Friday, 20 November 2015

కార్తీక పౌర్ణిమ

Script For 25/11/2015 Broadcast


పరమేశ్వర స్వరూపులైన myind media శ్రోతలకు నమస్కారము. నా 

పేరు చెరుకు రామమోహన్ రావు. నేను విశ్రాంత 

భారత రాష్ట్రీయ వార్దుషీ యదికారిని. అంటే State Bank Of India 

Retd. Officer ను.వార్దుషి అంటే bank అని. నిజానికి వార్దుషి అన్నది  

bank కన్నా చాలా అనుగుణమైన పేరు. కానీ మనకు విదేశీ వ్యామోహము 

ఎక్కువ కదా! సరే , గీత దాటకుండా విషయములోనికి అడుగు పెడతాను.

మీతో మాట్లాడే అవకశాన్ని నాకు కలిగించిన myind media కు 

ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

పుట్ట పగిలితే చీమలు వచ్చినట్లు, bank తెరిచితే చెక్కులు వచ్చినట్లు నోరు 

తెరిచితే ఆవులింతలు వచ్చినట్లు, బడి వదిలితే విద్యార్థులు వచ్చినట్లు, 

బ్రహ్మానందము కనబడితే ప్రేక్షకులకు నవ్వులు వచ్చినట్లు,web తెరిచితే 

గబ్బువస్తుంది. గబ్బుల మబ్బులు తొలగించితే అబ్బురపరచే మంచి కూడా 

సుబ్బరంగా కనబడుతుంది. నిప్పుతో కొంపలనూ అంటించవచ్చు, వంటా 

చేసుకోవచ్చు.కాబట్టి ఈ మంచి చెడులన్నవి మన మనసు మీద 

ఆధారపడేవి. ఆ విధమైన web media నుండి చెడ్డను వంచి,మెల్లిగా 

తుంచి, మంచిని ఎంచి,మంచిగా పెంచి ,సంతరించి, మిమ్ము వరించి తరించ 

దలచి మీతో పంచుకోవలేనన్నధ్యేయముతో ముందుకు వచ్చిన, వారు,  

ఎంతయో అభినందనీయులు. వారు తలపెట్టిన యజ్ఞములో నేను సమిధను 

మాత్రమే . ఏ కల్తీ సారాయి పోయ్యిక్రింద కట్టెగా కాలుట కంటే సమిధ గా 

కాలుట గర్వహేతువే కదా! వారు ఇటువంటి మంచి మంచి పనులింకా 

ఎన్నెన్నో తలపెట్ట వలయునని, కేవలము వయసులో పెద్దనైన నేను 

ఆశీర్వదించుటకు చొరవ తీసుకొంటున్నాను. ఈ బృహత్కార్యము 

నెరవేరుటకు మీ ఆదరము, అభిమానము, ఆప్యాయత

అనురాగము,ప్రేమ, 

వాత్సల్యమును, మమకారములను చూపించి , పాలూ నీరు ,జీర గులాబ్ 

జామూన్, ఇడ్లీ సాంబారు కలిసినట్లు సంస్థలో భాగమై మా తప్పులను 

సవరించుతూ, ఒప్పులకు భేష్ అంటూ మమ్ము నడిపించి మీ 

హృదయములకు కలకాలమూ చేరువగా వుంచుకొంటారని  

ఆశించుతున్నాను.ఆరంభమున హేరంబా యని తలచి స్వామి 

యనుగ్రహము కోరుట, ముఖ్యముగా మంచిపనులు చేయుటకు అత్యంత 

అవసరము. అందులో భాగముగానే నేనే వ్రాసి బాణీ కట్టిన పాట 

మీముందు ఉంచుతున్నాను. నేను సంగీతము అణుమాత్రము కూడా 

నేర్చుకోలేదు. పాట బాగుంటే పరమేశ్వరానుగ్రహము లేకుంటే నా చేతగాని 

తనముగా భావించ ప్రార్థన.

వందే వందే గజాననా
గౌరీ ప్రియసుత గజాననా
హారతి గొని మా కలుష మెల్లను
హరియించుమయా హరుతనయా       || వందే వందే గజాననా ||

సకల కార్యముల కాద్యుడవీవే
సర్వ శుభములను కూర్తువు నీవే
నీదు పాదములు మదిలో నిలిపి
నిన్నే నిన్నే వినుతింతుమయా             || వందే వందే గజాననా ||                                    

ఆగ్రహ నిగ్రహ శక్తి యుతుడవు
అనుగ్రహించుము మాపైన
కరములు కలిపి వేడుకొందుము
కనికరించుమా కరుణాహృదయా           || వందే వందే గజాననా ||

కార్యక్రమాన్ని ఒక మంచి మాటతో మొదలు పెడదామన్నది నా ఉద్దేశ్యము. 

అజరామర సూక్తి

విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం

విద్యా భొగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః

విద్యా బంధుజనో విదేశగమనే విద్యాపరా దేవతా

విద్యా రాజసు పూజితా న హి ధనం విద్యా విహీనః పశుః

- నీతిశతకము, భర్తృహరి

దీనిని ఏనుగు లక్ష్మణ కవి గారు ఈవిధముగా తెనిగించినారు:
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.

వ్యక్తికి విద్యయే రూపము. విద్యయే గుప్త ధనము,విద్యయే సకల భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్య లేనివాడు మనషుడే కాదు.

విద్య తోటి వచ్చు వినయము విద్వత్తు
విద్య తెచ్చు కీర్తి విత్తములను 
విద్య నేర్వకున్న విలువేది ధరలోన 
విద్య లేని వాడు వింత పశువు
ఈ పద్యములోని చివరి పాదము పుష్పగిరి తిమ్మన గారి తెలుగు సేతలోని చరణమనుకొంటాను లేక ఎలకూచి బాలసరస్వతి గారిదో! అది చాలా ప్రసిద్ధి గన్నది. మిగతా మూడు చరణములు తెలియనందువల్ల నా పైత్యమే జోడించినాను.
విద్య మరియు విజ్ఞానం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే మారుస్తుంది. విద్య వినయము విజ్ఞానమును కూడా ఇస్తుంది. ధనము యశస్సును ఆర్జింపజేస్తుంది. గుణనిధుల సహవాసమును గూర్చుతుంది. ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. దీనిని bank locker ల లో పెట్టనవసరములేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా విద్యావంతుని ఆదేశము గౌరవించుతుంది. విద్యకు వినయము, విధేయత  కర్ణునికి కవచకుండలముల వంటివి . అవి వదిలి కర్ణుడు దిక్కులేని మరణము పొందినాడు. వినయ విధేయతలు గలిగినవాడు గౌరవపాత్రుడౌతాడు. ఆ పాత్రత కలిగితే ధనము వద్దన్నా వస్తుంది. అధివస్తే తానూ తినవచ్చు పదిమందికీ పెట్టవచ్చు. ఈ విద్య విషయములో మనము ఇద్దరు వ్యక్తులను పోల్చవచ్చును. ఒకరు అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఇంకొకరు అబ్దుల్ కలాం . ఖదీర్ అంటే ఆంగ్లములో Powerful అని. కలాం అంటే speech అని. మొదటి వ్యక్తి పాకిస్తానీ శాస్త్రజ్ఞుడు . ఆయన అంతస్తు హోదా కోరుకున్నాడు. దానికి తగిన మార్గము ఏదయినా ఫరవాలేదనుకొన్నాడు. రెండవ వ్యక్తి కలాం అంటే speech. తన speech తో పిల్లలకు preach చేస్తూనే మన గుండెలకు reach అయ్యి తన తనువు చాలించినాడు. అంటే తాను పొందిన విద్యకు వినయుడై విధేయుడై మన గుండెలలో నిలచినాడు.
జ్ఞానమునకు  ఎటువంటి అడ్డంకులు, హద్దులు లేవు. ఇది ప్రపంచ వ్యాప్తంగాగౌరవింప బడునది.దీనిని ఇంత మాత్రమె పొందవలేనన్న ఆంక్షలు వుండవు. ఈ ధనము పై Income Tax లేదు. రాజులైనా విద్యానిదులగు సత్పురుషులను గౌరవించక తప్పదు.
ఆలోచనా శక్తి గలిగి జ్ఞాన సముపార్జన చేయవలసిన వ్యక్తి మన్నుదిన్న పాము మాదిరి ఊరక గూర్చుంటే అతనికీ జంతువుకు తేడా ఏముంది.
అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. మామూలు పశువు కూడా కాదు పాపం!
*********************************************************************************
కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమికి అత్యంత ముఖ్యమైనది దీపము. అందునా సంధ్యా దీపము. ఒకటి ప్రాతః సంధ్య, రెండు సాయం సంధ్య. సూర్యోదయము ఉదయము ఆరు గంటలకు అవుతుందనుకొంటే, దాన్నికి ఒక గంటన్నర ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తము అంటారు. అంటే తెల్లవారుజ్హామున 4 - 30 కు మొదలవుతుందన్నమాట. ఈ సమయములో దంతదావనాది కాలకృత్యములు 
తీర్చుకొని శుచిగా స్త్నానము చేయావలె. ఆకాశగంగలో స్త్నానానికి సప్త ఋషులు ఆ సమయములో బయలుదేరుతారట.మనము ఆ సమయములో స్త్నానము చేయుటవల్ల వారి అనుగ్రహ దృష్టి మనపై ప్రసరించుతుంది. స్త్నానము చేసిన పిదప సూర్యోదయాత్పూర్వమే  ప్రాతః సంధ్యా దీపమును వెలిగించవలె.అదే విధముగా సాయం సంధ్య యందు సూర్యాస్తమయాత్ పూర్వమే సాయం సంధ్యాదీపమును వెలిగించవలె. శక్తి, అవకాశము కలిగినవారు కేవలము ఆవునేయితోనే దీపమును వెలిగించ మన్నది శాస్త్ర వచనము. దానివల్ల శుక్లములు రావన్నది ఆర్య వాక్కు. అట్లు కాకుంటే తైలము తోనే వెలిగించవలె.'తిలేభ్య ఇదం తైలం' తిలల ద్వారా వచ్చినది మాత్రమె తైలము . ఇది సర్వ విధాలా ఆరోగ్యకరము. ఆలివ్ నూనెను గూర్చి వారు తెలుపలేదు. దాని అవసరము వారికి కలుగలేదు కాబట్టి. అటువంటి దీపమునకు ఈ శ్లోకమును చెప్పి నమస్కరించవలె. ఈవత్తికి ఎన్ని పురులు వుండవలెనంటే  మూడు పురులు అంటే మూడు వత్తులు పేని ఒకటిగా జేసి దీపమును వెలిగించవలె. పెద్దలు 
"సాజ్యం త్రివర్తి సంయుక్తం-- వహ్నినా యొజితమయా
గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం" అన్నారు . స + ఆజ్యము అంటే ఆజ్య సహితముగా అని మీకు తెలిసినదే! ఆజ్యము అంటే ఆవు నెయ్యి మాత్రమె. 3 పురులు కలిగిన వత్తి నేతిలో తడిపి పెట్టమన్నారు. అది సర్వ శ్రేష్ఠము. దీపము మూడు లోకముల చీకటులను పారద్రోలి జగములకు వెలుగులు నింపుతుంది.
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపా నమోస్తు తే
ఇది చెప్పవలసిన శ్లోకము దీపము పెట్టు సమయములో !

పాశ్చాత్యులు,  Light Trapping System అన్న ఒక పద్ధతిని వారి వారి పేర్లమీద ప్రచారమునకు తెచ్చినారు. మరి దేనికయినా ఒక మూలము అవసరము కదా! దానికి మూలము మన దేశమే! మనము పిలుచుకొనే దీపావళి, దీపోత్సవము , కార్తీక దీపారాధన ప్రభావమే వారి పుర్రెలో పుట్టిన భావము. అసలీ దీపోత్సవము వెనుక దాగియున్న శాస్త్రీయతను చూద్దాము. (correction**) వర్ష ఋతువులో వర్షము పడుట మూలమున పెరిగిన పంటలు కోతలకు రావటముతో అవి కోయుటవలన వానిపై నివసించిన కీటక,పతంగములు ఇళ్ళలోనికి రావటము ఎక్కువౌతుంది. భూమి లోపల చేరిన నీటి కారణమున అంతకు ముందు ఋతువులో గ్రహించిన వేడితో మిశ్రితమౌట వలన వివిధ వాయువులు (విషవాయువులు ఎక్కువగా వుంటాయి) ఆవిరులరూపములో వాతావరణములో ప్రవేశించుతాయి. పగలైతే సూర్య ప్రకాశము వుంటుంది కానీ రాత్రికి ఎట్లు ? అందుకే కార్తీక మాసములో నూనె దీపములు వెలిగించేది. మన ఋషులు ద్రష్టలు. వారు అనుగ్రహించిన విధానమే ఈ కార్తీక దీపారాధన. దీనికి కేవలము((correction**) ఆవునెయ్యి అదిలేకుంటే నూవుల నూనెను మాత్రమె ఉపయోగించ వలెనన్నది వారి యాదేశము. ఇందుకు ముఖ్యమైన కారణములు రెండు. ఒకటి ఆ దీపములనుండి వచ్చు పొగ విషవాయువులకు విరుగుడుగా పని చేస్తుంది. ఆ దీపమూల వెలుగులకు ఆకర్షింపబడి క్రిమి కీటక పతంగ శలభములు, అందులో ఆహుతి యగుట చేత మానవాళి రోగముల నుండి రక్షింపబడుతుంది. ఇంత గొప్ప విషయమును పేరుకొరకు ప్రాకులాడకుండా ప్రజలకు పంచినవారు మన ఋషులు. మనమేమి చేసినా వారి ఋణము తీరదు కానీ మనసారా మరచి పోకుండా వారిని తలచుకొంటూ వుందాము. ఇక కార్తీక మాసములోనికి అడుగు పెడదాము.
కృత్తికా నక్షత్రమునకు, పున్నమి చంద్రుడు దగ్గరగుటవల్ల ఈ మాసమునకు కార్తీక మాసమని పేరు. కార్తీకమాసంలో సూర్యుడు తులారాశియందు ప్రవేశించును. ఆ సమయమున సమస్త నదులు కూడా గంగానది తో సమానముగా విష్ణుమయమౌతాయని కార్తీక పురాణమున చెప్పబడినది. కార్తీకమాసం వర్షాకాలం ముగిసిన తరువాత వస్తుంది. అంటే శరదృతువు లోని చివరి నెల కార్తీకము. అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణము ఇటు శరత్తులోను అటు వసంతములో వస్తాయి. అందువలన అన్ని పండుగలకు నోములకు ఆలవాలము. అందులో అత్యంత ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి. (correction**) ఈ ఋతువులో హృద్రోగములు ఎక్కువవుతాయి. అందుకే ఈ నక్తాలు ఉపవాసాలు . (correction**)ఉసిరిక చెట్టు లేక దాత్రీ వృక్షము క్రింద భోజనాలు. ఆమలకము అన్నివ్యాధులకు మందు అంటారు.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన (correction**)తరువాతి రోజు నుండినే కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ (correction**)ప్రాతః సాయంవేళల దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. (dialogue delete) ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహా పూరాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. ఈ రోజు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులు తోడూ రాగా త్రిపురాసుర సంహారము చేయుట జరిగింది. అందుకనే దీనిని త్రిపుర పౌర్ణిమ అంటారు.
మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. దేవతలను నానావిధాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వారు. రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కృత్తిక అన్నది ఒక నక్షత్రము కాదు, ఆరు నక్షత్రముల సముదాయము. కృత్తికలు మాతృకలు. అగ్ని సప్తఋషులు చెయు హవనమున వారి ధర్మపత్నులజూసి మొహితుడౌతాడు.వశిష్ఠుని భార్య అరుంధతి రూపము తప్ప మిగిలిన సప్తఋషులలోని ఆరుమంది రూపము దాల్చి, అగ్ని భార్య స్వాహాదెవి ఆయనకు ప్రీతిగలిగించుతుంధి. ఆ యువతులు తమ భార్యలని భ్రమపడి ఋషులు వారికి శాపములిస్తారు . వారే 6 కృత్తికలు  . 
పరమేశ్వరుడు పార్వతీ దేవితో క్రీడించు సమయమున, దేవతలు కైలాసమువచ్చి స్వామిని ఎలుగెత్తి పిలువడముతో ఆయన హృదయస్థానమునుండి వెలువడిన రేతస్సుతో వారి ముందునకు వచ్చి ఇక నా శక్తిని పార్వతి కడుపులో నిక్షిప్తము చేయలేను కావున తగినవారెవరని యడిగితే భూమి యని చెబుతారు దేవతలు. స్వామి భూమిపైకి తన రేతస్సును జారవిడుస్తాడు. భూమి భరించలేక పోవుట మూలాన  ఆ వేడిని అగ్నిమాత్రమే గ్రహించగలడని అగ్నిని వేడుకొంటారు దేవతలు. అగ్ని దానిని గ్రహించుతాడు కానీ భరించలేక పోతాడు. అప్పుడు తన మిత్రుడైన వాయువు సహాయముతో రేతస్సును పార్వతికి సహోదరియైన గంగకు ఇస్తారు. అప్పుడు గంగ  ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. కానీ గంగకు కూడా అది  చేతగాని పనియే అవుతుంది.(correction**) కొంత కాలము తరువాత ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరముల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకము నందు విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకము నుండి, ఆరుముఖములతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్లషష్ఠినాడు, షణ్ముఖుడు ఉద్భవించుతాడు.. (correction**)శరవణ తటాకము నుండి ఉద్భవించిన కారణముగా స్వామికి శరవణభవ అని నామము వచ్చినది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించినాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామము వచ్చినది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామములు వచ్చినాయి. దేవతలను రక్షించుటకొరకై శివుని నుండి, స్ఖలనమై (correction**)వచ్చిన కారణముగా స్వామికి 'స్కంద' అనే నామము వచ్చినది. అక్కడ వున్న   ఆరుమంది కృత్తికలు ఆయన ఆరు ముఖములకు స్తన్యమిచ్చినారు. కానీ దానికి గానూ వారు తమకొక నిరంతరమైన గుర్తింపు (correction**) కావలెనని అడిగినారు.దానికి తోడుగా  సుబ్రహ్మణ్యుడు తమకొడుకు గా కూడా గుర్తింపబడవలయునన్న ఒక కోరిక కోరినారు. అందు వలన ఆయన కార్తికేయుడై తక్షణ యవ్వనము పొంది తారకాసురుని ఈ పౌర్ణమినాడు నిర్జించినాడు. దేవతలు ఆనందించి ఈ దినము చేసుకొన్న దీపావళే 'దేవ దీపావళి' అయినది. కలకాలము వారి పేరు నిలుచుటకుగానూ ఇంద్రునితో చెప్పి వారికి విశ్వాంతరాళములో కృత్తికా నక్షత్రముగా విరాజిల్లులాగున (correction**)ఏర్పాటుచేసినాడు కార్తికేయుడు..
ఈ మాసమునందు దీపమునకున్న ప్రాశస్త్యము ఇంత అంత కాదు. ఈరోజు 360 వత్తులతో ఒక గుత్తి చేసి ఆలయములలో దానిని ముఖ్యముగా ఆవునెయ్యితో వెలిగిస్తారు. దీనికి కూడా తగిన కారణమున్నది. మనము సాధారణముగా "ఆయింట్లో దీపము పెట్టేవారు లేరు అని ఏదయినా ఒక తాళము వేయబడిన ఇంటినిగూర్చి అంటూ ఉంటాము." దీపానికున్న ప్రాముఖ్యత అది. ఏకారణము చేతనయినా మనము కొన్ని రోజులపాటు తాళము వేసి వేరు వూరికి పోవలసి వస్తే ఆ రోజులలో దీపము పెట్టె దిక్కు వుండరు. దీపము వెలిగించుట యజ్ఞము చేయుటకు ప్రతీక. దీపము పెట్టి ఒక చిన్న బెల్లపు ముక్క దేవునికి నైవేద్యముగా పెడితే అది ఇంటికి ఎంతో శోభస్కరము. ఈ విధముగా తలుపు తాళము వేయుటవల్ల ఆరోజులలో దీపమును పెట్టలేము కావున భగవంతుడు మనకు ఈ వెసలుబాటును ఇచ్చినాడు. ఈ పౌర్ణమిరోజు 360 వత్తులు ఒక గుత్తిగా చేసి దేవాలయములోని ప్రమిద లో ఆవునెయ్యి తో వెలిగించుటవల్ల ఆ దోషము పరిహారమగుటయే గాక సర్వ శుభాములనూ సమకూర్చుతుంది. మరి సంవత్సరమునకు 365 రోజులు కదా అంటారేమో. మనము భూమి చుట్టూ తిరిగే చంద్రుని భ్రమణ కాలమును తీసుకొంటాము. ఒక సంపూర్ణ భ్రమణము పూర్తియైతే ఒక వృత్తము పూర్తియైనట్లు.మరి వృత్తమునకు 360 డిగ్రీలే కదా వుండేది. ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క రోజుగా పరిగణించి 360 వత్తుల గుత్తి చేస్తాము. (correction**)హెచ్చు తగ్గులు శూన్య మాసము అధిక మాసములతో సవరించుకొంటాము.
దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలి కాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధన వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. వెలిగించేవాళ్లకి సహాయకులుగా ఉన్నా... కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అలాగే ఈరోజున... కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీకపురాణం చెబుతోంది.
అన్ని దానాలు ఒక యెత్తు అయితే దీపదానం ఒక్కటీ ఒక యెత్తు. దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారు చేసుకుని వరిపిండితో గానీ, గోధుమపిండితో గానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానికి నమస్కరించి నదీతీరంలోగానీ, దేవాలయప్రాంగణంలో గానీ బ్రాహ్మణుడికి దానం యివ్వవలెను. దీపదానం చేసే సమయంలో . అసలు ఉసిరిక కాయను తొలచి అంధుడి విత్తనము తీసి వత్తియుంచి ఆవునేతితో దీపము వెలిగించుట అత్యంత శ్రేయస్కరము. ఆ పొగ అత్యంత ఆరోగ్య ప్రదము.

సర్వ జ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్శుభావాహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ

కార్తీకపౌర్ణమినాడు వేకువజామునే లేచి శివనామస్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటిదొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు మహిళలు. పెళ్లికాని అమ్మాయిలు కార్తీకదీపాలను నదుల్లో వదిలి రాత్రికి తులసికోటలో కాయలతో ఉన్నఉసిరిక కొమ్మపెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు , మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేసి అమ్మవారు స్వామీ దానిని దాటగానే వారివెంట తామూ దాటితే  సర్వపాపాలు తొలగుతాయి. జ్వాల తోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. జ్వాలాతోరణమునకు సంబంధించిన పురాణ కథనము ఈవిధముగా వుంది. క్షీర సాగర మథనములో మొదట వచ్చిన హాలాహలాన్ని , లోకకల్యాణార్థమై, మ్రింగుటకు పరమేశ్వరుడు ముందుకువచ్చి మ్రింగుతాడు . ఆ దినము కార్తీక పౌర్ణిమ. ఆ కాలకూట విషాగ్ని అగ్నినే దహించివేయగల సామర్థ్యము కలిగినది. అట్టి అగ్నిని స్వామి కంఠము నుండి క్రిందికి జారకుండా ఆపి అమ్మవారు స్వామి ఉదరములోని చతుర్దశభువనములను కాపాడింది. ఆసందర్భామున ఆమె అగ్నిని , తనభర్త కంఠము లో శాశ్వతముగా వున్నా అటు ఆయనకు ,ఇటు లోకాలకు ఎటువంటి హాని కలిగించకుండునట్లునూ, అందుకు ప్రతిగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు తానూ తన భర్తతో సహా జ్వాలాతోరణము ముమ్మారు దాతుతానని చెప్పిందట. అందుకే ఈ తిథినాడు రెండు గుంజలను మధ్యన కాస్త దూరముంచి పాతి, వాటి పైన అడ్డముగా ఒక పురితిప్పిన ఎందుగడ్డిని చుట్టి వెలిగించి పల్లకిలో అమ్మవారిని స్వామిని త్రిప్పుతారు. వారితో బాటు భక్తులు కూడా తిరిగి తమ తమ పాప వినాశము చేసుకొంటారు.
కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. 
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 
ఇక ఈ దినము పరమేశ్వరుడు త్రిపురారులను చంపినట్లుకూడా చెప్పుకొంటారు. భాగవతము సప్తమస్కంధములో ఈ విధముగా వున్నది. త్రిపురాసురులచే విపరీతమైన కష్ట నష్టాలననుభవించిన దేవతలు విష్ణుని ఆజ్ఞ మేరకు శివుని ఈ విధముగా ప్రార్థించినారు.
దీనులము గాక యుష్మద
ధీనులమై యుండు మేము దేవాహితదో
ర్లీనుల మైనారము బల
హీనుల మగు మమ్ముఁ గావు మీశాన! శివా!

అప్పుడు శివుడు
శరి యై కార్ముకి యై మహాకవచి యై సన్నాహి యై వాహి యై

సరథుండై సనియంత యై సబలుఁడై సత్కేతన చ్ఛత్రుఁ డై
పరమేశుం డొక బాణమున్ విడిచెఁ ద ద్బాణానల జ్వాలలం
బురముల్ కాలె ఛటచ్ఛటధ్వని నభోభూమధ్యముల్ నిండగన్.

(భా-7-405-వ.)

వచనము.
ఇట్లు హరుండు దురవగాహంబు లైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తం

బున భస్మంబు చేసి కూల్చిన, నమర గరుడ గంధర్వ సాధ్య యక్ష
వల్లభులు వీక్షించి జయజయశబ్దంబులు జేయుచుఁ గుసుమ వర్షం
బులు వర్షించిరి; ప్రజలు హర్షించిరి; బ్రహ్మాదులు గీర్తించి; రప్సరసలు
నర్తించిరి; దివ్య కాహళ దుందుభి రవంబులును మునిజనోత్సవంబు
లును బ్రచురంబు లయ్యె; నిట్లు విశ్వజనీనం బగు త్రిపురాసురసంహా
రంబున నఖిలలోకులును సంతసిల్లి శివ కేశవులకు కృతజ్ఞత తెల్పుకొనిరి.
జ్యోతిష్ శాస్త్రానుసారము అభిజిత్ముహుర్తము ఒక దినములో సర్వ శ్రేష్ఠమైనది. పరాత్పరుని మనసారా పూజించి ఈ ముహూర్తమున ఎపనిజేసినా విజయము వరించక తప్పదు.సాధారణముగా ఇది 45 నిముసములుంటుంది. కానీ దీని వ్యవధి సూర్యోదయ సూర్యాస్తమయాలతో ముడివడి యుంటుంది. నారదపురాణానుసారము తిథివారనక్షత్రములేవీ ఈ ముహూర్తమునకు వర్తించవు.ఒక్క దక్షిణ దిశా ప్రయాణము మాత్రము నిషిద్ధము.

రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. 
 కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. 
కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి  ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. 
ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు. 

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. 
మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. 

పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. 
పూర్వం   నైమి శారణ్యంలో శౌనకాది మహర్షులతో  సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి  బోధించటం జరిగింది. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 
బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వటము చేస్తారు. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిదాని చెబుతారు. 
ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. 
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును. 
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. 
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. 
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన). 
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. 
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును. 
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

ఈ కార్తీక పౌర్ణమి శుభ సందర్భముగా శివునికి కేశవునికి సబందిన , నేనే వ్రాసి మేట్టుకట్టిన  రెండు పాటలు మీకు వినిపించుతాను.


పేరేపెన్నిది వేరేమున్నది చేరగ నీ సన్నిధి 
శివా నా మది మరి మరి యన్నది

కాలపు మాయా జాలపు ఎరనై 

విదివిధానమను వింటికి గురిని నై
జవసత్వములే చేయివదలగా
తెలిసేనాకిపుడు తేటతెల్లముగ
దాతవు నీవని త్రాతవు నీవని 
భీతిల పని యేలని 
శివా నామది మరి మరియన్నది         ||పేరే పెన్నిధి ||

నీ విభూతిలో నిరతము నెలవై 

నిలిచిపోయెదను ను నె రేణువునై
భస్మదారి యో భవభయహారి 
ఉండనివ్వు నీవంటినంటిమరి
తల్లివి నీవని తండ్రివి నీవని 
సకలము నీవేనని 
శివా నా మది మరి మరియన్నది.       ||పేరే పెన్నిధి ||     

మరుభూములలో మసలే దేవా 

నీపద రక్షణ చేయగ నీవా
అరచేతులనే పరచేతునయా 
నీ పదాల నేనంటియుందునయ 
నా స్థితి నీవని నా గతి నీవని 
గమ్యము నీవే నని 
శివా నా మది మరి మరి యన్నది      ||పేరే పెన్నిధి ||

ఈ కార్తీక పౌర్ణమి నాడే గోపికలకు కృష్ణ సాయుజ్యము కలిగినదని యంటారు . అట్టి సందర్భములో ఈ పాట వినండి.


రాస క్రీడకు రయమున రమ్మని 

రాగాలాపన రవళించేను 
రావె పోదాము మనసా 
యమునా తటమునకు
మనసా యమునా తటమునకు

ఎదలో దాగిన యదునందనుడు 

ఏదో గుసగుస వినిపించేను 
ఏమి సేతునే నేటుల సైతునే 
రావె పోదాము మనసా 
యమునా తటమునకు                         ||రాస క్రీడకు||

మెరుగుల సరిగెల మేఘాంబరమున 

ఎడనెడ నగుపడె నెలమానికము
కలువదివ్వెగొని కలువ మోహనుని 
రావె పోదాము మనసా 
యమునా తటమునకు                         ||రాస క్రీడకు||

హరిత సాలముల హరిణీ తతుల

వెలుగుల జిలుగుల హర్మ్య దీపికల
యమున వెలిగెలే హరిమయమౌచును
రావె పోదాము మనసా 
యమునా తటమునకు                         ||రాస క్రీడకు||

శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః.















2 comments:

  1. అయ్యా.. నమస్సులు. మీ మాటలను చదివి, ఒకమాట చెప్పాలని....ఏదయినా పుస్తకము అట్టమీద పేరుకు తగిన విషయం లోపలి పుటలలో ఉంటుంది. అలా ఊహించి, శివుడు హాలాహలము స్వీకరించడము గురించి... లోపలికి ప్రవేశిస్తే, కార్తీక పౌర్ణమి..తప్ప " అసలు విషయము" కనిపించలేదు. విచారిస్తున్నాను

    ReplyDelete
    Replies
    1. విషయము చదివినందుకు ముందు మీకు ధన్యవాదములు. శీర్షిక పేరే కార్తీక పౌర్ణమి.
      మరి వ్యాసము దానిని గురించే ఉంటుంది. ఇక వ్యాసమునకు అనుసంధానముగా వఉపయొగించిన బొమ్మ మనకు Blog లో అగుపించదు. పైగా ఆనాడు ఏబొమ్మ ఉంచినానో కూడా గుర్తులేదు. ఒక్కొఅ సారి కోరిన బొమ్మ దొరకకనూ పోవచ్చు. ఎదిఎమయినా మీకు వ్రాసిన విషయము నచ్చిఉంటే సంతోషము. ఈ వ్యాసమును మరొక పర్యాయము వాడినపుడు వేరేమయినా ప్రయత్నించుతాను.

      Delete