Monday, 20 September 2021

బైబిలు – కొన్ని వాస్తవములు

 

బైబిలు కొన్ని వాస్తవములు

https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post_20.html

మనము అనుసరించు జీవన విధానము మతము కాదు ధర్మము.

 ప్రపంచమున ‘ధర్మము’ పేరుతో అనుసరింపబడుచున్న ఏకైక జీవన విధానము మనది మాత్రమే! మతము పేరుతో పుడమి పై ఉద్భవించినవి ఆయుర్దాయము తీరగానే కనుమరుగై పోయినాయి. ఇప్పుడు తెరపై నున్నవి రెండే ప్రముఖ మతములు. 1. క్రైస్తవము, 2. ఇస్లాము ఈ వ్యాసమునందు క్రైస్తవమును గూర్చి మాత్రమే క్లుప్తముగ  తెలుపుచున్నాను.

రెవరెండ్ జేమ్స్ యుషర్ ఆర్చ్ బిషప్ ఆఫ్ ఐర్లాండ్ సృష్టి యొక్క సమయము మరియు తేదీని "సృష్ట్యాది" గా స్థాపించడానికి ప్రయత్నించిన వ్యక్తిగా అత్యంత ప్రసిద్ధుడు. అక్టోబర్ 23 వ రోజు ముందు రాత్రి ... క్రీస్తు 4004 ముందు సంవత్సరం "; అనగా, ప్రోలెప్టిక్ జూలియన్ క్యాలెండర్ ప్రకారం, క్రీస్తుపూర్వం 22 అక్టోబర్ 4004 సాయంత్రం 6 గంటలకు. సృష్టి ప్రారంభము జరిగినది అని వారు ఏర్పరచిన క్రైస్తవ ప్రముఖుల సమావేశము ద్వారా నిర్ధారించినారు. (వికీపీడియా). ఇంతగా నిర్ధారించిన పిమ్మట కూడా క్రీస్తు వారి జననము మొదలు శిలువ, పునర్జననము మొదలగు విషయములను వారుకానీ వారి తదనంతరపు చారిత్రికులు గానీ నిర్ధారించ లేక పోయినారు. మరి క్రీస్తు గారు ఉండినట్లా, లేనట్లా అన్నది నేటికీ సందిగ్ధమే!

మాటకు రుజువే ప్రాణము

తోటకు ప్రాణంబు నీరు తోడుట కనగా

పేటకు ప్రాణము ప్రతినిధి

గాటముగా ప్రాణమౌను గన సుగుణమ్మే

ఇక బైబిలు ప్రస్తాపనకు వస్తే, బైబిలు అన్న మాటకు అర్థము పుస్తకముల సంకలనము. అందు మొదటిది పాతనిబంధనలు, రెండవది క్రొత్త నిబంధనలు. ఇది క్రీస్తునకు అనంతరము వారి అనుయాయులు వ్రాసినది.  (There is no scholarly consensus on the date of composition of the latest New Testament texts. - Google Wiki).ఇవి అన్నీ క్రీస్తుకు తరువాత వ్రాసినవే కానీ వీని చరిత్రను వారు పదిల పరుపలేక పోయినారు. పైగా ఒకే విషయము పై ఒకరు వ్రాసిన వ్రాతలకు వేరొకరు వ్రాసిన వ్రాతలకు ఎన్నో భేదములున్నవి.

ఇక అసలు విషయమునకు వస్తే పాత నిబంధన 5 పుస్తకముల సంకలనము. అవి 1. ఆది కాండము (Genesis) 2. నిర్గమ కాండము(Exodus)   3. లేవీ కాండము (Leviticus), 4. సంఖ్యా కాండము (Numbers)  5. ద్వితీయోపదేశ కాండము. (Deuteronomy).

పాత నిబంధనలో

a) 39 పుస్తకములు

b) 929 అధ్యాయములు

c) 23214 వచనములు కలవు

d) అతి పెద్ద పుస్తకము కీర్తనలు

e) అతి చిన్న పుస్తకము ఓబద్యా

బైబిలు పండితులు పాత నిబందనను 4 భాగములుగా విభజించారు.

1) ధర్మశాస్త్ర గ్రంధములు – 5 (ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు)

2) చరిత్ర గ్రంధములు – 12 (యెహోషువా నుండి ఎస్తేరు వరకు)

3) కావ్య గ్రంధములు – 5 (యోబు నుండి పరమగీతము వరకు)

4) ప్రవక్తల గ్రంధములు – 17 (యెషయా నుండి మలాకి వరకు)

ఈ విభజన గ్రంధకర్తలు రాసిన కాలమును బట్టి విభజించలేదు. ఏ గ్రంధము అయిన ముందు రాసి ఉండవచ్చు లేదా వెనుక రాసి ఉండొచ్చు.

ఉదాహరణకు: 2, రాజులు గ్రంధం బైబిలు క్రమ పట్టికలో 12వ పుస్తకము, యిర్మియా గ్రంధము 24వ పుస్తకము. కాని ఈ రెండు పుస్తకములు క్రీస్తు పూర్వము 500 నుండి 600 మధ్య కాలములో వ్రాయబడినాయి. యిర్మియా గ్రంధములో వున్న లేఖనాలు రాజుల గ్రంధములో కనబడే వ్యక్తుల గురించి, రాజుల గురించి, జనం గురించి ప్రస్తావించినవే. కనుక యిర్మియా గ్రంధము అర్థము కావాలి అంటే రాజుల గ్రంధములను కూడా పరిశీలించాలి.

కాబట్టి బైబిలు చదువుతున్నపుడు ఎవరు రాసినారో, ఏ కాలములో వ్రాయబడినదో, ఏ సందర్బమును బట్టి రాసినారో, ఏ ప్రదేశము వారు రాసినారో,  అనేది తప్పనిసరిగా గుర్తించగలిగితే ఆ రాతలలోని నిజానిజములను మనము గ్రహించవచ్చును. భారత భాగవతములను వ్రాసిన వేదవ్యాసుడు ఆ ఇతిహాసములు జరుగుచున్న కాలము వాడు. పైపెచ్చు తన అంతర్దృష్టితో విశ్వాంతరాళమున ఏమి జరుగుచున్నది అన్న విషయయమును మనకు తెలియగలిగిన తపఃసంపన్నుడు. మరి బైబిలు వ్రాసిన వారల గూర్చిన ప్రస్తాపనలో మనకా విషయము తెలిసి రాదు.

1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం ఈజిప్టులోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్కతో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి, 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంథానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తుకు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ మరణం అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరితో శారీరక సంబంధం ఉన్నదని, వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడినాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో బైబిల్ వ్యతిరేక పత్రికలుగా మిగిలిపోయినాయి.

రేపు ముగింపు ........

బైబిలు కొన్ని వాస్తవములు - 2

ఇన్ని వైరుధ్యముల మధ్య పురుడు పోసుకొన్న బైబిలు కు కర్త ఎవరనన్నది వారు నిరూపించలేరు. అది అలా ఉంచితే ప్రస్తుతము కీర్తి శేషులు మరియు నాకు అత్యంత ఆప్తులు, జేష్ట భ్రాతృసమానులు  dr. VVS శర్మ గారు 2016 న ప్రచురించిన ఈ చిన్న వ్యాసమును మీ ముందుంచుచున్నాను:

అన్ని మతాలూ ఒక మంచికోసమే పుడతాయి, - ఇది సరియైన ఊహకాదు. భారతీయమతాలు ఒక ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని పుట్టినవి. వాటికి ప్రవక్తలు లేరు. బుద్ధుడు మహావీరుడు తరువాత చాలాకాలానికి గురునానక్, చైతన్యుడు, త్రిమతాచార్యులు వీరెవరూకూడా మత ప్రవక్తలు కాదు. ముఖ్యంగా వ్యక్తిని మోక్షం, నిర్వాణం, సద్ధర్మాచరణ ఈ విధంగా పరిణామం చేయడం కోసమే వచ్చిన ధర్మ మార్గాలు ఇవి. యూదు, క్రైస్తవ, మహమ్మదీయ మతాలు ఒక ప్రవక్త ఏర్పరిచిన, మతప్రచార ప్రాతిపదికన తమ సమూహంలో చేర్చుకోవడానికి ఏర్పడిన రాజకీయ, సాంఘిక వర్గాలు. కౄసేడులు,జిహాదులు వాటి చరిత్ర. మా దేవుడే సత్యము, మా ప్రవక్తయే దేవుని కుమారుడు లేదా పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ అని చెప్పుకునేవి ఈ మధ్య అశియాలో పుట్టిన మతాలు. బైబిల్ డ్యూటిరానమీ పుస్తక వాక్యాలు చూడండి --- డ్12

1 మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.

2 మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.

3 వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను.

4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు.

నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

5. నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

6 నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని నా ఆజ్ఞను అతిక్రమించిన ప్రాణముతో నిలువకూడదు.

7 భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల

వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.

8. చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.

ఇతర మతాల వారు తమ పుస్తకాలనే పాటిస్తున్నారు.

ఇది హిందూ సమాజం తెలుసుకొవలసిన విషయాలు.

వారు తెలియజేసిన పై విషయమునకు, దిగువన, నా పరిశీలనను జోడించుచున్నాను.

1.       సార్వజనీనమైన ఉచితమగు వనరులను భగవంతుడే భూమికి సమకూర్చవచ్చును. పృథివ్యాపస్తేజో వాయురాకాశములను, శైల వృక్షసంపదలను, మానవ మేధస్సును ఇచ్చి సృష్టించినాడేకానీ యోగ్యతాయోగ్యతలను మన కర్మ ఫలమునకు వదిలివేసినాడు. మరి వారి దేవుడు దండ పారుష్యముచే తన మాట చేల్లిన్చుకోన దలచినాడు. మరి ఆయన ప్రజలు ఆయన మాటకు నిబద్ధులయితే భూమియే స్వర్గము కదా! కర్మఫలము యొక్క ప్రస్తాపనే లేదు కదా!

2.    చెట్లు గుట్టలు పుట్టలలో వెలసిన దేవతా మూర్తులను నాశనము చేయ నాజ్ఞాపించిన వ్యక్తిని దేవునిగా అంగీకరింపనగునా!

3.    దేవతామూర్తులను యూప స్తంభములను, బలిపీఠములను నాశనము చయ నాజ్ఞాపించిన వ్యక్తిని దేవుడని అనగలమా! హిరణ్యకశిప, హిరణ్యాక్ష, శుంభ, నిశుంభ త్రిపురాసురాది దైత్యులను మనము దేవతలు అనము కదా!

4.    వారు తమ దేవతలకు చేసినట్లు యహోవాకు చేయకూడదు అని చెప్పుట ఒక ద్వేషపూరిత సందేశమును తమ అత్యున్నత దైవము చెప్పినాడు అనుట మానవత్వము కలిగిన మనుష్యులు జీర్ణము చేసుకొనగలరా!

5.    తన మాటను తూచా తప్పక పాతిన్చావలేనాను వ్యక్తికి దైవము అన్న పట్టము కట్టదగునా!

6.    తల్లిదండ్రులను కన్న బిడ్డలను, కట్టుకొన్న భార్యను విశ్వశాంతికి సంకేతమైన పరమాత్మగా మనము విశ్వసించే వ్యక్తి, తనమాటను త్రోసిరాజన్నవారిని నిర్దాక్షిణ్యముగా చంపమంటున్నాడు. మరి ఆపని తానే చేయవచ్చును కదా!

7.    ఇందు భూమి యొక్క ఈ కొన మొదలు ఆ కొన అని వాడబడినది. అంటే అది బల్లపరుపుగా ఉన్నదంటూ, మన ఋగ్వేదము చెప్పినట్లు భూమి అండాకారమున లేదనియే కదా! బైబిలు చెప్పుచున్నది. ఎంత హాస్యాస్పదమో చూడండి. తన నిర్దేశాకత్వమును పాటింపని ప్రతి ఒక్కరినీ చంపమంతున్నాడు. మరి అట్టివారిని పుట్టించడమెందుకు?

8.    నా ఆజ్ఞలను ధిక్కరించిన పరమతస్తులపై నీ దెబ్బయే ముందు పడవలెను.

9.    ఈ విధమగు ఉపదేశములను ఇచ్చిన వారిదేవుని ఏవిధముగా విశ్వాత్మగా పరిగణించవచ్చునో మీ విచక్షణకే విడిచి పెడుతూ, విరమించుచున్నాను.

స్వస్తి. 


1 comment:

  1. Extremely valuable information especially in telugu thousand salutes sir
    Best regards
    Sudarshanarao

    ReplyDelete