Thursday, 27 June 2019

కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకము


కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకము
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_27.html
కాళీదాసు భోజరాజుల మైత్రీ బంధము అజరామరము. భోజునితో ఉన్నది కాళీదాసు-2.
మొదటి కాళీదాసు విక్రమార్కుని కాలము వాడు మరియు రఘువంశాది కావ్యములను, అభిజ్ఞాన శాకుంతలము వంటి నాటకములను వ్రాసిన మహాకవి. కాళీదాసు-2 విద్వద్వరేణ్యుడేగానీ, ఆయన కావ్యములు వ్రాసినట్లు తెలిసిరాదు, కానీ భోజుడు వ్రాసిన రామాయణ చంపు అన్న భోజుని ఆశు కావ్యమునకు సహకారమునందించినాడు అన్న ప్రతీతి కలదు. భోజ కాళీ దాసుల నడుమ ఎన్నో విచిత్ర సంవాదములను సన్నివేశములను చూస్తూ ఉంటాము. అటువంటి వానిలో ఇదీ ఒకటి.
ఒకసారి భోజ రాజు ఒక విచిత్రమైన సమస్య సభికులకు ఇవ్వటము జరిగినది. సముద్రానికి అనేక పర్యాయపదాలలోని 6 పదములను ఒక శ్లోకపాదముగా తీసుకొని పూరించమన్నాడు. అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి: అన్నదే ఆ శ్లోక పాదము.
ఎవరూ పూర్తి చేయలేక పోయినారు సభలో. కాళిదాసు ఒక చక్కటి సన్నివేశమును ఊహించినాడు. ఆ ఊహించిన సన్నివేశము ఇది.
పార్వతికి కోపము వచ్చింది ఎందుకు? ఎందుకు వచ్చిందంటే తనభర్త తనకో సవితి ని తీసుకొని రావడమే గాక ఆమెని నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. తన బాధను శూరుడు దేవ సేనాని మరియు తన కుమారుడైన షణ్ముఖుడికి  తన కష్టం చెప్పుకుంది. కుమారుడు పరమశివుడి దగ్గరకు వెళ్లి నాన్నా నీవు అమ్మకు సవితిని తెచ్చుటయేగాక ఆమెను నెత్తిన పెట్టుకోన్నావని అమ్మకు ఎంతో కోపము అంతకు మించిన తాపము కలుగుచున్నది. నువ్వు నెత్తిన పెట్టుకున్న గంగమ్మను విడిచి పెట్టు.  అన్నాడు. అప్పుడు పరమశివుడు కుమారా! చిరకాలంగా నాదగ్గరే ఉంటున్న గంగను ఇప్పుడు నేను వదిలేస్తే పాపం ఎక్కడికి పోతుంది అన్నాడు మహదేవుడు.
తన తల్లి యొక్క సవితిని తండ్రి వెనకేసుకొని రావడం షణ్ముఖుడికి  బొత్తిగా నచ్చలేదు. అందువల్ల కోపముతో ఊగిపోతూ వెళ్లి సముద్రములో దూకమును (నదీనాం సాగరో గతి:) తన ఆరు ముఖాలతో ఒక్కొక్కసారి ఒక్కొక్క సముద్ర పర్యాయ పదమును వాడుతూ 6 చెప్పినాడు. అదే అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి: అంటూ భోజరాజు సభలో ఇచ్చిన సమస్య.
 దానిని కాళీదాసు ఎంత చమత్కారంగా పూరించినాడో చూడండి.
అంబా కుప్యతి తాత మూర్ద్ని విలసత్ గంగేయముత్సృజ్యతాం !
విద్వన్ షణ్ముఖ! కా గతి:మయి చిరాత్ అస్యా: స్థితాయా:వద?
కోపావేశవశాతశేష వదనై:ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి:
నీవు నెత్తిన గంగను పెట్టుకున్నావని అమ్మకు కోపం వచ్చింది.ఈ గంగను విడిచి పెట్టు సర్వం తెలిసిన షణ్ముఖుడా! .పాపం చిరకాలం గానన్ను నమ్ముకొని నా దగ్గరే వుంటున్నది  యిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది? అన్నాడు శివుడు.అప్పుడు షణ్ముఖుడు కోపంతో తన ఆరుముఖాలతో సముద్రం లోకి పొమ్మను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని సముద్రానికి పర్యాయపదాలు ఆరు చెప్పాడు. ఆ అద్భుత మైన ఊహకు, పూరణకు భోజరాజు ఉబ్బి తబ్బిబ్బై సింహాసనం దిగి వచ్చి కాళిదాసును కౌగలించుకొని, ఉచిత రీతిని సత్కరించినాడు.
ఆ శ్లోకార్థము దిగువన ఇవ్వబడినది.
అంబా కుప్యతి =అమ్మకోపిస్తున్నది,
మూర్ద్ని విలసత్ గంగా ఇయం ఉత్సృజ్యతాం ! = నీ శిరసు మీద వున్న గంగ పరిత్యజింప బడుగాక!  
ఇది షణ్ముఖుడు చేప్పిన మాట. ఆ మాటకు బదులుగా శివుడు ఈ విధముగా అంటూవున్నాడు.
విద్వన్  షణ్ముఖ =సర్వము తెలిసిన షణ్ముఖుడా!
మయి చిరాత్  స్థితాయా: -అస్యా: - కా గతి: -వద =నాతోనే చిరకాలంగా వుంటున్న ఈమె గతి ఏమిటి? ఎక్కడికి పోతుంది? చెప్పు అన్నాడు.
ఆమాట విని స్కందుడు అగ్గిమీద గుగ్గిలమైపోయినాడు. అప్పుడు
కోప- ఆవేశవశాత్ - అశేష వదనై: -ప్రత్యుత్తరం దత్తవాన్ = కోపావేశాలతో కూడిన 6 ముఖములు కలవాడగు సుబ్రహ్మణ్యుడు తన ఆరుముఖాలతో సముద్రము లోకి పోయి దూకమను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని 6 పర్యాయపదములనువాడుతూ ఉచ్చస్వరముతో అన్నాడు.
మహామహితాత్ముల బుద్ధిగున విశేషాలు ఈవిధముగా వుంటాయి. అంతా వాగ్దేవి కరుణ.
స్వస్తి.

Saturday, 15 June 2019

బుద్ధిః కర్మానుసారిణీ


బుద్ధిః కర్మానుసారిణీ
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_15.html

నేను అంటే శరీరం – మనస్సు – బుద్ధి.
శరీరము బాహిరమైనది. దానికి సంజ్ఞలందజేసేది మనసు. దానిని ప్రచోదనము చేసేది బుద్ధి.
 పూర్వజన్మముల కర్మఫల సారాంశమే బుద్ధి. తప్పో ఒప్పో మనసును ప్రేరేపించేది బుద్ధి.
మరి బుద్ధికి కూడా వెనుకల ఒక నడిపే శక్తి అవసరము. పరమేశ్వరునికే పరాశక్తి అవసరమైతే మనమెంత. కావున ఈ బుద్ధిని ఉసిగొల్పుటకు ఏర్పడిన శక్తే కర్మఫలము.
ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము. పదవీ విరమణ చేసిన 65 సంవత్సరముల వ్యక్తి తానూ పనిచేస్తూ వుండిన కార్యాలయము ఇంటికి దూరమైనా అదేపనిగా ఆటో లో వెళ్లి వయసులో ఉన్న పారిశుధ్యపు కార్మికురాలితో పరాచికాలాడేవాడు. ఒకరిద్దరు అతనితో ఇదేమి ఖర్మ అంటే నాకు తెల్లవారితే స్నానము దేవుడు దైవము ఏదీ అనిపించదు, కనిపించదు. ఈమెయే కళ్ళముందు కనిపిస్తుంది. కష్టముమీద కార్యాలయ సమయము వరకు వేచియుండి ఆమెతో పరాచికాలాడుటకు వస్తాను అని చెప్పినాడు. ఈ విషయమును ఇక్కడ నిలిపితే, ఆ వయసు వారందరూ ఆపని చేయుట లేదు. వాళ్ళు గుడి గోపురము, దేవుడు దైవము అంటూ తిరుగుచున్నారు. దీనివల్ల మనకేమి తెలియుచున్నది. బుద్ధిని ప్రేరేపించే శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉన్నది అని తెలియవస్తూవుంది. ఆ శక్తియే వారి వారి కర్మ ఫలము.
భగవద్గీత ఈ క్రింది శ్లోకముతో మొదలౌతుంది.
శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ
ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే
సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?
ఇందులో అత్యంత గూడార్థము ఇమిడియుంది. ఒకసారి విశ్లేషించుకొందాము.
'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల)
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది. ఆక్షేత్రము వేరేదీ కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడినాడు. మామ అంటే ఒకవిధముగా అంతా నాకేకావలెనన్న అత్యాశగా చెప్పుకోనవచ్చును. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబడినట్లు తెలియుచున్నది కదా!.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథనము కొనసాగుతూనే వుంటుంది.
కావున ఈ వివరణను సంగ్రహించితే, 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .
భగవద్గీత కర్మ యోగములో కర్మలు చేయక తప్పదు అని పరమాత్ముడు మనకు తెలుపుతాడు. అసలు ఊరక కూర్చునత కూడా ఒక కర్మే. దానికి తగిన సమయములో ఫలితముంటుంది.  ఒకవేళ  కర్మ సత్కర్మయైుతే కర్తకు సత్ఫలితం వస్తుంది. దుష్కర్మ అయితే కర్తకు దుష్ఫలితమే వస్తుంది. అయితే ఈ కర్మఫలాలు కర్మ చేసిన వెనువెంటనే రాకపోవచ్చు, కనిపించపోవచ్చు. అందుకే పుణ్యాలు చేస్తున్నవాళ్లు సుఖాలు పొందుతున్నట్లు కనిపించకపోవడం, పాపాలు చేస్తున్నవాళ్లు కష్టాలు అనుభవిస్తున్నట్లు కనిపించకపోవడం చూస్తుంటాం. ఈ విపరీతమే జనులను పుణ్యకార్యాలను చేయడంలో నిరుత్సాహపరచడం, పాపాలను చేయడంలో ప్రోత్సహించడం చేస్తుంది. దీనిలో మనం చేయగలిగింది ఏదీ లేదు. ప్రకృతి నియమం ఆవిధముగా ఉంది.
ఈ కర్మలను నియంతించేది కూడా ప్రమాత్మయగు అంతరాత్మ. కావున మన కర్మ బుద్ధిని ప్రేరేపించినా ఆవిషయమును అంతరాత్మకు నివేదించి అనుజ్న పొంది చేయవలసి ఉంటుంది.
క్లుప్తముగా తెలిపినాను.
కనుకనే కర్మానుసారాణీ బుద్ధిః అన్నారు.
స్వస్తి.

Friday, 14 June 2019

భగవద్గీతా ప్రవేశము


భగవద్గీతా ప్రవేశము

ఎందఱో మహనీయులు, మహానుభావులు,మహాగురువులు భాష్యము వ్రాసిన భగవద్గీత తిరిగీ నేను విమర్శనాత్మకంగా తెలియబరచే అవసరము గానీ,శక్తి గానీ భగవంతుడు నాకు ఇవ్వలేదు. అయినా ఒక్క విషయము మాత్రము శ్రద్ధాళువులతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నము.

భారత యుద్ధ వార్తలను ధృతరాష్ట్రునకు చెప్పుటకై వేదవ్యాసులవారు సంజయునికి కురుక్షేత్ర సంగ్రామము వీక్షించగల దివ్య దృష్టి నొసంగి నియమించిరి.

ఈ గీతా ప్రవేశద్వారము వద్ద మొదట నిలిచినది ధృతరాష్ట్రుడు .
ధృతముఅంటే ధరింపబడిన అని అర్థము, రాష్ట్రుడు అంటే రాష్ట్రమును కలిగినవాడు అని అర్థము. అంటే చక్రవర్తి యని అర్థము. ఈ పేరుకు ఇంకొక అర్థమూ వుంది. ధృతమన్న మాటకు ఆనందము అని ఒక అర్థము. రాష్ట్రము అన్న మాటకు ఉత్పాతము అని ఒక అర్థము (బ్రౌణ్య నిఘంటువు). అంటే ఉత్పాతములయందు ఆనందమును పోడువాడు అని. చూచినారా పూర్వము పేరు పెట్టుటలోని సార్థకత. ఆలోచిస్తే భారత యుద్ధమునకు ఈ పేరే దారి తీయించిందేమో అనిపిస్తుంది.

ఇక రెండవ వాడు సంజయుడు. సత్+జయుడు సంజయుడౌతుందని అందరికీ తెలిసిన విషయమే. 'ఏకం సత్' అన్నది వేదం వాక్కు.అంటే ఆ సత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ను జయించినవాడే సంజయుడు. 'ఏకం సత్' అన్నది వేదవాక్కు. అంటే' ఆసత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను జయించినవాడే సంజయుడు. అంటే వ్యాసుడు విష్ణువు యొక్క అంశయే కదా. సంజయుడు ఆయన అనుగ్రహము పొందుట అంటే ఆయనను జయించినట్లే కదా.

భారతము ఇతిహాసమని సోదాహరణముగా పండితులచేత నిరూపింప బడినది. ఇది ఇపుడు నిర్వివాదము. అప్పుడు ఇందులోని పాత్రల పేర్లు కథ కొరకు పెట్టినవి కావని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. వారి పేర్లు వారి స్వభావమునకు ఎంత అతికినట్లు సరిపోతూ వుందో పైన దొరికిన రెండు మెతుకులు పట్టి చూస్తే తెలుస్తుంది.

కృష్ణుడు అర్జనునకు చేయు గీతోపదేశ మటుంచి ఆ ఉపదేశానికి ఉపోద్ఘాతమునకు , ఒక ఉత్పాతములయందు ఉత్సాహము కల్గినవాడు, ఎట్లు నాంది పలుకుచున్నాడో గమనించండి. భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయున్ని ప్రశ్నించిన ఈ శ్లోకముతో మొదలౌతుంది.

శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ

ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే

సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?

ఇందులో ఒక అంతరార్థము వున్నది. అదేమిటంటే యుద్ధము చేయ నిచ్చాగించినవారు, యుద్ధము చేయుట సహజమే అయినా, చేయనిర్ణయించుకొన్న ప్రదేశము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. వామన పురాణములో ఈ విధంగా చెప్పబడింది.కురు మహారాజు తన సామ్రాజ్యమునకు సరియగు రాజధానిని సమకూర్చుకొన సంకల్పించి ఎన్నో ప్రాంతములను వేదికి ఈ ప్రాంతమునకు వచ్చి ఈ ప్రాంతపు ప్రత్యేకతలను ఈ క్రింది విధముగా తెలుసు కొన్నాడు.

ఈ ప్రాంతము,బ్రహ్మ ఎన్నో వేల సంవత్సరములు తపమాచ్రించుతవలన బ్రహ్మ వేడిగానూ,సరస్వతీ నది ఉత్తరవాహినియై ప్రవహిన్చుతవలన ఉత్తరవేదిగానూ, సరస్వతీ యమునా నదుల సంగమము దృష్టావతి గా ఇక్కడ పిలువబడేది. ఈ ప్రాంతము సప్త గుణ సంపన్నమైనదని ఇచ్చట నగరము నేర్పరచ తన అనుచర గణమునకు నిర్దేశించినాడు.ఈ సప్త గునములేమిటివన:1.తపస్సు 2.సత్యము 3.క్షమ 4.దయ 5.శుచి 6.దానము 7. బ్రహ్మచర్యము. ఈ ప్రాంతమును రాజధానిగా ఎన్నుకొన్న తన పరమ భక్తుడైన కురు మహారాజుకు శ్రీ మహావిష్ణువు రెండు వరాలను ప్రసాదించినాడు . 1.ఆ ప్రదేశమికపై కురుక్షేత్రముగా పిలువబడుతుందని
2.అక్కడ మరణించిన వారు స్వర్గవాసులౌతారని.

ఋషులు అనేకక్రతువులను నిర్వహించుట వలనను,వేదవ్యాసులవారు వేదములను ఋగ్ యజుస్ సామ అధర్వణములుగా విభజించుట వల్లను ఈ ప్రదేశమునకు ధర్మక్షేత్రమనే పేరు కూడా స్థిరపడినది. అందువల్లనే ధృతరాష్ట్రుడు 'ధర్మక్షేత్రే' 'కురుక్షేత్రే' వాడినాడని చెప్పవచ్చును.

ఇందులో ఒక గూఢార్థము కూడా ద్యోతకమగుచున్నది. 'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల )
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది.ఆ క్షేత్రము వేరే కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడియుంటాడు. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబదినదేమో.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే
చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథానము కొనసాగుతూనే వుంటుంది.

కావున ఈ వివరణను సంగ్రహించితే, 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .
స్వస్తి.

Thursday, 9 May 2019

Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు


Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు
https://cherukurammohan.blogspot.com/2019/05/dr.html
ఆస్య గ్రంధిలోనికి నేను అడుగు పెట్టేవరకూ వారిని గూర్చి నాకు తెలియదు, నన్ను గూర్చి వారు తెలుసుకొనే అవకాశమేలేదు. కాలంతరములో ఆస్య గ్రంధిలోని మా రచనలు మా ఇరువురినీ దగ్గరకు చేర్చినాయి. నిజానికి మాది పర్వత పరమాణు సారూప్యము, అజగజ సామ్యము, ఆయన నడిచే విజ్ఞాన సర్వస్వము. విషయము ఆస్య గ్రంధిలో ఎవరు వ్రాసినదైనా కానీ, నిర్మొహమాటముగా విమర్శించే వారి తీరు  నాకెంతో నచ్చినది. ఆయన స్వర్గాస్తుడయి ఆయన చేత సందేహములు తీర్చుకొనుటకు దేవేంద్రుడే స్వర్గములోని తన మహాసభలో ఉన్నత స్థానమోసగి సభికునిగా చేసుకోన్నాడేమో!
2013 నుండి 2016 వరకు ఆస్య గ్రందియోక్క రూపురేఖలు వేరు. ఎవరికి ఏ విషయముపై అభినివేశామేక్కువగా వుంటుందో దానిని గూర్చి విశ్లేషణా పూర్వకముగా వివరణాత్మకముగా వ్రాసేవారు. ఆ విషయముపై శ్రద్ధగలిగినవారు. తమతమ అభిప్రాయములతో స్పందించేవారు. సందేహమేర్పడితే అడిగేవారు. ఆ సమయములో శర్మ గారు ప్రతి సందేహాన్నీ సాధికారకారక టిప్పణితో తీర్చేవారు. వారు దానిని ఏకారణము చేతనైన చూచియుండకపోతే ఆ బాధ్యత నేను తీసుకొనేవాడిని.
నేనేదయినా ఒక ముఖ్యమైన విషయముపై వ్రాస్తే తప్పనిసరిగా దానిపై వారి అభిప్రాయము ఉండి తీరవలసినదే! వారు  సద్గురు శివానంద మూర్తిగారి ఆధ్వర్యమున వచ్చే సంచిక ‘సుపథగ’ కు ఆంగ్లములోనూ తెలుగులోనూ వ్యాసములు వ్రాసేవారు. నారచనపై ఎవరయినా కుతర్కము చేస్తే ముందు దానికి జవాబుగా వారి స్పందన ఉండేది. వారి రచనల కుతార్కికులకు నేనూ అదేవిధముగా స్పందించేవాడిని. ఒకరికొకరము యథాదృష్టి అంటే నేరుగా చూచుకొనకపోయినా మామద్యన ఒక ఆత్మీయతాభావము నెలకొనియుండేది. ఆంగ్లములో ‘Historicity’ ని గూర్చి వారు ‘సుపథగ’ కు వ్రాయదొడగిన వ్యాస శృంఖలను నాకు ‘Email’ లో పంపి ఒకసారి చూసి అవసరమున్నచోట మార్పునకు అవకాశము ఉన్నదేమో చూడమన్నారు. నిజానికి ఆయనముందు నేను పిపీలికమును. ఈ విషయము ఆయన యొక్క నిగర్వమును చాటుతుంది. ఇక వారిని గూర్చి ఇది కాక ఇంకాస్త తెలుసుకొందాము.

వీరు ఆది నుండి తుది వరకు చదువులో అగ్ర తాంబూల గ్రహీత. దేశంలో సుప్రసిద్ధమైన భారతీయ విఙ్ఞాన్ సంస్థాన్ (Indian Institute Of Science) విద్యుత్ తాంత్రిక విభాగమునుండి 1964, 1966, 1971 లో BE, ME, PhDలు పొందినారు. 1967లో అక్కడే ఉపన్యాసకునిగా చేరిన వీరు, 2006 లో కంప్యూటర్ సైన్సు మరియు ఆటోమేషన్ విభాగంలో ఆచార్యునిగా పదవీ నివృత్తి పొందినారు. 2012 వరకు అక్కడే INAE Distinguished Professor గా ఉండినారు. ఎన్నో దేశ విదేశ విశ్వ విద్యాలయములకు Visiting Professor గా వుండినారు. సద్గురు శివానంద మూర్తిగారు స్థాపించిన సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు నుండి 2010 విశిష్ట పౌర సన్మానాన్ని అందుకున్నారు. Indian Academy of Science, Indian National Academy of Science మరియు Indian Academy of Engineering లలో విశిష్ట సభ్యునిగా ఎన్నికైనారు. వారు తెలుగు ఇంగ్లీషులలో చరిత్ర, తత్వ శాస్త్రము, సాహిత్య విషయాలపై వ్యాసరచనా వ్యాసంగమును సద్గురువు శివానంద మూర్తిగారి కోరిక మేరకు చేబట్టి నిరాఘాటముగా నిరంతరాయముగా కొనసాగించుచుండినారు.
2017, మె 7 న ఆవ్ష్కరణకు నోచుకొన్న నా పుస్తకములు ‘శంకరదాస ఆష్టోత్తరశ తి’ మరియు ‘సరసరస (వ్యాస సంపుటి)’ లలో ‘శంకరదాస ఆష్టోత్తరశ తి’ కి నేను వారికి తెలిపిన మరురోజుకల్లా తన అభిప్రాయము వ్రాసి email లో పంపిన మహానుభావుడు. వారు తమ అభిప్రాయమును తెలియజేస్తూ వ్రాసిన వారి రచనకు ఉంచిన శీర్షిక ‘ఒక చదువరి అభిప్రాయము’. ఆమహనీయునికి నా సాష్టాంగ పాదాభివందనము. వారు నా పుస్తకముపై అభిప్రాయమును తెలుపుతూ తమ ఉదాత్తతను ఎంత గొప్పగా చాటుకొన్నారో  చూడండి. “పుండరీకము అంటే తామర పువ్వు గుర్తుకొస్తుంది.కానీ బెబ్బులి అన్న అర్థమున్నాడని ఇప్పుడే తెలిసింది.” ఎంతో గొప్పవాడై ఉండికూడా ఆయన ఎంత వినయసంపంనత కలిగియుండినాడో చూడండి. ఆమహనీయునికి మరొక సారి అంజలించుతూ నాయొక్క ‘శంకరదాస ఆష్టోత్తరశతి’ లో వారిని గూర్చి వ్రాసిన ఈ క్రింది పద్యముతో ఈ రచ్జన ముగించుచున్నాను.
సాంకేతికంబైన చదువు నెవ్వరు సాటి
కలన సువిద్య లో గాంచ మేటి
ఆచార్య పదవికే యాతడౌను కిరీటి
సందేహతప్తుని సతత సురటి
సరస గీర్వాణాంధ్ర సాహిత్య ఘనపాఠి
ధర్మ దర్శక మూర్తి ధన్వి ధాటి
విజ్ఞాన మధుపుష్ప విష్టపమ్మున తేటి
వసుధ మేధావిగ్రావంపుకోటి

నాదు ప్రార్థన మన్నించి నలువ రీతి
అట్టి విద్వచ్ఛిరోమణి యాదరాన
వ్రాసె దనమాట, శివునాఙ్ఞ వాటుగొనుచు
శంకరునిదాస విరచిత శతకమునకు
స్వస్తి.

Sunday, 7 April 2019

నుదుటి బొట్టు మన సాంప్రదాయము


నుదుటి బొట్టు మన సాంప్రదాయము
https://cherukurammohan.blogspot.com/2019/04/blog-post.html
కను బొమలు రెండు పర్వత శిఖరములుగా భావించుకొంటే ఆరెంటి నడుమన ఉదయించే సూర్యుడు స్త్రీకి కనుబొమల నడుమగల నుదుటి బొట్టవుతాడు. నేటి కార్యాలయ సాంప్రదాయములలో అసలు సూర్యుడు, వెలుతురు, ఆరోగ్యము అన్నవి అగుపించని ఎత్తుకు ఎగిరిపోయినాయి. బొట్టు కూడా అదే ఎత్తుకు చేరుకొనింది. ఆర్జన తప్ప అన్యము అవసరము లేని కాలములో  ఉన్నాము. స్థితి నిరాశ నిస్పృహకు ఆలవాలమైనా. అంధకార బంధురమైన మన జీవన సరళి అను సొరంగమునకు అటువైపు ఎదో ఒక ఆశా కిరణము అగుపించక పోతుందా? అన్న తపనతో ఈ విషయమును మీకు తెలుప ప్రయత్నించుచున్నాను.

అంగుష్ఠః అంటే బొటన వ్రేలు. సంస్కృతములో అంగుష్ఠమన్నది పుంలింగము. దానికి దార్ఢ్యము చాలాఎక్కువ. మిగత నాలుగు వ్రేళ్ళ బలమును అది కలిగియుంటుంది. వ్రేళ్ళు ఏపనిని కూడాబొటనవ్రేలు సాయము లేనిదే చేయలేవు. ఇది హృదయానికి సంకేతము అని పెద్దలు చెప్పినారు. ఇక మిగిలిన నాలుగు వ్రేళ్ళను 'అంగుళ్యః' అంటారు. ఇవి నాలుగు అందంగా ఆకర్షణీయంగా వుంటాయి. బహుశ అందుకేనేమో ఇవి స్త్రీలింగమునకు చెందు పదములు సంస్కృతములో! వీనిలో మొదటి దానిని 'తర్జని' అంటారు.  తర్జనము అంటే భయము బెదురు అని అర్థము. అందుకే అసంకల్పితముగానే మనము కోపములో ఎవరినైనా హెచ్చరించవలసి వస్తే ఆ వ్రేలునే చూపిస్తాము. 'తర్జని' అంటే బెదిరించేది, భయపెట్టేది' అని అర్థము. కొందరు దీనితో బొట్టు పెట్టుకొంటారు.  మనకనుబొమల నడుమ సుషుమ్న నాడి మరియు ఆజ్ఞా చక్రము వుంటాయి.  సుషుమ్న, మన ముక్కు కుడివైపునుండి ఇడ అన్న నాడి నుదుటికి ప్రాకి అక్కడ ఎడమ వైపునుండి వచ్చిన పింగళ అన్న నాడితో కలిసే చోట ఉంటుందని పెద్దలు చెబుతారు.  ఈ తర్జనితో  బొట్టు పెట్టుకొంటే మనకు ఆ బెదిరించే లేక కోపగించుకొనే లేక అసహనమనే లక్షణాలను కలిగిపజేస్తుంది సుషుమ్న వద్దనున్న ఆజ్ఞా చక్రము. కాబట్టి చూపుడు వ్రేలితో బొట్టు పెట్టుకొనరాదు.
   ఇపుడు చివరి వ్రేలును గూర్చి తెలుసుకొందాము. దీనిని సంస్కృతములో 'కనిష్ఠిక' మంటారు. కనిష్ఠము అంటే చిన్నది, బలహీనమైనది (Least, weak) అని అర్థము. ఇక్కడ ఒక్క విషయము  చెప్పవలసి వస్తుంది. వివాహములో వదూవరులకు పాణిగ్రహణము చేయించి నడిపించే సమయములో ఇరువురినీ చిటికెన వ్రేళ్ళు పెనవేసుకొని నడువ మంటారు. ఇది పాణిగ్రహణము కానేరదు. 'కనిష్ఠికా' గ్రహణము ఔతుంది. కావున ఇరువురూ చేతులను చేతులు కలిపి (shake hand లో లాగా) నడిపించాలి. బలహీనమగు వ్రేలితో బొట్టు పెట్టుకోనకూడదు.  ఇక మిగిలి పోయినవి రెండు వ్రేళ్ళు. చిటికెన వ్రేలికి ప్రక్కనున్న వ్రేలును సంస్కృతములో అనామికమంటారు. అనామికము అంటే పేరులేనిది అని అర్థము. అసలు మన వ్యాసమునకు సంబంధము లేక పోయినా ఇక్కడ . 'కనిష్ఠిక' మరియు అనామిక ను గూర్చి ఒక చిన్న కథ చెప్పుకొందాము.
కాళిదాసు ఒక కవితామేరువు. అందుకే విద్వాంసులు ఈ విధముగా అంటారు అన్న ఒక ప్రసిద్ధమైన చాటువు మన మధ్యన ఉంది. పూర్వ కాలము ఒక విద్వత్ కవి పండిత సదస్సులో అందరికన్నా గొప్పయగు ఒక ఐదుగురు కవుల పేర్లు గుర్తించ దలచినారట. అనుకొన్నదే తడవుగా గుర్తుకొచ్చిన మొదటి పేరు కాళిదాసుది. ఆతరువాత ఎవరు అన్నది ఎంత గింజుకొన్నా గుర్తు రాలేదట. దానిని ఈ శ్లోక రూపములో ఎంత హృద్యముగా చెప్పినారో చూడండి:
పురాకవీనాం గణన ప్రసంగే

కనిష్ఠికాధిష్టిత కాళిదాసా:

అద్ద్యాపి తత్తుల్య కవేరభావేత్
అనామికా సార్థవతీ భభూవ
ప్రాచీన కవులలో గొప్పవారెవరా అని ఒక పెద్ద పండితుడు  వేళ్ళు లెక్కబెట్టుట , చిటికెన వేలితో మొదలుపెడుతూ  కాళిదాసు అన్నారట. తరువాత వ్రేలిని లేపి పేరు చెప్పబోగా కాళిదాసుతో సమానుడైన మరోకవి ఎవరూ తోచక ఆపివేసినాడట. ఆ విధముగా ఆ వ్రేలికి అనామికమ'న్న పేరు సార్థకమయిందట. ఇందులోని చమత్కారము ఏమిటంటే సంస్కృతములో చిటికెన వ్రేలికి ప్రక్కనున్న వ్రేలికి  అనామికము అన్న పేరు మాత్రమే ఉంది. అనామికము అంటే పేరులేనిది అన్నది తాత్పర్యము.
కానీ తెలుగులో ఆ వ్రేలిని ఎంతో గౌరవించి మనము  ఉంగరపు వ్రేలు అంటాము.
ఇప్పుడు పెరులేనిది అన్న మాటకు ఉంగరపు వ్రేలు అన్నది సమన్వయము చేద్దాము. కాళిదాసు తరువాత అంతటి గొప్ప కవి లేడన్నాము కదా! ఒకవేళ ఉంటే, అతనే, ముద్రిక అనగా ఉంగరము ధరించగల యోగ్యుడు. అది జరగని పని కాబట్టి ఆ వ్రేలు 'అనామకము' గానే మిగిలిపోయింది సంస్కృతములో!
ఇక తిరిగీ విషయానికి వస్తే అనామికమునకు పేరే లేదు కావున దాని గుణగణములూ మనకు తెలిసే అవకాశము లేదు. కావున బొట్టు పెట్టుకొనుటకు ఇది కూడా నిషిద్ధము.
ఇక మిగిలినది మధ్యమము. అసలు మధ్యే మార్గము మంచి మార్గము అన్న సామెత ఒకటి మనకుంది. ఇదికాక ఈ మధ్య వ్రేలు పొడవు గానూ బలిష్టముగానూ ఉంటుంది. దీనితో కుంకుమ తీసుకొని ఆడవారు కానీ మగవారుకానీ నుదుటిపై అదిమి పెట్టుకొనుటవల్ల ఆజ్ఞా చక్రమును ఉత్తెజితము చేసినట్లవుతుంది. రోజంతా అది మనకు రక్షగా పనిచేస్తుంది. కాబట్టి నుదుటి బొట్టును ఎప్పుడూ మధ్యవ్రేలుతో అదిమి పెట్టుకొనవలెను. అదే ఒకరు ఇంకొకరికి బొట్టు పెట్టునపుడు  బొటన వ్రేలును ఉపయోగించమని పెద్దల మాట.
కానీ ఈ రోజు ఆడ మొగ ఎవరికీ ఆ కష్టము లేదు. ఎందుకంటే మగవాళ్ళు మానేసి ఒక శతాబ్దము కావస్తూ ఉన్నదేమో! ఆడవారు కూడా 6౦ సంవత్సరముల క్రిందటే కుంకుమ మాని Plastic Stickers ను ప్రత్యామ్నాయముగా చేసుకొన్నారు. నేటి అతివలు ఆ ఖర్చుకూడా తగ్గించుకొని బోసి నుదుటి తో ఉండుటయే బోగొప్ప అని భావించుతున్నారు. ఈ సందర్భములో నాకు గుర్తుకు వస్తున్న ఒక చాటువును తెలుపుతూ విరమించుతాను
చాకివానితోడి జగడాలు పడలేక
సిరిగలాడు పట్టు చీర కట్టె
శివుడు తోలు గప్పె ఛీయని మదిరోశి
భైరవుండు చీర బారవైచె
చాకలితో ఇది చినిగింది, అది పోగొట్టినావు అది ఇంకా తేలేదే అన్న పోరు పడలేక విష్ణువు పట్టు పీతాంబరములు ధరించినాడట, అవి రోజూ ఉతుకనక్కరలేదు అందుకని, అసలు ఉతికే పనే ఉండదు కదా అని శివుడు తోలు చుట్టుకొన్నాడు, అసలు తోలు కూడా ఎల్లకాలమూ ఒంటికి అతుక్కొని ఉంటే వాసన వస్తుందని భైరవుడు అంతా విడిచిన వాడు ఎంత భాగ్యశాలి అనుకొంటూ అదికూడా లేకుండా దిగంబరంగానే ఉండిపోయినాడట. అనేకమంది మన భారతీయ వనితలు బొట్టు విషయములో నేడు భైరవుని POLICY నే అనుసరిస్తున్నారు.
స్వస్తి.

Sunday, 17 March 2019

భూగోళము


భూగోళము
మన ఊహకు అందని కాలము నుండి కూడా మనము భూమిని భూగోళము అనియే వాడుచున్నాముకదా! మరి ఈ బల్లపరుపు భూమి ఎక్కడనుండి వచ్చినది. ఈ ప్రతిపాదన మనది కాదు. ఈ ప్రతిపాదన, క్రొత్తగా పుట్టిన వారి వారి మతముల దేవుళ్ళు చేసినవి. ముందు వెనుక ఆలోచించకుండా వారిని అనుసరించే గొర్రెదాటు మనస్తత్వము కలిగిన మనది, కాబట్టి అవునేమో అనుకొన్నాము. . అంతేకానీ మన పూర్వులు భూమి గుండ్రముగా ఉన్నదనే చెప్పినారు.
16, 17 వ శతాబ్దాలకు చెందిన పర దేశీయులైన కెప్లర్ కోపర్నికస్, మరియు గెలీలియోలు, భూమిగుండ్రంగా గోళాకారంలో వున్నదని కనిపెట్టినట్లు ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా నమ్ముతున్నాము  అదేవిధముగా.పుస్తకాలలో కూడా చదువుచున్నాము. కానీ ఈ విషయము వేదకాలంలోనే మన భారతీయులకు తెలుసు. దానినిరూపణకు ఎన్నో ఉదాహరణలున్నాయి. 1.ఋగ్వేదంలో 1.33. 8 వ మంత్రంలో ఇలా వుంది:
'చక్రాణానః పరీణయం వృథివ్యా...' అనగాభూమియొక్క వృత్తపు అంచున వున్న వారు అనిభావం. అనగా భూమి గుండ్రంగా వున్నదనిఅర్థం.

2. సూర్య సిద్ధాంతం అనే ప్రాచీనగ్రంధంలో 12 వ అద్యాయం, 32 వ శ్లోకంలో ఇలావుంది.:   'భూగోళో వ్యోమ్నితిష్ఠతి' అనగా బ్రంహాండం మద్యలో భూగోలంఆకాశంలో నిలిచి వున్నది అని అర్థము. ఇంతస్పష్ఠంగా చెప్పబడింది. 3. క్రీ.శ. 476 ప్రాంతంవాడైన ఆర్య భట్టు తన గ్రంథం ఆర్య భట్టీయంలో గోళ పాదమనే అధ్యాయం...... 6 వ శ్లోకంలో :: 'భూగోళః సర్వతో వృత్తః' అన్నాడు. అనగా భూమి సర్వతో వృత్తః అంటే భూమి అన్ని వైపులా వృత్తాకారముగా  వున్నదని అంటే భూమి గోళాకృతి కలిగియున్నది అనియె కదా అర్థము. అసలు సంబోదనే 'భూగోళః' అని వుంది.  మరి ఈ విషయములు మన పూర్వులకు అనంతకాలమునుండి సుపరిచితములని తెలియుట లేదా! ఈ విషయముగా ఒక, బహుశ, జరిగిన కథ తెలుసుకొందాము.
భాస్కరాచార్య - 2  యొక్క కుమార్తె లీలావతి. వీరు 12వ శతాబ్దమునకు చెందినవారు. వీరికి సంబంధించిన ఒక విషయము, భూమిని గూర్చి, వినండి.
 ఒక నాడు "భూమి నాలుగు వైపులా బల్లపరుపుగా ఉంది కానీ మీరు భూమిని గోళము అంటూవున్నారు. కారణమేమి" అని అడిగింది లీలావతి తన తండ్రి భాస్కరా చార్యుల వారిని .
అప్పుడు ఆయన, పుత్రీ! మనకు కనిపించేదంతా నిజమనుకోవడం తప్పు. అది ఒక భ్రమ. కొండను దూరము నుండి చూస్తే ఎంతో నునుపుగా కనబడుతుందికదా!  మరి దగ్గరికి పోయి చూస్తె అది భ్రమయని మనకు తెలుస్తుంది. నీవు ఇసుకలో ఒక పెద్ద వృత్తమును గీచి దాని పరిథిలో  ఏ 16వ భాగాన్ని గుర్తించి చూడు. అది నీకు సరళ రేఖవలెనే కనిపిస్తుంది కాని నిజానికది వృత్తములోని భాగమే కదా! అదేవిధముగా విశాలమగు ఈ భూమి  గోళాకారమును కలిగియున్నా, మనమందులో  అత్యంత తక్కువభాగమును మాత్రమే చూడగలుగుచున్నాము. కాబట్టి మనకది బల్లపరుపుగా కనిపిస్తుంది. వాస్తవానికి భూమి గుండ్రంగా ఉంది అన్నది నీకు అర్థమౌతూవున్నది కదా!. అని ఆమె సందేహమును తీర్చినాడు.
ఆమాటకు శ్లోకరూపము ఈ దిగువన ఇవ్వబడినది.
నమో యతః స్యాత్పరిధేః శతాంశః
పృథ్వీ చ పృథ్వీ నితరాం తనీయాన్.
నరశ్చ తత్పృష్ఠగతస్య కృత్స్నా
సమేవ తస్య ప్రతిభాత్యతః సా. (భువనకోశం – 13)
భూమి గుండ్రంగా ఉంది అని బైబిల్ కు విరుద్ధముగా చెప్పిన కోపర్నికస్ ను రాళ్ళతో కొట్టి చంపిన మతానుయాయులను, మన అభిమతాలను చంపుకొని, మన పూర్వుల ఆవిష్కరణలను తుంగల ద్రొక్కి, 'మీరే తప్ప నితఃపరంబెరుగము' అంటూ ఆలోచన లేక అనుసరించుచున్నాము.  ఈ భారతీయ సంస్కృతిలో శాస్త్రమునకు మనము అనుసరించే ధర్మమునకు  అవినాభావ సంబంధము వున్నది. ఆవిషయమును ఆసాంతము మరచి, తెలివి అంటే వారిది అని మానాభిమానములు వదలి వారి వెనుక మన గోచి ఊడిపోతూవున్నా పరిగెడుతూ ఉన్నాము. సత్యాన్వేషణ, సత్యనిరూపణ అన్నవి మన జాతికి మూలములు. ఈ రెండు విషయాలను నిర్లక్షంచేసి జాతిని తిరోగతిలో పయనింపజేసి  అథోగతికి చేర్చుచున్నాము. ఇకనన్నా యువత వాస్తవాలను గమనించి, గ్రహించి పురోగమించితే దేశ ప్రతిష్ఠకు పునర్వైభవము సమకూర్చినవారవుతారు.
స్వస్తి.

Wednesday, 27 February 2019

గణిత మేధావి పావులూరి మల్లన

గణిత మేధావి పావులూరి మల్లన
లంకె:
https://cherukurammohan.blogspot.com/2019/02/blog-post.html

మహనీయులగు మల్లన్న గారు భారతమును ప్రారంభించి తెలుగునా ఆదికవి అని అనిపించుకొన్న నన్నయ గారి సమకాలీనుడు. వివిధవిధములగు ఛందస్సులలో, తెలివిని, భక్తిని, పాండిత్యమును , శాస్త్రవిజ్ఞానమును మేళవించి గణితశాస్త్రమును తెనుగులో పద్య గ్రంధముగా వ్రాసినాడు. ఈ విషయము ఎందరికి తెలుసునో నాకు తెలియదు. 10 భాగములుగా వ్రాసిన ఆ గ్రంథములోని 3 భాగములు మాత్రమె మనకు లభ్యములు. పెద్దలపై మన భక్తి, మన శాస్త్రములపై మన విశ్వాసమునకు ఈ వాస్తవము ప్రతీక. ఇకనైనా కన్ను తెరువండి. యువకులారా మీ పూర్వుల గొప్పదనము గుర్తించండి. మీరు చదువుతారు అన్న నమ్మకము నాలో కొడిగట్టిన దీపమయినా ఆ మహానీయులపై భక్తి గౌరవము అన్న తైలమును పోసి ఈ దీపమును అఖండముగా వెలిగించే బృహత్ప్రయత్నము చేయుచున్నాను. గణిత ఉపాధ్యాయులు, ఆచార్యులు ఈ చిన్నివ్యాసమును ఆలంబనగా తీసుకొని కృషిచేసి ఆ మహనీయుని పేరును చిరస్మరనీయము చేస్తారని మనసులోని మారుమూలన ఒక అత్యాశ.

పావులూరి మల్లన
తెనుగున గణితశాస్త్రమును రచించిన గణిత శాస్త్రజ్ఞుడు, శివ భక్తుడు, పండితుడు మరియు మహాకవి. ఈయన నియోగి బ్రాహ్మణుడు; తాను శివన్న గౌరమ్మల పుత్రుఁడనని, ఆపస్తంభసూత్రుఁడనని, గార్గ్యగోత్రుఁడనని తానె చెప్పుకొన్నాడు.  వీరుమల్లయామాత్యుని పౌత్రులని కూడా తమ రచనల ద్వారా తెలుపుచున్నారు.ఈయన గోదావరిమండలములోని పావులూరి గ్రామ కరణము.
వీరి కాలము 11 వ శతాబ్దము. వీరు నన్నయ కాలమునాటివాడని, కాదు నన్నెచోడుని కాలమునాటి వాడని అన్న వాదములు గలవు. ఈయన ‘గణితసార సంగ్రహము’ అను గణిత గ్రంథమును వ్రాసినాడు. రాజరాజునుండి తనకు నవఖండవాడ అగ్రహారం లభించిందని తన గ్రంథములో తానే చెప్పుకొన్నాడు. తెలుగు పద్యానికి ఆరంభదశ అని మనము నేటికి కూడా ఊహించుకొనే కాలములో అలతి పదములతో అద్వితీయ గణిత మరియు భాషా పాండిత్యముతో  గణిత శాస్త్ర సూత్రములను అనుబంధముగా తాను కూర్చిన అనేక  గణిత సమస్యలను ఎంతో సులభముగా అర్థము చేసుకొనగలిగిన రీతిలో రచించుటచేత, ఆయన గొప్పదనమే గాక తెలుగు కవిత్వము నన్నయకు ముందు కాలమునుండియే వున్నది అన్న నిజము నిజాయితీగా పరిశీలించితే అర్థమౌతుంది.  ఈయన మహావీరాచార్యులు రచించిన "జైన గురుసార సంగ్రహ గణితము"ను సంగ్రహించి  ఆ సంస్కృత గ్రంథమును మూలముగా గైకొని అందుగల గణిత సమస్యలను తానె ఏర్చి కూర్చి పేర్చి అల్లినాడు. వ్యర్థ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంథమును రచించుట వీరి ప్రతిభకు తార్కాణము.
ఆయనను గూర్చి ఎక్కువగా తెలుసుకొనే అవకాశము చరిత్ర మనకు అనుగ్రహించలేదు. పైగా ఆయన తన గణిత గ్రంధమును పది ఖండములుగా వ్రాస్తే ఇపుడు మనకు లభించినవి మూడు మాత్రమేనని తెలియవచ్చుచున్నది.
ఆ పుస్తకం లోనుండి ఒక సమస్యా  పద్యం:

ఖర్జూర ఫలములు గణకుండు కొనితెచ్చి
సగపాలు మోహంపు సతికి నిచ్చె
నందు నాల్గవ పాలు ననుగు దమ్ముని కిచ్చె
నష్ట భాగం బిచ్చె ననుజు సతికి
తగ తొమ్మిదవ పాలు దనయున కిచ్చెను
దనచేత నాల్గున్న తల్లికిచ్చె
మొదల తెచ్చిన వెన్ని, మోహంబు సతికెన్ని,
యనుగు తమ్మున కెన్ని, అతని సతికి

ఎన్ని యిచ్చె సుతునకెన్నిచ్చె  మరియును
 తల్లికెన్నియిచ్చె దగ వచియింప
గణిత మెరిగినట్టి కరణాల బిలిపించి
అడగవలయు దేవ అవధరింప
తాత్పర్యం: లెక్కలు తెలిసిన వాడొకడు ఖర్జూరాలు తెచ్చి, సగం మోజుపడ్డ భార్యకిచ్చాట్ట. నాలుగొంతులు తమ్ముడి కిచ్చాట్ట. ఎనిమిదో భాగం తమ్ముడి భార్య కిచ్చాట్ట. తొమ్మిదవ భాగం తనయుడికి ఇచ్చాట్ట. చేతిలో మిగిలిన నాలుగు తల్లికిచ్చాట్ట. మొదట తెచ్చినవెన్ని? ఒక్కొక్కరికి ఇచ్చినవెన్ని?
ఈ కింది సమీకరణాన్ని సాధిస్తే సమాధానం తెలుస్తుంది. పద్యమును చక్కగా అనుసరించితే మనకు ఈ క్రింది సమీకరణము వస్తుంది.
అది తరువాత చూద్దాము......
x/2 + x/4 + x/8 + x/9 + 4 =
x = 288.
అలాగే పావురాల పై మరొక పద్యం. 
 సౌధతలమున విహరించె సప్తమాంశ 
మష్టమూలంబు శయన గృహాంతరమున 
జనగ యేబది యారుండె జాలకముల 
గృహ కపోత గణమ్మెంత మహతకీర్తి! 
తాత్పర్యం: ఏడో వంతు పావురాలు మేడ (సౌధతలం?) మీద ఉన్నాయట. అష్ట   (=8)మూలం (root) పడగ్గదిలో ఉన్నాయట. పోగా మిగిలిన 56 వలలో చిక్కుకున్నాయి.
  దీన్ని సమీకరణంగా రాస్తే -  

Hence the result.
ఈ విధముగా సమస్యను ఒక కథ రూపములోనూ మరియు ఛందోబద్ధముగానూ వ్రాయాలంటే ఎంతటి పాండిత్యము కావలెనో గమనించండి. ఈ విధముగా గణితము బోధించితే పిల్లలు ఎంతో ఉత్సాహముతో విని భవిష్యత్తులో కొందరయినా గణిత మరియు  భాషా శాస్త్రజ్ఞులే  కాగలుగుతారు కదా!

ఇంకొక సమస్య చూడండి: 
ఇంకొక సమస్య చూడండి:
 చెలికి షడంశమున్ బ్రియకు శేషము లోపలఁ పంచమాంశమున్  
బొలుపుగ దాని శేషమున బోదకు నాల్గవపాలునిచ్చి యం  
దులఁ దన పాలు దాఁ గొనిపోయెఁ దొమ్మిది జేనలు రాజహంసమీ  
నళిన మృణాళమెంత సుజనస్తుత మాకెఱుఁగంగఁ జెప్పవే  
నళిన మృణాళము=తామర తూడు, బోద=పక్షి పిల్ల, జేన=అరచేయి విస్తరించితే బోటికెన మరియు చిటికెన వ్రేళ్ళ కొసలకు గల మధ్య దూరము.
ఇక ఇచ్చిన సమస్యను పరిష్కరించుదాము. తామర తూడు పొడవు x   అనుకొందాము.  అందులో 6వ భాగము చెలికి ఇవ్వబడినది. అంటే x\6 ఇవ్వబడినది అన్న మాట. మిగిలినది x-x\6= 5x\6. ఇందులో 5వ వంతు ప్రియురాలికి ఇవ్వబడింది. 

చూసినారు కదా పద్యము సమస్య జవాబు. ఇదీ మన పూర్వుల మేధో సంపత్తి. ఈ విధమగు ప్రతిభ ప్రపంచములోని ఏదేశమునకు సంబంధించిన Scientists లో లేక శాస్త్రజ్ఞులలో కూడా చూడము.
ఇక ఈ మహనీయుడు వ్రాసిన సంఖ్యాశాస్త్రము(Theory of Numbers)నకు సంబంధించిన కొన్ని సమస్యలను గూర్చి కాస్త తెలుసుకొందాము.
ఈ పద్యమును గమనించండి, ఇది ఒక హెచ్చవేత:
సోమాంబుధి వేదసుధా
ధామాగ్ని శరంబు విడి ముదంబున శశి భరి
త్సామజి సంఖ్యను బెంచిన
ఏమియగున్ దాని సంఖ్యా నేరిగింపుమిలన్
ముందు ఒకవిషయము తెలియబరచుతాను. శాస్త్ర విషయములను శ్లోకములోనూ, పద్యములోనూ వ్రాయుట మన పూర్వుల సాంప్రదాయము. దానికొరకు సంఖ్యలను ‘కటపయాది సూత్రము’ తోనూ ‘భూత సంఖ్యాసూత్రము’ తోనూ శ్లోకరూపములో లేక పద్య రూపములో వ్రాయుట కద్దు.
భూత సంఖ్యావిధానము 'భూత సంఖ్య' అంటే పంచ భూతముల పేరుతో ఈ విధానము ఏర్పడింది. ఆకాశమునకు విలువ '0' లేక శూన్యము. పృథివీ=1 ఆపస్సు= నీరు=2 తేజస్సు= వెలుగు=3 వాయువు=4 ఆకాశము =0 భూతము = 5. ఈ విధముగా చక్రవర్తి అంటే శత చక్రవర్తులు= 6 ఋషి=సప్త ఋషులు= 7 ఈ విధముగా వుంటాయి.
ఇప్పుడు మన పద్యమును తీసుకొని అందు తెలిపిన సంఖ్యలను ముందు కనుగొందాము.
‘సోమాంబుధి వేదసుధాధామాగ్ని శరంబు’లు అన్నది ఒకటే సమాసము. ఈ సమాసము పూర్తిగా ఒక పెద్ద సంఖ్యకు ప్రాతినిధ్యము వహించుతుంది. ‘శశి భరిత్సామజి సంఖ్య’ ను బెంచిన అన్నది రెండవది. పెంచుత అన్న పదమునకు హెచ్చించుట లేక హెచ్చవేయుట అన్నది అర్థము. నా బాల్యములో నెల్లూరు జిల్లాలో హెచ్చింపునకు (Multiplication) ‘పెంచుట’ అన్న పదమునే వాడేవారు. కాబట్టి మనకు రెండు సంఖ్యలనిచ్చి వాని లబ్ధమును కనుగోనమన్నారు కవిగారు. ఇందు సాధారణార్థము అంటే పదములయోక్క అర్థమును యధాతథముగా తీసుకొంటే భావాన్వయము కుదరదు.
కావున ‘భూత సంఖ్యా’ విధానమును ఆశ్రయించి మాత్రమే ఈ పదములకు అర్థమును తీసుకొనవలెను.
ఇపుడు మొదటి సమాసమును తీసుకొందాము:
సోమ= చంద్రుడు=1
అంబుధి=సముద్రములు=4; భూమి నాలుగు దిక్కులా జలముచే చుట్టబడిన ద్వీపము కాబట్టి, శాస్త్రములో ‘చతుస్సాగర  పర్యంతం’ అని వాడుతాము. కావున సముద్రములను 4 తెలియజేస్తుంది.  
వేద= చతుర్వేదములు=4  
సుధాధామ=సుధకు నిలయమైనవాడు, చంద్రుడు=1  
అగ్ని=త్రేతాగ్నులు, అవి 1)గార్హపత్యము 2)దక్షిణాగ్ని 3)ఆహవనీయము.=3  
శరంబులు= 5, అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక l నీలోత్పలంచ పంచైతే పంచాబాణాస్సుసాయకః అని అమరము.   ఈ అయిదునూ మన్మధుని యొక్క బాణములు.  
ఇక రెండవ సమాసము.  
శాశిభరిత్సామజము   
శశి=చంద్రుడు=1   
భరిత అంటే కలసిన లేక కూడిన, ఇక్కడ సంఖ్య కానీ అంకె కానీ లేదు.  
సామజ=8, అష్టదిగ్గజములు అంటాము కదా. సామజము అంటే ఏనుగు అనే అర్థము.  
ఇపుడు ఆ సంఖ్యలను వ్రాసుకొని హెచ్చించుదాము. ‘అంకానాం వామతో గతిః’ అని మన గణిత శాస్త్రము చెబుతుంది. కాబట్టి   ఒక సంఖ్యను వ్రాసేటపుడు కుడినుండి అంటే ఒకట్ల స్థానము నుండి వ్రాసుకొంటూ పోతాము.
531441x81 వస్తుంది. ఇక్కడ వేదగణితము చెప్పిన సులభపద్ధతిని ఆశ్రయించుదాము.    
(531441x81= (531441x80) + (531441x1) గా వ్రాసుకొందాము.
    = 42515280 + 531441= 43046721       
మరి ఈ మాత్రపు హెచ్చింపునకు ఇంత తతంగమవసరమా! అన్నది సాధారణ జిజ్ఞాసువు ప్రశ్న.
ఇందులో భాష, మన సాంప్రదాయము, గణితము అన్న మూడు విషయములు తెలియవస్తూ వున్నాయి.
మరి నేడు మనము చేసే హెచ్చింపులో హెచ్చవేయుట తప్ప వేరేమీ తెలియదు కదా!

ఇప్పుడు మరొక సమస్యా పద్యమును తీసుకొందాము.
ఏడును నేనార్లును గడు
వేడుకతో నారు మూళ్ళు వేలయగానిడి తా
రూడిగ ముప్పదిమూటను
దోడనె గుణియించిచెప్పు  ధ్రువముగ మాకున్
ఏడును=7; ఏనార్లు=5 మార్లు 6ను వేసుకోనుము.
ఆరు మూళ్ళు=3 ను 6 మార్లు వేసుకొనుము
ఆ సంఖ్య ఎంత అంటే 333333666667 (అంకానాం వామతోగతిః)
 రెండా సంఖ్య=33. (30+3)
ఇపుడు ఆరెంటినీ గుణించాలి.
333333666667x33 = (333333666667x30) + (333333666667x3)
=(1౦౦౦౦౦1౦౦౦౦౦10) + (1౦౦౦౦౦1౦౦౦౦౦1)
=11000011000011
పై సంఖ్యను ఎటువైపు నుండి చదివినా మనకు ఒకే సంఖ్య వస్తుంది. ఇటువంటి సంఖ్యలను ద్విముఖ సంఖ్యలు అంటారు.
ఇటువంటి ఒక విచిత్ర సంఖ్యను మనము కూడా తయారు చేయవచ్చు. ముందు మనము కోరుకొనే సంఖ్య వ్రాసుకొని దానిని నిశ్శేషముగా భాగించగల ఒక సంఖ్యతో భాగించితే వచ్చే భాగఫలము మనము హెచ్చవేయవలసిన సంఖ్య ఔతుంది.
మరొక ఉదాహరణను తీసుకొందాము.
రుద్రాంబర రుద్రాంబర
రుద్రుల వరుసనిడి శీతరుచిరంధ్రములన్
దద్రాశి బెంచి చెప్పుము
రుద్రార్చిత పుష్ప తిలక! రూపేర్పడగన్

రుద్ర=11 (ఏకాదశ రుద్రులు)
అంబర=0 (ఆకాశం గగనం శూన్యం)
రుద్ర=11
అంబర=0
మొదటి సంఖ్య= 11011011 (అంకానాం వామతోగతిః)
ఇక్కడ రుద్ర అను మాటను కాస్త వివరించుతాను.
నమః సోమయచ రుద్రాయచ
నమః తామ్రాయచ అరుణాయచ
నమః శఙ్గాయచ పశుపతయేచ
నమః ఉగ్రాయచ భీమాయచ
నమః అగ్రే వధాయచ దూరే వధాయచ
నమో హన్త్రేచ హనీయసేచ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః
నమః తారాయ
నమ్హ శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ
మనము మంత్రం రాజముగా భావించి మనము చేసే ‘నమః శివాయ’
అన్న మంత్రము ఇక్కడ వస్తుంది. అందుకే అప్పయ్య దీక్షితులవారన్నారు...
విద్యాసు శ్రుతిరుత్కృష్టా రుద్రైకాదశని శ్రుతౌ
తత్రపంచాక్షరీ తస్యాం శివ ఇత్యక్షరద్వయం
                                       అప్పయ్య దీక్షితులు
శీతరుచి (చల్లని కిరణములు కలిగిన వాడు, చంద్రుడు = 1)
రంధ్ర= (నవ రంధ్రములు = 9)
రెండవ సంఖ్య= 91 (అంకానాం వామతోగతిః)
ఇపుడు 11011011x91 మనము చేయవలసియున్నది.
పై సమస్యలో చేసిన విధముగానే ఇక్కడకూడా సులభరీతినే అనుసరిద్దాము.
 11011011x91 = (11011011x90)+( 11011011x1) = 990990990 + 11011011
= 1002002001
చూసినారు కదా! మల్లన్న గారి ప్రతిభ. ఇంకా తెలుసుకొనవలెనను ఉత్సాహము ఉన్నవారు, వారు రచించిన గణిత గ్రంధమును సంపాదించి అందలి సమస్యల్;అను సాధించి లోకానికి మన పూర్వుల ప్రతిభ చాటండి.

స్వస్తి.