ఈ క్రింద నేను వ్రాసిన పాటను పొందు పరచు చున్నాను. ఇది శాస్త్రీయ సంగీత సభలలో శ్రీమతులు నిత్యశ్రీ,సుధా రఘునాదన్ మొదలగువారు, శ్రీయుతులు జేసుదాస్ ఉన్నికృష్ణన్ మొదలగు లబ్ధప్రతిష్టులు ఈ పాట పాడినారు.ఈ పాట కానడ రాగము లో మెట్టు కట్ట బడినది . తమిళములో ఈ పాట వ్రాసినవారు ఊత్తుక్కాడు సుబ్బయ్యర్ గారు. ఇది చాలా పాత పాట .
దీనిని అనువాద రీతిలో కాకుండా నాదైన రీతిలో నేను వ్రాసినాను. బాగోగులు చూసి నచ్చితే పాడి వినిపింపజేసేది .
కెరటమ్ములా నా మది ఊగెనే.....
కెరటమ్ములా నా మది ఉగేనే , కెరటమ్ములా,కృష్ణా , నామది ఊగెనే
నీ ఆనంద మోహన వేణుగానమున , కెరటమ్ములా నా మది ఊగెనే
కనీ విని ఎరుగని కళా రూపమౌ నీ గాన హైమ శిల కరిగి కరగి సుర
గంగయై దనర, తన్మయాన తొలి కెరటమ్ములా నా మది ఉగేనే
వసంత ఋతువు తొలి చివురుల్ తొడిగెలె
మందగతిన సెలయేళ్ళే నడిచెలే
మల్లె విరుల సౌరభాలు మరులుగొల్ప సాగెలె
విలంబమే వలదని తనువు వీణై పలికెలె
వరించి నిలచిన చరించ దలచిన విరించి మలచిన లతాంగిని
నిను గురించి తలంచి స్మరించి భరించి తరించ దలచిన సుమాంగిని
అలయక సొలయక తలయక నిలువక నీకై వేచిన శుభాంగిని
నీ మధుర మధురతర మధురిమ లోలికే గానఝరిన నే తరంగిణి
కరుణతోడ నను కావవైతివో ఈ పరిక్షలిక మానవైతివో
నను గనవా దరి గొనవా ఇది ధర్మమ్మేనా
నీ బాటలో నీదు ఆటలో నీ పాటకు పల్లవినై నిరంతరము ॥కెరటమ్ములా॥
No comments:
Post a Comment