Wednesday, 26 October 2016

ప్రతిష్ఠ, బ్రతుకు చీకటి ...,మా బడి

ప్రతిష్ఠ 

ప్రతిష్ఠను గూర్చి నా ఈ నాలుగు మాటలు చదవండి 

ప్రతిష్ఠ అంటే ఏమని ప్రశ్నించితి నొక నాడు 
ధనము పలికె తానేనని దర్పముగా ఎదుట నిలిచి 
ప్రతిభ పలికె తానేనని ప్రత్యర్థిగ తెలియ బరచి 
ప్రతిష్ఠతా చిన్ననవ్వు ప్రసరించుచు ఇట్లుపలికె 
వారిమాట నిజముకాదు వాస్తవమున ఆ పదమ్ము 
సద్వర్తనకే చెందును సత్యము ఇది దైవవాక్కు
मैंने पूछा प्रतिष्ठा किसका है न्यारा
धन बोला प्रतिष्ठा मेरा है दुलारा
फ़न बोला प्रतिष्ठा मेरा है किनारा
लेकिन बोली प्रतिष्ठा मेरा है सहारा
न तो धन,न तो फ़न,पर वो है सिर्फ़ गुण
Once I asked ' cause of honour' someone to share
Wealth declared'I am the cause of honour every where'
Talent said 'None but I the badge of honour wear'
Honor remarked 'Both of you are quite off the mark'
I am the God's secret 'which goodness doth share'

_____________________________________________________________________________________
బ్రతుకు చీకటి లోన చిరుదివ్వె వెలిగింది

చదవకుండానే like కొట్టవద్దండి. ఇది ఒక నిస్సంతు (బిడ్డలు లేనివాడు) హృదయనివేదన.మనసు పెట్టి చదవండి.మీ హృదయాన్ని ఈ ఉదంతము కదిలించితే, నాలుగు మాటలు మీరు వ్రాస్తే, అవి ఇంకా కొన్ని జంటలను ఉద్దీపించ గలుగుతాయేమో!

నాకు దాదాపు 40 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు కలుగలేదు.కొలువని స్వామీ లేడు,కలువని స్వామీ లేడు. నేను ఏ జన్మలో చేసినదో కీడు, తీరిపోయిందొకనాడు,గురువు కరుణించినాడు, దైవములు ఇరువురూ అనుగ్రహించినారు.

ఆ గురువు రాఘవేంద్రుడు,ఒక దైవము పెంచల నరసింహుడు. వేరొక దైవము రామేశ్వర రామలింగేశ్వరుడు. .
మృత్యు ముఖము నుండి నా శ్రీమతిని రాఘవేంద్రుడు ఏవిధముగా కాపాడినాడో ఒకపరి వ్రాసియుండినాను. ఇప్పుడు పెంచేల నరసింహుడు , మంత్రాలయ రాఘవేంద్రుడు,రామేశ్వర రామలింగేశ్వరుడు పిల్లల కోసం తల్లడిల్లే మా దంపతులపై ఎట్లు కరుణించినారో ఎరుక పరచుతాను.

అది రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం. పూర్తిగా అటవీ ప్రాంతం. అయినా సరే ఎటు చూసిన భక్త జనం కిటికిటలాడుతుంటారు. మొక్కు తీర్చుకోవడానికి బారులు తీరి వస్తుంటారు. కోరిన భక్తులకు అక్కడి స్వామి నిజంగా కొంగుబంగారమే. ఆయనే లక్ష్మి నరసింహస్వామి. ఆయన ఉన్న స్థలమే పెంచలకోన . ప్రశాంతత కోసం నరసింహస్వామి ఈ ప్రాంతాన్ని చేరుకుని స్థిరపడ్డట్లు పురాణాలు చెపుతున్నాయి.  కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసినారని రని అంటూవుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గంలోని పెంచలకోనజిల్లా కేంద్రమైన నెల్లూరుకు దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుంచి ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ బస్సు సౌకర్యం ఉంది. అదే స్థాయిలో కడప జిల్లా రాజంపేట నుంచి బస్సులున్నాయి.

లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మీదేవిని పెనవేసుకుని శిలగా స్థిరపడినట్లు చరిత్ర చెబుతుండడంతో ఈ క్షేత్రం పెనుశిలగా పేరుగాంచింది. స్వా మివారిని భక్తులు పెంచలస్వామిగా పిలుస్తారు. నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లోని నదీపరీవాహక ప్రాం తమైన పెనుశిల క్రమేణా పెంచలకోనగా మారింది. 

1809లో 200 ఎకరాల అటవీ ప్రాంతాన్ని పెంచలకోన క్షేత్రానికి హంటన్‌దొర  ధారాదత్తం చేసినట్లు ఆధారాలున్నాయి. హిరణ్యకశికున్ని వధించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి పెంచలకోన అడవుల్లోని చెంచు వనితను మో హించి, మనుమాడారని పెద్దలు చెబుతారు. ఎత్తై కొండ లు, దట్టమైన అడవుల మధ్య కండలేరు ఒడ్డున స్వామి వారు స్వయంభుగా వెలిశారని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణుమూర్తి తొమ్మిదోఅవతారంగా పెంచలకోన క్షేత్రంలో స్వామి వారు కొలువైఉన్నారని అంటారు. వైష్ణవ క్షేత్రాల్లో పెద్దదిగా పెంచలకోనకు పేరుంది. ఇక్కడి గర్భగుడిని సుమారు 800 ఏళ్ల కిందట నిర్మించి ఉంటారని అంచనా వేశారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో సంతానలక్ష్మి వటవృక్షం వుంది.సంతానం లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. 

ఈ క్షేత్రం లో సప్తతీర్థాలు ఉన్నాయి. కొండమీద నుంచి కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు హరించి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ పిల్లల కొరకు స్వామికి వరపడటం ప్రత్యేకత. 

ఈ క్షేత్రానికి నేను మా తండ్రి అమ్మమ్మ గార్లతో నాకు 8 సంవత్సరాల వయసు వున్నపుడు పోయి వుండినాను.అప్పుడు ఆయన ఒక పిల్లలు లేని జంటను తన వెంట పిలుచుకుపోయి స్వామీ ముందు వరపడ
జేసినారు.వారు స్వామీ కృపా కటాక్షము వల్ల కాలాంతరమున సంతానవంతులైనారు.

ఆడవారు కట్టుబట్టతో కోనేటిలో శిరస్త్నానమాచరించి ఏమాత్రము బట్ట పిండుకోకుండా వళ్ళు తుడుచుకోకుండా
స్వామి గర్భ గుడిముందు బోర్లా సాగిలబడి చేతులు సాచి స్వామికి దండం పెడుతూ కళ్ళు మూసుకొని ఉండిపోతారు. వారికి తెలియకుండానే సుషుప్తిలోకి జారుకొంటారు.వారి వారి కర్మ ఫలాన్ని బట్టి స్వామీవారు ఫలితాన్ని తప్పక స్వప్నములో ఎదో ఒక రూపములో అంద జేస్తారు. అదే జరిగి తీరుతుంది. దానిని వరపడుట అంటారు.30 సంవత్సరాల తరువాత మా తండ్రిగారు మా దంపతుల విషయములో కూడా అదే చేసినారు. అప్పటికే 10 ఆపరేషనులు జరిగి, ఒక డాక్టరు అసమర్థత వలన కడుపు బాగా పెరిగి పోయిన, అప్పటికి 31 సంవత్సరములు కలిగిన నా శ్రీమతి అసలు బోర్లా 3,4 గంటలు ఎట్లు వరపడినదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఆమె వరపడి
యున్నంతసేపు నేను స్వామికి గర్భగుడి చుట్టూ ప్రక్షిణలు చెస్తీనె వుండిపోయినాను. స్వామి తనకు పూవులు పళ్ళు స్వప్నములో ఇచ్చినట్లనిపించింది. పూజారిగారు ఆడపిల్ల కలుగుతుందని చెప్పినారు. కళ్ళు మూసుకుకొని నిద్రలోకి జారిపోయిన తనకు తాను వరపడినంతసేపూ నేను ప్రదక్షిణాలు చేస్తూవున్నట్లే ఉండినదట.తాను వరపడినంతవరకూ నాకు ప్రదక్షిణలు చేస్తూ ఉండవలెనన్న వూహ కూడా లేదు.అంతా ఆయన లీల.

అక్కడనుండి వచ్చినతరువాత నేను ఉద్యోగరీత్యా తిరుపతిలో వున్నప్పుడు  మా జోనల్ ఆఫీసుకు (అప్పుడు నా ఉద్యోగము అక్కడ) 9 గంటలకల్లా పోయేవాడిని, అంటే ఆఫీసు టైమునకంటే గంట ముందే. అందువల్ల మధ్యాహ్నము బోజనమునకు ఇంటికి వచ్చి అన్నము తిన్న వెంటనే ఆఫీసుకు పోయే వాడిని . ఆరోజూ అదేవిధముగా నేను వచ్చేసమయానికి , వంటింటిలోనున్న దేవుని మందహాసమునకు ఎదురుగా బోర్ల సాగిలబడి, రెండుచేతులు సాచి జోడించి మ్రొక్కె భంగిమలో, స్మారకమే లేని స్థితిలో వుండినది. నేను వచ్చిన అలికిడి విన్నంతనే లేసు వ్యక్తి పిలిచినా పలుకలేదు. నేను ఆపై పిలువక అత్లీ వుండిపోయినాను. కాసేపైనతరువాత లేచి రాఘవేంద్రులవారు స్వప్నములో ఫల తాంబూలము నిచ్చినట్లు చెప్పినది. ఆ తరువాత బహిష్టు కాలేదు.

అంత మాత్రము చేత అది గర్భధారణ అని నిర్దారించుకోలేని స్థితి మా అందరిదీ. అందరిదీ అంటే నాది,నా శ్రీమతిది మా తండ్రిది నన్ను పెంచిన మా అమ్మమ్మది. కొన్ని దినముల తరువాత పరిస్థితులు కలిసి రావడము వల్ల దక్షిణ దేశ యాత్రకు బయలుదెరినాము. మొదలు చెన్నపట్టణము చేరి, అప్పటికి ఒక సంవత్సరమునుండి చికిత్స చేయించు  కోనుచుండిన, ప్రపంచములో ఏర్పరచిన 'అపోలో హాస్పిటల్స్' మొదటి  శాఖ లోని గర్భ చికిత్సా నిపుణురాలయిన (gynecologist) డా. వాసంతి వద్దకు వెళ్ళ్లినాము. ఆమె 'అల్ట్రా సౌండ్' పరీక్ష చేయించి ఫలితములు (results) చూసి గర్భ ధారణ జరుగలేదు అని తెల్పినది.అప్పటికి నా శ్రీమతికి రెండు నెలలు దాటి పది రోజులు దాదాపుగా అయి వుండినది. నేను మాత్రము ఆ మాటను నమ్మలేక అమ్మా నాకు అది pregnency గానే తోచుచున్నది. harmonal టాబ్లెట్స్ ఇవ్వవద్దని చెప్పినాను.ఆమె నామాటను గౌరవించుతూ మీరు తీర్థయాత్రలకు పోయివచ్చునపుడు వచ్చే దారి ఇదే కదా కాబట్టి అప్పుడు తిరిగీ checking కు వచ్చేది అని చెప్పింది.నేను సరే అని చెప్పి తీర్థయాత్రలకు బయలుదేరినాను.

తీర్థ క్షేత్ర విగ్రహ దర్శనాదులు చేసుకొంటూ రామేశ్వరము చేరినాము. అక్కడ శారీరిక మానసిక ఆర్ధిక వంచనలేకుండా నాగప్రతిష్ఠ చేయించి కన్యాకుమారి మీదుగా కేరలపుణ్యక్షేత్రములు చూసుకొంటూ చెన్నపట్టణము చేరినాము. డాక్టర్ వాసంతి గారి వద్దకు వెళ్ళితే తిరిగి scanning చేయించి గర్భము కాదు అని తెల్చినారు. అట్లు తేల్చి 'dufastan' అన్న tablets వ్రాసియిచ్చినారు(పేరు వ్రాసినానని doctor ను సంప్రదించనిదే, మీరు వాడవద్దు.) ఆ చీటీ చేతికి తీసుకొంటూ అమ్మా నాకు ఇంకా తాను కడుపుతో ఉన్నదన్న నమ్మకమే వున్నది. ఈ మాత్రలు చెడుపు చేయవు కదా అని అడిగినాను. ఆమె ఎంతో అభిమానముతో మారు ఆచింత పెట్టుకోనక్కరలేదు. ఇవి pregnency టెస్ట్ గా కూడా పని చేస్తాయి. రెండుమాత్రలు వేసుకొన్న తరువాత ఒక వారము లోపల బైట చేరకుంటే అది pregnency గా మీరు నిశ్చయించుకోవచ్చు అని చెప్పినది. నా శ్రీమతికి అవి వాడిన పదిహేను రోజులవరకు వేచియుండి, ఆ తరువాత తిరిగి చెన్నపట్నం అపోలో డా.వాసంతి గారి వద్దకు చేరినాము.తిరిగి వారు scanning చేయించి అప్పుడు అది గర్భమని నిర్ధారించినారు.

మాపై ఆ పెనుశిల నరసింహుడు ఆ రాఘవేంద్రుడు,ఆ రామలింగేశ్వరుడు దయ చూపుట చేత ఆ కాన్పులో ఒక అమ్మాయి ఆపై సంవత్సరము పై ముడునేలలకింకొక అమ్మాయి కలిగినారు. అబ్బాయి కొరకు ఇంకొక సంవత్సరము sterilize చేయించుకోకుండా ఆగుతారా అని ఆపరేషన్ థియేటరు నుండి తన అసిస్టెంట్ డాక్టర్ను పంపి అడిగించిందిదాక్టరమ్మ.ఇదే చాలు, ఇంతే చాలు అని అన్నాను.

నమ్మకమెప్పుడూ నడిపిస్తుంది. అపనమ్మకమో ఆపేస్తుంది.

నా శ్రీమతి తో సమానముగా నేనూ ఆ ముహుర్తానికే ఈ గేయము ప్రసవించినాను.
చదివితే ఒక నిస్సంతు ఆత్మ వేదన ఏమిటో మీకు తెలుస్తుంది. సంతానము ఎంత స్పూర్తిదాయకమన్నది కూడా అర్థమౌతుంది.

ఇంటి కేతెంచిన అతిధి అభ్యాగతులు పాప లెక్కడ మాకు కనిపించరే మనిన

కడుపులో కన్నీటికడవలను దాచుకొని కరుడుకట్టిన కంటిపాప జూపుచునుంటి

బోసి నవ్వులు మాకు కనిపించవే మనిన పటము లో గాంధీని పరికించ మంటి

తప్పటడుగులు ఇంట కనరావు మాకనిన వయసుమీరిన యవ్వవంక గాంచమనంటి

పసిపాప ఏడుపులు పసిగట్టకుంటిమన మనసార ఇల్లాలి మోముజూడమనంటి

కటిక చీకటి యాయె కరదీపి కేదియన *కరముల కొరకు నే కాచుకొన్నానంటి   (కరములు=కిరణములు, వెలుగు)

చిలుకపలుకులు వినగ మనసాయెననియన్న చిద్విలాసునికరుణ  చిలుకవలె నంటి

ప్రశ్న ప్రశ్నకు నాకు బడులిచ్చు ఓపిక రాను రానూ సన్నగిలి పోవు చుండగా

అన్ని ప్రశ్నల కోక్కటే జవాబును కూర్ప పసిపాప నందించె పరమేశ్వరుడు నాకు

బ్రతుకు చీకటిలోన చిరుదివ్వె వెలిగింది నా గమనమునకిపుడు గమ్యమగుపించింది
స్వస్తి
_________________________________________________________________________________


మా బడి (గేయము)

నేను వ్రాసిన ఈ గేయము బాగుంటే మీ పిల్లలకు నేర్పండి . 

అదిగోనండీ అదియే మాబడి 
చదువుల తల్లికి నిర్మించిన గుడి 
నేర్పును మాకది చక్కని నడవడి 
కాదది బడి మా తల్లి యొడి 

అమ్మా నాన్నల పెట్టక ఆరడి 
చేయక ఎప్పుడు మాటల గారడి
బడికి పోయెదము రోజూ వడివడి
నిలువమెప్పుడూ అడుగులు తడబడి

గురు వచనములకు కట్టుబడి
పాఠము విందుము చేయక సవ్వడి
పోకుండా మేమెప్పటికీ చెడి
కాచేవారలు సురలు సుడీ


చెరుకు రామ మొహన్ రావు



No comments:

Post a Comment