Wednesday, 23 August 2023

త్రైలింగ స్వామి

https://cherukurammohan.blogspot.com/2023/08/blog-post_23.html

 మన తెలుగువాడై యుండికూడా తెలుగువారిచే అధికముగా గుర్తించబడని త్రైలింగ స్వామిని గూర్చి ఈ విశ్వనాథ జ్యోతిర్లింగము అన్న శీర్షిక క్రింద వ్రాయుట అసంగతముగా నేను అనుకోనుటలేదు. ఎందువల్ల అంటారేమో ఈయన , మహా మహిమాన్వితుడై , మహామహులచే మహానీయు డనిపించుకొని విశ్వనాథునిలో లీనమైన వారు.(సినిమాలలో చూపే విధముగా కాదు). వారి పాదదోయికి సాష్టాంగ ప్రణామముల నాచరించూదాము.

మనకు ప్రేమానంద తెలుసు, నిత్యానంద తెలుసు, బాలసాయి తెలుసు, అసారాం తెలుసు,పీర్ బాబా తెలుసు కానీ నిజమైన యోగుల గూర్చి తెలియదు. ఎందుకంటే ప్రచార సాధనాలకు కావలసిన మసాలాలు నిజాయితీ లో  వుండవు. ఒక స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి,స్వామి శివానంద,లాహిరీ మహాశయులు ఈ విధంగా చెప్పుకొంటూపోతే చేంతాడంత అయ్యే ఈ మహనీయుల గూర్చి మన వార్తా పత్రికలలో, దుర్దర్శనులలో(దూర దర్శనులలో) బహు తక్కువగా వింటాము. ఈ జాబితాలోఒక మహారత్నమే త్రైలింగ స్వామి. ఇప్పుడు, మన తెలుగు వాడయి వుండి మనలో ఎక్కువమందికి తెలియని,తెలిసినా తలువని,తలచినా  తెలుపని ఆ మహనీయుని గూర్చి తెలుసుకొందాము.

పుట్టింది తెలుగు నాట నయినా ,ఆయన జీవితములో అధిక శాతము కాశీ లోనే గడిచింది .ఆయన చూపించిన మహిమలు పొందిన సిద్దులు, దివ్య విభూతులు అనేకం,అపారం, అనంతం .ఆయన అసలు పేరు శివ రామయ్య. విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామము లో జన్మించినారు. తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి, సంపన్న బ్రాహ్మణ కుటుంబము. ఆయన జననం  19 -12 -1607   తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుండి ఐహిక వాంఛల  మీద కోరిక లేదు. నలభై ఏళ్ళకు తండ్రి, యాభై రెండో ఏట తల్లి చని పోవడం జరిగింది. శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళ దాకా గడిపి హటాత్తుగా స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో వున్న బస్తర్ చేరి అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్థానికి వెళ్ళి ఆయనతో సన్యాస దీక్ష గడించి గణపతి స్వామి అనే దీక్షా నామమును స్వీకరించినాడు. గురు సమక్షం లో పదేళ్ళు సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు. సిద్ధులు పొందిన కాలమునుండి ఆయన దిగంబరుడే! ఆయనకు అప్పుడు 78 సంవత్సరాలు వయసు. గురువు పరమపదించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరినాడు. అచ్చట ఆయన చూపిన  లీలలకు ఆశ్చర్య చకితులై ఆయనను అపర రామలింగేశ్వరుడేయని  కొనియాడినారు అక్కడివారు. అక్కడి నుండి నేపాల్ చేరి అక్కడ అడవి లో తపస్సు చేసుకొంటూవుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగా చేష్టలుడిగి కూర్చొని వుండి పోయింది. రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి  పులిని చంపటానికి ప్రయత్నిస్తే వలదన్నాడు ఆయన. నేపాల్ రాజుకు ఆవిషయము తెలుపగా ఆయన వచ్చి సాష్టాంగ దండ ప్రణామమునాచరించి అనేక కానుక లిస్తే వలదని  జంతు హింస చేయ వద్దన్న హితవు చెప్పి అక్కడి నుండి టిబెట్, తరువాత మానస సరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలము తపస్సు చేసి అటుపిమ్మట  నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ”ఖాఖీ బాబా”అనే అహోరాత్రాలు తపస్సు చేసే ఒక మహాయోగిని దర్శించినాడు. ఒక రోజు  తెల్లవారు ఝామున నర్మదా నది లో నీటికి బదులు పాలు ప్రవహిస్తున్నట్లు ఈయన దానిని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూసి ఆయన మహిమ ను గుర్తించడం జరిగింది. ఆవిషయము స్వామికి తెలిపితే తనను వదలి వెళ్ళిపోతాడని మిన్నకుండినాడు. అయినా ఈయన ఒక చోటునుండే వాడు కాదు గదా! 1733 లో  ప్రయాగ చేరినారు .తపో నిష్ఠలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పడవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్ఞ చేయడమే కాకుండా,అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే  . స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించినాడు. ఆశ్చర్య పడటము శిష్యుని  వంతైనది.

ఊరూరు తిరుగుతూ వీరు 1737 లో తన 130వ ఏట కాశీ చేరడము జరిగింది. 

అంతే! తాను, జీవాత్మను పరమాత్మ సాయుజ్యము చేర్చేవరకు అంటే 150 సంవత్సరములు కాశీ లోనే గడపడము జరిగింది. ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహము. గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరముతో దిశమొలతో. మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, బాన కడుపుతో కాశీ నగర వీధుల్లో సంచరించే వాడు. క్షురకులెవరైనా తనకు క్షురకర్మ చేస్తే చేయించుకొనేవాడు. గంటల కొలదీ గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు లేదంటే గంటల కొద్దీ నీటిలోనే మునిగియుండే వాడు. ప్రాణాయామమంటే శ్వాస నియంత్రణ. రేచక (గాలిని బయటికి వదలడం), పూరక (లోనికి పీల్చడం), కుంభక (లోపలి ప్రాణ వాయువును అలానే నిలిపి ఉంచడం ) హృదయాన్ని పరిపుష్టం చెయ్యడానికి, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేయడానికి ప్రాణాయామం ఉపకరిస్తుంది. ఇందులో ఆ మహనీయుడు పరాకాష్ట నందుకోగలిగినాడు కాబట్టి ఆయనకు ఆ విద్యలు సిద్ధించినాయి. కుష్టు రోగులకు సేవ చేసి వారిని ఆదరించినాడు స్వామి. వేద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతానాథ బంధోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరినాడు. కొంత కాలము తరువాత అక్కడినుండి దశాశ్వమేధ ఘాట్ కు తన మకామును మార్చినాడు ఆ మహనీయుడు.  ఒక మరాఠీగృహిణి రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తూ ఈ దిగంబర స్వామిని చూసి ఏవగించు కొనేది .ఆమె భర్తకు రాచపుండు. ఆవిడ శ్రేయోభిలాషులెందరో ఆమెను దిగంబరస్వామి శరణు వేడమన్నారు. తాను ఏవగించుకొనే వ్యక్తిని శరణు కోరడము ఆమెకు మింగుడు పడలేదు. భర్త వ్యాధి ముదర జొచ్చింది. గత్యంతరాలన్నీ తలుపులు మూసివేయడముతో స్వామిని శరణు కోరక తప్పలేదు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడింది. దయామయుడైన ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది.

కాశీ మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గావుండేవారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించినారు. వారు ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టినారు. తెనుగు దేశము అంటే త్రిలింగ దేశమే కదా! అప్పటి నుండి ఆయనకు ఆపేరే స్థిరపడి పోయినది. 1800  లో తన స్థావరమును దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవానికి మార్చినారు.

మిగిలినది మరొక మారు.....

త్రైలింగ స్వామీ - 2

ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు యోగ సమాధిలో ఉండటమే! అందుకే ఆయనను ”మౌన బాబా ”అన్నారు .ఆనోటా ఈనోటా స్వామివారి మహాత్మ్యము ప్రాకి కాశీ రాజును చేరింది. ఆయన గంగా నదిలో వున్నారని తెలిసి తన పడవలో ఆప్రాంతము చేరినారు. స్వామిని గుర్తించి పడవలోనికి సాదరముగా ఆహ్వానించినారు. స్వామి అందులో కూర్చున్న తరువాత వారితో ముచ్చటిస్తూ బ్రిటీషు వారు తన గొప్పదనమునకు బహుమతిగా ఇచ్చిన ఖడ్గమును స్వామికి చూపింప దలచి ఆయన చేతికందివ్వబోతే అది జారి గంగలో పడిపోయింది. వెంటనే అంత లోతుకు దిగి దానిని తెచ్చేవారు సులభముగా దొరకరుకదా! వారు వచ్చేవరకు కత్తి గంగలో వున్న చోటనే ఉండిపోవదు కదా! ఖిన్నుడయిన రాజును చూసి స్వామి పడవలో కూర్చొనియుంటూనే తన చేతిని గంగలోపలికి పోనివ్వజేసినాడు. ఆచేయి ఎంత లోతుకుపోయినదో మనకు తెలియదు కానీ అది బయటికి మాత్రం రెండు ఒకే విధమైన కత్తులతో వచ్చింది. తన కత్తిని తీసుకొమ్మని రాజును అడిగితే ఆయన అది గుర్తించలేకపోయినాడట. స్వామి రాజుకత్తిని రాజుకు ఇచ్చి రెండవ కత్తిని తిరిగీ గంగలో పారవేసినాడట.

దిగంబరంగా తిరగటం కొంత మందికి నచ్చక స్వామిపై  కేసు పెట్టినారు ఆయన గొప్పదనము తెలియని కొందరు మూర్ఖులు. కోర్టు లో కేసు నడిచింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని న్యాయాధీశుని ఉత్తరువు. రాజు తలచితే దెబ్బలకు కొదువా! స్వామిని తక్షణము న్యాయస్థానములో ప్రవేశ పెట్టినారు. ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివరించినా ఆయన పెడచెవిని పెట్టటము జరిగింది కారణము అతను ఆంగ్లేయుడు. స్వామి శుద్ధ శాఖాహారియని తెలిసిన ఆ న్యాయాధిపుడు  మాంసము స్వామి తింటే శిక్షించను అన్నాడు.  స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. జవాబు వచ్చేలోపలే  తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని ఆ మహానుభావుడు తినివేయుట జరిగినది. విడ్డూరమైన విషయము ఏమిటంటే  దుర్గంధమునకు బదులు సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. మతి పోయింది న్యాయాధీశునకు! స్వామి మహిమను గ్రహించిన న్యాయపతి వారు దిగంబరముగా తిరగవచ్చునన్న తీర్పును ఇచ్చివేయడము జరిగింది.

ఒక సారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తూవుంటే మర్మాంగాన్ని గుంజినాడు. అది అలాగే కొన్ని గజాలు సాగింది. వాడు భయ పడి పారి పోయినాడు. దుండగులు కొందరు ఆయనకు సున్నపు తేటనిచ్చి పాలు అని చెప్పినారు. స్వామి ఎటువంటి తటపటాయింపు లేకుండా శుభ్రంగా త్రాగినాడు. ఆ దుండగుని కడుపు మండనారంభించింది. వాడు తప్పు తెలుసుకొని స్వామి పాదాలపై వాలినాడు. స్వామి వానితో " ఇప్పుడు తెలిసినదా నీవు నేను వేరుకాదని" సైగలతో అన్నారు. దుండగీడు చెంపలు వేసుకొని స్వామికి సాగిలబడి మ్రొక్కి క్షమాపణ చెప్పుకొని అచటనుండి నిష్క్రమించినాడు. స్వామి మింగిన దానిని మూత్ర రూపమున విసర్జించినారు.

శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్ తో కలిసి మౌన  స్వామిని దర్శించినారు .ఆయనకు స్వామివారు  నశ్యం వేసుకొనే కాయ అంటే పొడుంకాయ కానుకగా ఇచ్చినారట. పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పినారట స్వామి. పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరూ మహా పురుషులే.పరమ హంసలే. ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంతగా గౌరవించినారంటే మన త్రైలింగ స్వామి ఎంతటి మహిమాన్వితుడో మనకు అర్థమౌతుంది. స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పినారట పరమ హంస.

వేరొకమారు  అర్ధ మణుగు పాయసము అంటే 5.6 కిలోల పాయసము వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించినారటమరొక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్ లో ఉన్న  స్వామి దగ్గరకు  వచ్చినారు .ఇద్దరూ గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు. కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరూ మాయమైనారు. అరగంట తర్వాత స్వామి మాత్రమే తిరిగి వచ్చినారు. తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చినట్లు సైగలతోనే చెప్పి స్వామి అందరి సందేహాల్ని తీర్చినారు . అంటే ఆయన అష్టసిద్ధులు గడించిన మహిమాన్వితుడు అన్న విషయము మనకు అర్థమౌతుంది.

వారణాశికి వచ్చిన మరొక మహనీయుడైన లాహిరీ మహాశయుని గూర్చి త్రైలింగ స్వామివారు నాలుగు మాటలు చ్వెప్పుటకు తమ మౌనము వీడినారు. వారి శిష్యులు వెంటనే " స్వామీ! సర్వ సంగ పరిత్యాగులై పరమేశ్వరానుగహము బడసిన మీరు ఒక సామాన్య సంసారి కొరకు మౌనము వీడుటయా!" అన్నారు. అందుకు స్వామివారు ఈ విధంగా తమ శిష్యులకు శెలవిచ్చినారు " ఏమాత్రము నొప్పి కలిగించకుండా తల్లి పిల్లి తన కూనలను ఎక్కడ వుంచితే అక్కడ యిమిడి పోతాయి. లాహిరీ మహాశయులు కూడా అటువంటి యొక పిల్లికూన వంటివారు. తల్లి ఆదేశము ప్రకారము ఆయన సంసారమన్న స్థావరములో ఇమిడి పోయినారు. నేను సర్వసంగ పరిత్యాగినై సాధించినది వారు సంసారములో వుంటూనే సాధించ గలిగినారు. వారిని గూర్చి మాట్లాడుట నాకు అమ్మ యొసగిన వరము" అన్నాడు. ఇప్పుడు నేను వ్రాసిన వారి మహాత్మ్యములను గూర్చి కూడా అనేక విధములుగా వారిని గూర్చి లోకులు చెప్పుకొంటారు. కానీ వారి మహత్తును గూర్చిన అనుమానము మాత్రము ఎవ్వరికీ లేదు.

పంచ గంగా ఘట్టం లో చిన్న భూగృహం నిర్మింపజేసుకొని  32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26 -12 -1887 న సర్వజిత్తు నామ  సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం  స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషము. పతంజలి యోగములో విభూతి పాదములో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగములో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు. ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో వ్రాసినారు .కాని మన తెలుగు వారి దృష్టి దాని మీదికి పోలేదు. 280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై  ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన  ముద్రాలంకారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించ టానికి.

త్రైలింగ స్వామినేనమః

 


No comments:

Post a Comment