Sunday, 25 August 2013

సంసారం లో సరిగమలు - నీవు నా మోహినివి

సంసారం లో సరిగమలు
సంసారం అన్న తరువాత అభిమానము ఆప్యాయతే కాకుండా కుటుంబ పరమైన ఆటుపోట్లు భార్యా భర్తల మధ్య ప్రణయ కలహాలు ఒక్కొక్కసారి ప్రళయ కలహాలూ కూడా వస్తుంటాయి . దానికి సమ్యమనము ఒక సమాధానమైతే సమయస్ఫూర్తి ఇంకొక సమాధానము.పై రెండు నాకున్నా లేకున్నా,తనను లాలించే కళ మాత్రం నాకు పట్టుబడింది. 'అవసరము ఆవిష్కరణకు పునాది కదా.'
అందులో భాగంగా ఈ పాటను,మీ అవసరాలకు కుడా ఉపయోగపడుతుందన్న ఆశతో మీకందిస్తున్నాను.
ఇది పాత హిందీ మూవీ 'వక్త్' లో 'అయ్ మెరే జొహరజబీన్' అన్న బాణీలో పొదగ బడింది. మెట్టు తెలిసి వుంటే సరేసరి లేదంటే 'యూ ట్యూబు'ను పట్టుకోవచ్చు .
ఇందులోఉపయోగించిన కొన్ని పదములకు కొంత విశ్లేషణ ఇచ్చున్నాను.
 సరసం= రసఙ్ఞత గల్గిన, సరసం=సరస్వతీ (తన పేరు) ( మీరు మాత్రం మీకు సంబంధ్సిన పేర్లు పెట్టుకోండి దయ ఉంచి)
ఇక్కడ మావి తోరణం అంటే అన్ని శుభాలకు వాకిటి గూమ్మానికి కడతారు కదా. ఈ మామిడి తోరణం ప్రత్యేకత ఏమిటంటే ఇది శ్రావణ మాసపు తోరణం. ఎప్పుడూ పచ్చగానే వుంటుంది. శ్రావణమాసమంతా నోములు వ్రతాలు పండగలే కదా.మా కాలంలో తోరణం వాడు తగిలితే క్రొత్తది కట్టేవాళ్ళు .
ఇక శ్రావణం అంటే శ్రావణ మాసమని ముందే చెప్పుకొన్నాను . ఇంకొక శ్రావణమంటే 'పట్టుకారు'నీరుకారు'చిమ్టా'. అంటే నేను కష్టాలలో మునిగితే 'శ్రావణము'తొ లేవనెత్తుతుంది  .
 స్యందనం అంటే రథము తేరు అంటే ఆంగ్లము లో నిఘంటు అర్థము CAR .
ఇక ఇంధన మంటే పెట్రోలని నేను చెప్పనక్కర లేదు.
పై విషయాలు మీకు తెలియవనికాదు. నాకూ తెలుసునని చెప్పడానికే.
ఇక మిగిలిపోయింది 'అతిరస'మన్న మాట. అతిరసమంటే సర్కారు ప్రాంతములో 'అరిసె' అని అర్థం. కానీ 'అరిసి'  అంటే అరవములో 'బియ్యము' అని అర్థము. అరిసె అన్న పదము అందుండి వచ్చినదే! కానీ ఆపేరు ఆ విధముగా వచ్చినదని చాలా మందికి తెలియకపోవచ్చు. తమిళులు మాత్రం దానిని 'అతిరసం' అని అంటారు, కానీ దాన్ని అరిసె అంటారన్న విషయము తెలియదు. మరి బియ్యమును  'అరిసి'  అన్న మాట ఆంధ్రా నుండి అరవదేశం పోయిందేమో! దేశ భాషలలో సంస్కృతజన్య పదములు లేకుండా వుండే భాష లేదు . అందుకే కృష్ణ రాయలు కంటే పూర్వజుడైన శ్రీనాధ పండిత కవి సార్వభౌముడు అన్నాడని కొందరు,  వల్లభారాయలు వాడినాడని కొందరు అంటారు. సమస్య క్రీడాభిరామము వ్రాసిన విషమై ఉత్పన్నమైయున్నది. ఆ కావ్యమును వ్రాసినది పండిత రాయాలా లేక శ్రీనాధుడా అన్నది తర్క విషయము. ఏది ఏమయినా ' దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నది మాత్రము అక్షరసత్యము. ఆ పద్యము యొక్క పూర్తి పాఠమిది.
జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు కాదె
ఇక పాట చదవండి మాట చెప్పండి. 
పరమేశ్వరుని పరమ భక్తుడగు అప్పయ్య దీక్షితులు స్వతహాగా తమిలుడైవుండి తానూ తెలుగువానిగా పుట్టలేదే అనిబాధపడుతూ  'ఆంధ్రత్వమాంధ్రభాషాచ నాల్పస్య తపసః ఫలం'. ఎంతో తపోఫలితముంటేనే ఆంధ్రము నేర్చిన ఆంధ్రుడైపుడతాడు అని చెప్పినాడు. తెలుగుతల్లికి ఇదే నమస్కారము.
స్వస్తి.
ఇదీ పాట 
నీవు నా మోహినివి

వలపుల వాహినివి
నేను నీ శోభనాల పెళ్లి కొడుకుని
నీవు నా నవరసాల నాయకీమణి
              నీతోటి నాదు జీవితం ఓ మదురమైన అతిరసం
              కోపాన చూడ రాజసం నన్నావహించు నీరసం
              సరసం సరసం నీవెనా పాయసం సుఫల రసం ॥నీవు నా॥
నాచింత లో కణం కణం భరింతువు క్షణం క్షణం
నాయింటి మావి తోరణం తీరెదికాదునీ ఋణం
నీవె నా, నీవె నా, జీవిత శ్రావణం శ్రావణం        ॥నీవు నా॥
              నీవేమొ విమల నందనం నీ మదికిదే నా వందనం
              సాగింది బ్రతుకు స్యందనం నీవందులోని ఇంధనం
              నీకిదే నీకిదే నాఅభినందనం కుందనం         ॥నీవు నా॥

No comments:

Post a Comment