Friday, 1 June 2018

వాల్మీకి శాస్త్రజ్ఞత


వాల్మీకి శాస్త్రజ్ఞత
వాల్మీకి ఆదికావ్య కర్త, అందుచే ఆదికవి అని మాత్రమే మనకు తెలుసు. రామాయణమంటే రాముడు సీత, లక్ష్మణుడు, భరతశత్రుఘ్నులు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు విభీషణుడు, రావణ కుంభకర్ణులు, కట్టె, కొట్టె, తెచ్చె   అని మాత్రమే అనుకొంటాము. ఇందులో ఎన్నో శాస్త్ర రహస్యములు దాగివున్నవని ఆలోచించము. ఆ దిశగా మనకు చెప్పేవారు కూడా తక్కువే. మనకూ వినే ఓపిక తక్ఇకువే! 
ఇప్పుడు రామాయనమునండలి ఒక ఖగోళ రహస్యమునకు సంబంధించిన విషయమును వాల్మీకి మహర్షి ఎంత నిగూఢముగా మనకు తెలియబరచినాడో తెలుసుకొందాము. అందుకే కాళిదాసువంటి మహాకవులు వాల్మీకి వారిని ఈ విధముగా పొగిడినారు.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం l
ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలంll
రామాయణ కల్పవృక్ష కవితా శాఖల పై వాల్మీకి అన్న కోకిల కూర్చొని 'రామ' రామ' యని కూయు చున్నది.
వాల్మీకి ముని సింహస్య కవితా వన చారిణాl
శ్రుణ్వన్ రామ కథా నాదం కొనయాతి పరాం గతింll
కవన వనములో వాల్మీకి ముని సింహము 'రామ' 'రామ' రామకథా నాదమును ధ్వనింప జేస్తూవుంటే విన్నవారు కైవల్యమును గాంచక ఎట్లుండగలరు. ఇక అసలు విషయమునకు వద్దాము.
బాలకాండ 18 వ సర్గము. 16 వ శ్లోకము ఈ విధముగా వుంది.
గుణవంతో సురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాఃl
జగుః కలం చ  గంధర్వా ననృతుశ్చాప్సారో గణాఃll
దశరథుని నలుగురు పుత్రులూ రూపములోనూ గుణములోనూ నిరుపమానులు. వారు ప్రోష్ఠపద నక్షత్రమువలె అన్యోన్యత కలిగి వుండినారు. వీరి జనన కాలమున గంధర్వులు గానము చేసినారు. అప్సరసలు నాట్యము సల్పినారు. దేవదుందుభులు మ్రోగినాయి. అసలు వాల్మీకి రామాయణము ప్రకారము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ విష్ణ్వంశ  సంభూతులే!  రాముడు కాక మిగిలిన ముగ్మగురూ ఆదిశేష శంఖ చక్ర అవతారములు కాదు. పై శ్లోకములో మనకు కావలసింది ‘రుచ్యా ప్రోష్ఠపదోపమాః’ అన్న పదము మరియు దాని విశ్లేషణ. రుచి అన్న మాటకు ప్రకాశము అన్నది ఒక అర్థము. మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కదా! మరి ఒక నక్షత్రము పేరు చెప్పి, దానివలె ప్రకాశించుచున్నారు  అంటే కొంత ఎబ్బెట్టుగా వున్నట్లు తోచకమానదు కదా!. నలుగురు స్త్రీలను ఉద్దేశించి చెబుతూ, ఆ నలుగురి ముఖములూ చంద్రబింబములవలె వున్నాయి అని అంటే మనసుకు రుచించదు కదా! ఆ విశేషణము ఎదో ఒకరికి ఆపాదిస్మతే చక్కగా ఉంటుంది.  మరి ఇది ఎలా సరిపోతుంది, అన్నది సమస్య. అది ఇపుడు కాస్త ఈ పదప్రయోగను గూర్చి తెలుసుకొనే ప్రయత్నము చేస్తాము. పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రములు రెంటినీ కలిపి  ‘ప్రోష్ఠపద’ అని అంటారు. మరి ఇప్పుడు కూడా రెండేకదా అయినది, వారు అన్నదమ్ములు నలుగురు కదా! అన్న సందేహము వస్తుంది. అక్కడే వున్నది అసలు రహస్యము. పూర్వాభాద్ర రెండు ప్రకాశవంతమగు నక్షత్రములను కలిగియుంటుంది. అదేవిధముగా ఉత్తరాభాద్ర కూడా రెండు తేజోవంతమైన నక్షత్రములను కలిగియుంటుంది. ఈ నాలుగూ నాలుగు చుక్కలు (Points) గా గ్రహించి అవి A,B,C,D అన్న బిందువులుగా భావించి కలిపినట్లు ఊహించితే ఇంచుమించుగా ఒక చతురస్రము (Square) ఏర్పడుతుంది,  అంటే AC, BD ల దూరములో సూక్షమైన తారతమ్యాలు వుంటాయిగానీ AB, BC,CD,DA లు  ఇంచుమించుగా ఒకే దూరాన్ని కలిగివుంటాయి. ఇది  రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నుల అన్యోన్యతను తెలుపుతాయి. మరికాస్త ఆలోచిస్తే A బిందువుగా కలిగిన రాముడు C బిందువుగా కలిగిన లక్ష్మణుని చూస్తూ ఉంటాడు, అంటే లక్ష్మణుడు ఎప్పుడూ రాముని కనుసన్నలలో ఉంటాడు. అదేవిధముగా శతృఘ్నుడు, భరతుని కనుసన్నలలో ఉంటాడు.   మహర్షి ఒకే పదములో  ఖగోళ శాస్త్రమును ఆధారము చేసుకొని అన్నదమ్ముల అన్యోన్యతను ఎంతో నిర్దుష్ఠముగా తెలియజేసిన విధానము. ఎంత గంభీరమైన భావమో గమనించినారో కదా! 
నిరంతర భక్తితత్పరులు భగవంతుని అవిరళానుగ్రహ ప్రాప్తులగు ఆ మహానీయులకే అట్టి భావములు కలుగుట, అట్టి కావ్యములు వ్రాయుట, వానిని ఆచంద్రార్కము నిలిపివుంచుట సాధ్యము. వాల్మీకి మహర్షి పాదపద్మములకు సాష్టాంగ దండప్రణామములు సమర్పించుతూ శెలవు తీసుకొంటాను.
స్వస్తి.

2 comments:

  1. Xyennenno teliyani vishayalu vaati khagola sastra rahasyalu teluputhunnaru
    Inthati sasreeyamyna kavyalanu kondaru moorkhulu helanachesthunnaru Mana sasralanu telusukundam
    Teluputhunna meeku vandanaalu

    ReplyDelete
  2. మంచి సూక్ష్మ విషయ వివరణ బాగున్నది. కొత్తవివరాలు తెలుసుకున్నాను. ధన్యవాదములు.

    ReplyDelete