Sunday, 8 June 2014

శివశ్చ హృదయం విష్ణుం - విష్ణోశ్చ హృదయం శివం-రామేశ్వరుడు

'శివశ్చ హృదయం విష్ణుం - విష్ణోశ్చ హృదయం శివం' అన్న ఈ శ్లోకభాగము గాయత్రి మంత్రమును అనుష్టించే ఏ వైదీకి లేక స్మార్తుడు అయిన బ్రాహ్మణుడు నిత్యమూ చెప్పుకొంటాడు తన సంధ్యావందనములో. లోకములో హరిహర మూర్తి , శంకర నారాయణుడు , రామలింగం, రామేశ్వరం అన్న శివకేశావాభేదమైన ఇటువంటి పేర్లను పెట్టుకొంటారు.ఈ అద్వైతాన్ని ప్రతిష్ఠాపించిన అపర శంకరులు ఆదిశంకరులు. దానిని నిష్ఠగా అనుష్ఠించినవారు నడయాడే దేవునిగా కొనియాడబడిన కంచికామకోటి జగద్గురువులవారు. వారు తెలిపిన ఈ శ్లోకమును, కథను మీ ముందుంచుచున్నాను.

సంస్కృత సమాసములలో తత్పురుషము,బహువ్రీహి, కర్మధారయము అన్న మూడు సమాసాలు వున్నాయి.

ఒకసారి 'రామేశ్వరుడు' అన్నది ఏ సమాసమని సందేహము కలిగినది దేవతలందరికీ. వెంటనే సర్వ వ్యాపి అయిన మహావిష్ణువు వద్దకు వెళ్ళినారు వారు. సందేహమును తెలిపినారు. విష్ణువు కూడా వెంటనే వారి సందేహము తీరుస్తూ ఇదియేమి అంత పెద్ద విషయమని ఇంత దూరము వచ్చినారు 'రామస్య ఈశ్వరః--రామేశ్వరః' అంటే రామునియొక్క ప్రభువు అనే కదా అన్వయము కావున ఇది షష్టీ తత్పురుష సమాసమన్నారు.దేవతలు తృప్తి చెందలేదు.వారు వెంటనే శివుని వద్దకు పోయి తమ సందేహమును విన్నవించుకొన్నారు.అంత పరమేశ్వరుడు ఇది ఏమంత పెద్ద విషయము అని 'రాముడే ఈశ్వరునిగా కలిగినవాడు రామేశ్వరుడు' ఇది అన్య పదార్థ ప్రదానము కదా కావున 'బహువ్రీహి సమాసము' అన్నాడు శివుడు.దేవతలకు తోచ లేదు. వారు బ్రహ్మలోకానికి బయలుదేరినారు. బ్రహ్మ వారి రాకను గూర్చి విచారించి ఇంత చిన్న విషయానికి ఇంత దూరము వచ్చినారా అని ' రాముడయినట్టి ఈశ్వరుడు' లేక 'ఈశ్వరుడైనట్టి రాముడు' అని విగ్రహ వాక్యమును తెల్పి వారి అభేదమును విషాదము చేసినాడట.

అంతట దేవతలు ఈ విధముగా అనుకొన్నారు :

విష్ణు స్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరం

ఉభయోరప్య త్రుప్తానా మాత్మభూః కర్మధారయం

విష్ణుః=విష్ణుమూర్తి, తత్పురుషం= షష్టీ తత్పురుష సమాసమని

బహువ్రిహీం= బహువ్రీహి సమాసమని శివుడు తెల్పినాడు

ఉభయోరపి = ఆ ఇరువురి చేతనూ

అత్రుప్తానాం= తృప్తి చెందనట్టి (దేవతలకు)

అత్మభూః= బ్రహ్మదేవుడు

కర్మ ధారయం= కర్మధారయ సమాసమని

బ్రూతే=చెప్పుచున్నాడు

ఆ మహనీయుడు చెప్పిన మాటలోని నీతి ఏమంటే 'శివ కేశవ భేదమును మానండి అద్వైతము పాటించండి.'

నాదొక చిన్న మాట . ఒకే విధమైన పని జరుగుటకు ఒకే కార్యాలయమునకు ఐదు,ఆరు మంది పోతే ఉన్నతాధికారి గారిని చేరుటకు ఒక్కొక్కరు తమకు తెలిసిన ఒక్కొక్కరిని ఆశ్రయించి పై అధికారిగారి చేత తమ పని చేయించుకొంటారు. మరీ గోప్పవాడైతే నేరుగా ప్రధానాధికారిగారి వద్దకే పోతాడు. అంతే భక్తిలోకూడా ఎవరి సాధన వారిది.చివరకు చేరేది పైవానినే . 

స్వస్తి.









No comments:

Post a Comment