Friday, 6 September 2013

కాంచీపురము

కాంచీపురము

https://cherukurammohan.blogspot.com/2013/09/blog-post_6.html

పుష్పేషు జాతీ, పురుషేషు విష్ణు నారీషు రంభా, నగరేషు కాంచీ... అంటారు పెద్దలు

కాంచి అంటే సంస్కృతం లో వఢ్యాణము అని అర్థము. ఈ పట్టణము అతి ప్రాచీనమైనది. ఇది వేగావతీ నది యొడ్డున వుంది. చాలాకాలమీ పట్టణము పల్లవుల చోళుల తదనంతరం పాండ్యుల ఆపైన విజయ నగర రాజుల పరిపాలనలో ఉండిపొయినది. వారి తరువాత ముస్లిం క్రైస్తవ ప్రభుత ఏడిలోకి  ఇందులో క్రీ.శ.788–820 మధ్యకాలములొ 'ఘటికాస్థానము'

లనబడు గురుకులములుండేవి. .(ఘటికా స్థానమని ఎందుకంటారు అన్నవిషయాన్ని

వేరొకసారి ముచ్చటించు కొందాము).

ఇక్కడ వుండే దేవాలయాలు లెక్కకు మిక్కుటములు. అందుకే 'కంచి లోని గుళ్ళు తిరుపతి లోని గుండ్లు లెక్కించలేమంటారు.' ఒకప్పుడిది జైన బౌద్ధ ధర్మములకిది ఆలవాలము. 4 నుండి 9వ శతాబ్దము వరకు ఇది పల్లవుల రాజధాని.

 జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారి (కాలము క్రీ.పూ.509-477 అని నిర్ద్వంద్వముగా పండిత కోట వెంకటాచలం గారు నిరూపించినారు. ఆ విషయము వేరొకసారి ప్రస్తావించుతాను. ప్రస్తుతానికి క్రీ.శ.788–820 కాదని గ్రహించ గలిగిన చాలు. వారి కాల నిర్ణయమును గూర్చి వేరోకసారి ప్రస్తావించుతాను. వారి చేతనే స్థాపించబడి వారే మొదటి గురువై విలసిల్లిన గురు పీఠము కల్గిన పట్టణమిది. ఈ పీఠమును వారు 6 సం. మాత్రమే అలంకరించినారు.ఇక ఈ పీఠము నధిష్ఠించి నడిచే దేవునిగా కొనియాడబడిన చంద్ర శేఖర సరస్వతీ స్వామివారిని గూర్చినే నెక్కువగా చెప్ప నక్కర లేదు.

కంచి పట్టుకు తుది మెట్టు. ఇప్పటికీ అక్కడి నేతపనివారు (సాలె వారు) చాలామంది తెలుగువారే. ఒకప్పుడు అంతా తెలుగు వారే. ఆరోజుల్లో ఈ నగరము అత్యుత్తమమైనదిగా పేరుగాంచి యుండినది. అందుకే 'పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ నగరేషు కంచి' అని ముందే చెప్పుకొన్నాము. కాళీదాస మహాకవి గారు. యువాన్ త్సువాంగ్ అన్న చైనా బౌద్ధ భిక్షువు ఈ పట్టణాన్ని 7వ శతాబ్దములో సందర్శించినపుడు ఇది 6 మైళ్ళ (అంటే ఇంచుమించు 10 కి. మీ.) పరిధి కలిగియుండినదని తన పుస్తకములో వ్రాసుకొన్నాడు. ఇక్కడి ప్రజలు ధైర్యమూ నీతి న్యాయము ధర్మమునకు నిజాయితీకి కట్టుబడిన వాళ్ళని తన పుస్తకములో తెలియబరచినాడు.

 

చైనాకు బౌద్ధ ధర్మమును గొనిపోవుటయేగాక షావోలిన్ కుంగ్ఫూ అక్కడ ప్రవేశపెట్టిన బోదిధర్మ ఇక్కడివాడు .

'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచి అవంతికాపురీ ద్వారావతి చైవ సప్తైతే మోక్ష దాయకాః' అన్న ఈ ఆర్యవాక్కు ననుసరించి ఈ క్షేత్రము (అంటే దేవాలయములు కాక ఈ పట్టణ భూమియే) మోక్ష దాయకమయిన 7 క్షేత్రములలో ఒకటి. కంచి రెండు గా విభజింప బడినది.

వైష్ణవములో ముఖ్యమైన రెండు శాఖలు 1.వడఘలై 2.తేంఘలై . మొదటి తెగకు శ్రీరంగము, అహోబిలము రెండవదానికి కాంచీపురము తిరుమల ముఖ్య మఠములు కలిగియున్నవి. కంచి లోని తిరుకోయిలూర్ లో వీరి మఠము గలదు.ఇక్కడి అనేక ముఖ్యమైన ప్రాంతములలో అతిముఖ్యమైనవి నాలుగు.

1.       కంచి వరద రాజ పెరుమాళ్ : ఇక్కడ ఈయన ఆది లోనే వెలసినస్వామి. వీరి అతి పురాతన దేవాలయము విష్ణుకంచి లో గలదు. ప్రసిద్ధి చెందినా బంగారు,వెండి బల్లులుండేది ఇక్కడే. మనదేశమును తన శక్తికి మించి దోచుకొన్న రాబర్ట్ క్లైవు, స్వామి ద్యకోసమేమో, వజ్రాలహారాన్ని ఆయనకు చేయించినట్లు చెబుతారు. సందర్భము వచ్చినది కాబట్టి 'కంచి గరుడ సేవ' ను గూర్చి నాలుగు మాటలు చెబుతాను. 

శ్రీ మహావిష్ణువునకు వాహనము గరుత్మంతుడు. ఆకాశంలో గరుడిని చూడటం అతనికూత వినటము మహాద్భాగ్యముగా చెప్పుకొంటారు. అతనికూత ‘కృష్ణా’ అని వినిపిస్తుందని పెద్దలు చెబుతూ వుంటారు. ‘కంచి గరుడ సేవ’ అన్న జాతీయం ఆసక్తికరంగా ఉంటుంది. 108 దివ్యదేశాల్లో ఒకటైన ఖ్యాతికెక్కిన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాధుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే వరదరాజ స్వామి ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. ఆ ఉత్సవమూర్తికంటే  గరుత్మంతుని వాహనం చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రము చేయవలసి ఉంటుంది. దాన్ని శుభ్రం చేసే క్రమంలో అలిసిపోతుంటారు. ‘ స్వామి వారిని గరుడ సేవకు గరుడిని సిద్ధము చేయుటకు. స్వామీ విగ్రహము చిన్నది, గరుడ వాహనము అతి పెద్దది. స్వామిని సిద్ధము చేయుటకు ఒక గంట పడితే గరుడుని సిద్ధము చేయుటకు ఏడూ కేక ఎనిమిది గంటలు పడుతుంది. శుభ్రము చేస్తూ చేస్తూ అర్చకులు అలసిపోతారు. ఇంత చేసినా ఈయనేమన్నా అలసట తీరుస్తాడా,  వరాలు ఇస్తాడా, అదేదో స్వామి వారికి చేస్తే మనకెంతో పుణ్యం కదా!’ అని వాపోతుంటారు అటు అర్చకులు ఇటు భక్తులు. కావున కంచి గరుడసేవలో కష్టము తప్ప ఫలితము ఉండదు.  ఎప్పుడైనా మనం చేసిన పనులు వృథా అయినప్పుడు ఈ గరుడ సేవతో పోలుస్తూ ‘ కంచి గరుడ సేవ’ అనే జాతీయాన్ని వాడుతుంటారు.

2. కామాక్షీ దేవి :కంచి లో తల్లి లీలలు అనూహ్యములు అనంతములు. ఈమె విగ్రహములోని తీక్షణతను తగ్గించి శాంతింప జేసినవారు శంకరాచార్యులవారు. అమ్మవారి ఎదుట శ్రీ చక్రమును ప్రతిష్ఠించి పూజలు చేయ ,వారు నిర్దేశించినారు. వారిమాట నేటికి అమలు జరుగుచున్నది. అమ్మనుఆరాధించిన ఒక మూగకు మాటలు వచ్చుటే గాక ఆ మహానుభావుడు మూక పంచశతి తి అను మహాకావ్యము అమ్మవారి దయాపరాయణత్వమును గూర్చి వ్రాసి మూకకవిగా అమ్మవారి భక్తకోటి హృదయాలలో చెరగని ముద్ర తో నిలచిపోయినాడు. ఆ మహనీయుని పాదదోయికి శతసహస్ర వందనములు.

3. ఎకామ్ర నాధుడు : స్వామి స్వాయంభు లింగము. ఈ లింగము పంచ భూత లింగములలో మొదటిది. దీనిని పృథివీ లింగము అంటారు. జంబుకేశ్వరము (తిరువానిక్కావిల్) ఆపో లింగము. ఇక్కడ గర్భ గుడిలో దేవుని వద్ద ఎప్పుడూ తడిగానే వుంటుంది. అరుణాచలము తేజోలింగము. తమిళము లో తిరువణ్ణామలై అంటారు. కాళహస్తి వాయు లింగము. గర్భ గుడిలోని దీపము,గాలి వచ్చే అవకాశము లేకుండానే ఎప్పుడూ రెపరెపలాడుతూనే వుంటుంది. మిగిలింది ఆకాశ లింగం. స్వామి అమ్మవారితో ఒక తెరలోపల వుంటారు. ఈ తెరనే మాయ అంటారు. తెర తీస్తే అక్కడ చర్మ చక్షువులకేమీ కనిపించదు. 'ఆకాశం గగనం శూన్యం' అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా . నటరాజ విగ్రహము మనము చూడవచ్చు. ఆయన ఈ జగన్నాటక సూత్ర ధారి.

ఇక ఈ ఎకామ్రనాధ దేవాలయము 23 ఎకరముల విస్తీర్ణములో వుంది. ఫాల్గుణ మాస బహుళ పక్షంలో అంటే మార్చి చివర ఏప్రిల్ మొదటి వారములో 3 దినములు స్వామీ పాదాలమీద సూర్యకిరణములు పడతాయి.

ఇక్కడి ఆమ్ర వృక్షము దాదాపు 3500 సం.ల వయసు కలిగినదని చెబుతారు. అంత విస్తీర్ణములో ఇది ఒకటే మామిడి చెట్టు. దీని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఫలము మాత్రమె కాస్తుందని జనశ్రుతి . చెట్టును చూస్తూనే ఎన్నో వేల యేళ్ళదని మనకు ఇట్టే తెలిసి పోతుంది.

4. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారి(కాలము క్రీ.పూ.509-477 అని నిర్ద్వంద్వముగా పండిత కోట వెంకటాచలం గారు నిరూపించినారు. ఆ విషయము వేరొకసారి ప్రస్తావించుతాను. ప్రస్తుతానికి క్రీ.శ.788–820 కాదని గ్రహించ గలిగిన చాలు.వారి కాల నిర్ణయమును గూర్చి వేరోకసారి ప్రస్తావించుతాను )చేతనే స్థాపించబడి వారే మొదటి గురువై విలసిల్లిన గురు పీఠము కల్గిన పట్టణమిది.ఈ పీఠమును వారు 6 సం. మాత్రమే అలంకరించినారు.ఇక ఈ పీఠము నధిష్ఠించి నడిచే దేవునిగా కొనియాడబడిన చంద్ర శేఖర సరస్వతీ స్వామివారిని గూర్చినే నెక్కువగా చెప్ప నక్కర లేదు.

ఇప్పటికే చాలా వ్రాసినానేమో. పైన తెలిపిన విషయాలు నాల్గింటినీ కలిపి ఒక సీస పద్యము వ్రాసినాను. ఈ పద్యమును 'ముక్త పద గ్రస్త' ముతో అలంకరించినాను . ప్రీతితో చదువ ప్రార్థన .

వారించి మహిమచే వాంఛితాల వరద

వరదరాజులు బ్రోచు '' '' '' యనుచు

కామాక్షి కన్నులు కామకోటిని చేర్చు

కామకోటినిచేర్చు కడలి యడుగు

ఏకామ్రనాథుని ఎన్ని మదిన గొల్వ

కొల్వ వీలే లేని కోర్కెలడచు

కామకోటీ పీఠ కరుణా సుధా ధారి

దారి చూపు తనదు దరినిజేర

అన్న చెల్లి బావ ఆదిశంకర పీఠ

పీఠ మయ్యి కంచి పేరు గాంచ

కాంచ పుడమి తల్లి కటికి నయ్యెను కాంచి

కాంచి నిలుప భక్తీ కలుగు ముక్తి

తమిళములో '' అంటే 'రా'అని, ఇక తెలుగులో ''అన్నా '' అన్నా 'రా' అనే. అంటే వరదరాజస్వామి భక్తులను రా రా రా అని పిలిచి కోర్కెలు తీర్చి మనల బ్రోచుటకు సిద్ధము గా వున్నాడు.

కోట్లకొలది వున్నా కామములను అంటే కోర్కెలను తీర్చి మనలను కామకోటికి అనగా మోక్షమునకు చేర్చుటకు కామాక్షి తల్లి సిద్దముగా వున్నది .(కోటి అంటే అంచు, కొస, కొన, అని అర్థము. కామమునకు అంచు మోక్షము. ఎందుకంటే చతుర్విధ పురుషార్థములు ధర్మార్థ కామ మోక్షములు. మూడవదైన కామము పిదప వచ్చేది (అంటే కామమునకు అంచు ) మోక్షమే.

ఇక ఎకామ్ర నాథుని మనసారా కొలిస్తే అంటే స్వామిని సేవిస్తే కొలుచుటకు వీలేలేని కోర్కెలను అణచుతాడు.

కామ కోటి పీఠ కరుణా సుధా ధారి అంటే కంచి కామకోటి పీఠ అధిపతి అనగా చంద్రమౌళీశ్వరుడు, ఇంకొక విధంగా ఆలోచిస్తే నడచే దేవుడైన చంద్ర శేఖర సరస్వతి స్వాములవారు తన వద్దకు చేరేదారిని చూపుతాదని కూడా అన్వైన్చుకోన వచ్చును.

కావున ఆవిధమైన అన్న (వరద రాజులవారు అంటే విష్ణువు) ఆయన చెల్లెలు కామాక్షీ దేవి, ఆమె భర్త యగుటవల్ల విష్ణువుకు బావయైన ఏకామ్రేశ్వరుడు, ఆ పైన చంద్రమౌళీశ్వరుడు, చంద్రశేఖర సరస్వతీ సంయమీంద్రుల

పీఠములకు పీఠమై పేరుగాంచిన కంచి భూమికి వఢ్యాణ్ణమై చేలగగా అట్టి కంచి ని గాంచి అంటే చూసి, (తిలకించి) భక్తి నిలిపిన ముక్తి కలుగును .

 

స్వస్తి.

 

No comments:

Post a Comment