Monday, 2 December 2013

మొల్ల రామాయణము 

మొల్ల అంటే మల్లె అని అర్థము. ఈవిడ 16 వ శతాబ్దికి చెందిన వ్యక్తి. ఈమెకు ముందు 15వ శతాబ్దిలో తాళ్ళపాక తిమ్మక్క 'సుభద్రా 

కళ్యాణ'మనే పద్య గ్రంథాన్ని రచించింది. ఈమె తెలుగులో, కావ్యము వ్రాసిన, మొదటి కవయిత్రిగా పరిగణించుతారు. కానీ ఈమెకన్నా 

ముందు 13 వ శతాబ్దికి చెందిన కుప్పమాంబ అన్న కవయిత్రి ఉండినదని మరియు ఆమె కవిత్వము అష్టదిగ్గజ కవులలో ఒకడైన 

అయ్యలరాజు రామభద్రునికి ఆలంబనమని చెబుతారు. ఈ ముగ్గురూ కడప మండలము వారే. కానీ నేడు కడప కక్షలకు కుట్రలకు 

కుసంపదలకు కూడలియై కూర్చునింది. 


ఈమె అవివాహితగానే ఉండి శ్రీశైలములో శివైక్యము చెందినదని చెబుతారు. కులాల కులమునకు చెంది కూడా రామాయణము వ్రాసిన 

ఆమె పాండిత్యమునకు, భాషావైశద్యమునకు , అకుంఠిత భక్తిభావమునకు అష్టాంగ నమస్కారము తప్ప ఏమి చేయగలము. 


మొల్ల రామాయణము బాలకాండలోని రాజకుమారుల వర్ణనము ఆ తరువాత కవులకు ఎంత ప్రేరేపణమయ్యిందో గమనించండి :


మొల్ల రామాయణము -బాలకాండ

'రాజు ' అన్న శబ్దాన్ని శ్రేష్ఠతా వాచకంగా ఎట్లు ఉపయోగించిందో గమనించండి:

రాజులు కాంతియందు రతి రాజులు రూపమునందు వాహినీ


రాజులు భోగమందు మృగరాజులు విక్రమ కేళియందు గో 

రాజులు దానమందు దినరాజులు సంతత తేజమందు రా

రాజులు మానమందు నగరమ్మున రాజకుమారులందరున్


ఇక 'రాజు' అనే పదాన్ని విలోమార్థములో ఇరువురు కవులెట్లు (వారి పేర్లు నాకు తెలియవు)

ఉపయోగించినారో చూడండి.

రాజు కళంక మూర్తి రతిరాజు శరీర విహీను డంబికా


రాజు దిగంబరుండు మృగరాజు గుహాంతర సీమనుండు వి

భ్రాజిత పూసరాడ్విజయ రామ నృపాలుడు రాజుగాని ఈ

రాజులు రాజులా పెను తరాజులు గాక ధరా తలమ్మునన్


రాజును రాజుగాడతడు రాహు ముఖంబున జిక్కె, వాహినీ

రాజును రాజుగాడతడు రామ శరాహుతి దూలె దేవతా

రాజును రాజుగాడతడు రావణ సూతికి నోడె నాజిలో

రాజన రాజు మల్కి యిభరాముడె రాజు ధరాతలంబునన్


భావము సులభ గ్రాహ్యమని తలచి వ్రాయలేదు.

పై ఫణితి లో మా లలితమ్మ (ఉక్కు నగరము --విశాఖపట్నం లో వైధ్యాదికారిణి)భర్తను గూర్చి నేను వ్రాసిన పద్యము తిలకించండి.


మారుడు రూపమందు సుకుమారుడు మానసమందు పార్వతీ 

మారుడు కోపమందు నిశిమారుడు శీతలమందు జానకీ 

మారుడు ధర్మమందు సిరిమారుడు కాచుట యందు వాహినీ 

మారుడు లోతునన్ ఫణి కుమారుడు మా లలితమ్మ తల్లికిన్ 



తత్సత్ 

No comments:

Post a Comment