Saturday, 14 April 2018

అమ్మవారి అగ్ని స్వరూపము – జ్వాలాముఖీ క్షేత్రము


అమ్మవారి అగ్ని స్వరూపము జ్వాలాముఖీ క్షేత్రము
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని కాంగడాా లోయకు 30 కిలోమీటర్ల దూరములో 'జ్వాలాముఖి దేవి' ఆలయము వెలసి యున్నది. ఇది 51 శక్తిపీఠములలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ ఆలయమును ఆ ప్ర్తాన్తములో 'జోతావాలీ మందిర్' అనీ 'నగర్ కోట్' అనుట కూడా కద్దు. విగ్రహము దుర్గా స్వరూపము.
సతీదేవి తానూ దక్షయజ్ఞములో ఆత్మాహుతి చేసుకొన్నపుడు  కొందరు ఈ శరీర శకలములు 18 చోట్ల పడినవి అని చెబితే కొందరు 51 అని అంటారు. ఆమె నాలుక ఈ క్షేత్రములో పడినట్లు చెబుతారు. మరి ఏవిధముగా వెదకినారో ఎందుకు వెదకినారో నేను చదువుట తటస్థించలేదు కానీ  ఈ ప్రాంతమును పాండవులు కనుగొన్నట్లు స్థానికులు చెబుతారు. ఈ మందిర ప్రాంతమునకు దగ్గరగా 'బాబా గోరా/ గోరఖ్  నాథ్' మందిరము కూడా వున్నది. ఈ పుణ్యపురుషునికి ఈ చుట్టుప్రక్కల ప్రాంతములలో భక్తులు ఎక్కువ.
అమ్మవారి గర్భగుడిలో  ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారైన భూమి చంద్ నకు  అమ్మవారు కలలో కనిపించి తన ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు  భగభగ మండుతున్న మంట మాత్రం తప్ప. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
ఇక ఈ జ్వాలాముఖి క్షేత్రమును గూర్చి చెప్పవలసివస్తే, ఆదిగా అమ్మవారికి రాజా భూమిచంద్  ఒక మందిరమును ఏర్పాటు చేయగా ఆ తరువాత చరిత్ర ప్రసిద్దుడగు సిఖ్ఖు రాజు 'రాజా రంజీత్ సింహ్ మరియు రాజా 'సంసార్ చంద్'  లు ఈ మందిర నిర్మాణమును సంపూర్ణము గావించినారు. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు ఈ తల్లిని తమ కులదేవతగా భావిస్తుంటారు. ఈ జ్వాలలు నిరంతరమూ అఖండముగా జ్వజ్వాలాయమానముగా వెలుగుతూ ఉండుట అందరినీ అబ్బురపరచే విషయము.
ఇక్కడ అమ్మవారి విగ్రహము వుండదు. కేవలము అగ్నిజ్వాలలు మాత్రమే!అని పైనే చెప్పుకొన్నాము. నాలుక పడుటచేత ఈ జ్వాలలు నాలుక చాస్తున్నట్లుగా  ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు.  మొగల్ చక్రవర్తి అక్బర్  ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా నిప్పును ఆర్పే ప్రయత్నం చేసినాడు కానీ పూర్తిగా విఫలుడై వెనుదిరిగినాడు.
ఇక్కడ మనకు తొమ్మిది అగ్నికీలలు అగుపించుతాయి. అవి 1. మహాకాళి  2. అన్నపూర్ణ  3. చండి 4. హింగలాజ 5. వింధ్యావాసిని 6. మహాలక్ష్మి 7. సరస్వతి 8. అంబిక  9 అంజీ దేవి గా వ్యవహరిపబడుతాయి.
ఒక గోపాలుడు తన ఆవు పాలు ఇవ్వక పోగా మిగతా ఆవులతో బాటూ మేయుట కూడా లేదని గ్రహించి దానిని వెెంబడించగా అది ఆ జ్వాలలో వున్న ఒక సుందరాంగికి తన స్థన్యమునిచ్చుటగమనించి రాజునకు తెలుపగా, అది వాస్తవమని తన భటుల ద్వారా నిర్ధారించుకొన్న భూమిచంద్ రాజుగారు అక్కడ అమ్మవారికి మందిరము నిర్మించుట జరుగుతుంది. ఈ మందిరములో 9 జ్వాలలూ మనకు వేరు వేరుగా దర్శనమిస్తాయి. మందిరమునకు బయట అక్బరు కట్టించిన కొలను మనకు ఇప్పటికీ సాక్షాత్కరిస్తుంది. అందలి నీటితోనే ఆ కీలలను ఆర్పుటకు తాను విశ్వప్రయత్నము చేసినాడట. ఈ దేవాలయములో నవరాత్రులను ఎంతో విశేషముగానూ వైభవముగానూ చేస్తారు. అమ్మవారి ఉదయము మొదలు శాయనిచే వరకు 5 ఆరతులు ఇస్తారు. శయన ఆరతికి భక్తులు క్రిక్కిరిసి యుంటారు.
దౌలాధర్ పర్వతాల దిగువన, ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గమున వుండే ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రమై వెలుగుతున్న అమ్మవారిని సందర్శించుకుని భక్తులు పునీతులవుతూ వుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తర ప్రదేశ్ లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాధ్ లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి.
పఠాన్ కోట్ నుండి ప్రత్యేకముగా రైలు మారండా వరకు పోతుంది. అక్కడనుండి బస్సు లేక కారు వసతులు మందిరము చేరుటకు కలవు. బస్సుమార్గమయితే దిల్లీ సీమ్లా, పఠాన్ కోట్ ల నుండి నేరుగా జ్వాలాముఖికే బస్సువసతి కలదు.
చిత్రవిచిత్రములయిన అనేకానేక భగవద్దర్శనీయ స్థలములు కలిగిన ఈ దేశములో పుట్టినందుకు ఆ పరమాత్మకు అంజలి ఘటించుదాము.
స్వస్తి.

No comments:

Post a Comment