Wednesday, 26 October 2016

దుష్ట చతుష్టయం


దుష్ట చతుష్టయం
https://cherukurammohan.blogspot.com/2016/10/blog-post_33.html
భారతము లక్ష శ్లోకాలకు మించిన గ్రంథము. నావంటి అర్భకులకు అది గగన కుసుమమే. కానీ ఆ కుసుమములు కలిగిన వృక్షముల (పౌరాణికులు) క్రింద కూర్చుంటే కనీసము ఆ పూవుల వాసననైనా అఘ్రాణించవచ్చు అని నా ఉద్దేశ్యము.
ఒక చాటువు, అందరికీ తెలిసినదే అయినా, ఒకసారి చాటుతాను.
ప్రాతర్ ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతఃl
రాత్రౌ చోర ప్రసంగేన కాలౌ గచ్చతి ధీమతామ్ll
బాహిరంగా ఈ శ్లోకానికి అర్థము చూస్తే ఉదయము జూదము మధ్యాహ్నము అడవారినిగూర్చి రాత్రులందు దొంగతనాలను గూర్చి మాట్లాడుకొంటూ బుద్ధిమంతులు కాలము గడుపుతారు అని.
కానీ ఆంతరీకములో ఉదయము భారతము మధ్యాహ్నము రామాయణము రాత్రికి భాగవతమును గూర్చి చర్చించుటలో బుద్ధిమంతులు కాలము గడుపుతారు అని. ఈ అర్థము కూడా అందరికీ తెలిసిందే. ఇందులో నాకనిపించిందేమిటంటే పగలు దేవుని లీలలను గూర్చి చదివి రాత్రికి ఆయనను గూర్చిన విశ్లేషణలో కాలము గడిపితే ఎంతోకొంత కాలానికి ఆయనను చేరే దారి దొరుకుతుందేమో అని నా మనో భావన.
ఏమైతేనేమి ఈ రోజు ప్రోద్దుననే భారతము లోని దుష్ట చతుష్టయమును గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందా మనిపించింది.
భారతములోని దుష్టచతుష్టయం ఎవరన్నది అందరికీ తెలిసిందే. 'మాయాబజారు' సినిమా చూసిన పిల్లవాళ్ళకు కూడా తెలిసేవుంటుంది. నాకూతెలుసుననేదానికి గాను వారిపేర్లు తెలియజేస్తున్నాను
1. దుర్యోధనుడు 2. దుశ్శాసనుడు 3. కర్ణుడు 4. శకుని. ఇక ఈ పెర్లలోని ప్రత్యేకత ఏమిటో కాస్త విశ్లేషించుకొందాము.
1. దుర్యోధనుడు :దుః+యోధనుడు ఈ దుః అంటేనే చెడ్డ మార్గములో యోధనము అంటే పోరాటము అంటే 'A Foul Game Player' అని అర్థము. జీవితమంటే అంతులేని ఒక పోరాటమేకదా దానిని దుర్మార్గ గామియై సాధించాలనుకొంటాడు ఈ జీవుడు. ఈ మాటను వేరొక విధముగా కూడా అన్వయిన్చుకోనవచ్చునని పెద్దల ద్వారా విన్నాను. ఈయన జయింప శక్యము కానివాడట. అది కూడా నిజమే కదా! యుద్ధ న్యాయమునకు వ్యతిరేకముగా భీముడు ఈయనను కటి భాగమునకు క్రింద కొట్టి విగాతుని చేస్తాడు. దానికి భీమ ప్రతిజ్ఞా కారణము కావచ్చు. మహాభారతమును ఇంత సునిశితముగా పరిశోధించి పరిశీలించి పరీక్షించి వ్రాయుట వ్యాస భగవానునికే చెల్లినది. అంటే ఈ పేరును అటు మంచికీ ఇటు చెడుకు కూడా తార్కాణముగా గొనవచ్చును.ఈతనికి తోడబుట్టినవాడు దుశ్శాసనుడు .
2. దుశ్శాసనుడు:
ఈ పదమునకు మొదట ఇంకొక విధముగా కూడా అర్థము చెప్పుకొందాము. ఈతనిని శాసించుట దుర్లభము. అందుకే దుశ్శాసనుడైనాడు. ఒక్క దుర్యోధనుని మాట ఒక తమ్మునిగా బాల్యము నుండి వినుటకు అలవాటు పడినాడు కాబట్టి అన్న తప్ప వేరెవరూ అతనిని శాసించలేరు. ఇక ఈ అర్థమును గమనించండి.దుః+శాసనుడు. దుః అంటే చెడ్డ అని ముందే చెప్పుకోన్నాము. శాసనము అంటే సాధికార నిర్ణయము అనేకదా! అంటే ఆ చెడు మార్గా పోరాటానికి ఈ చెడ్డ, అధికారముతో కూడిన, నిర్ణయాలు తోడైనాయి. చెడ్డ దారి లోపోవలెనని నిశ్చయించుకొన్న వాని మదికి చెడ్డ నిర్ణయాలే కదా వస్తాయి. పదే పదే అవే నిర్ణయాలెందుకు వస్తున్నాయి. వింటున్నాడు కాబట్టి. 
3. కర్ణుడు : ఆకర్ణించుతున్నాడు కావున ఆతని మిత్రుడు 'కర్ణుడుఅయినాడు.
తన జీవితమునకు చెడ్డ దారినెంచుకొన్న వ్యక్తికి చెడ్డ తలపులే(దుశ్శాసనములే ) వినిపిస్తుంటాయి. కావున మంచి వినగలిగి కూడా, ఆ మంచిని పెడ చెవిని బెట్టి, చెడ్డ కే చేయూత నివ్వడముతో మంచి చెడులకు సమానస్తాయి నివ్వలసిన ఆ చెవులు కలిగినవాడు "కు' కర్ణుడై నాడు. 
4. శకుని:  తీసుకొన్న చెడ్డ నిర్ణయములు చెప్పేది వాక్కు. మాటకు,శకునము అనే అర్థమున్నదని మాకాలేజీ లో మా గురువుగారు బ్ర.శ్రీ.వే. ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు చెప్పియుండినారు.శకునమునకు ఒక అర్థము మాట ఐతే వేరొక అర్థమేమంటే పక్షి, పక్షి శాస్త్రము అని. అది పక్షి ఎడమనుండి కుడికి పొతే ఒక ఫలితము కుడినుండి ఎడమకు పొతే ఒకఫలితము, పక్షుల అరుపు లేక కూతల బట్టి కూడా ఫలితములున్నాయని ఈ శాస్త్రము చెబుతుంది. మన మిపుడు ఈ పదాన్ని ఒక కార్యము చేయుటకు మునుపు ఒక వ్యక్తి ఊహకు ఎదురయ్యే ప్రబల విబల చిహ్నములుగా ఉపయోగించుకొను చున్నాము. ఇక్కడ అంతా చెడుపే కావున శకునము దుశ్శకునమే. అంటే శకుని 'ధీ' కూడా అదే దారి.
ఈ నాల్గు దుర్లక్షణాలు అంటే 'దుష్ట చతుష్టయము' మానవునికి ఎంత దుర్హిత కారకములో
గమనించండి.
స్వస్తి.

దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం

దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం

https://cherukurammohan.blogspot.com/2016/10/blog-post_70.html

న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ ll1ll

అమ్మానాకు మంత్రాలు తెలియవు,యంత్రాలు తెలియవు. నిన్ను స్తుతిచేసే మతిలేదు. నాకు నిన్నుపాసన చేసే ముద్రలు తెలియవు. ఇవియన్నీ నా బాధలు అని చెప్పుకొని ఏడ్వలేను. నాకు తెలిసినది ఒకటే. నిన్ననుసరించుటయే నా దుఃఖములకు ఉపశమనము.

విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా
విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్l 
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ll2ll

నా అజ్ఞానముచేత, అశక్తతచేత, నా సోమరితనము చేత, నా దౌర్బల్యముచేత, నేను పెట్టదలచిన నైవేద్యము నీ పాదములనంటినది. తల్లీ శివా, భవానీ, రుద్రాణీ నన్ను క్షమించు.అందరినీ ఉద్ధరించే తల్లీ నీకు తెలియనిదేమున్నది. కుపుత్రుడుండుట లోక సహజము కానీ కుమాత ఉండదు కదా!

 పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః

పరం తేషాం మధ్యే విరల విరలోzహం తవ సుతః

మదీయోzయం త్యాగః సముచిత మిదం నో తవ శివే

కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ll3ll

 అమ్మా అనేకానేకమైన నీ సుపుత్రుల నడుమ,నాది,నాకు అన్న స్వార్థ పూరిత వాంఛలచే పెనుగొనబడి శమ దమాదులను అధిగమించలేక పడియున్నాను. నాకున్న ఒకేఒక అర్హత నీ కుమారుని కావటమే. తల్లీ శివా! అదిచాలదా నన్ను ఉద్ధరించుటకు. అయినా కుపుత్రుడుండుట లోక సహజము గానీ కుమాత ఉండదుకదా!

ఇక్కడ శమము దమము అన్న రెండు మాటలను చేర్చినాను, వాటిని కాస్త విడమరచుదామని.

ఆ రెండింటి అర్థము ఈ చిన్న ఉదాహరణతో వివరిస్తాను. అసలు 'దూరదర్శిని' చూడాలనే కోరిక మనసులో నిర్మూలించితే అది శమము. అందులోని కార్యక్రమాలను ఇంటిలోనివారు చూస్తూవున్న కూడా దానిపై చూపు మరల్చక నీ పనిని నీవు చేసుకొనుట దమము.

జగన్మాతర్మాతస్తవ చరణ సేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ll4ll

అమ్మా! జగన్మాతలకు మాతా! నీ పాదసేవ నేను చేసినదేలేదు. నీ పద సన్నిధిన నేనుంచిన నైవేద్యము ఏమీ లేదు. నిరుపమానమైన నీ కనికరమునకు నీ పుత్రుని నుండి అవి నీకు కావలెనా. నాకు తెలుసు కుపుత్రుడుండుట లోక సహజము గానీ కుమాత ఉండదుకదా!

పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా
మయా పంచాశీతేరధిక మపనీతే తు వయసి
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాzపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ ll5ll

అమ్మా! 85సంవత్సరముల వయసు వచ్చినా, అంటే బాల, యౌవ్వన, కౌమారావస్తలను దాటి  వృద్ధాప్యామున ప్రవేశించినా నాకు ఏవిధమైన పూజా విధానాలూ తెలియవు. నేను చేయ గలిగినది నీ శరణు కోరడమే. నిరాలంబుడనైన అంటే ఎటువంటి ఆశ్రయము మూ ఉత్లేతమ లక్నిషణములు కల్గిన  నాకు నీవు కాక ఆశ్రయము వేరేవ్వరివ్వగలరు ఓ లంబోదరజననీ! ఈ వేడికోలు ఉత్తమ లక్షణములు కల్గిన ఒక సాధారణ భాక్తునిది.  ఒక సాధారణ భక్తునిది. శంకరుల వారు ఈ స్తోత్రమున ముఖ్యముగా ఈ శ్లోకమును మన కొరకు వ్రాయుచున్నారు. ఆయన  

అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వ శాస్త్రవిత్ l

షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరత్యగాత్ll

అంటే 8 సంవత్సరములకే నాలుగు వేదములూ నేర్చుకొన్నాడు. 12 వత్సరముల ప్రాయమునకే సర్వశాస్త్రములు అభ్యసించినాడు.16 సంవత్సరముల వయసులో ప్రస్తాన త్రయమునకు భాష్యములు వ్రాసినాడు , 32 వ ఏట పార్థివ శరీరమును విడిచి కైలాసము చేరినాడు. ఇదీ ఆ అపర శంకరుల సంక్షిప్త జీవనము.

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాంతంకోరంకో విహరతి చిరం కోటికనకైః
తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జప విధౌ ll6ll

తల్లీ అపర్ణా! నీమహిమనేమని కొనియాడను. విద్యా విహీని (చండాలుడు) కూడా మధుర మధురతర మంజుల వాణిని వినిపించగలడు,నిర్ధనుడు ధనవనమున ధాటిగా నడయాడగలడుకేవలము నీ నామామృతము వారి కర్ణ రంధ్రములు సోకుచుండినచాలును. మరి అంత మహిమగల నీ నామము అనుష్ఠాన నియమములతో అకుంఠితముగా జపించే వారి అదృష్టమును ఏమని కొనియాడవలెను.

చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీఫలమిదమ్ ll7ll
అమ్మా కాపాలీ! ఎవరైతే కాల్చిన మృతదేహముల బూడిదను ధరించినారో, దిక్కులనే తన వస్త్రములుగా చేసుకొనియున్నారో, చిక్కనైన జటాజూటములు కలిగియున్నారో, సర్పభూషలను తన తొడవులుగా కలిగియున్నారోఎవరైతే పశుపతిగా గుర్తించ బడుతారో, ఎవరైతే భూత నాథునిగా తలచుతారో, ఎవరైతే విశ్వ శాంతికి విసము మెసవినారో,ఎవరైతే కాలుడోకాలకాలుడో ఆయనకు ఆ స్థితి వచ్చుటకు కారణము నీవాయన అర్దాగివగుటవల్లనే కదా అమ్మా!

 న మోక్షాస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే

న విజ్ఞానాపేక్షా శశిముఖి! సుఖేచ్ఛాపి న పునఃl

అత స్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వైl

మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః ll8ll

 అమ్మా నేను ధన,కనక,వస్తు,వాహన కామిని కాదు మోక్షగామినీ కాదుశాస్త్రజ్ఞత కూడా నాలో శూన్యమే. తల్లీ ఇందుముఖీ నాకు ఏ సుఖ సంతోషాలూ వద్దు. నాకు నీవెన్నిజన్మలు కలిగించ బోవుచున్నా అన్ని జన్మలలోనూ  నీ నామములైన మృడాని,రుద్రాణి,శివా,భవానీ మొదలయిన వీనినే నేను సదా స్మరించు నటుల చేయి తల్లీ.

నారాధితాసి విధినా వివిధోపచారైః l కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః l

శ్యామే! త్వమేవ యది కించన మయ్యనాథేl ధత్సే కృపాముచితమంబ పరం తవైవ ll9ll


అమ్మా శ్యామా! నేను వేదచోదితమైన మంత్రపఠనముతో, ఉదాత్తానుదాత్త స్వరితములతోఅచంచలమైన భక్తితో నిన్ను కొలుచుటలేదు. నాకుతెలిసినదల్లా నా భాషలో నా ఘోష వినిపించడమే. అయినా నన్ను నీ అక్కున చేర్చుకొన్నావంటే నవనీత హృదయముతో కూడిన నీవు నా హృదయావేదన గుర్తించినావు. నీవు ఈ జగత్తుకే అతీతురాలివి కదా!

ఆపత్సుమగ్నస్స్మరణం త్వదీయం | కరోమి దుర్గే కరుణార్ణవే శివే |
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః | క్షుధాతృషార్తా జననీం స్మరంతి ll10ll

అమ్మా దుర్గా! దయా సాగరీ! ఆపదలలో నిన్ను తలచుతానని నన్ను అసహ్యించుకోవద్దు. బిడ్డకు ఆకలైతే తలచుకోనేది తల్లినేకదా!

జగదంబ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చే న్మయి |
అపరాధపరంపరావృతం న హి మాతా సముపేక్షతే సుతమ్ ll11ll

అమ్మా జగన్మాతా! నీవు పోతపోసిన కరుణా మూర్తివి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అందుకే తనయుడనైన  నా తప్పులెన్నున్నా తప్పనిసరిగా నన్నుపేక్షింపక నీ అక్కున చేర్చుకొంటావు అమ్మా!

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు ll12ll

నేనే అధమాధముడను. నాకన్నా అధములు వుండరు కదా. నీవు అధిపాదిపవు. ఇది చిత్తమునందుంచుకొని నీకు మంచిదని తోచినరీతి జేయుము.

స్వస్తి.

 

 

భారతీయ శాస్త్ర విజ్ఞానము

భారతీయ విజ్ఞానము- 1
https://cherukurammohan.blogspot.com/2016/10/blog-post_51.html

'జ్ఞ' అంటే ఎరుక అని అర్థము,నాకు తెలిసినంత వరకు. జ్ఞానము ఇందు నుండి పుట్టినదే. 'విజ్ఞానము అన్న మాటకు ఒకవిధంగా సపూర్ణ అవగాహన అని చెప్పుకోవచ్చు.'Science' అన్నది విజ్ఞానమునకు సమానార్థకము కాదు అన్నది నా ఉద్దేశ్యము. విజ్ఞానము అంటే ఆంగ్లములో Worldly or profane knowledge, knowledge derived from worldly experience.  Monier Williams (1899; rev. 2008) provides the following definition:
To distinguish, discern, observe, investigate, recognize ascertain, know, understand - Rig Veda (RV.), etc., etc. (with na and inf.: 'to know not how to');
To have right knowledge - Katha Upanishad (KahUp.)
To become wise or learned - Mn. iv, 20;
To hear or learn from (gen.) - Chandogya Upanishad (ChUp.); Mahabharata (MBh.);
To recognize in (loc.) - Panchatantra (Pañcat.);
To look upon or regard or consider as (two acc.), Mn. MBh. etc.; Kāv. etc.; to explain, declare - BhP.
ఇక్కడ ఎక్కడా విజ్ఞానము అంటే science అని చెప్పలేదు. విజ్ఞత అన్నది  తనకు వస్తువునకు కల అనుభవాన్ని అనుబంధాన్ని తెస్తుంది.ఇది తనకు తాను సహజీవనము చేసే సకల చరాచర వస్తు ప్రపంచానికి పరస్పర హితకరమైన మైత్రిని కలుగజేస్తుంది. ఇక 'science' అన్నది ఆధునిక విజ్ఞానమన్న పేరుతో ప్రపంచమున ప్రబలమై యున్నది. దీనికి, కొన్ని ఆధునిక ఆవిష్కరణలను తప్పించి, ప్రకృతిని తన బానిసగా చేసుకొని ప్రకృతికి ముప్పు తెప్పించడం తప్పించి లోక కళ్యాణము లోక హితమును గూర్చి తలచినదే లేదు.
ఐన్ స్టీన్ గారి  ఈ సంభాషణ గమనించండి:
Student: Dr. Einstein, arent these the same questions as last year's [physics] final exam?
Dr. Einstein: Yes; But this year the answers are different.
Albert Einstein
ఈ మాట చాలదా నేటి విజ్ఞాన శాస్త్రము ఎంత శీఘ్రముగా మార్పులకు గురియౌతూ వుంటుందో తెలుసుకొనుటకు.

ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము.బట్టలు ఉతుకుటకు గానీ పాత్రలు తోముటకుగానీ వివిధ నామావళితో'detergents' వస్తున్నాయి . 'Plastic scrubbers' వస్తున్నాయి. వీటివల్ల చర్మ సంబంధమైన వ్యాధులు రావని ఏ శాస్త్రజ్ఞుడు అయినా చెప్పగలడా.మనము గతములో వాడుచుండిన మెత్తటి మన్ను బొగ్గుల బూడిద , చింతపండు పిప్పిఉప్పు , శ్రేయస్కరములుకావని చెప్పగలరా! ఇప్పుడు ప్రాచుర్యములో వుండే పిజ్జాలు బర్గర్ల వంటి తిను బండారములు,కోకాకోల పెప్సీ వంటి పానీయములు మంచి చేస్తాయని గానీ చెడుపు చేయవనిగానీ వారు చెప్ప గలరా! Trade secret పేరు తో వానిలో ఉపయోగించే మూలకములను మూసిపెట్టుటేగానీ ధైర్యముగా లోకమునకు చాటగలరా! లొగుట్టు ఇద్దరి ఎరుక .1.చేసేవానికి 2.వానిని చేసేవానికి.

మనిషిలో సంతృప్తి సమసిపోయింది.సంపాదనే సర్వస్వమైపోయింది. ఇటువంటి స్థితిలో తీరుబడి ఎక్కడిది. దేవుణ్ణి తలచుకోనుటకు కూడా సమయము లేదు. తిరుమల కొండకు flight లోపోయి దేవుని దర్శనానికి special ticket' తీసుకొని దానికి recommendation జోడించి 15 నిముషాలు దైవ సన్నిధిలో యుండి తిరిగి flight లో వూరు చేరి భగవంతుడే నేరుగా వచ్చి దర్శనమిచ్చినాడని గొప్పలు చెప్పుకొనే ఈ భాగవతోత్తముల భక్తిని ఏమని పొగడవలె. ఆడంబరాలే భక్తీ అనుకునేటంత అమాయకుడా భగవంతుడు. మన ఆత్మను తనకు ఎంతవరకు అనుసంధానము చేసినాము అన్న విషయము తెలుసుకోలేడా ఆ పరమాత్ముడు. లేక ఈ భక్తాగ్రేసరులు భగవంతుని కూడా నమ్మించినామనే భ్రమలో ఉన్నారా ! ఇదీ మన ప్రగతి. ఇది నమ్మితే కలిగేది అధోగతి. వదిలేదెప్పుడు మనలనీ దుర్గతి. దీనికి పరిష్కారము నివ్వగలిగినది యువత ధర్మ నిరతి.

సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయా
సర్వే బద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్

కాసింత కూడా దుఃఖము లేని సౌఖ్యమును సకల జీవరాశికీ కోరిన వేదభూమి మనది.
వేద చోదితమైన మన యంత్ర, తంత్ర, మంత్ర నిర్మాణమంతా విశ్వ శ్రేయస్సుకే  మన పూర్వీకులు వినియోగించినారు గానీ విశ్వ వినాశనమునకు గాదు.5,౦౦౦ సంవత్సరముల జరిగినదని నిర్ధారింపబడిన భారత యుద్ధము ముగిసిన వెంటనే వివిధ విధములుగా సంపాదించిన తమ మారణాయుధములనెల్లా సముద్రములో పడవేయుటే  ఇందుకు తార్కాణము . పెద్ద దేశములకే పెద్దదయిన అమెరికా తన మారణాయుధాలను పారవేయ గలుగుతుందా! చేయలేదు. ఎందుకంటే దేశాలమీద యుద్ధాలు రుద్ది ఆయుధాలు అమ్ముకోనుటే వారి గుణము. ఆ దేశములోవేరు పరిశ్రమలు ఏవైనా వున్నా దీని తరువాతనే.
ఏతావాతా నేను చెప్పదలచుకోన్నదేమిటంటే మన విజ్ఞానము కోరేది  'లోక హిత'మైతే వారి science కోరేది  'లోక హతము'.ఈ దృక్పథముతో భారతీయ వినీలా కాశములో కనిపించే కొన్ని తారకలను చూస్తాము.

ప్రాచీన భారతము అంటేనే, ఇప్పుడు కుంచించుకు పోయిన మన ఎల్లలను, సుదూర తీరాలకు విస్తరించవలె. పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్,ఉజ్బెకిస్తాన్,తుర్క్మెనిస్తాన్ మరియు రష్యాలోని కొన్ని భాగాలు ఇరాన్, సౌదిఅరేబియా, టర్కీదేశాలు,సింగపూర్ ,మలేసియా, థాయిలాండ్,మయాన్మార్ మొదలగు దేశాలు ఈ భారత ఖండములోని భాగములుగా ఉండేవి.(Indian Kshatriyas Once Ruled from Bali to Baltic & Korea to Kaba (1966)-By P.N.Oak) నేటికీ మన సంస్కృతికి ప్రతీకలైన గుళ్ళు, గోపురాలు,విగ్రహాలు, శిలలు,శిల్పాలు ఈ దేశాలలోనే కాక జపాన్,చైనా లాంటి దేశాలలో కూడా చూడవచ్చు. మక్కా ఒకప్పుడు మఖేశ్వరాలయము. మఖము అంటే యజ్ఞము. అంటే ఇక్కడ విరివిగా యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉండుటవల్ల ఆపేరు వచ్చియుండవచ్చు. అరబ్బీ భాషలో ఈ పేరునకు మూలము దొరకదు. పైగా ఈ ఆలయమును మహమ్మదు ప్రవక్త మరియు వారి అనుచరులు విద్వంసము చేయక మునుపు 'సాయిర్-ఉల్-ఓకుల్' అన్న పద్య సముదాయము అరబ్బీ భాషలో బంగారు ఫలకముపై వ్రాసి ఆ ఆలయము లోపల కుడ్యమునకు వ్రేలాడదీయబడి యుండెడిదట.దానిని నేటికినీ 'మాక్క్తాబ్-ఎ-సుల్తానియా' అన్న, టర్కీ కి రాజధానియైన 'ఇస్తాంబుల్'నగరములోని ప్రభుత్వ గ్రంథాలయములో చూడవచ్చునని చదివినాను . ఇది ప్రవక్త గారి uncle అయినటువంటి 'ఉమర్-బిన్-అస్నాం' ఉర్ఫ్'అబల్-హికం' అనునతడు,మన 'భేతాళ కథలకు' పరిమితమైన 'విక్రమార్కుని'గురించి,ఆయన దక్షతను గురించి  అత్యున్నతముగా వ్రాసినాడు.ఆ కవి, ప్రవక్త గారి మతములో చేరలేదన్నకారణానికి  నూతన మతావలంబకులచే హతమార్చ బడినాడట. బ్రిటీషు చారిత్రికులు వారి హిందూదేశ అనుయాయులు వ్రాసిన చరిత్రలో మహాపురుషుడైనఈ 'విక్రమార్కునికి' చరిత్రలో స్థానమే లేకుండాపోయింది.అసలు 'అర్వము' అంటే గుఱ్ఱము. 'వ బ యోరభేదః' అన్న సూత్రము ప్రకారము ఆ దేశము కాలానుక్రమణములో 'అరేబియా' అయినదని 'P.N.Oak' గారు నిర్ధారించినారు. అరేబియా గుఱ్ఱములకు ప్రసిద్ది యన్న విషయము మనకు తెలిసినదే కదా !

అసలు విషయానికొస్తే ప్రాచీన భారత దేశములో, భౌతిక ఉపయోగములకై, అనేక యంత్రాలను వాడినట్లు సప్రమాణముగా మన వాఙ్మయము ద్వారా తెలియ వచ్చు చున్నది.'యంత్రార్ణవము' 'సమరాంగణ సూత్రధార' ఇత్యాది గ్రంథ పరిశీలనము చేసిన మనకు వాస్తవాలు గోచరిస్తాయి. వీని మూలములను మనము అధర్వణ వేదములో చూడ వచ్చు. ఈ గ్రంథాలు గృహోపయోగములకు, వ్యవసాయానికి,యుద్ధ ఆయుధములకు,రోబో లకు సంబంధించిన ఎన్నో విషయములను గూర్చిన వివరాలనందిస్తాయని విజ్ఞులు చెప్పగా విన్నాను. కానీ ఈ ఆవిష్కరణలేవీ అటు ధ్యేయాన్ని ఇటు ప్రకృతి పై ధ్యాసను ఏమరలేదు.ఇవి నేటి కొన్ని యంత్రములవలె దారుణ మారణ హోమములను సృష్టించవు. 'jaguar naught' అన్న పేరుతో పిలువబడుతూ మారణ హోమమును సృష్టించే అతి పెద్ద 'tanker' కు ఆ పేరును 'జగనాథ' రథము నుండి తీసుకోన్నారంటే ఆ జగన్నాథుని పాదాశ్రితులమైన మన మనసెంత నోచ్చుకొంటుందో గమనించండి. ఆపేరు,చాలా పెద్దదైన ఆ రథము లాగుటలో చక్రముల కింద పడి మరణించు వారిని జూచి, ఆ రథము పేరు పెట్టినారు. మనమో, అలా జరిగితే ఆ భక్తుడు వైకుంఠ గతుడౌతాడని నమ్ముతాము. 
మిగిలినది మరోమారు.....



ప్రతిష్ఠ, బ్రతుకు చీకటి ...,మా బడి

ప్రతిష్ఠ 

ప్రతిష్ఠను గూర్చి నా ఈ నాలుగు మాటలు చదవండి 

ప్రతిష్ఠ అంటే ఏమని ప్రశ్నించితి నొక నాడు 
ధనము పలికె తానేనని దర్పముగా ఎదుట నిలిచి 
ప్రతిభ పలికె తానేనని ప్రత్యర్థిగ తెలియ బరచి 
ప్రతిష్ఠతా చిన్ననవ్వు ప్రసరించుచు ఇట్లుపలికె 
వారిమాట నిజముకాదు వాస్తవమున ఆ పదమ్ము 
సద్వర్తనకే చెందును సత్యము ఇది దైవవాక్కు
मैंने पूछा प्रतिष्ठा किसका है न्यारा
धन बोला प्रतिष्ठा मेरा है दुलारा
फ़न बोला प्रतिष्ठा मेरा है किनारा
लेकिन बोली प्रतिष्ठा मेरा है सहारा
न तो धन,न तो फ़न,पर वो है सिर्फ़ गुण
Once I asked ' cause of honour' someone to share
Wealth declared'I am the cause of honour every where'
Talent said 'None but I the badge of honour wear'
Honor remarked 'Both of you are quite off the mark'
I am the God's secret 'which goodness doth share'

_____________________________________________________________________________________
బ్రతుకు చీకటి లోన చిరుదివ్వె వెలిగింది

చదవకుండానే like కొట్టవద్దండి. ఇది ఒక నిస్సంతు (బిడ్డలు లేనివాడు) హృదయనివేదన.మనసు పెట్టి చదవండి.మీ హృదయాన్ని ఈ ఉదంతము కదిలించితే, నాలుగు మాటలు మీరు వ్రాస్తే, అవి ఇంకా కొన్ని జంటలను ఉద్దీపించ గలుగుతాయేమో!

నాకు దాదాపు 40 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు కలుగలేదు.కొలువని స్వామీ లేడు,కలువని స్వామీ లేడు. నేను ఏ జన్మలో చేసినదో కీడు, తీరిపోయిందొకనాడు,గురువు కరుణించినాడు, దైవములు ఇరువురూ అనుగ్రహించినారు.

ఆ గురువు రాఘవేంద్రుడు,ఒక దైవము పెంచల నరసింహుడు. వేరొక దైవము రామేశ్వర రామలింగేశ్వరుడు. .
మృత్యు ముఖము నుండి నా శ్రీమతిని రాఘవేంద్రుడు ఏవిధముగా కాపాడినాడో ఒకపరి వ్రాసియుండినాను. ఇప్పుడు పెంచేల నరసింహుడు , మంత్రాలయ రాఘవేంద్రుడు,రామేశ్వర రామలింగేశ్వరుడు పిల్లల కోసం తల్లడిల్లే మా దంపతులపై ఎట్లు కరుణించినారో ఎరుక పరచుతాను.

అది రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం. పూర్తిగా అటవీ ప్రాంతం. అయినా సరే ఎటు చూసిన భక్త జనం కిటికిటలాడుతుంటారు. మొక్కు తీర్చుకోవడానికి బారులు తీరి వస్తుంటారు. కోరిన భక్తులకు అక్కడి స్వామి నిజంగా కొంగుబంగారమే. ఆయనే లక్ష్మి నరసింహస్వామి. ఆయన ఉన్న స్థలమే పెంచలకోన . ప్రశాంతత కోసం నరసింహస్వామి ఈ ప్రాంతాన్ని చేరుకుని స్థిరపడ్డట్లు పురాణాలు చెపుతున్నాయి.  కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసినారని రని అంటూవుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గంలోని పెంచలకోనజిల్లా కేంద్రమైన నెల్లూరుకు దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుంచి ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ బస్సు సౌకర్యం ఉంది. అదే స్థాయిలో కడప జిల్లా రాజంపేట నుంచి బస్సులున్నాయి.

లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మీదేవిని పెనవేసుకుని శిలగా స్థిరపడినట్లు చరిత్ర చెబుతుండడంతో ఈ క్షేత్రం పెనుశిలగా పేరుగాంచింది. స్వా మివారిని భక్తులు పెంచలస్వామిగా పిలుస్తారు. నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లోని నదీపరీవాహక ప్రాం తమైన పెనుశిల క్రమేణా పెంచలకోనగా మారింది. 

1809లో 200 ఎకరాల అటవీ ప్రాంతాన్ని పెంచలకోన క్షేత్రానికి హంటన్‌దొర  ధారాదత్తం చేసినట్లు ఆధారాలున్నాయి. హిరణ్యకశికున్ని వధించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి పెంచలకోన అడవుల్లోని చెంచు వనితను మో హించి, మనుమాడారని పెద్దలు చెబుతారు. ఎత్తై కొండ లు, దట్టమైన అడవుల మధ్య కండలేరు ఒడ్డున స్వామి వారు స్వయంభుగా వెలిశారని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణుమూర్తి తొమ్మిదోఅవతారంగా పెంచలకోన క్షేత్రంలో స్వామి వారు కొలువైఉన్నారని అంటారు. వైష్ణవ క్షేత్రాల్లో పెద్దదిగా పెంచలకోనకు పేరుంది. ఇక్కడి గర్భగుడిని సుమారు 800 ఏళ్ల కిందట నిర్మించి ఉంటారని అంచనా వేశారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో సంతానలక్ష్మి వటవృక్షం వుంది.సంతానం లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. 

ఈ క్షేత్రం లో సప్తతీర్థాలు ఉన్నాయి. కొండమీద నుంచి కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు హరించి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ పిల్లల కొరకు స్వామికి వరపడటం ప్రత్యేకత. 

ఈ క్షేత్రానికి నేను మా తండ్రి అమ్మమ్మ గార్లతో నాకు 8 సంవత్సరాల వయసు వున్నపుడు పోయి వుండినాను.అప్పుడు ఆయన ఒక పిల్లలు లేని జంటను తన వెంట పిలుచుకుపోయి స్వామీ ముందు వరపడ
జేసినారు.వారు స్వామీ కృపా కటాక్షము వల్ల కాలాంతరమున సంతానవంతులైనారు.

ఆడవారు కట్టుబట్టతో కోనేటిలో శిరస్త్నానమాచరించి ఏమాత్రము బట్ట పిండుకోకుండా వళ్ళు తుడుచుకోకుండా
స్వామి గర్భ గుడిముందు బోర్లా సాగిలబడి చేతులు సాచి స్వామికి దండం పెడుతూ కళ్ళు మూసుకొని ఉండిపోతారు. వారికి తెలియకుండానే సుషుప్తిలోకి జారుకొంటారు.వారి వారి కర్మ ఫలాన్ని బట్టి స్వామీవారు ఫలితాన్ని తప్పక స్వప్నములో ఎదో ఒక రూపములో అంద జేస్తారు. అదే జరిగి తీరుతుంది. దానిని వరపడుట అంటారు.30 సంవత్సరాల తరువాత మా తండ్రిగారు మా దంపతుల విషయములో కూడా అదే చేసినారు. అప్పటికే 10 ఆపరేషనులు జరిగి, ఒక డాక్టరు అసమర్థత వలన కడుపు బాగా పెరిగి పోయిన, అప్పటికి 31 సంవత్సరములు కలిగిన నా శ్రీమతి అసలు బోర్లా 3,4 గంటలు ఎట్లు వరపడినదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఆమె వరపడి
యున్నంతసేపు నేను స్వామికి గర్భగుడి చుట్టూ ప్రక్షిణలు చెస్తీనె వుండిపోయినాను. స్వామి తనకు పూవులు పళ్ళు స్వప్నములో ఇచ్చినట్లనిపించింది. పూజారిగారు ఆడపిల్ల కలుగుతుందని చెప్పినారు. కళ్ళు మూసుకుకొని నిద్రలోకి జారిపోయిన తనకు తాను వరపడినంతసేపూ నేను ప్రదక్షిణాలు చేస్తూవున్నట్లే ఉండినదట.తాను వరపడినంతవరకూ నాకు ప్రదక్షిణలు చేస్తూ ఉండవలెనన్న వూహ కూడా లేదు.అంతా ఆయన లీల.

అక్కడనుండి వచ్చినతరువాత నేను ఉద్యోగరీత్యా తిరుపతిలో వున్నప్పుడు  మా జోనల్ ఆఫీసుకు (అప్పుడు నా ఉద్యోగము అక్కడ) 9 గంటలకల్లా పోయేవాడిని, అంటే ఆఫీసు టైమునకంటే గంట ముందే. అందువల్ల మధ్యాహ్నము బోజనమునకు ఇంటికి వచ్చి అన్నము తిన్న వెంటనే ఆఫీసుకు పోయే వాడిని . ఆరోజూ అదేవిధముగా నేను వచ్చేసమయానికి , వంటింటిలోనున్న దేవుని మందహాసమునకు ఎదురుగా బోర్ల సాగిలబడి, రెండుచేతులు సాచి జోడించి మ్రొక్కె భంగిమలో, స్మారకమే లేని స్థితిలో వుండినది. నేను వచ్చిన అలికిడి విన్నంతనే లేసు వ్యక్తి పిలిచినా పలుకలేదు. నేను ఆపై పిలువక అత్లీ వుండిపోయినాను. కాసేపైనతరువాత లేచి రాఘవేంద్రులవారు స్వప్నములో ఫల తాంబూలము నిచ్చినట్లు చెప్పినది. ఆ తరువాత బహిష్టు కాలేదు.

అంత మాత్రము చేత అది గర్భధారణ అని నిర్దారించుకోలేని స్థితి మా అందరిదీ. అందరిదీ అంటే నాది,నా శ్రీమతిది మా తండ్రిది నన్ను పెంచిన మా అమ్మమ్మది. కొన్ని దినముల తరువాత పరిస్థితులు కలిసి రావడము వల్ల దక్షిణ దేశ యాత్రకు బయలుదెరినాము. మొదలు చెన్నపట్టణము చేరి, అప్పటికి ఒక సంవత్సరమునుండి చికిత్స చేయించు  కోనుచుండిన, ప్రపంచములో ఏర్పరచిన 'అపోలో హాస్పిటల్స్' మొదటి  శాఖ లోని గర్భ చికిత్సా నిపుణురాలయిన (gynecologist) డా. వాసంతి వద్దకు వెళ్ళ్లినాము. ఆమె 'అల్ట్రా సౌండ్' పరీక్ష చేయించి ఫలితములు (results) చూసి గర్భ ధారణ జరుగలేదు అని తెల్పినది.అప్పటికి నా శ్రీమతికి రెండు నెలలు దాటి పది రోజులు దాదాపుగా అయి వుండినది. నేను మాత్రము ఆ మాటను నమ్మలేక అమ్మా నాకు అది pregnency గానే తోచుచున్నది. harmonal టాబ్లెట్స్ ఇవ్వవద్దని చెప్పినాను.ఆమె నామాటను గౌరవించుతూ మీరు తీర్థయాత్రలకు పోయివచ్చునపుడు వచ్చే దారి ఇదే కదా కాబట్టి అప్పుడు తిరిగీ checking కు వచ్చేది అని చెప్పింది.నేను సరే అని చెప్పి తీర్థయాత్రలకు బయలుదేరినాను.

తీర్థ క్షేత్ర విగ్రహ దర్శనాదులు చేసుకొంటూ రామేశ్వరము చేరినాము. అక్కడ శారీరిక మానసిక ఆర్ధిక వంచనలేకుండా నాగప్రతిష్ఠ చేయించి కన్యాకుమారి మీదుగా కేరలపుణ్యక్షేత్రములు చూసుకొంటూ చెన్నపట్టణము చేరినాము. డాక్టర్ వాసంతి గారి వద్దకు వెళ్ళితే తిరిగి scanning చేయించి గర్భము కాదు అని తెల్చినారు. అట్లు తేల్చి 'dufastan' అన్న tablets వ్రాసియిచ్చినారు(పేరు వ్రాసినానని doctor ను సంప్రదించనిదే, మీరు వాడవద్దు.) ఆ చీటీ చేతికి తీసుకొంటూ అమ్మా నాకు ఇంకా తాను కడుపుతో ఉన్నదన్న నమ్మకమే వున్నది. ఈ మాత్రలు చెడుపు చేయవు కదా అని అడిగినాను. ఆమె ఎంతో అభిమానముతో మారు ఆచింత పెట్టుకోనక్కరలేదు. ఇవి pregnency టెస్ట్ గా కూడా పని చేస్తాయి. రెండుమాత్రలు వేసుకొన్న తరువాత ఒక వారము లోపల బైట చేరకుంటే అది pregnency గా మీరు నిశ్చయించుకోవచ్చు అని చెప్పినది. నా శ్రీమతికి అవి వాడిన పదిహేను రోజులవరకు వేచియుండి, ఆ తరువాత తిరిగి చెన్నపట్నం అపోలో డా.వాసంతి గారి వద్దకు చేరినాము.తిరిగి వారు scanning చేయించి అప్పుడు అది గర్భమని నిర్ధారించినారు.

మాపై ఆ పెనుశిల నరసింహుడు ఆ రాఘవేంద్రుడు,ఆ రామలింగేశ్వరుడు దయ చూపుట చేత ఆ కాన్పులో ఒక అమ్మాయి ఆపై సంవత్సరము పై ముడునేలలకింకొక అమ్మాయి కలిగినారు. అబ్బాయి కొరకు ఇంకొక సంవత్సరము sterilize చేయించుకోకుండా ఆగుతారా అని ఆపరేషన్ థియేటరు నుండి తన అసిస్టెంట్ డాక్టర్ను పంపి అడిగించిందిదాక్టరమ్మ.ఇదే చాలు, ఇంతే చాలు అని అన్నాను.

నమ్మకమెప్పుడూ నడిపిస్తుంది. అపనమ్మకమో ఆపేస్తుంది.

నా శ్రీమతి తో సమానముగా నేనూ ఆ ముహుర్తానికే ఈ గేయము ప్రసవించినాను.
చదివితే ఒక నిస్సంతు ఆత్మ వేదన ఏమిటో మీకు తెలుస్తుంది. సంతానము ఎంత స్పూర్తిదాయకమన్నది కూడా అర్థమౌతుంది.

ఇంటి కేతెంచిన అతిధి అభ్యాగతులు పాప లెక్కడ మాకు కనిపించరే మనిన

కడుపులో కన్నీటికడవలను దాచుకొని కరుడుకట్టిన కంటిపాప జూపుచునుంటి

బోసి నవ్వులు మాకు కనిపించవే మనిన పటము లో గాంధీని పరికించ మంటి

తప్పటడుగులు ఇంట కనరావు మాకనిన వయసుమీరిన యవ్వవంక గాంచమనంటి

పసిపాప ఏడుపులు పసిగట్టకుంటిమన మనసార ఇల్లాలి మోముజూడమనంటి

కటిక చీకటి యాయె కరదీపి కేదియన *కరముల కొరకు నే కాచుకొన్నానంటి   (కరములు=కిరణములు, వెలుగు)

చిలుకపలుకులు వినగ మనసాయెననియన్న చిద్విలాసునికరుణ  చిలుకవలె నంటి

ప్రశ్న ప్రశ్నకు నాకు బడులిచ్చు ఓపిక రాను రానూ సన్నగిలి పోవు చుండగా

అన్ని ప్రశ్నల కోక్కటే జవాబును కూర్ప పసిపాప నందించె పరమేశ్వరుడు నాకు

బ్రతుకు చీకటిలోన చిరుదివ్వె వెలిగింది నా గమనమునకిపుడు గమ్యమగుపించింది
స్వస్తి
_________________________________________________________________________________


మా బడి (గేయము)

నేను వ్రాసిన ఈ గేయము బాగుంటే మీ పిల్లలకు నేర్పండి . 

అదిగోనండీ అదియే మాబడి 
చదువుల తల్లికి నిర్మించిన గుడి 
నేర్పును మాకది చక్కని నడవడి 
కాదది బడి మా తల్లి యొడి 

అమ్మా నాన్నల పెట్టక ఆరడి 
చేయక ఎప్పుడు మాటల గారడి
బడికి పోయెదము రోజూ వడివడి
నిలువమెప్పుడూ అడుగులు తడబడి

గురు వచనములకు కట్టుబడి
పాఠము విందుము చేయక సవ్వడి
పోకుండా మేమెప్పటికీ చెడి
కాచేవారలు సురలు సుడీ


చెరుకు రామ మొహన్ రావు



Friday, 21 October 2016

నా తెనుగు

నా తెనుగు
కాంచనమగు నా తెనుగది కన 'అజంత' సుందరము
గాన కవన రసమందున కన అజంత సుందరము
               భువన విజయ కవి సారము భువి కృష్ణా నయగారము
                గాన  కవన  రసమందున  కన   అజంత   సుందరము
 మావి పైని నునుపుదనము మావిలోని తీయదనము
గాన కవన రసమందున కన అజంత సుందరము
                మది మెచ్చే కుందనము మరులు గొల్పు చందనము
                గాన  కవన  రసమందున  కన  అజంత  సుందరము
 కలితాక్షర ధని యాంధ్రము గన 'అజంత' సుందరము
గాన కవన రసమందున కన అజంత సుందరము


చెరుకు రామ మోహన్ రావు