Tuesday, 31 July 2018

లాహిరీ మహాశయుడు


లాహిరీ మహాశయుడు

పూజ్య గురువులు శ్యామ చరణ్ లాహిరి గారు(1828 సెప్టెంబరు 30 - 1895 సెప్టెంబరు 26) "లాహిరీ మహాశయుడు"గా ప్రసిద్ధుడు. ఈయన బెంగాలులో ఘుర్ణి గ్రామ కాపురస్తులయిన గౌర్ మోహన్ లాహిరీ, ముక్తకేశీదేవి దంపతులకు ఈ దేవశిశువు క్రీ. శ. 30 సెప్టెంబర్ 1828 న జన్మించినాడు. వారి ఇల్లు ఏటినానుకొనియుండేది. ఆయన ఎప్పుడూ ఎదో కాల్పనిక జగత్తులో, లేదా భావలోకంలో విహరిస్తున్నట్లు వ్యవహరించేవాడు. "ఆ అబ్బాయి గృహస్థజీవితం గడుపుతూ చాలామందిని యోగసాధన వైపు ఆకర్షిస్తాడు. అతను  నా నీడలోనే జీవితమంతా తన అంతర్ జ్యోతిని ప్రసరింపజేస్తూ ఉంటాడు" అని శివస్వరూపుడగు ఒక జటాధారియగు సన్యాసి, ఆబాలుని తన వడిలో కూర్చోబెట్టుకొన్న తల్లితో చెప్పినట్లు చెబుతారు.
కాలాంతరములో వారి తల్లి మరణము, వారి ఇల్లు వరదపాలు కావడము, వారి తండ్రికి కాశీ తో అనుబంధము పెరగడమూ, వారి అన్న కాశీలో ఇంటినికొనటమూ ఆయనను కాశీవాసిని చేసింది.
ఈ విధముగా శ్యామాచరణులవారి విద్యాభ్యాసం వారణాశి లోని  గరుడేశ్వర్ మొహల్లాలో భూకైలాస రాజయిన జయనారాయణ ఘోషాల్ స్థాపించిన జయనారాయణ ఇంగ్లీషు పాఠశాలతో మొదలైంది. ఆయన ఇంగ్లీషు, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలే కాక ఫార్సిభాష కూడా నేర్చుకున్నారు. ఇంతేకాకుండా, నాగాభట్టనే మహారాష్ట్ర శాస్త్రపండితుని సన్నిధిలో సంస్కృతంతో బాటు వేదం, ఉపనిషత్తులు మొదలయిన శాస్త్రగ్రంధాలు ధార్మిక గ్రంధాలు అధ్యయనం చేశారు. కాలేజీలో చదువుతుండే రోజుల్లోనే 18 వ ఏట అంటే క్రీ . శ . 1846 లో శ్యామాచరణులకు మంచి నిష్టాపరులయిన బ్రాహ్మణులు, కాశీలోని పండితుల్లో మంచి పేరుప్రతిష్టలు కలిగిన మరియు గౌర్ మోహన్ గారికి మంచి స్నేహితులు అయిన దేవనారాయణ సన్యాల్ వాచస్పతి గారి కూతురు కాశీమణి తో వివాహమైంది.
క్రి. శ. 1851 లో 23 ఏళ్ల వయస్సులో శ్యామాచరణులు గాజీపూర్ లో పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు వారి మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్ లో గుమస్తాగా చేరినారు. ఆ రోజుల్లో సైన్యానికి ఆహార సామాగ్రి సరఫరా చేయడం, రోడ్లువంటివి నిర్మించడం ఈ శాఖ చేసే ముఖ్యమైన పనులు. ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగము కాబట్టి ఎన్నో ఊర్లకు వారు Transfer అగుట జరిగింది. సర్వీసు చివరి రోజుల్లో ఆయన బేరక్ మాస్టర్ ( barrack-master, ఈ రోజుల్లో Sub Divisional Officer అంటారేమో! ) పదవిలో ఉండేవారు.
క్రీ. శ. 1868 నవంబర్ 23 వ తేదీన, శ్యామాచరణులవారు రాణిఖేత్ కు బదిలీ చేస్తూ ఉత్తరువు వచ్చింది. నవంబర్ 27 న శ్యామాచరణులు భారత దేశము యొక్క  ఉత్తర దిక్కున హిమాలయాల ఒడిలో 5980 అడుగుల ఎత్తున ఉన్న రాణిఖేత్ కు బదిలీ కావటం జరిగింది.  ఒక రోజున వారు సాయుధులయిన సిపాయిలను, నౌకర్లను వెంటబెట్టుకొని జనసంచారం లేని ఆ కొండప్రాంతములో వెళ్తూ ఉండగా... ఒక సన్యాసి తమను పేరు పెట్టి పిలుస్తున్నట్టు వారికి వినిపించింది. ఆయన ఆగి అటుఇటు చూస్తుంటే, ఆ సన్యాసి కొండ దిగి వచ్చి "నువ్వు ఈ దారిలో వస్తావని నాకు తెలుసు. అందుకే నీకొరకు ఎదురుచూస్తూన్నా, నీవు ఆఫీసు పనులు శీఘ్రముగా పూర్తిచేసుకోని నా కుటీరమునకురా, నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను." అని చెప్పి  దూరంగా కొండ మీదున్న కుటీరాన్ని చూపిస్తూ అచటికి వెళ్లిపోయినారు. శ్యామాచరణులు ఆఫీసుపని తొందరగా ముగించుకొని ఆయన వద్దకు పోయినారు.


     అక్కడ ఆయన     "శ్యామా! దగ్గరికిరా! నన్ను నువ్వు గుర్తుపట్టినావా?" అని అడిగినారు. అక్కడే వున్న వేరొకజత  పులి చర్మమూ కమండలమూ  చూపించి, "వీటిని కూడా గుర్తుపట్టగలవా? అని  శ్యామాచరణులను స్పృశించినారు దాంతో లాహిరీవారికి  పూర్వజన్మలోని ఆ బాబాను గురువుగా నెంచి తాను చేసిన సాధన గుర్తుకు వచ్చింది. తరువాతికాలములో ఈ బాబా గారిని మహావతార్ బాబాగా జనులు పిలిచేవారు. ఆ మహనీయుడే  పూర్వజన్మలో తమ గురుదేవులని అర్ధమయిపోయింది లాహిరీ మహాశయులకు. “నీకిపుడు గత జన్మ గుర్తుకొచ్చినది కదా! నీకు యోగదీక్ష ఇవ్వడానికి తగిన సమయమాసన్నమైనదని తలచియే  నేను నిన్నిచటికి బదిలీ చేయించినాను” అని తెలిపి లాహిరీగారికి  యోగదీక్ష నొసంగినారు మహావతార్ బాబా గారు. దానిని క్రియాయోగము అంటారు. (సినీ నటుడు రజనీకాంత్ హిమసలయాలకు ఈ బాబాగారి ఆశ్రమానికే వెళుతూ ఉంటాడు అని అంటారు.)
శ్యామాచరణులు వారిని బాబాజీ అని పిలుస్తూండేవారు. బాబాజీ ఒక రోజు శిష్యునితో నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయింది, నీవు వెనుకకు వెళ్లి .  ఒక యోగి గృహస్థుగానే ఉంటూ కఠోరయోగసాధన చేస్తూ పరమాత్మను పొందవచ్చునన్న అమోఘమైన ఆదర్శాన్ని నెలకొల్పవలసివున్నది. మోక్షసాధనకై అర్రులు సాచే సద్గృహస్తులందరికి  ముక్తి మార్గము చూపించు అన్నారు.  కొద్దిరోజులకే శ్యామాచరణుల వారికి బదిలీ అయ్యింది. క్రీ. శ. 1869 జనవరి 15 వ తేదీన ఈ యోగసాధనను అందరికి ఉపదేశించడానికి గురుదేవుల అనుమతిని తీసుకొని స్వస్థలమునకు బయలుదేరినారు.

ఇక ఆయన మహాత్మ్యమును గూర్చి కాస్త తెలుసుకొందాము. ఒకసారి అంగ్లేయుడగు తన పైఅదికారి యొక్క భార్య ఇంగ్లాండులో  జబ్బుతో  బతకడమే కష్టమైన పరిస్థితిలో పడి ఉందని తెలిసి చింతాగ్రస్తులయి వుండుట లాహిరీ మహాశయులు గమనించినారు. కరుణా హృదయుడగు ఆయన వెంటనే ఆఫీసులోనే ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ధ్యానమగ్నులైనారు. కొద్దిసేపు తరువాత బయటికి వచ్చి, దొరసాని గారి ఆరోగ్యం బాగుపడిందని త్వరలో అక్కడినుండి ఉత్తరము వస్తుందనితెలుపుతూ అందు ఉండబోయే వివరాలుకూడా తెలియజేసినారు.  కొన్నాళ్ళతరువాత ఆ దొర తన భార్య వద్దనుండి వచ్చిన  ఉత్తరము చూస్తే అందులో అన్నీ శ్యామాచరణులు చెప్పినరీతిగానే ఉన్నాయి. కొన్ని నెలల తరువాత ఆ దొరగారి భార్య ఇంగ్లాండ్ నుండి రావడము సంభవించింది. ఒకనాడు ఆవిడ తన భర్తను కలుసుకొనుటకు ఆఫీసుకు వచ్చి అక్కడ శ్యామాచరణులను చూసి నిర్ఘాతపోయింది. తాను జబ్బులో ఉన్నప్పుడు ఈయనే తన మంచము వద్ద  నిలచి తనకు బాగవుతుందనిచెప్పి  అంతర్దానము అయినారని దొరగారికి చెప్పింది. ఈవిధమగు మహిమలు (అని చెప్పవచ్చునోలేదో!) శ్యామాచరణులు ఎన్నో మార్లు ప్రకటించినారు.
          ఒకానొక సందర్భంలో మౌనియగు త్రైలింగస్వామి ( వీరు తెలుగు వారు, వీరు సాక్షాత్తు, కాశీలో సజీవంగా సంచరించే విశ్వనాథులుగా పేరు పొందినవారు. ఈయన 300 సంవత్సరములు జీవించినారు. వీరిని గూర్చి రెండు మూడు సంవత్సరముల క్రితము విపులముగా వ్రాసియుండినాను.) లాహిరీ వారిని గూర్చి "దేన్ని పొందడానికి సాధువులు సన్యాసులు గోచిగుడ్డతో సహా అన్నీ త్యాగం చెయ్యవలసి వస్తుందో దాన్ని ఈ మహాత్ముడు, గృహస్థాశ్రమంలోనే ఉండి పొందినాడు". అని ఒక పలకమీద రాసి చూపించినారు.  శ్యామాచరణులు ప్రచారానికి విముఖులు. ఎవరయినా శిష్యవర్గములో ఆ ప్రస్తాపన తెస్తే "సూర్యోదయము తెల్పుటకు దండోరా అవసరమా?" అనేవారు.
   యోగిరాజులు స్వయంగా అనేక మందికి యోగక్రియప్రదానం చేస్తూ, ఆత్మోన్నతిమార్గంలో ప్రగతి సాధించడానికి వాళ్ళకు ప్రేరణ ఇస్తుండేవారు. వారు ఎంతమందికి దీక్షాప్రదానం చేసినారో చెప్ప వీలు లేదు.  విఖ్యాత యోగులుగా పెరెన్నికగన్నవారిలో యోగిరాజుల కుమారులు - ఋషికల్పులు - తీన్ కౌడీ లాహిరీ, దుకౌడీ లాహిరీ, పంచానన భట్టాచార్య, స్వామి ప్రణవానంద గిరి, స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి (శ్రీ పరమహంస యోగానంద గారి గురువు గారు), భూపేంద్రనాథ్ సన్యాల్ మొదలగువారు వున్నారు. ఆయన గొప్పదనమేమిటంటే నేటి బాబాలవలె Money Order దర్శనాలు ఆయనవద్ద ఉండేవి కావు. ఆయన అడుగు, బడుగు ప్రజలకెందరికో  యోగక్రియ నేర్పిన మహనీయుడు.
వీరు కుటుంబ వ్యవస్థలో ఉంటూ, ఉద్యోగం చేస్తూనే భార్యాపిల్లలను గమనించుకుంటూ, పెళ్లిళ్లు చేస్తూ పూర్తిగా సంసారాన్ని బాధ్యతతో నిర్వహిస్తూ ఉదయం, సాయంత్రం, సెలవు దినాలలో  క్రియా యోగమును బోధించినవారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం తక్క మిగిలిన సమయమంతా సాధనకు, బోధనకు ఉపయోగించినారు. సాధారణంగా రాత్రిళ్లు సాధన చేసేవారు. ఇచ్ఛా మరణాన్ని పొందినవారు - జీవన్ముక్తులు. అనితరసాధ్యమైన యోగ సిద్ధి పొందిన మహనీయుడు యోగిరాజు లాహిరి. ఈయన ఉద్యోగ బదిలీలలో  తప్పించి పరమపదించే వరకూ కాశీ మహాక్షేత్రంలో నివసించినారు. 1872లో షిర్డీబాబా లాహిరీ మహాశయుల నుండే క్రియా యోగ దీక్షను స్వీకరించినారని లాహిరీ మహాశయుల జీవిత చరిత్రలో వ్రాయబడివుంది.

‘లాహిరీజీ’ ముఖ్య శిష్యులు యుక్తేశ్వర్‌గిరి. వీరు తమ భార్య మరణించేవరకు గృహస్థాశ్రమంలో ఉండి ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించినవారు. కలకత్తాలోని దక్షిణేశ్వరంలోనూ, పూరీలోనూ వీరి ఆశ్రమాలున్నాయి. పూరీలోనే వీరు మహా సమాధి చేయబడ్డారు. యుక్తేశ్వర్‌గిరిగారి ముఖ్య శిష్యులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక యోగి ఆత్మకథ పుస్తక రచయిత పరమహంస యోగానంద.
యోగానందులు ఈ క్రియా యోగమును విశధీకరిస్తూ, "క్రియా యోగి తన ప్రాణశక్తిని, వెన్నుబాములోని అరు కేంద్రాల్ని (ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన, మూలాధారాలనే షట్చక్రాలను) చుట్టి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశించగల శక్తిమంతుడు. ఈ క్రియకు పట్టే అర నిముసము, ఒక సంవత్సరంలో జరిగే ప్రకృతిసహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానము" అని అన్నారు.
ఇట్టి వారిని మనము మహాపురుషులు అని అనవలెను. సిరి సంపద మంది మార్బలము, అధికారము, అహంకారము ఏదీ ఆశించక నిష్కాములై  ప్రజలయోక్క ఆధ్యాత్మిక వికాసమునకై జీవితమును ధారపోసినారు. నేడు మనము గమనించే ప్రపంచములో ఇటువంటివారిని గాంచుట గోలీలాట కాదని నా ఉద్దేశ్యము. గోలీలాట అన్న మాట ఎందుకు ఉపయోగించినానంటే అదికూడా ఇట్టి మహాత్ములవలేనే కనుమరుగైపోయింది.
స్వస్తి.

Saturday, 28 July 2018

కౌపీన సంరక్షణార్థం…


కౌపీన సంరక్షణార్థం
సంసారము ‘ఛీ’ సన్యాసము ‘సైఁ’
అని తలంచెనొక సంసారి
ఆలుపిల్లలను ఇంటిని వదలి
అడవి దారి బడె కౌపీనముతో
సగముదారి తా బోయిన పిమ్మట
ఇంకొక గోచియు అవసరమనుకొనె
ఇల్లుజేరి వేరొక్కటి గైకొని
అడవి జేరె నతడాత్రముగా
మొదటిరోజు తా గడిపిన పిమ్మట
వలనుగ కుటీరమవసరమనుకొని
అడవి కట్టెలకు వచ్చిన వారిని
అడిగి సహాయము, నిర్మించె
ఏటి స్నానమును జేసిన పిమ్మట
తడి గోచిని తన ఇంటివద్ద తా
నారవేసి వేరొక్కటి కట్టెను
దైనందిన సద్విధులకు నై
ఒకనాడొక చిట్టెలుక వచ్చి యా
కౌపీనమ్మును కొరికె కొద్దిగా
చింతించిన యా తాపసి యంతట
బిడాలమొక్కటి బిరబిర తెచ్చి
పెంచగనుంచెను పర్ణశాలలో
అప్పుడాతనికి అర్థంబాయెను
పిల్లికి వలయును క్షీరమటంచును
పాల కొరకు ఒక ఆవును తెచ్చెను
ఆవు గడ్డికై భూమిని దున్నెను
నాట్లు వేసి పంటలు పండించెను
పిల్లి త్రాగగా మిగిలిన పాలను
అమ్మదలచె నాసన్యాసంతట
అడవికి వచ్చిన అబ్బాయొకనిని
ఆందుకొరకు తా వినియోగించెను
పంటల దిగుబడి ఎక్కువ కాగా
ధాన్యాదుల తానమ్మసాగెను
రాను రాను వడి రాబడి పెరుగగ
వ్యవసాయమ్మును ఇంకా పెంచెను
సన్యాసమ్మును నదిలో వదలుచు
సంపద మార్గముననుసరించెను
అతనిజాడ తా వెదకుచు సతియూ
సంతానముతో అతనిని జేరెను
బ్రహ్మచర్యమతి దుర్భరమనుచూ
సంసారంమును చేరదీసెను
ఒకనాడంతట ఒక్క విలేఖరి
ఆతని కడజని అడిగె నిటు
అయ్యా తెలుపుము ఫ్రిజ్జీ టీవీ
గ్యాసు గొయ్యి మరి ఆపై పొయ్యి
భార్యాపిల్లలు సిరులూ సంపద
కలిగినదా సన్యాసమ్మంటే
అంతట ఆతను బదులు పల్కెనిటు
కౌపీనార్థము పటాటోపమిది
సంసారము సైఁయని నేనెరిగితి
దేశమంతటిని జంటల జేసెద
పుట్టగోచి కథ జనులకు తెల్పగ
పుట్టించెదనొక పార్టీనిప్పుడు
ఎన్నిక గుర్తును పుట్టగోచిగా
ఎంచుచు నిలిచెద నేనెన్నికలో
దేశమెల్ల సంసారుల నింపుచు
సన్యాసుల లేకుండ జేసెదను
గోచిపాత నా గొప్పకు మూలము
దరిద్రానికది శివుని త్రిశూలము
అందులకే నే నిర్ణయించితిని
గోచిపాత నా పార్టీ పేరు
గోచిపాత నా పార్టీ జెండా
గోచిపాత నా పార్టి ఎజెండా
గోచిపాత మహరాజను పేరును
దిక్కుల చాటుచు దేశమునేలెద
పెంచివేయుచూ నా సిరిసంపద
ఫోర్బ్స్ లిస్టులో లో ఫస్టున వుండెద
బిల్లు గేట్సుతో వియ్యమునందెద

Friday, 27 July 2018

దివినుండి భువికి ... (గుర్రం జాషువా గారు )


దివినుండి భువికి ...

కవిత్వము, చక్కటి కావితా వస్తువు, మబ్బులేని ఆకాశము వంటి భావము,భావమునకు వలసిన భాష కలిస్తే జాషువా కవిత్వమౌతుంది. అటువంటి లబ్ధ ప్రతిష్ఠుల కవిత్వము చదివితే అవి మన కవితలకు దిశా నిర్దేశము చేస్తాయి.
ఆయన పెద్ద పెద్ద పదములు వాడగలడు. కానీ భావానికి తగిన భాష నే వాడుట ఆయన గొప్పతనము.పెద్దల, ఆధునికులే కానీగాక, కవిత్వము చదవండి, ఆకళింపు చేసుకోండి, ఆపైన వ్రాయండి. ఎంతో సృజనాసక్తి,సృజనాశక్తి కలిగినవారు ఈ తరము వారు . భాష పై పట్టు ఒక్కటే వారికి కావలసింది. పసిబాలుని లీలలు, బోసి నవ్వులు... ఎవరికి ఇష్టం ఉండవు ? మచ్చునకు గుఱ్ఱం జాషువా గారు అలతి పదాలతో అందమైన పోలికలతో వ్రాసిన  ఈ పద్య చూడండి...
గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు                                                 
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

Sunday, 15 July 2018

Dr. కటింగ్ - మునగ


Dr. కటింగ్ - మునగ












https://cherukurammohan.blogspot.com/2018/07/dr.html
అనగా అనగా ఒక మునగ
తినగా తినగా తెలిసెనుగ
సుఖముగ మనమంతా మనగ
మేనికి మేలౌనది కనగ
పెద్దల సలహా నే వినగ
తింటిని అంటిని అది కనగ
దేవుని వరమే కనుగొనగ
ఒసగెను మన పెన్నిధి అనగ

కల్పవృక్షమది ఒకటే చూడగ
కలిగె, నాకమున కోర్కెలు తీర్చగ
ఎంతో దయతో విధి మనకొసగెను
మన రక్షణకై భువిపై పొసగెను
ఎన్నో కామిత భూరుహమ్ములు
కాంచినచో అవి కరుణాకరములు
అందున మునగది ప్రముఖస్థానము
దానికి వేరింకేదీ తులనము

స్వాస్థ్య గృహమ్మున కిదియగు దూలము
రేజీకటితో చేయును ఆలము
బిపి షుగరున కిదియగు శూలము
ఆల్జీమర్సునకిది యాభీలము
మన పూర్వీకులు వేసిరి గాలము
అందుకె అది మన భోజన మూలము
ఇదేమిటబ్బా శీర్షికలో Dr. కటింగ్స్ అని వుంది. కటింగ్స్ కు మునగ కు సంబంధమేమి అన్న సందేహము ఈపాటికే మీకు కలిగి వుంటుంది. ఆ విషయానికే వస్తున్నాను. ఇంచుమించుగా 195౦ నుండి 1985 వరకు కడప జిల్లా జమ్మలమడుగు లోని ‘Church Of South India’ వారి ‘CAMP BELL HOSPITAL’ తమిళనాడులోని వెల్లూరు ‘CSI Hospital’ తరువాత అంతటి పేరు గాంచిన ఘనత ఈ ఆసుపత్రిదే! చికిత్స
కొరకై ఈ HOSPITAL కు కడప జిల్లాలో ముఖ్యపట్టణములగు కడప, ప్రొద్దటూరు, లనుండియే కాకుండా ఆ జిల్లా యొక్క అన్ని తాలూకాలనుండి మరియు పొరుగు జిల్లాలనుండి కూడా వచ్చేవారు. దీనిని పెట్టినపుడు మాత్రము ‘Church of South India’ వారు మతాంతరీకరణను మనసులో పెట్టుకొనే ఏర్పాటుచేసినారు, కానీ England నుండి వచ్చిన Dr. సోమర్వెల్ గారు Dr. కటింగ్స్ గారు ఆ చికిత్సాలయమునకు వచ్చినవారెవరికయినా నిస్వార్థముగా సేవ జేసినారు. సోమర్వెల్ గారు గొప్ప Surgeon. ఆయన వయసు మీదబడి తన దేశమునకు పోయిన తరువాత Dr. కటింగ్స్ అక్కడికి వచ్చినారు.
ఈయన ఎన్నో విభాగములలో కృషిచేసి పట్టాలను సాధించినా ఎక్కువగా పిల్లల ఆరోగ్యముపై మక్కువ చూపేవారు. ఆరోగ్యము బాగాలేని పిల్లలతో తల్లులు వస్తే, ఆ పిల్లలకు మూతి, ముక్కు తుడిచేటందుకు గుడ్డ పెట్టుకొని స్వయముగా తుడిచేవాడు. ఆ కాలములోనే తనవద్దకు పిల్లలతో వచ్చిన తల్లులకు ఉడకబెట్టిన మునగాకు రసములో బెల్లము కలిపి రోజూ ఇవ్వమని చెప్పేవాడు. అది గమనించిన నేను ఒక రోజు ఆయనను అందులోని గొప్పదనమేమిటని అడిగినాను. అందులో అనేక లణములు (Minerals) విటమిన్-సి మరియు ఇంకా ఎన్నో పోషక  విలువలు మునగ కలిగియున్నదని చెప్పినారు. నేను సందేహము తీరక Dr. సువీన నరసింహులు గారిని అడిగితే వారు కాయలు, పూత, ఆకు, బెరడు, చివరకు వేర్లుకూడా మంచివి. ఇవి అన్నీ ఆయుర్వేద ఔషధముల తయారీలో వాడుతారు అని చెప్పియుండినారు. నా దృష్టిలో ఆయన చాలా గొప్ప ఆయుర్వేద వైద్యులు. ఆయన మా పిన్నమ్మ గారికి ‘తెల్లబట్ట’ అవుతూ వుండి  ఆమెను Allopathi Doctors కు చూపిస్తే అది Cancer కు తిరుగుతుంది. తగిన మందులు Allopathi లో లేవు అని పెదవి విరచినారు. నేను డాక్టర్ నరసింహులు గారితో చెబితే నా వద్దకు పిలుచుకు రండి అని చెబితే పిలుచుకు పోయినాను. ఆయన తనవద్ద నుండే మందులనే ఇచ్చి బియ్యము కడుగు నీటితో అవి తీసుకొమ్మని చెప్పినారు. మంత్రము వేసినట్లు ఆ వ్యాధి మాయమయిపోయినది. మరి పెద్ద డాక్టరులే పెదవి విరువగా ఆ మహానుభావుడు నాతో కానీ ఖర్చు చేయించకుండా బాగు చేసినాడు. వీరు ఆ కాలముననే తమ పూర్వుల నుండి తెలుసుకొన్నది, తాము వైద్య గ్రంధములద్వారా తెలుసుకోన్నదీ కలిపి చికిత్స చేసినారు. మరి ఈ విజ్ఞానమునకు మూలము మనము కనుగొన సాధ్యమా!
ఇక కటింగ్స్ గారితో నా అనుభవమును గూర్చి తెలిపి ‘మునగ’ ను గూర్చి తెలియజేస్తాను.
కడప జిల్లా జమ్మలమడుగులో Campbell Hospital కు వెల్లూరు CSI Hospital తరువాత అంతటి పేరు ఉండేది. Dr. కటింగ్ గారు అందులో ఒక ప్రముఖమైన డాక్టరు. Hospital కు పోతే నేను ఆయన వద్దకు నేరుగా పోయినట్లు Bank కి వస్తే నా వద్దకే వచ్చేవారు. తాను పెద్ద దాక్ట రునని, అప్పుడు నేను కేవలము గుమాస్తానని, తెలిసి కూడా! Manager వద్దకు పోయేవారు కాదు. ఒకసారి మా మామగారికి అంటే నా భార్య తండ్రిగారికి తీవ్రమయిన వ్యాధి వస్తే, వారిని మా అత్తగారు ప్రోద్దటూరు నుండి Jeep లో తీసుకొని వస్తే ఆయనను Camp Bell Hospital లో చేర్చి కటింగ్స్ గారి పర్యవేక్షణలో ఉంచినాను. ఆయనకు బాగుచేసి పంపిన తరువాత కొన్ని రోజులకు వ్యాధి తిరుగాదోడుతచే ఆయనను తిరిగీ పిలుచుకరావలసి వచ్చింది. అప్పటికి సాయంకాలము 6.30 అయి వుంటుంది.జమ్మలమడుగులో Rikshwa లు లేవు, నాకు Cycle లేదు. కాబట్టి దూరమయినా నడచి పోయి కటింగ్స్ గారిని కలిసి విషయము చెప్పి, తరువాతి రోజు Admit చేస్తానని చెప్పినాను. ఆయన స్థానికులతో తెలుగు లోనే మాట్లాడుతాడు. ఆంగ్లేయుడైనా ఆంగ్లములో మాట్లాడడు. ఆయన మందులు వ్రాసి యిచ్చి ఈ రోజు ఎందుకు చేర్చకూడదు అని నన్నడిగి ఓహో! ఈ రోజు అష్టమి అగుటచే చేర్చుట లేదా! అన్నారు. నేను తలవంచుకొని వుండిపోయినాను.  తరువాతి రోజు చేర్చినాను. ఆయన 3,4 రోజులు చూసినతరువాత లాభము లేదన్నాడు. మా మామగారిని ప్రొద్దటూరుకు పిలుచుకపోవుట జరిగింది. ఆతరువాత కొన్నిరోజులకు ఆయన పరమపదమునందినారు.
కటింగ్స్ గారు కాలాంతరములో బ్రిటన్ వెళ్ళిపోయినారు. WHO (UNITED NATIONS) లో BOARD OF DOCTORS లో ఒకరిగా కొంత కాలము వారు పని చేసినట్లుగా విన్నాను కానీ మళ్ళీ ఎప్పుడూ చూడలేదు.  ఈనాడు మునగ కాయను గూర్చి మాట్లాడు కొంటున్నాము కానీ ఆనాటికే అంటే ఇప్పటికి 50 సంవత్సరముల క్రితమే ఈ చెట్టు గొప్పదనమును గూర్చి చదువు రాని వాళ్ళకు నచ్చజెప్పి చైతన్యవంతులనుచేయుట ఒక గొప్పదనమైతే, మన సంస్కృతిని కూడా తెలుసుకొని, అష్టమి మంచి రోజుగా తలవరు అన్నవిషయమును తెలియజేసినాడే ఎంతటి ఉన్నత మనస్కుడని, మన పంచాంగము పై కూడా ఎంత శ్రద్ధగల వాడని చెప్పుకోవలసి వస్తుందో చూడండి. అటువంటివారు జీవితములో అతి తక్కువగా తారసపడుతారు.

మునగ 

మునగ యొక్క శాస్త్రీయ నామము  Moringa oleifera. ఈ మోరింగా అన్నది తమిళము లోని ‘మురుంగ్ కాయ్’ నుండి వచ్చింది. తమిళము అజన్తము కాదు కాబట్టి ‘కాయ’ అన్న తెలుగు పదము ‘కాయ్’ అయ్యింది. అదేవిధముగా ‘మునగ’ అన్న మాట కృతకమై  ‘ మురుంగ్’ అయ్యింది. ఆంగ్లేయుల ముఖ్య స్థావరములలో నాటి సంయుక్త  ‘మద్రాసు’ కూడా ఒకటి. అందుచేత తమిళములోనికి చేరిన   అనేక తెలుగు పదాలు, తమిళము ద్వారా ఆంగ్లము లోనికి ప్రవేశించుట జరిగినది. ఈ చెట్టును 5౦౦౦ సంవత్సరముల పూర్వము నుండియే వాడుచున్నట్లు దాఖలాలు కనబడుచున్నవి.

‘ఇంటికి ముందు మునగ వెనుక వేప పనికిరావు’ అన్న నానుడి తెలుగునాట అధిక ప్రచారములో వుంది. మొన్న ఈ సందేహమును నా మిత్రుడు నాగసుబ్బారెడ్డి వెలిబుచ్చినాడు. నేను వెంటనే తెలియదు అన్నాను కానీ ఆలోచించగా మదిలో ఈ ఊహ మెదిలింది. మునగ ఎంతో పెళుసైన చెట్టు. ఇంటికి ముందు ఉంటే ఇంటిలోనికి వచ్చిపోయే వారిపై, గాలికి, కొమ్మలు లేక చెట్టే విరిగిపడే ప్రమాదముంది. ‘మునగచెట్టు ఎక్కించవద్దు’ అన్న సామెతను ఎవరినైనా ఎక్కువగా పొగడుతూ వుంటే పొగడబడే వ్యక్తి అనుట కద్దు. అంటే నీవేమో ఆ పెళుసైన చేట్టెక్కిస్తున్నావు, ఆ ఎత్తునుండి పడితే కాళ్ళు చేతులు విరుచుకోనేది నేనే కదా! అన్న అర్థములో వాడుతారు. కావున ఇంటి ముందు అంటే తలవాకిట మునగ చెట్టు ప్రమాదకరము. అదేవిధముగా వేప కీటక నాశిని. ఇంటి వెనుక వుంటే ప్రయోజనము ఉండదు. ఇంటి ముందయితే నీడనే గాక ఎన్నో విధములగు రోగముల బారిన పడకుండా  కూడా  కాపాడుతుంది.

మునగ చెట్టు విషయానికొస్తే వైద్యంలో దాదాపు 300 విధములగు రోగములను బాగు చేయగల సామర్థ్యము దీనికున్నట్లు చెబుతారు. పోషకాహార లోపముచే వచ్చు వ్యాధుల నివారణకు వాడతారు. వ్యవసాయము, పాడిపరిశ్రమలో ఎరువుగా, కీటకనాశినిగా, ఉపయోగపడుతుంది. దీని ఆకులు తింటే పాడిపశువులు వేగంగా బరువుపెరగవచ్చు. పాడి దిగుబడికూడా ఇంచుమిన్న్చు 50 నుండి 65 శాతం పెరుగుతుందని అంచనా. 

సౌందర్య సాధనాలలోనూ, తోలు మరియు వస్త్ర, పరిశ్రమలలోనూ, 

వంటనూనెను తయారుచేయుటలోనూ  మునగ ఉపయోగించుతారు. అసలు ఎండిన మునగకట్టెలు ఒక మూరెడు పొడవున కోసి, కట్టకట్టి వీపు వెనకాల కట్టుకొని ఈత నేర్చుకొనుటకు ఉపయోగించుతారు.




తమిళనాడు, ఏపీ, తెలంగాణా, కర్ణాటక, ఒడిసాలతో పాటు హిమాలయా పర్వత పాదాల వద్ద ఈ చెట్లు లక్షల సంఖ్యలో సాగాగుచుండగా, ఘనా, మొజాంబిక్‌, నైజీరియా, కెన్యా, రువాండా, నైగర్‌, కంబోడియా, హైతీ, ఫిలిప్పీన్స్‌ మున్నగు ప్రపంచ దేశాలలోనూ మునగ పెరుగుతున్నది.

అత్యధికముగా పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా, కనీసం ఆషాఢంలోనైనా తినమన్నారు పెద్దలు. వైద్యులు తరచూ తినవలసిన ఆకు అని అంటున్నారు. ఆయుర్వేదములో మునగకు విశిష్ట స్థానం ఉంది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు. చెట్టు బెరడు, కాయ, లోపలి విత్తనాలు, పూవు, ఆకు, అన్నీ ఔషధీయ గుణములు కలిగి యున్నాయి.

 

మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి.. ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. యాంటాసిడ్‌గా మునగాకు గ్యాస్ట్రిక్‌ అల్సర్లను నయం చేస్తుంది. ఊబకాయం, మధుమేహానికి మంచి మందు. కేన్సర్‌ చికిత్సలోనూ దీని పాత్రను ఇపుడిపుడే అంచనా వేస్తున్నారు. కండరాల నొప్పి, క్షీణతకు తగిన మందు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల నిద్ర సరిగా పట్టేట్టు చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి, లివర్‌ సిరోసిస్ కు ఇది అద్భుతమైన మందు అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. 

200 మిల్లీ గ్రాముల మునగాకు పొడి తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ దాదాపు 40 శాతముు తగ్గుతుందని నిపుణులు చెబుతారు. ఇది లైంగిక సామర్థ్యం పెరగడానికి కూడా దోహదం చేస్తుందట. అసలీవిధముగా దీనిని  పరమౌషధముగా పరిగణించవచ్చును.మునగాకు ఎగుమతి ధర రూ.80/ కిలో గానూ, మునగవిత్తనాల ఎగుమతి ధర. రూ.500/కిలో గానూ

వున్నట్లు తెలియవస్తూ వుంది.

మునగాకు బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్‌ , పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం , క్యారట్‌ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌'సి', అరటి పండు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు.  ఆకు ఒకటే కాదు, మునగ చెట్టు బెరడు మునగ కాడలు, వానిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే, అదో ఔషధాల నిధి. దానిని అందించినాడావిధి.

మహిళలు రోజుకు 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలలపాటు సక్రమముగా తీసుకోవడం వలన 13.5 శాతం చక్కెర స్థాయి (Blood Sugar Level) తగ్గించవచ్చునని సైంటిస్ట్‌లు సూచిస్తున్నారు.
అలాగే ఐదు రకాల క్యాన్సర్‌లను నిరోధించే సత్తా ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయన సమాచారం.

ఏది ఏమయినా నేను అందించే సమాచారము తెలుసుకొనుటకు మాత్రమే.  వైద్యముగా వాడదలచినవారు వైద్యుల సలహాల మేరకే వాడేది.
మునగాకులలో పవర్‌ఫుల్‌ నియాంజిమినైన్‌ అనే యాంటీ క్యాన్సర్‌,
 యాంటీ ట్యూమర్‌ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు పేర్కొన్నట్లు వార్తలు. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా ఈ మునగాకు పొడి అరికట్టగలదట.
మునగాకులో ఎముకపుష్టికి తోడ్పడే కాల్షియం,
 గర్భిణులకు మేలు చేసే ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. పొట్టలో హానికారక క్రిములను తగ్గిస్తుంది. బాలింతలు తింటే పాలు పడతాయి.

మునగ భారత్‌లోనూ, అనేక ఆఫ్రికన్‌ దేశాల్లోనూ ఎదుగుతుంది. పశ్చిమదేశాల్లో కానరాదు. వీటిలోనూ భారత్‌ నుంచి వచ్చే మునగాకు శ్రేష్ఠమైనది. అందుకే- భారత్‌ నుంచి మునగ ఆకును అమెరికా, కెనడా, 

ఐరోపా దేశాలు, చైనా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో దీనికోసం ఎగబడుతున్నాయి. అక్కడ మునగాకు పొడికి చాలా డిమాండ్‌ ఉంది. 2015లో భారత్‌ నుంచి రూ 146 కోట్ల విలువైన మునగ ఆకులు ఆయా దేశాలకు ఎగుమతి అయినాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మునగాకు వ్యాపారం దాదాపు 27వేల కోట్లు, ఇంకో రెండేళ్ళలో ఇది రూ 47,500 కోట్లకు పెరగవచ్చు.

 

అమెరికాకు చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపినాయి. ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూవుంది. దాంతో మన దృష్టి కూడా అటు మళ్లింది. ‘న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌ గారు  మునగాకు ప్రాశస్త్యాన్ని ఎంతగానో చాటినారు. ఆయుర్వేద వైద్యులు కూడా ఎన్నో TV ఛానల్స్ లో మునగ ప్రాశస్తాన్ని గూర్చి ఎక్కువగా తెలియజేస్తూనే వున్నారు.

అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. 
ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి,
 ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకును తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే. 

మా బాల్యములో మా అమ్మమ్మ మునగాకు కూర ఎక్కువగా చేసేది. తినమని బలవంతమూ చేసేది. కళ్ళకు మంచిది అని మాతండ్రిగారు కూడా చెప్పేవారు.

కామెర్లు,
 కలరా బేదుల, బాధితుల బాధ చెప్పనలవి కాదు. ఒకటే దాహము. నీరసము. అప్పుడు రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయట. 
ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు,
 బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.

పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, తెల్లని పూలు కూడా ఔషధ నిధులే! పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది.

ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.


రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌,
 ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.
మునగాకు మనుషులకే కాదు,
 పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు. 
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు
 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు, ఇంటి అవసరాలకోసం ఇంటి వెనుక మునగను పెంచితే ఆరోగ్యమే మీ పెరట్లో ఉన్నట్లే!

స్వస్తి.

 

స్వస్తి.