ముదితల్ నేర్వగరాని విద్య గలదే
ముద్దార నేర్పించినన్.
తెలుగు మాట్లాడుతూ, తెలుగు చదువుతూ ఉండే వారికి ఈ
పద్యపాదము సదా సుపరిచితము. కానీ మిగతా మూడు పాదములు తెలిసినవారు తక్కువగా
ఉండవచ్చు. అందుకే ఈ ప్రయత్నము.
చదవన్నేర్తురు
పూరుషుల్ వలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు
శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము
తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్
నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.
ఇది చిలకమర్తి వారి నరకాసుర వధ లేక ప్రసన్న యాదవమను నామాంతరములు గల
నాటకములో సత్యభామ యుద్ధ కౌశలాన్ని వీక్షిస్తున్న శ్రీకృష్ణుని చేత కవి గారు
పలికించిన ఆణిముత్యము ఈ పద్యము. వనితలు చేయలేని పనిలేదు. ఏపనిలోనైనా వారు పురుషులకన్నా ఎక్కువే!
అందుకే నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతుంది.
స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి
నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం
ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు నీతిశాస్త్రము వ్రాసిన మహనీయులు.
ఇదే మాటను భర్తృహరి మహాకవి ఏవిధముగా తెలుపుచున్నారో చూడండి.
నూనం హితే కవివరా విపరీతవాదో
యే నిత్య మాహూరబలా ఇతి కామినీస్థాః
యాభిర్వైలోలతరతారకదృషిపాతైః
శక్రాదయ్ఽపి విజితాస్త్వబలాః కధం తాః?
అతివలజూచి వీరబల లంచు వచించు మహాకవీంద్రులు
ద్ధతవిపరీతవాదు,విది దబ్బర గాదు, విలాసినీసమం
చితతరలాక్షిపాతములచే గెలువంబడి రింద్రముఖ్యులున్
ధృతి నటువంటి వా రబల లేగతి నైరి తలంచి చూడగన్?
స్త్రీలను చూచి వీరు బలం లేనివారని (వీరు+అబలలు = వీరబలలు) వర్ణించే కవుల మాటలు, గమనించినచో,
సత్యదూరములు. కేవలము, చంచలములైన తమ కనుపాపల కదలికచే, సర్వరాక్షస సంహారము గావించుటయే
గాక, ఇంద్రాదిదేవతలను తృటిలో గెలువగలిగిన వారు
అబలలెట్లగుదురు?
కావున వారు సబలలు అన్నది భర్తృహరి సంస్కృతములోనూ, దానిని అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి గారు
తెనుగులోనూ తెల్పిన మాట.
చెప్పుకోతగ్గ కాలం మన దేశాన్ని శాసించినది ఒక ‘విదేశీ మహిళ’. ఆమె
అత్త దేశానికి నిరంకుశ నేతయై పాలించింది. డిల్లీ ఒకప్పటి ముఖ్యమంత్రి మహిళ, నేడు మన దేశపు వంగ రాష్ట్రమును పాలించేది మహిళ.
డిసెంబరు 5, 2016 వరకు తమిళనాడును ఏలినది ఒక మహిళ. ఆమె ప్రాణగండముగా ప్రచారము
పొంది, కారావాసము చేస్తూ కూడా అక్కడి శాసనములను తనకనువుగా మలచుకోన్నది మహిళ. ఒకనాటి రూపాయికాసుబొట్టుతో ప్రముఖ రాజకీయ పార్టీని నడిపింది మహిళ. ఇక సంపూర్ణ
విద్యావంతుల రాష్ట్రముగా పేరు పొందిన పొరుగు రాష్ట్రములో నేటికీ మాతృ స్వామ్యమే! ఇక
వ్యాపారాల్లో,
ఉద్యోగాల్లో మహిళలలు ఎందఱో ప్రపంచములోనే అగ్రస్థానమును పొందినారు కదా!
అంతెందుకు మా ఇంటిలో నాభార్యదే రాజ్యము. తన అంగరక్షకులు సామతులు నా కుమార్తెలిద్దరూ. ఇంత వరకూ చెప్పినదంతా కొందరు అత్యాధునిక భారతీయ మహిళల గూర్చి
మాత్రమే!
ఇంత చెప్పించిన్బ చిలకమర్తివారికి, సకల మహిళాస్వరూపమైన అనుట ఎలా, సకల చరాచర సృష్టికి మూలము జగజ్జనని
యగు ఆ తల్లియే కదా!
అందుకే జగద్గురువగు ఆది శంకరులవారు
శ్లో.. శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి !!
ఇది సౌందర్య లహరిలోని మొట్టమొదటి శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే..”అమ్మా..శివుడు శక్తితో (నీతో) కూడి ఉన్నప్పుడే సృష్టించగలడు. లేని పక్షంలో ఆ మహాదేవుడు కదలడానికి సైతం అశక్తుడే.అందుకే త్రిమూర్తులకు ఆరాధ్యురాలవగు నిన్ను స్తుతించడానికి గాని,నీకు ప్రణమిల్లడానికి గాని పూర్వపుణ్యం లేనివాడు ఎలా సమర్ధుడవుతాడు..??
ది పరాశాక్తికి నమస్కరించి శెలవు తీసుకొంటాను.
స్వస్తి.
Very nice and descriptive
ReplyDelete