ఒక చిన్న మాట
భరద్వాజ మహర్షి ఎన్నో వేల ఏళ్ళు తపస్సు
జేసి బ్రహ్మ సాక్షాత్కారము పొందితే స్వామి ప్రత్యక్షమై ఏమి వలయునని యడిగితే తనకు
వేదములు సంపూర్ణముగా అవగతము కావలెనన్నాడట.
బ్రహ్మ ఇది చాలదు ఇంకా కొన్ని వేల సంవత్సరములు తపము చేయమన్నాడట. ఆ విధంగా
చాలపర్యాయములు చేసినతరువాత మరులా బ్రహ్మ ప్రత్యక్షమైతే ఋషి వర్యులు అదే
వరమడిగినారట. స్వామి మళ్ళీ కొన్ని వేల యేండ్లు తపమాచారించమంటే, ఋషివర్యులు"స్వామీ అసలు నేనింత కాలము తపస్సుచేసి ఎంత వేద జ్ఞానమును పొందినాను"
అని బ్రహ్మదేవుని అడిగితే సముద్రము చెంతజేరి దోసిలితో ఒకసారి నీరు దోసిలి నిండా తీసుకోమ్మన్నారట.
ఆయన ఆవిధంగా చేసిన తరువాత బ్రహ్మ దేవుడు "నీకబ్బినది అంతే" అన్నాడట.
వేనకు వేల ఏండ్లు తపస్సు చేసిన ఋషివర్యుల పరిస్థితి అది ఐతే ఏదో కాస్త ఆ
దోసిట్లోని ఒక అదృశ్య పరమాణువు లోని పరమాణువో ఇంకా తక్కువ చదువుకొన్న నా లాంటి
ఒకడు సమకాలీన సాంప్రదాయాలను అరిగించుకోలేక ఆరోకొరో వ్రాస్తే అది నిజంగానే భావి
తరానికి తనకు తెలిసిన పరమాణువునే అందించవలేనని తపన. ఇది యువతకు నచ్చనూ వచ్చు
నచ్చకనూ పోవచ్చు. మన తెలుగు మన సంస్కృతి నిర్వాహకులు చక్కగా తెలిపిన విధంగా, (relay race) గొలుసు పరుగు లో (baton) 'చిరు దండము' ను తన తరువాత పరుగెత్తే వానికిచ్చిన విధంగా ఇవ్వవలయునన్న తపన తాపత్రయము తప్ప
తక్కినది కాదు. దండమందిచడంతో తనపని అయిపోతుందనాలో, లేక తనపని అయిపోతుంది కాబట్టి దండము అందించడానికి త్వరపడుతున్నాడనాలో పాఠకులకు
వదిలేస్తాను . లైకులు 'కేకులు'(తిండి) సంపాదించవు అన్న విషయ అందరికీ
తెలిసిందే.
ఎక్కడో ఒకరి ప్రశ్న'ఆడవాళ్ళు ఋతు సమయయములో దైవదర్శనమునకు ఎందుకు పోకూడదు.' అని విన్నాను. నిజానికీ అనుమానము ఆడవారికి రావలసింది, మనకెందుకులే అని మగవారు ఊరకుండ వలసింది. కానీ ఇది మగవారికి వస్తుంది, ఆడవారికి రాదు మరియు సమాధానాలు కూడా మగవారే ఇస్తూవుంటారు. ఇందులో సమంజసత ఎంత? మనలో కలిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకున్న పరిధిలో మన ఇంటి లోనే లేక
మనకున్న అందుబాటు లోనే తెలుసుకోవచ్చు. ఇక విమర్శలు హార్దికంగాను,భావస్పోరకంగాను, ఉత్సాహ భరితంగానూ వుంటే
జిజ్ఞ్యాసువులైన యువకులకు ఉపయుక్తములౌతాయి. ఇందుకు నా ఉదాహరణే ఒకటి చెబుతాను. నేను, 'రామమోహనుక్తి రమ్యసూక్తి ', అనే మకుటాన్ని నేను
వ్రాసిన శతక పద్యాలకు పెట్టుకొన్నాను. వ్యాకరణ పరంగా, తెలుగు చదువుకొన్న వారికి, తప్పు అని తెలిసి
పోతుంది. మామూలుగానైతే 'రామమోహన+ఉక్తి =రామమోహనోక్తి
కావలయును. ఇది గుణ సంధి అవుతుంది. ఇది శాస్త్ర బద్ధము. కానీ,మా తండ్రిగారు నాకు 'రామ మోహన్ రావు' అని పెట్టినారు. దానిని అటులనే ఉపయోగించుకోనవలెనని నా తపన. అందువల్ల వ్యాకరణలో
వున్న ఒక వెసలుబాటును తీసుకొని రామమోహన్ ద్వితీయా విభక్తి లో రామమోహను అవుతుంది
కాబట్టి రామమోహను+ఉక్తి=రామమోహనుక్తి చేసుకొన్నాను. ఆసలు నకారమునకు ‘ఉ’ అన్న అచ్చు
చేరితే ‘న్+ఉ=ను’ అవుతుందికదా! దీనిని మహా పండితులైన సి.వి. సుబ్బన్న శతావధాని
గారు M.A., Ph.D., D
Lit., గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అవధానం నాగరాజ రావు గారు M.A., PhD
తప్పు లేదు అన్న తరువాత నేనది అట్టులే వుంచుకొన్నాను.
ఒకరోజు ఒక సంస్కారవంతుడు ఈ తప్పును
విమర్శ(comment)
కాలములో వ్రాసి రసాభాస చేయకుండా నా వార్తా ఫలకము పై వ్రాసి
సందేహము తీర్చమన్నాడు. నేను చెప్పిన జవాబు తప్పకుండా తనకు సంతృప్తి కలిగించి నది
కాబట్టే నాకు ప్రత్యుత్తరము రాలేదు. ఈ సందర్భములో నేను మనవి చేసుకోదలచినది
ఒక్కటే.మహాకవి ధూర్జటి గారి కాళహస్తి మహాత్మ్యం లో చింతాకంతయు. అన్న ప్రయోగాన్ని చేసినారు.
నిజానికి ‘చింతయాకు’ అని అనవలసి ఉంటుంది. కవి నిరంకుశుడన్నారు పైగా ఆయన మహా
పండితుడు ఆయన ప్రయోగము కాదనేదానికి నాలాంటి అపండితులకు సాధ్యమా.'పండిత ప్రయోగంబులు యదా ప్రకారంబు గ్రాహ్యంబులు' అన్నారు. నా విషయములో, తప్పు కాదని పండితులైన పెద్దలు
అనుమతి ఇచ్చిన తరువాతనే వాడుకొనుచున్నాను.
ఇక ఆంగ్ల వ్యాకరణము విషయానికొస్తే మా
కాలానికీ ఇప్పటికీ ఎంతో మారినది. మనమిపుడు మారిన వ్యాకరణాన్నేవాడుకొంటున్నాము కానీ
పాతది కాదు. భారతీయ భాషలలో ముఖ్యంగా తెలుగులో మనకు బాల వ్యాకరణము సూత్రాంధ్ర
వ్యాకరణము లాంటి కొన్ని వ్యాకరణములు మన పూర్వులు వ్రాసినవి తప్పించితే ఈ కాలానికి అనుగుణంగా,
అంత ప్రసిద్ధి చెందిన సరళీకృతమైన వ్యాకరణములేదు. అటువంటి ఒక వ్యాకరణాన్ని ప్రభుత్వ
నియమిత భాషా సంఘములేవైనా అనుగుణముగా వ్రాయగలిగితే నేటి రచయితలకు కూడా ఒక మార్గమును
ఏర్పరచిన వారలౌతారు. అదే విధంగా విమర్శ పరిధి లో (Space For Comment) మీరీ తప్పు చేసినారు అని చెప్పే దానికంటే ఇక్కడ పొరబాటు జరిగినట్లుంది ఒకసారి
గమనించేది అని రచయిత వార్తా బల్ల (Message Board) పై తెలిపితే తన తప్పు సవరించుకొంటాడు. అటువంటి విధానము సంస్కారవంతమని నా
నమ్మకము మన పెద్దలు కూడా ' న భ్రూయాత్ సత్యమప్రియం' అన్నారు. అంటే బాహాటంగా తప్పు పట్టవద్దనే కదా!
స్వస్తి
No comments:
Post a Comment