Tuesday, 15 October 2013

అబ్దుల్ కలాం పై పద్యం

అబ్దుల్ కలాం పుట్టిన రోజు సందర్భంగా నేను వ్రాసిన పద్యం 

కోహినూరు బోలు కోలారు గని బోలు 
మలల రాజు మంచు మలను బోలు 
అన్యుడతడు కాడు అబ్దుల్ కలామిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 


 Photo: ఈ రోజు భారతరత్న 
డా.ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ పుట్టినరోజు.. 

నేటి తరానికి నిప్పులాంటి నీతి..

నేను వేలాదిగా పరిచయ సంపదను కలిగివున్నాను. 
అందులో నుంచి వ్యక్తిగతంగా నన్ను ప్రభావితం చేసిన అంశం గురించి తెలియచేస్తాను. ''..నేను చిన్నవాణ్ణిగా వున్నప్పుడు నా తండ్రి జనాబ్ అవుల్ పకీర్ జైనుల్లాబ్దీన్ ఓ పెద్ద పాఠం నేర్పారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన కొద్ది కాలానికే ఇది జరిగింది. రామేశ్వరం దీవిలో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. మా నాన్నగారిని గ్రామ పంచాయితీకి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈయన ఒక కులానికో లేక మతానికో చెందిన కారణంగానో, ఆర్థిక స్థితిగతులనుసరించో వాళ్లు ఎన్నుకోలేదు. ఈయన మనస్సు దొడ్డదైనందున, ఈయన మంచి మనిషి అయినందువల్లనే ఎన్నుకున్నారు. నా తండ్రి పంచాయితీ అధ్యక్షునిగా ఎన్నుకోబడిన రోజునే ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. నేను అప్పటికింకా పాఠశాల విద్యార్థినే. పాఠాలను గొంతెత్తి వల్లె వేస్తున్నాను. ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అప్పట్లో రామేశ్వరంలో మేమెవ్వరం తలుపులకు తాళాలు వేసేవాళ్లం కాము. కనుక ఆ వ్యక్తి లోపలికి వచ్చి మా నాన్నగారెక్కడ అని అడిగాడు. సాయంత్రం పూట నమాజుకు వెళ్లారని చెప్పాను. ఆయన మా నాన్నగారికి కొన్ని వస్తువులు బహూకరించేందుకు తెచ్చినట్లుగా చెప్పి వాటిని అక్కడ పెట్టి వెళ్తానన్నాడు. పక్కనే వున్న మంచంమీద పెట్టి వెళ్లమన్నాను. తిరిగి నేను నా చదువులో పడిపోయాను. మా తండ్రి తిరిగి వచ్చి మంచం మీద వెండి పళ్లెంలో కొన్ని బహుమానాలు వుండడం గ్రహించారు. అవి ఎవరు ఇచ్చారని అడిగారాయన. ఎవరో వచ్చి అక్కడ పెట్టి వెళ్లారని చెప్పాను. ఆయన పాకెట్టు విప్పి చూస్తే ఖరీదైన బట్టలు, వెండి కప్పులు, కొన్ని పండ్లు, మిఠాయిలు వున్నాయి. వాటిని చూడగానే మా తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నేను సంతానంలో అందరికంటే చిన్నవాణ్ణి. నన్ను గారాబంగా చూసేవారు. నేనూ నా తండ్రిని అమితంగా ప్రేమించేవాణ్ణి. అదే తొలిసారిగా కోపం ఆయనలో అలా పెల్లుబకడాన్ని చూడడం. తొలిసారిగా బాగా దెబ్బలు తిన్నాను. నాకు భయం వేసింది. ఏడ్వసాగాను. తర్వాత నా తండ్రి అంతటి కోపానికి కారణాన్ని వివరించి చెప్పారు - అనుమతి లేకుండా ఆయనకు ఎవరు ఏ బహుమానాలు పంపినా స్వీకరించవద్దని చెప్పారు. బహుమతుల్ని స్వీకరించడం మంచి అలవాటు కాదు. ఏదయినా మనకు బహుమతి లభిస్తే దాని వెనక ఏదో ప్రయోజనం ఆశింపబడుతుంది. కనుక అది ప్రమాదకరం. అది ఎటువంటిదంటే పామును తాకి ప్రతిగా విషాన్ని పొందినట్లు. నాకు ఇప్పుడు ఎనభైయ్యేళ్ల వయస్సు వచ్చినా ఈ పాఠం నా మనస్సులో అలాగే నిలిచిపోయింది. ఇది నా మనస్సుపై చెరగని ముద్ర వేసి నాలో విలువల విధానాన్ని రూపొందించింది. ఇప్పటికీ ఎవరైనా ఏదయినా బహమతితో నా ముందు నిలిస్తే నా శరీరం, మనస్సు వణికిపోతాయి...
===========================
''..అభివృద్ధి సాధించేందుకు తలలన్నీ ఒకచోట కూడడం నన్నెప్పుడూ ఆకర్షించే అంశమే. అదంత తేలికయిన విషయం కాదు. అందువల్లనే అభిప్రాయ బేధాలు తరచుగా అభివృద్ధిని కుంటుపరుస్తూనే వుంటాయి. రాకెట్టునో, క్షిపణినో అభివృద్ధి చేసే పనిలో కూడా ఎంతో సమిష్టి కృషి అవసరమౌతుంది. ప్రజల ఆలోచనా విధానాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తూ, ఆకళింపు చేసుకుంటూ వాళ్ల నుంచి నేర్చుకున్నాను. దేశాధ్యక్షునిగాను, ఆ తర్వాత కూడ భావనా సంపదను నిలుపుకున్న అదృష్టవంతున్ణి నేను. వాటితోపాటు అభిప్రాయాలు, విమర్శలు అనుభవంతో కూడినవి, అంతగా అనుభవాన్ని జోడించలేకపోయినవి కూడా వుండేవి. భావనలు, ప్రశ్నలకు సంబంధించిన వెలుగు నీడలన్నీ మానవ అభివృద్ధికి దారితీసే జ్ఞానాన్నే పెంపొందింపచేస్తాయి..''

No comments:

Post a Comment