మునగ యొక్క శాస్త్రీయ నామము Moringa oleifera. ఈ మోరింగా అన్నది తమిళము లోని ‘మురుంగ్ కాయ్’ నుండి వచ్చింది. తమిళము అజన్తము
కాదు కాబట్టి ‘కాయ’ అన్న తెలుగు పదము ‘కాయ్’ అయ్యింది. అదేవిధముగా ‘మునగ’ అన్న మాట
కృతకమై ‘ మురుంగ్’ అయ్యింది. ఆంగ్లేయుల ముఖ్య స్థావరములలో
నాటి సంయుక్త ‘మద్రాసు’ కూడా ఒకటి. అందుచేత తమిళములోనికి చేరిన
అనేక తెలుగు పదాలు, తమిళము
ద్వారా ఆంగ్లము లోనికి ప్రవేశించుట జరిగినది. ఈ చెట్టును
5౦౦౦ సంవత్సరముల పూర్వము నుండియే వాడుచున్నట్లు దాఖలాలు కనబడుచున్నవి.
‘ఇంటికి ముందు మునగ వెనుక వేప పనికిరావు’ అన్న
నానుడి తెలుగునాట అధిక ప్రచారములో వుంది. మొన్న ఈ సందేహమును నా మిత్రుడు నాగసుబ్బారెడ్డి
వెలిబుచ్చినాడు. నేను వెంటనే తెలియదు అన్నాను కానీ ఆలోచించగా మదిలో ఈ ఊహ మెదిలింది.
మునగ ఎంతో పెళుసైన చెట్టు. ఇంటికి ముందు ఉంటే ఇంటిలోనికి వచ్చిపోయే వారిపై, గాలికి,
కొమ్మలు లేక చెట్టే విరిగిపడే ప్రమాదముంది. ‘మునగచెట్టు ఎక్కించవద్దు’ అన్న సామెతను
ఎవరినైనా ఎక్కువగా పొగడుతూ వుంటే పొగడబడే వ్యక్తి అనుట కద్దు. అంటే నీవేమో ఆ పెళుసైన
చేట్టెక్కిస్తున్నావు, ఆ ఎత్తునుండి పడితే కాళ్ళు చేతులు విరుచుకోనేది నేనే కదా! అన్న అర్థములో వాడుతారు.
కావున ఇంటి ముందు అంటే తలవాకిట మునగ చెట్టు ప్రమాదకరము. అదేవిధముగా వేప కీటక నాశిని.
ఇంటి వెనుక వుంటే ప్రయోజనము ఉండదు. ఇంటి ముందయితే నీడనే గాక ఎన్నో విధములగు రోగముల
బారిన పడకుండా కూడా కాపాడుతుంది.
మునగ చెట్టు విషయానికొస్తే వైద్యంలో దాదాపు 300 విధములగు రోగములను బాగు చేయగల సామర్థ్యము దీనికున్నట్లు
చెబుతారు. పోషకాహార లోపముచే వచ్చు వ్యాధుల నివారణకు వాడతారు. వ్యవసాయము, పాడిపరిశ్రమలో ఎరువుగా, కీటకనాశినిగా, ఉపయోగపడుతుంది. దీని ఆకులు తింటే పాడిపశువులు
వేగంగా బరువుపెరగవచ్చు. పాడి దిగుబడికూడా ఇంచుమిన్న్చు 50 నుండి 65 శాతం పెరుగుతుందని అంచనా.
సౌందర్య సాధనాలలోనూ, తోలు మరియు వస్త్ర, పరిశ్రమలలోనూ,
వంటనూనెను తయారుచేయుటలోనూ మునగ ఉపయోగించుతారు. అసలు ఎండిన మునగకట్టెలు
ఒక మూరెడు పొడవున కోసి, కట్టకట్టి వీపు వెనకాల కట్టుకొని ఈత నేర్చుకొనుటకు
ఉపయోగించుతారు.
తమిళనాడు, ఏపీ, తెలంగాణా, కర్ణాటక, ఒడిసాలతో పాటు హిమాలయా పర్వత పాదాల వద్ద ఈ చెట్లు
లక్షల సంఖ్యలో సాగాగుచుండగా, ఘనా, మొజాంబిక్, నైజీరియా, కెన్యా, రువాండా, నైగర్, కంబోడియా, హైతీ, ఫిలిప్పీన్స్ మున్నగు ప్రపంచ దేశాలలోనూ మునగ పెరుగుతున్నది.
అత్యధికముగా పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా, కనీసం ఆషాఢంలోనైనా తినమన్నారు పెద్దలు.
వైద్యులు తరచూ తినవలసిన ఆకు అని అంటున్నారు. ఆయుర్వేదములో మునగకు విశిష్ట స్థానం ఉంది.
ఇది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి
ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు.
చెట్టు బెరడు, కాయ, లోపలి విత్తనాలు,
పూవు, ఆకు, అన్నీ ఔషధీయ గుణములు
కలిగి యున్నాయి.
మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్
ఉంటాయి.. ఇవి వాపుల్ని, ఒత్తిడిని
నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది.
కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. యాంటాసిడ్గా మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్లను నయం
చేస్తుంది. ఊబకాయం, మధుమేహానికి
మంచి మందు. కేన్సర్ చికిత్సలోనూ దీని పాత్రను ఇపుడిపుడే అంచనా వేస్తున్నారు. కండరాల
నొప్పి, క్షీణతకు
తగిన మందు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల నిద్ర సరిగా పట్టేట్టు చేస్తుంది. గుండె
పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి, లివర్ సిరోసిస్ కు ఇది అద్భుతమైన
మందు అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు.
200 మిల్లీ
గ్రాముల మునగాకు పొడి తింటే రక్తంలో షుగర్ లెవల్స్ దాదాపు 40 శాతముు
తగ్గుతుందని నిపుణులు చెబుతారు. ఇది లైంగిక సామర్థ్యం పెరగడానికి కూడా దోహదం చేస్తుందట.
అసలీవిధముగా దీనిని పరమౌషధముగా పరిగణించవచ్చును.మునగాకు ఎగుమతి
ధర రూ.80/ కిలో గానూ, మునగవిత్తనాల ఎగుమతి ధర. రూ.500/కిలో గానూ
వున్నట్లు తెలియవస్తూ వుంది.
మునగాకు బచ్చలి
కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్ , పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం , క్యారట్ కంటే 9 రెట్లు ఎక్కువ
విటమిన్'సి', అరటి పండు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి
ఉండే ఆకు. ఆకు ఒకటే కాదు, మునగ చెట్టు బెరడు మునగ కాడలు, వానిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు
ముక్కల్లో చెప్పాలంటే, అదో ఔషధాల నిధి. దానిని అందించినాడావిధి.
మహిళలు రోజుకు 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలలపాటు సక్రమముగా తీసుకోవడం
వలన 13.5 శాతం చక్కెర
స్థాయి (Blood Sugar
Level) తగ్గించవచ్చునని సైంటిస్ట్లు సూచిస్తున్నారు.
అలాగే ఐదు రకాల క్యాన్సర్లను నిరోధించే సత్తా
ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయన సమాచారం.
ఏది ఏమయినా నేను అందించే సమాచారము
తెలుసుకొనుటకు మాత్రమే. వైద్యముగా వాడదలచినవారు వైద్యుల సలహాల మేరకే వాడేది.
మునగాకులలో పవర్ఫుల్ నియాంజిమినైన్ అనే యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు
పేర్కొన్నట్లు వార్తలు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా
ఈ మునగాకు పొడి అరికట్టగలదట.
మునగాకులో ఎముకపుష్టికి తోడ్పడే కాల్షియం, గర్భిణులకు మేలు చేసే ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తాయని
నిపుణులు తెలియజేస్తున్నారు. పొట్టలో హానికారక క్రిములను తగ్గిస్తుంది.
బాలింతలు తింటే పాలు పడతాయి.
మునగ భారత్లోనూ, అనేక ఆఫ్రికన్ దేశాల్లోనూ ఎదుగుతుంది.
పశ్చిమదేశాల్లో కానరాదు. వీటిలోనూ భారత్ నుంచి వచ్చే మునగాకు శ్రేష్ఠమైనది. అందుకే-
భారత్ నుంచి మునగ ఆకును అమెరికా, కెనడా,
ఐరోపా దేశాలు, చైనా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో దీనికోసం ఎగబడుతున్నాయి.
అక్కడ మునగాకు పొడికి చాలా డిమాండ్ ఉంది. 2015లో భారత్ నుంచి రూ 146 కోట్ల
విలువైన మునగ ఆకులు ఆయా దేశాలకు ఎగుమతి అయినాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా
మునగాకు వ్యాపారం దాదాపు 27వేల కోట్లు, ఇంకో రెండేళ్ళలో ఇది రూ 47,500 కోట్లకు
పెరగవచ్చు.
అమెరికాకు చెందిన ‘ద ట్రీస్
ఫర్ లైఫ్’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి
తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపినాయి. ఐక్యరాజ్యసమితి కూడా
మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూవుంది. దాంతో మన దృష్టి
కూడా అటు మళ్లింది. ‘న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు డాక్టర్ సి.గోపాలన్
గారు మునగాకు ప్రాశస్త్యాన్ని ఎంతగానో చాటినారు. ఆయుర్వేద
వైద్యులు కూడా ఎన్నో TV
ఛానల్స్ లో మునగ ప్రాశస్తాన్ని గూర్చి ఎక్కువగా తెలియజేస్తూనే వున్నారు.
అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా
ఏటా ఐదు లక్షల మంది విటమిన్-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన
పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు.
ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ
కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు...
మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’
అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా
వాసులు మునగాకుని పండించి, పొడి
చేసి విక్రయిస్తున్నారు. భారత్ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది.
కానీ ఆకును తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.
మా బాల్యములో మా అమ్మమ్మ మునగాకు
కూర ఎక్కువగా చేసేది. తినమని బలవంతమూ చేసేది. కళ్ళకు మంచిది అని మాతండ్రిగారు కూడా
చెప్పేవారు.
కామెర్లు, కలరా బేదుల, బాధితుల బాధ చెప్పనలవి కాదు.
ఒకటే దాహము. నీరసము. అప్పుడు రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను
మునగాకు రసం, కొద్దిగా
తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి
క్యారెట్ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్లన్నీ తొలగిపోతాయట.
ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని
నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్హెడ్స్ మీద రాస్తే
అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి మునగాకు
టీ రుచికరమైన పరిష్కారం.
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ
కాయలే కాదు, తెల్లని
పూలు కూడా ఔషధ నిధులే! పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది.
ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది.
ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి
మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో
తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.
రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు.
కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్, ఇండొనేషియా
వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను
బిందెలోని నీళ్లలో కలిపి, ఓ
ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద
పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు.
శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్గా
పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా
చేస్తుంది.
మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల
మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి
వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో
ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో
దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం.
రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ
ఉత్పత్తుల విలువ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం
మనవే. కాయలతోబాటు పొడినీ ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో
వేసి ఎగుమతి చేస్తారు.
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం
కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి.
నేలతీరు, వాతావరణాన్ని
బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని
పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు, ఇంటి అవసరాలకోసం ఇంటి వెనుక మునగను పెంచితే ఆరోగ్యమే
మీ పెరట్లో ఉన్నట్లే!
స్వస్తి.
No comments:
Post a Comment