవని పండితులు పదేపదే చెబుతూ వుంటారు. మరి నాలాంటి
వారిలో అది ఎక్కడ.
నన్నయ, తిక్కన ఆదిగా గల కవులందరూ వాల్మీకి,వ్యాస,కాళిదాసాది మహా కవులకు మ్రొక్కక తమ రచనలు
ప్రారంభిచలేదు. వారి తదుపరి వచ్చిన తెలుగు కవులు అటు సంస్కృత కవులను ఇటు నన్నయాది
కవులను మనసారా తలంచక తమ కవిత్వ మహత్వ పటుత్వ సంపదలను మనకు పంచి పెట్టలేదు. మరి
నాలాంటి వారికో అవి తలచే అర్హత కూడా మృగ్యమే! మరియా అనర్ఘ సంపద ఏమికావలె? చెదపురుగుల కాహారమేనా ! ఒకానొక కాలములో కవిత్వము వ్రాయుటకు భయముగా వుండేది,
గురువుల ఎదుట సిగరెట్టూ అంటించనట్లు . మరినేడో గురువు శిష్యుడు
కలిసే కానిస్తున్నారు. శ్రీనాథుడు ఒక సందర్భములో అంటాడు :
బూడిద బుంగలై యొడలు పోడిమి తగ్గి మొగంబు తెల్లనై
వాడల వాడాలన్ దిరిగి వారును వీరును చొచ్చొచో యనన్
గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో
'గాడిద'నీవునున్ కావివి కావుకదా యనుమాన మయ్యెడిన్
అని అనగలిగినాడు. మరి వాక్స్వాతంత్ర్యము , భావ
స్వాతంత్ర్యము ,వ్యక్తీ స్వాతంత్ర్యము కలిగిన మనలను నేడు
అనగలడా!
అల్లసాని పెద్దన యంతటి వాడిని
'ఉమెతక్కయ తిని సెపితో
క్రమమెరుగక ఎర్రి పుచ్చ కయ తిని సెపితో
ఎమి తిని సెపితో కపితము
అమవస నిసి యనుచు నువ్వు అలసని పెదనా!
యని ధిక్కరించినాడు తెనాలి రామకృష్ణుడు. మరి నేడో?
ఇదే తెనాలి రామకృష్ణుడు ప్రెగ్గడ నరసరాయలన్న కవి, పెద్దలైన
'పెద్దన' లాంటి వారిని నిరసించితే 'భావ్య మెరుంగక పెద్దలైన వారల నిరసింతువాప్రగడరాణ్ణరసా విరసా తుసా భుసా'
అని అతనిని నిర్దాక్షిణ్యముగా తూలనాదినాడు. పెద్దలను నిరసించకూడదు
అన్న మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినాడు. చూచినారా నవ్వులాట వేరు గౌరవ
మర్యాదలు వేరు. ఇప్పటి కవితలలో ఇంతటి నిర్దుష్ఠత కనగలమా! ఏ దిగంబర కవులలోనో నగ్న
కవులలోనో విప్లవ కవులలోను కనగలమంటే, వారి కవితలనేమాత్రము
మనము గుర్తుంచుకో గలిగినాము. సాంప్రదాయానికి పెద్దపీట వేసి వ్రాసిన వేటూరి,
సీతారామ శాస్త్రి లాంటి సినిమా కవుల గీత రచనలలోని పదములు అన్నీ
తెలియక పోయినా వింటూ ఎంతనో అనందించుతాము.
ఇది ,భాష గొప్పదనము అన్న పుష్పమునకు, వారి భావము, పదముల కూర్పు, అన్న
రంగు సువాసన కూర్చినట్లైనది కదా! పింగళి నాగేంద్రరావు గారు సినిమాలకు మాటలు పాటలు
వ్రాసే కాలములోఎన్నోతెలుగు పదాలు తేర మీదికి తెచ్చినారు . అందులో 'హల' అన్న పదము ఒకటి. జగదేకవీరుని కథలోని 'జలకాలాటలలో'అన్న పాటలో 'ఏమి
హాయిలే హల' అన్న ప్రయోగము ఆపాటను ఎంత ప్రసిద్ధి చెంద జేసిందో
ఆతరము వారికెవరికైనా ఇప్పటికీ మరచి పోలేని విషయమే. అది కవిత్వమంటే.
మాకు ముందు తరములోని పెద్దలు వాడుక భాష పేరుతో పర్వత శిఖరాగ్రమున
వుండే భాషకు పతన మార్గము చూపించి చరిత్రలో మార్పుకు మార్గదర్శకులుగా, భాషను
అప్రతిష్ఠ పాలు చేసినా, తమ ప్రతిష్ఠను పదిలం చేసుకొన్నారు
కొందరు లబ్ధ ప్రతిష్ఠులు. భాష మీద పట్టులేకుండా కవితలలో భావ ప్రకటన సాధ్యమా. కవిత
తమలపాకు లాంటిది. దానికి తడి తగులుతూ ఉంటేనే తన పచ్చదనమును కోలుపోక తాంబూలమునకు
రాసిక్యత చేకూర్చుతుంది. చెమ్మ లేకుంటే అప్పుడు కూడా అది తమలపాకే అవుతుంది కానీ
తాంబూలానికి పనికి రాదు. నాకు ఇక్కడ ఒక జానపదుల సామెత గుర్తుకొస్తూవుంది. అది
ఏమిటంటే 'ఇహము పరము లేని మొగుడు ఇంటినిండా-రుచిపచి లేని కూర
చట్టి నిండా.' నాలాంటివారి కవితలకు ఈ సామెత సరిగా
సరిపోతుందేమో! ఒక రవివర్మ చిత్తరువు మనవద్ద వుంటే దానిని పదిలంగా ఒక చట్రము లో
బింగించితే ఆ చిత్రమునకే కాక దానిని తగిలించిన గోడకు గోడ కలిగిన ఇంటికి కూడా
అందమొస్తుంది. ఇది నిజమా కాదా అన్నది ఒక్కసారి మనము మనసుపెట్టి యోచించితే మనకే
అవగతమౌతుంది. ఇంకొక ముఖ్యమైన విషయము తన 'మాళవికాగ్నిమిత్రము'
అన్న నాటకములో కాళిదాసు ఈ
మాట చెబుతాడు : 'పురాణమిత్యేవ నసాదు సర్వం నచాపికావ్యం
నవమిత్య వాదం' దాని అర్థము 'పాత రోతా
కాదు కొత్త చెత్త కాదు.' ఎంత గొప్ప మాటో చూడండి . పాత రచనలలో
తలలోనికి దూరనివి కొత్త రచనలలో తలపులకే రానివి కోకొల్లలు. వీనిని 'అజగళస్థనము లంటారు.' మేక గొంతుక్రింద చన్నులనుండి
పాలు రావు కదా! అంటే వుండీ వుపయోగములేనివి అని అర్థము.
వాల్మీకి కవి, వ్యాసుడు కవి, కాళీదాసు కవి అంతకు మించిన విశేషణముల
నేవీ వారు తగిలించుకోలేదు. మరి నేడో 'సరస కవి' 'విప్లవకవి' 'భావకవి' 'ప్రేమ
కవి' 'దిగంబర కవి' ఇవికాక
అనేకానేకములైన బిరుదములు. అసలు 'కవి యను నామంబు నీరుకాకికి
లేదే' అని తెనాలి రామకృష్ణ కవి ఈవిధముగా కుండను బద్దలు కొట్టినాడు.
కవి అల్లసాని పెద్దన
కవి తిక్కన సోమయాజి గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ
కవి యను నామంబు నీటి కాకికి లేదే
చెప్పుకోదగిన కవులు అంటే
తిక్కన సోమయాజి మరియు అల్లసాని పెద్దన. రామకృష్ణుడయిన నేను కూడ కవినే! కవి అనే పదానికి
నీటి కాకి అనే అర్థం కూడ ఒకటి ఉన్నది కదా! (క = నీరు, వి =
పక్షి, కవి = నీటిపక్షి- ఏకాక్షర నిఘంటువు) కవి అనే మాట
వాడుకలో ఉన్నంత మాత్రాన నేను వారిద్దరితో సమానుణ్ని కాలేను అని . రామకృష్ణుడు
కొంటెవాడే కాకుండా ఎంతటి వినయ శీలుడో చూడండి. నేడు అంత సులభముగా మనము నిర్భయముగా
నిగర్వముగా చెప్పుకోగలమా!
అదే వాల్మీకి మహర్షిని వారి తరువాతి కవులు ఎన్నివిధములుగా
పొగిడినారో గమనించండి.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరంl
ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కొకిలంll
రామాయణ కల్పవృక్ష కవితా శాఖల పై వాల్మీకి అన్న కోకిల కూర్చొని 'రామ'
రామ' యని కూయు చున్నది .వాల్మీకి ముని సింహస్య
కవితా వన చారిణాl
శ్రుణ్వన్ రామ కథా నాదం కొనయాతి పరాం గతింll
కవన వనములో వాల్మీకి ముని సింహము 'రామ' 'రామ' యని గర్జించుతూ వుంటే విన్నవారు కైవల్యమును
గాంచక ఎట్లుండగలరు.
యాపిబన్ రామ చరితామృత సాగరం
ఆరుతస్తం మునిం వందే ప్రాచేతాస మకల్మషం
రామ చరితామృత సాగరాన్ని సంతృప్తి అన్న మాటను ఆపేక్షించక ఆసాంతము
త్రాగుచుండే మహనీయుడు కల్మషము అన్న పుట్టలోనుండి నిష్కల్మషుడైన వ్యక్తీ
ప్రాచేతసుడు. ప్రచేతసుడంటే వరుణుడు. వరుణుని దయా వర్షముచే పునీతుడైనాడు కావున ఆయన
ప్రాచేతసుడైనాడు.
వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామినిl
పునాతు భువనం పుణ్యా రామాయణ మహానదిl
వాల్మీకి యన్న పర్వతము పై జనియించి రామ సాగరము లో చేరు ఈ నదీ
ప్రవాహము తాను ప్రవహించే ప్రాంతము నంతా పుణ్యభూమిని చేయుచున్నది.
ఒక మహనీయుని గొప్పతనమును ఎన్నివిధముల పొగడవచ్చునో గమనించండి.
ఇందులో ఎవరి స్వార్థము స్వలాభాములు లేవు.
ఇక వేదవ్యాసులవారు. తాను వ్రాసిన మహా భారతమునుగూర్చి ఒకే ఒక్క
ముక్కతో దాని గొప్పదనాన్ని మనకు తెలియ జేసినాడు. 'యది హస్తి తదన్యత్ర
యన్నేహాస్తి నతత్కచిత్' ఇందులో వుండేది వేరే ఏభాషలోని ఏ
గ్రంథముము లోనైనా వుండవచ్చునుగానీ ఇందులోలేనిది ఎక్కడా వుండదు. ఇంచుమించు 125
ప్రముఖ పాత్రలు కలిగి అనేకానేకములైన ఆఖ్యాన ఉపాఖ్యానములు కలిగిన ఈ ఇతిహాసకావ్యము
హోమర్ వ్రాసినట్లు చెప్పబడే ఈలియాడ్, ఒడెస్సిల కన్నా నిడివి
లో 10 రెట్లు పెద్దదని తెలియు చున్నది.ఇది సాధారణమానవులకు సాధ్యమా! వేదాలు
విభజించి పురాణాలు ప్రచురించిన విష్ణ్వంశ సంభూతుడు.
ఇక కాళీ దాసును గూర్చి యొక్క మాట :
పురాకవిత్వా గణనప్రసంగే అధిష్టికాదిష్టిత కాళిదాసాl
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవll
కాళిదాసు మొదలు పురాతన కవులలో పేరెన్నిక గన్న వారిని చిటికెన
వ్రేలితో ఎన్న ప్రారంభించగా తరువాత ఎంచుటకు ఎవరూ దొరకలేదు. అందుకే ఆ వ్రేలికి 'అనామిక'
మనే పేరు సార్థకమైనది. మరి ఇది నిజమే కదా! ఇది నిజమైతే వారి పేరు
మసకబారకుండా ఉంచవలసిన బాధ్యత మనపైన లేదా! నిజాము చెప్పవలేనస్న్తే ఈరోజు మనము
వానిని తాకే యోగ్యత కూడా పోగొట్టుకొన్నాము.
అసలింకొక చిన్న విషయము. పండిత ప్రపంచములో నాచన సోమనాథుని తిక్కనకు
పోల్చదగినవాడని చెబుతూ వుంటారు. ఆయన వ్రాసిన ఉత్తర హరివంశములోని 'నరకాసుర
వధ' ఘట్టములోని అనేక పద్యముల భావము పోకడ మరియు నడకను 'పోతన' వంటి గొప్ప కవియే పూర్తిగా అనుకరించినాడు లేక అనుసరించినాడు. ఆయన
గొప్పదనము పాఠకులకు తెలియజేయ ఈ క్రింది పద్యమును భావ సహితముగా ప్రకటించున్నాను:
ఇది శ్రీ కృష్ణుడు శివుని స్థుతించే పద్యము. ఇక్కడ శివుడు పారిజాత'వృక్షము'
తో పోల్పబడినాడు.
కుజము కుంజరముచే కూలునో కూలదో
కూలు,కుంజరమునీ కుజము గూల్చె
మాను పేరేటిచే మడుగునో మడుగదో
మడుగు,పేరేటినీ మాను మడచె
గాలునో యొకనిచే గాలదో సాలంబు
గాలు, నీ సాలంబు గాల్చె నొకని
దునియునో పరశు చే దునియదో వృక్షంబు
తునియు, నీ వృక్షంబు తునిమె బరశు
ననుచు దమలోన చర్చించు నమరవరుల
కభిమతార్థ పదార్థమై యందవచ్చు
పారిజాతమ్ము నా మ్రోల పండియుండ
నందగంటిని కోర్కుల నందగంటి
పద్యము చదివినవెంతనే కవి హృదయము మనకు బోధ పడదు. వాక్య నిర్మాణము
లోనూ భావ ప్రకటనలోనూ అంటే చెప్పేతీరు లోనూ వైవిధ్యమే ఇందుకు కారణం . దీనిని
పండితులు 'వక్రత' లేక 'వక్రగతి'అంటారని విన్నాను. చెట్టును ఏనుగు కూల్చుతుంది కానీ ఇక్కడ చెట్టు (పారిజాత
వృక్షము తో పోల్పబ్డిన శివుడు) ఏనుగును, గజాసురుని, కూల్చింది.చెట్టు పెద్ద ఏరు వల్ల వంగిపోతుంది . ఇక్కడచెట్టు, శివుని శరీరము, గంగను వంచింది. చెట్టును ఎవరైనా
కాల్చితే కాలి పోతుంది . ఇక్కడ చెట్టు, కాల్చేవానినే అంటే
మన్మధునే కాల్చివేసింది.చెట్టు గోడ్డలిచే నరక బడుతుంది. ఇక్కడ చెట్టు, అంటే శివుడు గొడ్డలినే (దక్షయజ్ఞము లో శివుడు విష్ణువు యొక్క పరుశువును
ద్రుంచుతాడు)ద్రుంచుతాడు.అటువంటి, దేవతలకిష్టమౌ పారిజాత
వృక్షాన్ని అందుకొని తన కోర్కెను తీర్చుకొంటున్నాడు కృష్ణుడు. సోమనాథుని
వేదసాస్త్రపురాణేతిహాస ప్రతిభ ,కవితాచమత్కృతి, వక్రగతిన పద్యము చెప్పిన తీరు గమనించండి. నాడు కవిత్వమంత నిర్దుష్టంగా
వుండేది.
ఒకమాట ఆధునిక కవితానర్ఘ రత్నాలను గూర్చి కాస్త చెప్పుకొందాము. ఇందు
పద్య సాంప్రదాయమును గూర్చి నేను వ్రాయబోవుట లేదు. గడియారం, విశ్వనాథ,రాయప్రోలు, జాషువ,కరుణశ్రీ ఇలా
వ్రాస్తూ పొతే చాలా పెద్ద పట్టిక తయారౌతుంది. నేను ఇందు మాత్రా ఛందస్సు నుపయోగించి
సనాతనత్వమును విడువని రెండు కవితలు, అదునాతనము తో కూడి
మాత్రా ఛందస్సు తో రమ్యముగా వ్రాసిన ఒక కవితా శకలము, 1971లో
సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఒక ఆధునిక కవిత ఉటంకించుచున్నాను.
మొదటిది పుట్టపర్తి నారాయణాచార్లు వారు వ్రాసిన 'శివ
తాండవము' లోనిది.
తమ్ములై,ఘటితమోదమ్ములై,సుకృత రూ
పమ్ములై,శాస్త్ర భాగ్యమ్ములై,నవకోర
కమ్ములై ,వికచ పుష్పమ్ములై ,తుమ్మెదల,
తమ్ములై,భావ మంద్రమ్ములై,హావపు
ల్లమ్ములై,నూత్న రత్నమ్ములై,వెల్గు హా
సమ్ములై, కన్గొనల సోమ్ములై,విశ్రాంతి
దమ్ములై, రక్త కిసలమ్ములై,రక్తి చి
హ్నమ్ములైన్తంద్ర గమనమ్ములై,గెడగూడి
కులుకు నీలపు గండ్ల తళుకు జూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ
ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు
ఇందులో మనకు ఒకవేళ ప్రతి పదమూ అర్థము కాకున్నా ఆ పద సౌందర్యము
మనలను ఆసాంతము చదివించుటేగాక శివతాండవము కనులకు కనిపింపజేస్తుంది.
రెండవది వెంకట పార్వతీశ్వర కవులు వ్రాసిన 'ఏకాంత
సేవ' లోనిది :
పుష్పనికుంజ ప్రభూత హాసంబు
సౌరభాపూర్ణ ప్రసన్న హాసంబు
మందాకినీ మృదు మధుర హాసంబు
రాకానిశాకర రమ్య హాసంబు
తారకాకోరక తరళ హాసంబు
విద్యుల్లతా ప్రభా విమల హాసంబు
మద్ర మోహన మూర్తి మందహాసమున
అద్భుతంముగా లీనమైనట్టులుండ...
చూడండి ఎన్ని విధములైన హాసమ్ములో! చదువుతూ వుంటే మనసుకు ఎంత హాయో !
ఇక మూడవది శ్రీ శ్రీ గారి 'మహా ప్రస్థానం' లోని 'జ్వాలా తోరణము' లోనిది:
జాతి జాతి నిర్ఘాత పాత సం
ఘాత హేతువై , కాలకేతువై
అదె సంవర్తపు తుఫాను మేఘం
తొలి గర్జించిన తూర్య విరావం
ప్రదీప్త కీలా ప్రవాళ మాలా
ప్రపంచవేలా ప్రసారములలో
మిహిర వాజితతి ముఖవ ధనుర్ద్యుతి
పుడమికి నేడే పుట్టిన రోజట
ఆ కవిత సాగిన తీరు చూడండి. మరి ఇందులో కఠిన పదములు లేవా! అట్లని
చదువ నారంభించితే వదలబుద్ధవుతుందా! అది శ్రీశ్రీ గారి గొప్పదనము, చలం
గారు శ్రీశ్రీ గారిని గూర్చి ఒకమాట చెప్పినారు. "కృష్ణ శాస్త్రి తన బాధ
లోకానికి పంచితే, శ్రీ శ్రీ లోకంలోని బాధనంతా తాను
తీసుకొంటాడు." ఎంతటి గోప్పమాటో చూడండి.
ఇక దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు వ్రాసిన 'అమృతం
కురిసిన రాత్రి' అన్న వచన కవిత నుండి 'మన
సంస్కృతి' యన్న ఒక ఖండికలోని కొన్ని పాదములు:
మాధుర్యం,సౌందర్యం,కవితా
మాధ్వీక చషకంలోరంగరించి పంచిపెట్టిన
ప్రాచేతాస కాళిదాస కవిసమ్రాట్టులనీ,
వ్యూహా వ్యుహోత్కర భేద నచణ
ఉపనిషదర్థ మహోదధి నిహిత మహిత రత్న రాసుల్నీ
పోగొట్టుకొనే బుద్ధి హీనుడెవరు?
ఇందులో కఠిన పదాలు లేవా? భావము ఎంత గంభీరమైనదో చూడండి. వారిది
సాధారణమైన కవిత కాదు. 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవితా సంకలనం.
వారి కవితలు వారి మాటల్లోనే "నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు,
నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు." వారు అంతటి గొప్పవారు కాబట్టే అభ్యుదయ
కవిత్వాన్ని కూడా అద్భుత రీతిలో అందంగా ఆకర్షణీయంగా చెప్పవచ్చునని ఢంకా బజాయించి నిరూపించినారు.
ఈ నాలుగు కవితలూ పరిశీలించితే కవిత్వానికి భావ ప్రాముఖ్యత ఎంత అవసరమో భాషా ప్రాముఖ్యత పద గుంఫనము కూడా
అంతే అవసరమని అర్థమగుట లేదా! కవితా వస్తువేదైనా కావచ్చు. భావ స్పష్టత, భాషాధిష్టత
ఎంత అవసరమో మనకు అవగతమౌతుంది. అందానికి అంతోఇంతో ఎంతోకొంత అలంకారమూ తప్పక అవసరమే.
అవసరము మీరితే అసహ్యమే మరి.
కావున పై విషయాలను మనసు పెట్టి చదివి కవితా సేద్యము ఆరంభించుతాము.
ఇంకొక అతి ముఖ్యమైన విషయమేమిటంటే పైన తెలిపిన వారెవరు 'ప్రేమ,విరహ,నిర్వేద' కవితలతో
ప్రశస్థిపొందలేదు. ఈ విషయమై మహాకవి కాళీదాసు ఏమంటున్నారో ఒకపరి గమనించండి.
पुराणमित्येव
न
साधु
सर्वं
न
चाऽपि
काव्यं
नवमित्यवद्यम्।
सन्तः
परीक्ष्यान्यतरत्
भजन्ते
मूढ्ः
परप्रत्ययनेयबुद्धिः
॥
-मालविकाग्निमित्रम्
(महाकवि
कालिदास)
పురాణ మిత్యేన సాధు సర్వం
నచాऽపి కావ్యంనవమిత్యవధ్యం
l
సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే
మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః ll
(మాళవికాగ్ని మిత్రము-మహాకవి కాళీదాసు)
మహాకవి కాళీదాసు ఈ
విధముగా అంటున్నారు:
కవిత్వము అదునాతనమా
పురాతనమా అన్నది సమస్య కాదు. పురాకవుల కావ్యాలన్నీ గొప్పవీ కావు, అదునాతనుల్లవి
అధమమైనవీ కావు.
పండితులయినవారు ఆ
విషయమును, కూలంకషముగా చదివి
నిర్ణయించుతారు. మూర్ఖులు మాత్రము ఎవరేమి చెబితే దానికి తలూపుతారు.
నిన్నటి దినమున ఒక
పాఠకుడు ఈ శ్లోకాన్ని ఉదాహరించుతూ, నేను నిన్న వ్రాసిన విషయమును అపార్థము చేసుకొని
పై శ్లోకమును ఉదహరించి గోప్పంతా పాతలోనే లేదు కొత్తలోకూడా ఉంటుంది అని తమ
అభిప్రాయమును తెలియజేసినారు. ఇందుకు గానూ నేను సమాధానము వ్రాయవలసి వచ్చి
వ్రాయుచున్నాను.
కాళీదాసుకు పూర్వము
ఎందఱో కావ్యములను వ్రాసినారు. కాళిదాసు తరువాత కూడా వ్రాసినారు. కానీ పేరెన్నిక
గన్నవి ఆయన కావ్యములే. రాశిలో నేటికి కూడా సంస్కృత కావ్యముల తరువాతనే మిగత ఏ భాషా
కావ్యములైనా! మరి ఆయన తదనంతరము వ్రాయబడిన కావ్యములకు ఆ ప్రశస్తి రాలేదు. అట్లే
ఆంధ్రమహాభారత కవులను కాదని, వారితదనంతరము భారతము వ్రాయ సమకట్టలేదు. అటులే ఆంద్ర
భాగవతము కూడా! తెలుగులో ఎందఱో ఉద్దండులయిన పండితులు రామాయణమును వ్రాసినా, అధునాతనుడైన విశ్వనాథ వారి ‘రామాయణ కల్పవృక్షము’నకు ఎంతో
వాసి వన్నె వచ్చినది. అట్లని గతములో వ్రాసినవారెవరూ తక్కువైనవారు కారు.
పద్య కావ్యాల మాట
అటుంచితే శ్రీశ్రీ మరియు సినిమా కవులను తప్ప మిగతా ఎందఱో ప్రతిభావతులయిన కవులను
ఎందరు గుర్తు పెట్టుకొనియున్నారు. ఇక తెలుగులో నేటి పాటలు ఎంతగా దిగాజారిపోయినాయో చెప్పంక్కరేలేదు.
వ్రాయగలిగే చేవయుండికూడా ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి’ గారి కలమునుండి ఒక రసమయ
గీతము జాలువారి ఒక దశాబ్దము అయిపోయిందేమో.
ఇక నావంటి చిల్లర కవులు
వ్రాసే వ్రాతలకు పాత కావ్యముల స్థాయి రమ్మంటే వస్తుందా! ఇప్పుడు వచన కవిత్వము
వ్రాసే ఎంతమంది నేడు కొంత మాత్రమైనా వ్యాకరణము చదివి వ్రాస్తూవున్నారు. ఈ సంస్కృత
శ్లోకము చదవండి.
యద్యపి బహునాధీషే
తథాపి పఠపుత్రా వ్యాకరణంl
స్వజనః శ్వజనః మాభూత్
శకలం శకలం సకృత్ శకృత్ll
వేదశాస్త్రాధ్యనము
చేయకున్నా వ్యాకరణము నేర్చుకో!పదాలు సక్రమమైన అక్షరాలతో పలుకుట నేర్చుకో! ‘స్వజనం’
కు బదులు ‘శ్వజనం’ అని
‘సకలం’ (అంతా) కు
బదులు ‘శకలం’ (ముక్క) అని ‘సకృత్’(ఒక మారు) ‘శకృత్’ (మలము) అని పలికితే ఎంత
అసంబద్ధమయిన అసహ్యమయిన అర్థాలు వచ్చి
పలికిన వానికి ఎంత అవమానమును తెచ్చి పెడతాయో
చూడండి. తెలుగులో ‘పాలాభిషేకము’లో ‘పాలు’
అన్న తెలుగు పదమునకు ‘అభిషేకము’ అన్న సంస్కృత తత్సమ శబ్దముతో సంధికుదరదు.
‘క్షీరాభిషేకము’ లేక
‘దుగ్ధాభిషేకము’ అని అనవలసి వస్తుంది. తమిళమునకు ఈ వెసలుబాటు అంటే వాళ్ళు
‘పాలాబిశేగం’ అని సరిపుచ్చుకొంటారు. అట్లే ‘నాకు ౘాలు' అనవలసిన చోట
'నాకు చాలు' అని పలుకుట ఎంత
అసభ్యముగానూ అసహ్యముగానూ ఉంటుందో గమనించండి. 'ఋ' అన్న అక్షరమును 'రు' గా పలుక కూడదు.
చెంపలు, దవడలు, గవదలు9(ఒకే శరీర భాగమునకు
వేరువేరు పేర్లు) కదిలించకుండా 'ఋ' అన్న శబ్దము పలుకవలసి
ఉంటుంది. అదేవిధముగా ‘ఌ’ కూడా పలుకవలసి ఉంటుంది. మనము 'కృష్ణ' కుబదులుగా 'క్రుష్ణ' అని పలుకుతున్నాము. సిగ్గుపడవలసిన విషయమేమిటంటే ఆంగ్లేయులు కూడా వాళ్లకు
వట్రసుడి లేకున్నా'ఋ' కు 'ఇ' తో యతి చెల్లుతుంది
కాబట్టి Krishna అని వ్రాస్తారు.
దేవనాగరి అంటే సంస్కృత హిందీ లిపులలో వాళ్ళు ఈ శబ్దమును क्रु అనికాకుండా कृ అని వ్రాస్తారు. క్ఌ (నిజానికి ‘ఌ’ క
క్రింద రావాలి కానీ మనము వదిలి వేసినాము కాబట్టి ఆ సువిధ Google లో లేదు. ఇప్పుడు ‘క్లుప్తము’
అని వ్రాస్తున్నాము. ఇంతకన్నా దారుణమైన విషయము ఏమిటంటే ‘ఙ,ఞ’ లు వాడకములో
లేవు. ఇవి ఏ రుద్ర నమక చమకముల వంటి వైదిక పుస్తకములలో మాత్రమే కానవస్తాయి. అసలు
గంగ అని వ్రాయకూడదు, ‘గఙ్గ’ అని వ్రాయాలి. కొదణ్డము అని వ్రాయాలి. కిఞ్కిణి,కాఞ్చి
అని వ్రాయాలి కింకిణి, కాంచి అని వ్రాయ కూడదు. ఈ విధముగా మనము అక్షరములను
వదిలివేసుకొంటూ పోతే ‘గొరగంగా మిగిలేది జుట్టే’. అసలీ భాషా వినాశనమునకు నాంది
పలికినవారు వాడుక భాషను అమలు చేయు ఉద్యమమును ఆంగ్లేయుల కోరికకు అనుగుణముగాప్రారంభించి
వారిచే సత్కారములను పొందిన మహనీయులు. ఈ రోజు మనకు వ్యాకరణము రాదు. పద్యకావ్యములు
చదువలేము. సంస్కృతి పై ఆసక్తి లేదు. మన భాశాభినివేశము ‘నానాటికి తీసికట్టు
నాగంభొట్టు’.
కళ్ళు తెరిచి ఇకనైనా
ముందు భాష నేర్చుకొందాము. మన అక్షరములను పునరుద్ధరించుకొందాము. మలయాళీలు చలన
చిత్రములలో సంస్కృత గీతములను కూడా చొప్పించి ఎంతో భావగర్భితముగా, మనోరంజకముగా 90
దశకము వరకు వ్రాసి పాడేవారు. మనమో! సంస్కృతము అన్న శబ్దమును కూడా పలుకలేని వారిని
కలిగియున్నాము. మాతృభాష తెనుగులో చక్కగా మాట్లాడలేక అవమానించే తెలుగు నాయకులను,
చిత్ర నాయకులను చూచే దుర్గతి నేడు మనకు పట్టింది. ఈ విధముగా మన భాషా పాండిత్యమునుంచుకొని
చక్కటి భావమునకు అక్షర రూపము ఇవ్వగలమా! మనము క్షరములు అంటే నశించేవి కాదు
వ్రాయవలసినది, అక్షరములు అంటే శాశ్వతముగా నిలచిపోయేవి.
చివరిగా శ్రీశ్రీ గారు కరుణశ్రీ గారితో ఏమన్నారో మీకు వినిపించి
విరమించుతాను.
'వాగ్దానం' అన్న సినిమా లో ' సీతా కళ్యాణ సత్కథ' అన్న'హరి కథ' శ్రీశ్రీ గారు వ్రాసినారు. అందులో 'ఫెళ్ళు మనెవిల్లు ఘంటలు ఘల్లుమనియె' అన్న పద్యము తో ఆ హరికథ ముగుస్తుంది.అది కరుణశ్రీ గారు వ్రాసినది. ఒకసారి శ్రీశ్రీ కరుణశ్రీ గార్లు ఒకే వేదిక నలంకరించడం జరిగింది. అప్పుడు కరుణశ్రీ గారు " ఏమోయ్ నాపద్యము కాపీ చేసినావు నీ హరికథలో "అన్నారట.అది ఇంకా నీదెందుకౌతుంది. 'ప్రతి' బయటికొచ్చిన తరువాత వ్రాసిన వానిగా దానిపై నీకెంత హక్కో పాఠకునిగా నాకూ అంతే హక్కన్నారట. అంటే మంచి కవితకు ఎంతటి విలువ వుంటుందో మనము గమనించ వలెను.
స్వస్తి
Like
· Comment · Share · February 9 at 12:46pm ·
Kannaji
Rao Jr., Dayanand Vallab, Mukkavilli Dharma Prakasa Rao and 12
others like this.
1 share
Manju
Yanamadala February 9 at 1:35pm · Like ·February 9 at 1:35pm · Like ·
పెద్దలు శ్రీ చెరుకు రామమోహన్రావు గారు రాసిన ఈ టపా ముఖ్య
ఉద్దేశ్యం కవితకు కాదేది
అనర్హం అన్న శ్రీ శ్రీ గారి మాటలు నేటి మనలో చాలా మందిమి మన మాటలనే
కవితలు గా
భావిస్తూ అదే ఆధునిక కవిత్వం అన్న భ్రమలో ఉంటున్నాము... కవితకు
భావం ఎంత
ముఖ్యమో వస్తువు,వచనం, శిల్పం, శైలి, భాష ఇలా ఎన్నో కలిస్తేనే కాని కవితగా పూర్తీ
రూపాన్ని సంతరించుకోదు...ఆది కవి నన్నయ్య రాసినా.. అష్టదిగ్గజాలు
అమూల్య ఆశు
కవితలను, రస రమ్య పద్యాలను అందించినా , శ్రీనాధుని శృంగార చేమంతులను
చూసినా...వాటిలో సొంపైన సొగసుల తెలుగు దాగి ఉంటుంది...అందమైన
భావాలను
మనకు అందిస్తూ ... ఇక వచన కవిత్వంలో కూడా ఇలానే తిలక్ గారి
కవితలు...శ్రీ శ్రీ
గారివి...అన్నమ్మయ్య, రామదాసు పద కవితల కీర్తనలు ఇలా
ఎన్ని చూసినా వాటిలో చక్కని
హృద్యమైన భావాలు మనకు కనిపిస్తాయి....కవితలను కవితగా
రాయండి....మాటలను కవిత
అనకండి.....ఇది పెద్దల సహృదయ మనవి అందరికి .. రామమోహన్రావు
గారు.....
ఈ మీ మనసులోని మాటలు ఈనాటి కవిత్వంగురించి చదివాక మా తప్పులు
సవరించుకోవడానికి
ప్రయత్నిస్తాము...మీ సుదీర్ఘ వివరణకు మా మనఃపూర్వక వందనాలు
Vedapanditaha
Sannidhanam Dixit Sarma మంచి పరిచయం
February
9 at 1:40pm · Unlike · 1
భావరాజు పద్మిని Venkateswara Rao pls read d above article n comment.
February
9 at 1:59pm · Unlike · 1(Liked అని అర్థము. Don’t take in negative sense)
భావరాజు పద్మిని February 9 at 2:57pm
· Unlike · 3
February
9 at 2:57pm · Unlike · 3
బాబాయ్ నేటి కవితల పరిస్థితిని చక్కగా ఉదాహరణలతో విశ్లేషించారు. 'కవితలు'
రాస్తున్నాము అనుకుని, వాడుక మాటలనే అక్షరాల్లో
పెడుతున్నారు. దానికి ౩౦
లైక్లు, ఇరవై కంమెంట్లు. ఎందుకంటే, చదివేవారికి
కూడా అవి కవితలో, కావో
తెలుసుకునే స్థాయి ఉండదు. నానీలు,
బఠానీలు, చువ్వలు, రవ్వలు... ఏక వాక్య
కవితలు... బాబోయ్ ఎన్ని రకాలో. క్షుద్ర కవితలు, అందులో
మాంసాలు, రక్తాలు,
భీబత్స కవితలు, విఫలప్రేమ కవితలు, పడకగది
మన కళ్ళ ముందు పెట్టే ప్రేమ
పొంగే కవితలు... చెప్పినా వీరికి అర్ధం కాదు. ఎందుకంటే, ఇరవై
మందికి నచ్చింది
అంటే, వారి దృష్టిలో, వారు కవి
క్రిందే లెక్క. పుస్తకం 'అచ్చోసి ' వదిలేస్తారు.
దొరికిన వాల్లకల్లా కవితలు వినిపిస్తారు. కవితలో ఒక వాక్యం
చాంతాడంత పొడుగు...
మరొకటి చెవి తాడంత కురచ. వాక్యాల పదాల అమరికలో, కొత్త
పదాలకోసం
ప్రయత్నించక, వాడిన పదాలే వాడుతుంటారు. మరి పద సంపద ఎలా
పెరుగుతుంది? అలా దొరికిన వాటితో సంతోషించి సర్దుకునే
అల్ప సంతోషులకు
మీ పోస్ట్ చెంప దెబ్బ లాంటిది. Ramesh Kumar గారు...
ఇప్పటికైనా మీకు మా బాధ
అర్ధం అయ్యిందని అనుకుంటున్నాను. 'ఏదో ఒకటి రాసేస్తే కవిత
కాదు...' అన్నది
సారాంశం. నమస్కారం.
Surendra
Seelam February 9 at 3:55pm · Unlike · 1
ఆర్యులు.. చక్కగా చెప్పారు. ఇప్పటి కవితలలో ఎంత వెదకినా కనబడడం
లేదు
భావమెందుకు? చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా చెప్పగలగడమే కవి యొక్క
గొప్పదనము.
అట్టి కవులు మలచిన గ్రంధరాజాలే నేటికిని అనుసరణీయాలైనవి. ఈ మాటలు
ఎవ్వరిని చిన్నబుచ్చుటకు చెప్పుటలేదు. ఉదా.. ఒక కవితలో పదప్రయోగం ఈ విధంగా వాడారు "మదిలో
కోరికలు ఎదలో ఉన్నవి" మది, యద ఒక్కటే అని తెలియని స్థితిలో మన కవితలు
వస్తున్నాయి. మనసును కదలించగల శక్తి, మనిషిని ఆలోచించ జేయు
శక్తి ఒక్క కవితకే ఉన్నాయన్నది నాకు తెలిసిన సత్యం...ఈ క్రమంలో నా అనుభవాన్ని
పంచుకుంటాను.. మొన్నటిరోజున నేనొక కవిత చదివాను. బాగుందనిపించి ఆ కవి (యిత్రి)ని
ప్రశంసిస్తూ, కొన్ని పదాలకు అర్థం మరియు అక్కడ వాడడానికి
కారణం అడిగాను. పదాలు బాగున్నాయని వాడాను... నాకు కూడా అర్థం తెలియదు అని సమాధానం
వచ్చింది... చివరిగా ఉత్సాహవంతులైన కవిమిత్రులకు, యువకవులకు
ఒక చిన్న మనవి... కవిత వ్రాయవలెనన్న సంకల్పానికి నా జోహార్లు... కాని వ్రాసింది
ఒక్క సారి చదువుకోండి. తప్పులను సరిదిద్దగల పెద్దల సహకారం తీసుకోండి. మంచి కవితలను
అందించండి...
Sastry
Tvs February 9 at 6:04pm · Unlike · 3
శ్రీ రామ్మోహన్ రావు గారు వ్రాసిన 'కాదేది కవిత కనర్హం ?'
అనే సమగ్ర వ్యాసాన్ని చదివిన తరువాత
తెలియచేస్తున్నాను. కవిత్వానికి వస్తువు ప్రధానం కాదు ,ఏ
వస్తువైనా కవితకు అర్హమే అన్న శ్రీ శ్రీ
గారి భావాన్ని రామ్మోహన్
రావు గారు సమర్దిస్తూనే -కవితా లక్షణాలను గురించి చక్కగా
వివరించారు. 'Appropriate words
used at appropriate places is called poetry 'అన్న
ఒక ఆంగ్ల మహాశయుని సూక్తి అక్షరాలా నిజం . కవిత్వానికి
కావలసింది--చక్కని పదాల పొందిక.
గద్యం కావచ్చు, వాక్యం కావచ్చు! కవి తాను చెప్పదలచుకున్నది,స్పష్టంగా,చక్కని పదాల
పొందికతో చెప్పటమే కవిత్వం. వాక్యం రసాత్మకం అయితే అది
కావ్యమౌతుంది అని అన్నాడు శ్రీ
సంజీవ దేవ్. ఆయన ఇంకా ఇలా అన్నాడు--వాక్యం,కావ్యం
లోని మాటలు ఒకటే , కొద్ది తేడాతో!
అంటే వాక్యాన్ని కొద్దిమార్పులతో తిరిగి వ్రాస్తే ,అది కావ్యం అవుతుంది !కొద్ది
మార్పులు అంటే,వాక్యాన్ని రసాత్మకంగా చెప్పటమే ! రసాత్మకంగా
లేని కావ్యం కూడా కవిత్వం కాదు. రసాత్మకమైన ఒక్క వాక్యాన్ని కవిత్వం అని అనవచ్చు
!అలా రసాత్మకంగా వ్రాయటం తెలిసిన వారే ప్రఖ్యాత కవులుగా చలామణి
అయ్యారు,అవుతున్నారు. అటువంటి వారు ఏమి/ఏది వ్రాసినా మనకు
పదే ,పదే చదవాలని
అనిపిస్తుంది. అంతే కానీ శబ్ద పటాటోపం తో, సుదీర్ఘ
సమాసాలతో వ్రాసినంత మాత్రాన అది కవిత్వం కాదు, కానేరదు! కవికి
ముఖ్యంగా కావలసింది చక్కని భావుకత !మిగిలినవన్నీ దాని తరువాతే! కవిత్వాన్ని
గురించి నేటి తరానికి ఉత్సాహం కలిగేలా తన భావాలను చక్కని వ్యాసకుసుమంగా అందచేసిన
శ్రీ రామ్మోహన్ రావు గారి కృషి ప్రశంసనీయం!
Cheruku
Ramamohanrao February 9 at 6:35pm · Like · 3
మలి తరానికి మన మాటలు పునాదులు కావాలనినాకోరిక. 'వాగర్థాత్
వివసంపృక్తౌ
వాగర్థాత్ ప్రతిపత్తయే' అని వాక్కును భావాన్ని పరవటీ
పరమేశ్వరులకు
పోల్చినాడు మహాకవి కాళీదాసు . శాస్త్రి గారు ధన్యవాదాలు
Sastry
Tvs
February
9 at 6:43pm · Unlike · 1
కృతజ్ఞతలు రామ్మోహన్ రావు గారు!
Devarakonda
Subrahmanyam February 9 at 6:52pm · Unlike · 3
అద్భుతమైన వ్యాసం. నిజమే . కవితకు అనర్హమైనది ఏదీలేదు. ఐతే అందరూ
మాత్రం కవులు కాలేరు. ఎదో పదాలు వ్రాసేసి అడ్డదిడ్డంగా విరిచేసి, పదాలగారడి
చెయ్యటం కవిత్వం కాదు. నాదృష్టిలో కవిత్వం
అంటే చదివినవారికి కవిహృదయం అర్ధం కావాలి. తను ఏమి
చెప్పదలచుకున్నాడో అది స్పష్టంగా చెప్పగలగాలి. మనసుని ఉర్రూతలూగించ గలగాలి, ఉత్తేజపరచగలగాలి,
ఆలోచింప
చెయగలగాలి, భావోద్రేకాలని వెలికితేగలగాలి. అప్పుడే అది నిజమైన
కవిత్వం అనిపించుకుంటుంది. అసలైన కవిత్వం అనిపించుకుంతుంది. ఆనాటి మన ప్రాచీన
మహాకవులు ఇదే ధోరణిలో
తమ కవితావ్యాసంగం చేసి మహాకావ్యాలను సృష్టించారు. నవతరంకవులలో
ఎంతోమంది ఇదే స్పూర్తితొ ఎన్నో రచనలు సాగించారు. కానీ నేడు కొంతమంది కవితల పేరుతో
చేతికివచ్చినది
వ్రాసి కవులుగా వెలుగుతున్న సంగతి తెలిసినదే. అటువంటివారికి ఈ
వ్యాసం ఒక కనువిప్పు. ఈసందర్భంలో నాకు ఒక విషయం గుర్తు వస్తున్నది. ఆనాటికాలం
నుండి కుకవులు ఉండేవారని
కావ్యాలలోనే తెలుస్తుంది. అదేవిధంగా ఈనాటి కాలంలో శ్రీవేటూరి
సుందరరామమూర్తిగారు (వీరు శ్రీవేటూరిప్రభాకరశాస్త్రిగారి మేనల్లుడు) ఒక టి.వి.
లోమాట్లాడుతూ "ఆరేసుకోబోయి" వంటిపాటలు పొట్టకూటికోసం వ్రాయవలసి
వచ్చిందని ఎంతో సిగ్గుపడుతు చెప్పారు. ఎంతో గొప్ప
మహాపండితుడిని మన సినిమా ప్రపంచం సినీగీత రచయితగా మార్చేసింది.
పరిస్థితుల ప్రభావం అనండి, ఇంకేమైన అనండి ఇది మారుతున్న న అభిరుచులకు అద్దం
పడుతోంది.
Cheruku
Ramamohanrao February 9 at 6:57pm · Like · 3 February 9 at 6:57pm · Like · 3
చాలా చక్కని స్పందన సుబ్రహ్మణ్యం గారూ. నాతపన అర్థము చేసుకోగలిగి
చక్కని సందేశాన్ని అందించినారు. సుందరరామ్మూర్తి గారు బహుశ ప్రభాకర శాస్త్రి గారి
దాయాదులై ఉండనోపునని నా తలంపు.
Jaji
Sarma February 9 at 7:18pm · Unlike · 3
చాలా బాగుంది శ్రీ రామమోహన్ రావు గారు! వ్యాసం శ్రీ శ్రీ, శ్రీ
కరుణశ్రీ
గారి సంభాషణ తో ముగించడం సంతృప్తిగా ఉంది.
Srinivas
Iduri February 9 at 7:31pm · Unlike · 2
పెద్దలు రామమోహనరావు గారికి నమస్కారాలు. ఆలశ్యంగా ఈ టపాపై
స్పందిస్తున్నందుకు
మన్నించగలరు. మీ వ్యాసం అద్భుతంగా ఉంది. మీబోటి పెద్దలు
అప్పుడప్పుడు
ఇలా దిశానిర్దేశం చేయనిదే నేటి యువతకి, మాబోటి
వారికీ మన పూర్వ కవుల
విశేషాలు, వారి విజయాలూ బోధపడవు. మీరన్నట్టుగా ఎవడికివాడు
తను రాసిన నాల్గు
ముక్కలే కవిత్వం అనుకుని పొంగిపోతున్న రోజులివి. పొరబాటు
దిద్దబోయిన వారికి
అవమానమే ఎదురౌతున్నది కూడా నిజమే. నాకున్న పరిజ్ఞానం బహుతక్కువ
అన్నది
మీకుతెలియనిదికాదు అయినా రెండుముక్కలు నాకు తోచినవి
చెప్పదలుచుకున్నాను. ఈ
సృష్టిలో ప్రతి విషయమూ ఒక వలయమే (సైకిల్) ఒక స్వర్ణయుగం నుండి
అత్యంత దిగువకి
జారి మళ్ళీ స్వర్ణయుగానికి తప్పకుండా వస్తుంది. నాకు తెలిసినంతవరకూ
ఇప్పుడు
మనమున్నది అత్యంత దిగువ స్థాయి. ఇక్కడనుండి నెమ్మదిగా మళ్ళీ అత్యంత
ఉన్నత
స్థాయికి చేరుకోవడం ఖాయం. మరో వ్యాసుడు, మరో
కాళిదాసు తప్పక పుడతారు. ఒక్క
కవిత్వములోనే కాదు ఏ రంగం తీసుకొన్నా మనం, ప్రస్తుతం ప్రామాణికంగాకనిష్ట
స్థాయిలోనే
ఉన్నాము. మాటలాడుకోడానికి కూడా SMS భాష ఉపయోగిస్తున్న రోజులివి.
అసలు బోధించే
గురువులేక్కడ దొరుకుతున్నారు? ఎవరికీ వారు మనకెందుకులే అని
సర్దుకుపోయే తత్వంలోనే వున్నారు. ఎక్కడో ఒకచోట మీలాంటి పెద్దల చొరవతో ఈ పరిస్థితులు మారతాయి, తప్పక
మారతాయి. అప్పుడు మళ్ళీ తెలుగు వెలుగై ప్రకాశిస్తుంది. కవిత్వం కదను తొక్కుతుంది.
Padma
Mvs గురువుగారికి నమస్కారం. కవిత్వం అంటే పదాల
అమరిక అని అనుకునేవాళ్ళకి మీ వ్యాసం ఒక కనువిప్పు. కవితకు భావం
ఒకటే కాక, శిల్పం, శైలి కూడా చాల
ముఖ్యం. మనసు ఏదో ఒక భావనలో
కోట్టుకుపోతున్నపుడు మెదడు లో జనించే కొన్ని పదాల గుంపును కవిత్వం
అనలేము. కాని ఈరోజుల్లో అవి అన్ని లెక్కజెసెవారు ఎక్కడ? వాక్యాలు
విరిచి
కుప్ప పోసి దానినే కవిత్వం అనే వారు ఎక్కువగా ఉన్నారు ఈరోజుల్లో.
ఇంకా
నానీలు, హైకులు వచన కవితల కన్నా కొంత వరకు నయం
అనిపిస్తుంది
పదాలను లెక్కపెట్టి వాడతారు కనుక. చిన్న మాటల్లో పెద్ద భావం
ఉంటుంది
కనుక. పరిణామ క్రమంలో మన మాతృభాషకు కొంత గడ్డుకాలం వచ్చినా, మీ
వంటి
పెద్దల మార్గ నిర్దేశం లో మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అని నా
నమ్మకం.
Cheruku
Ramamohanrao February 9 at 10:00pm · Like · 2
మంచిమాట చెప్పినావంమా పద్మా!
ఇంతమంది సహృదయులు, భాషా ప్రియులువుండగా తెలుగుకు తగిలిన
తెగులును సమూలముగా నాశనము చేయవచ్చని నమ్మకము కుదిరింది.
Mukkavilli
Dharma Prakasa Rao February 9 at 11:52pm
· Unlike · 1
Unfortunately
I have very little knowledge in expressing but I enjoy reading your
Educative
n informative articles. Thank you very much for having taken much more
Pain
in developing n posting.
Krishna
Mohan Mocherla Yesterday at 12:41am · Unlike · 1
చరిత్రలో మార్పుకు మార్గదర్శకులుగా, భాషను అప్రతిష్ఠ పాలు
చేసినా, తమ
ప్రతిష్ఠను పదిలం చేసుకొన్నారు
Well
said sir !
Krishna
Mohan Mocherla Yesterday at 12:43am · Unlike · 1
రాకానిశాకర రమ్య హాసంబు తారకాకోరక తరళ హాసంబు ..... Just like yours in
the
Fb
page sir!
Krishna
Mohan Mocherla Yesterday at 12:44am · Unlike · 2
కఠిన పదాలు ... పదాలు become కఠిన, only due to
lack of usage
Krishna
Mohan Mocherla Yesterday at 12:46am · Unlike · 1
అతి ముఖ్యమైన విషయమేమిటంటే వీరెవరు 'ప్రేమ,విరహ,నిర్వేద' కవితలతో
ప్రశస్థిపొందలేదు.
Krishna
Mohan Mocherla Yesterday at 12:48am · Unlike · 1
'ప్రతి' బయటికొచ్చిన తరువాత వ్రాసిన వానిగా దానిపై
నీకెంత హక్కో పాఠకునిగా
నాకూ అంతే హక్కన్నారట. ... So now I have every right on this
article ... just kidding sir. Thank you
very much for your beautiful article and sharing with us. Also very kind of you
for reminding me, as I am
Busy
with work could not spend time on FB __/\__ after seeing your reminder,
Could
not resist to read. Thank you
Cheruku
Ramamohanrao Yesterday at 4:44am · Like · 1
At
the outset let me thank you Mr. Krishna Mohan for taking out a little of your
Invaluable
time to read article. With all your cooperation if the trend turns towards
Good
i feel happy that something good is done to the society with all the help of
people like you.
Cheruku
Ramamohanrao Yesterday at 5:06am · Like · 1
M.D.
గారూ మీ లాంటివారు చదివి పది మందితో చదివించి వారిలో కొంతైనా చైతన్యమును నింపినారంటే అది మంచి
వైపునకు తిరిగే పెను మార్పునకు దారి తీస్తుంది.
Sunitha
Macherla 3 hours ago · Like
కొన్ని సంవత్సరాల క్రింద ఒక సంస్కృత లెక్చరర్ని అన్నమాచార్య కీర్తన
"ఏమొకో,
చిగురుటధరమున ..." కు అర్థం అడిగాను. పత్రిక అంటే ఆమె ఉత్తరం
అని చెప్పింది - మరి ఉత్తరం వ్రాస్తే స్వామివారి అధరాల మీద అక్కడక్కడ ఎరుపు అవ్వటం
ఏమిటి అంటే, అది అంతే అన్నారు ఆవిడ. ఇంకొక ఆవిడ, తనకు తాను కవియిత్రి అని, కళల పట్ల అభిరుచి
ఉన్నవ్యక్తిగా చెపుకుంటూ ఒక కృష్ణుని పాట పాడుతూ నా ఖర్మ
కొద్దీ దాని అర్థం కూడా చెప్పారు. అది ఏమంటే కృష్ణుడు తల్లి
యశొదాను పెద్ద ఏనుగును తెచ్చి సుచ్చిలో దూర్చి నెత్తి మీద పెట్టుకొమ్మని అవస్థ
పెడుతున్న విషయం - అయితే సుచ్చి అంటే పాలపీక అంటుంది ఆవిడ.
మరి పాలపీక నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు, క్రిష్నుడిది
ఎంత అమాయకపు అల్లరి అయినా అందులో రసికత లేదు కదా, సుచ్చి
అంటే చిన్న tote కావచ్చు అంటే ఆమె అభిమానం దెబ్బ తిన్నది.
ఇక నా మాటకు వస్తే కవిత్వాలపై వ్యాఖ్య వ్రాయటానికి ఎన్నడూ
కవిత్వాలను అభ్యసించని నాకు ఏమాత్రం అర్హత లేదు. ఇంత మంది పెద్దలూ, కవితల
గురించి తెలిసిన వారి ముందు మాట్లాడటం
చిన్న నోట పెద్ద మాట అన్నట్టు. కాక పోతే కవిత్వాలలో భావాన్ని, సున్నితపుతనాన్ని
appreciate చెయ్యగల మనసుతో కవిత్వాలు వ్రాయాలన్న ఉత్సుకత,
జిజ్ఞ్యాస, అభిరుచి ఉన్న వారికి చెప్పేది
ఏమంటే, ఈ కాలంలో పైన చెప్పినట్టు కవిత్వాల గురించి
తెలిసిన వాళ్ళు చాలా అరుదు. అందులో
ఇప్పటి యువతకు సాహిత్యంలో అవగాహన లేకపోవడం చూసి క్షోభతో, మిడి
మిడి జ్ఞ్యానంతో రాసే వట్టి మాటలే కవిత్వం అన్న భ్రాంతిలో ఉంటున్నవారికి
మార్గదర్శనం చేయాలన్న తాపత్రయం ఉన్నవారు ఇంకా తక్కువ. రామమోహన్ రావు గారి వంటి
పెద్దలు అదృష్టం కొద్ది తటస్థించితే, ఆ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు కష్టపడి వ్రాస్తున్న పద్యాలే కాని, కవిత్వాలే కాని
చదివి, చర్చించటమో, వీలుంటే collaborate
నో చెయ్యాలి. అంతే కాక సంస్కృత మహాకవులు, తెలుగు
మహాకవుల రచనల అభ్యాసం చేయాలి. భాష, భావం, శైలి .... ఇవన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అదృష టం
ఉంటే వాళ్ళ రచనలు అర్థం చేసుకునే ప్రయత్నంలో మనదంటూ ఒక శైలి కూడా
ఏర్పడవచ్చు. కవిత్వాలు వ్రాస్తున్నప్పుడు వీలున్నంత వరకు poetry elements లో ఎక్కడ compromise కాకుండా ఉండటానికి
ప్రయత్నించాలి. ఇవన్నిటికీ మించినది ధ్యానం - centered ఉన్నప్పుడే
creative juices flow అవుతాయి. రామమోహన్ రావు గారు, మీ ఈ ఒక్క వ్యాసంలో నా వంటి వారికి నేర్చుకునే
విషయాలు ఎన్నో ఉన్నాయి. Thank you very much for your efforts and
please excuse me for any mistakes on my part.
Vijaya
Suvarna 16 minutes ago · Edited · Like
రామ మోహన్ రావు గారూ శ్రద్ధతో శ్రమ కోర్చి మీరు కూర్చిన వ్యాసం
తెలుగు వారందరూ చదివి అవలోకన చేసుకోవసిన విషయం. ఒక్కొక్క పూర్వపు కవి యొక్క నిపుణత, నాణ్యతలను
అప్పటి కాళిదాసు నుండి ఇప్పటి శ్రీ శ్రీ, కరుణశ్రీ గార్ల
వరకు చదువుతుంటే, ఎంతెంత జ్ఞాన సంపద గల వారో అనిపిస్తుంది.
మనకున్న ఇంత సంపద చదివి అవగాహన చేసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపడదేమో !!.....
ఇక నేటి NET కవుల సంగతి తీసుకుంటే, ఈ
అంతర్జాలంలో ముఖపుస్తకం (Facebook), బ్లాగులు(Blogs),
సమూహ చర్చలు (Group Chats) మొదలైనప్పటి నుండి
కవులు కోకొల్లలు అయిపోయారు. ఒక వరుస చాంతాడు లాగా ఉంటె ఇంకో వరుస నాలుగు పదాలు
కూడా ఉండదు, ఒక వరుస కు ఇంకొక వరుసకు అసలు పొంతన ఉండదు,
అన్ని వరుసలు కలసి ఒక భావం ఏర్పడిందా అని మనం వెతుక్కోవాలి. కవితలో
నాణ్యత రావాలంటే పద సంపద ఉండాలి, ఒకే వస్తువు యొక్క వివిధ నామాలు
తెలిసి ఉండాలి, అలాగే ఒకే
పదానికి ఉన్న నానా అర్థాలు కూడా తెలిసి ఉండాలి. అటువంటి పద సంపద
ఉన్న అన్నమాచర్య కీర్తనలు కాని, రామదాసు గీతాలు కాని తీసుకుంటే, ఇప్పటి మనకు అన్ని పదాలకు అర్థాలే తెలియవు. అంటే అప్పటికి ఇప్పటికి మనందరి
వాడుక పదాలు చాలా తక్కువైపోయినావనే కదా అర్థం !!!
మీ వంటి వారు తటస్థ పడటం నా వంటి వారి అదృష్టం. ఎందుకంటే తప్పులు
చేసినప్పుడు చెపితేనే దిద్దుకోగలం మరి. అందరు నాకెందుకు అని ఊరుకుంటే ఆ తప్పులే
చెల్లుబడి అయిపోతుంటాయి.
మనందరి ప్రయత్నంతో కొంతమటుకు అయినా మార్పు వస్తే అందరి శ్రమ
ఫలించినట్టే కదా !!!
Cheruku
Ramamohanrao
అమ్మా సువర్ణ,సునీత మీ అభిమానమెంతెంతో ఆనందదాయకము. 'నేను సైతం తెలుగు కవితా
యజ్ఞమునకొక సమిధ కూర్చాను ' 'తెలుగు కవితా విభవ ఘోషకు గొంతు
చేర్చాను' అన్నట్లువుంది. ఉత్తేజ
భరితమైన మీ విమర్శ చూస్తూవుంటే. 'ఇంత మందిమి ఒక్కటైతే
ఎదురుమనకేది' ఎంత మందము గోడ లైనా ఎట్లు నిలిచేది' 'ఎదురెట్లు నిలిచేది'అని అనిపిస్తూవుంది. మన
సమూహములోని సభ్యులు ఎక్కువగా ఒక్కటైతే ఒక్కసారిగా ఈ వేదనా కవితలు రోదనా కవితలు,ఆరాధనా కవితలు ,సరసకవితలు, కురసకవితలు
, కురుచకవితలు , సద్ది కవితలు ,దుర్బుద్ధి కవితలు, గంగజేరి మన వెతలబాపవా! ఈ
రచనకు వత్తాసు పలికినవారికి చదివిన వారికి అనుసరించాలనుకొనే వారికి
పెరుపెరునా కృతఙ్ఞతలు
శ్రీ వేంకట్ టేకుమళ్ళ గారు నేను వ్రాసిన కవిత్వం -- 4 అన్న వ్యాసము
పై ఈ విధముగా స్పందించినారు. అందువల్ల నాకు తెలిసిన నాలుగు మాటలు నలుగురికీ పంచ వలసి వచ్చింది. ఈ వివాదము
ఇంతటితో స్వస్తి.
Venkat
Tekumalla మీరు చెప్పిన వారంతా అటు ప్రాచీన ఛందస్సులోనూ..ఇటు ఆధునిక
కవిత్వం లోనూ తల పండినవారు. వారి కత్తికి రొండు పక్కలా పదునే...ఇంతకీ మీరు కఠిన
పదాలు వద్దంటారా.. సమర్ధిస్తున్నారా? అర్ధం కాలేదు.
పుట్టపర్తి నారాయణా చార్యులు తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి
పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి
నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన
బహుభాషా చక్రవర్తి ఆయన. అందువల్ల మీ కవిత్వం-4 లో "అవసరము
మీరితే అసహ్యమే మరి" అన్నారు. వారు పండితులకోసం మరియూ పామరులకోసం ఇరువురికోసం
రాసారు. ఆయా కాల మాన రాజకీయ సాంఘిక చారిత్రక పరిస్తితులకు అనుగుణంగా రచనలు వస్తూ
ఉంటాయి. అవి మంచివా చెడ్డవా అసహ్యం కలిగించేవా అన్నది మనం విచారించదగ్గది కాదు అని
నా అభిప్రాయం. పైగా అవన్నీ సాహిత్య అకాడెమీ వారి బహుమతులందుకొన్నవి. కఠిన పదాలు
ఉన్నంత మాత్రాన అసహ్యం వేయడం ఎందుకో నాకు అర్ధం కాలేదు. సిరివెన్నెల రాసిన...
"విరించినై" పాటలో చాలా అర్ధాలు తెలీక పండితులు సైతం నిఘంటువులు చూసి
తెలుసుకొన్నారు. కవిత్వాన్ని..కవిత్వంగా ఆదరిద్దాం.
**************************************************
జవాబు
'అందానికి అంతోఇంతో ఎంతోకొంత
అలంకారమూ అవసరమే. అవసరము మీరితే అసహ్యమే మరి.
'ఇది నా వ్యాసములో నేను వ్రాసినది.
ఒక బాలగంగాధరతిలక్ గారు
వ్రాసిన ‘అమృతము కురిసినరాత్రి’కి మాత్రమే జ్ఞానపీఠ పురస్కారములభించినది
ఇక పుటపర్తి వారినిగూర్చి, వారు విద్వాన్ పరీక్షకు
వెళ్ళినపుడు వారువ్రాసిన 'పెనుగొండ లక్ష్మి' వారిపాఠ్య పుస్తకము. ఇంత వరకు ఇది ఏకవికీ కలగని అనుభవము. ఆయన కృషీవలుడు. ఎంతోకష్టపడి
విద్య నేర్చినవాడు. మహాలక్షుమ్మ అనునావిడ ఉడుపులుతికి నాట్యము నేర్చుకొన్నపట్టుదల కలిగిన వాడు. ఆయనవ్రాసిన 'షాజీ' మద్రాసు
విశ్వవిద్యాలయమునకు పాఠ్యగ్రంథ మైనది.
ఇంతకూఆయన పాఠశాలలోచదివినది 8 వరకే. ఆయనస్కూలులో చదివేఆ కాలములో
పెనుగొండ సబ్ కలెక్టర్ గారి భార్య V.J. Pitt ముద్దుగావుండే ఆ
అబ్బాయికిఆంగ్లము నేర్పించింది. వారినిగూర్చి వ్రాస్తూబోవటానికి నాశక్తి
చాలదు.తెలుగు వాళ్ళు గుర్తించకున్నామలయాళీలతో మహా సన్మానముల నందుకొన్నవాడు. ఒక
ఒర్వలేనికవి ఆయనకు 14 భాషలు రావు అన్నందుకు ఆయన సమక్షములో 14 భాషలేవో చెప్పి ఏభాషలోఎవరుఏప్రశ్నఅడిగినా
అదే భాషలో చ్జందోబద్ధంగా తన కవిత్వము వినిపిస్తానన్న సరస్వతీపుత్రుడు. హృశీకేశమున
స్వామీశివానంద గారిబలవంతముతో'సరస్వతీ పుత్ర' యన్నబిరుదును అసాంతము ఉంచుకొన్నారు తప్పించితే, వచ్చిన
లేకఇచ్చిన ఏ బిరుదుకూ తలవంచ లేదు.
నన్ను తప్పుగా తలవకుంటే ఆ మహనీయుని పరిచయ భాగ్యము కలిగిన
అల్పజీవిని.
వేంకట పార్వతీశ కవుల కవిత్వం ఇరవైయవ శతాబ్ది కవిత్వధోరణయిన భావ
కవిత్వానికి ఆద్యులలో నిలుస్తారు. పండితవంశాజులైనా కృషితో, జట్టుకట్టి
పైకొచ్చినవారు. మొదట కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ , తరువాత
శ్రీశ్రీ ప్రభావంతోనూ , కవిత్వం రాసినా, వచన కవితా ప్రక్రియని తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన
ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని
భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ
కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ,
భావ కవిత్వాల కలనేత. వీరంతా కృషిచేసి ఉన్నతినిపొందినవారు.
వేటూరి, సిరివెన్నెల తెలుగుకుపెద్దపీటవేసినమహానుభావులు పైనతెలిపిన
వారందరూ అందమైన స్వతహాగానే అందమైన ఆంధ్రమునకు తమశక్తి మేరకు అలంకారాలు
అందముఇనుమదించే విధంగాపొదిగిన వారే.
భాష పై పట్టులేకుంటే కవిత్వము పేలవము అవుతుంది.ఏతావాతా
ఔత్సాహికులకు నేను చెప్పిన దేమిటంటే భావ
వ్యక్తీకరణకు భాష అత్యంతఅవసరము. అవసరమునుబట్టి పదము కఠినమా సరళమా అని చూడకుండా
యుక్తమా అయుక్తమా అన్నది చూడవలేనన్న భావమును నా వ్యాసములోనే తెలియజేసినాను. అందుకే
కాళీదాస మహాకవి 'వాగర్థాత్ వివాసంపృక్తౌవాగర్థాత్ ప్రతిపత్తయే
జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అన్నారు. మనమందరమూ
పైవారిలాగా అతిగొప్ప కవులము కాలేము . భాషపై కొంచెమైనా పట్టు సాధించి కవిత
వ్రాయదొడిగితే ఈభాష ఇంకాకొంతకాలము భూమిపైనిలుస్తుంది.
ఒకప్పుడు హిందీ తరువాత రెండవ భాషగా యుండిన తెలుగు ఇప్పుడు మూడవ భాష.
రెండవ స్థానము 'బంగ్లా' భాషది.
స్వస్తి
No comments:
Post a Comment