ఆప్తులకు
ఆగష్టు 15వ తేదీ దగ్గర పడుచున్నది. అందువల్ల ఆ పర్వమునకు అనుసంధానముగా
నేటి రాష్ట్రీయ స్థితి
గతులను దృష్టిలో నుంచుకొని నా మనసుకు తోచిన
నాలుగు మాటలు పంచుకోదలచినాను . నా భావము మనము అన్న భావన కు ఛాయ.
ఈ రచన సానురాగంతో స్వీకరించుతారని నా నమ్మకము .
మా నవతా ఇది మానవతా
మన్నన కల్గి లోకమున మంచికి నెప్పుడు మారుపేరుగన్
సన్నుతికెక్కి సంతతము సర్వహితంబులు గూర్చు నేతలున్
ఎన్నికయై ప్రజాభిమత మేర్పడ పాలన జేసి రప్పుడున్
ఎన్నగు వెన్నుపోటరులె యేలికలై ప్రజ దోతు రిప్పుడున్
(వెన్నుపోటరులు =వెన్ను పోటు పొడిచే వారు )
వేషాల్మోసము లంకురించి మమతల్ వేలారగా యాత్మలన్
రోషోన్మాదము హెచ్చి రుక్కు యగు నీ రుక్మంబు రుత్తవ్వగా
ద్వేషాసూయలు పెల్లు రేగె నిల ప్రాంతీ యాభిమానోద్ధతిన్
పాషాణంబుగ మారే మానవత ఎపారంగ స్వార్థంబొగిన్
(వెలార=లేకుండా పోవు ; రుక్కు=ప్రకాశమగు;రుక్మము=బంగారు; రుత్తు=నాశము;
ఉద్ధతి=గర్వము ;
ఏపారు= అహంకరించు ఒగిన్=క్రమముగా)
అంతయు రాజకీయమయమై మయ నిర్మిత ధర్మరాట్సభా
భ్యంతర సీమవోలె నోకటన్న మరొక్కటి గానుపించు నే
క్రంతకు నీడ్చునో ఎచట కాలు దిగంబడునో శిరంబులే
కంతులు గట్టునో యనెడు కాలము వచ్చెను రామమోహనా
(క్రంత= బొరియ,కంత ; కంతులు =బొప్పి కట్టు )
కుట్టిన బట్టగు కూసము
కుట్టక యున్నట్టి యెడల గుడ్డయె, దానిన్
కుట్టించి చించి వేయగ
ఎట్టాగా పీలికలను బట్టందు రిలన్
కావు కావు కక్ష కార్పణ్య కలహముల్
కావు కావు కండ కావరాలు
కావు కావు కల్ల కపటాలు తిరములు
కావు కావు యనుచు కాకి యరిచె
No comments:
Post a Comment