Thursday, 5 December 2013

గొర్రె దాటు


అహో సైకత లింగేన  భ్రష్టా మే తామ్ర భాజనం
గతాను గతికోలోకః  న లోకః పారమార్థికః
గొర్రె దాటు అన్న ఒక లోకోక్తి వుంది. అంటే ముందు వెనుక చూడకుండా ముందువాడేది చేస్తే అది చేసేయడం. పై శ్లోకము లోని భావము ఈ లోకోక్తిని తలపింప జేస్తుంది.
          పండుగ రోజు  ఒక భక్తుడు స్నానానికి వెళ్తాడు. తన చేతిలో ఒక రాగి చెంబు తీసుకొని  స్నానానికి పోతాడు.  సముద్రస్నానానికి ఇంకా ఎవరూ రాలేదు. మంచి సమయమని తలచి స్నానానికి వెళ్ళే ముందు రాగి చెంబును ఒడ్డున జాగర్తగా దాచాలనుకొంటాడు. అందుకని చెమ్మ వున్న ఇసుకలో చిన్నగొయ్యి చేసి ఆ చెంబుని గోతిలో పెట్టి, ఇసుకను దానిపై ఎత్తుగా పోసి దానిని  లింగాకారములో తట్టి  ఆ చెంబు ఇంక  దొంగలించలేరను    నమ్మకంతో సముద్రము లోకి వెళ్తాడు. బొరియ చేసి చెంబునుంచింది చూడలేదు కానీ ఇసుక లింగము అతనుచేసేది చూసిన ఇద్దరు ఈ రోజు ఈ విధంగా సైకతలింగము  చేస్తే పుణ్యమొస్తుందని  తలచి   మొదటి కుప్ప ప్రక్కనే వాళ్ళిద్దరూ మరో రెండు కుప్పలు చేసి స్నానానికి వెళతారు. దూరం నుంచి వచ్చే మరో నలుగురు వీరు చేసిన దానిని చూసి వాటి ప్రక్కనే మరో నాలుగు శివ లింగాలు చేస్తారు. ఇలా సముద్ర స్నానానికి వచ్చే ప్రతి ఒక్కరు ముందు వారిని చూసి “ఈ పర్వదినాన ఇసుకని శివలింగంగా చేసి సముద్రస్నానం చేయాలి” అనుకొని అలాగేచేస్తారు. ఇలా వందల సంఖ్యలో ఆ సముద్రపు ఒడ్డున సైకత లింగాలు  ఏర్పడుతాయి. మొదటి భక్తుడు స్నానం చేసి ఒడ్డుకి వచ్చి చూసి ఆశ్చర్యపోయి, అన్ని శివలింగాలలో తన చెంబు కోసం గుర్తుగా చేసిన ఇసుక కుప్ప ఎక్కడ ఉందో తెలుసుకోలేక, తన రాగి చెంబు పోయినందుకు బాధపడుతూ “అయ్యో ఈ ఇసుక లింగం వల్ల నా రాగి చెంబు పోయింది కదా! లోకంలో జనులు గొర్రెల మంద లాగ ముందువారు ఏదిచేస్తే అదే చేస్తారు కాని, ఆ పనిలోని పరమార్థాన్ని గ్రహించరు. నేను చేసిందేచూసి చేసినారు  కాని ఎందుకు చేసితినన్నది  తెలుసుకోలేకపోయిరనుకొంటూ వెళ్ళిపోతాడు.”
    చెంబు పోయింది అన్న విషయం ఆయన మరచిపోయి వుండవచ్చు కానీ ఆయన చెప్పిన అనుభవ వాక్యము అక్షరాలా పాటించుదాము
స్వస్తి

2 comments: