లాహిరీ మహాశయుడు
కాలాంతరములో వారి తల్లి మరణము, వారి ఇల్లు వరదపాలు కావడము,
వారి తండ్రికి కాశీ తో అనుబంధము పెరగడమూ, వారి
అన్న కాశీలో ఇంటినికొనటమూ ఆయనను కాశీవాసిని చేసింది.
ఈ విధముగా శ్యామాచరణులవారి విద్యాభ్యాసం వారణాశి లోని గరుడేశ్వర్ మొహల్లాలో భూకైలాస రాజయిన జయనారాయణ
ఘోషాల్ స్థాపించిన జయనారాయణ ఇంగ్లీషు పాఠశాలతో మొదలైంది. ఆయన ఇంగ్లీషు, బెంగాలీ,
ఉర్దూ, హిందీ భాషలే కాక ఫార్సిభాష కూడా
నేర్చుకున్నారు. ఇంతేకాకుండా, నాగాభట్టనే మహారాష్ట్ర
శాస్త్రపండితుని సన్నిధిలో సంస్కృతంతో బాటు వేదం, ఉపనిషత్తులు
మొదలయిన శాస్త్రగ్రంధాలు ధార్మిక గ్రంధాలు అధ్యయనం చేశారు. కాలేజీలో చదువుతుండే
రోజుల్లోనే 18 వ ఏట అంటే క్రీ . శ . 1846 లో శ్యామాచరణులకు మంచి నిష్టాపరులయిన బ్రాహ్మణులు, కాశీలోని
పండితుల్లో మంచి పేరుప్రతిష్టలు కలిగిన మరియు గౌర్ మోహన్ గారికి మంచి స్నేహితులు
అయిన దేవనారాయణ సన్యాల్ వాచస్పతి గారి కూతురు కాశీమణి తో వివాహమైంది.
క్రి. శ. 1851 లో 23 ఏళ్ల వయస్సులో శ్యామాచరణులు గాజీపూర్ లో
పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు వారి మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్ లో గుమస్తాగా చేరినారు.
ఆ రోజుల్లో సైన్యానికి ఆహార సామాగ్రి సరఫరా చేయడం, రోడ్లువంటివి
నిర్మించడం ఈ శాఖ చేసే ముఖ్యమైన పనులు. ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగము కాబట్టి ఎన్నో
ఊర్లకు వారు Transfer అగుట జరిగింది. సర్వీసు చివరి రోజుల్లో ఆయన బేరక్ మాస్టర్ (
barrack-master, ఈ రోజుల్లో Sub Divisional Officer అంటారేమో!
) పదవిలో ఉండేవారు.
క్రీ. శ. 1868 నవంబర్ 23 వ తేదీన,
శ్యామాచరణులవారు రాణిఖేత్ కు బదిలీ చేస్తూ ఉత్తరువు వచ్చింది.
నవంబర్ 27 న శ్యామాచరణులు భారత దేశము యొక్క ఉత్తర దిక్కున హిమాలయాల ఒడిలో 5980 అడుగుల ఎత్తున ఉన్న రాణిఖేత్ కు బదిలీ కావటం జరిగింది. ఒక రోజున వారు సాయుధులయిన సిపాయిలను, నౌకర్లను వెంటబెట్టుకొని జనసంచారం లేని ఆ కొండప్రాంతములో వెళ్తూ ఉండగా...
ఒక సన్యాసి తమను పేరు పెట్టి పిలుస్తున్నట్టు వారికి వినిపించింది. ఆయన ఆగి అటుఇటు
చూస్తుంటే, ఆ సన్యాసి కొండ దిగి వచ్చి "నువ్వు ఈ దారిలో
వస్తావని నాకు తెలుసు. అందుకే నీకొరకు ఎదురుచూస్తూన్నా, నీవు
ఆఫీసు పనులు శీఘ్రముగా పూర్తిచేసుకోని నా కుటీరమునకురా, నీ
కోసం ఎదురుచూస్తూ ఉంటాను." అని చెప్పి
దూరంగా కొండ మీదున్న కుటీరాన్ని చూపిస్తూ అచటికి వెళ్లిపోయినారు.
శ్యామాచరణులు ఆఫీసుపని తొందరగా ముగించుకొని ఆయన వద్దకు పోయినారు.
అక్కడ ఆయన "శ్యామా! దగ్గరికిరా! నన్ను నువ్వు
గుర్తుపట్టినావా?" అని అడిగినారు. అక్కడే వున్న వేరొకజత పులి చర్మమూ కమండలమూ చూపించి, "వీటిని
కూడా గుర్తుపట్టగలవా? అని
శ్యామాచరణులను స్పృశించినారు దాంతో లాహిరీవారికి పూర్వజన్మలోని ఆ బాబాను గురువుగా నెంచి తాను చేసిన సాధన గుర్తుకు వచ్చింది. తరువాతికాలములో ఈ బాబా గారిని మహావతార్ బాబాగా జనులు పిలిచేవారు. ఆ మహనీయుడే
పూర్వజన్మలో తమ గురుదేవులని అర్ధమయిపోయింది లాహిరీ మహాశయులకు. “నీకిపుడు గత
జన్మ గుర్తుకొచ్చినది కదా! నీకు యోగదీక్ష ఇవ్వడానికి తగిన సమయమాసన్నమైనదని
తలచియే నేను నిన్నిచటికి బదిలీ
చేయించినాను” అని తెలిపి లాహిరీగారికి
యోగదీక్ష నొసంగినారు మహావతార్ బాబా గారు. దానిని క్రియాయోగము అంటారు. (సినీ
నటుడు రజనీకాంత్ హిమసలయాలకు ఈ బాబాగారి ఆశ్రమానికే వెళుతూ ఉంటాడు అని అంటారు.)
శ్యామాచరణులు వారిని బాబాజీ అని పిలుస్తూండేవారు. బాబాజీ ఒక రోజు
శిష్యునితో నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయింది, నీవు
వెనుకకు వెళ్లి . ఒక యోగి గృహస్థుగానే
ఉంటూ కఠోరయోగసాధన చేస్తూ పరమాత్మను పొందవచ్చునన్న అమోఘమైన ఆదర్శాన్ని నెలకొల్పవలసివున్నది.
మోక్షసాధనకై అర్రులు సాచే సద్గృహస్తులందరికి
ముక్తి మార్గము చూపించు అన్నారు.
కొద్దిరోజులకే శ్యామాచరణుల వారికి బదిలీ అయ్యింది. క్రీ. శ. 1869 జనవరి 15 వ తేదీన ఈ యోగసాధనను అందరికి
ఉపదేశించడానికి గురుదేవుల అనుమతిని తీసుకొని స్వస్థలమునకు బయలుదేరినారు.
ఇక ఆయన మహాత్మ్యమును గూర్చి కాస్త తెలుసుకొందాము. ఒకసారి
అంగ్లేయుడగు తన పైఅదికారి యొక్క భార్య ఇంగ్లాండులో జబ్బుతో బతకడమే కష్టమైన పరిస్థితిలో పడి ఉందని తెలిసి చింతాగ్రస్తులయి
వుండుట లాహిరీ మహాశయులు గమనించినారు. కరుణా హృదయుడగు ఆయన వెంటనే ఆఫీసులోనే
ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ధ్యానమగ్నులైనారు. కొద్దిసేపు తరువాత బయటికి
వచ్చి,
దొరసాని గారి ఆరోగ్యం బాగుపడిందని త్వరలో అక్కడినుండి ఉత్తరము
వస్తుందనితెలుపుతూ అందు ఉండబోయే వివరాలుకూడా తెలియజేసినారు. కొన్నాళ్ళతరువాత ఆ దొర తన భార్య వద్దనుండి
వచ్చిన ఉత్తరము చూస్తే అందులో అన్నీ శ్యామాచరణులు
చెప్పినరీతిగానే ఉన్నాయి. కొన్ని నెలల తరువాత ఆ దొరగారి భార్య ఇంగ్లాండ్ నుండి రావడము
సంభవించింది. ఒకనాడు ఆవిడ తన భర్తను కలుసుకొనుటకు ఆఫీసుకు వచ్చి అక్కడ
శ్యామాచరణులను చూసి నిర్ఘాతపోయింది. తాను జబ్బులో ఉన్నప్పుడు ఈయనే తన మంచము వద్ద నిలచి తనకు బాగవుతుందనిచెప్పి అంతర్దానము అయినారని దొరగారికి చెప్పింది. ఈవిధమగు
మహిమలు (అని చెప్పవచ్చునోలేదో!) శ్యామాచరణులు ఎన్నో మార్లు ప్రకటించినారు.
ఒకానొక సందర్భంలో
మౌనియగు త్రైలింగస్వామి ( వీరు తెలుగు వారు, వీరు సాక్షాత్తు, కాశీలో సజీవంగా సంచరించే విశ్వనాథులుగా పేరు పొందినవారు. ఈయన 300
సంవత్సరములు జీవించినారు. వీరిని గూర్చి రెండు మూడు సంవత్సరముల క్రితము విపులముగా
వ్రాసియుండినాను.) లాహిరీ వారిని గూర్చి "దేన్ని పొందడానికి సాధువులు
సన్యాసులు గోచిగుడ్డతో సహా అన్నీ త్యాగం చెయ్యవలసి వస్తుందో దాన్ని ఈ మహాత్ముడు,
గృహస్థాశ్రమంలోనే ఉండి పొందినాడు". అని ఒక పలకమీద రాసి చూపించినారు. శ్యామాచరణులు ప్రచారానికి
విముఖులు. ఎవరయినా శిష్యవర్గములో ఆ ప్రస్తాపన తెస్తే "సూర్యోదయము తెల్పుటకు
దండోరా అవసరమా?" అనేవారు.
యోగిరాజులు స్వయంగా అనేక
మందికి యోగక్రియప్రదానం చేస్తూ, ఆత్మోన్నతిమార్గంలో ప్రగతి సాధించడానికి
వాళ్ళకు ప్రేరణ ఇస్తుండేవారు. వారు ఎంతమందికి దీక్షాప్రదానం చేసినారో చెప్ప వీలు
లేదు. విఖ్యాత యోగులుగా పెరెన్నికగన్నవారిలో
యోగిరాజుల కుమారులు - ఋషికల్పులు - తీన్ కౌడీ లాహిరీ, దుకౌడీ
లాహిరీ, పంచానన భట్టాచార్య, స్వామి
ప్రణవానంద గిరి, స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి (శ్రీ పరమహంస
యోగానంద గారి గురువు గారు), భూపేంద్రనాథ్ సన్యాల్ మొదలగువారు
వున్నారు. ఆయన గొప్పదనమేమిటంటే నేటి బాబాలవలె Money Order దర్శనాలు
ఆయనవద్ద ఉండేవి కావు. ఆయన అడుగు, బడుగు ప్రజలకెందరికో యోగక్రియ నేర్పిన మహనీయుడు.
వీరు కుటుంబ వ్యవస్థలో ఉంటూ, ఉద్యోగం చేస్తూనే
భార్యాపిల్లలను గమనించుకుంటూ, పెళ్లిళ్లు చేస్తూ పూర్తిగా
సంసారాన్ని బాధ్యతతో నిర్వహిస్తూ ఉదయం, సాయంత్రం, సెలవు దినాలలో క్రియా యోగమును
బోధించినవారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం తక్క మిగిలిన
సమయమంతా సాధనకు, బోధనకు ఉపయోగించినారు. సాధారణంగా రాత్రిళ్లు
సాధన చేసేవారు. ఇచ్ఛా మరణాన్ని పొందినవారు - జీవన్ముక్తులు. అనితరసాధ్యమైన యోగ
సిద్ధి పొందిన మహనీయుడు యోగిరాజు లాహిరి. ఈయన ఉద్యోగ బదిలీలలో తప్పించి పరమపదించే వరకూ కాశీ మహాక్షేత్రంలో
నివసించినారు. 1872లో షిర్డీబాబా లాహిరీ మహాశయుల నుండే క్రియా యోగ దీక్షను
స్వీకరించినారని లాహిరీ మహాశయుల జీవిత చరిత్రలో వ్రాయబడివుంది.
‘లాహిరీజీ’ ముఖ్య శిష్యులు యుక్తేశ్వర్గిరి. వీరు తమ భార్య
మరణించేవరకు గృహస్థాశ్రమంలో ఉండి ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించినవారు.
కలకత్తాలోని దక్షిణేశ్వరంలోనూ, పూరీలోనూ వీరి ఆశ్రమాలున్నాయి. పూరీలోనే
వీరు మహా సమాధి చేయబడ్డారు. యుక్తేశ్వర్గిరిగారి ముఖ్య శిష్యులు ప్రపంచ ప్రఖ్యాతి
గాంచిన ఒక యోగి ఆత్మకథ పుస్తక రచయిత పరమహంస యోగానంద.
యోగానందులు ఈ క్రియా యోగమును విశధీకరిస్తూ, "క్రియా యోగి తన ప్రాణశక్తిని, వెన్నుబాములోని అరు
కేంద్రాల్ని (ఆజ్ఞా, విశుద్ధ, అనాహత,
మణిపుర, స్వాధిష్ఠాన, మూలాధారాలనే
షట్చక్రాలను) చుట్టి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి
పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశించగల శక్తిమంతుడు. ఈ క్రియకు పట్టే అర నిముసము, ఒక సంవత్సరంలో
జరిగే ప్రకృతిసహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానము" అని అన్నారు.
ఇట్టి వారిని మనము మహాపురుషులు అని అనవలెను. సిరి సంపద మంది
మార్బలము, అధికారము, అహంకారము ఏదీ ఆశించక నిష్కాములై ప్రజలయోక్క ఆధ్యాత్మిక వికాసమునకై జీవితమును
ధారపోసినారు. నేడు మనము గమనించే ప్రపంచములో ఇటువంటివారిని గాంచుట గోలీలాట కాదని నా
ఉద్దేశ్యము. గోలీలాట అన్న మాట ఎందుకు ఉపయోగించినానంటే అదికూడా ఇట్టి మహాత్ములవలేనే
కనుమరుగైపోయింది.
స్వస్తి.
No comments:
Post a Comment