Monday, 23 September 2013

శంకరులు -- వారి కాలము(శంకరులవారి కాలము)

శంకరులవారి  కాలము.

సనాతన ధర్మ  ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు, అపర శంకరులు అని కొనియాడబడే జగద్గురు శంకరాచార్యులవారిని గూర్చి ప్రతి సనాతన 
ధర్మావలంబికి తెలుసుకొనవలసిన బాధ్యత ఎంతైనా వున్నది. ఆయన  గురువేగాక, మహాకవి, మహా భక్తుడు, వేదాంతి,ఒక సన్యాసి రూపములో ఈ పుణ్యభూమి నాలుగు చెరగులు నడచి ధర్మ ప్రతిష్ఠ చేసిన మహనీయులు . 
శంకరులు  ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతము సార్వజనీనము. శంకరులు సాక్షాత్తు పరమశివుని అవతారమని నమ్మకం ఉంది.

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః

దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).

కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా

శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు, నీల లోహితుడు అనగా నీలి వర్ణపు రక్తము గలిగిన వాడు అని అర్థము. కాలకూట విషము మింగుట వలన ఆయన 
రక్తమునకు ఆ వర్ణము కల్గినది అన్నది అన్వయము. ఆయనే శివుడు.ఆయనే  స్వయంగా శంకరుల రూపంలో అవతరించినారు. (కూర్మపురాణం నుండి).ఈ సనాతన ధర్మముపై  శంకరుల ప్రభావం అసమానమైనది. 
శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, 
శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పింపజేసినాడు. అసలు ఆయన బౌద్ధముకన్నా ఇతరములైన సనాతన ధర్మ శాఖలను తన వాదముచే సమన్వితము చేసి సంఘటిత పరచినాడు.ఉపనిషత్తులకు, భగవద్గీతకు,
 బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామములకు భాష్యములు వ్రాసినారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్త మైనాయి.

శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలనుస్థాపించినారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేచేస్తూ వున్నాయి. ఈ మహనీయుని రచనలు ఇన్ని 

అన్ని అని చెప్పవీలుకానివి. వారు రచించిన భజగోవిందము అన్న చిన్న పుస్తకమును తీసుకొన్నా దానికి టిప్పణి వేదాంతులలో నిష్ణాతులైనవారు వ్రాస్తే 1000 పుటలకు తక్కువగాని గ్రంథమౌతుంది. గణేశ పంచరత్న స్తోత్రం, 

భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి  రచనలు ఎన్నో ఎన్నెన్నో! ఇది నిజమునకు పాఠ్యాంశముగా నిర్ణయించవలసిన సాహిత్యము. జ్ఞానార్జన కన్నా 
ధనార్జన పై మక్కువ ఎక్కువ చూపే పాలకులకు ఈ సాహిత్యము అన్దేదూదయము, మహా బధిర శంఖారావము , రంభాషండ సంగమము.


జీవిత గాధ

శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాధలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని శంకరుల జీవిత గాధలో ఎన్నో 
అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి. మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచనచిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన వీనికన్నా చిత్సుఖాచార్యులవారు రచించిన 'బృహత్శంకర విజయము' సాధికారత కలిగియున్నది. ఎందుకనగా వారు శంకరుల సమకాలీనులు మరియు వారి శిష్యులు.
పలువిధములైన శాఖలు,ప్రశాఖలు ఏర్పడుట చేత  వైదిక కర్మలు సంకటంలో పడగా. ఆ సమయంలో శంకరాచార్యులవారు వివిధ శాఖలను ఒక్కటిచేసి అందులోనూ విరివిగానున్న  శైవము, వైష్ణవము, శాక్తేయము, 
గాణావత్యము, సౌరవము; అన్న ఆరు మతములను ఒక్కటి జేసి షణ్మత స్థాపకులైనారు,  ఆవిధముగా ఈ   ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.

శంకరుల కాలము (క్రీ.పూ.509-477)
'చరిత్ర' అంటే 'చత్తరా' అనే కాలము లో మనమున్నాము. తల్లి తండ్రుల చాయాచిత్రములు పదిల పరచుకొనే పిల్లలను ఇంకా మనము చూస్తూనే ఉన్నాము. మరి ఆ తల్లిదండ్రులు గతించినా చిత్తరువులు గోడనతుకు కొనియే   వున్నాయి కదా మరి అది చరిత్ర కాదా. ఆ చిత్రములు మాలలువేసి బొట్లు పెట్టి ధూపదీపములుసమర్పించి  మన భక్తీ ప్రపత్తులను చాటుకొంటాము . మన కుటుంబ అభివృధ్ధి కొరకు పాటు పడినవారినే గుర్తు పెట్టుకొని తరువాతి తరానికి ఆ పెద్దల గొప్పదనాన్ని అందజేస్తున్నామే , మరి విశ్వ శ్రేయస్సు కోసం నిస్స్వార్థంగా శ్రమించిన మహనీయుల చరిత్ర గుర్తు పెట్టుకోనవసరం లేదా. కాస్తో కూస్తో మేలుచేసిన కారణానికి జయంతులని, వర్ధంతులని
ఆయా తేదీలు గుర్తుపెట్టుకొని కొందరు పెద్దలకు నివాళులర్పించుకొంటున్నామే మరి విశ్వ శ్రేయస్సే ప్రాధాన్యముగా , మరల భూమి పై ధర్మప్రతిష్ఠాపనకు కంకణం కట్టుకొని నెరవేర్చి అతిపిన్న వయసులోనే పరమపదించిన జగద్గురువులైన శంకరుల వారి కాలనిర్ణయము తెలుసుకోన వలసిన బాధ్యతా మనపై లేదా.

మనచరిత్ర పై మనకు భక్తీ, గౌరవము, శ్రద్ధ మనకుంటుంది. మన ప్రవర మన ప్రక్కన యున్నవాడు చెబితే మనకెట్లుంటుంది. మన చరిత్ర ఆంగ్లేయులు చెబితే మనకూ అట్లే వుండాలి కదా. ఒక సంస్థ తన కార్యాచరణ బేరీజు వేసుకోవాలంటే తన గత ప్రస్థుత పరిస్తితులను పరిగణనలోకి తీసుకొని భవితకు బాట వేసుకొంటుంది. మరి సంస్థలకే చరిత్ర అవసరమైతే దేశానికి అవసరం లేదా. గతము గుర్తుంచుకొంటే ఆ గుర్తులవెంట మనము నడవ వచ్చు.

మన చరిత్ర తమకన్నా ప్రబలమైనది కాకూడదనే దుర్భుద్ది తో మన చరిత్ర వ్రాసినవారు పాశ్చాత్యులు . అందులోభాగంగానే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి కాలాన్ని క్రీ.శ. 788 గా నిర్ణయించినారు.మన మొదటి ప్రధాని పుణ్యమాయని ఇప్పటికీ మనకు ఆంగ్లేయుల వుచ్చిష్టము మెసవక తప్పుటలేదు.

'విమర్శకాగ్రేసర''భారత చరిత్ర భాస్కర' మహామహులైన కోట వెంకటాచలం గారు శంకరులవారి కాలాన్ని సహేతుకంగా నిరూపించినారు. ఆ వెలుతురులో మన యానము ప్రారంభించుదాము.

శంకరుల కాలమునుండి అవిచ్ఛిన్నముగా గురుపరంపర గలిగిన జోషిమఠము,పూరి,ద్వారక,కంచి మఠములు కలి 2593(క్రీ.పూ. 509) శంకరుల కాలంగా నిర్ణయించినారు.
ఈ వాదమునకు నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆదివారం నాడు పునర్వసు నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు శివగురు ఆర్యాంబ దంపతులకు జన్మించినట్లు ఈ క్రింది శ్లోకము తెలియబరచుతుంది. ఇది శంకరులవారి సహాధ్యాయులుగా వుండి పిమ్మట వారి శిష్యుడై సన్యసించి, వారి తదనంతరము గూడా బ్రతికిన చిత్సుఖాచార్యుల వారు వ్రాసిన 'బృహత్ శంకర విజయము' లోనిది.

"తిష్యే ప్రయాత్య నలసేవధి బాణనేత్రే |
యే నందనే దినమణా వుదగధ్వభాజి |

రాధే సితేరుడువినిర్గత మంగ లగ్నే ప్యా  |
హూతవాన్ శివగురుః సచ శంకరేతి ||

అనల =3(త్రేతాగ్నులు), సేవధి==9(నవ నిధులు),బాణ = 5(పంచ బాణుని 
బాణములు) నేత్రే =2(కళ్ళు)

'సంఖ్యాం దక్షిణతో వామః' అని శాస్త్ర వాక్యమని మన చంద్రశేఖర సరస్వతులవారి ఉవాచ.కావున ఆ సంవత్సరము కలి 2593 ఔతుంది. ఇపుడు ఈ మొత్తము శ్లోకము యొక్క సారాంశము ఏమిటంటే 'నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆదివారము పునర్వసు నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు అనగా పై తిథి వార నక్షత్రములు కల్గిన కలి సం. 2593(క్రీ. పూ. 509)లో శంకరులవారు శివగురు దంపతుల శిశువు గా జన్మించినారు.

'జినవిజయ' మనెడు జైన గ్రంథము ఈ విధముగా చెప్పు చున్నది :తదనంతరము 15 సం. గడచిన తరువాత అంటే క్రీ.పూ. 494 లో,కర్మకాండను(పూర్వమీమాంస) కైవల్య మార్గముగా ప్రతిపాదించిన 

కుమారిల భట్టు, (శంకరులకన్నా 48 సం. పెద్దవారు), మహాశయులను, వారు కుమ్ము (వేరుసెనగ పొట్టు నివురు గప్పిన నిప్పు)లో ఆత్మాహుతి చేసుకొనుచున్నఅవసాన దశలో శంకరులవారు వారిని కలిసినట్లు ఈ క్రింది శ్లోకములో చెప్పబడినది.

ఋషి ర్బాణ స్తధా భూమి ర్మర్త్యాక్షౌ వామమేళనాత్|
ఏకత్వేన లభేతాంకం తామ్రాక్షా తత్ర వత్సరః|

ఋషి =7(సప్తర్షులు),బాణ(మన్మధ బాణములు)=5,భూమి=1,మర్త్యాక్షు (మానవుని కన్నులు)=2 ,తామ్రాక్ష =రక్తాక్షి నామ సంవత్సరము
విలోమముగా లెక్కించితే యుధిష్ఠిర శక (జైనులు ,బౌద్ధులు యుధిష్ఠిర శకమును పాటించుతారు. ఆయా మతములకాద్యులు క్షత్రియులు కావుననేమో.)2157 సం. న నిర్యాణమని చెప్పబడినది. యుధిష్ఠిర శకము
కలి.468 లో మొదలైనది. అంటే శంకరులవారి  నిర్యాణము కలి 2625 లో జరిగినట్లు రూఢి యగుచున్నది. అంటే
క్రీ. పూ. 477 అగుచున్నది. అంటే అప్పటికి శంకరులవారి వయసు 32 సం.లు.
వారిని గూర్చిన వివరము ఈ క్రింది శ్లోకములో వున్నది.

అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ శాస్త్రవిత్
శోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరత్యగాత్
8 సం. లో 4 వేదాలు నేర్చుకొని 16 ఏండ్లకు సకలశాస్త్రములను ఆకళింపు చేసుకొని 16 సం. లకు భాష్యములను వ్రాసి 32వ ఏట కైవల్యమును పొందినారు.

వారు 491క్రీ. పూ. లో ద్వారకా మఠమును,486క్రీ. పూ.లో జ్యొతిర్మఠమును 485క్రీ. పూ.లో గోవర్ధన మఠమును 484క్రీ. పూ. లో శృంగేరి మఠమును స్థాపించి వరుసగా హస్తామలక, తోటక ,పద్మపాద,సురెశ్వరులను పీఠాధిపతులనుజేసి కంచి పీఠమునేర్పరచి దానిని వారే అధిష్ఠించారు. ఒక్కశృంగేరి  ీపీఠము తప్పించి,మిగత పీఠములన్నియు, స్వల్ప వ్యత్యాసముతో క్రీ. పూ.5వ శతాబ్దమునే బలపరచుచున్నవి. ప్రముఖ చరిత్రకారులు డా.సర్ జడునాథ్ సర్కార్ గారు తమ 'HISTORY OF DASANAMI NAGAS' లో ఈ విధంగా తెలియబరచినారు : "No paper earlier than the 19th century has been preserved at sringeri mutt and the same list can be accepted as correct at the best from 19th century downwards but not earlier than that period."ఇదే పుస్తకములో వేరొకచోట ఆర్. యన్. ఘోష్ అను నతడు తనకు శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఈ విధంగా చెప్పినట్లు తెలియబరచుచున్నారు "At the request of modern archaeologist,my guru constructed this list......you may take it true or false" అని వ్రాసినారు. దీనిని బట్టి మనకు తెలియవచ్చుచున్నదేమిటంటే వారి వద్ద ఏకారణాంతరాలవల్లనో ఆ రికార్డులు అలభ్యములని తెలియవచ్చున్నది.

పండిత కోట వెంకటాచలం గారి 'మహా భారత యుద్ధ కాలము' అను పరిశోధనా గ్రంథములో 56పేజి నుండి 60వ పేజి వరకు సుధన్వ సార్వభౌముని శాసనమును గూర్చి తెలిపియున్నారు. ఈ శాసనము శంకరులవారికి యుధిష్ఠిరశకము 2663(క్రీ. పూ.477) రక్తాక్షి సంవత్సర ఆశ్వయుజ శుధ్ధ పౌర్ణమికి విజ్ఞ్యప్తి పత్రముగా సమర్పింప బడినది . అటుపిమ్మట కార్తీకములో జగద్గురువులు కైలాస యాత్ర చేసినారు. దీనితో శంకరులవారి కాలము రుజువౌతున్నది.
దీనిని మించిన ఇంకొక నిర్దుష్టమైన ఆధారము ఇక్కడ పొందు పరుప బడినది.
"PILGRIMAGES IN KASHMIR"
"Sankaraacharya"- The shrine is situated in the city of Srinagar. It is an ancient temple crowining

'takht-i-Sulemaan'hill and standing 1000ft. above the valley. The temple as well as the hill take the

name from Sankaraachaarya the great South Indian Teacher of Monoism,who came to Kashmir from

Travancore. The temple was built by king Gopaditya who reigned in Kashmir from 368B.C. to

308B.C. It was repaired by the liberal minded Muslim king Zain-Ul-Abdin"
                                                                 
(The Hindu, dated 17th July,1949, page15,2nd column)    ఇంతకంటే సాక్ష్యాధారాలు అవసరమా. అయినా ఇంకా కొన్ని  ఈ పొందుపరచిన వివరాలను గమనించండి .

1. పైనతెలిపిన శంకరుల జనన కాలము ఆ దినమున నాటి పంచాంగము ప్రకారమూ గ్రహగతి సరిపోవుచున్నది .

2. 'పతంజలి చరిత్ర' అన్న గ్రంథమాధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ. పూ.493 గా నిర్ధారింపబడినది. శృంగేరి పీఠాధిపతులైన అభినవ విరూపాక్ష స్వాములవారు నిర్ణయించడము విశేషము. కావున ఇది కూడా శంకరులవారి జన్మ వత్సరమును బలపరచుచున్నది.

3. క్రీ.శ. 788 కన్నా ముందువారని చరిత్రకారులే ఒప్పుకొన్న మహేంద్ర వర్మ,భవభూతులవారి గ్రంథాలలో శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత ప్రసక్తి వుంది. అంటే ఆయన ఆ కాలానికి చాలా ముందుకాలం వాడని మంకు చెప్పకనే అర్థమౌతుంది కదా.

4. బ్ర.శ్రీ. కోట వెంకటాచలం గారి నేపాల రాజుల వంశ చరిత్రలో శంకరులు, వృష దేవ వర్మ నేపాలును పరిపాలించే కాలంలో ఆ దెస పర్యటన చేసినట్లు చెప్పబడింది. ఆ రాజు పరిపాలనా కాలము కలి శకం 2555-2615 అని చారిత్రికులు నిర్ధారించినారని తెలియబరచి యున్నారు. అంటే ఆయన క్రీ. పూ. 547-487 కాలము వాడు . అంటే అప్పుడు కూడా శంకరుల వారు  క్రీ. పూ.509 - 477 మధ్యకాలము వాడే అని తెలియా వచ్చుచున్నది .

5.మాక్స్ ముల్లరు 'శంకర మందార సౌరభ ' మన్న గ్రంథమును పునాదిగా గైకొని శంకరులవారి జననము క్రీ.శ. 787-88 అని నిర్ధారించి యున్నారు. చిత్సుఖాచార్యులవారు రచించిన'బృహత్ శంకర విజయము'కంటే ఇది అధునాతనమైనది.పైగా  చిత్సుఖాచార్యులవారు శంకరులవారి సమకాలీనులు. ఆయన మాటను త్రోసిరాజని  'శంకర మందార సౌరభ ' మును గీటురాయిగా తీసుకొనుటెట్లు ?

6. డా. పోతక్ మొదలుగాగల కొంతమంది చరిత్రకారులు క్రీ.శ. 788 లో కంచి పీఠాధిపతియైన అభినవ శంకరులవారిని, ఆది శంకరులుగా భ్రమించి ఆదిశంకరులవారి కాలనిర్ణయము చేసినారు.
7. అసలు కోటవారి చరిత్ర ప్రకారము బుద్ధుని జనన కాలము క్రీ.పూ. 1887. అంటే శంకరులవారికన్నా ఎన్నో సంవత్సరముల ముందు కాలము వాడు, అయితే, ఆయన నిర్యాణము క్రీ. పూ. 1807 న జరిగినది. శంకరుల కాలమునకు బౌద్ధము విస్తృతముగా వ్యాపించియున్డినది.

ఇన్ని సాక్ష్యాధారాలమధ్య శంకరులవారి కాలాన్ని పరిష్కరించుటవల్ల మనము పొందే లాభమేమి?
1.ఆ నాటి సాంఘీక ఆచార వ్యవహారాలూ తెలుసు కొనుట
2. వారి తదనంతరము దేశ కాల పరిస్థితిలను సమీక్షించుట
3. వారి తరువాత ఎందరు మహనీయులు ఉధ్భవించినారు మరియు వారి యోగదానము
4. వారి గోప్పదనములో అణు మాత్రమైనా మనము సాధింప ప్రయత్నించుట
5. వారి భాష్యముల,భాషణములద్వారా సచ్ఛీలత,తత్వ సాధనము మున్నగునవి గ్రహించి ప్రచలితము చేయుట
మొదలగు వుపయోగము లేన్నోకలవు.
6.వాస్తవ కాలానికి మిధ్యా కాలానికి మధ్యన గల మహనీయులు మరుగై పోతారు. 



సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ ।
వ్యాసం శుకం గౌడపదం మహాన్తం గోవిన్దయోగీన్ద్రమథాస్య శిష్యమ్ ॥

శ్రీ శఙ్కరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యమ్ ।
తం తోటకం వాతి।ర్కకారమన్యానస్మద్గురూన్ సన్తతమానతోస్మి ॥

జననము

సదాశివుడే ఆదిశంకరుల రూపంలోభూలోకంలోఅవతరించినాడని మనము ముందే చెప్పుకొన్నాము.  కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది.ఆర్యమాంబ,శివగురు లు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతోపుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి,  శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివునిజన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించినారు.

బాల్యము
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించతము తతస్తింరు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించినారు.

అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ శాస్త్రవిత్ 
శోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరత్యగాత్ 

అన్న శ్లోకాన్ని మనము ముందే సార్థకముగా చెప్పుకొన్నాము.
బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్షవేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరిక కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరిక కాయలను వర్షింపజేసింది. ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది.
అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిపాయ  ఇంటివద్దకు తెప్పించి కలకాలమూ అదేవిధముగా ప్రవహింప జేసినారు.   నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి విస్తుపోయినారు.

సన్యాస స్వీకారము
పుణ్యస్య ఫలమిఛ్చంతి పుణ్యం నేఽఛ్చంతి మానవాః |
న పాప ఫల మిఛ్చంతి పాపం కుర్వంతి యత్నతః   ||

ఈ లోకము ఎంతో విచిత్రమైనది. పుణ్యము చేయుట సులభమైన పనికాదని అది చేయదు గానీ దాని ఫలితము మాత్రము కావాలనుకొంటుంది. అదే విధముగా పాప ఫలమును కోరదు గానీ పాపము మాత్రము చేయుటకు వెనుకాడదు. అటువంటిది అంత చిన్న వయసులో సన్యసింప దలచినాడా మహానుభావుడు. అసలు సన్యాసమంటే ఏమిటో చూస్తాము.సమ్యక్-న్యాసః సన్న్యాసః సర్వ సంగ పరిత్యాగమే సన్యాసము.  శాస్త్రాలు బోధించిన ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్య 

ఆశ్రమవాసులు కర్తవ్యాలతోను, గృహస్థాశ్రమం లోనివారు బాధ్యతలతోను ముడిపడి వుంటారు.  వారు తమ కర్తవ్యాలను, బాధ్యతలను విడిచిపెట్టడం ఎంత దోషమో వాటిలోనే కూరుకు పోవడం కూడా అంతే దోషమని గ్రహించాలి.  తన కర్తవ్యాలను, బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించిన వ్యక్తి వాటిని తన తరువాతి తరానికి అప్పజెప్పిమోక్షమనే పరమ పురుషార్థాన్ని పొందేందుకు ఆంతరంగికంగాను, బహిరంగంగాను సంసిద్ధుడు కావాలి.  ఈ సంసిద్ధతనే సన్యాసమని, దీనినే విద్వత్ సన్యాసము, వివిదిషా సన్యాసమని శాస్త్రాలు రెండు విధాలుగా వివరించినాయి. 1. విద్వత్ సన్యాసము  2. వివిదిషా సన్యాసము 

విద్వత్ సన్న్యాసమనగా?

వేదవేదాంత సారమును సంగ్రహించిన విద్వాంసుడు ఆ తత్త్వంలో నిష్ణాతుడై పరమధర్మమైన మోక్షమును పొందుటకు సమస్తాన్ని పరిత్యజించే వాడు విద్వత్ సంన్యాసి.

వివిదిషా సన్న్యాసమనగా?

వేత్తుం ఇచ్చా వివిదిషా .. అంటే శాస్త్రాల ద్వారా తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే సంకల్పంతో తనకున్న ప్రతిబంధకాలను దాటుకుంటూ శ్రవణ, మననముల కొరకై అన్నింటినీ త్యజించేవాడు వివిదిషా సన్యాసి. ఈ విధంగాఐహిక, ఆముష్మిక, సామాజిక, వ్యావహారిక, లౌకిక భావాల నుండి విడివడి, వాటితో లేశమాత్రపు సంబంధమైనా లేకుండా కేవలం ఆత్మస్థితి యందు రమించేవాడే సన్యాసి. వారి వల్ల సమాజానికి ఉపయోగం ఉందా, లేదా అని భావించడం మన అవివేకమే.సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరినారు.  ఆయన జన్మ కారణము ఆయనకు తెలుసు. కానీ తల్లి ఆ విషయమును తెలుసుకోలేదు. తాను ఒంటరి నౌతానన్న కారణంతోనో  లేక కుటుంబాభివృద్ధి కుంటుపడుతుందనో   తల్లి అందుకు అంగీకరించలేదు. యిది యాదృచ్ఛికమో  లేక ఆయనే సృష్టించినారో తెలియదుగానీ ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. మొసలి వదిలితే సన్యాసిగా స్థిరపడతాడు లేకుంటే సన్యాసిగా మొసలికిఆహారమౌతాడు. శంకరుల వారి తల్లిది అడకత్తెర - పోకచెక్క పరిస్థితి యై కూర్చుంది. ఎట్లయితే నేం ఆమె దానికి అంగీకరించక తప్పింది కాదు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాతర్ సాయం దివారాత్రులలో ఎప్పుడయినా ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు చెప్పి తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు తానె చేస్తానని చెప్పి బయలుదేరుతారు.

******************************************************
గోవింద భగవత్పాదుల దర్శనం

తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు.నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

న భూమిర్న తోయం న తేజో న వాయుః
న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః
అనేకాంతికత్వాత్సుషుప్త్యేకసిద్ధః
తదేకో వశిష్టః శివః కేవలో హమ్

నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.) శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేయటము జరిగినది. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వ 

ప్రపంచానికి వెల్లడి చేసినారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగాబోధించినారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించినారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసిచేరుకున్నారు.
వారాణసిలో శంకరులు గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రధమ శిష్యుడయ్యాడు.

మనీషా పంచకం
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.

అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి

 సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః॥ 
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే॥

నాకు జవాబు చెప్పు, ఓ మహానుభావా! నీటి ఉమ్మతో సహా అన్ని చోట్లా నీటిలో మెరిసే సూర్యుడి ప్రతిబింబం లాగానే ఆ పరమాత్మ అయిన పరబ్రహ్మ ప్రతి జీవిలోనూ ప్రతిబింబిస్తాడు. మరి ఈ విభేదాలెందుకు? ఈ ఎక్కువ తక్కువలెందుకు? ఒకడు బ్రాహ్మణుడా, చండాలుడా అనెందుకు చూడాలి? ఎవరిద్దరిలో గొప్ప? గంగలో కనిపించే సూర్యుడి ప్రతిబింబానికీ, చండాలుడి వీధులలో కనిపించే నీటిపై పడే సూర్యుడి ప్రతిబింబానికీ తేడా ఉందా? నీటి పాత్ర బంగారందో లేదా మట్టిదో అయితే అందులోని నీరు కూడా మారిపోతుందా? ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేసినాడు. ఒక్కటి ఇక్కడ తెలియబరచుతాను.

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ,
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచే-
చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ

ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో- మెలకువగా, నిద్రపోతూ, కలలో విహరిస్తూ - అన్ని సందర్భాలలో కనిపించే ఆత్మను తానేనని గుర్తిస్తాడో, విధియయిన బ్రహ్మ మొదలు అతి చిన్నదయిన చీమ వరకూ అన్ని జీవాలలో, అన్ని వస్తువులలో ఉన్న పరమాత్మనే తానని అర్ధం చేసుకుంటాడో. అన్నిఁటా ప్రతిధ్వనించే, కనపడని, అందరినీ గమనించే ఆ పరమాత్మను తానుగా భావించి - తనను అన్నిటిలో చూసుకొనే వ్యక్తిని - అతడు ద్విజుడయిన బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ - నా పరమ గురువుగా అతడిని నేను నమ్ముతాను.

శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించినాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధము జేసిన నాలుగు వేదములకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంత వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపవలె." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయిన పిదప, నన్ను చేరుకుంటావంటూ, శివుడు అంతర్ధాన మయినాడు.

ప్రస్థానత్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరి కి బయలు దేరారు. బదరి లో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రములకు భాష్యములు వ్రాసినారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరినాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవించాడు.
శంకరాచార్యుల శిష్యులు శంకరులకు అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు.

మండన మిశ్రునితో తర్క గోష్ఠి

మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరుడు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరుని లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా,మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తి గా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలి పోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటి కి మండనమిశ్రుని మెడలోని మాల ఒడిలిపోయింది. కాని, భర్త శరీరం లో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరుడు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశ్యంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువుఇమ్మని అడిగినాడు.

పరకాయ ప్రవేశము 
శంకరుడు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ద, ప్రీతి, రతి, దృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని,మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశాడు. చివరికి మండనమిశ్రుడు తన ఒటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యునిగా ప్రసిద్ధుడవు కమ్మని ఆశీర్వదించినారు.

పద్మపాదుడు

శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్ధించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారీనాడు.సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసినారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించినారు.

హస్తామలకుడు

శ్రీశైలము నుండి మూకాంబికా క్షేత్రము వేదాల సంకల్పించి శంకరులవారు వెళుతూ వుండగా అర్థాంతరంగా చనిపోయిన ఒక అల్పాయుష్కుని శవము ముందు భోరున విలపిస్తున్న తల్లిండ్రులు స్వామిని చూసి ఆయన పాదాలపైబడి వారి ఏకైక పుత్రుని బ్రతికించమని వేడుకొంటారు. స్వామీ తన మనోనేత్రముతో ఆ బాలుడు చేయవలసిన కర్మ ఇంకా వున్నదని గ్రహించి ఆతనిని తన తపోబలముతో బ్రతికించి ముందునకు సాగుతారు. మూకాంబికను దర్శించి అమ్మను అనేక విధముల స్తుతించి క్రమంగా 'బలి'అన్న అగ్రహారము చేరుతారు. అక్కడ ప్రభాకరుడు అన్న పండితుడు, తన కుమారుడు  ఉలుకు పలుకు లేని జడునివలె ఎప్పుడూ నిరామయముగా ఉంటాడని విన్నవించుకొంటాడు స్వామి వారితో . శంకరులు ఆ బాలుని చేరదీసి " నాయనా నీవేవ్వరు? నీవు జడునిలాగా ప్రవర్తించుటకు కారణమేమి " యన ఆ బాలుడు అప్పుడే మేలుకోన్నరీతి, అంతకుమునుపే పరిచయమున్న రీతి స్వామీ వారితో ఈ విధముగా పలికినాడు.

నాహం జడః కింతు జడః ప్రవర్తతే 
మత్సన్నిధానేన నసందిహే గురో 
షడూర్మి షడ్భావ వికార వర్జితం
సుఖైకతానాం పరమస్మి తత్పరం

ఓ ఆచార్యా! నేను జడునిగాను. షడూర్ములగు, ఆకలిదప్పులు, శోకమోహములు, జరామరణములు, మరియు షడ్భావములైన పెరగటము, మారటము,తరగటము, విరగటము, అన్నవి, లేనిస్థితి నాది. మరి నాస్థితి ఏది అంటే అత్యంత సుఖప్రదమైన, పరమోత్క్రుష్టమైన, సర్వశ్రేష్టమైన పరబ్రహ్మ స్థితి నాది. అని అంటూ 12 శ్లోకములతో తన స్థితిని గూర్చి వర్ణించినాడు. ఆదిలోనే బ్రహ్మత్వమును అంతగా ఎరిగినవాడు కావుననే శంకరులు ఆయనను హస్తామలకా అన్నారు. ఆమలకము అంటే ఉసరిక కాయ. అది ఒకటి చేతిలోవుంటే ఎన్నో వ్యాధులకు విరోధిగా పని చేస్తుంది. అందుకే 'కరతలామలకము' లేక హస్తామలకము' అన్న నానుడి వచ్చింది. అప్పటి నుండి ఆయన అతి ముఖ్య శిష్యులలో హస్తామలకు  లొకరైనారు.

తోటకుడు

ఆచార్యుల వారి మదిలో శృంగేరి మెదిలింది.శృంగేరి లో తుంగా తీరాన శిష్యులకు ప్రవచనము చేయుచుండగా ఒక బాలకుడు వచ్చి చేరినాడు. అతనికి గురువే సర్వస్వము. గురువు మాట వేదవాక్కు. కానీ ఎందుకో అతని లో ఎక్కడ లేని జడత్వము. ఏమి చెప్పినా అర్థము కాదు. ఎంత ముఖ్యమైన విషయమైనా తన మెదడు లో నిలువదు. అందుకే ఆ బాలుని అందరూ 'ఆచల' మనీ 'గిరి' యనీ పిలువ దొడగినారు. ఆ బాలుడు తుంగా తీరానికి గురువు గారు ఆరవేసిన బట్టలు తెచ్చుటకు వెడలినాడు ఒక రోజు . గురువు గారు ప్రవచనము చేయవలసిన సమయమైనది కానీ ఆ బాలుడు రాలేదు. సమయమగుచున్నది చెప్పండి గురుదేవా! అన్నారు శిష్యులు. శ్రీవారు బట్టలకి వెళ్ళిన బాలుడువచ్చువరకు ఆగుదామన్నారు. 'గిరి' వచ్చు వరకూ ఆగ వలసినదేనా అంటూ హేళన చేసినాడు పద్మపాదుడు. పద్మ పాదుని లో గలిగిన అహంకారానలమును ఆర్పివేయ దలచి గురువుగారు తమ సంకల్ప బలముచే అనల్పజ్ఞానమును ఆ అల్పజ్ఞానికి అనుగ్రహించినారు. అనుకోకుండా అఖండ జ్ఞానమును పొందిన ఆ బాలుడు గురువును గాంచిన వెంటనే హన్దస్సు నందలి తోటక వృత్తములో ఎనిమిది శ్లోకములను గురువుగారిని పొగడుతూ ఆశువుగా చెప్పి అందరినీ అబ్బుర పరచినాడు. ఒక్క శ్లోకమును ఇక్కడ ఉటంకించుచున్నాను.

కరునావరుణాలయ పాలయమాం 
భవసాగర దుఃఖ విదూన హృదం
రచితాఖిల దర్శన తత్వ విదం
భవ శంకర దేశికమే శరణం 

గురువరెంయులగు శంకరాచార్యా! ఓ కరుణా సముద్రమా! భవసాగర దుఃఖముతో గుండె బీటలు బారుచున్న నన్ను రక్షించు.అన్ని దర్శనముల తత్వ జ్ఞానముల రచన చేసిన నీవే నాకు రక్ష అని ఆర్తితో వేడుకోనుచున్నాడు. తోటక వృత్తములో అంత సుందరముగా చెప్పబడిన శ్లోకములచే ఆయన తోటకాచార్యు లైపోయినారు. భగవత్పాదులకు ఇప్పుడు ఉత్తమోత్తములైన శిష్యులు నలుగురు దొరకినారు. వారు 491క్రీ. పూ. లో ద్వారకా మఠమును,486క్రీ. పూ.లో జ్యొతిర్మఠమును 485క్రీ. పూ.లో గోవర్ధన మఠమును 484క్రీ. పూ. లో శృంగేరి మఠమును స్థాపించి వరుసగా హస్తామలక, తోటక ,పద్మపాద,సురెశ్వరులను పీఠాధిపతులనుజేసి కంచి పీఠమునేర్పరచి దానిని వారే అధిష్ఠించినారని అంటారు. 
వారు శృంగేరిలో వున్న సమయములో తల్లి అవసాన దశ చేరినదని తన దివ్య శక్తి ద్వారా తెలుసుకొన్నారు. యోగ శక్తి తో కాలడి చేరి సజీవముగా ఉన్నప్పుడే బ్రహ్మలోక, వికుంత కైలసములు చూపి ఆ పున్యవాతిని ఏది కావలెనో కోరుకోమ్మన్నాడు . ఆమె వైకుంఠము నభిలషించింది. ఆయన తధాస్తు అన్నారు.అగ్రహారీకులు ఆగ్రహించి అడ్డుపడినా అమ్మకిచ్చిన మాటకై అపర కర్మల నాచరించి అచ్యుతపదము నందజేసిన అనన్య సామాన్యు డాయన.

దిగ్విజయ యాత్రలు
 పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాశ్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు. శంకరులను ప్రభంజనము ముందు ఎందు గడ్డి పరకాల వలె ఎగిరిపోయినారు వారంతా! 

సర్వజ్ఞపీఠం అధిరోహణ

శంకరుడు కాశ్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతలో ఉంది ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తులైనారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుని స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని తిరుచ్చూర్‌ లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం"చెబుతున్నది. కాదు కంచి లో అని కూడా అంటారు.చతుర్మఠాల వ్యవస్థ . ఇప్పుడు మఠము పీఠము అంటే ఏమిటో తెలుసుకొందాము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠము అక్కడ దేవతను ప్రతిష్టించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరుడు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా 

దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి,సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఏప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించాడో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరుడు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టాడు. మఠామ్నాయము, మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది.నేటి ఆధునిక పద్ధతులను శంకరుడు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగినది.శంకరుడు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దానిని ప్రవేశపెట్టాడు.హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాతపేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్తపేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అటువంటి పది పేర్లను శంకరుడు నిర్దేశించినాడు. అవి ,తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. 

ఉదాహరణకు- ఆనందతీర్ధ, విద్యారణ్య, సత్యవృతసామాశ్రమి, చంద్రశేఖరసరస్వతి, నృసింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు. శంకరుడు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా 

దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించాడు. వేదము- మహావాక్యము :వేదాలు నాలుగింటి లోను ఒక్కొక్కదానినుండి ఒక్కొక్క వాక్యము తీసుకొనబడినది.

ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ

యజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మి

సామవేదం నుండి తత్త్వమసి

అధర్వణ వేదం నుండి అయమాత్మా బ్రహ్మ

అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్తవేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించుతాయి . ఇక మఠముల వివరములు
శిష్యుడు
మఠం
మహావాక్యం
వేదం
సంప్రదాయం
హస్తామలకాచార్యుడు
గోవర్ధన పీఠం
పూరి
ప్రజ్ఞానం బ్రహ్మా
ఋగ్వేదం
భోగవార
సురేశ్వరాచార్యుడు
శృంగేరి శారదాపీఠం
శృంగేరి
అహం బ్రహ్మాస్మి
యజుర్వేదం
భూరివార
పద్మపాదాచార్యుడు
ద్వారకాపీఠం
ద్వారక
తత్వమసి
సామవేదం
కీటవార
తోటకాచాఱ్యుడు
జ్యోతిర్మఠం
బదరీనాధ్
అయమాత్మా బ్రహ్మా
అథర్వవేదం
ఆనందవార

ఆమ్నాయాలు: ఆమ్నాయాలు ఏడు. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల ఆమ్నాయములు. వీటిలో మొదటి నాలుగు దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి మూడు దృష్టికి గోచరించనివి బుద్దికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞానగోచరములు అని వ్యవహరించినారు.
సాంప్రదాయాలు: సాంప్రదాయాలు నాలుగు విధాలైనవి. 
అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరుడు నాలుగు మఠాలను నిర్దేశించాడు.

మఠ నిర్వహణలో శంకరుని వ్యవస్థానైపుణ్యము మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరుడు ఏర్పరిచాడు. వాటిలోశంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించినాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసినాడు. వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసినాడు. పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్ధిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,"తమ ధర్మాన్ని తామే పోషించాలి" అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకే రూపొందించినాడు.ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ భాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు మరియు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను ఏర్పాటు చేసినాడు.

శంకరుని రచనలు

ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుని రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరుడు ఉదాహరించాడు. స్వానుభవానికి శంకరుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అతని రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుని రచనలుమూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు.భాష్యాలు వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంథాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరుడు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌషీతకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తులనుండి విస్తృతంగా ఉదాహరించినాడు. శంకరుడు క్రింది గ్రంథాల గురించి భాష్యాలు వ్రాసినాడు.

బ్రహ్మసూత్రములు

ఐతరేయోపనిషత్తు (ఋగ్వేదము)

బృహదారణ్యకోపనిషత్తు (శుక్ల యజుర్వేదము)

ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) (శుక్ల యజుర్వేదము)

తైత్తరీయోపనిషత్తు (యజుర్వేదము)

ఛాందోగ్యోపనిషత్తు (అధర్వణ వేదము)

మాండూక్యోపనిషత్తు (అధర్వణ వేదము) మరియు గౌడపాదకారిక

ముండకోపనిషత్తు (అధర్వణ వేదము)

ప్రశ్నోపనిషత్తు (అధర్వణ వేదము)

భగవద్గీత

విష్ణు సహస్రనామ స్తోత్రము

గాయత్రీ మంత్రము

ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు శంకరుడు వ్రాశాడా అన్న విషయం గురించి సందేహాలున్నాయి. బ్రహ్మ సూత్రాలకు శంకరుడు వ్రాసిందే మనకు లభించే మొదటి భాష్యం. 

ప్రకరణ గ్రంథాలు
ప్రకరణ గ్రంథాలు అనగా తత్వ, వేదాంత వివరణలు. గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి.
వివేక చూడామణి

ఉపదేశ సహస్రి

శతశ్లోకి

దశశ్లోకి

ఏక శ్లోకి

పంచ శ్లోకి

ఆత్మబోధ

అపరోక్షానుభూతి

సాధనా పంచకము

నిర్వాణ శతకము

మనీషా పంచకము

యతి పంచకము

వాక్య సుధ

తత్వబోధ

సిద్ధాంత తత్వవిందు

వాక్యవృత్తి

సిద్ధాంత తత్వవిందు

నిర్గుణ మానస పూజ

శంకరుడు వ్రాసినాడని చెప్పబడే వాటిలో "ఉపదేశ సహస్రి" మాత్రం శంకరునిదని   అధికుల అభిప్రాయం. మిగిలిన వాటిపై సంశయాలున్నాయి 

స్తోత్రాలు

భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శంకరుడు తన "గురు స్తోత్రం" ఆరంభంలో చెప్పిన 

"గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః,
 గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః" 

అనే స్తోత్రం ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ధమైనది. 
శంకరులు వ్రాసినారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు:

శివ పంచాక్షరీ స్తోత్రం

ప్రస్థానత్రయం

పాండురంగాష్టకం

సాధన పంచకం

వివేకచూడామణి

శివానందలహరి

మనీషాపంచకం

సౌందర్యలహరి

మీనాక్షీ పంచరత్న స్తోత్రం

ఆనందలహరి

గణేశ పంచరత్న స్తోత్రం

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

భజగోవిందం

కనకథారా స్తోత్రం

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

గంగా స్తోత్రము

వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.శంకరుని తత్వం, సిద్ధాంతం

ప్రధాన వ్యాసం: అద్వైతం

శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరుడు ప్రస్థాన త్రయం (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు) నుండి గ్రహించాడు అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. 

అతని "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -
'బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః' బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, బ్రహ్మమునకు భేదం లేదు శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలుమరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, మహాత్ములు శంకరుని మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించేవారున్నారు. అయితే బ్రహ్మమొక్కటే సత్యమనే విషయానికి ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైత వాదులు అంటారు.


"ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో శంకరులు ఇలా వివరించుతారు

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?

పూర్వ జన్మ లలోని కర్మ వలన.

కర్మ ఎందుకు జరుగుతుంది?

రాగం (కోరిక) వలన.

రాగాదులు ఎందుకు కలుగుతాయి?

అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.

అభిమానం ఎందుకు కలుగుతుంది?

అవివేకం వలన

అవివేకం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానం వలన

అజ్ఞానం ఎందుకు కలుగుతుంది? 

అజ్ఞానానికి కారణం లేదు. 
అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం. అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.ఇటువంటి విషయములు వింటూ, చదువుతూ వుంటే మనకు ఆహా ఓహో అని అనిపించవచ్చు కానీ ఈ వివరణ ఇవ్వడము పరమేశ్వరావతారుడైన శంకరులవారికే సాధ్యము. శంకరుని ప్రభావం బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం కారణంగా శంకరుని కాలంనాటికి హిందూమతం క్షీణ దశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారు తగవులాడుకొంటుండేవారు. మీమాంస, సాంఖ్య వాదులు దాదాపు దేవుడిని నమ్మరు. చార్వాకులు వేదాలను నిరసించారు. ఆది శంకరుడు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించినాడు. భగవంతుని నమ్మేవారినందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశాడు. వేదాలకు తరిగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశాడు కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుని ప్రభావం హిందూమతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొలిపిన సంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయం, షణ్మత విధావం, పంచాయతన విధానం శంకరుడు నెలకొలిపినవే. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్ధులకు ముఖ్యమైన అధ్యయన రంగములు, హిమవన్నగ శృంగములు,మధురసమయ భృంగములు,విరాట్పతికి అంగములు,పరాత్పరుని సంగములు, భగవద్భక్తి విహంగములు. పరమేశ్వర పరిష్వంగములు.

శంకరుని గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం

శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోక శంకరం

వేద వేదాంత పురాణజ్ఞానమునకు ఆలయమైన వాడు, కరుణామూర్తి, లోకమునకు శుభము చేకూర్చువాడు, భగవంతుని పాదముల యొక్క రూపమైనవాడు అగు శంకరులకు నమస్కరిస్తాను అనంతర పరిణామాల శంకరుని అనంతరం అతడి శిష్యులు అద్వైత సిద్ధాంతాన్ని తత్సంబంధిత మతాచారాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. అద్వైత సిద్ధాంతంలో పాండిత్యాన్ని సంపాదించిన పిదప ఎందరో పండితవర్యులు వ్రాసిన వ్యాఖ్యలను పరిశీలించిన మీదట నేడు అమలులో ఉన్న అద్వైత వ్యవస్థలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.నిర్గుణబ్రహ్మ వాదము, బ్రహ్మవివర్త వాదము, అనిర్వచనీయ ఖ్యాతి వాదము, జీవన్ముక్తి వాదము అద్వైత సిధ్ధాంతపు పునాదులపై ప్రతిపాదించ బడిన ఈ నాలుగు సిధ్ధాంతాలూ, ఒకదానికొకటి చక్కని పొంతన కలిగి ఉన్నాయనటంలో సందేహం లేదు.మొదటి రెండు సిద్దాంతాలకూ అధిభౌతిక భావార్థముంటే, మూడవ దానికి అధిభౌతిక మరియు జ్ఞానమీమాంసకు సంబంధించిన భావార్థాలున్నయి. నాలుగవ సిద్ధాంతానికి గొప్ప మౌక్తిక భావార్థమున్నది. ఈ విధముగా ఆయనను గూర్చి ఎంత చెప్పుకుంటూ పోయినా తక్కువే! ఇటువంటి మహనీయుల గడుగుజాడలు మన భవితకు మార్గదర్శకములు శంకరుని తరువాత మహానీయులెందరో భూమిపైకి వచ్చినా శంకరులు మాత్రము జగద్గురువే!

శుభం భూయాత్ 
















Thursday, 19 September 2013

తిరుమల గురించి కొన్ని నిజాలు

                      తిరుమల గురించి కొన్ని నిజాలు*******Some truths about Tirumala
                 (For people who know telugu and who Don't)

1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
1.At the right side of mahadwaara on the threshold of the lord we can find a crow bar, said to have hit by ananthaaLvaar and there from applying 'chandana' started to the idol.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
2.on the head of the idol it is said that real hair is there and 'll not get tangled.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
3.there is a village, 23 k.m. away from tirumala into which there is no entry for outsiders. It is said that the ladies do not wear jackets following the old tradition. every thing in the Sanctam-Sanctoram comes from there only that includes all cow products and flowers.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
4.The lords idol is situated a bit towards the right hand corner and not exactly in the middle.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
5.every day The Lord is adorned with 'Dhoti' down the waist and with 'Saree' above the waist.there is a seva which costs about rs.50,000/= and in that the saree is given to the lady and dhoti to the gent.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
6.From the Sanctum-Sanctorum the used flowers will not be brought out they will be thrown into the waters flowing at the back of the deity.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
At the back of the deity despite wiping with the  towel any number of times there will be moisture.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడులక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
8. Goddess Lakshmi placed on the heart of the lord, during the 'darsan free from any alankaara(Nija Roopa Darsana)' that place of Swami will be coated with sandal paste and after it gets dried it will be sold.
9. స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
9.the flowers that were decorated , will be thrown out (At the back of of the lord into the waters flowing)at the time of next puja with out turning back. for that day the ARCHAKA who did it will not see back during that day. The flowers thrown out thus will appear near Verped  which is 20 k.m. from Tirumala en route KALAHASTI .
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
The lams that are lit before the God will not extinguish.No body knows since how many thousands of years they are burning.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.
during 1800 A.D. for 12 years the temple was closed as it was said that a king of that regime killed 12 people for some malafide done by them.During that period only Vimana Venkateswara was sculpted.


THANK YOU NISANTH FOR GIVING ME AN OPPORTUNITY TO DO SO.

మురళీ కృష్ణుని వేణు గానము

మురళీ కృష్ణుని  వేణు గానము

శృంగార కలితయై శృతిబద్ధమౌ రీతి
కాళింది కడు రమ్య గతిన కదల 
ఘమ్మని కమ్మని కమల సౌరభములు 
మలయానిలమ్ము తో మసలుచుండ 
ఝుమ్మను తుమ్మెదల్ సొంపు సన్నాయిలు 
మేచకళ్యాణితో మేళవింప
గజవధూ గుణము గోగణము నౌదల దాల్చి 
తలలూపుచూ మంద తరము నడువ 

మదన తాపమ్ము గోపికా మదులు నిండ  
మునిజనాళికి ముక్తిని భక్తీ గూర్చ 
ప్రకృతి పులకించగా తాను ప్రమదమంద 
మురళి నూదె విహారి దా మోవి చేర్చి 



        

Friday, 13 September 2013

అవధాన సహస్ర ఫణి

అవధాన సహస్ర ఫణి బ్ర.శ్రీ.వే. మాడుగుల నాగ ఫణి శర్మ గారితో నేను 

సంస్కృతాంధ్రము నందు సవ్యసాచి యతండు 

దేవగురుని ధాత్రి దీటతండు 

ప్రావాణి గళసీమ ప్రాలంబమాతండు 

కచ్ఛపీరవ యుక్త కంఠు డతడు 


పృచ్ఛక కల్హార పూషుడౌ నాతండు

]సరస భావ రసాల సాలమతడు

శతసహస్రవధాన జగతి ప్రఖ్యాతుండు

తెలుగు తల్లికి కంటి తేజమతడు

మాడుగుల వంశ మకుటాయ మానమతడు

మంచి యను మాట కవనిలో మారతండు

గతము మరువక తలపోయు ఘనుడతండు

నాగ ఫణి శర్మ నామాన నెగడు నతడు

[ధాత్రి=భూమి;ప్రావాణి=సరస్వతి; ప్రాలంబము=హారము; కఛ్ఛపి =వాణీ వీణ; కల్హారము= కలువపువ్వు


పూషుడు= సూర్యుడు (సూర్యుని చూస్తే కలువ ముడుచుకొంటుంది);

రసాలసాలము=మధుర ఫల వృక్షము ]







Wednesday, 11 September 2013

నేను వ్రాసిన పాట

'None Can Destroy Iron But Its Own Rust Can
Likewise None Can Destroy A Person But
His Own Mind Set Can'... RATAN TATA

ఈ మాట చదివినపుడు నేను, ఓక 40 సంవత్సరాల క్రితం,  వ్రాసిన ఈ పాట  గుర్తుకు వచ్చింది.

ఈ పాటను చిత్తగించండి :

ఎవరు నీవారు   ఎవరు పెర వారు
తెలుసుకోవాలి రా  తెలిసి మసలుకోవాలిరా

వీడని తోడౌ నీడకు గూడా
వెలుగంటెనే వెరపు కదా
చీకటిలో మటుమాయము కాదా
నీ చేవయె నీ చెలువు కదా
నీ చేవయె నీ చెలువు కదా                 ॥ఎవరు॥

నెత్తురు పంచుకు పుట్టిన నలతే
చెరుపు చేయగా నీకెపుడూ
కొండల కోనల పండిన మాకుల
మూలికలే నీకండ కదా
మూలికలే నీకండకదా                       ॥ ఎవరు॥

అమరుల జేసే అమృతమే మరి
రాహువు పాలిటి మిత్తి కదా
హాలాహలమే ఆభరణముగా
శివుని గళములో నిలిచే కదా
శివుని గళములో నిలిచే కదా               ॥ఎవరు॥ 

శివలింగ తత్వము, Sivalinga Tatvam

శివలింగ తత్వము
https://cherukurammohan.blogspot.com/2013/09/shiva-lingam-concept-there-are-various.html

సాధారణంగా శివ లింగము అన్న మాటకు ఎన్నోవిధములైన వివరణలున్నాయి.శివుణ్ణి  కూడా  ఆంగ్ల భాషోచ్ఛారణ కనుగుణంగా 'షివఅని పలికే వాళ్ళను నేను చాలామందిని చూసినాను. అంత భాషా దాస్యము అవసరమా అన్నది నా ఆలోచన. ఆప్రకారముగా పలుకుట దోషము. ఉచ్ఛారణ లోపము విలోమ ఫలితము కలిగించుతుంది. 'శివ' అని మాత్రమే పలుకవలెను. మనుస్మృతి ప్రకారము 'లింగంఅన్న శబ్దానికి 16 అర్థాలు వున్నాయని విన్నాను. ఇపుడు మనకు అవసరమైన అర్థమును మాత్రమే ఈ క్రింద పొందు పరుచుచున్నాను.
'లిమః గమయతీతి లింగంఅని నిరుక్త నిర్వచనము. లిం అంటే చేతనము. అంటే ఈ చేతనమే ప్రకృతి. ఇది లయము నుండి ఉద్భవించి ముందునకు సాగేది. లయముతో పెనవేసుకొని వుండేది.
ఇంకొక అర్థమేమిటంటే 'లిం గమయితీతి లింగం.లయ కారకమైనది లింగం. లయము వైపుకు సాగి లీనమై పోయేది .
ఈ రెండు వివరణలవల్ల మనకు ఏమర్థమౌతుందంటే సృష్ఠి స్థితి లయ కారకమౌతూకూడా  తాను దానికి అతీతముగా వుండేది అని. ఇది పునరావృతము ఔతూనే వుంటుంది. పుట్టిన ప్రతి వస్తువు  గిట్టక మానదు. దాని స్థితి సమయములోఒక దానితో ఇంకొకటి పోలిస్తేతేడా ఉండవచ్చును. ఇదే ప్రకృతి. ప్రకృతి పురుష తత్వమే అర్ధనారీశ్వర తత్వముఅదే  సాంబశివతత్వము. (స+అంబ+శివ ).
స్వస్తి.


Sivalinga Tatvam
There are various explanations for the word Sivalinga. At the outset let me first clarify that the word is SIVA and not SHIVA. As per Manusmruti there are 16 different meanings for Lingam. Meaning suitable to the context has to be taken while explaining the concept.

'Limah Gamayiteeti Linga.' That which originates from the condition of absorption is Lingam.

'Lim Gamayiteeti Linga.'  That which reaches the condition of absorption is Lingam.

Lim means absorbed condition of knowledge or consciousness. Matter originates from consciousness and finally gets absorbed back into consciousness. This is called 'Chetanaavasta.' The one containing the quality of 'chetana'(consciousness) is 'prakRti' or 'Nature.' Hence the nature comes into existence, exists and is later absorbed. This process is repeated in a cyclic manner in nature. Since from the Leena (absorbed) condition it is going forward (Gamana) so the name Lingam. 'Lingam' indicates the principle of creation, sustenance and absorption. For example thing that is created to come into existence from absorption has to finally get decay and be absorbed, that is it has to embrace 'Laya.' The nature originates from Shiva and later gets absorbed in it .The blending of absorbed Shiva and Sakti is 'ardhnaareeswara tatwam.' or 'Samba Siva tatvam' (Sa + Amba+ Siva).

Monday, 9 September 2013

నేటి విద్యా వ్యవస్థ (బ్రిటిష్ పాలన-రాజీవ్ దీక్షిత్)

బ్రిటీష్ వాళ్ళు భారతీయ విద్యా వ్యవస్థను, భారతీయ సమాజాన్ని ఏవిధముగా నాశనము చేసినారు? 

{ స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి (Social activist, Bharat Swabhiman Andolan) ఉపన్యాసము యొక్క తెలుగు తర్జుమా }


భారతీయ సంస్కృతిని నాశనం చేయుటకు మెకౌలే అనే వ్యక్తిని భారతదేశానికి పంపించారు. మెకౌలే భారతదేశానికి వచ్చిన తరువాత ఒక సర్వే నిర్వహించినాడు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే భారతదేశ సంస్కృతి, విద్యా వ్యవస్థ ఇక్కడ ఉండే గురుకుల పాఠశాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారతదేశంలో ఉండే పాఠశాలలను/స్కూళ్ళను అప్పుడు గురుకులాలు అని పిలిచేవారు. 1835 లో మెకౌలే ఆదేశాల మీదగా 1500 మంది ఆఫీసర్లు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, దేని మీద ఆధారపడి ఉంది అని సర్వే నిర్వహించినారు. అది ఏమి తెలిపినదంటే భారతదేశం మొత్తం విద్యా వ్యవస్థ గురుకులాలలో ఆశ్రమ పద్దతిలో జరుగుతుంది. ఈ పాఠశాలలో ఏమేమి భోదిస్తున్నారు అని కూడా సర్వే చేయుత జరిగింది. ఆ సర్వేలో ఒక భాగాన్ని చూడండి, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో !


బ్రిటీషు సర్వే రిపోర్ట్ ప్రకారం 1835 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక లక్ష 50 వేల కాలేజీలు/కళాశాలలు ఉండేవి. నేను అప్పటి బ్రిటీషు లాండ్ రెవెన్యూ రికార్ద్సును భారతీయ లైబ్రరీ ఆఫీసును నుండి తీసుకుని చూసినాను. వాటిని ఎందుకు చూసినాను అంటే 1853/1840 లో మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తం మీద పల్లెటూళ్ళు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి. కాబట్టి మొత్తం 1 లక్ష 57 వేల పల్లెటూళ్ళు మరియు ఒక లక్ష 50 వేల కాలేజీలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. అంటే సరాసరి చూసుకుంటే ప్రతీ ఊర్లో ఒక కాలేజీ ఉండేది. దాన్ని బ్రిటీషు పరిభాషలో చెప్పాలి అంటే Higher learning institutes అంటే చిన్న చిన్న పాఠశాలు కాదు. స్కూళ్ళ విషయానికి వస్తే ప్రతి ఊర్లో రెండు మూడు ఉండేవి. ఈ 1 లక్ష 50 వేల కాలేజీలలో ఏం భొదిస్తున్నారు అని బ్రిటీషు వారు చేసిన సర్వే ప్రకారం వీటిలో 1500 శస్త్ర చికిత్స/సర్జరీ కాలేజీలు. ఇవి కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీలోనివి మాత్రమే భారత దేశం మొత్తం కాదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సర్జరీ కాలేజీలలో చదువుకునే వారు మంగల జాతి వారు. బ్రిటీషు వారి పుణ్యమా అంటు మన దేశంలో ఒక తప్పుడు ప్రచారం ఉంది. అది ఏమిటంటే శూద్రులను పై కులాలవారు చదువుకోనివ్వలేదు అని. మన దేశం లో ఒక మంగల వాడు సర్జన్ అయినప్పుడు తక్కువ జాతి వారు చదువుకోకపోవడం అసంభవం ! బ్రిటీషు వారి సర్వే ప్రకారం ఆ కాలేజీలలో 70% శూద్రులు, 30% మంది బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు విద్యను అభ్యసించేవారు.


ఆ రిపోర్ట్ లోని ఇంకొక విషయం ఏమిటంటే భారతదేశంలో ఉండే శూద్ర జాతికి చెందిన వారి చేతిలో గొప్ప టెక్నాలజీ/విజ్ఞానం ఉండేది. ఇది నా రెపోర్ట్ కాదు బ్రిటీషు వారి రిపోర్ట్. ఇప్పుడు కూడ మీరు మద్రాసు కు వెళ్ళి చూస్తే "పెరియార్" అనే జాతివారు ఉంటారు. వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రిటీషు వారి సర్వే ప్రకారం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే 2200/2300 Architect /భవన నిర్మాణ కాలేజీలలో ఉపాధ్యాయులు/ఆచార్యులు ఆ పెరియార్ జాతి వారే. అక్కడ వాస్తు కళ, భవన నిర్మాణం గురించి చదువుకున్నది పెరియార్ జాతి వారే. దక్షిణ భారతదేశం లో మనం చూసే ఆలయాలు మీనాక్షిపురం, మదురై వంటివి అన్నీ పెరియార్లు కట్టించినవే. నిర్మాణం పరంగా చూసినా, డిజైన్ పరంగా చూసినా అటువంటి ఆలయాలను మనం ఉత్తర భారతదేశంలో చూడలేము. వాటన్నిటిని పెరియార్లు కట్టించేవారు. పెరియార్లు అనబడే వారి పని మందిర నిర్మాణం. కాని 1890 తరువాత బ్రిటీషు వారు పెరియార్లను నాశనం చేశారు. ఎ. ఓ. హ్యూం అనే ఆఫిసర్ మద్రాస్ ప్రెసిడెన్సీ కి కలెక్టరుగా ఉండేవాడు. ఆ అదికారంతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఒక చట్టాన్ని సృష్టించాడు. అప్పటిదాకా మందిర నిర్మాణం పెరియార్లు చేసినారు కాని ఎ. ఓ. హ్యూం చట్టం ప్రకారం పెరియార్లు మందిర నిర్మాణం చేయకూడదు. ఒకవేళ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. అలా పెరియార్లను మందిర నిర్మాణం చేయకుండా అపేసినాడు. ఫలితంగా పెరియార్ జాతి వారు తక్కువ అవుతూ వచ్చారు. బ్రిటీషు వాళ్ళు భారతీయ సమాజాన్ని అలా విభజించినారు.


-(స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ ఉపన్యాస అనువాదం )

Sunday, 8 September 2013

సంస్కృత చాటువు (మేకపోతు గాంభీర్యం )

మేకపోతు గాంభీర్యం 
“అహమేకశత వ్యాఘ్రాన్/ పంచ వింశతి కుంజరాన్
ఏక సిహం నభక్ష్యామి/ గడ్డం వపనముత్యతే”

ఈ సంస్కృత చాటువు మనందరికి తెలిసిన “మేక పోతు గాంభీర్యం” అనే తెలుగు సామెతకు సంబంధించిన కథ. ఈ కథ తెలుగువారి ఇంటింటి సరస్వతి అయిన  “పెద్దబాలశిక్ష” లో  ఉంది.  లోపల బెరుకు,బైట కరుకు,కలిగి డాంబికంగా మాట్లాడేవారి విషయంలో ఈ సామెతని ఉపయోగిస్తారు. “వాడు చూడండి ఎలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడో” అని. 
ఇదీ కథ :
ఒక కొండ పరిసరాలలో మేస్తున్న తెలుగు మేకల మందలోంచి ఒక మేకపోతు వేరుపడిపోతుంది. తెలుగు మేక  అని ఎందుకన్నానంటే ఆ శ్లోకంలో గడ్డమనే తెలుగు పదం ఉండుటవల్ల. అదే సమయంలో వాన వస్తుంది. వాన నుంచి తప్పించుకోవాలని అది ఒక గుహలోకి వెళ్తుంది. వెళ్ళిన తరువాత తెలిసింది అది సింహపు గుహ అని.బహుశా జంతు కళేబరాలనుచూసి
వూహించుకొనివుంటుంది . అదృష్టవశాత్తు అప్పుడు సింహం గుహలో లేదు. కొంత సమయం గడిచిన పిదప సింహం గుహలోనికి  వచ్చింది. లోపల వేరే జంతువు వున్నట్లు తెలుసుకొని ప్రాణభయం తో గుహ  బైటే నిలిచింది . లోపల ఉన్న మేకపోతు సింహాన్ని చూసి భయాన్ని దిగమ్రింగి  గడ్డం మాత్రం సింహానికి కనబడేటట్టు గుహ బైటికి పెట్టి ద్వారము వద్ద నున్న సింహంతో వచ్చీ రాని సంస్కృతం లో  పై శ్లోకం  చెప్పింది.  దాని అర్థం ఈ క్రిది విధంగా వుంది :(తాత్పర్యం వ్రాస్తున్నాను)
నేను ఇప్పటికి ఒక నూరు పెద్ద పులులను ఇరవైఐదు ఏనుగులను తిన్నాను ఇంకా ఒక సింహాన్ని తిని గాని ఈ గడ్డం గీయించుకోనని ప్రతిన బూనినాను. సమయానికి నీవు వచ్చినావు అని అన్నది. 
ఆ మాటలు విన్న సింహం  భయపడి తోక ముడుచుకొని పారి పోయింది . “బ్రతుకుజీవుడా” అనుకొని మేకపోతు కూడా అక్కడి నుంచి పారిపోయింది . 
కాబట్టి మేకపోతు గాంభీర్యము మనిషికి అవసరమే కానీ ఆచరణలో దానిని ఉంచేటపుడు తగిన ధైర్యము సమయస్పూర్తి ఎంటొ అవసరము. అందుకే భర్తృహరి (ఏనుగు లక్ష్మణ కవి తెలుగు సేత) 
ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ 
భూప సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ మాజి బా
హాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాం
ఛాపరివృత్తియున్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్   

అన్నాడు. ఇది నేడు వ్యక్తిత్వ వికాసమునకు (personality Development) అన్నపేరుతో చెప్పే ఎన్నోసూత్రములు ఈ పద్యములో ఇమిడి వున్నాయి.
ఆపదలో ధైర్యము, అన్యసంపద మీద ఆశ, సభాగోష్ఠులలో వాక్చాతుర్యము, యుద్ధములైతే బాహుబలము  అంటే ఇక్కడ వాగ్యుద్ధాలే కాబట్టి తార్కిక వాదనాపటిమ, ఋజుమార్గములో కీర్తి గాంచవలెనను తపన, నిరంతర జ్ఞాన సముపార్జన సజ్జనుల లక్షణము .
ఇంతకన్నా స్పూర్తి దాయకమైన మాట ఏముంటుంది చెప్పండి.