నారాయణం నమస్కృత్య నరంచైవ
నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో
జయముదీరయేత్
'జయము' అన్న పేరు భారతమునకు గలదు. ఆ జయమునకు
కారణ కర్తలేవరెవరో చూతము. నారాయణ స్వరూపుడైన శ్రీ కృష్ణుడు, నరోత్తముడైన
అర్జనుడు,వారి లీలలు ప్రకటించే వాణి, ఆ
వాణిని గ్రంథస్థము చేసిన వేదవ్యాసునికి, (వ్రాయుటకు తోడ్పడి
మనము తెలుసుకొను రీతి గావించిన వినాయకునికి ) నమస్కరించి ఈ ఇతిహాస పఠనము గావించవలె
నన్నది ఆర్య వాక్కు.
వాల్మీకి వ్యాసులు జన్మించిన
ఈ పుణ్య భూమిలో మనము పుట్టుటకు ఎంతయో పుణ్యము చేసియుండవలె.
వాల్మీకి
'యావత్ స్థాంస్యతి గిరియః సరితశ్చ మహీతలే
తావద్రామాయణ కథా లోకేషు
ప్రచరిష్యతి
రామాయణ మహా కావ్యం శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం పుంసాం
పాతక నాశనం
గిరులు తరులు ఝరులు ధరలో వరలినంత కాలం రామాయణ కథ ఈ లోకంలో ప్రచలితమై
వుంటుంది. శతకోటి ప్రవిస్తరమైన ఈ మహాకవ్యములోని
ఒక అక్షరం వల్లించినా జనుల పాతకములు పటాపంచలౌతాయి.
ఆయనము అంటే ప్రయాణము. అది
రాముని యొక్క ప్రయాణమా రాముని కొరకు ప్రయాణమా
రాముని యొక్క ప్రయాణమైతే
పరుడైన పరమాత్మ నరుడై ధర్మపరుడై పిత్రువాక్య తత్పరుడై అసురోత్పల (ఉత్పల=కలువలు)
దివాకరుడై, వనచరుడై
వనచరసహితుడై, జనహితుడై, జగన్మహితుడై
మానవాళికి ఆదర్శప్రాయుడై నిలచిన నరుడు.'
అని అంటే,
వ్యాసులవారు
ధర్మేచార్థేచ కామేచ మొక్షేచ భరతర్షభ
యది హస్తి తదన్యత్ర
యన్నేహాస్తి తతత్ క్వచిత్
ఈ ఇతిహాస గ్రంథము కలిగినది ప్రపంచములోని ఏ గ్రంథమైనా కలిగి యుండ
వచ్చును. ఇందులో లేనిది ఎందులోనూ ఉండదు. ఈ మాట చెప్పుట ఒక సాధారణ మానవునికి
సాధ్యమా! ఆయన మహా పురుషుడు,దైవాంశ సంభూతుడు,సకల వేదం వేదంగా విద్యా పారంగతుడు అయి ఉంటాడో ఆలోచన చేయండి. ' అమ్మ తిథి' నాన్న తిథి' 'భాషా
తిథి' రోగాల తిథులు ' ఈ విధముగా ఎన్నో
జరుపుకొంటున్నామే, ఈ దేశములో పుట్టిన ఆమహనీయులపేరుతో దేశ
వ్యాప్తమైన ఒక రోజును ఎందుకు ఏర్పాటు చేయలేము. ఎందుకంటే మనది ప్రజాస్వామిక దేశము.
సరే ఈ దేశము ఈ ప్రజలదే కాదా. ఈ మొత్తము ప్రజల యొక్క పూర్వీకులను తీసుకొంటే వారందరూ
కేవలము హిందువులు మాత్రమేకదా. మరి నేడు అనేక కారణములచేత పరమతాల పంచన చేరినవారికి,
తమ పూర్వీకులను, గౌరవించమని తమ మతములు చెప్పుట
లేదా. సెక్యులరిజం పేరుతో దేశాన్ని సర్వ నాశనము చేసిన నేతల, నానా
జాతి బీజాళి జాతల చావు పుట్టుక దినాలను నెత్తిన పెట్టుకొని విద్యా సంస్థలలో కూడా
వేడుకలు జరుపుకొంటున్నామే , ఈ దేశానికి ఒక గుర్తింపు తెచ్చిన
పై మహానుభావులను గూర్చి ఎందుకు ఆలోచించము. మనదంతా 'ఆడువారి
పెళ్ళో మగవారి పెళ్ళో'గాటికాడ ఇంత వేస్తే గతికి వచ్చినామన్న చందము
. అందుకే సభ్యత, సంస్కృతి,భాష, ఆత్మీయత, అనుబంధము , అన్నీ
పోగొట్టుకొని విదేశీయుల గొప్పదనమును నెత్తికెత్తుకొని ఉరేగుచున్నాము. ఇంకొక
ముఖ్యమైన విషయము ఏమిటంటే దాదాపు 5100 సంవత్సరాలక్రితమే psycho
analysis, counseling, HR relationships అన్న ఈ ఆధునిక నామములను
కలిగిన విషయముల గూర్చి రామాయణములోనూ భారతములోనూ విరివిగానూ విపులముగానూ ఈ ఆధునిక
పుస్తకముల చదువనవసరములేనంత పొందవచ్చును.
చాలా దూరము వచ్చివేసినాము . ఇక అసలు విషయానికి వద్దాము. భారతమును
తెనిగించిన నన్నయ తిక్కన ఎర్రనలు తక్కువ వారుకాదు.వారు పుట్టిన ఈ గడ్డ పై పుట్టుట
మన సుకృతము. వారు రచించిన ఇతిహాస కావ్యము చదువలేకపోవుట మన దుష్కర్మము. దీనికి
కారణము ఆ తల్లి బిడ్డలుగా జన్మించి తల్లి రోమ్ములనే తన్నిన మహనీయులకు చెందుతుంది.
వారు మహనీయులను భ్రమలోపడి వారిని నేత్తికేత్తుకొని ఊరేగుచున్నాము.
నన్నయ భారతమును 11వ శతాబ్దములో ప్రారంభించి ఆది
సభా పర్వములను అరణ్యపర్వములో కొంత భాగమును నారాయణ భట్టు సహాయముతో వ్రాసినారు. ఆపై
ఎలా వ్రాయలేక పోయినారన్నది మనకు అప్రస్తుతము. ఆ పిదప రెండు శతాబ్దములు ఆ గ్రంథమును
తాకి తలచిన వారు లేరు. కారణము కడు జుగుప్సాకరము. ఆ రెండు శతాబ్దములలో వీరశైవ వీర
వైష్ణవ విజృంభణము అతిపెద్ద కారణము . దానిని దైవసంకల్పమనుకొంటే అది
మనకిచ్చిన ఫలితము అత్యద్భుతము. సోమయాజియై,హరిహర తత్వాన్ని నమ్మి, ఆచరించి బోధించి ఆ పరతత్వమునకే తన రచననంకితము చేసిన తిక్కన గారి, భారతములోని 15పర్వములు (చెరుకు గడలు) మనకు దొరికేవి
కావేమో ! తెనుగు తేటను తేట తెల్లము చేసిన మహానీయుడాయన. వ్యాసుల వారి మనసెరింగి
వ్రాయుటయేకాక తన మనసు బుద్ధిని ఒకటిచేసి మన చేతికి చెరుకు రసమునిచ్చిన మహనీయుడు.
***మిగిలినది
రేపు***
ధౌమ్యుడు గురువయిన తరువాత వివిధ తీర్థాలను గూర్చి వివిధ స్థలాలను
గూర్చి విపులముగా చెబుతాడు ధర్మరాజుకు. ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే ఒక
పురోహితుడు ఎంత విషయగ్రాహి అయి వుండవలె విడమరచి విమర్శనా పూర్వకముగా చెప్పగలుగవలె.
అరణ్యపర్వములోనే ఒక సందర్భములో తనకు మించిన దురదృష్టవంతులు , అమిత మైన కష్టములు పడినవారు వున్నారా అంటే ఎంతోమంది ఉదారచరితుల ఉదాహరణలు
చెబుతాడు. అంటే ధర్మరాజు కష్టాలను చిన్న గీత చేస్తూ అతనికంటే ఎక్కువ కష్టపడినవారి
యొక్క పీద్ద గీతను గీచి చూపించుతాడు. అంటే ఇక్కడ హితుడైనవానికి ఎంత విషయ
పరిజ్ఞానము, సమస్పూర్తి
కావలెనో ఆలోచించండి.
అదే అరణ్యపర్వములో
పాండవులు వేటకు వెళ్ళినపుడు సైంధవుడు ద్రౌపదిని అపహరించి రథములో పోతూవుంటే,
ద్రౌపది ధౌమ్యుని గట్టిగా కేకవేస్తుంది.ఆయన రథము వెనుక
పరిగేడుతూవుంటే పాండవులు రథముపై ఆయనను చేరుకొని మీరు నెమ్మదిగారండి మేము ఆ
దుర్మార్గుని పని బడతామని చెప్పి వెళతారు. ఇక్క డ హితునిగా ఎంత
నిస్వార్థుడో చూడండి. వేరొక సందర్భములో బకాసురుని సోదరుడైనకింవీరుడు తన మాజాలముచే
పాండవులను నిలువరించితే ధౌమ్యుడ రక్షోఘ్న మంత్రము వేసి ఆ మాయను పటాపంచలు చేస్తే
భీముడా రాక్షసుని పరిమార్చుతాడు.పాండవులు అరణ్యవాసములో సూర్యుని
అర్చించు విధానమును తెలిపి, తమతో వున్న బ్రాహ్మలకు క్షుద్బాధ లేకుండా చేయుటకు అక్షయ పాత్రను పొందు
విధమును వివరించి విశధ పరుస్తాడు. దానితో తమతో వుండిన బ్రాహ్మలకు గానీ తమను
చూడవచ్చు అతిథులకు గానీ ఏమాత్రము లోటు లేకుండా షడ్రసోపేతమైన భోజనము అమర్చ
గలిగినారు. ఒక పురోహితునికి ఎన్ని బాధ్యతలున్నాయో గమనించండి. ఆతడెంతటి కార్య
దీక్షాదక్షుడై వుండవలెనో గమనించండి.
మరి నేడో? మనము ధౌమ్యుని చూడము, బ్రాహ్మణ పక్షపాతులైన పాండవులను చూడము. బ్రాహ్మణ్యము, పతనము అన్న పర్వతపు అంచున నిలిచియున్నా ఏమీ పట్టనట్లు
హిందువుల మందరమూ వూరకున్నాము.
ఎంతమంది వేదపండితులను చూడగలము, ఎంతమంది
అహంకారములేని వేదపండితులను చూడగలము. నాడు రాజులను చేయుటేగానీ తాము రాజులు
కావలెననుకోలేదు, నమ్మిన వారి నాశమును వారెన్నడూ కోరలేదు
టిప్పుసుల్తాను దుర్మార్గుడు. ఆదుర్మార్గుని మంత్రి పూర్ణయ్య బ్రాహ్మడు.నమ్మిన
నేరానికి అతని కొరకే చచ్చినాడు కానీ ఆతని వదలలేదు. అంతెందుకు ద్రోణుడు కృపుడు
హస్తిన ఉప్పుతిన్న నేరానికి దుర్యోధనుని వదలలేదు.కృష్ణరాయల గొప్పదనమునకు మూలము
తిమ్మరుసు కాదా! అంతటి ప్రజ్ఞావంతుడు తాను తలఛి యుంటే రాజు అయి ఉండలేడా! అయినా
రాజదండనకు గురియినాడుకానీ రాజద్రోహి కాలేదు. అసలు శివాజీ తన కుమారుని ఔరంగజేబు బారినుండి
రక్షించుటకు ఒక బ్రాహ్మణ అగ్రహారములోని ఒక విప్రునివద్ద
వుంచుతాడు. దానిని పసిగట్టిన ఔరంగజేబు సైనికులు ఆ పారునివద్దకు వచ్చి ఆ బాలుడు
నిజముగా ఆయన కుమారుడే అయితే , ఆ బాలుని కంచములోని ఎంగిలిని ఆ బాలునితోకూడి తినమంటారు. ఆయన
అటులనే చేసి యా బాలుని రక్షించుతాడు. చెప్పుకొంటూ
పోతే ఉదాహరణలు కోకొల్లలు.
నేటి పరిస్థితినిచూస్తే బ్రాహ్మణుని ఒక విదూషకుని చేసి ఈ సినిమా
వారు చిత్రీకరించుచున్నా ఎదో ఒకట రెండు విషయములలో తప్ప స్పందన ఎక్కడా కనిపించదు.
వేదము చదవని బ్రాహ్మడంటే ఎగతాళి. మరి వ్యవసాయము చేయని రైతు , బట్టలునేయని సాలె, కొయ్యపని చేయని వడ్రంగి ఈ విధముగా
తమ వృత్తుల వదలిన వారిని ఎగతాళి చేస్తున్నారా. ఒక 'ప్రధాని'
పదవి చేపట్టాలంటే బ్రాహ్మణుడు కావలసిందే . శ్రీమతి సోనియా గాంధీ
గారికి కూడా పండితులుపెట్టే ముహూర్తాలు కావలె. కానీ సినిమాలలో
"బ్యాపనీస్"
అని, అక్షరము ముక్క సరిగా పలుకలేని హీరో గారు
ఏమిరా శాస్త్రీ అని, కాలితో కొట్టి హాస్యాన్ని
సృష్టించుతున్నారు. ఒక సినిమాలో ఎదో రాగాన్ని వదులుతాను అని అపానవాయువును
వదులుతాడు ఒక విదూషకుడు. లోకానికి కర్నాటక సంగీత సాగ్రామ్రుతమును చవిచూపిన
అన్నమయ్య, శ్యామశాస్త్రి , త్యాగరాజు,
ముత్తుస్వామి దీక్షితులు, అందరూ తెలుగువారే
మరియు బ్రాహ్మణులే! ఆనాడు ఎంతో గౌరవము పొందిన బ్రాహ్మలది ఎంత హీనమైన బ్రతుకయ్యిందో
ఆలోచించండి .ఈ వాస్తవాన్ని గమనించండి learn how Pythagoras came to India,
where he was instructed by the Brahmins. Then notice how he began to teach the
doctrine of metempsychosis after his return to Europe.(a search in secret India)
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనము ఇటు మన సంస్కృతి
వదిలిపెట్టుకోన్నాము అటు పరమతములను అవలంబించి వారి పోకడలు పోలేకుండా ఉన్నాము.
మనకిపుడు (మన అంటే హిందువులందరూ అని నా అభిప్రాయము , ఎందుకంటే
ధౌమ్యుని గౌరవించిన పాండవులు బ్రాహ్మలు కారు) హంసనడక పోయింది కాకినడక రాకుంది.
పెద్దల 'కుల వ్యవస్థ' ను తప్పు పట్ట
పనిలేదు. హైందవేతర జాతులన్నింటిలో కూడా జాతి,వర్గ, వృత్యనుసారమగు విభాజనలున్నాయి. నిస్వార్థముగా
వేద వేదాంగ శాస్త్ర పురాణేతిహాసములను మన చేతయుంచిన వారిని, స్వార్థ ప్రయోజనముల కొరకు
మనలోమనకు వైషమ్యములను సృష్టించిన స్వార్థపరులగు(మన విజ్ఞానమునకు వారిపేరు
తగిలించి) పాశ్యాత్య కుహనా శాస్త్రజ్ఞులను నమ్మి, దూషించకండి.
అసలు పూజారులుగా పౌరోహితులుగా ఉన్న పెళ్ళి ఈడుకు వచ్చిన అబ్బాయిలకు
అమ్మాయిలనిచ్చుటకు తల్లిదండ్రులు ముందునకు రాకుండా వున్నారు. ఇది ఇట్లే జరిగితే
పురోహితులు, పూజారులు , హితమునకు,
పూజకు అరులైన వారిచే పూర్తిగా తుడిచివేయ బడుతారు.
కాపు కమ్మ వెలమ రెడ్డి కులస్తులు వీరులే కాక వీరలనేకులు రాజ్యము
లేలినారు. నేను విన్న ఇంకొక ఆశ్చర్యమైన విషయమేమిటంటే మైసమ్మ పాలించిన
కారణముగా ఆ పట్టణమునకు మైసూరు అని ఏర్పడినదట. ఆ రాజ్య పరిపాలనా దక్షురాలి
కులమునుగూర్చి ఏ రోజయినా తెలుసుకోన్నారా!
తెలుసుకొంటే మరి మీరే ఈ సనాతన
ధర్మమున ఉచ్చనీఛములేవీ? అని ప్రశ్నించుతారు. నదులు నదులుగా పారుచున్నంతవరకే నీరు త్రాగుటకు ఉపయోగ
పడుతాయి. అవి అన్నీ సముద్రములోకలిసి ఒకటైపోతే ?
నేడు పౌర హితము చేసేవాళ్ళు ఎక్కువున్నారో జలగల మాదిరి డబ్బు గుంజి
పౌర హతము చేసే వాళ్ళుఎక్కువున్నారో పాఠకుల విచక్షణకు వదిలి పెడుతున్నాను. వారుకూడా
మానవత్వమును మరువక సమాజ శ్రేయస్సుకు పాటుబడితే ఒకవేళ మావంటి వయోవృద్ధులు
చూడలేకపోయినా, సనాతన సమాజమును పునఃప్రతిష్ఠించిన వారవుతారు.
వాల్మీకి ఏమిచేబుతున్నారో వినండి.
ధర్మ ఏవహతో హంతిధర్మో రక్షతి రక్షితః l
తస్మాద్ధర్మోన హంత వ్యోమానో ధర్మాహతో వధీత్ ll
"చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది; కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ
చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి"
మిగిలినది రేపు...........
ఇక ధౌమ్యుని హితోక్తులకొస్తాము.
ద్రౌపది తో సహా, పాండవులు తాము ఏ ఏ వేష
ధారణలు చేయవలెని నిశ్చయించుకొంటారు.నేను, ఆ వేషములేవి
వారి పనులేవి అన్న విషయమును దాటవేస్తున్నాను అవి మీకు తెలిసినవే కాబట్టి. చదివి
కొందరైతే నర్తనశాల సినిమా చూసిఅయినా చాలామంది పాండవుల ప్రచ్చన్న వేషముల గూర్చి
వారి పనుల గూర్చి తెలుసుకోనియే వుంటారు.అప్పుడు ధౌమ్యుడు వారితో ఏమంటాడో తిక్కన
గారి మాటలలోనే వినండి.
"మీకునప్రమాదార్థంబుగా
నానేర్చినవిధంబున నుపదేశం బవశ్య కర్తవ్యంబు
రాజులం గొలిచి యెమ్మెయి నయినను
బ్రదుకుజనంబులు గీడునుం బొరయ
కుండునట్టి సాధారణనీతి సంక్షేపరూపంబున
నెఱింగించెద సావధానులరయి
వినుండు." చూడండి పురోహితుడు అనేవాడు
ఎంత స్వార్థ నిరపెక్షితుడై
ఉంటాడో!
తగఁ జొచ్చి తనకు నర్హం
బగునెడఁ గూర్చుండి, రూప మవికృతవేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన,
జగతీవల్లభునకతఁడు-సమ్మాన్యుఁడగున్.
తన యోగ్యతకు తగిన ఆసనముగా ఏదయితే
నిర్ణయింప బడినదో
అక్కడ కూర్చునుట,వికృతము కాని వేష ధారణా కలిగియుండుట,
సమయానుసారుకూలముగా మాటలాడుట, ఈ లక్షణములు గలిగిన వాడు
రాజునకు సమ్మాన పాత్రుడౌతాడు.
మన్నన కుబ్బక యవమతి,
దానొందిన స్రుక్కఁబడక ధరణీశుకడన్
మున్నున్నయట్ల మెలఁగిన,
యన్నరునకు శుభము లొదవు నాపద లడఁగున్.
రాజుయొక్క దూషణ భూషణ తిరస్కారములను
ఆశీస్సులుగా తలచేవారికి
మాత్రమే రాజాదరణ పుష్కలముగా లభించుతుంది
అని తెలుపుతున్నారు
ధౌమ్యులవారు.
ఇవి మచ్చునకు తిక్కన మాటలలో ధౌమ్యుడు చెప్పిన రెండు మాటలు.
ఆ అన్ని మాటలను కలిపి నేను ఒకటి రెండు మూడు వరుసలో చెప్ప
ప్రయత్నించినాను . ఇవి తిక్కన గారు చెప్పిన
వరుసక్రమములో లేక పోవచ్చు,
కానీ తెలిసిన మేరకు తెలియబరచుతాను.
1. రాజును కలువవలసి వచ్చినపుడు ముందుగా నాతని
ద్వారపాలకుని అనుమతి తీసుకోనవలసియుంటుంది.
అంటే ద్వాపర యుగము లొనే రాజ దర్శనమునకు వాకిటికాపు వద్ద అనుమతి పొందే
సాంప్రదాయముండేదని గ్రహింప గలరు. విదెశీయుల ఏలుబడి కలిగిన 800 ల సంవత్సరములలో నెర్చుకొన్నది కాదు. అసలు ఈ విషయములొ రాయల సభకు పోతూ వాకటి కాపును పెద్దన
తిమ్మన భట్టుమూర్తి తెనాలి రామకృష్ణుడు ఎంత చాతుర్యముతో పలుకరించినారో గమనించండి, అనుమతి తీసుకొనే అవసరములేకున్నా ఎప్పుడు ఏపని అతనితో పడుతుందోనని
అతనిని పలుకరించిన వారి సమయ స్పూర్తి చూడండి.
వాకిటి కావలి తిమ్మా
ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా
నీకిదె పద్దెము కొమ్మా
నాకీ పచ్చడమె చాలు నయముగనిమ్మా
మొదటి ముగ్గురూ పలకరింపుతో సరిపుచ్చుకొంటే మన తెనాలివారు
పలుకరించినట్లూవుంది పచ్చడము అంటే శాలువా తీసుకొన్నట్లూ వుంది. పలకరింపులో కూడా లాభము పొందడము
రామకృష్ణుని చాతుర్యము .
2. రాజులను
మనస్పూర్తిగా నమ్మ కూడదు
దొరల చిత్తము మాకులనీడ ఎప్పుడేవిధముగా వుంటుందో చెప్ప వీలు కాదట, ఇది పెద్దల
మాట. అంటె యుగయుగాలనుండినే మన పూర్వులు మనకొరకు ఎంత మంచిని బోధించుతూ వచ్చినారో చూడండి.
అనుభవముతో అమితమైన పరిశీలనా పటిమతో చెట్టునీడ ఏ సమయయములొ
ఎటువైపుకు మారుతుందో తెలుసుకొన వచ్చును. అప్పుడు తదనుకూలముగా మనమూ మారవచ్చును. రాజువిషయములో
కూడా అంతే. కానీ చెట్టునీడ
నిర్ణీత సమయములో మారుతూ వుంటుంది. జన్మతః అహంకారము కలిగిన రాజుల మతి ఏ నిముసమునకు
ఎటుల ఉంటుందో చెప్పుట అంత సులభము కాదు.
3. ఇతరులకు నియమింప బడని, స్థానములోనే
కూర్చొనవలెను. రాజునకు ఎదురుగా కూర్చొనరాదు
రాజుకు ఎదురుగా కూర్చుంటే అన్నింటికీ కష్టమే. అవసరమునకు
మించి ఏ రసమునకు స్పందించినా మనకు మిగిలెది నీరసమే. రాయల సీమలో ముఖ్యంగా కడప
జిల్లాలో ఒక సామెత వుంది, 'రెడ్డి గారి పిల్లోనితో
గోలిగుళ్ళు ఆడినట్లు' అని. రెడ్డి గ్రామాధికారి.
గ్రామమునకు అతడు రాజే ! ఆయన కొడుకు యువరాజే! మరి యువరాజు తో గోలీలాడితే గెలిచినా
తప్పే ఓడినా తప్పే కదా! రాజుకు ఎదురుగా కూర్చొని నవరసములలో దేనికైనా అవసరానికి మించిన
స్పందన మనము చూపినపుడు రాజు కంతబడితే ముప్పే. ఆయన తలచితే అది తప్పే!
4. రాణివాసముతో
అనుబంధము ఏర్పరచుకోగూడదు
రాణివాసముతో అనుబంధము అరటియాకు ముల్లు వంటిది. మనకందుబాటులో
వుండే అనుభవముతో మాట్లాడవలెనంటే, tissue paper మరియు water
నీరు వంటిది. నీరు ఎక్కువైతే టిష్యూ పేపరు పనికిరాదు కదా!
కాబట్టి మనము కదళీ పత్రమే! రాణివాసము కంటకమే! ఆ రెండింటి లో ఏది దేనిమీద పడినా
చిరిగేది అరటియాకే. ఈ విషయము పై ఇంతకన్నా విశ్లేషణ అవసరము
లెదని నా అభిప్రాయము. ఈ మాట కూడా నేటికీ సత్యమే కదా!
5. తమతమ కారణాలకు రాజాంతఃపురమునకు వచ్చిపోయే వారలతోనూ,రాజుకు ఇష్టము లేని వారితోనూ,రాజుకు శతృత్వము
వున్న వారితోనూ మైత్రి ఘటించరాదు
నేటి కాల పరిస్థితులకు అనుకూలముగా ఒక కార్యాలయమును ఊహించుకొండి.
ప్రధానాధికారికి ప్రత్యేక వాతానుకూల మందిరము ( AIR CONDITIONED
CHAMBER) వుంటుంది. దాని చుట్టూ బయట కలుపు మొక్కల్లా పెద్ద చిన్న
వుద్యోగులకు ఉచిత స్థానాలు అమర్చబడి వుంటాయి. అధికారి తో కలిసే వారితో, అనవసరముగానూ అతిగానూ, బయట కూర్చున్నవారు కలిస్తే చుట్టూ వున్నవారికి
చెవులు కొరుక్కునే అవకాశమిచ్చినట్లే! అదేవిధంగా ఆయనకు సరిపోని వారితో సహవాసము చెయుట అధికారి
కంటబడినా, మనము ఆయన ఆగ్రహానికి పాత్రులమైనట్లే! కాబట్టి రెండు
విధాలా మనపని శ్రీమతే రామానుజాయన్నమః అయినట్లే!
తస్మాత్ జాగ్రత.
మిగిలినది మరొకమారు...........
6. అతిచిన్నపనినైనా రాజునకు ఎరుకపరచిన పిదప మాత్రమే చేయవలెను.ఆ విధముగా చేయుట వలన ఎటువంటి ఆపద సంభవించదు
ఇప్పటి కాలములో రాజులు లేరు
కాబట్టి మీ ఉన్నతాధికారిని వూహించుకొండి. మీ శత్రువులు మీతో పనిచేసే సహచరులలో
పుష్కలంగా వుంటారు. మీరేదయినా చిన్నతప్పు చేసినారనిపించినా దానికి కమ్మలు కడియాలు
తొడిగి అందంగా అలంకరించి అధికారి ముందుంచుతారు.ఆ తరువాత పరిస్థితి మీ ఊహకే వదలి
వేస్తున్నాను. అందువల్ల కార్యాలయమునకు సంబంధించిన చిన్నపని కానీ గాక, అధికారికి చెప్పిచెస్తే ఆపద
అడ్డు రాదు.ప్రసాధన (TOILET)పోవునపుడు కూడా చెప్పవలెనా అని
అడుగవద్దు. ప్రక్కనున్న ఉద్యొగికి చెబితే అవసరమైతే అడిగినవారికి
తెలియబరుస్తాడు. ఈ మాటలు అల్పమైనవి అని నిర్లక్ష్యము చేయవద్దు.
7. అగ్ని
దేవతలను కొలిచినట్లుగా రాజును కూడా ప్రయత్న పూర్వకముగా సేవించవలెలను. కపట ప్రవర్తన
మరణ హేతువు కావచ్చును
యాగము లొని అగ్ని కీలలు ఏడు.
ఊర్ధ్వ లోకాలు ఏడు. అవి భూ,భువ,సువ,మహ,జన,తప.సత్య లొకములు. ఏడు లొకాలకూ హవిస్సులను ( దేవతల
ఆహారము ) గొని పోయె వాడు అగ్ని. అందుకే ఆయనను సప్త జిహ్వుడు (జిహ్వ = నాలుక )
అనికూడా అంటారు.తాను జ్వలించినంతసేపూ హవిస్సులను మొసుకుపోతాడేతప్పితే దాచుకోడు.
బంటుకు ఇంతకుమించిన ఉపమానము ఉండదేమొ! కపటమెప్పటికైనా కష్ట హేతువే.
8. రాజు
ఆజ్ఞాపించిన పనులను మాత్రమే చేయవలెను.
ఒకసారి నా అధికారి అంటే మా Assistant జనరల్ Manager గారిని మరియు తనహోదా గలిగిన వేరువేరు
ప్రాంతీయాధికారులను వారి పై అధికారి అంటే Deputy General Manager సమ్మేళనమునకు (MEETING)
కు పిలిచినాడు. తప్పదుగదా యని తలపట్టుకొని బయలుదేరినారు వారంతా. DGM
గారు వారిని, తాను చెప్పిన పనిని ఎంతవరకు
చేసినారని ప్రశ్నించుచూ ఎవరెవరు ఎంతవరకు చేసినారని నిర్ణయించి మావారిని (నా పై
అధికారిని, అంతేగానీ తప్పుగా తలచ వద్దండి) ఆ క్రమములో చివర
చేర్చటము జరిగింది. చిర్రుబుర్రులాడుతూ వచ్చిన మా అధికారికి కనిపించినది ఇద్దరమే.
మిగత అధికారులు నిజగృహంబులకు జనియుండినారు ! అప్పటికి సమయము సాయంకాలము 7 గం. ఆయన, తాను వెళ్లి వచ్చిన
సమ్మేళనముతో మా ఇరువురికీ సంబంధము లేనప్పటికీ, మమ్ము లోనికి
పిలిచి తనపై అధికారి తన శరీరములోనికి పంపుటచేత ఆవిరియైన
తన భావాలను మాపై వదలినాడు. నేను అప్పటికి యువకుడినే. నా ప్రక్కనున్న అధికారి
పెద్దవాడు. ఇద్దరమూ శ్రోతలుగానే వుండిపోయినాము కానీ నోరు మెదపలేదు. అంతా
ముగిసినతరువాత వారికి నమస్కారము చెప్పి మేము మా ఇళ్ళు చేరుకొన్నాము. తెల్లవారి
ఆఫీసుకు,ఒక గంట ముందే
పోవుట నా అలవాటు, చేరి నా పనిలో వుండగా మా అధికారి గారు కూడా
ముందే వస్తారు కావున వచ్చిన వెంటనే నన్ను లోనికి పిలిచి ' ఏమి
బ్రొథెర్ నేను నా బాధను అంతగా చెబితే నోరు మెదపకుండా విని ఇంటికి పోయినావే'
అన్నారు. నేను వెంటనే 'సార్ మొదటి విషయము
ఏమిటంటే అది నాకు సంబంధించినది కాదు. రెండవది ఏమిటంటే ఒకవేళ ఆ పనిని నాకు అప్పగించ
వలెనంటే ఒకమాట ఈ పని నీవు చేయి అంటే నేను కాదన బోయేదీ లేదు మీకాచనువు నాతో
లేకపోయిందీ లేదు.' మీరు ఆడుగకుండా నేను చేస్తాననుట అత్యుత్సాహమౌతుంది
పైగా నేను ముందుకు వచ్చి ఒప్పుకొని చేయలేకపోతే పెద్ద తప్పౌతుంది.' అన్నాను . 'నీతో చాలా కష్టము బ్రొథెఋ అంటూ ఆ పనిని నాకు ఒప్పజేప్పినారు. చెప్పినపని
చేయగలిగినాను. కథ సుఖాంతమైనది. ఇందులో ధౌమ్య సూక్తులు మీరు గమనించవచ్చు .
ఇందులొ గమనించవలసినది 1.తనకు సంబంధము లెని విషయములో
నొరుమూసుకొనియుండటము,2. రాజు అనుమతించిన పిదప పని కష్టమైనా
పూర్తి చెయటము. ఇవి రెండూ ధౌమ్య హితోక్తులే. వీటివల్ల ఆత్మ సంతృప్తే కాక అధికారి
మన్ననలను కూడా పొందవచ్చును.
తొందర పడే గొడ్డు మురికి
నీళ్ళు త్రాగుతుంది అన్నది పెద్దల మాట
ఇపుడు చెప్పబోయేది ధౌమ్యులవారు చెప్పిన 9 వ హితోక్తి.
9. నిర్లక్ష్యము,క్రోధము, గర్వము,సర్వే సర్వత్రా రాజాశ్రయమున వర్జింపదగినవి
భారతములోనే
ఊద్యోగపర్వమునందు విదురనీతిలోని ఈ మాటను వినండి :
కోపము
నుబ్బును గర్వము,
నాపోవక
యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము
ననునివి,
కాపురుష
గుణంబులండ్రు కౌరవనాధా
భారతం. ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం -- 32 వ పద్యము
కోపం, పొంగిపోతూ
వుండటం, అహంకారము, తృప్తిలేకపోవడం,
తన గొప్పతనాన్ని అతిగా చూసుకోవడం, పనీపాటా
లేకుండా పొద్దు పుచ్చడం ఇవినీచుల లక్షణాలని పెద్దలు చెబుతారు.
అహంకారికి
గర్వము అది వుంటే నిర్లక్ష్యము వుండక తప్పదు. నిర్ల్కక్ష్యముంకు మూలము కోపమే! ఒక్క
కొపము ఎన్ని దుర్లక్షణాలను కూర్చుతుందో చూదంది. వాల్మీకి వ్యాసులవారు కూదా 'క్షమయా నిష్ఠితాం
జగత్' అంటే ఈ విశ్వమే సహనము (Tolerence) పై ఆధారపడియుందని చెప్పినారు.
సహనము
వున్నచొట మరి కోపము వుండదుకదా!
కాబట్టి
'తన కోపమె తన శతృవూ అన్న వాస్తవాన్ని ఆచరణలో ఎంతగా వుంచితే అంత మంచిది.
ముఖ్యముగా
పై అధికారి మూర్ఖుడై తన తాపేదారుపై కొపము ప్రకటించినపుడు.
10.
ప్రియముతో కూడిన హితవు పలుకవలెను
ఒక
వ్యక్తి తన ప్రభువు హితమును ఎప్పుదు కొరుతాడంటే ఆయనపై తన అభిమానము
నిర్మలమైయుంటెనే.
నిర్మలత
ఏర్పడా లంటే, ఆ స్వామిభక్తి స్వచ్ఛత
కలిగియుండవలె. అప్పుడ సేవాప్రియత్వము కలుగుతుంది. అదే నిజమైన ప్రేమ లేక భక్తి. హితవు కూడా అప్పుడు మనసారా
చెప్పబడుతుంది. పై వారితో మాట్లాడే సమయయములో 'ఇట్లు చేయండీ అని చెప్పుటకంటే 'ఇట్లు చెస్తే
బాగుంటుందేమో!' అనడము గౌరవముతొ కూడిన ప్రేమను సూచిస్తుంది.
ఆప్తుల
ప్రియ భాషణములను విని పాండవులు ఎంత మంచిని పొందినారో
వినక కౌరవులు అంత చెడును పొందినది మనకు తెలిసిన విషయమే !
11.
అన్ని విషయాలలో అన్ని వ్యవ హారాలలో రాజుకు
అనుకూలముగా వుండాలి
రాజుకు
అనుకూలముగా వుందటమంటే రాజభక్తి కలిగి యుండుటయే కదా! నయవంచనకు ఇచట తావు వుండదు. ఈ
కథనొకసారి గమనించండి :
ఒకసారి
శ్రీకృష్ణదేవరాయలు రామలింగడి తెలివిని మెచ్చి రాజు
ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చినాడు.ఆ గంప చాలా బరువుగా ఉంది.
రామలింగడు ఆ గంపను తాకి చూసి తాను దానిని కదిలించనుగూడా కదిలించలేనని అర్థం చేసుకొన్నాడు. వెంటనే తన తలపాగాను తీసి నేలపై చాపలాగా
పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టినాడు. తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో
కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను చంకకు
తగిలించుకొని, గంపను నెత్తిన పెట్టుకుని ఇంటికి
బయలుదేరినాడు.
రామలింగడని
సమయస్పూర్తికి ఆశ్చర్యపదిన రాజు "శభాష్ రామలింగా! అంటూ మెచ్చుకోసాగినాడు.
రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిన అతని జేబుల్లోని
నాణాలు కొన్ని నేలమీద పడిపోయినాయి. వాటి చప్పుడుతో సభంతా నవ్వులతో నిండిపోయింది.
గంపను, మూటను కిందపెట్టి రామలింగడు ఆ నాణెముల కోసం సభంతా వెతకసాగినాడు. పడుతూ, లేస్తూ
ఏరుకొంటూ వుంటే తలా ఒకమాట అన్నారు.
రామలింగడు
నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చినాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన
కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ
కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది
కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను
సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో
సభంతా మూగబోయింది.
పై కథ చదివితే రాజభక్తి తో బాటూ సమయస్పూర్తి
కూడా రాజసేవలో ఎంత అవసరమో తెలుస్తుంది.
మిగిలినది
మరొక మారు.....
12. రాజుకు ఇష్టము లేని వస్తువును
అనుభవించకూడదు
ఈ ధౌమ్య సూక్తులను ఆకళింపు చేసుకొన్న
మేధావి కథ చదవండి. దాదాపు రెండు సంవత్సరముల క్రితము ఇది నేను
వ్రాసి ప్రచురించియుండినాను. ఇప్పుడు క్లుప్తముగా వ్రాయుచున్నాను.ఒక
కార్పొరేటు ఆఫీసులో ఒక బాసు(ఒకే బాసు) ఉండినాడు . అతని అనేక మంది అనుచరులలో ఒక
మేధావి ఉండినాడు. ఒకరోజు ఎదో పనిమీద బాసు కేబిన్ లోకి వెళ్ళితే ఆయన రమ్మని ఎదుట
కూర్చుండబెట్టుకొని , తాను వ్రాస్తూవున్న
రేనాల్డు బాలు పెన్నును గూర్చి ఇట్లు చెప్పినాడు " నల్లేరు మీద బండి
నడచినట్లు ఎంత మెత్తగా వ్రాస్తుందో ఈ
పెన్ ను చూడు మేధావి' అన్నాడు. అందుకు
మేధావి వెంటనే 'సార్ రేనాల్డ్ బాల్ పెన్ నాకు
దైవసమానము సార్. మీవద్ద పనిచేసే అదృష్టము నాకు ఆ పెన్ తో పరిక్ష వ్రాయుట చేతనే
వచ్చింది ' అన్నాడు.బాసు మహదానంద భరితుడై 'నేను చెప్పే ప్రతి మాటకు నీవద్ద ఒక అనుభవము వుంటుంది,అందుకే నీవంటే నాకిష్టం, అన్నాడు.
వేరొక సందర్భములో మేధావి బాస్ రూము లోనికి పోతూనే బాసు తన పెన్నును కాగితము పై
గీకి ప్రక్కనున్న చెత్త బుట్టలోకి బలంగా విసిరి, మేధావితో 'ఈ రేనాల్డ్ బాల్ పెన్ కన్నా
చెత్తది ఇంకొక పెన్ ఉండదు.' అన్నాడు . వెంటనే మన
మేధావి అందుకొని' అంతకంటే హీనమైనది,చండాలమైనది,దరిద్రమైనది,అసహ్యమైనది,
అవసరానికి పనికిరానిది ఇంకొకటి ఉండదు'అన్నాడు. బాసు వెంటనే గతము గుర్తు తెచ్చుకొని 'ఆ రోజు ఆ పెన్నును అంతగా పోగిడితివే'అంటే ' ఆ వెధవ బాల్ పెన్
రాస్తే ఏమి రాయకుంటే ఏమి నాగురించి మీరు బాగా వ్రాసి ప్రోమోషనులు ఇప్పించాలిగానీ' అన్నాడు. విస్తుపోవడము బాస్ వంతైనది.
కావున ఈ సూక్తులను చదివి ఆకళింపు
చేసుకొంటే ' మూడు ప్రోమోషనులు ఆరు ఇంక్రిమెంట్లగా' గడిచి పోతుంది.
13. అతని శత్రువు తో సంభాషించకూడదు
రాజ సేవకులమైన మనకు రాజ శతృవు, శతృవేకదా! మనము శతృవు తో మాట్లాడుట రాజు కంట బడితే హాని
తప్పనిసరి . జాగ్రత్త అత్యవసరము .
14.ఎప్పుడూ తన స్థానము నుండి చలించకూడదు.
ఇటువంటి ప్రవర్తన గలవాడే రాజుల వద్ద ఉండగలడు
రాజసేవకునికి నిలకడ అవసరము.తన స్థానము
తన ఉనికి,తన అంతస్తు తెలుసుకొని మసలుకొంటే చేటు మూడదు. ఎవరి
స్థానమేది అన్నది రాజుకు అవగతమగులాగున చేస్తే ఆయన అత్యవసర స్థితి లో కళ్ళతో కూడా
సందేశాలు పంపె సౌలభ్యము సభలో సమకూరుతుంది.
15. విద్వాంసులు రాజుకు కుడివైపు గానీ
ఎడమవైపు గానీ కూర్చోవాలి
రాజు వినికిడ్దికిఎటువంటి ఇబ్బంది కలగ
కుందా వుందాలంటె విద్వాంసులు కుడి లేక ఎడమ ప్రక్క గూర్చుంటేనే రాజు శ్రద్ధగా
వినగలుగుతాడు.
16.ఆయుధాలు ధరించి కాపు కాసే వారు రాజుకు
వెనకాల వుండాలి
టన శతృడెవడు మితృడెవడు అనంది తనయెదుట
పడినంతనే రాజు గ్రహించగలడు కావున అతనికి కళ్ళకడ్డముగా భబటులు ఋఆజుకు ముందు
నిలువరాదు. ఆపై వెనుకనుండి జరుగు దాడిని అరికట్టుతకు వెనుక ఆయుధపాణులు జాగరూకతతో అనుసరించవలె. అప్పుదు అనుకొని విధముగా
వెనుక నుండి రాజుకు ఏదయినా ముప్పు వాటిల్ల బోయినా ఆయుధపాణులు అడ్డుకొంతారు. వారికి
ఒకవేళ ప్రమాదము జరిగినా రాజును క్షేమముగా కాపాడినవారవుతారు.
17. రాజు ఏదయినా అప్రియమైన సంగతి చెబితే
అది ఇతరుల ఎదుట బైట పెట్ట కూడదు
ఒక రాజు కు ఐదుగురు మంత్రుల సమూహము వుండెది.
రాజుకు ఒక మంత్రి పై కొన్ని కారణాలవల్ల అనుమానము వుండెది. అదే విధంగా చిన్నతనము
నుంది తనను పెంచి పెద్దచెసి లోకానుశీలన నెర్పించిన మహామాత్యుడంతె గౌరవము, నమ్మకము, భక్తి .రాజ్యపు
పొలిమేరలో అరణ్యము దాతుతూనే పొరుగు రాజ్యము.
ఒకరోజు మంత్రి వర్గముతో సమావేశమైనపుదు
రాజు తమ పొరుగురాజు కపటమును గూర్చి మోసముచేత తమ్ము జయించవలెనను యోచనను గూర్చి
మాట్లాడినాడు. కాసేపు తరువాత పరిమితమైన ఒక వందమంది సైన్యముతో పైన తెలిపిన అదవికి
వెట కు పోవుచున్నట్లు తన అభిప్రాయమును
తెలిపినాడు.
రంగము సిద్ధమనది.రాజు వెటకు
బయలుదేరినాడు. అడవిలో విడిది వేస్తూవుండేంతలోనే పొంచియున్న పొరుగు రాజు తన ఐదు వందల సైన్యముతో చుట్టు
ముట్టినాడు.కానీ ప్రధానమంత్రి రాజు వేసిన ఉచ్చులో తగులుకొన్నాడు. రాజు తాను వేటకు వచ్చుటకు
మునుపే పదిహేను వందల మంది భటులను చుట్టూ మోహరింప జేసినది పొరుగురాజు
తెలుసుకోలెక పోయినాడు.అంతే ఎట్లయితేనేమి పొరుగురాజును బంధించి సభలో ప్రవేశపెట్టి
అతనిని చిత్ర హింసలకు గురిచేయగా రాజ మంత్రివర్గములోనిమంత్రి ఒకడు తనకు గూఢచారిగా
పని చెస్తున్నాడని తెలిపినాడు.ఆరా రీస్తే అతడు రాజు అనుమానించిన వ్యక్తే! రాజు
ఇరువురికీ తగిన దండన విధించడం జరిగింది.
గమనించినారా! రాజు మాట బయటికి పొక్కుటవల్ల కదా తనకే కాకుండా
తనను నమ్మిన ఇతరులకు కూదా ఆపద తెచ్చినాడు
. దీనిని ప్రస్తుత పరిస్థితులకు కూడా అన్వయించుకొన వచ్చును.
18. 'నేను పరాక్రమ వంతుడిని తెలివైన వాడిని' అన్న అహంకారము కలిగియుండ కూడదు
ఆవేశమైనా అడపా దడపా మంచిదే కానీ అహంకారము మాత్రము అనర్థదాయకము.రాజు
ఎదుట
అహంకరించినవాడు అసువులు బాసినా ఆశ్చర్యపోనవసరము లేదు.
19. ఎప్పుడూ రాజుకు ఇష్టమైన పనినే చేస్తూ
వుండాలి
క్రితము తెలిపిన రెనాల్డ్ పెన్ను కథను దీనికి కూడా
అన్వయించుకొనవచ్చును.
20. చేతులు మోకాళ్ళు పెదవులు అనవసరముగా
కదిలించరాదు. ఆవులింత తుమ్ము నిష్ఠీవనము (ఉమ్ము) రాజుముందు చేయకూడదు. ఈ పద్యము
చూడండి
ఆవులింత తుమ్ము - హాసంబు నిష్ఠీవ,నంబు
గుప్తవర్త-నములు గాఁగఁ
జలుపవలయు నృపతి-గొలు వున్నయెడల బా,హిరములైనఁ
గెలని-కెగ్గు లగుట.
రాజుగారు కొలువున్నప్పుడు ఆవులింత, తుమ్ము, నవ్వు, ఉమియుట
-ఇవి ఇవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి. బయటకు తెలిస్తే
అందరి దృష్టి నీమీదే వుంటుంది.అపుడు రాజు ఆగ్రహానికి గురి కావలసి
వుంటుంది.
21. మిత
భాషణము పాటించవలెను
జ్ఞానము మౌనమునకు ఆస్పదమౌతుంది.ఎందుకంటే జ్ఞాని ఎప్పుడూ
ఉచితానుచిత పరిధులను ఏర్పరచుకొంటాడు. ఊచితజ్ఞత
అంతే అదేమరి.
ఆహ్లాద సమయములోకూడా కప్పల బెకబెకలు వినుటకు కఠోరముగా
ఉంటాయి ,అదే వెసవిలో కూడా
కోయిల కూత ఆహ్లాద జనితమై
యొప్పుతుంది.
స్వోత్కర్ష అని అనుకోకుంటే నా ఊద్యోగ సమయమందలి ఉదాహరణ ఒకటి
వివరిస్తాను. అవి ఇంకా కలన యంత్రములు(computer)లు వార్దుషీ
శాఖ (Bank Branches) లకు ప్రాకని రోజులు.
నేను ప్రాంతీయ
కార్యాలయములో పనిచేసే రోజులు.ఆకాలమునకు
అత్యాధునికమైన కలనయంత్రమును (calculater)మా ప్రాంతీయ
అధికారికి చూపించి దాని నిర్మాణము చాలనము
మొదలగు
అంశములqను వివరించి ఒప్పించి అమ్ముదామన్న
ఉద్దేశ్యముతో
ఒక వ్యాపార ప్రతినిధి
అనుమతి గొన్న పిదప లోనికి వెళ్ళినాడు. ఆ
సమయములో మా
ప్రాంతీయాధికారి హొదా గలవారే ఇంకా
నలుగురు వారితో కూర్చొని మాట్లాడుతూ
వుండినారు.
పరిచయము ముగిసిన
పిదప తన వస్తువును గూర్చి
చెప్పమొదలిడినాడతడు. నేను ఈ కొనుగోళ్ళకు
సంబంధించిన
అధికారినగుటవల్ల ఆయన వార్తాహరునితో (messenger) నన్ను
పిలువనంపినాడు. ప్రతినిధి చెప్పుట ముగిసిన
తరువాత "మీ అభిప్రాయమేమి" అని మా ప్రాంతీయాధికారి
నన్ను ప్రశ్నించుట
జరిగినది.నేను "అది క్రొత్తది అండీ"
అంటూ వారి అనుమతి తీసుకొని బయటికి నడచినాను. అంతే
నా వద్దకు
ఆ ప్రతినిధి పరుగునవచ్చి
"నా కొంప ముంచినారండీ"
అని అన్నాడు. నేను కారణమడిగినాను.
" మీ జవాబు అర్థముగాక
మీ అధికారి గారి మితృలు వారిని
విశధ పరుచమనియడిగినారు"
వారప్పుడు " ఇది
కొత్తది కావున అతను చూపించే వరకూ
బాగానే వుంటుంది.
మనచేత పడినవెంటనే వాడు
నొక్కి వీడు నొక్కి పాడవుతుంది అని
అన్నానని చెప్పినాడు "
అని వివరించినారు.ఒకేదెబ్బతో
నన్ను ఇంటిదారి పట్టించినారు
అన్నాడు."అలాగా" అని నేను ఊరకుండిపోయినాను. అతను
వెళ్ళిపోయినాడు.
ఇలాంటివారు రావడము సాధారణము . ఏదోవిధంగా తమ వస్తువులనమ్మే
ప్రయత్నము చేస్తూ వుంటారు.
ఇక్కడ గమనించవలసినదేనిటంటే నెను మాట్లాడినది ఒకే మాట, కానీ నా
మనసును అర్థము చెసుకొన్న ఆ అధికారిని గూర్చి యోచించండి.
అల్పవాక్యములోనే అవసరమైన భావము ఇమిడియుండుట పైన
చెప్పిన
మిత భాషణమునకు ఉదాహరణగా పేర్కొన్నాను.
22. అకారణ హాసము
పనికిరాదు
సుమతి
శతకకారుడు బద్దెన నవ్వును గురించి ఈ విదముగా చెబుతాడు :
నవ్వకుమీ
సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ
నవ్వకుమీ
సభలోపల అన్న మాటను అదే అదే పదే పదే పెద్దలు
చెబుతూనే వస్తున్నారు. దానిని బట్టి
ఈ మాటకు ఎంత విలువ వుందో
తెలుస్తూవుంది.అనవసరమైన నవ్వు ఎంత అనర్థహెతువో అన్నది
రామాయణ భారతాలలో కొన్ని కొన్ని విషయాల మీద ప్రజలలో పుక్కిటి
పురాణ గాధలున్నాయి. వీటిలో కొన్ని గ్రంధస్థం చేయబడ్డాయి కూడా.
అందులో లక్ష్మణ దేవర నవ్వు కూడా ఒకటి. ఇది వాల్మీకి
రామాయణములో లేనిది. ఏవరి ఊహనో కానీ
అనవసరముగా
నవ్వకూడాదు అన్న సూక్తిని మాత్రము ఈ కథ బలపరుస్తుంది.
రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ,అంగద,సుగ్రీవులతో,
సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న
సందర్భం. ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, వారితో పాటు
అయోధ్యాపురప్రముఖులు అందరూ
కూర్చున్నారు.పట్టాభిషేకం
అట్టహాసంగా జరుతోంది.రాముని పక్కనే సింహాసంకి దగ్గరగా నిలబడి
ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు
దీర్ఘంగా నవ్వినాడు. లక్ష్మణ దేవర నవ్వినది అందరూ చూసినారు .
సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారా నవ్వు చూసి . ఆనాడు
రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని,భరతునిచే తిట్లు తిని,
నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వినాడా ? అనుకుందిట
కైక, సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని
సంపాదించాడా అని నన్ను
చూసి నవ్వినాడేమో అనుకున్నాడట. తండ్రి
ని చంపించిన పిన తండ్రి పంచ
చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు. ఇంటి
గుట్టు
చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని
ఎగతాళీగా నన్ను
చూసినవ్వినాడా అనుకున్నాడట విభీషణుడు. రాముడి
బాణాలను తండ్రి
వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం
చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట. 'తిరిపెమునకు'
అంటే బిచ్చగాని కెందుకు గంగాగౌరి అని
తన్ను చూసి నవ్వుతున్నాడని శంకరుడనుకొన్నాడట. ఈశ్వరుడి
పెళ్ళికి
అందరితో పాటు తనూ వెళ్ళగా కాలు మడత పడి క్రింద పడినప్పుడు
నడుము విరిగి, ఆ వొంగిన నడుముతోటే ఈ సభకి
చక్కా వచ్చినందుకు
తన్నే చూసి నవ్వుతున్నాడు అని జాంబవంతుడనుకొన్నాడట.బంగారు
లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట
సీత. బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక
తీర్చడానికి బయలుదేరి
వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు
అనుకున్నాడట.
సభలో
నవ్వినందుకు అతని తల తెగవేస్తానని రాముడుకోపముతో కత్తి
ఎత్తుతాడు. సభలోని వశిష్ఠ వామదేవాది పెద్దలంతా ఆయన్ని
అడ్డుకొని
అసలు కారణము తెలుసుకోమంటారు.శాంతించిన
రాముడు లక్ష్మణుని కారణమడుగుతాడు. అప్పుడు
లక్ష్మణుడు “అన్నా!’
సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక
వరం అడిగినాను. నన్ను వనవాస సమయం లో పదునాల్గు సంవత్సరాలూ
ఆవహించవద్దని.’ దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ ‘పదునాలుగేళ్ళయిన
తరవాత నిన్ను ఆవహిస్తానని’ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని
నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది.
నిలబడే ఒక చిన్నకునుకు తీయవలసివచ్చింది
అన్నయ్యా ! నిద్రా దేవి
మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వినాను, మరేమీ
కాదు” అన్నాడట. తరువాత రాముని
ప్రాయశ్చిత్తముమొదలగు విషయాలు
మనకు అప్రస్తుతము. ఏతావాతా మనము
తెలుసుకొన్నదేమిటంటె అకారణ
హాసము అదేవిధంగా అకారణ హాస్యము కూడా మంచిదికాదు అని.
23. పిచ్చివాడిలా హ హ హ అని శబ్దము చేస్తూ నవ్వరాదు
ఇది కూడా సభామర్యాదకు సంబంధించిన విషయమే. వివరణ
అవసరము లేదని తలుస్తాను.
24. ఏదయినా వస్తువు లభిస్తే ఆనందముతో పొంగిపోకూడదు
వస్తువు విలువైనదై మనకు దొరికితే ఆనందాతిరేకములో అది బహిర్గత పరచితే
ఓర్వలేనివారు అది రాజునకు ఎన్నో అవాకులు చవాకులు జోడించి చెప్పి
మనపై అభియొగమును మోపుతారు. దానికన్నా ముందే జాగ్రత్త పడి ఆ విషయము రాజునకు తెలియబరచుట
ఉత్తమోత్తమము. స్వంతదారుడెరుకపడని వస్తువు ఏది దొరికినా అది రాజుకు చెందవలసియుంటుందన్నది
మనుధర్మశాస్త్రము.
25. అవమానముజరిగినపుడు కృంగిపోయి ఉండిపోకూడదు
పేడముద్ద మరియు బంతిని ఉదాహరణగా తీసుకొందాము. రెండూ
గోళాకారములోనేవున్నా గోడకు విసిరిన పెడముద్ద గోడకే అంటుకొని పోతుంది. బంతి అలాకాదు,అది ఏ వేగముతో విసరబడుతుందో అడె వేగముతో తిరిగి మరలుతుంది.గోడనంటితే అక్కడే
వుండిపోవడము చేతగానివానిపని. టెలివయినవాడెపుడూ ఆ సమయానికి తగ్గినా అనతి కాలములొనే
తన సత్తా చూపిస్తాడు.
ఈ
పద్యము గమనించండి
చేతనగువాడు కార్యము
కైతగ్గును వంగుగాక అల్పుండగునా
ఏతము వడిదా వంగును
పాతాళము నీరుదెచ్చిబయలున్ జల్లున్
ఈ విషయములో ఇంతకన్నా చెప్పవలసినది ఏముంది!
26. తన పనిలో తాను జాగరూకుడై వుండాలి
కథ రూపములో నేను చెప్పబొయే ఈ మాటకు ఆలంబనగా ఏ వృత్తివారలనైనా
తీసుకొనవచ్చు. కానీ నేను మంగలి వారిని తీసుకొనుచున్నాను. మనము జన్మించిన వర్ణము, జన్మించేటపుడే
మన కర్మలనుబట్టి భగవంతుడు చేసేనిర్ణయము. మంగళకరమైనదానిని మంగళము లేక మంగలము
అంటారు. ప్రయోగములో కూడా ఎంగిలి మంగలము లేకుండా ఏమిటా తినడము అన్న
మాట వాడుకలో వుండేది మరి ఇప్పుడు వాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ తెలుగు భాష
కర్మ ఏమో పెద్దలు ఏర్పరచిన పదాల వాడుకకు మనము ఎంతో మొగమాటము కనబరుస్తాము. ఉదాహరణకు
పోతన భాగవతము లోని ఈపద్యములో భగవంతుని వాడు వాడు అని ఆసాంతమూ వాడుతాడు. "
నల్లని వాడు పద్మ నయనమ్ముల వాడు ....." అంటూ 'వాడు అన్న మాటను పదే పదే
ఉపయోగించుతాడు. మరి దేవునికే ఉపయొగించినపుడు మనమధ్య ఉపయొగించడములో తప్పు లేదుకదా
అది అసలు వ్యాకరణ కార్యము. 'కారన్= వాడు, అన్నమాటను తమిళులు సహజముగా ఉపయొగించుతారు.
ఉదా. పాల్కారన్, వేలైకారన్ అంటే పాలవాడు
పనివాడు అని.
ఇక మంగలి అన్న మాటకు సంబంధించి నేను నా బాల్యములో పెద్దలనుండి
విన్నది చెబుతాను. మంగల అన్న శబ్దమే సంస్కృత శబ్దము. సంస్కృత దేవనాగరి లిపిలో, ‘ళ’
అన్న అక్షరము లేదు. మనకు ‘ళ’ ఉన్నది కాబట్టి ఈ పదమున్ ‘ల’ కు బదులు ‘ళ’ వాడుతాము. మంగళ కరమైన ప్రతి కార్యమునకు వారు ముందులేనిదే
జరుగదు . వారికి నాయీ బ్రాహ్మణులన్న పేరు ఉన్నది. వారు అన్నిటికి ముందుంటారు
కాబట్టి వారి వృత్తిని, బ్రాహ్మణ వృత్తితో పోల్చి నాయీ
బ్రాహ్మణుడన్నారు. అదే శబ్దము అన్నింటా వాడుటలో తప్పేలేదు. కానీ ఒకవేళ ఎక్కడైనా మంగల
అన్న శబ్దము వస్తే దయతో తప్పుడు అర్థముగా భావించవద్దు. మంగళ శబ్దమునకు సమానార్థకమగు
శబ్దము, తమిళములో ‘అమటన్’ అన్న పురాతన శబ్దమే చలామణిలో వుంది.
ఇక అసలు విషయానికి వద్దాము.
రెండు క్షౌరశాలలు ప్రక్క ప్రక్కల వుండేవి. మొదటిది వృత్తిలో అత్యంత
నిపుణుడైన వ్యక్తిది. రెండవ వాడు అంత నిపుణుడు కాడు. ఇద్దరిలో వుండే ఒకే
ఆంతర్యమేమిటంటే మొదటివానికి 'నేను నిపుణున్ని కాబట్టి
నేనెట్లు ప్రవర్తించినా అందరూ నా వద్దకే వస్తారులే' అన్న
గర్వము వుండేది. రెండవవాడు అందుకు విరుద్ధము. వాడు 'నాపని
నాకు దైవముతో సమానము. నా శక్తి వంచన లేకుండా నా వృత్తిని, శ్రద్ధా
భక్తితో చేస్తాను అని తలుస్తాడు. అందువల్ల ముందు రోజు రాత్రే తెల్లవారుతూనే
చేయవలసిన పనులకు అనుబంధముగా చేయవలసినవన్నీ చేసి తన వద్దకు వచ్చిన ఖాతాదారునికి
ఎటువంటి ఆలస్యము కలిగించక జాగరూకత వహించించేవాడు. మొదటి వ్యక్తి తనయొక్క గర్వముచే
రాను రానూ ఖాతాదారులను పోగొట్టుకొన్నాడు. ఎంధుకంటే వచ్చినవారిని పలుకరించకపోగా తన
పనికి కావలసినవి అప్పటికప్పుడు సమకూర్చుకొంటూ వుండిపొయేవాడు. గిరాకీ మొదటి
వ్యక్తికి తగ్గే కొద్దీ రెండవ వానికి పెరిగినది.
అహంకారము అణచుకొని మొదటి వాడు రెండవ వాని వద్దకు వచ్చి అతని విజయ
రహస్యము అడిగితే, అతడు, తన భక్తి శ్రద్ధ, పనిపై తాను కలిగిన జాగరూకత అని
చెప్పినాడు.
దీనినిబట్టి జాగరూకత వ్యక్తికి ఏ విషయములోనైనా ఎంత అవసరమో
తెలుస్తుంది.
27.తన మేలు పై ధ్యానమునుంచి రాజును గూర్చి పరులతో తక్కువ
మాట్లాడవలెను, అసలు తక్కువజేసి మాట్లాడరాదు.
ఇది చాలా ముఖ్యమైన విషయము.
తాను చెసే ఉపయుక్తమైన పనిని తాను నేరుగా చెప్పినట్లు కాకుండా రాజుకు తెలియజేయుట
అతి ముఖ్యము. ఇది అతని చాకచక్యముపై కూడా ఆధారపడి వుంటుంది.అదే విధముగా రాజు పై
మంచి అభిప్రాయమున్నా తాను పూర్తిగా నమ్మిన వారితో తప్ప అందరికీ ఆ విషయము ప్రచారము
చేయకూడదు. దుర్మార్గులు అటువంటి వారిపై, అవకాశము వచ్చినపుడు తప్పక దెబ్బ తీస్తారు.
ఇక రాజును గూర్చి తక్కువగా చెప్పే ప్రయత్నము చేసేదానికంటే ఓర్పుతో అతని
ప్రారబ్ధానికి వదిలితే కాగల కార్యము గంధర్వులే తీరుస్తారు.
మిగిలిన విషయముతో మరొక మారు..........
రాజును ఆశ్రయించుత కత్తిమీద సాము నెత్తిమీద పాము వంటిది. కాబట్టి ఆపదలందు ధైర్య గుణము అత్యవసరము.అది కలిగినవాడే ధీరుడనిపించుకొంటాడు. ఈ విషయమై భర్తృహరి ఈ విధముగా చెబుతారు.
ప్రియా న్యాయ్యా వృత్తిర్మలినమసుభంగే-ప్యసుకరమ్
త్వసంతో నాభ్యర్య్థాః సుహృదపి న యాచ్యః కృశ ధనః ।
విపద్యుచ్చైః ధైర్యం పదమనువిధేయం చ మహతాం
సతాం కేనోద్దిష్టం విషమ మసిధారావ్రత మిదమ్॥ 56
న్యాయ సమ్మతమైన వృత్తిచేయుచూ, ప్రాణాపాయము ఏర్పడిననూ అకార్యము చేయకుండా, దుర్జనులను ఏస్థితిలోనూ ప్రార్థించకుండుట, ప్రాణ స్నేహితుడైననూ ధనహీనుడైనచో యాచించకుండుట, ఆపదలందు దైర్యమును, మహాత్ముల అడుగుజాడల ననుసరించుట యను యీ అసిధారావ్రతము, సజ్జనులకు స్వభావ లక్షణమేగానీ ఒకరి ఉపదేశమువల్ల వచ్చేవి కాదు.
కాబట్టి ధీరత్వము ఉచితజ్ఞత అన్న ఈ రెండు గుణాలు కలిగియుంటే పునర్వైభవమును పొందవచ్చును. ఆవ్యక్తికి తిరుగు లేదు.అది లేకుంటే భూమిపై తిరుగలేడు.
29. యుద్ధ్హాలు మొదలయిన అత్యవసర సమయములలో రాజును అన్నివిధాలా తమ శక్తియుక్తులతో కాపాడుకోవాలి
ఇది శూర లక్షణము. అతని సహజ గుణము. శూరుని ఈ గుణము పూవు వంటిది. పూవుకు తావి సహజగుణము . అది అందమైన స్త్రీ కొప్పునలంకరించినా , అన్యులడుగేబెట్టని అడవిలోనైనాను తన సహజ గుణము కోల్పోదు. శూరుడు రాజుకు కవచము. శరాఘాతములచే ఎంతనొచ్చుకొన్నా రాజును కాపాడుట మాత్రము మానడు
30. ఎప్పుడూ ఉత్సాహమును ప్రదర్శించువాడు,బుద్ధిబలము గలవాడు, పరాక్రమ వంతుడు, సత్యవాది,దయాళువు, జితేంద్రియుడు,నీడలా వెన్నంటి ఉండేవాడు మాత్రమే రాజసేవా పాత్రు డౌతాడు.మునుపెపుడో నేను వ్రాసిన పద్యము ఈ సందర్భమునకు సరిపోవుటవలన దానిని యథాతథముగా గ్రహించి ఇచ్చట పొందుపరచినాను.
నీడగ వుండువాడు దయ నిత్యము కల్గినవాడు సత్యమున్
వేడుక పల్కువాడమిత వీర్య పరాక్రమశాలి బుద్ధిలో
వేడిమి తోడ ఎల్లపుడు వీడని ఇంద్రియ జేతయౌచు దా
వాడని ఉత్సుకమ్ముగల వాడె మనున్ మహరాజ పాత్రుడై
రాజనీతి, బోగముదాని వలె ఆయా సందర్భములకు తగినట్లు
సత్యాసత్యము గలదియు, నిష్ఠురత్వము గలదియు, ఇచ్చకములు
పలుకునదియూ, చంపునదియూ, కనికరము గలదియు, ఎల్లప్పుడూ
ఖర్చు పెట్టించుచూ రాబడి గలదియు అయిన వారకాంత వంటిది. అనగా
రాజనీతి వేశ్య కు సమానమని . నొక్కి వక్కాణించుచున్నారు.
ఈ సూత్రములను తన BOSS కు సేవ చేయునపుడు గుర్తుంచుకొనిన ఆ సేవకునికి తిరుగు లేదు.'అతి సర్వత్ర వర్జ్యేత్' అన్న విషయాన్ని ఎంత విపులముగా చెప్పినాడో చూడండి. BOSS ఏ బట్టలు వేసినా, తాను తన మహిళా సహచరుల కోసమే విచిత్ర విపరీత వస్త్ర ధారణ చేసుకొని వస్తాడు. BOSS వద్ద వెకిలి వేషాలు నిష్కారణమైన హాస్యము మొదలగునవి చేస్తాడు. ఇది, లేని ఎబ్బెట్టు తనానికి, దారి తీయుటయేకాక మనిషిని అందరిదృష్టి లోను ఆపై అధికారి దృష్టిలోను పూర్తిగా దిగజార్చుతుంది.
32. రాజునకతి సమీపములో గానీ అతి దూరములో గానీ యుండకూడదు. అసలు రాజుకెదురుగా కూర్చుండ కూడదు.
దూరమో దగ్గరో సాధారణ సభ లో తన స్థానములోనే తాను కూర్చోవలెనని ముందుగానే చెప్పుకొన్నాము. ఇక ప్రత్యేక సభలలో అతిధులందరికీ స్థానములు నిర్దేశించి యుండబడవు కాబట్టి ఒక ఆహ్వానితునిగా ఎప్పుడూ దూరము దగ్గర కాకుండా మధ్యేమార్గముననుసరించుట మంచిది.రాజు చూపులకు అందుబాటులో వుంటాడు వక్తల సంభాషణలను చక్కగా వినగలుగుతాడు. మరీ రాజుకు ఎదురుగా కూర్చుంటే రాజు భావోద్వేగానికి బలీయ్యే అవకాశము వుండవచ్చు. కాబట్టి ఎప్పటికీ మధ్యేమార్గము మంచి మార్గము.
33. ఒకే విషయము పై విరుద్ధమైన అనేక సలహాలు, ఇవ్వని వాడే రాజుకు ప్రీతీ పాత్రుడు కాగలడు
మరి నిముసమునకొక సలహా ఇచ్చే వ్యక్తి యొక్క ఏ సలహాను రాజు పరిగణన లోనికి తీసుకొంటాడు. కాబట్టి రాజుకు చెప్పే సలహా మబ్బులు వీడిన నీలాంబరము వాలే ఉండవలెను. అప్పుడే మనము చెప్పినది, నేటి కాలములోనైతే , మన పై అధికారికి వ్రాసే NOTE ఎప్పుడూ cristal clear గా వుంటే ఆయన సమయాన్ని సక్రమముగా కాపాడుకొనుటకు సహాయము చేసినవారమౌతాము.
34. సమ్మానమునకు అతిగా పొంగి పోరాదు. రేపెట్లు ఉంటుందో తెలియదు కదా
సమ్మానమునకు అతిగా పొంగి పోరాదు. రేపెట్లు ఉంటుందో తెలియదు కదా
రాజాశ్రయమ్మున దూషణ భూషణ తిరస్కారములను ఆశీస్సులుగానే తలువవలసివుంటుంది. ఈ రోజు సన్మానమౌతే రేపు అవమానము జరుగవచ్చు.ఈ విషయములో భర్తృహరి సుభాషితము ఏమంటున్నదో చూస్తాము:
నమ్రత్వేనోన్నమంతః పరగుణ కథనైః స్వాంగుణాన్యాపయంతః
స్వార్థాన్సంపాదయంతో వితత పృథుతరారంభ యత్నాః పరార్థే ।
క్షాంత్యైవాక్షేప రూక్షాక్షర ముఖర ముఖాం దుర్జనాం దుఃఖయంతః
సంతః సాశ్చర్యచర్యా జగతి బహుమతాః కస్య నాభ్యర్చనీయాః ॥ 60
తాత్పర్యము: అణుకువ గల వారగుటచేత సత్పురుషులు ఔన్నత్యమును పొందుచున్నారు. ఇతరుల గుణములను కీర్తించుట చేతనే తమ సద్గుణములను వెల్లడించు చుందురు. పరుల కార్యముల సాఫల్యతకై ప్రయత్నము చేయుచూ తమ పనులను కూడా నెరవేర్చుకుందురు.
35. రాజు ఏదయినా బాధ్యత నొసంగినపుడు కడు జాగరూకతతో మెలగవలెను. తన సర్వస్వము ఒడ్డి యయినా రాచ కార్యమును జయప్రదము చేయవలెను
ఈ సందర్భములో తిక్కనగారి ఈ మాట చదవండి
ఎండకు వాన కోర్చి తన-యిల్లు ప్రవాసపుఁజోటు నాక యా
కొండు నలంగుదున్ నిదుర-కుం దఱి దప్పెడు డప్పి వుట్టె నొ
క్కండన యెట్లొకో యనక - కార్యము ముట్టినచోట నేలినా
తం డొకచాయ చూపినను - దత్పరతం బని సేయు టొ ప్పగున్.
తిక్కనగారు చెప్పినపిదప నేను చెప్పేదేముంటుంది. అదే అనుసరణీయము.
36. ఎటువంటి లంచములకు గానీ ఆశ్రిత పక్షపాతమునకు గానీ తావివ్వరాదు.దొంగతనము చేసిన వాడు కారావాసమో మరణ శిక్షయో ఎప్పటికయినా రాజు కనుగొంటే అనుభవించక తప్పదు.
ధౌమ్యులవారు చెప్పిన పై మాట భర్తృహరి కాలానికే ఎంత మారిపోయందో ఈ సుభాషితాన్ని చదివితే మనకర్థమౌతుంది.
జాతిర్యాతు రసాతలం గుణ గణైస్తత్రాప్యధో గచ్ఛతాత్
శీలం శైల తటాత్పతత్వభిజనః సందహ్యతాం వహ్నినా ।
శౌర్యే వైరిణి వజ్రమాశు నిపతత్వర్థో-స్తు నః కేవలం
యేనైకేన వినా గుణస్తృణ లవ ప్రాయాః సమస్తా ఇమే ॥ 31
జాతి పాతాళమునకృంగి పోవుగాక, గుణగణమ్ములు గూడు వీడు గాక, శీలసంపద అడుగంటిపోవుగాక, పిడుగుపాటున శౌర్యమ్ము పిగులుగాక, గడ్డిపోచలు అవి ధనము గలిగెనేని .
ఇకనైనా గుణశీలములని గుర్తించి గౌరవించి నడుచుకొంటే మన పురాతన వైభవాన్ని పునః ప్రతిష్ఠ చేయగలుగుతాము
ఈ రీతిగా మీ మనసులను సంపూర్ణ నియంత్రణలో నుంచుకొని ఈ 13వ సంవత్సరమును గడిపినారంటే మీరు తదనంతరము మీ దేశానికి వచ్చి హాయిగా తిరుగవచ్చును అని ధౌమ్యుడు చెప్పి వారి వద్ద శెలవు తీసుకొని, అనుకొన్న ప్రకారము పరివారముతోగూడి ద్రుపదుని కడకు ఎగినాడు.
ఇది రాజుసేవలో వున్నంత కాలమేకాదు జీవితమంతాకూడా గుర్తుంచుకొవలసిన విషయములు.
అన్నీ తెలుసను ఆత్రము వీడుము
ఆరినదనుకొని అడుసు తొక్కకుము
బుద్ధికి పదునది పూర్తిగ పెట్టుము
కత్తి పదునుకే కాయ తెగునది
నోటికి తోచిన మాట చెప్పకుము
మాట మంత్రమని మరువకుమెప్పుడు
మాట యొక్కటే మనుగడ కూర్చును
అది గమనించిన అంతయు జయమే
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాం
స్వస్తి.
No comments:
Post a Comment