Thursday, 13 July 2017

భీష్ముడు

భీష్ముడు  -- 1వ భాగము
భీష్మ జననము
భారత ఇతిహాసమునకు ముందు కాలములో దేవతలగు అష్టవసువులు తమ భార్యలతో ఒకసారి భూమిపైకి విహారమునకు వస్తారు. అది వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతము. ఆ ప్రకృతి రామణీయకతకు ముగ్దులౌతారు వారు. అంతలో మహర్షి అల్లారుముద్దుగా చూసుకొనే 'నందిని' , కామధేనువు సంతానముగా పురాణ వాక్యము, వారి కంట పడుతుంది.ఆ ధేనువు అందమునకు ముగ్ధయయిన, అష్టవసువుల్లో కడపటివాడయిన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు కావలెనంటుంది. వసువులందరూ వారించినా వినదు. భార్య మాటకు కట్టుబడి ఆ దేనువును తెస్తాడు ప్రభాసుడు. నందిని కూడా దైవంశ సంభూత కావున జరగబోయే మహాభారత సమరానికి తన పాత్రను ప్రాతిపాదికగా చేసింది.
వశిష్ఠుడు పర్ణశాలకు వచ్చి తన దివ్య దృష్టిచే జరిగినది గ్రహించి అష్టవసువులకు మానవులై పుట్టమన్న శాపాన్నిస్తాడు. విషము తెలిసిన వసువులు తమ తప్పు మన్నించమని ఆయన పాదాలపై బడితే ఒక్క ప్రభాసుడు తప్ప తక్కిన వారంతా పుడుతూనే మరణించి యథాస్థానము చేరుతారంటాడు. వారుకూడా సంతసించి వెళుతూ తమతల్లిగా గంగాదేవి కావలెనన్న తలంపుతో ఆమెను అర్థించుతారు. ఆమెయు వల్లెయని ద్వాపర యుగములో అది నెరవేరగలదని చెబుతుంది.
ద్వాపరమున హస్తినాపురి మహారాజయిన శంతనుడు గంగా తీరమునకు వేటకు వెళ్ళినపుడు గంగ ఒడ్డున ఒక స్త్రీనిచూచి ఆమె దివ్య సౌందర్యమునకు మైమరచి ఆమె వద్దకు వెళ్లి తనను గూర్చి చెప్పుకొని, పెళ్ళియాడమని అర్థించుతాడు.
అందులకు గంగ "మహారాజా! మీరు మీరుకానీ వేరేవరయిన కానీ నాగురించి, నాకులమును గూర్చి ప్రస్తావించ కూడదు,నేనేమిచేసిన కారణమును గూర్చి ప్రశ్నించ కూడదు, నాపై కోపపడుట, అప్రియములగు మాటలు మాటలాడుట చేయ కూడదు. అట్లు జరిగిన వెంటనే నేను మిమ్ము వదలి వెళ్ళిపోతాను. ఇందుకు కట్టుబడేవిధముగా వుంటే పెళ్ళి చేసుకొంటా"నంటుంది ఆమె. మొహపరవశుడైవున్న రాజు ముందువెనుక ఆలోచించకుండా ఆమె మాటకు సరేనని ఆవిధముగా ప్రమాణము చేస్తాడు.
ఇరువురికీ వివాహమయి కొంత కాలము సుఖించిన పిమ్మట ఆమెకు పుత్రోదయము జరుగుతుంది. ఆమె వెంటనే ఆ శిశువును గంగలో కలిపి తిరిగి వస్తుంది అమె. రాజు తన మాటకు కట్టుబడి బాధను దిగమ్రింగి ఊరకుండిపోతాడు. అదేవిధముగా ఇంకా ఆరు పర్యాయములు జరుగుతుంది. రాజుది మౌనవ్రతమే! ఎడవ పర్యాయము కూడా మగశిశువును కని పారవేయుటకు ఉద్యుక్తురాలగుచున్న ఆమెతో "ఓ కఠోర మానసీ! పసికందును గంగపాలు చేయుటకు నీకు మనసెట్లు వచ్చుచున్నది" అని అంటాడు. ఆమె వెంటనే రాజునకు తన ప్రమాణమును గుర్తునకు తెచ్చి, తాను విడిపోతున్నట్లు తెలుపుతుంది.
ఇంతవరకు తనను గురించి ఏమాత్రము అడగని రాజుకు తన వృత్తాంతము తెలుపదలచుకొని ఈవిధముగా చెబుతుంది" నేను గంగానది ఆధిదేవతను. వశిష్ఠ శాపముతో అష్ట వసువులు మన పుత్రులైనారు. కానీ ఎదవవాడు గోచౌర్యము చేసినాడు కావున మానవునిగా జీవితము అనుభావించుతాడు. మిగతావారికి పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులగులాగున ఋషి శాపోపశమనము కలిగించినాడు కావున వారు విముక్తులైనారు. ఈ బాలకుని నావద్దనుంచుకొని సకల శాస్త్ర, శస్త్రాస్త్ర పారంగతుని చేసి ఒప్పజేబుతా"నని తెలిపి తనతో తీసుకు వెళుతుంది. ఆ బాలకుని పేరే సత్యవ్రతుడు. తదనంతర కాలములో భీష్ముడౌతాడు.

మిగిలినది మరోసారి .....

భీష్ముడి శపథం (భీష్ముడు -- 2 వ భాగము)
ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో విహరిస్తున్నాడు. ఎక్కడో దూరము నుండి వచ్చు సుగంధ వీచికలు నాసికాగ్రమునుతాకి ఆయనను పరవశింపజేస్తున్నాయి. మనసు అదుపుతప్పింది. మనోవికారమునకు బానిసయైన శంతన మహారాజు  వైపుగా వెళ్లగా, అక్కడ ఒక అందమైన సుందరిని  చూచుట తటస్థించుతుంది. ఆమె శరీర సౌష్ఠవమును, రూప లావణ్యమును చూసి అప్రతిభుడౌతాడు. అంతలో తేరుకొని ఆవిడతో "ఓ సుందరీ, నీవు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకు పడవ నడుపుతున్నావు?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె వినయ వదనయై ఆయనతో " రాజా!  నేను దాశ రాజు కూతురిని. నాపేరు సత్యవతి. తండ్రిగారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను" అని బదులు చెప్పింది. శంతనునికి ఆమెను వివాహం చేసుకొన వలెనని  కోరిక కలిగింది. ఆవిషయమును ఆమెతో వెల్లడించితే ఆమె, తానూ తను తన తండ్రి ఆజ్ఞానువర్తిని అని చెప్పింది.

వెంటనే శంతనుడు దాశ రాజు దగ్గరకు వెళ్లి, తన కోరిక వెల్లడించినాడు. అప్పుడు దాశరాజు "మహారాజా, ఆడపిల్ల పుట్టిన తరువాత యుక్త వయసుకు వచ్చిందంటే  ఒక అయ్య చేతిలో పెట్టడం సంప్రదాయం. నా కుమార్తెకు మహారాజువయిన నీకన్నా  మంచివరుని నావంటి ఒక పల్లెపెద్ద తెచ్చుటకు వీలేకాదు. మీకు మీరుగా వచ్చి అడిగినపుడు  ఇవ్వడానికి అభ్యంతరము నాకేముంటుంది. కానీ  నాది ఒక చిన్న విన్నపము" అని అన్నాడు దాశరాజు. "అదేమిటో చెప్ప" మని అడిగినాడు శంతనుడు. "నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికి రాజ్యాధికారం దక్కాలి" అని కోరినాడు దాశరాజు. దానికి శంతనునకు  ఒప్పుకొన మనస్కరించలేదు. అత్యంత యోగ్యుడగు సత్యవ్రతునికి  తప్ప అన్యులకు రాజ్యభారమునప్పజెప్పు ఆలోచనే లేదు ఆయనకు. అందువల్లవేరేదయినా కోరుకోమన్నాడు శంతనుడు. దాశరాజు తన పట్టు సడలించలేదు.
విషణ్ణ వదనముతో  శంతనుడు హస్తినాపురానికి తిరిగి రావటం జరిగింది. మరులుగొన్న మనసుకు బుద్ధి చెప్పిన మాటలు అరణ్యరోదనములైనాయి.
 శంతనుడు రాచకార్యాలను మనసారా చూడలేక పోవుటయేగాక , నిరంత విచారతాప్త హృదయుడైయున్దసాగినాడు. గాంగేయుడు దీనిని కొంత కాలముగా గమనించుట చేత, ఒకానొక రోజు తండ్రివద్దకు వెళ్లి మనోవేదనకు కారణమునడిగినాడు. శంతనుడు చెప్పలేక చెప్పలేక తన మనోగతమును విప్పిచేప్పినాడు. తండ్రిని ఓదార్చి, విషయమును మంత్రులచే సమగ్రముగా తెలుసుకొని, దాశరాజు దగ్గరకు వెళ్ళి,"దాశరాజా, నీ కుమార్తెను నా తండ్రి శంతనునికి ఇచ్చి వివాహము చేయుము" అని అడిగినాడు.
" తండ్రి కొరకు కన్యను అడగడానికి వచ్చిన ఒక ధర్మాత్ముని చూసిన నా జన్మ ధన్యము. ఈ కన్య సామాన్యురాలు కాదు. ఉపరిచర వసువు వీర్యానికి జన్మించింది. ఆ ఉపరిచర వసువు ఈ కన్యను శంతన మహారాజుకే ఇమ్మని చెప్పినాడు. అందుకే ఇది వరకు దేవలుడు అడిగినా ఇవ్వలేదు. కాని నాది ఒక కోరిక. నా కూతురికి పుట్టే పుత్రులు సవతి కుమారులవుతారు. కాబట్టి ఆ దోషం లేకుండా చెయ్యి" అని చెప్పినాడు దాశరాజు.
గాంగేయునికి దాశరాజు ఆంతర్యం అర్థం అయింది. వెంటనే అక్కడ ఉన్న వారిననందరిని పిలిచి "ఇక్కడ చేరిన రాజులు అమాత్యులు, ప్రజలు అందరూ వినండి. నా తండ్రికి కాబోయే భార్యమరియు నాకు మాత్రుసమానురాలునుయగు ఈ సత్యవతికి పుట్టబోయే పుత్రుడే ఈ రాజ్యానికి వారసుడౌవుతాడు. అతడే కురువంశ ప్రభువు" అని చాటుతాడు. కాని దాశరాజు "గాంగేయా, నీవయితే  రాజ్యాధికారాన్ని వదులుకున్నావుగానీ  నీ మాటను నీ సంతు అంగీకరించక పోవచ్చు కదా?" అని సందేహమును వెలిబుచ్చినాడు.
అప్పుడు సత్యవ్రతుడు "దాశరాజా నాకు పుత్రులు కలిగితేనే కదా ఆ సమస్య వచ్చేది. అందుకే నేను ఈ రోజు నుండి అవివాహితునిగా బ్రహ్మచర్య దీక్షనుబూనుతాను.   నీ కూతురిని  ఇప్పుడు ఇచ్చి నా తండ్రికి వివాహం చెయ్యడానికి నీకు అభ్యంతరం లేదుగదా" అని అన్నాడు .
గాంగేయుడు చేసిన ఈ భీషణమైన ప్రతిజ్ఞ చేయుటచే చరిత్రలో భీష్మునిగా చిరస్థాయిగా నిలచిపోయినాడు. జయజయ ద్వానములనడుమ దేవతలు పూలవర్షము కురిపించినారు. 
దాశరాజు వెంటనే తన కూతురు సత్యవతిని శంతనునికి ఇచ్చి వివాహం జరిపించినాడు. తన కుమారుడైన గాంగేయుడు, తన కోర్కె తీర్చడం కోసం చేసిన ఈ త్యాగానికి విభ్రాంతిచెంది శంతనుడు విచలిత మనస్కుడు కాగా, భీష్ముడు తండ్రితో " తండ్రీ ఒకకొడుకు తలిదండ్రులకు వుండీ లేనట్లే! మీరు వివాహము చేసుకొనుట సమంజసము.  ఈ రాజ్యాధికారమును ఎవరు చేబూనినా  నేను జీవితాంతమూ రక్షణకర్తగా వుంటాను" అన్నాడు. సంతుష్టాంతరంగుడయిన శంతనుడు "కుమారా, ఏదయితే మానవులకు అసాధ్యమో అట్టి ఒక వరమును నీకు  ప్రసాదిస్తున్నాను. నీవు స్వచ్ఛంద మరణమును అనుగ్రహించుచున్నాను." అని అన్నాడు. కాలాంతరములో యోజనగంధి యనబడు సత్యవతికి శంతనుని వలన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అన్న కుమారులు కలిగినారు. శంతనుడు కాలధర్మము చెందినాడు. రాజు కాకున్నా రాజ్య భారము భీష్మునిపై బడింది.

సత్యవతికి యోజనగంధియన్న పేరు ఎందుకు వచ్చినది అన్న వృత్తాంతమును గూర్చి మరొకసారి మాట్లాడుకొందాము. 
సత్యవతీ వృత్తాంతము  (భీష్ముడు --3)
చేది రాజ్యమునకు ప్రభువైన వసువు యొక్క వీర్య పతనముచే అద్రిక అన్న పేరుగల అప్సరస శాపవశాత్తు చేప రూపములో వుండగా, ఆ చేపకు జన్మించిన మగ ఆడ శిశువులు కలుగుతారు. వారిరువురిలో సత్యవతి ఒకటి . జాలరులు ఆమెను, ఆ పిల్లవానిని తమ ప్రభువైన దాశరాజునకు అప్పగించుతారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి మస్త్య దేశపు రాజవుతాడుగానీ సత్యవతి మాత్రము దాశరాజు వద్ద పెరుగుతుంది. చేపలు పట్టుట వృత్తిగా కలిగిన ఇంట పెరుగుటయేగాక అదేవృత్తి చేపట్టుటవల్ల ఆమె శరీరమంతా చేపల కంపు కొడుతూ వుండుటచే ఆమెకు మత్స్యగంధి అన్న పేరుఏర్పడుతుంది.
ఒకపరి తీర్థయాత్రలకు బయలుదేరిన వశిష్ఠ పౌత్రుడు, శక్తి కుమారుడునగు పరాశర మహర్షి  యమున సమీపమునకు వచ్చి నది దాటుటకు మత్స్యగంధి నావలో యెక్కుట జరిగినది. నావ యమున మధ్యకు వచ్చినది. పరాశరుడు మత్స్య గంధి పై మరులుకొన్నాడు. దైవ ఘటన అంటే ఇదే కామోసు. మహనీయుల ఆంతర్యము మనకు అందుబాటునకు రాదు. ఆయన తన కోరికను సత్యవతికి ఎరుకపరచినాడు. ఆమె కూడా అవనత శిరస్కురాలై తాను  మత్స్య కులమునకు చెందినదని, తన పితరుని అనుమతిని గైకొనవలసి ఉంటుందని చెబితే   ఆయన ఆమెను  యొజన గంధిగా మార్చి.తన కన్యాత్వము చెడకుందునట్లు వరమొసగి ఆమెను ఒప్పింపజేసినాడు. ఆప్పుడు సూర్యుడు నడి నెత్తిన వుండటము వల్ల తనకు సిగ్గుగా వున్నదన్నది అని ఆవిడ అంటే ఆయన  ఆకసమును ప్రగాఢ మేఘావృతము జేసి యమున మధ్యయందేర్పడిన  ద్వీపములో ఆమెతో వాంఛా నివృత్తి చేసుకొని  సద్యో గర్భమున ఆమెకు పుత్రోదయము కలిగించెను. ఆబాలకుడు నల్లనివాడగుటచే కృష్ణ శబ్దమును, ద్వీపమునందు జన్మించుతచే ద్వైపాయనుడగుచూ కృష్ణద్వైపాయనునిగా పిలువబడినాడు. కాలాంతరమున వేదములను విభజించి ఆయన వేదవ్యాసుడయినాడు. అఖండ ప్రఖ్యాతుడయి ఆబాలుడు వెలుగొందుతాడని చెప్పి పరాశరుడు తనదారిని పోగా వ్యాసుడును తల్లికి నమస్కరించి తనను యెప్పుడు తలచిన అప్పుడు వత్తునని వరమోసగి తపమునకు వెడలినాడు.  
Top of Form

Bottom of Form
సత్యవతీ, శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే బిడ్డలు కలిగినారు. శంతనుని మరణానంతరం చిత్రాంగదుడు రాజయినాడు. యువకుడూ, దురహంకారి అయిన చింత్రాగదుడు ఒక రోజు అడవికి వెళ్ళటం తటస్తించింది. అదేపేరు కలిగి అసాధారణమైన సామర్ధ్యముతో నున్నఒక గంధర్వుడు అక్కడకు  వచ్చి యుండినాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదుటపడి గంధర్వుడు నీవెవరని ఆడుగగా, నా పేరు చిత్రాంగదుడు అని గర్వంగా చెప్పినాడు శంతన పుత్ర చిత్రాంగదుడు. ఇరువురికీ మాటామాట పెరిగి యుద్ధము వరకు దారితీయగా కొన్ని నెలలు జరిగిన ఆ పోరాటములో శంతనపుత్ర చిత్రాంగదుడు అసువులు బాసినాడు.
 తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని రాజుగా చేసినాడు. విచిత్రవీర్యుడు భోగాలాలసుడై వివాహమునకు విముఖత చూపేవాడు.
ఆతని గుణగణములగూర్చి మరియు భీష్ముని బ్రహ్మచర్యమును గూర్చి విన్న కాశీరాజు తన కుమార్తెలు అంబ,అంబిక, అంబాలికలకు స్వయంవరము ప్రకటించినాడు కానీ హస్తినాపురికి ఆహ్వానము పంపలేదు.
కాశీరాజు ఆహ్వానమును పంపనందుకు ఆగ్రహోదగ్రుడైన భీష్ముడు స్వయంవరమునకు వెళ్లినాడు. స్వయంవరములలో సాధారణముగా రాజులకు, యోధులకు మాత్రమే ఇందులో అవకాశం వుంటుంది. రాజకన్యలు తమ తమ భర్తలను తామే ఎంచుకుంటారు, స్వయంవర సమయమునకు  ముగ్గురు రాజ కన్యలకు ఏర్పాటుచేయడం జరిగింది అంబ, అంబిక, అంబాలిక వీరికి 18,17,ఇంకా 15 సంవత్సరాల వయస్సు. అంబ అప్పటికే సాళ్వరాజును ప్రేమించి యుండినది. అందరికన్నా పెద్దది కావడంవల్ల ఆమెకు ముందుగా ఎంచుకోవడానికి అవకాశం దొరికింది. రాజకుమారి పూలమాల తీసుకుని అందరినీ చూసి తను భర్తగా ఎన్నుకున్న వారి మెడలో పూలమాల వేయడం స్వయంవరంలో ఒక సాధారణ పద్ధతి. అంబ సాళ్వరాజు వద్దకు వెళ్ళి అతని మెడలో పూలమాలను వేసింది. ఆవిషయము భీష్మునకు ఎరుకలేదు.
అతడు గొప్ప వీరుడు కాబట్టి ఇతర వీరులు భయపడినారు. కానీ వారికందరకీ అతనికి బ్రహ్మచర్య వ్రతము ఉందని, అతను పెళ్ళి చేసుకోడని తెలుసు. “ఈయనకు  ఇప్పుడు భార్య కావలసి వచ్చిందా లేక కురు వంశంలో భార్యను గెలుచుకోగల వీరుడు లేక తను స్వయంగా రావలసివచ్చిందా?” అంటూ అతనిని రెచ్చగొట్టటం ప్రారంభించినారు, తమ గుసగుసలతో! తన వంశాన్ని తక్కువగా మాట్లాడేసరికి భీష్ముడు కోపంతో రెచ్చిపోయినాడు. ముగ్గురు రాజకుమార్తెలను ఎత్తుకుపోవడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడున్న వీరులతో యుద్ధం ఆరంభమయ్యింది, భీష్ముడు అందరినీ ఓడించినాడు, సాళ్వుడు అంబ కోసం పోరాడినాడు కానీ భీష్ముడు సాళ్వుని ఓడించి అతనిని అవమానించి ముగ్గురు రాకుమార్తెలను తన రథము నెక్కించుకొని అడ్డమొచ్చిన రాజులను అడ్డదిడ్డముగా నరికి తనవెంట గొనిపోయినాడు. అంబ సాళ్వుని ప్రేమించినట్లు చెప్పుటతో ఆమెను వదలివేసినాడు, కానీ సాళ్వుడు ఆమెను తృణీకరించినాడు. ఆమె తిరిగీ భీష్మునివద్దకు వెళ్లి పెళ్ళియాడమని అర్థించితే ఆయన తన శపథమును ఆమెకు తెలియజేసినాడు. అన్నివిధాలా భంగపడిన అంబ తన పగను భీష్మునిపై తీర్చుకొన ఈశ్వరునిగూర్చి తపమొనరించ, అడవులకు వెళ్ళింది.
కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొద్దికాలానికే అనారోగ్యంతో, నిస్సంతుగా మరణించినాడు.
మిగిలినది 4వ భాగములో చదువుదాము.......
భీష్ముడు -- 4 






No comments:

Post a Comment