Wednesday, 27 August 2014

మతాతీత పరిపాలన


'సెక్యులరిజము'నకు పరమత సహనము(మతాతీత పాలన) అన్న అర్థము చెప్పుకోవచ్చునేమో . అట్లు చెప్పుకొంటే అది అన్ని మతాలలోవుందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అయితే, వుంది అని చెబితే అది అబద్ధమౌతుంది. లేదు అని చెబితే ఆత్మ వంచనౌతుంది. ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులలో సమాధానము మౌనమే.

మరి మన రాజ్యాంగ అవతారికలో వాక్స్వాతంత్ర్యము  వున్నది,  'ఇహము పరము లేని మొగుడు ఇంటినిండా రుచి పచి లేని కూర చట్టినిండా ' అన్నట్టు. ఏమి మాట్లాడితే తప్పో ఏమి మాట్లాడితే ముప్పో అన్న భయముతో సామాన్య మానవుడు సతమతమౌతూవున్నాడు, ఎందుకంటే ఏమి మాట్లాడితే ఒప్పో తేల్చుకోలేక పోవడమే కారణము.

ఈ 'వాక్ స్వాతంత్ర్యము' అన్న మాటకు నేను నా మనసుకు ఈ విధముగా చెప్పుకొన్నాను.'స్వ' అంటే తన యొక్క 'వాక్' అంటే మాట, 'తంత్రము' కుత్సితము కుట్రతో కూడుకొని యుండునది అన్న అర్థము చెప్పుకోవలసి వస్తుందేమో.

అంటే' మన మాట ఎప్పుడూ 'ఆత్మలోన విషము అంగిట బెల్లమ్ము' అన్నట్లుండవలెనేమో! ఇది ప్రప్రధముడైన మన దేశ ప్రధాని ,ప్రధానముగా సనాతన (శాశ్వతమైనది అంతే కానీ పాతది అన్న అర్థము లేదు.) ధర్మావలంబులకు వేసిన బురఖా.

ఎన్ని కలలో కన్నసామాన్యునికి ఎన్నికల భూతము ఆవహించగా దానిని వదిలించుకొనేటప్పటికి తనలో మిగిలినది నిరాశ,నిస్పృహ,నిస్సహాయత,నిర్వేదము.' పళ్ళూడగొట్టుకోనుటకు ఏ రాయైతే ఏమన్న' వేదాంతాన్ని ఆకళింపు చేసుకొన్నాడు. నాయకులు మాత్రము ' మీరూ మీరూ తన్నుకు చావండి మిగిలినవారిని మేమేలుతాం' అంటున్నారు. నాయకులకు కావలసినది కేవలము 'స్వార్థము',. దీనికి నేను నాది అన్నది ఒక అర్థమైతే ఇంకొక అర్థము 'నా డబ్బు' అని. అంటే నా 100 రూపాయల ఖర్చుకు 100000 రూపాయలన్నా వస్తుందా అన్న దురాశ.

ఎంత సంపద వున్నా 3 లేక 4 పూటలు తింటాడు ఎవడైనా ఒకవేళ ఆరోగ్యము బాగుంటే, అంతకు మించి తినలేడు కదా! అందుకే పెద్దలు ' లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారమ్ము మ్రింగబోడు' అన్నారు. ఇక నిద్రా!, తన చేతిలోలేదు . నిద్ర మాత్రల నాశ్రయించ వలసిందే. మరి సంపాదించి ఏమి చేసుకోబోతున్నాడు. పాపం తనకే తెలియదు. ఇక ఆరోగ్యము 'లైఫ్ బాయ్ ఎక్కడ వుంటే ఆరోగ్యమక్కడ' వున్నట్లు వీరికి తోడుగా రక్త పీడన (blood pressure) మధుమేహము(diabetes) ఉండవలసిందే కదా! అనారోగ్య జీవితానికి అర్థమూ లేదు పరమార్థమూ లేదు.

జాతీయ మహానాయకులు,నిజమైన మహనీయులు అయిన సుభాష్ బోస్ , సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, లాల్ బహాదుర్, గుల్జారీలాల్ నందా, మొరార్జీ దేశాయ్ ప్రకాశం పంతులు, ఇంకా ఎందరెందరో ఆదర్శ మూర్తులుగా ఉండవలసినవారు కాల గర్భములో కలిసి పోయినారు. ఇప్పటి నాయకులు 'హాథీ కె దాంత్ ఖానేకే ఔర్ దిఖానేకే ఔర్' బాపతుకు చెందిన వాళ్ళే.

భావి నాయకులను తయారుచేసే బాధ్యత తల్లిదండ్రులు,అంటే ఇప్పటి యువతరము తీసుకోగలిగితే , తమపిల్లలకు నీతి నిజాయితి, ఋజువర్తన  నేర్పించ గలిగితే, వారి వృద్ధాప్యములోనో, లేక వారి సంతానము యొక్క వృద్ధాప్యములోనో ఒక ఆదర్శవంతమైన సమాజము చూసే అవకాశము ఉందేమో. ఈ దేశము యొక్క ఈ ధర్మము యొక్క , మనకీ వారసత్వమునందజేసిన  పేరునాశించని మహాపురుషుల గొప్పదనము తెలుసుకొనే ప్రయత్నము చేయండి.
అసలు ఈ వాలంటైన్ అనునతడు ఎక్కడి వాడు అసలు వుండినాడా లేదా, ఒకవేళ వుండివున్నా అతనిని అనుసరించవలసిన కర్మ మనకెందుకు పట్టినది అని యోచించండి.ఈ రోజు మీరు హీరో కావచ్చు రేపు పెళ్ళయి మీ బిడ్డలు వయసుకు వచ్చి బరితేగించితే మీ మనోవ్యధ ఏవిధంగా ఉంటుందో ఊహించండి.
ఈ వాలంటైన్ దివసము (దినము) నకు తిలోదకాలివ్వండి. యువత నిర్వీర్యులైపోతే  రంగులోమునిగిన రవివర్మ చిత్రమైపోతుంది ఈ దేశము. అప్పుడు మనకు 'గొరగంగా మిగిలిందే జుట్టు.'
స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు




















No comments:

Post a Comment