Friday, 14 July 2017

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ


గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
https://cherukurammohan.blogspot.com/2017/07/blog-post_14.html
ఒక సారి కంచి మహాస్వాములు నడిచే దైవమునగు శ్రీ శ్రీ శ్రీ  చంద్రశేఖర యతీంద్రులు శ్రీశైలమునకు బయలుదేరి వస్తూ వున్నారు..
 కర్నూలునకు  దగ్గరగు  ఒక ప్రాంతం లో  స్వామి వారిని పూర్ణ కుంభముతో  అహ్వానము పలికి సభ ఎర్పాటు చేసినారు. స్వామి వారు బహుభాషా ప్రావీణ్యులు. స్వామివారు  వేద సంరక్షణ, భారతీయ వైభవం గురించి తెలుగులో  అనుగ్రహభాషణమునిచ్చి తీర్థ ప్రసాదలతో ఆశీర్వదించి మళ్ళీ యాత్ర  మొదలు పెట్టినారు. 73 ఏళ్ళ పీఠ నిర్వహణలో తమ ప్రయాణములను కాలినడకనే సాగించిన మహనీయుడు ఆయన. అప్పుడే వర్షం  మొదలయ్యింది.  స్వామివారి అడుగులు ఆగలేదు. వారికి ఎదురు చేప్పే ధైర్యమూ ఎవ్వరికీ లేదు.  స్వామి వారి మీద భక్తితో శిష్యులు పల్లకి ఎక్కమని విన్నవించినారు. అందుకు స్వామి వారు నవ్వుతూ "మీరు తడుస్తూ ఉంటె నేను పల్లకి లో ఎలా రాగలను?"  అంటూ ముందునకు సాగినారు. ఆవిధముగా కొంత దూరము నడచిన పిదప  ఒక పల్లెటూరు  వచ్చింది. ఆ ఊరి జనాలందరు స్వామి వారికి సాష్టాంగ నమస్కారలుచేసి స్వామి వారిని అక్కడ బస చెయమన్నారు. వారి గురుభక్తికి సంతసించిన స్వామివారు సరేనన్నారు.
ఆ ఊరిలో పండుగ వాతావరణము నెలకొనింది.
తెల్లవారింది. చంద్రమౌళీశ్వరుని నిత్య సేవన జరుగవలసి వున్నది. అందుకు గానూ పూలయితే సమకూర్చినారు కానీ   బిల్వ దళములు సమకూర్చలేక పోయినారు పరివారము.   బిల్వ దళములు లేకుండ పూజ పూర్తి కాదు. స్వామివారి అర్చనకు అవాంతరము ఏర్పడుచున్నదని శిష్యులంతా  కంగారుపడుతున్నారు. స్వామి వారు స్నానాది కార్యములను ముగించి, పూజకు  కూర్చుని   బిల్వ దళాలు ఎక్కడ అని అడిగినారు. శిష్యులు భయపడుతూ తమకు దొరకలేదని విన్నవించుకొన్నారు.   అప్పటికే  10.30 అయ్యింది .స్వామి పూజకు కామాక్షి అమ్మదే బాధ్యత అన్నట్లు  మౌనంగా ధ్యాన మగ్నులైవుండిపోయినారు. ఎవరి చింతలో వారున్న సమయములో ఆఇంటి అరుగు పై ఒక బుట్టలో బిల్వదళములనుంచిన వ్యక్తిని గమనించినవారుగారు. పరివారము స్వామివారికి విషయము చెప్పి బిల్వమిచ్చుటతో నిత్యపూజ నిరాఘాటముగా జరిగిపోయింది.  మరుసటి  రోజు కూడా అదే వరుస. ఎవరు పెడుతున్నారో వారిని గమనించి తమ వద్దకు తెమ్మన్నారు స్వామివారు. యధావిధిగా ఒక గోపాల బాలుడు బుట్ట పెట్టి వెంటనే వెనుదిరిగి పోయేలోపల  శిష్యులు పిల్లవాడిని  గమనించి ఆతనికి నచ్చజెప్పి స్వామివారి వద్దకు రమ్మన్నారు. ఆ పిల్లవాడు స్నానం చేసి  మంచి బట్టలు వేసుకొని స్వామి వారి దర్శనమునకు వస్తాననిచెప్పి ఇంటికి వెళ్లి పరిశుభ్రుడై వచ్చినాడు. అప్పటికి పూజ ముగుసి భోజనాదులు అయిపోయినాయి. పరివారము ఆ బాలుని స్వామివద్దకు తోడుకొని పోగా, స్వామివద్ద,  భయపడుతూ నిలబడినాడు విధేయతతో ఆ బాలుడు. స్వామి ఆ అబ్బాయి పేరు అడగగా "పురంధర కేశవులు" అన్నాడు.  స్వామి అంతటితో ఆగకుండా "మీ తలిదండ్రులను గూర్చి తెలుపుము" అన్నారు. అందులకా బాలకుడు " మా అమ్మ నా 2 ఏళ్ళ వయసులో చనిపోయింది మా నాన్న నన్ను పెంచటం జరిగింది. ఆయన నాలో బాల్యము నుండి, భక్తి భావము ,పెద్దలఎడ గౌరవము, పురంధర, త్యాగరాజస్వామి  కీర్తనలు, ఇంకా ఎన్నెన్నో నెర్పినాడు.  నాకు పురంధర అని పేరు కూడాపెట్టినాడు. ఆయనతో పశువుల కాచుటకు పోవు సమయమున కొండకు దగ్గరగా  దారిలో వున్న బిల్వవృక్షమును చూపి "దీనిని మారేడు చెట్టు అంటారు. ఈ చెట్టుకు మూడు ఆకులు ఒకటిగా కలిసి వుంటాయి. దానిని దళము అంటారు. విడిగా ఒకే ఆకు ఉండదు. ఇది శివ పూజకు ఎంతో ముఖ్యమయినది అని చెప్పేవారు." 

మా తండ్రిగారు కూడా మరణించి 2 సంవత్సరములైనది. నాకిప్పుడు 12 సంవత్సరములు" అన్నాడు.  స్వామి వారు పిల్ల వాడి వినయానికి భక్తికి పొంగి పోయి "నాయనా నీకేమయినా నన్ను కోరవలెనని వుందా"  అన్నారు.   పిల్లవాడు "స్వామి మా నాన్నగారి కోరిక ఒకటుంది". మా తండ్రి నాతో " నాయనా ఈ దారి మహాపురుషులు శ్రీశైలమునకు వెళ్లేదారి. వారు ఈదారిన వచ్చినపుడు మరువక వారిని సేవించు అన్నాడు. వారికి నిరుపేదలమైన మనము ఇవ్వగలిగినది ఈ బిల్వదళములే! వారు ఒకవేళ ఈ వూళ్ళో బస చేస్తే  వారికి  నిత్యం ఈ దళములను పూజకు గానూ ఇవ్వమన్నారు. ఆయన ఆదేశము, నా మదిలోని కోరిక ఇప్పటికి నెరవేరినది స్వామీ! "మీరు నన్ను కోరమన్నారు కావున నేను  మీతో రెండు కోరికలు విన్నవించుకొంటాను"అన్నాడు. స్వాములవారు కూడా ప్రసన్నులయి వల్లె యన్నారు. అప్పుడు ఆబాలుడు ఇట్లన్నాడు "ఒక్కటి మీ దగ్గర నాకు వచ్చిన పురంధర,త్యాగరజ స్వామి కీర్తనలు ఇక్కడ మీరు ఉన్నంత కాలమూ నాచే వినిపించనివ్వండి." అన్నాడు. స్వామి వారు సంతొషించి అలాగేనని ఇంకొక కొరిక ఏమిటని అడిగినారు. ఆబాలుడు " అది మీరు ఇచట నుండి బయలుదేరే సమయములో అడుగుతా"నని  అని సాస్టాంగ దండప్రణామము నాచరించి అప్పటికి శెలవు  తీసుకొన్నాడు.  స్వామి అచట మొత్తము 21 దినములు బసచేసినారు. 22 వ రోజున స్వామి బయలూదేరు సమయమున తన పరివారముతో ఆ బాలుని పిలుచుకొని రమ్మన్నాడు. వారు ఆ బాలుని తోడుకొని వస్తే స్వామి ఎంతో వాత్సల్యముతో  "ఆ రెండవ కొరిక  ఏమిటి" అని అడిగునారు.  ఆ బాలుడు కూడా ఎంతో వినయముతో "స్వామి మీరు తప్పక ఇస్తానంటేనే చెబుతా"నన్నాడు. స్వామి వారు నవ్వి అలాగే అనగా ఆ బాలుడు " స్వామి నాకు మరు జన్మ లేకుండ మోక్షం ఇప్పించండి అని అడిగాగినాడు. స్వాములవారు ఆ బాలుని  భక్తికి పొంగిపోయి 'ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు' అని ఆశిర్వదించి ఆచటినుండి బయలుదేరినారు.   
కాల చక్రము ఎవరికొరకూ ఆగదు కదా!  40 సంవత్సరములు యిట్టే గడచిపొయినాయి. ఒకసారి కంచి మఠం లో ఉన్నట్టుండి స్వాములవారు మధ్యానం 2 కు తటాలున లేచి వెంటనే  కామక్షీదేవి  గుడి పుష్కరిణికి వెళ్లి శిరస్నానమునాచరించుతూ ఎవో మంత్రాలు జపిస్తూ 6 సార్లు మునక వేసినారు. శిష్యులకు ఎందుకిదంతా స్వామివారు చేస్తున్నారు అన్నది తెలిసిరాలేదు.  జంకుతూ స్వామిని "ఈ సమయములో మీరు ఎందుకు రావలసి వచ్చినది, ఎందువల్ల శిరస్నానమునాచరించినారు"  అని అడుగగా  పాత శిష్యులను కొందరిని చూపిస్తూ  " వీరికి గుర్తుంటుంది, 40 సంవత్సరముల క్రితం కర్నూలు దగ్గర పల్లెటూరులో 'పురంధర కెశవులు' అన్న 12 సంవత్సరముల బాలుడు  పూజ కొరకు బిల్వదళాలు మనమున్నన్ని రోజులూ తెచ్చిఇచ్చినాడు. ఆతడు ఇపుడు  52 ఏళ్ళ వయసులో  వ్యాధిగ్రస్తుడై మరణించినాడు. అప్పుడు మోక్షం కావాలని కోరియుండినాడు కదా! అతనికి ఇంకా 6 జన్మల కర్మ శేషమువున్నా  చంద్రమౌళిశ్వరుడు కరుణించి ఇప్పుడే మోక్షం ఇచ్చినాడు అన్నారు. అందరు స్వామి వారి జ్ఞాపక శక్తికి, ఆయన మహత్తుకు,దయకు నివ్వెరపోయినారు.
అందుకే సద్గురువు దొరకవలెనన్నా పూర్వపుణ్య ఫలము ఉండవలెనని పెద్దలు చెబుతారు.
గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేనమః
స్వస్తి

2 comments:

  1. Very nice sir. Quite interesting information. Thanks for posting.

    ReplyDelete
  2. ఎంతో ఆశ్చర్యం కలిగించే యదార్ధ గాధ. ఆ బాలుని నిర్వికార దృష్టి వైరాగ్యం,మరుజన్మ లేకుండా చేయమని శ్రీ పరమాచార్యుల వారిని కోరడం,నలభై సంవత్సరాల తరువాత అతను మరణించే సమయంలో ఆ విషయం అపార కరుణామూర్తి శ్రీ పరమాచార్య వారికి తెలియడం
    వారు ఆరు సార్లు స్నానం చేయడం ఆయన జన్మ రాహిత్యానికితన తపశ్శక్తితో పరమేశ్వరుని కృపను వర్షింపజేయడం మహదాశ్చర్యకరమైన విశేషాలు...
    ఇన్ని గొప్ప విషయాలు తెలిపారు... మీకు అనేక ధన్యవాదములండీ.వందనములు రామ మోహన రావు గారూ.🌹🙏🙏🙏🌹

    ReplyDelete