Sunday, 15 April 2018

శిభక్తికి ప్రతిరూపమే అప్పయ్య దీక్షితులు

శిభక్తికి ప్రతిరూపమే అప్పయ్య దీక్షితులు

https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_15.html

అప్పయ్య దీక్షితుల వారు  తమిళనాడు నందలి  తిరువణ్ణామలై జిల్లా, పట్టు చీరలకు 

పేరుగాంచిన  అరణికి దగ్గరగా వున్న  అడయపాలెం అన్న ఊరియందు ప్రమాదీచ నామ 

సంవత్సరము ఆశ్వయుజ(అని విన్నాను) మాసము, కృష్ణ పక్షము ఉత్తరాభాద్ర నక్షత్రమున 

క్రీ.శ. 1520 లో  జన్మించినారు.  అప్పయ్య దీక్షితుల వారి పూర్వ నామము వినాయక 

సుబ్రహ్మణ్యం.  వీరితండ్రి  రంగారాజాధ్వరి. యజ్ఞ క్రతువులు చేసినవారిని ఆధ్వరి 

అంటారు. ఆధ్వరము  యజ్ఞము.  దీక్షితుల వారు విద్యాభ్యాసమును రామకవీంద్ర 

గురుముఖతః చేసినట్లు చెబుతారు.

వీరు శంకరాద్వైతమును త్రికరణ శుద్ధిగా అనుష్ఠించిన వారు. ఆయన చిత్తము మొత్తము 

పరమేశ్వర పాదయుగళికి అంకితము చేసిన మహాభక్తుడు. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ 

వేదాంతాది సకల శాస్త్రములకు ఆయన ఆటపట్టు. అద్వైతి కాబట్టి ఒకసారి వెంకటేశ్వర 

దర్శనార్ధమై ఆయన తిరుమల వెళ్ళినపుడు వేంకటేశ్వరుడు, లింగాకృతిలో దర్శనమిచ్చుట 

జరిగినదని చెబుతారు. అసలా విగ్రహము స్వయంభూ విగ్రహము. సకల దేవతానురూప సారము. బాల త్రిపుర సుందరిగా భావించి కొందరు భక్తులు బాలాజీ అంటారు. అసలు వెంకట అన్న పదము కాలాంతరములో చేరిన తమిళ పదము. మిగిలినది ఈశ్వర  శబ్దమే. ఆ విగ్రహమునకు నాగాభరణములు గలవు. ఆయనకు స్వామి అన్నపేరు కలదు. స్వామి అన్నపేరు ఒక్క సుబ్రహ్మణ్యునికి మాత్రమే కలదు. గురువారము నాడు అభిషేక 

సమయములో విగ్రహము యొక్క మూడవ కన్నును చూడవచ్చునని చూసిన అర్చకులు 

చెప్పేవారట. ఇక విష్ణు రూపుడు అనుటకు కూడా ఆధారాలు మనము చూస్తూ ఉన్నాము. 

ఒకానొక కాలములో ఈ విగ్రహమునకు 6 నెలలు శివునిగానూ 6 నెలలు విష్ణువుగానూ 

పూజ జరిగేదట. ఇక విగ్రహము యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడూ 110°ఉంటుందట. 

విగ్రహము వెనుకవైపు నీటి గలగలల శబ్దము చాలా ఎక్కువగా ఉంటుందట.ఇవన్నీ 

విగ్రహము యొక్క శివ తత్వమును తెలుపవా! అందుకే పరమ అ భక్తుడైన అప్పయ్య  

దీక్షితులగారికి వేంకటేశ్వరునిలో ఈశ్వరుడు కనిపించినాడు.

ఆయన తపస్సిద్ధి పొందిన మహనీయుడు. ఆయనకు కడుపునొప్పి విపరీతముగా 

వుండేది. అది ఆయన తపస్సాధనకు ఎంతో అంతరాయమును కలిగించేది. నైష్ఠిక  

బ్రాహ్మణులు జపానుష్ఠానాది సమయములలో తమ వద్ద ఒక తడి తుండుగుడ్డ 

పెట్టుకొంటారు. అప్పయ్యగారు కూడా ఆ విధముగానే ఒక తుండును వుంచుకొనేవారు. 

ఆయన తన యావత్తు జప సమయములో ఆ కడుపునొప్పిని ఆ తుండులోనికి 

ఆవాహనముజేసి తన దీక్షలో తానూ మునిగిపోయేవారు. ఆ సమయమంతా ఆ తుండు 

విపరీతముగా కంపించేది. ఈ ఉదంతము ఆయన సాధనకు తార్కాణము. ఆయన శివ 

భక్తి నిరుపమానము. వారిచే రచింపబడిన ఈ శ్లోకము అందుకు తార్కాణము. విద్యలలో 

వేదం విద్య ఉత్కృష్టమైనది. అందులో రుద్రములోని 11 వ అనువాకము శ్రేష్ఠము. 

అందులో పంచాక్షరి మిక్కిలి శ్రేష్ఠము, అందులో 'శివ' అన్న శబ్దము అత్యంతశ్రేష్ఠము.

ఈ భావమును అప్పయ్య దీక్షితులు గారు వ్రాసిన ఈ క్రింది శ్లోకము 

తెలియజేయుచున్నది.

విద్యాసు శ్రుతిరుత్కృ ష్టా రుద్రైకాదశిని శ్రుతౌI

తత్ర పంచాక్షరీ తస్యాం శివ ఇత్యక్షరద్వయంII

ఆయన అద్వైత తత్పరత ఒకసారి చూద్దాము.

మారమణ ముమారమాణం ఫణధరతల్పంఫణధరాకల్పం

ముర మధనం పుర మధనం వందే బాణారి మసమ భాణారిం

మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని

నవస్తూ భేదః ప్రతిపత్తి రస్తుమే తధాపిభక్తిః తరుణేందుశేఖరే  (అయ్యప్ప దీక్షితులు)

లక్ష్మీపతి యగు విష్ణువు సర్పము పై శయనించితే ఉమాపతి సర్పములనే

దేహముపై ధరించినాడు. హరి మురారి అయితే హరుడేమో పురారి. హరి

బాణాసురహర్త హరుడేమో మారుని సంహర్త (మారుడు=మన్మధుడు).

మహితాత్ములగు వారిరువురికీ నమస్కారము.

జగదధీశ్వరుడు మహేశ్వరుడు. జగదంతరాత్ముడు జనార్దనుడు. వస్తుతః

వారిరువురికీ భేదము లేనప్పటికీ నాకు తరుణేందు శేఖరునిపై తపము

సిద్ధిస్తూవుంది. ఒక మాట ఆయన పాండిత్యమును గూర్చి చెప్పుకొందాము.

అప్పయ్య దీక్షితులవారు మహా వేదాంతి మరియు పండితుడు. ఆయన ఎన్నో

రాజాస్థానములు తిరిగి ఆయా ఆస్థానముల దిగ్దంతులగు పండితులను తమ

అసమాన పాండితీ ప్రకర్షతో ఓడించి సన్మానములను అందుకొనేవారు. ఆ

ప్రకారంగా ఆయన ఒక పర్యాయము జింజి సంస్థానమును సందర్శించుట

తటస్తించినది. అక్కడ రాజు కొలువులో శ్రీనివాస దీక్షితులు అన్న మహాపండితుడు

ఉండేవాడు. ఆయనకు తనను మించిన పండితుడు లేడన్న నమ్మకమే కాక ఎన్నో

సంస్థానములు తిరిగి ఎందఱో పండితులనోడించిన అప్పయ్య దీక్షితులను ఓడించి

తన పాదములకు నమస్కరింప జేసుకొనవలెనను తపన తలమీద తాండవము

చేయుచుండెడిది. అవకాశము అందివచ్చినది కాబట్టి ఆయన వాగ్వాదమునకు

దీక్షితులవారితో తలపడినాడు. వాదములో రోజులు గడువగా తాను ఓటమికి

దగ్గరలోవున్నట్లు అర్థమైపోయింది శ్రీనివాస దీక్షితులవారికి. విషణ్ణవదనుడై 

అగమ్యగోచరునిగా అగుపించుచున్న శ్రీనివాస దీక్షితులకు మహారాజు చక్కని సలహా

ఇచ్చినాడు."మీరు మీ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లిచేయ దలచుచున్నారని నేను

చెబుతాను. ఆయన కాదనలేడు. పెళ్లి పూర్తయిన పిదప సతీసమేతముగా ఆయన

మీ పాదాలాంటి నమస్కరిస్తాడుకదా!" అని సలహా ఇచ్చినాడు. శ్రీనివాస దీక్షితులు

ఆవిధముగాజేసి తన గౌరవమును కాపాడుకొన్నాడు. అప్పయ్య దీక్షితులవారు

అంతటి ప్రతిభాశాలి.

ఒకసారి తమలోని శివభక్తిని పరీక్షించుకొనదలచి ఒక శిష్యుని పిలిచి దత్తూర ఫల

రసము అంటే ఉమ్మెత్తకాయ రసము (ఇది తాగిన వానిని ఉన్మత్తునిచేస్తుంది) ను

తెమ్మన్నాడు. శిష్యునికి ఈ విషయమును చెప్పి దాని విరుగుడు కూడా చేతికిచ్చి

ఫలరసము త్రాగి ఉన్మత్తుడైనాడు. ఆ రసము త్రాగినా త్రాగకున్నా అచంచలమైన

తన మనసు శివ పూజారతి విడువక శివునిపై ఏబది శ్లోకములను ఆశువుగా

చెప్పినాడు. అది నేటికీ భక్తజన రసనలపై ఉపలబ్ధము. పుస్తకరూపములో కూడా

నేటికాలమున లభించుచున్నది. దానిని 'ఉన్మత్త పంచశతి' యని  'ఆత్మార్పణస్తుతి'

అనీ అంటారు.

అది ముగిసిన వెంటనే విరుగుడు త్రావి తన సహజస్థితికి వచ్చి తృప్తిచెందినాడు, తానూ 

శివ ధ్యానము ఏ పరిస్థితిలోనూ వీడనందుకు ఎంతో సంతసించినాడు. మచ్చుకు 

అందులోని ఒక పద్యమును చిత్తగించండి.

అర్కద్రోణప్రభృతి కుసుమైః అర్చనంతే విధేయం I

ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీఃI

ఏతజ్ఞానన్నపి శివ శివ వ్యర్థయః కాలమాత్మా I

ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధః పతానిI

శివ శివా! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను. సులభముగా లభించే జిల్లేడు

తుమ్మి పూవులతో పూజలందుకొని భక్తులకు మోక్ష సామ్రాజ్య లక్ష్మిని

అనుగ్రహించుచున్నావు. ఈ సూక్ష్మమును మేము తెలుసుకోలేక కాలమును వ్యర్థము 

చేయుచున్నాము. ఆ మహనీయుని భక్తిభావము అమోఘము అద్భుతము

అసమానము.

 

అద్వైతిగా దీక్షితులవారు పరబ్రహ్మతత్వములో భేదమును చూడలేదు. శివవైష్ణవ

తారతమ్యమును పరిగణింపలేదు. కానీ వేదపురాణములకు గల వేర్వేరు

భాష్యములను ఖండించలేదు. దీక్షితులవారి మాటల్లో - "బ్రహ్మసూత్రములే వేర్వేరు

అర్థములను చూపినప్పుడు మనమెందుకు ఒకటిగా పరిగణింపవలెను"? అన్నారు. కానీ 

ఆయనకు త్రాసులోని ముల్లువలె కాసింత శివునిపై మక్కువ ఎక్కువ.

అందుకే ఈ క్రింది శ్లోకములో ఆయన  తానద్వైతియే అయినా కాస్త శివునిపై

మమకారము పెచ్చు అన్న అర్డుథములో ఈ శ్లోకమును చెప్పినాడు.

మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దానేవా జగదంతరాత్మనిI

నవస్తుభేడ ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరేII

కాంచీపురమందలి అదెహోల గ్రామమందు, పెనుగొండ వేంకటపతి రాయల

ఆస్థానంలోను, మధురానగర తిరుమ నాయకుని ఆస్థానంలోను, వెల్లూరు

చిన్నబొమ్మని ఆస్థానంలోను కొంతకాలం ఉన్నట్లు పండితుల అభిప్రాయం.

అప్పయ్యదీక్షితులు వెల్లూరి పాలకుడైన చిన్న బొమ్మరాజు ఆస్థానంలో ముప్ఫై

సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నో రచనలు చేయుట జరిగింది. ఒకసారి వేదాంత

దేశికుల రచనయైన యాదవాభ్యుదయానికి సరళ వ్యాఖ్య వ్రాయమని

చిన తిమ్మరాజు కోరగా ఆ పనిని పూర్తిచేసి రాజుగారి దగ్గర నుండి

గౌరవసన్మానాభిమానాన్ని పొందినారు.

ఈవిధంగా అప్పయ్య దీక్షితులు అద్వైతాచార్యునిగా ప్రజలకు బోధ చేస్తూ అనేక

గ్రంథాలను రచనచేస్తూ తనకు ఆస్థానంలో స్థానం ఇచ్చిన రాజులకు

మతాచారాల్లోను, రాజ్యవ్యవహారాల్లోను తగిన సలహాలు ఇస్తుండేవారు.  ‘మార్గ

బంధుస్తవం’ లాంటి రచనలు చేసి అటు భగవంతుని ఆశీర్వాదాన్ని ఇటు ప్రజల

అభిమానాన్ని ఇంకొక ప్రక్క రాజుగారి ఆదరణను  చూరగొన్న అప్పయ్య

దీక్షితులగొప్పదనమును గూర్చి ఎంత చెప్పినా తక్కువే.

ఈయన సుమారుగా 104 గ్రంథాలను వ్రాసినారని ప్రసిద్ధి. సిద్ధంత లేశ సంగ్రహం,

నయమంజరి, న్యాయరక్షామణి (బ్రహ్మసూత్ర భాష్యం), శివార్కమణి దీపిక

(శ్రీకంఠభాష్య వ్యాఖ్య), రత్నత్రయ పరీక్ష, శిఖరిణీమాల, మయుఖావళి,

విమతఖండనము, మధ్యతంత్రముఖ మర్దనము, మధ్వవిధ్వంసనము (వ్యాఖ్య),

యాదవాభ్యుదయ వ్యాఖ్య, హరివంశసార చరితావ్యాఖ్య రామాయణ సారస్తవము,

భారతతాత్పర్య సంగ్రహం, వృత్తివార్తికము, కువలయానందము, చిత్రమీమాంస

అనే వేదాంత, దార్శనిక కావ్య, అలంకార గ్రంథాలను వ్రాసిన శైవమతానుయాయి,

మహాపండితుడు, అప్పయ్యదీక్షితులు.

ఆయనకు ఆంధ్రము అంటే అత్యంత అభిమానము ,ప్రేమ గౌరవము. అందుకే

ఆయన   'ఆంధ్రస్య మాంధ్ర భాషాచ| నాల్పస్య తపసః ఫలం|| ' అని అన్నారు.

ఆంధ్రుడైపుట్టట గొప్ప అదృష్టము . ఆంద్ర భాష మాట్లాడగలగటం గొప్ప తపస్సు

‘’అని చెప్పిన  అప్పయ్య దీక్షితుల ను ’’పాపం పిచ్చివాడు ‘’అన్నారు పుట్టపర్తి

నారాయణాచార్యులవారు నేటి తెలుగుకున్న ప్రాముఖ్యాన్ని చూసి బాధ పడుతూ.

స్వస్తి.

1 comment:

  1. అయ్యా చాలా బాగా చెప్పారు. శ్రీ రామ జయం. కానీ శీర్షికలో అక్షర దోషమున్నది. సరిచేయగలరు ధన్యవాదాలు...

    ReplyDelete