Sunday, 22 April 2018

భగవద్గీత




సనాతన ధర్మమును అవలంబించువారెవరైనా 'భగవద్గీత' అన్న పేరు వినని వారుండరు. ఒక 30, 40, సంవత్సరముల క్రిందయితే ఇది భారతములోని భీష్మ పర్వములోవస్తుంది, ఇందు శ్రీకృష్ణ భగవానుడు అర్జనునకు కర్తవ్యమును బోధించి కార్యోన్ముఖుని చేస్తారు అన్నమేరకు జిజ్ఞాసువులకు తెలిసివుండేది. నేడు పరిస్థితి ఆవిధముగాలేదు. 'గీత'అంటే నా 'Friend' కాదు అనే స్థితిలో వుండే యువకులు కూడా నేడు మనకు కనిపించితే ఆశ్చర్యపోనవసరములేదు. ఇది ఇట్లుండగా కాస్తో కూస్తో చదువుకొన్న నాలాంటి ప్రతివానికీ భగవద్గీతమీద తనకు తోచిన టీకా టిప్పణి వ్రాయుట, లేకుంటే ఆ శ్లోకములను పద్యరూపములో వ్రాయుట ఒక ఆచారమయింది.
కానీ ఈవిధముగా తమకుతోచిన రీతిలో వ్రాస్తూవున్నారు అంటే అక్కడ మనము గుర్తించవలసినది ఆ వ్రాసినవారికి 'గీత' పై గల భక్తి గౌరవము. ఏ స్థాయి రచయితకు ఆ స్థాయి పాఠకుడు ఉంటాడు. కావున వ్రాయుటలో తప్పులేదు. వజ్రాలు భూపతుల కిరీటములలోనే కాదు భూమిలో కూడా దొరుకుతాయి. పరిశీలించే ఓర్పు కాస్త అవసరము. గీతను తత్వ విచారణకు వాడుకొని దానికి భాష్యము, వార్తీకము, టీకా, టిప్పణి, వ్యాఖ్యానము వ్రాసిన మహనీయులు అనేకులు. నేను ఆదారిని పట్టకుండా లౌకిక కార్యాచరణములలో  గీత యొక్క ఆవశ్యకత ఎంతవరకూ వున్నది అన్న కోణములో ఆలోచించి నాకు తెలిసిన, నా బుద్ధికి తోచిన వ్యాఖ్యానము, ఉదాహరణముల సహితముగా, శక్తికి మించినపని కావున శ్రమకోర్చి, రెండు మూడు సంవత్సరములు కృషిచేసి కొంతవరకూ వ్రాసినాను. ఇందు ఉపోద్ఘాతముగా 'భగవద్గీతను గురించీ, తరువాత నిజజీవితములోని సమస్యలకు 'గీత' ఎటువంటి పరిష్కారములను సూచించుతుంది అన్న అంశమును ప్రధానముగా తీసుకొని వ్రాస్తూవున్నాను. పాఠకులగు మీకు నచ్చితే నా రచన కొనసాగిస్తాను.
ఈ క్రింది లంకెలో నేను వ్రాసిన ఉపోద్ఘాతమును చదువగలరు. నిడివి కొంచెము ఎక్కువే! తెలుసుకోదలచినవారు అటువంటి చిన్నవిషయములకు ప్రాధాన్యమివ్వక ప్రశాంత చిత్తముతో పరిశీలనా దృక్పథముతో చదువుతారని నా ప్రగాఢ విశ్వాసము.
లంకె:

https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_68.html 
******************************************************

భగవద్గీత

భగవంతుడు తన సందేశమును తన అంశజుడగు వేదవ్యాసుని ద్వారా తాను అర్జునునికి తెలిపిన వేదాంత సారమును మనపై మక్కువ ఎక్కువగా కలిగినవాడై తెలియజేసినాడు.   
ఇక్కడ ఒక్క విషయమును తెలుపవలసి వుంటుంది. కృష్ణ శబ్దమునకు అర్థము నలుపు అన్నది మనకందరకు తెలిసినదే! అదే విధముగా అర్జున శబ్దమునకు ఒక అర్థము తెలుపు. ఒక తమాషా అయిన విషయము ఏమిటంటే ఈ రెండూ రంగులు కాదు. మనము వానిని రంగులుగా భావించుకొంటున్నాము. ఏదయినా చీకటి అంటే నలుపు వదిల్తే తెలుపు లోనికి రావలసిందే! అదేవిధముగా వెలుగు అంటే తెలుపు వదిలితే నలుపును చేరవలసినదే! ఈ తెలుపు నలుపే జీవాత్మ పరమాత్మ.
అర్జునునము అన్న పదమునకు కసవు, బంగారు అన్న రెండర్థాలు వున్నాయి. అర్జుని అనగా ఆవు అని ఒక అర్థము. ఇపుడు చూడండి, పరమాత్మ కశ్మల దూషితమగు మనసును తన గీతా బోధనచే సువర్ణము గావించినాడు. పేరు మారలేదు కానీ మనిషిలోని ప్రకృతి మారింది. ఇక అర్జుని అంటే ఆవు అని చెప్పుకొన్నాము.ఆవు పవిత్రతకు దైవత్వమునకు సంకేతమన్నది మనకు తెలిసిన విషయమే! అంటే నారాయణుడు తన గీతా బోధచే  నరుడగు అర్జునునిపై దైవత్వమును ఆపాదించినట్లే కదా! మహనీయులు చెప్పిన ఒక్కొక్క మాటకు ఎన్నెన్ని అర్థములుంటాయో చూడండి. ఇంకొక మాట గమనించండి. గో శబ్దమునకు ఆవు అన్న అర్థమే కాకుండా వేదములు అన్న అర్థము కూడా వున్నది. ఉపనిషత్తులు వేదసారమే కదా! కావున అవి కూడా గోవులే! ఆ గోవుల యొక్క పాలను  పితికి అర్జునుడు అన్న లేగకు అందిస్తున్నాడట. ఈ శ్లోకమును చూడండి.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనఃI
పార్థో వత్సః సుధీభోక్తా దుగ్ధం గీతామృతం మహాII
ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునునికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచినాడట. ఎటువంటి పోలికో గమనించండి. అందుకే కృష్ణుడంటాడు ‘మన వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః’. అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను అని కచ్చితంగా!   ఇనుముతో వస్తువును చేయించదలచినవాడు ఏవిధముగా  ఇనుమును కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించి కార్యోన్ముఖుని చేస్తాడు
ఒక్క మాటలో చెప్పాలంటే ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికములగు తాపత్రయములనడచు పారమార్థిక పదగమ్యసూచిక ఈ భగవద్గీత.
అన్య మతస్తుల మత గ్రంధములవలె కాదిది. అసలు మన సనాతన ధర్మము మతము కాదు, మనకు మత గ్రంధములూ లేవు. అన్య మతస్తుల మతగ్రంధములలో శవముల వద్ద చదివే ఆనవాయితీ ఉన్నదేమో నాకు తెలియదు. కానీ భగవద్గీత శవముల వద్ద చదువవలెనను వేదవాక్కు ఎక్కడా లేదు. అసలు వేదముల వయసు మనకు చెప్పతరము కాదు. పరమాత్మ నిశ్వాసమే వేదము అన్నది ఆర్య వాక్కు. వేదము అనంతము అనాది. గీత ఏమో 16 అక్టోబరు 3544క్రీ.పూ. అంటే ద్వాపరము ముగియుటకు (18 ఫిబ్రవరి 3102 క్రీ.పూ. కలియుగ ప్రారంభము)కొన్ని వందల సంవత్సరములకు పూర్వము నాటిది. మరి వేదము గీత శవముల వద్దచదివేది అని చెప్పలేదు కదా! ఆవిధముగా ద్వాపరములో చదువబడనూ లేదు. ఆత్మ దర్శనము చేయించి పరమాత్మయందైక్యమొనరిప జేసేది భగవద్గీత.
ఇంకొక ముఖ్యమగు విషయము. ఎందఱో మహానుభావులు గీతా మహాత్మ్యమును గూర్చి భగవత్ సాయుజ్యమును గూర్చి తాము పరిశోధించి అనుభవించి ఆనందించి అందలి సారమును అందజేసినారు. నేను వారితో పోల్చితే పిపీలికమునే అంటే చీమనే! అందువల్ల గీతా పఠనము ఆముష్మికమునకే కాదు ఐహికమునకు కూడా ఎంతో అవసరము అన్న విషమును గూర్చి నాకు తెలిసిన వరకు, జ్ఞాపకమున్నంత మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. అసలు వ్యక్తిత్వ వికాసమునకు గీతనొక ప్రామాణిక గ్రంథముగా మనము భావించవచ్చును. అందుకే వ్యాసులవారు, భారతములో వున్నది ఎక్కడయినా ఉండవచ్చు గానీ అందులోలేనిది వేరెక్కడా ఉండదు అన్న సవాలును విసరినారు. కార్యశీలత, కార్యనిర్వహణ దక్షత అన్న సమస్యలపై పాశ్చాత్యులు ముఖ్యముగా అమెరికా సంయుక్త రాష్ట్రీయులు సందేహ,బాహ్య, భౌతిక మరియూ పరిధీగత (superficial, material, external and peripheral levels) కారణములను పరిగణనలోనికి తీసుకొని తగిన సూచననలను అందజేస్తారు. కానీ మన భగవద్గీత అట్లుగాక వృక్ష శాఖలను పరిగణించక వృక్షమూలములకు పోయి అచ్చటినుండి కాండము శాఖోపశాఖలు ఫలములు అన్న తర్కబద్ధ ప్రతిపాదనలతో, వివరణాత్మక పరిశీలనలతో మనకు విషయమును తెలుపుతుంది. Think of the roots then think of the fruits. ఈ మూల మంత్రమును మనము ఆచరించితే సత్ఫలితమును అదే తెస్తుంది. పాశ్చాత్య పోకడలను అవలంబించుట చేత క్రమక్రమముగా యాజమాన్య వర్గము కార్మిక వర్గము అన్న చీలికలేర్పడి ఒకరిపైనొకరు ఎత్తులు వేసి జిత్తులు చేసి. కత్తులు దూసే స్థితికి తెచ్చుకొన్నాము. పనిలో పరమాత్మను చూసే సంస్కారము మనది. భగవద్గీత ఇదే చెప్పినది. ఈ దినములలో భగవద్గీత చదివేవారెంతమంది. 
****************************************
2.
చాలా కాలము క్రితము నేను ఒకసారి నా మిత్రుని ఇంటికి పోయివుంటే ఆతడు ఒక అతి పురాతన భగవద్గీతను తెచ్చి నాకు చూపించి ‘ఇది మా ముత్తాత కాలమునుండి వస్తూవుంది. పారంపర్యముగా ఒకరినండి ఒకరికి ఇది ప్రాప్తిస్తూ వచ్చింది. ప్రొద్దుటే స్నానము చేసి దేవుని గదిలో వుండే ఈ గీతకు దేవతా విగ్రహములతో బాటూ నమస్కరించి మా పనులకు పోతాము’ అన్నాడు. ‘ఇది తెరిచి ఒక శ్లోకమయినా చదివినావా’ అంటే గీత దేవునితో సమానము తెరువ కూడదు అనిచెప్పి మా పూర్వులంతా అట్లే చేసినారని చెప్పినాడు. నా నోట్లో పచ్చివెలగ పడినట్లైనది. అదే భగవద్గీతను నాటినుండి చదువుతూ వచ్చియుంటే మనము అన్యులపై ఆధారపడనవసరము వుండేది కాదు.
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః I
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతి II
అంటే ఒక ఇంటికి గానీ సంస్థకు గానీ పెద్ద ఏ దారిలో పోతూ వుంటే మిగతా అందరూ అదే దారిలో పోతూవుంటారు. అదేకదా ‘యథా రాజా తథా ప్రజా’ అన్నారు. ఒక నిర్వాహకుని విధి, బాధ్యత, కర్తవ్యములను మనము ఈ క్రింది విధముగా వర్గీకరించుకొనవచ్చు:
స్వాప్నిక దృష్టి, దానిని సాధించుటకు భవిష్యత్ ప్రణాళికావ్యూహమును ఊహించగల బుద్ధి చాతుర్యము దానివల్ల ఏర్పడు నాయకత్వ లక్షణము, వినూత్న ఆవిష్కరణలచే క్రొత్తక్రొత్త పోకడలచే  సంస్థాగతశ్రేష్ఠతను అభివృద్ధిచేయుటకు తగిన మేధోవికాసము, మానవ వనరులను అభివృద్ధి పరచుట అంటే పరస్పర అవగాహన పరస్పర సహకారము వానివల్ల ఏర్పడే పరస్పర అభిమానము, సంఘీభావము, స్ఫూర్తి,  ప్రాతినిధ్యము పరస్పర అనుసంధాన నైపుణ్యము మరియు తమ కార్యాచరణలో ఏర్పడ్డ కంటక పరిశీలన మరియు నివృత్తి , వంటి  విషయములపై చక్కనయిన అవగాహనను ఏర్పరచుకొనుటయే గాక తదీయాచరణమును చక్కనయిన రీతిలో ప్రదర్శించుటకు గీతా గరిత అసమాన రీతిలో సహకరించుతుంది సాధకునికి.
త్రిగుణాత్మకమగు శరీరములో శ్రేష్ఠమగు సత్వగుణ సముపార్జన చేయుట మరియు దానివలన కలుగు లాభములను గూర్చి భగవద్గీత లోని జ్ఞానవిజ్ఞాన యోగము(7వ విభాగము) లో పరమాత్మ చెప్పిన ఈ విషయమును ఎంతో శ్రద్ధతో గమనిమనించలసియున్నది.
ఏచైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే
మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వాహం తెషుతే మయి 7-12
సత్వరజస్తమోగుణములు నా నుండియే ప్రభవించు చున్నవి కానీ ఆ వెలువడిన గుణములలో నేనుకానీ, నాలో అవి కానీ లేవు. అంటే అవి ‘మానవ జన్మి’ లో ప్రవేశించిన పిదప తద్గుణానుగుణముగా ప్రవర్తించుచున్నాడు మానవుడు. అది అతని కర్మఫలమౌతూవుంది. ఈ ఉదాహరణ చూడండి.
నలుపు అన్నది, ముందే, ఏ రంగూ కాదు అనుకొన్నాము. కేశ సంపదను మన ఉదాహరణము కొరకు తీసుకొందాము. ఆ జుట్టును మనము జడగా పేననంతవరకు, జడను అల్లుటకు కావలసిన మూడు పాయలూ అందులోనే వున్నాయి. అసలు వున్నాయి అనుకొంటే వున్నాయి లేవు అనుకొంటే లేవు. ఈ మూడు సత్వరజస్తామో గుణాలు. ఇక జడ పేనటము జరిగితే ఆ జడలో ఏది ఏ పాయయో చెప్పలేము. అంటే ఈ జగత్తులోని జీవ మానవ రాశిలో ఈ సత్వరజస్తమోగుణముల పాళ్ళ యొక్క, వాని కలయికల యొక్క పౌనఃపున్యములు నిజమునకు అనంతము. అసలు ఇందులో కూడా జల, జంతు, తిర్యగ్ వర్గ జీవుల గుణగణములు ఆయా వర్గములకు ఒకే విధముగా వుంటాయి. ఒక్క మానవ వర్గులో మాత్రము ‘పుర్రెకొక బుద్ధి జిహ్వకొక రుచి.’
ఈ వర్గములో మాత్రమే గుణగణములయందు మార్పు ప్రతి వ్యక్తి లోనూ కనిపిస్తుంది. ఇట్లు లేకున్నా లోకము అల్లకల్లోలమే వున్నా అల్లకల్లోలమే! కానీ ఉండుటవల్ల చెడు నుండి మంచికి మంచినుండి ఇంకా మంచికి చేరుటకు మనిషి ప్రయత్నిచగలడు. లేదు, మంచి నుండి చెడ్డ వైపునకు కూడా నడువవచ్చు. అది వారివారి వివేచన, ఆచరణ, పెంపకము మొదలగు ఎన్నో విషయముల మీద ఆధారపడుతాయి అన్నింటికీ మించి పూర్వ జన్మ కర్మఫలము . బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన ‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ’ అన్న మంత్రపు అనుయాయులౌతారు సత్యాన్వేషకులగు సత్వగుణ సంపన్నులు. క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాంనోపకరణైః’ ఉపకరణములు లేకుండానే సత్వగుణ సంపన్నులు క్రియా సిద్ధి అంటే తలపెట్టిన పనిని నెరవేర్చ గలుగుతారు. అతి చిన్న ఉదాహరణ ఏమిటంటే కొయ్య పీటకు మరచీల పైకి లేచినది అనుకొండి ‘Screw driver’ కొరకు ఎదురు చూడక అందుబాటులో వుండే ఏ ఇనుప రేకుతోనో దానిని బిగించుతాము. కావున పని జరుగుటకు పట్టుదల ముఖ్యము పనిముట్టుకంటే! అట్లు కాదనుకొన్నా పట్టుదల వుంటే పనిముట్లు కూడా తమకు తామే అందుబాటులోనికి వస్తాయి.
దీనిని ‘కార్య నిర్వాహక శాస్త్రము’(Management Science)నకు అనుసంధించుదాము. ముగ్గురు వ్యక్తులను పరీక్షింపదలచి ఒక మహత్కార్యమును (Project) వారికి ఇవ్వటము జరిగింది. మొదటివాడు పెద్దగా దానిని గూర్చి ఆలోచించకుండానే మీరిచ్చిన వనరులు ఈ పని చేయించుటకు చాలవు. నేను దీనికి పూనుకోజాలను అన్నాడు. రెండవవాడు మొదలయితే పెడతానుగానీ ఏ కారణము చేతనయినా నిలబడి పోతే నాది జవాబుదారి కాదన్నాడు. అతను చెప్పినట్లే మొదలయితే పెట్టినాడు కానీ అతని కోపమునకు, ముఖ్యముగా, సాటి సహచరులనుండి సరియగు సహకారము లభించలేదు. చెప్పుడు మాటలచేత కూడా చెడిపోయినాడు. అతని పరిస్థితి చివరకు ‘అమ్మా పెట్టదు అడుక్కొ నీ తిననివ్వ’ దన్నట్లు అయింది. ఆతడు మధ్యలో విడిచి పెట్టినాడు. చివరిగా ఆపనిని ఏ వ్యక్తికైతే ఇచ్చినారో, అంటే 3వ వ్యక్తి, ఆతను ఆపనిని ఇచ్చినవారితో ‘ ఆపని సఫలమైతే కలుగు ప్రయోజనము అటు గ్రాహకులకు(Customers) ఇటు దాతకు(Entrepreneur)  మధ్యనున్న తనకు కలుగు ప్రయోజనములు తర్కించినాడు, తన మూక(Group) లో చేరబోయే వారి గుణ దోష పరిశీలన చేసినాడు. తరువాత ఇచ్చిన మహాత్కార్యాచరణకు వలయు ప్రణాళిక(Plan) సిద్ధము చేసుకొన్నాడు. ఆపయిన కార్యమునకు గడంగినాడు. మానవ వనరులన్నీ(Human Resources) సక్రమముగా కుదిరినతరువాత కార్యము సఫలము కావలసినదే కదా! భక్తి శ్రద్ధలలో భగవంతుడుంటాడు.
ఇక ముగ్గురి మనస్తత్వమును కాస్త అవలోకించుదాము. మొదటివానిలో  తామసము అత్యంత అధికము,రాజసము అల్పము, సాత్వికము అత్యల్పము. రెండవ వానిలో రాజసము అధికము తామసము అల్పము, సాత్వికము అత్యల్పము. కానీ మూడవ వానిలో సాత్వికము అధికము, రాజసము అల్పము, తామసము అత్యల్పము. ఈ విధమగు వ్యక్తులలోనే సాధించి తీరవలెనను పట్టుదల వుంటుంది.  మిగతా ఇద్దరిలో ఉండదు. వారిని గూర్చి ఒక చిన్న కథ చెబుతాను.
3వ భాగములో కలుద్దాము.
******************************************
3.
ఒకవ్యక్తి తన 15 అంతస్తుల భవనము పై కప్పుపై  కూర్చొని రోడ్డుపై చీమలవలె పారాడుచున్న వాహనములను చూస్తూ ఉండినాడు. ఆ సమయములో అతని తలపులలో ఏముండినదో ఏమో గానీ ఆతని మిత్రుడు పైకి వచ్చి’ నీభార్య లేచిపోయింది అన్నాడు. అంతే అతను ఆ 15 అంతస్తుల భవనముపై నుండి దూకినాడు. 12 వ అంతస్తు వద్దకు వచ్చిన తరువాత ఆస్పత్రిలో వుండే భార్య ఆస్పత్రి అధికారుల ప్రమేయము లేనిదే ఎట్లు లేచి పోతుంది అనుకొన్నాడు. 9వ అంతస్తు వద్దకు వచ్చిన పిదప కాలు విరిగిన వ్యక్తి లేచిపోలేదు కదా అనుకొన్నాడు . 3 అంతస్తుకు వచ్చిన తరువాత ఆస్పత్రిలో వుండే తన కూతురి సహాయముతో శౌచాలయమునకు పోయి వుంటుంది అనుకొన్నాడు. అంతా జరిగిపోయిన తరువాత అనుకొని లాభము లేదు కదా!
దైవీహ్యేషా గుణమయీ మమమాయా దురత్యయా
మామేవ ఏ ప్రపద్యన్తే మాయామేతాం తరంతితే 7-14
ఈ మూడు గుణముల సంకలనము మాయ. పౌనఃపున్యముల మూలమున ఇది అనంత గుణరాశి యగుచున్నది. ఈ అనంత గుణరాశికి చెందినదే ఈ ప్రకృతి, ఈ జడ జీవములు, మన మమకార వికారములు. మనము క్రియా తత్పరులము కావాలంటే మనతో వున్న వారందరినీ కలుపుకొని పోతూ వుంటే కార్య సిద్ధి కలుగుతుంది. దానికి, మనలో ‘ఇది నా బాధ్యత, నేను చేసితీరాలి అన్న పట్టుదల మనలో వుండాలి. అంటే ‘Ownership’ అన్నమాట. నా మిఉత్రుడు ఒక Asstant general manager ఉండేవాడు. ఒకసారి నేను అతనిని ఆఫీసులో కలియుట జరిగింది. నేను యధాలాపముగా ‘పని ఎట్లుంది?’ అని అడిగినాను. ఆతడు ‘ఆఁ, ఎవరి పని వారిదే. నేను నాపని ఎంతనో అంతే చేస్తాను. 1\2 ఇంచి ఎక్కువ చేయను, 1\2 తక్కువ చేయను అన్నాడు. 5 సంవత్సరముల తరువాత నేను అతనిని మళ్ళీ కలిసి DGM అయినావా అంటే ‘లేదు లేదు పని చేసే వారికి promotion ఇవ్వరు కదా? అన్నాడు.’ ‘ఆరోజు గీత గీచుకొని పనిచేస్తానన్నాడు ఈ రోజు పనిచేసే వాళ్లకు Promotion ఇవ్వరుకదా అంటున్నాడు.’ ఇది మనది, అంటే ownership తీసుకొంటే ఆ పట్టుదల కార్యాచరణ వేరుగా వుంటుంది. అంటే   Ownership తీసుకొంటే owner కాగలము కానీ గీత గీచుకొంటే గీత లోపలే ఉంటాము. ఆ Ownership పొందవలెనంటే తన బలగమును తనతో కలుపుకొని కదలవలసి వుంటుంది. Skill వుంటే చాలదు, Will వుండాలి. Leadership is an influence of personal power not positional power. పనిపై 'ప్రభావము' వుండాలి కానీ 'పరభావము ఉండరాదు. వనములో చేరినా, వనిత జడలో చేరినా మల్లెల వాసన మారదు కదా! ఈ మాటే పరమాత్మ 5 వ అధ్యాయమయిన కర్మసన్యాసయోగములో  ఈ విధంగా అంటాడు. 

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహాస్తినిI
శునిచైవ శ్వపాకేచ పండితః సమదర్శినః II  5-18(శ్లో)

ఇపుడు సంతోషము అన్న అంశమును గూర్చి కాస్త తెలుసుకొందాము. ఆనందాన్ని గూర్చి భగవద్గీత ఏమంటుందో చూద్దాము. ముందుగా ఈ ఆనందము అన్నది ఒకే విధమయినదా లేక విభిన్న ఆనందములున్నవా! అన్న విషయమును పరిశీలించుదాము. ఆనందాలు ఇన్ని అని చెప్పలేము కానీ వర్గీకరణ మాత్రము రెండు విధములుగా చేయవచ్చు. 1. తాత్కాలిక లేక క్షణిక ఆనందము 2. నిరంతర,నిత్య లేక ఆఖండానందము. ఒక కోరిన సినిమా చూచుటయో, కోరిన హోటలులో కోరిన తిండి తినుటయో లేక ఒక సరిపోని వ్యక్తిని అవహేళన చేసియో ఆనందించ వచ్చును. పోయిన సినిమాకే పోతూ ఉండలేము. తిన్న హోటలులో తిన్న తిండే తింటూ ఉండలేము. కావున ఈ విధములగు ఆనందములు క్షణికమైనవే! కానీ ఇందులో నీ ఆనందముకోరకు పరులను బాధ పెట్టుట లేదు. కానీ ఇపుడు నేను తెలిపిన మూడవ ఆనందము పైశాచికము ఇదికూడా క్షణికమే కానీ పరుని బాధలో సంతోషాన్ని పొందుట పైశాచికము కాక మరేమిటి. వ్యక్తి హేళనలో ఆనందము మనము పొందుతున్నాము అనుకొంటే అది భ్రమ. చూసేవారు మనలను ఎవగించుకోనూ వచ్చు, మన స్నేహమునే వదిలిపెట్టనూవచ్చు. కావున శారీరిక మానసిక హింసల చేబట్టి పొందేది ఆనందముగా పరిగణించలేము.  క్షణికానందమునకు మిక్కిలి సన్నిహిత మిత్రము హాస్యము. ఇందు పరహింస లేదు, ఈర్ష్య లేదు, ద్వేషము లేదు. కుళ్ళు లేదు. కుట్ర,కుతంత్రము లేదు. అందువల్ల అవసరమైనపుడు, అవకాశము దొరికినపుడు నవ్వును ఆశ్రయించితే హాయిగా నీవు విశ్రమించవచ్చు.
నవ్వే మనిషికి గుర్తగు
నవ్వే ఆరోగ్యమునకు నాణ్యత పెంచున్
నవ్వే మైత్రికి సఖుడౌ
నవ్వే లేనట్టివాడు నరుడా రామా!
అని నేను వ్రాసుకొని యుండినాను.
కావున నవ్వు హాస్యమునకు సంకేతము. హాస్యము ఆనందమునకు సంకేతము. ఆనందము ఆరోగ్యమునకు సంకేతము. ఈ ఆనందము తాత్కాలికమే! కావున ఇది 'అంతము' కాదు 'ఆరంభమే'. దీని ప్రత్యేకత ఏమిటంటే ఏదో ఒకరోజు నిన్ను ఈ ఆనందమునకన్నా మించినది ఉందా అని యోచిమ్పజేస్తుంది.  నిరంతర, నిరంతరాయ,నిత్యానందము వైపు నిన్ను దారితీయించుతుంది.
 నిత్యానందమును గూర్చి  భగవద్గీత ఏమంటూవుందో చూద్దాము.
రాగద్వేషా వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరాన్
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమథిగచ్ఛతి (2-63)
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠ తే (2-64)
మానవుడు లౌకికమైన ఏవిధమగు ప్రలోభములకు లొంగక, అందని వానికి అర్రులు సాచక, తనకు అందినవి అనుభవిస్తూ పొందే ఆనందము అనిర్వచనీయము. ఈ సుఖశాంతులను తెలుపునదే ‘ప్రసాదము’. ఇది పొందితే ఇక దుఃఖమేదీ! అంటే సంతృప్తే సంతోషమునకు సాధనము. ఉన్నదానితో తృప్తి చెందితే అసలు ఆరోగ్యమును కాపాడుకొన్నట్లే. అందుకే ఈ రెండవ అద్యాయములోని 62, 63 శ్లోకములలో విషయాసక్తి వలన మానవుడు ఎన్ని విధాల పతనము కావలసి వస్తుందో పరమాత్మ తెలుపుతాడు. మరి ఈ మాట సుఖజీవనమునకు సోపానముకాదా! ఈ విధముగా ఐహికమగు అనేక విషయములకు భగవద్గీతను కరదీపికగా గైకోనవచ్చును. ఇక అసలు భగవద్గీతలోనికి మనము ప్రవేశించుదాము.
4వ భాగములో కలుద్దాము.
***************************
4
భగవద్గీతా ప్రవేశము
ఎందఱో మహనీయులు, మహానుభావులు,మహాగురువులు భాష్యము వ్రాసిన భగవద్గీత తిరిగీ నేను విమర్శనాత్మకంగా తెలియబరచే అవసరము గానీ,శక్తి గానీ భగవంతుడు నాకు ఇవ్వలేదు. అయినా ఒక్క విషయము మాత్రము శ్రద్ధాళువులతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నము.
భారత యుద్ధ వార్తలను ధృతరాష్ట్రునకు చెప్పుటకై వేదవ్యాసులవారు సంజయునికి కురుక్షేత్ర సంగ్రామము వీక్షించగల దివ్య దృష్టి నొసంగి నియమించిరి.
ఈ గీతా ప్రవేశద్వారము వద్ద మొదట నిలిచినది ధృతరాష్ట్రుడు .
ధృతముఅంటే ధరింపబడిన అని అర్థము, రాష్ట్రుడు అంటే రాష్ట్రమును కలిగినవాడు అని అర్థము. అంటే చక్రవర్తి యని అర్థము. ఈ పేరుకు ఇంకొక అర్థమూ వుంది. ధృతమన్న మాటకు ఆనందము అని ఒక అర్థము. రాష్ట్రము అన్న మాటకు ఉత్పాతము అని ఒక అర్థము (బ్రౌణ్య నిఘంటువు). అంటే ఉత్పాతములయందు ఆనందమును పోడువాడు అని. చూచినారా పూర్వము పేరు పెట్టుటలోని సార్థకత. ఆలోచిస్తే భారత యుద్ధమునకు ఈ పేరే దారి తీయించిందేమో అనిపిస్తుంది.
ఇక రెండవ వాడు సంజయుడు. సత్+జయుడు సంజయుడౌతుందని అందరికీ తెలిసిన విషయమే. 'ఏకం సత్' అన్నది వేదం వాక్కు. అంటే ఆ సత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ను జయించినవాడే సంజయుడు. అంటే వ్యాసుడు విష్ణువు యొక్క అంశయే కదా. సంజయుడు ఆయన అనుగ్రహము పొందుట అంటే ఆయనను జయించినట్లే కదా.
భారతము ఇతిహాసమని సోదాహరణముగా పండితులచేత నిరూపింప బడినది. ఇది ఇపుడు నిర్వివాదము. అప్పుడు ఇందులోని పాత్రల పేర్లు కథ కొరకు పెట్టినవి కావని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. వారి పేర్లు వారి స్వభావమునకు ఎంత అతికినట్లు సరిపోతూ వుందో పైన దొరికిన రెండు మెతుకులు పట్టి చూస్తే తెలుస్తుంది.
కృష్ణుడు అర్జనునకు చేయు గీతోపదేశమటుంచి ఆ ఉపదేశానికి ఉపోద్ఘాతమునకు , ఒక ఉత్పాతములయందు ఉత్సాహము కల్గినవాడు, ఎట్లు నాంది పలుకుచున్నాడో గమనించండి. భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించిన ఈ శ్లోకముతో మొదలౌతుంది.
శ్లో. ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ
ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే
సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?
ఇందులో ఒక అంతరార్థము వున్నది. అదేమిటంటే యుద్ధము చేయుట సహజమే అయినా, యుద్ధము చేయ నిచ్చగించినవారు, చేయనిర్ణయించుకొన్న ప్రదేశము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. వామన పురాణములో ఈ విధంగా చెప్పబడింది. కురు మహారాజు తన సామ్రాజ్యమునకు సరియగు రాజధానిని సమకూర్చుకొన సంకల్పించి ఎన్నో ప్రాంతములను వెదికి ఈ ప్రాంతమునకు వచ్చి ఈ ప్రాంతపు ప్రత్యేకతలను ఈ క్రింది విధముగా తెలుసు కొన్నాడు.
ఈ ప్రాంతము,బ్రహ్మ ఎన్నో వేల సంవత్సరములు తపమాచరించుటవలన బ్రహ్మ వేదిగానూ, సరస్వతీ నది ఉత్తరవాహినియై ప్రవహించుటవలన ఉత్తరవేదిగానూ మరియు సరస్వతీ యమునా నదుల సంగమము ఇచట ఏర్పడుటవలన  ఈ ప్రాంతము దృష్టావతి గానూ పిలువబడేది. ఈ ప్రాంతము సప్త గుణ సంపన్నమైనదని ఎరింగి ఇచ్చట నగరము నేర్పరచ తన అనుచర గణమునకు నిర్దేశించినాడు కురు మహారాజు. ఈ సప్త గుణములేమిటివన: 1.తపస్సు 2.సత్యము 3.క్షమ 4.దయ 5.శుచి 6.దానము 7. బ్రహ్మచర్యము. ఈ ప్రాంతమును రాజధానిగా ఎన్నుకొన్న తన పరమ భక్తుడైన కురు మహారాజుకు శ్రీ మహావిష్ణువు రెండు వరాలను ప్రసాదించినాడు . 1.ఆ ప్రదేశమికపై కురుక్షేత్రముగా పిలువబడుతుందని
2.అక్కడ మరణించిన వారు స్వర్గవాసులౌతారని.
ఋషులు అనేక క్రతువులను నిర్వహించుట వలనను, వేదవ్యాసులవారు వేదములను ఋగ్ యజుస్సామాధర్వణములుగా విభజించుట వల్లనూ ఈ ప్రదేశమునకు ధర్మక్షేత్రమనే పేరు కూడా స్థిరపడినది. అందువల్లనే ధృతరాష్ట్రుడు 'ధర్మక్షేత్రే' 'కురుక్షేత్రే' వాడినాడని చెప్పవచ్చును.
ఇందులో ఒక గూఢార్థము కూడా ద్యోతకమగుచున్నది. 'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల)
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది. ఆ క్షేత్రము వేరే కాదు ఈ శరీరమే. కర్మ చేత బుద్ధి, బుద్ధిచేత ఆలోచనలు, ఆలోచనలు ఆలోచన చేత ఆచరణలు ప్రచోదితమౌతూ వున్నాయి. ఈ కర్మలు ప్రారబ్ధము, సంచితము, ఆగామి ఆసన్న మూడు విధములని మనకు తెలిసినదే! కానీ చేసే ప్రతి పనికీ ఈ శరీరమే ఉపాధి. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే మమకాః అని వాడియుంటాడు. ఇక పాండవాః అని కూడా ఆయన వాడినాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్ఛత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్ఛత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే అంటే ధృతరాష్ట్రునిచే అసంకల్పితముగా  వాడబడినదేమో!
కావున కురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుంది అని  చెడ్డను పుట్టించిన వ్యక్తి(తండ్రి)యే చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విధానమెట్లుండినది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరి భూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథనము కొనసాగుతూనే వుంటుంది.
కావున ఈ వివరణను సంగ్రహించితే,  'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము . రావణునికి పది తలలు అంటారు. రావణుడు దుర్మార్గుడు కావుననే శ్రీరామచంద్రుడు రావణుని సంహరించినాడు అంటారు. రావణుడు మహా పండితుడు భక్తుడు వేదాంతి. ఈ పలుకులను తానే కూడా చెప్పుకొన్నట్లు కొన్ని రామాయణాలలో వింటాము. అన్నీ అట్లుంచి ఒక వాస్తవాన్ని మాత్రము గ్రహించుదాము. ఆయనకు పది తలలు ఉండుట జగమెరిగిన వాస్తవము. అందులో మొదటి నాలుగు పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములైతే మిగతా ఆరు అరిషడ్వర్గములు. మంచిని మించిన చెడుగు ఆయనలో చేరుట చేతనే ఆయనకు పతనము ఏర్పడినదని తలువ వలసి వస్తుంది.  హిరణ్య కశిపునిగా ఆయన సంచితము (భూతకాలానికి సంబంధించినది) ఆయనకీ దుర్దశ తెచ్చినదని మనకు తెలియ వస్తుంది. అట్లు కాకుంటే వేదవాది అయిన ఆయనకేమిటి మరణము. కానీ అది పరమాత్ముడగు శ్రీరామచంద్రుని చేతిలోనే. కావున మన కర్మ మాత్రమె మనతో వుంటుంది. 'కర్మానుగోగచ్ఛతి ఎకమాత్రాః' అనికదా పెద్దలవాక్కు. అందుకే భగవద్గీతలోని మొదటి శ్లోకమే సత్కర్మ ప్రాశస్త్యాన్ని మనకు తెలుపుతూ వుంది. తరువాయి భాగము --5
*******************************************************************
5
ఇప్పుడు మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయ సంవాద విషయమునందు మనము ధృతరాష్ట్రుడు అడిగిన మొదటి ప్రశ్నను ఒక సంస్థానిర్వాహణా కలాపమునకు అనుసంధించి విశ్లేషించుకొనే ప్రయత్నము చేస్తాము. ‘కురు’ అన్న మాటకు To Transact అన్న అర్థమును తీసుకొనవచ్చును. Transactions అన్న పదమునకు ‘లావాదేవీలు’ అని చెప్పుకొనవచ్చును. అది Market Place అంటే ‘కురు క్షేత్రము’ ఔతుంది. మరి దీనికి laid down principles ను ధర్మము అంటే ఇచట ‘వ్యాపార ధర్మము’ ఔతుంది. అంటే కొన్ని నియమ నిబంధనలను అనుసరించి ఈ లావా దేవీలు జరుగుతూ వుంటాయి. ఈ వ్యాపార ప్రక్రియలో ఒకే విధమగు నియమ నిబద్దను అందరూ పాటించితే, అసలు, సమస్య అనేదే  ఉండదు. ‘స్వ’ ‘పర’ అన్న స్పర్ద ఎప్పుడయితే ఏర్పడుతుందో అప్పుడు వైషమ్యాలు మొదలౌతాయి. ఎప్పుడు వైషమ్యాలు మొదలౌతాయో ఎత్తులు జిత్తులు పురుడు పోసుకొంటాయి.
ఇప్పుడు ధృతరాష్ట్రుని విషయములో ఏర్పడినది అదే! ఇంతకాలము తన సామర్థ్యము చేత
ఉన్న సామ్రాజ్యమును (Kingdom) ఏక ఛత్రము క్రింద వుంచగలిగినాడు. పగ్గములు కొడుకు చేతికి వస్తూనే అంతా తనకే కావాలన్నాడు. శత్రుత్వాన్ని కోరి తెచ్చుకొన్నాడు. దీనిని వాణిజ్యమునకు అనుసంధింకొంటే అది ఎంతటి తప్పు పని అన్నది అర్థమౌతుంది.
అందుకే ధృతరాష్ట్రునికి ఈ భయము.
‘ధర్మ క్షేత్రే కురు క్షేత్రే’ ధర్మబద్ధమైన విధి విధానములతో సజావుగా సాగుతున్న విపణిలో స్వార్తపూర్తముగా వ్యవహరించి తన కుమారుడు కోరి శత్రుత్వమును కొని తెచ్చుకొన్నాడు. అట్లని అతను తెలివిలేని వాడు కాదు. యుద్ధమునకు సిద్ధము కావలసిన సమయము ఆసన్నమౌతూనే శత్రువులకన్నా 3 అక్షౌహిణుల సైన్యమును, తానూ ధర్మ వర్ధనుడు కాకున్నా, అదనముగా సమకూర్చుకొన్నాడు. అతను చేసిన తప్పల్లా కేవలము అంగబలమునకు ప్రాధాన్యతనిచ్చి ఆలోచనా బలమును అందిపుచ్చుకోలేక పోయినాడు.
తాను క్రియాశీల నిర్వహణ నుండి తప్పుకొన్నందువల్ల, కొడుకు చెడ్డవాడైనా అతి వ్యామోహము ఉన్నందువల్ల తన కుమారుని సాఫల్య శాతము తెలుసుకోనవలేనాను ఆశతో సంజయుని (Analyst) ను అడుగుతున్నాడు. ఇక్కడ ‘మమకాః’ అన్న మాటను ‘పాండవాః’ అన్న మాటను తన ప్రశ్న లో వాడినాడు. నిజానికి అందరూ తనవారే. ఆ సామ్రాజ్యములో పాండవులూ వాటాదారులే! కానీ ఇటు తనలోనూ తన కొడుకులోనూ స్వార్థము ప్రబలిపోయింది. స్వార్థము ఎప్పుడు రోషద్వేషమోసాలకు అనులోమానుపాతములో వుంటుంది. అందువల్ల అసలు సామ్రాజ్య పునాదులే బీటలుబారే అవకాశము అధికముగా వుంటుంది. ఉండటమే కాదు అదే జరిగింది. నీతి నియమమును ఆధారముగా చేసుకొని ధర్మబద్ధమగు పునాది కలిగినవారి సామ్రాజ్యము హద్దులనతిక్రమించి విస్తరిల్లుతుంది. కారణము ధర్మము మరియు నీతినియమాలు కూడా అనులోమముగానే వుంటాయి.
తన కుమారుని తప్పిదము అర్థమైపోయింది. అత్యాశ అతనిని అంధుని చేసింది. అందుకే అన్నివిధములా పతనమైనాడు. కాబట్టి ఒక ముఖ్యమైన పని చేయుటకు అంగ,అర్థ బలముతోబాటూ ఆలోచనా బలము అంటే బుద్ధిబలము, అదికలిగిన వారిపై గురుత్వము ఏర్పరచుకొని ముందునకు సాగితే ఆశించిన ఫలితమును అందుకొనే అవకాశము వుంటుంది.
తెరవెనుక ద్రుతరాష్టృనియొక్క, తెరముందు దుర్యోధనునియొక్క స్వార్థ పూర్తిత ప్రణాళికతో 18 అక్షౌహిణుల సైన్యమును పొట్టన పెట్టుకొన్నాడు దుర్యోధనుడు. దానికి తెలివిగా వత్తాసు పలికినాననుకొన్నవాడు ధృతరాష్టృడు. అక్షౌహిణి అనగా 
21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు.
ఇటువంటివి 11 కౌరవ పక్షమున, 8 పాండవ పక్షమున యుద్ధము చేయుట జరిగింది.
ఈ 11 అక్షౌహిణుల సైన్యములో కౌరవ పక్షాన మిగిలినది అశ్వథ్థామ, కృపాచార్యుడు మరియు కృతవర్మ. పాండవుల పక్షాన యుద్ధము చేసిన 7 అక్షౌహిణులలో మిగిలినది పంచ పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి. ఒక స్వార్థ ప్రయోజకుని దుర్బుద్ధికి ఎందరు బలియై పోయినారో చూడండి.
 ఎట్టకేలకు పాండవులు గెలిచినా, దీనిని నేటి మానవ వనరుల శాస్త్రము (H R Science) Lose-Lose Situation అంటుంది. అదే, సంధి కి, రాజగు ధృతరాష్టృడు ఒప్పుకొని వుంటే అప్పుడు Win-Win Situation అయివుండేది. అందుకే ఎప్పటికీ పనిచేసి చిన్తిన్చుతకంటే చింతించి పనిచేయుట మేలు.
 మనస్సునకు ఆలోచనాశక్తి, చిత్తమునకు చాంచల్యశక్తి, బుద్ధికి నిర్ణయాత్మక శక్తి ఉంటుందన్న విషయమును సదాజ్ఞాపకము ఉంచుకొనుట సరియైన వ్యాపారవేత్త లక్షణము. వ్యాపారము (Any sort of Business) మన ప్రవర్తన, మన కలుపుగోలుతనము  సాటివారిపై తగినవిధముగా చూపించే ప్రేమాభిమానములపై ఆధారపడివుంటుంది. అసలు కార్యదక్షుడైనవాడు తానూ నాయకుడై(Leader) తన బలగమును (Staff) ను నడిపించవలసి వుంటుంది. ఒక చిన్న పోలికను గమనించండి. ఈ పోలికలోని పసిబాలుని నాయకుని చేయమని నా అభిప్రాయము కానేకాదు. ఆ బాలుడు ఇంటిల్లపాదినీ ఒక్క తాటిపై ఏవిధంగా నడిపిస్తాడో ఆ విధంగా ఒక నాయకుడు మసలవలెనన్నది నా ఉద్దేశ్యము. పరివారమంతా కుటుంబ సభ్యులు అనుకొంటే ఆసేనను తనదారిన తెచ్చుకోగలవాడు ఆ యింట దోగాడే పసిబాలుడు. ఇంటివారంతా ఆ బాలునే అనుసరిస్తుంటారు. తాను చేసే పనిని వారంతా ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు, అభినందిస్తారు. ఒక నాయకుని లక్షణము అదే!  
తరువాత నాకు తోచిన సార్వజనీన సమస్యలకు  భగవద్గీత యందలి పరిష్కారముల గూర్చి  మాట్లాడుకొందాము.
అల్పజ్ఞుడను. తప్పులు క్షమించేది.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాం
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా స్సుఖినోభవంతు
ఈ ఉపోద్ఘాతము  పాఠకులకు నచ్చితే లౌకిక సమస్యలకు భగవద్గీత సలహాలను గూర్చి ఒక్కొక్కటిగా చర్చించుకొందాము.   

స్వస్తి

ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)

ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)
https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_22.html

ఎంచి జూచి నిజము నేర్పడ జెప్పెద
ఉన్న మాటకేల ఉలుకు నీకు
నాటి ఘనుల దారి నడువుము యువకుడా
దేశ హితము చేతి దీవిటీగ
విశధముగా ఈ క్రింది లంకెలో భక్తీ ధ్యాసలతో చదివి భావి దేశ పురోగతికి బాట వేసేది.

ఈ ఉపోద్ఘాతమంతా మీరు ఈ దిగువ కనబరచిన లంకెలో మన పూర్వుల ఆవిష్కరణలు చదివి చైతన్యవంతులగుదురన్నది నా ఆశ.
https://cherukurammohan.blogspot.in/2018/04/blog-post_22.html

కల్లబొల్లి పలుకు కడుతీయనై తోచు

ఉన్నమాటకేల ఉలుకు నీకు 

మసిని పూసి చేయు మారేడుకాయలు 

వైద్యగుణములెట్లు బడయ గలవు 

 

ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)
ఆపి స్వర్ణమయీ లంకా నమె లక్ష్మణ రోచతే l  
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ॥
ఇది వాల్మీకి రామాయణములో లేని శ్లోకము కానీ ఈ శ్లోకము యొక్క సాంద్రత మాత్రము  వాక్కునకతీతము. శ్రీరామ చంద్రునితో లక్ష్మణుడు లంకాపురీ ప్రవేశము చేస్తూ చెప్పే మాటకు శ్రీరాముని సమాధానమిది. 'మాతృభూమి స్వర్గమునకన్నా గొప్పది'. మన పూర్వులు ఆ మాటను తు,, తప్పక పాటించినారు. పేరుకు ఇసుమంత కూడా ప్రాకులాడలేదు. వారి ఆవిష్కరణలు తెలుసుకొంటే అవాక్కయి పోతాము. 50 సంవత్సరముల క్రితము ఎవడయినా నాలాంటివాడు వాళ్ళ గొప్పదనము చెబితే మనవాళ్ళే వెక్కిరించేవారు. నేడు పరిస్థితి మారినది. రుజుమార్గమున నడిచే ఆలోచనలు కలిగిన వారు కష్టపడి గతమును త్రవ్వి తెలుసుకొంటున్నారు. మిగతా వారి కొరకే నేను వ్రాసే ఈ రాతలు. వాస్తవాన్ని గ్రహించి యువత దేశాభ్యున్నతికి భాషాభ్యున్నతికి పాటుపడగలిగితే  మన ప్రగతి జగతికే తలమానికమౌతుంది.
ఆనోభద్రాః క్రతవో యంతు విశ్వతో వి దభ్దాసో అపరితాస ఉద్బితఃI
 దేవానో యథా సదమిధృతే అసన్నప్రాయువో రిక్షితారో దేవేదివేII ఋగ్వేదము 25-14.
సద్భావనా సుమసౌరభములు దశాదిశలనుండి మనల నలరించుగాక.
ఈ ఉపోద్ఘాతమంతా మీరు ఈ దిగువ కనబరచిన లంకెలో మన పూర్వుల ఆవిష్కరణలు చదివి చైతన్యవంతులగుదు రన్నది నా ఆశ.
https://cherukurammohan.blogspot.in/2018/04/blog-post_22.html
ఎంచి జూచి నిజము నేర్పడ జెప్పెద
ఉన్న మాటకేల ఉలుకు నీకు
నాటి ఘనుల దారి నడువుము యువకుడా
దేశ హితము చేతి దీవిటీగ
ఆర్యావర్తము, అజనాభము అన్న పేర్లను కలిగి అంకెలకు అందని కాలములోనే సృష్టికి ఆది యగు ఈ భారతావని మహనీయులకు ఆటపట్టు. నిరంతర నియమనిష్టాగరిష్ఠులగు మహర్షులకు ఆలవాలము. శరదిందు చంద్రికా ధవళ కాంతులతో  కలకాలము మెరిసే శాస్త్రజ్ఞ తారకల వినీలాకాశము ఈ దేశము.
కానీ మన పూర్వుల గొప్పదనము తెలుసుకొనే సామర్థ్యమును మనలో మిగిలించలేదు మనలనేలిన ఆంగ్లేయులు. మేలుకొంటే, అంతవరకూ మనమున్న స్థితిని  నిద్ర అంటారు, అట్లు కాకుంటే మరణము అంటారు. మరణము కన్నా మేలుకొనుట మేలుకాదా! కావున మేలుకొందాము, ఖర్చయినా పరవాలేదు మేలు కొందాము.
ఈ ఉపోద్ఘాతమును ఇక్కడ నిలిపి నాటి మన ద్రష్టల, ఋషుల, శాస్త్రజ్ఞుల, ఇతిహాసకారుల ఆవిష్కరణల గూర్చి తెలుసుకొందాము. తాళ పత్రములలోని మన యొక్క విజ్ఞానమును దోచుకొని తమవిగా తమ పేరును ఆయా ఆవిష్కరణలకు తగిలించుకొనిన పయోముఖవిషకుంభములను ప్రభంజనములై పగులకొట్టుట నేటి యువత కర్తవ్యము.
ఇక ఈ వాస్తవాలను గమనించండి.
గర్భవతులు, భక్తిగాథలు వీరగాథలు వినవలెనని, మనసును ప్రశాంతముగా  వుంచుకోనవలెనని, భీతావహ, విషాద సంఘటనలకు దూరముగా ఉండవలెనని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కృతయుగములో ప్రహల్లాద చరిత్ర, ద్వాపరములో అభిమన్యు వృత్తాంతము ఇందుకు ప్రబలమైన ఉదాహరణలు. అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని లేక శ్రీకృష్ణుని చిత్రపటాన్ని చూలాలు తన మంచమునకు దగ్గరగా గోడకు తగిలించియుంచుకొనవలెనన్నది  పెద్దల మాట. మరి ఈ గొప్పదనమును ఫ్రాయిడ్ కు అంటగట్టుట న్యాయమా! మన పెద్దలు మనకు మంచిని ఉపదేశము చేసినారేకానీ మేమే లోకానికి చాటినదని చంకలు గుద్దుకోలేదు. మన ఆవిష్కరణలకు తమ పేర్లను ఎంత చక్కగా అతికించుకొన్నారో గమనించండి.
పాశ్చాత్యులు ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ ని ప్రతిపాదించి ఒక మహాగ్నిగోళం బ్రద్ధలయి సృష్టి ఏర్పడిందని తేల్చినారు కదా! A Belgian priest named Georges Lemaître first suggested the big bang theory in the 1920s when he theorized that the universe began from a single primordial atom.
మరి ఈ భారత భూమిలోని అనామకుడు కూడా "బ్రహ్మాండం బద్దలయ్యిందనే" అంటున్నాడుకదా! మరి ఈ వేదచోదిత వాస్తవాన్ని సామాన్యుని నాలుకపై నాన జేసియు పేరుకు ప్రాకులాడని మన ద్రష్టలు ఎంతటి గొప్పవారు, ఒకపరి ఆలోచించండి. భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్టులు చెబుతున్నారు కదా!
పాశ్చాత్యుల ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకుపూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర ప్రకారము సృష్టి జరిగి 195,58,85,123 సంll (2021 వరకు) అయినవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతివర్షము తెలియజేస్తారు. “మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్ జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5119 (2022 నకు) సంవత్సరములైనది. ఇంత నిర్డుష్ఠముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”. మరి మనశాస్త్రములు నిరాధారమయినవా! సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు అయిన పూర్వీకులు పాశ్చాత్యులు చెప్పినట్లు ఆటవికులా! అనాగారికులా!

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది  మళ్ళీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముకుళిత సూత్రము కదా!
      మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పాంతమునందు సకల ప్రాణులూ తనయందు లీనమవుతాయని మళ్ళీ కల్పారంభములో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు వున్నది కదా! అసలు మనవారి సిద్ధాంతమునకు మూలము భగవంతుని నిశ్వాసమగు వేదము కాదా!

'ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుం'దనేది (For every actio there is equal and opposite reaction)న్యూటన్ చెప్పిన సూత్రముగా మనము పాఠ్యాంశములలో  చదువుతూనే ఉన్నాము కదా!
 మరి వేల సంవత్సరాలనుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతము చెప్పేది అదికాదా! ఒకచేతితో చేస్తే వేరొక చేతితో అనుభవించవలసిందే అన్న నానుడి ఏ చదువురాని వ్యక్తిని అడిగినా చెబుతాడు. మరి అంతమాత్రానికి న్యూటన్ ఎందుకు? అసలు ఎవరు ముందు చెప్పినట్లు?

ఇక తొలివిమాన నిర్మాణము  చేసిన మేధావులు రైట్ సోదరులు అని కదా
మనచేవులలో ఆంగ్లేయ విద్యావేత్తలు బాకాలూదినారు.  
రైట్ సోదరుల కంటే ముందు శివకర్ బాపూ తల్పాడే అనే పండితుడు భరద్వాజుని ‘యంత్ర సర్వస్వము’ అన్న గ్రంధములోని ‘విమాన శాస్త్రము’ ఆధారంగా తయారుచేసిన  ‘మరుత్సఖి’ గాలిలో ఎగిరింది కదా! ఆయనను మభ్యపెట్టి ఆ విమాన నిర్మాణ సూత్రములను గ్రహించిన ఆంగ్లేయులు రైటు సోదరులకమ్మి సోమ్ముచేసుకొని తల్పాడే గారిని పిచ్చివానిగా చేసి, ప్రప్రథమ విమాన నిర్మాతలుగా వారికి పట్టము కట్టినారు. ఆ విమాన నిర్మాణమునకు మన తెలుగువాడయిన వేదమూర్తులు సుబ్బరాయ శాస్త్రిగారి సహకారము తల్పాడే గారికి ఉండినదని ఎంతమందికి తెలుసు.

మొక్కలకు ప్రాణము వున్నదని  నిరూపించినది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా! ఆ ఆవిష్కరణకు ఆధారము అధర్వణవేదము కాదా! మన గ్రంధాలలో వృక్షముల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే! మన ఋషులు యాగాది క్రతువులకు దర్భ మొక్కలను  భాధ పెడుతున్నందుకు క్షమించమని ప్రార్థించే దర్బలను కోసేవారని, ఆవిధములగు మంత్రములు వేదములలో వున్నాయని పెద్దల ద్వారా విన్నాను. మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా!

వృక్షాదిః ప్రాణ సంబంధి 16.57

ఛాందోగ్యోపనిషత్తు

అస్య సౌమ్య మహతో వృక్షస్య యహా మూలే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్, యోమధ్యేభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్

యహ అగ్రే అభ్యహన్యాత్ జీవన్ స్రవేత్ సహా ఏతేన  జీవేన ఆత్మనా అనుప్రభూతః తెతీయమానః మోదమానః తిష్ఠతి.

వృక్షము యొక్క మొదలుకు దగ్గగ్గరగా ఒక బలమైన గాటు పెడితే ఆ గాటు నుండి ఒక రసమేదో ఊరుతుంది. దానిని సంస్కృతములో నిర్యాసం అంటారు. తెలుగులో నాకు తెలిసి 'రసి' అని పిలుస్తారు. చెట్టుకు మధ్యలో గాటు పెట్టినా ఆ 'రసి' వస్తుంది. పైన గాటు పెట్టినా వస్తుంది. మనకు కూడా అంతే కదా ఎక్కడ గాటు పెట్టినా ఒక ఎర్రటి ద్రవము ముఖ్యముగా వస్తుంది. దానిని మనము 'రక్తము' అంటాము. అంచనా వేయలేని కాలముననే ఇటువంటి వాస్తవములు చెప్పిన మనపూర్వులు గొప్పవారు కాదా!

పెద్దపెద్ద వృక్షాలగా రూపు దిద్దుకొనే  మొక్కలను  రూపలక్షణములు మారకుండా కుండీలలో 

చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్త్రమని అనుకోనుచున్నాము కదా!

మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్ని  తెలిపినాడే! దానిని గూర్చి ఏనాడయినా విన్నామా చదివినామా!
తులసి మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాదుల్ని అరికట్టవచ్చని వైద్యులు ఇప్పుడు ఒప్పుకుంటూ వుంటే ,  మరి యుగాల కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజించుచున్నామని మనలోనే ఎందఱో మూర్ఖులు ఎగతాళి చేసేవారే ఎందువల్ల?
సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటున్నాము కదా! మరి మన వేద పురాణాలలోనే  ఈ "బడభాగ్ని"ప్రస్తాపన ఏవిధముగా వచ్చినది?
భారతీయ సంతతికి చెందిన గోవు మానవుని ఆరోగ్య ప్రదాత అని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు నిర్దారిస్తే....మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ అనంత యుగకాలము  నుండి  మనకు ఎవిధముగా సంక్రమించినది చెప్పవచ్చు?
లోహవిజ్ఞానంలో ఆధునిక Scientists ఎంతో పురోగతి సాధించినట్లు చెబుతున్నారుకడా! మరి ఢిల్లీలో వున్న ఉక్కు స్తంభము (విష్ణు ధ్వజము) ఇప్పటికీ త్రుప్పు పట్టకుండా నిలిచి వున్నది, అది కాక కొల్లూరులో జాలరులచేత నిర్మింపబడిన త్రుప్పు పట్టని స్తంభము  ఇంకొకటి నేటికీ వున్నది. నేను కుటుంబముతో కూడా వెళ్ళినపుడు చూచినాను. ఇంతటి విజ్ఞానము తమవారికి ఆ కాలములో లేదని నేటి Scientists కూడా ఆ రహస్యము తెలియలేదని తెలియజేయుచున్నారా! మరి జాలరులు బ్రాహ్మణులు కాదుకదా! మరి వారికి ఇంత విజ్ఞానము ఎట్లు అబ్బినట్లు?
యశదమును (zinc) ముడిపదార్థమునుండి వేరుపరచుట మనకు తప్ప అసలు ప్రపంచ దేశములలో ఎవరికీ తెలియని కాలములోనే మనకు తెలుసు. యశదమును ఖనిజము నుండి వేరు పరచు విధానము మన వారికి మాత్రమే 4000 సంవత్సరముల క్రితమే తెలుసు.ఆ విధానము ఒకసారి గమనించండి.యశదము 997 డిగ్రీల సెల్షియస్ లో ద్రవీభవించుతుంది. అది 1000 సెల్షియస్ లో ఆవిరి ఔతుంది. అంటే  ముడేమూడు డిగ్రీల వ్యత్యాసములో ఈ పరివర్తన జరుగుతుంది. సాధారణంగా క్రింద వేడిచేసి పైనుండి ఆవిరిని వేరొక పరికరములోనికి పట్టి లోహమును వేరుచేస్తారు. కానీ మన పూర్వులు మంట పైనపెట్టి క్రిందినుండి తగిన పాత్రలలో, సరియైన ఉష్ణోగ్రత వద్ద పట్టి దానిని శీతలీకరణ విధానముతో  దానిని యశదముగా మార్చుతారు. మరి మనవారు అంతటి ఘనులని ఎవరయినా Scientists తెలిపినారా!
నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక నిపుణులు (Engineers) చాలా ముందున్నట్లు  చెప్పుకుంటారు  కదా!
అయితే వేలకు వెల  వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే, గత 500 సంII లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
మన పూర్వులగు శాస్త్రజ్ఞులు గొప్పవారా కాదా!
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ..... ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంబాలు గాల్లో నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో వ్యతిరేకదిశలో పడే అద్బుత కట్టడములు వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానము ఏమిటి?
అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!
     మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం"అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని వ్రాసిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరువచ్చినట్లు తెలుస్తోంది....ఎవరు ముందు చెప్పినట్లు?? 
రామాయణములో, లంకలో విద్యుత్ ఘటములు (Cells) వాడి విద్యుదుత్పాదనతో కోట తలుపులు యాంత్రికముగా మూసి తెరిచే విధానము, విద్యుద్దీపముల వాడకము ఉండినది. అనార్ద్రఘటము (Dry Cell) ఆవిష్కరించిన మహనీయుడు అగస్త్య మహర్షి. 
మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మన Scientists కు తెలియదని కదా మన శాస్త్రజ్నులపై ఒక అపప్రథ. మరి రసవిద్య నాగార్జనుడు ఏవిధముగా నేర్చుకొని లోకానికి చాటగలిగినాడు.
సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!
    మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః"అని చెప్పినారనుకుందామా?

భూమినుండి విడివడిన శకలమే అంగారకుడు అని నేటి Scientists చేబుతూవున్నారే మరి అంగారకుని ‘భూమి పుత్ర’ అనేకదా వేదాలు చెబుతూ వున్నాయి.
  ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వమే చెప్పిన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయినట్లు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే దూర్భిణి (Telescope) సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించినాడే, (ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం) మరి దాని మాటేమిటి?
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చిచెప్పిన విషయమును ఎంతమందిమి చదివినాము, ఎందరికి తెలుసు? 
ఖగోళము, జ్యోతిషముల యందు ఎన్నో ఆవిష్కరణలు చేసిన మన పూర్వులు అసామాన్యులు. గణితమునకు వారు అందించిన ఆవిష్కరణలు అపారము. త్రికోణమితి (Trigonometry) కలనము (Calculus), బీజగణితము(Alzebra), రేఖాగణితము (Geometry) ఈవిధముగా ఎన్నో గణిత శాఖలలో మంనవారు పేరుకు ప్రాకులాడక చేసిన ఆవిష్కరణలకు ఆంగ్లేయులు తమ పేరును ముందు ఉంచుకొన్నారు.  మన ఇస్రో నాసా వారు కూడా, తమసందేహములను, వేదపరమైన సమాదానములతో, నేటికి కూడా పూరీ శంకరాచార్యులగు నిశ్చలానంద సరస్వతి స్వాములవారి  నివృత్తి చేసుకొంటూ ఉంటారు. 

ఇయాన్ స్టీఫేన్సన్ అన్న psychiatrist పునర్జన్మ ఉన్నది అని ప్రయోగ పూర్వకముగా నిరూపించినాడు. ఒక నడుము నొప్పిచేత బాధ పడుచున్న వ్యక్తిని trans లో ఉంచి వివరాలు తెలుసుకొంటే గత జన్మలో తన ఊరిని ఆనుకొని ఉన్న అడవికి వెళితే దుండగులు బలంగా కొడితే నడుమోనొప్పి కలిగినట్లు తెలిపినాడు.  యథా స్థితి చేరిన పిదప ఆ నొప్పి మాయమయ్యింది. అంటే అంతకాలమూ అనుభవించినది ఆత్మగతమగు నొప్పి అని అవగతమైనది. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు 1960 ప్రాంతములో మనదేశములో కూడా తెలియవచ్చినాయి. పునర్జన్మ లేదు అని వాదించే అనంత మేధావులంతా తమ మతమును కాపాడుటకు అబద్ధములు చెబుతున్నారు అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరి 'వాసాంసి జీర్ణాని యథా నిహాయ' అని చెప్పిన భగవద్గీతకంటే ఈయన ముందువాడు కాదుగదా!

యాజ్ఞవల్క్య స్మృతి, మను స్మృతి, పరాశర స్మృతులను పెట్టుకొని న్యాయ శాస్త్రము కొరకు వెంపర్లాడ వలసిన అవసరము మనకేమి పట్టినది. ఏతా వాతా కాలానుగుణమగు మార్పులు చేసుకోవలసి రావచ్చు అంతేకదా! మరి ప్రస్తుత భారతదేశం న్యాయవ్యవస్ద, విదేశాలను అనుసరించింది అని వాదిస్తుంటారే! అది తప్పు కాదా!
శుశ్రుతుడు మొదటి శస్త్ర చికిత్సకుడు. దివోదాసు,చరకుడు మొదలగువారు  ఈ భారత ఖండమునకు ఆదివైద్యులు. అప్పటికి ఐరోపీయులే కన్ను తెరువలేదు, ఇక వైద్యమెక్కడిది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! మన పూర్వుల ఆవిష్కరణలను గుర్తించక పోగా అంతా తమ తెలివి తేటలే అన్న వారి మాటలకు బసవన్నల మాదిరి తలలూపుచున్నామే, మరి ఇకనైనా కనులు తెరువనవసరము లేదా! మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది.
జలవనరులనుపయోగించుట , flush Toilets అన్నపేరుతో నెడు మనము ఉపయోగించే ప్రసాధనలు (Toilets),ఆ మలినజలము పోవుటకు భూగర్భ జలమార్గములు సింధూనాగరికతలో బయల్వెడలినవని  జిజ్ఞాసవున్న ప్రతి చదువరికీ తెలుసు. అంటే నేటి ఈ Toilet విధానము మన పూర్వులకు క్రొత్త కాదు అన్న విషయము తెలియుట లేదా!
గ్రీకులు తోళ్ళు కట్టుకొనే కాలానికే మనము నూలు వస్త్రములు కట్టేవాళ్ళము. ఎవరి నాగరికత ముందు అన్నది ఒకపరి ఆలోచించండి.
నేడు చీడ పురుగులచే వక్రీకరింపబడిన మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను, గ్రంధాలను, ఇతిహాసాలను తూలనాడే స్థితిలో దయవుంచి వుండిపోవద్దు.
వివేకానందుడు పదే పదే  మనకు ప్రభోదించిన కఠోపనిషద్వాక్యము
ఉత్తిష్ఠ జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధార నిశితాదురాత్యయ” (Arise, Awake and Stop not, until the goal is reached) మరువవద్దు.
భారతమాత బిడ్డలుగా పుట్టినందుకు గర్వించుదాము. ఇప్పటికీ మనము ఎందులోనూ తక్కువ కాదు. ప్రయత్నిస్తే మనము మాధ్యందిన మార్తాండులము కాగలము.
స్వస్తి.