Sunday, 17 March 2019

భూగోళము


భూగోళము
మన ఊహకు అందని కాలము నుండి కూడా మనము భూమిని భూగోళము అనియే వాడుచున్నాముకదా! మరి ఈ బల్లపరుపు భూమి ఎక్కడనుండి వచ్చినది. ఈ ప్రతిపాదన మనది కాదు. ఈ ప్రతిపాదన, క్రొత్తగా పుట్టిన వారి వారి మతముల దేవుళ్ళు చేసినవి. ముందు వెనుక ఆలోచించకుండా వారిని అనుసరించే గొర్రెదాటు మనస్తత్వము కలిగిన మనది, కాబట్టి అవునేమో అనుకొన్నాము. . అంతేకానీ మన పూర్వులు భూమి గుండ్రముగా ఉన్నదనే చెప్పినారు.
16, 17 వ శతాబ్దాలకు చెందిన పర దేశీయులైన కెప్లర్ కోపర్నికస్, మరియు గెలీలియోలు, భూమిగుండ్రంగా గోళాకారంలో వున్నదని కనిపెట్టినట్లు ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా నమ్ముతున్నాము  అదేవిధముగా.పుస్తకాలలో కూడా చదువుచున్నాము. కానీ ఈ విషయము వేదకాలంలోనే మన భారతీయులకు తెలుసు. దానినిరూపణకు ఎన్నో ఉదాహరణలున్నాయి. 1.ఋగ్వేదంలో 1.33. 8 వ మంత్రంలో ఇలా వుంది:
'చక్రాణానః పరీణయం వృథివ్యా...' అనగాభూమియొక్క వృత్తపు అంచున వున్న వారు అనిభావం. అనగా భూమి గుండ్రంగా వున్నదనిఅర్థం.

2. సూర్య సిద్ధాంతం అనే ప్రాచీనగ్రంధంలో 12 వ అద్యాయం, 32 వ శ్లోకంలో ఇలావుంది.:   'భూగోళో వ్యోమ్నితిష్ఠతి' అనగా బ్రంహాండం మద్యలో భూగోలంఆకాశంలో నిలిచి వున్నది అని అర్థము. ఇంతస్పష్ఠంగా చెప్పబడింది. 3. క్రీ.శ. 476 ప్రాంతంవాడైన ఆర్య భట్టు తన గ్రంథం ఆర్య భట్టీయంలో గోళ పాదమనే అధ్యాయం...... 6 వ శ్లోకంలో :: 'భూగోళః సర్వతో వృత్తః' అన్నాడు. అనగా భూమి సర్వతో వృత్తః అంటే భూమి అన్ని వైపులా వృత్తాకారముగా  వున్నదని అంటే భూమి గోళాకృతి కలిగియున్నది అనియె కదా అర్థము. అసలు సంబోదనే 'భూగోళః' అని వుంది.  మరి ఈ విషయములు మన పూర్వులకు అనంతకాలమునుండి సుపరిచితములని తెలియుట లేదా! ఈ విషయముగా ఒక, బహుశ, జరిగిన కథ తెలుసుకొందాము.
భాస్కరాచార్య - 2  యొక్క కుమార్తె లీలావతి. వీరు 12వ శతాబ్దమునకు చెందినవారు. వీరికి సంబంధించిన ఒక విషయము, భూమిని గూర్చి, వినండి.
 ఒక నాడు "భూమి నాలుగు వైపులా బల్లపరుపుగా ఉంది కానీ మీరు భూమిని గోళము అంటూవున్నారు. కారణమేమి" అని అడిగింది లీలావతి తన తండ్రి భాస్కరా చార్యుల వారిని .
అప్పుడు ఆయన, పుత్రీ! మనకు కనిపించేదంతా నిజమనుకోవడం తప్పు. అది ఒక భ్రమ. కొండను దూరము నుండి చూస్తే ఎంతో నునుపుగా కనబడుతుందికదా!  మరి దగ్గరికి పోయి చూస్తె అది భ్రమయని మనకు తెలుస్తుంది. నీవు ఇసుకలో ఒక పెద్ద వృత్తమును గీచి దాని పరిథిలో  ఏ 16వ భాగాన్ని గుర్తించి చూడు. అది నీకు సరళ రేఖవలెనే కనిపిస్తుంది కాని నిజానికది వృత్తములోని భాగమే కదా! అదేవిధముగా విశాలమగు ఈ భూమి  గోళాకారమును కలిగియున్నా, మనమందులో  అత్యంత తక్కువభాగమును మాత్రమే చూడగలుగుచున్నాము. కాబట్టి మనకది బల్లపరుపుగా కనిపిస్తుంది. వాస్తవానికి భూమి గుండ్రంగా ఉంది అన్నది నీకు అర్థమౌతూవున్నది కదా!. అని ఆమె సందేహమును తీర్చినాడు.
ఆమాటకు శ్లోకరూపము ఈ దిగువన ఇవ్వబడినది.
నమో యతః స్యాత్పరిధేః శతాంశః
పృథ్వీ చ పృథ్వీ నితరాం తనీయాన్.
నరశ్చ తత్పృష్ఠగతస్య కృత్స్నా
సమేవ తస్య ప్రతిభాత్యతః సా. (భువనకోశం – 13)
భూమి గుండ్రంగా ఉంది అని బైబిల్ కు విరుద్ధముగా చెప్పిన కోపర్నికస్ ను రాళ్ళతో కొట్టి చంపిన మతానుయాయులను, మన అభిమతాలను చంపుకొని, మన పూర్వుల ఆవిష్కరణలను తుంగల ద్రొక్కి, 'మీరే తప్ప నితఃపరంబెరుగము' అంటూ ఆలోచన లేక అనుసరించుచున్నాము.  ఈ భారతీయ సంస్కృతిలో శాస్త్రమునకు మనము అనుసరించే ధర్మమునకు  అవినాభావ సంబంధము వున్నది. ఆవిషయమును ఆసాంతము మరచి, తెలివి అంటే వారిది అని మానాభిమానములు వదలి వారి వెనుక మన గోచి ఊడిపోతూవున్నా పరిగెడుతూ ఉన్నాము. సత్యాన్వేషణ, సత్యనిరూపణ అన్నవి మన జాతికి మూలములు. ఈ రెండు విషయాలను నిర్లక్షంచేసి జాతిని తిరోగతిలో పయనింపజేసి  అథోగతికి చేర్చుచున్నాము. ఇకనన్నా యువత వాస్తవాలను గమనించి, గ్రహించి పురోగమించితే దేశ ప్రతిష్ఠకు పునర్వైభవము సమకూర్చినవారవుతారు.
స్వస్తి.

Wednesday, 27 February 2019

గణిత మేధావి పావులూరి మల్లన

గణిత మేధావి పావులూరి మల్లన
లంకె:
https://cherukurammohan.blogspot.com/2019/02/blog-post.html

మహనీయులగు మల్లన్న గారు భారతమును ప్రారంభించి తెలుగునా ఆదికవి అని అనిపించుకొన్న నన్నయ గారి సమకాలీనుడు. వివిధవిధములగు ఛందస్సులలో, తెలివిని, భక్తిని, పాండిత్యమును , శాస్త్రవిజ్ఞానమును మేళవించి గణితశాస్త్రమును తెనుగులో పద్య గ్రంధముగా వ్రాసినాడు. ఈ విషయము ఎందరికి తెలుసునో నాకు తెలియదు. 10 భాగములుగా వ్రాసిన ఆ గ్రంథములోని 3 భాగములు మాత్రమె మనకు లభ్యములు. పెద్దలపై మన భక్తి, మన శాస్త్రములపై మన విశ్వాసమునకు ఈ వాస్తవము ప్రతీక. ఇకనైనా కన్ను తెరువండి. యువకులారా మీ పూర్వుల గొప్పదనము గుర్తించండి. మీరు చదువుతారు అన్న నమ్మకము నాలో కొడిగట్టిన దీపమయినా ఆ మహానీయులపై భక్తి గౌరవము అన్న తైలమును పోసి ఈ దీపమును అఖండముగా వెలిగించే బృహత్ప్రయత్నము చేయుచున్నాను. గణిత ఉపాధ్యాయులు, ఆచార్యులు ఈ చిన్నివ్యాసమును ఆలంబనగా తీసుకొని కృషిచేసి ఆ మహనీయుని పేరును చిరస్మరనీయము చేస్తారని మనసులోని మారుమూలన ఒక అత్యాశ.

పావులూరి మల్లన
తెనుగున గణితశాస్త్రమును రచించిన గణిత శాస్త్రజ్ఞుడు, శివ భక్తుడు, పండితుడు మరియు మహాకవి. ఈయన నియోగి బ్రాహ్మణుడు; తాను శివన్న గౌరమ్మల పుత్రుఁడనని, ఆపస్తంభసూత్రుఁడనని, గార్గ్యగోత్రుఁడనని తానె చెప్పుకొన్నాడు.  వీరుమల్లయామాత్యుని పౌత్రులని కూడా తమ రచనల ద్వారా తెలుపుచున్నారు.ఈయన గోదావరిమండలములోని పావులూరి గ్రామ కరణము.
వీరి కాలము 11 వ శతాబ్దము. వీరు నన్నయ కాలమునాటివాడని, కాదు నన్నెచోడుని కాలమునాటి వాడని అన్న వాదములు గలవు. ఈయన ‘గణితసార సంగ్రహము’ అను గణిత గ్రంథమును వ్రాసినాడు. రాజరాజునుండి తనకు నవఖండవాడ అగ్రహారం లభించిందని తన గ్రంథములో తానే చెప్పుకొన్నాడు. తెలుగు పద్యానికి ఆరంభదశ అని మనము నేటికి కూడా ఊహించుకొనే కాలములో అలతి పదములతో అద్వితీయ గణిత మరియు భాషా పాండిత్యముతో  గణిత శాస్త్ర సూత్రములను అనుబంధముగా తాను కూర్చిన అనేక  గణిత సమస్యలను ఎంతో సులభముగా అర్థము చేసుకొనగలిగిన రీతిలో రచించుటచేత, ఆయన గొప్పదనమే గాక తెలుగు కవిత్వము నన్నయకు ముందు కాలమునుండియే వున్నది అన్న నిజము నిజాయితీగా పరిశీలించితే అర్థమౌతుంది.  ఈయన మహావీరాచార్యులు రచించిన "జైన గురుసార సంగ్రహ గణితము"ను సంగ్రహించి  ఆ సంస్కృత గ్రంథమును మూలముగా గైకొని అందుగల గణిత సమస్యలను తానె ఏర్చి కూర్చి పేర్చి అల్లినాడు. వ్యర్థ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంథమును రచించుట వీరి ప్రతిభకు తార్కాణము.
ఆయనను గూర్చి ఎక్కువగా తెలుసుకొనే అవకాశము చరిత్ర మనకు అనుగ్రహించలేదు. పైగా ఆయన తన గణిత గ్రంధమును పది ఖండములుగా వ్రాస్తే ఇపుడు మనకు లభించినవి మూడు మాత్రమేనని తెలియవచ్చుచున్నది.
ఆ పుస్తకం లోనుండి ఒక సమస్యా  పద్యం:

ఖర్జూర ఫలములు గణకుండు కొనితెచ్చి
సగపాలు మోహంపు సతికి నిచ్చె
నందు నాల్గవ పాలు ననుగు దమ్ముని కిచ్చె
నష్ట భాగం బిచ్చె ననుజు సతికి
తగ తొమ్మిదవ పాలు దనయున కిచ్చెను
దనచేత నాల్గున్న తల్లికిచ్చె
మొదల తెచ్చిన వెన్ని, మోహంబు సతికెన్ని,
యనుగు తమ్మున కెన్ని, అతని సతికి

ఎన్ని యిచ్చె సుతునకెన్నిచ్చె  మరియును
 తల్లికెన్నియిచ్చె దగ వచియింప
గణిత మెరిగినట్టి కరణాల బిలిపించి
అడగవలయు దేవ అవధరింప
తాత్పర్యం: లెక్కలు తెలిసిన వాడొకడు ఖర్జూరాలు తెచ్చి, సగం మోజుపడ్డ భార్యకిచ్చాట్ట. నాలుగొంతులు తమ్ముడి కిచ్చాట్ట. ఎనిమిదో భాగం తమ్ముడి భార్య కిచ్చాట్ట. తొమ్మిదవ భాగం తనయుడికి ఇచ్చాట్ట. చేతిలో మిగిలిన నాలుగు తల్లికిచ్చాట్ట. మొదట తెచ్చినవెన్ని? ఒక్కొక్కరికి ఇచ్చినవెన్ని?
ఈ కింది సమీకరణాన్ని సాధిస్తే సమాధానం తెలుస్తుంది. పద్యమును చక్కగా అనుసరించితే మనకు ఈ క్రింది సమీకరణము వస్తుంది.
అది తరువాత చూద్దాము......
x/2 + x/4 + x/8 + x/9 + 4 =
x = 288.
అలాగే పావురాల పై మరొక పద్యం. 
 సౌధతలమున విహరించె సప్తమాంశ 
మష్టమూలంబు శయన గృహాంతరమున 
జనగ యేబది యారుండె జాలకముల 
గృహ కపోత గణమ్మెంత మహతకీర్తి! 
తాత్పర్యం: ఏడో వంతు పావురాలు మేడ (సౌధతలం?) మీద ఉన్నాయట. అష్ట   (=8)మూలం (root) పడగ్గదిలో ఉన్నాయట. పోగా మిగిలిన 56 వలలో చిక్కుకున్నాయి.
  దీన్ని సమీకరణంగా రాస్తే -  

Hence the result.
ఈ విధముగా సమస్యను ఒక కథ రూపములోనూ మరియు ఛందోబద్ధముగానూ వ్రాయాలంటే ఎంతటి పాండిత్యము కావలెనో గమనించండి. ఈ విధముగా గణితము బోధించితే పిల్లలు ఎంతో ఉత్సాహముతో విని భవిష్యత్తులో కొందరయినా గణిత మరియు  భాషా శాస్త్రజ్ఞులే  కాగలుగుతారు కదా!

ఇంకొక సమస్య చూడండి: 
ఇంకొక సమస్య చూడండి:
 చెలికి షడంశమున్ బ్రియకు శేషము లోపలఁ పంచమాంశమున్  
బొలుపుగ దాని శేషమున బోదకు నాల్గవపాలునిచ్చి యం  
దులఁ దన పాలు దాఁ గొనిపోయెఁ దొమ్మిది జేనలు రాజహంసమీ  
నళిన మృణాళమెంత సుజనస్తుత మాకెఱుఁగంగఁ జెప్పవే  
నళిన మృణాళము=తామర తూడు, బోద=పక్షి పిల్ల, జేన=అరచేయి విస్తరించితే బోటికెన మరియు చిటికెన వ్రేళ్ళ కొసలకు గల మధ్య దూరము.
ఇక ఇచ్చిన సమస్యను పరిష్కరించుదాము. తామర తూడు పొడవు x   అనుకొందాము.  అందులో 6వ భాగము చెలికి ఇవ్వబడినది. అంటే x\6 ఇవ్వబడినది అన్న మాట. మిగిలినది x-x\6= 5x\6. ఇందులో 5వ వంతు ప్రియురాలికి ఇవ్వబడింది. 

చూసినారు కదా పద్యము సమస్య జవాబు. ఇదీ మన పూర్వుల మేధో సంపత్తి. ఈ విధమగు ప్రతిభ ప్రపంచములోని ఏదేశమునకు సంబంధించిన Scientists లో లేక శాస్త్రజ్ఞులలో కూడా చూడము.
ఇక ఈ మహనీయుడు వ్రాసిన సంఖ్యాశాస్త్రము(Theory of Numbers)నకు సంబంధించిన కొన్ని సమస్యలను గూర్చి కాస్త తెలుసుకొందాము.
ఈ పద్యమును గమనించండి, ఇది ఒక హెచ్చవేత:
సోమాంబుధి వేదసుధా
ధామాగ్ని శరంబు విడి ముదంబున శశి భరి
త్సామజి సంఖ్యను బెంచిన
ఏమియగున్ దాని సంఖ్యా నేరిగింపుమిలన్
ముందు ఒకవిషయము తెలియబరచుతాను. శాస్త్ర విషయములను శ్లోకములోనూ, పద్యములోనూ వ్రాయుట మన పూర్వుల సాంప్రదాయము. దానికొరకు సంఖ్యలను ‘కటపయాది సూత్రము’ తోనూ ‘భూత సంఖ్యాసూత్రము’ తోనూ శ్లోకరూపములో లేక పద్య రూపములో వ్రాయుట కద్దు.
భూత సంఖ్యావిధానము 'భూత సంఖ్య' అంటే పంచ భూతముల పేరుతో ఈ విధానము ఏర్పడింది. ఆకాశమునకు విలువ '0' లేక శూన్యము. పృథివీ=1 ఆపస్సు= నీరు=2 తేజస్సు= వెలుగు=3 వాయువు=4 ఆకాశము =0 భూతము = 5. ఈ విధముగా చక్రవర్తి అంటే శత చక్రవర్తులు= 6 ఋషి=సప్త ఋషులు= 7 ఈ విధముగా వుంటాయి.
ఇప్పుడు మన పద్యమును తీసుకొని అందు తెలిపిన సంఖ్యలను ముందు కనుగొందాము.
‘సోమాంబుధి వేదసుధాధామాగ్ని శరంబు’లు అన్నది ఒకటే సమాసము. ఈ సమాసము పూర్తిగా ఒక పెద్ద సంఖ్యకు ప్రాతినిధ్యము వహించుతుంది. ‘శశి భరిత్సామజి సంఖ్య’ ను బెంచిన అన్నది రెండవది. పెంచుత అన్న పదమునకు హెచ్చించుట లేక హెచ్చవేయుట అన్నది అర్థము. నా బాల్యములో నెల్లూరు జిల్లాలో హెచ్చింపునకు (Multiplication) ‘పెంచుట’ అన్న పదమునే వాడేవారు. కాబట్టి మనకు రెండు సంఖ్యలనిచ్చి వాని లబ్ధమును కనుగోనమన్నారు కవిగారు. ఇందు సాధారణార్థము అంటే పదములయోక్క అర్థమును యధాతథముగా తీసుకొంటే భావాన్వయము కుదరదు.
కావున ‘భూత సంఖ్యా’ విధానమును ఆశ్రయించి మాత్రమే ఈ పదములకు అర్థమును తీసుకొనవలెను.
ఇపుడు మొదటి సమాసమును తీసుకొందాము:
సోమ= చంద్రుడు=1
అంబుధి=సముద్రములు=4; భూమి నాలుగు దిక్కులా జలముచే చుట్టబడిన ద్వీపము కాబట్టి, శాస్త్రములో ‘చతుస్సాగర  పర్యంతం’ అని వాడుతాము. కావున సముద్రములను 4 తెలియజేస్తుంది.  
వేద= చతుర్వేదములు=4  
సుధాధామ=సుధకు నిలయమైనవాడు, చంద్రుడు=1  
అగ్ని=త్రేతాగ్నులు, అవి 1)గార్హపత్యము 2)దక్షిణాగ్ని 3)ఆహవనీయము.=3  
శరంబులు= 5, అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక l నీలోత్పలంచ పంచైతే పంచాబాణాస్సుసాయకః అని అమరము.   ఈ అయిదునూ మన్మధుని యొక్క బాణములు.  
ఇక రెండవ సమాసము.  
శాశిభరిత్సామజము   
శశి=చంద్రుడు=1   
భరిత అంటే కలసిన లేక కూడిన, ఇక్కడ సంఖ్య కానీ అంకె కానీ లేదు.  
సామజ=8, అష్టదిగ్గజములు అంటాము కదా. సామజము అంటే ఏనుగు అనే అర్థము.  
ఇపుడు ఆ సంఖ్యలను వ్రాసుకొని హెచ్చించుదాము. ‘అంకానాం వామతో గతిః’ అని మన గణిత శాస్త్రము చెబుతుంది. కాబట్టి   ఒక సంఖ్యను వ్రాసేటపుడు కుడినుండి అంటే ఒకట్ల స్థానము నుండి వ్రాసుకొంటూ పోతాము.
531441x81 వస్తుంది. ఇక్కడ వేదగణితము చెప్పిన సులభపద్ధతిని ఆశ్రయించుదాము.    
(531441x81= (531441x80) + (531441x1) గా వ్రాసుకొందాము.
    = 42515280 + 531441= 43046721       
మరి ఈ మాత్రపు హెచ్చింపునకు ఇంత తతంగమవసరమా! అన్నది సాధారణ జిజ్ఞాసువు ప్రశ్న.
ఇందులో భాష, మన సాంప్రదాయము, గణితము అన్న మూడు విషయములు తెలియవస్తూ వున్నాయి.
మరి నేడు మనము చేసే హెచ్చింపులో హెచ్చవేయుట తప్ప వేరేమీ తెలియదు కదా!

ఇప్పుడు మరొక సమస్యా పద్యమును తీసుకొందాము.
ఏడును నేనార్లును గడు
వేడుకతో నారు మూళ్ళు వేలయగానిడి తా
రూడిగ ముప్పదిమూటను
దోడనె గుణియించిచెప్పు  ధ్రువముగ మాకున్
ఏడును=7; ఏనార్లు=5 మార్లు 6ను వేసుకోనుము.
ఆరు మూళ్ళు=3 ను 6 మార్లు వేసుకొనుము
ఆ సంఖ్య ఎంత అంటే 333333666667 (అంకానాం వామతోగతిః)
 రెండా సంఖ్య=33. (30+3)
ఇపుడు ఆరెంటినీ గుణించాలి.
333333666667x33 = (333333666667x30) + (333333666667x3)
=(1౦౦౦౦౦1౦౦౦౦౦10) + (1౦౦౦౦౦1౦౦౦౦౦1)
=11000011000011
పై సంఖ్యను ఎటువైపు నుండి చదివినా మనకు ఒకే సంఖ్య వస్తుంది. ఇటువంటి సంఖ్యలను ద్విముఖ సంఖ్యలు అంటారు.
ఇటువంటి ఒక విచిత్ర సంఖ్యను మనము కూడా తయారు చేయవచ్చు. ముందు మనము కోరుకొనే సంఖ్య వ్రాసుకొని దానిని నిశ్శేషముగా భాగించగల ఒక సంఖ్యతో భాగించితే వచ్చే భాగఫలము మనము హెచ్చవేయవలసిన సంఖ్య ఔతుంది.
మరొక ఉదాహరణను తీసుకొందాము.
రుద్రాంబర రుద్రాంబర
రుద్రుల వరుసనిడి శీతరుచిరంధ్రములన్
దద్రాశి బెంచి చెప్పుము
రుద్రార్చిత పుష్ప తిలక! రూపేర్పడగన్

రుద్ర=11 (ఏకాదశ రుద్రులు)
అంబర=0 (ఆకాశం గగనం శూన్యం)
రుద్ర=11
అంబర=0
మొదటి సంఖ్య= 11011011 (అంకానాం వామతోగతిః)
ఇక్కడ రుద్ర అను మాటను కాస్త వివరించుతాను.
నమః సోమయచ రుద్రాయచ
నమః తామ్రాయచ అరుణాయచ
నమః శఙ్గాయచ పశుపతయేచ
నమః ఉగ్రాయచ భీమాయచ
నమః అగ్రే వధాయచ దూరే వధాయచ
నమో హన్త్రేచ హనీయసేచ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః
నమః తారాయ
నమ్హ శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ
మనము మంత్రం రాజముగా భావించి మనము చేసే ‘నమః శివాయ’
అన్న మంత్రము ఇక్కడ వస్తుంది. అందుకే అప్పయ్య దీక్షితులవారన్నారు...
విద్యాసు శ్రుతిరుత్కృష్టా రుద్రైకాదశని శ్రుతౌ
తత్రపంచాక్షరీ తస్యాం శివ ఇత్యక్షరద్వయం
                                       అప్పయ్య దీక్షితులు
శీతరుచి (చల్లని కిరణములు కలిగిన వాడు, చంద్రుడు = 1)
రంధ్ర= (నవ రంధ్రములు = 9)
రెండవ సంఖ్య= 91 (అంకానాం వామతోగతిః)
ఇపుడు 11011011x91 మనము చేయవలసియున్నది.
పై సమస్యలో చేసిన విధముగానే ఇక్కడకూడా సులభరీతినే అనుసరిద్దాము.
 11011011x91 = (11011011x90)+( 11011011x1) = 990990990 + 11011011
= 1002002001
చూసినారు కదా! మల్లన్న గారి ప్రతిభ. ఇంకా తెలుసుకొనవలెనను ఉత్సాహము ఉన్నవారు, వారు రచించిన గణిత గ్రంధమును సంపాదించి అందలి సమస్యల్;అను సాధించి లోకానికి మన పూర్వుల ప్రతిభ చాటండి.

స్వస్తి.



Tuesday, 29 January 2019

చింత


చింత
https://cherukurammohan.blogspot.com/2019/01/blog-post_29.html
భగవత్ చింతన ఉత్తమోత్తమ మైనది. నేను దానిని గూర్చిగాక లౌకికమైన చింతను గూర్చి తెలియజేయుచున్నాను.
చితా చింతా సమాహ్యుక్తా బిందుమాత్రవిశేషతఃl
చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుఃll
चित चिंत (చిత, చింత) అన్న రెండు పదాలు దేవనాగరి లిపిలో వ్రాస్తే చింతలో ఒక బిందువు ఎక్కువ వుంటుంది. కానీ అర్థభేదము అపారము. చిత అన్నది శవాలను కాలుస్తుంది కానీ చింత జీవించే వారినే కాల్చివేస్తుంది. దీనిని బట్టి చింత ఎంత ఘాతుకమో మనము అర్థము చేసుకొనవచ్చును. ఈ విషయమును నాదయిన రీతిలో చెప్పిన ఈ పద్యమును చదవండి.
                                 చింత అదెంతయైన మరి చెంతన చేరగ చిత్తగించినన్
        ఎంతటివాడు కూడ గతినెంచగ తప్పును కొంతయైనయున్
సంతసమన్నదే వెదుక సంతనగూడ లభించగల్గునే
కంతలు గల్గు దుప్పటిని గప్పిన వేడిమి రాదు మోహనా!
అర్థము సుగమము కాబట్టి నేను విశ్లేషించలేదు. చింతలన్న కంతలున్న దుప్పటి కప్పుకొంటే చలితో ఏర్పడిన వణుకు తగ్గదు కదా!
సుభాషిత భాండాగారములోని ఈ అనర్ఘ రత్నమును పరికించండి.
అగ్నౌ దగ్ధం జలే మగ్నం హృతం తస్కరపార్థివైః
తత్సర్వం దానమిత్యాహుః యది క్లైబ్యం న భాషతే
- సుభాషితరత్నభాండాగారము
ఒకవేళ మన వస్తువేదయినా , అగ్నిలోబడి కాలి పోవడము గానీ, నీటిలోబడి మునిగి పోవడము గానీ లేక చోరులచేత తస్కరింపబడటము కానీ జరిగితే , పోగొట్టుకొన్న దానిని గూర్చి పరితపించక  కృష్ణార్పణం అన్న దృష్టిని అలవరచుకొంటే అంతకు మించిన ఆనందమే ఉండదు. మనసులో బాధ లేకుంటే వుండబోయేది ఆనందమేగదా . కాబట్టి పోగొట్టుకొన్న వస్తువును దానమిచ్చిన  దృష్టితో చూస్తే ఆవేదన పోతుంది, ఆత్మ సంతృప్తి వస్తుంది. ఆవిధంగా మనము వుండలేకపోయినంత మాత్రాన ఎవరూ ఉండరని మాత్రం అనుకోవద్దు. ప్రపంచములో మహా పురుషులింకా వున్నారు. వారలే మనకాదర్శము. ధర్మరాజు ఈ కోవకు చెందినవాడు. తానావిధముగా ఉండుటయేగాక తన తమ్ములను, కలత్రమును కూడా ఆ దారిలోనే నడిపించినాడు. ఇక్కడ ఆయన రాజ్యము ఎట్లు పోగొట్టుకొన్నాడు, అది ధర్మ సమ్మతమా లేక వ్యసనమా అన్న వాదమునకు ఇక్కడ తావులేదు. భగావానుడగు శ్రీకృష్ణుని తోడునీడయే పాండవుల నిబద్ధత చాటుతుంది.
శ్రీనాథ కవి సార్వభౌముడు తాను వ్రాసిన కాశీ ఖండములో, ఈర్ష్య వల్ల ఏర్పడిన చింత వింధ్యాదీశుని గర్వము సర్వము ఖర్వము గావించినది అన్నది జీవితాంతము మానవులమైన మనము గుర్తుంచుకొనవలసిన విషయము.
శ్రీనాథ విరచిత కాశీ ఖండములోని వింధ్యాద్రి స్వగతమును ఒకసారి పరికించండి.
మేరువు తనకన్నా గోప్పదేమో అన్న ఒక్క చింత వింధ్యపర్వతము యొక్క మనస్సును చింతాజ్వరముతో కృశింపజేస్తూ వుంది.
భేషజం బెద్దాని భేదింపఁజాలదు 
లంఘనంబున నెద్ది లావు చెడదు
తఱిగించు బుద్ధినిద్రామహోత్సాహ క్షు
ధాకార తేజోబలాది నెద్ది
నాసత్యచరక ధన్వంతర ప్రభృతి వై
ద్యులకు నసాధ్యమై యుండు నెద్ది
దివసంబు లీరేడతిక్రమించిన యప్డు
జీర్ణత్వదశ నధిష్ఠింపదెద్ది
          ప్రత్యహంబు నవత్వంబు వడయు నెద్ది/
          యట్టి చింతా జ్వరంబు తన్నలముకొనియె/
          నేమి సేయుదు నింక నే నెచటఁ జొత్తు/
          నెట్టు నిర్జింతు మేరు మహీధరంబు.
దేనిమీదనయితే ఏ మందులూ పనిచేయవో, ఉపవాసాలు ఎన్నిజేసినా దాని లావు సన్నగిలదో, ఏదయితే బుద్ధి, నిద్ర ఉత్సాహ ఆకలి ఆకారము తేజస్సు మొదలగునవి క్రుశిమ్పజేస్తుందో,  తరిగించుతుందో, చరక ధన్వంతరి వంటి మహా భిషగ్వరులకు కూడా దేనిని రూపుమాపుట సాధ్యము కాదో, ఏదయితే ఎంతకాలమునకైనా జీర్ణించుకొన శక్యము కాదో, ప్రతి దినము కొత్తపోకడలతో దహించుచున్నదో అట్టి చింతా జ్వరము  అలముకొన్నది. నేను ఏమి చేసేది? ఎచటికి పోయేది. ఆ మేరుపర్వతమును ఎట్లు జయించేది? అని వాపోవుచున్నది వింధ్యపర్వతము.
చింతకు ఈర్ష్య చేరితే ఏ విధముగా వుంటుంది అన్న ఈ పద్యమును శ్రీనాథులవారు వింధ్యేంద్రుని ద్వారా చెప్పించిన ఈ పద్యము వింటే ఇది భారతములో పరాభవము చెందిన దుర్యోధనుడు కదా ఇది చెప్పినది అనిపిస్తుంది.  ఈర్ష్య ఎంతగా వ్యక్తిని వ్యాకులపరుచుతుందో చూడండి.

కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటకమిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి మనుష్యునకెట్టి వానికిన్
గంటకుఁ డైన శాత్రవుఁడొకండు దనంతటి వాఁడుగల్గినన్.

కంటికి నిద్ర రాదట, రతికేళి కూడా సుఖమును కూర్చదట, ఎంత రుచికరమయిన వంట కూడా నోటికి ఇంపితము కాదట, అవి పదివేల విధములగు వైభవములే కానీగాక మనసు ఇష్టపడదట, ఎవరికి, ఎటువంటివానికి అంటే మానవత గల్గిన మనిషికి ఎవనికైనా తనంతటి శత్రువు ఒకడు ఏర్పడినాడంటే వాడు ‘చెప్పులోని రాయి, చెవిలోనిజోరీగ, కంటిలోని నలుసు, కాలిముల్లు కదా’!
ఇది ఈర్ష్య తో కూడిన చింత. ఇది ఇంకా బయంకరమైనది. గమనింంచినావు కదా!
ఈ కథను ఒకసారి గమనించు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరి సంపద చూసి ఇంకొకరికి ఈర్ష్య.  దానిచే ఒకనికన్నా ఇంకొకడు అమిత ధనవంతుడు కావలెనను చింత.  ఎంతో యోచించి పెద్దవాడు, తపస్సు చేస్తే తనకోరిక సాధించుకోనవంచును అన్న ఆలోచన కలుగుటచేత ఒక కొండగుట్ట చేరి తపమాచరించ మొదలుపెట్టినాడు. ఇది తెలిసిన తమ్ముడు తానూ కూడా అదే పని అదే కొండపై అన్నకు కాస్త దూరములో మొదలుపెట్టినాడు. ఎత్లయితేనేమి దేవుడు ముందు తపస్సు మొదలుపెట్టిన పెద్దవానికి ప్రత్యక్షమై వారము కోరుకొమ్మన్నాడు. వాడు కళ్ళు తెరువగానే దేవునికన్నా ముందు తమ్ముడు తపస్సు చేయుట చూసినవాడై, దేవుని ‘స్వామీ! నీవు ఎటూ ఆ తపస్సు చేసుకొనే వానికి కూడా ప్రత్యక్షమౌతావు కదా! వాడు కోరిన దానికి నాకు రెండితలివ్వు.’ అన్నాడు. పనిలో పనిగా దేవుడు తమ్ముని ఎదుట నిలిచి వారము కోరుకొమ్మన్నాడు. వానికి ‘అన్న’ చింత కదా! ‘వాడేమి కోరినాడ’ని అడిగినాడు. అబద్ధామంటే తెలియని దేవుడు ఉన్నమాట చెప్పినాడు. తమ్ముడు వెంటనే “స్వామీ అట్లయితే నాది ఒక కన్ను గుడ్డి చేయి” అన్నాడు. తక్షణం వీడికి ఒక కన్ను వాడికి రెండుకళ్ళు పోయినాయి. ఈర్ష్య చింత కలిస్తే ఇంత అనర్థము దాపురించుతుంది.
ఈ సందర్భముగా నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.
ఎంతటి  వానికైన  మది  నేర్పడు చింతకు  ఊపిరూదుచున్
చెంతన  ఈర్ష్య  వున్న  ఇక  చింత  దవానలమౌచు  రేగి  
పొంతన  లేని  దుష్టగుణ  పూత విపత్తి విషాద మూకలన్
సంతతముంచి చిత్తమును సాంతము గాల్చును రామమోహనా!
పూతము= చిక్కనయిన
అందుకే చింత అన్నది luggage తో పోల్చుకొంటే నాకు ఒకకాలమునాటి Railway Slogan గుర్తుకు వస్తుంది.
Less luggage More Comfort Make Travel A Pleasure.
స్వస్తి.

Friday, 25 January 2019

బాధాకర విషయము


బాధాకర విషయము

https://cherukurammohan.blogspot.com/2019/01/blog-post_25.html

మనది ధర్మమే కానీ మతము కాదు అన్నది మనకు తెలిసిన విషయమే! ప్రపంచములో ఆదిపత్యమునకై పోరాడుచున్న పెద్ద మతములు తమ మత గ్రంధములను అనుసరించవలెనన్నది వారల నిబంధన లేక నిర్బంధన.

మన ధర్మమే మనదారి. మన దారిలో మనము పోతున్నాము. ఒకానొక కాలములో అది రాజ మార్గము. రథ్యల(Roads) కు ఇరువైపులా ఆహ్లాదము గొలిపే చెట్లు ఉండేవి. సువాసనలు వెదజల్లే పూలమొక్కలు ఉండేవి. ఆకలిగొన్నవారికి ఆహారమునందించే ఫలసాలములు ఉండేవి. విమతస్థులు ఆ చెట్లను నరికినారు. మొక్కల పెరికినారు. ఫలసాలముల పాదులలో విషము కలిపినారు. అయినా మనకేమీ పట్టదు. ‘ఉదారవాదులము’, ‘మానవతా వాదులము’ అన్న బిరుదములను మనకు మనమే కల్పించుకొని లేక తగిలించుకొని లేక ఇచ్చుకొని మన సముదాయమునే మనమే మార్చుకొనే ప్రయత్నము చేస్తాము. కాళీదాసు ఉద్దండ పండిత కవి. అది కాకమునుపు ఆయన ఒక జ్ఞాన హీనుడు. తను కూర్చున్న కొమ్మను తానే నరికే ఆ కాళిదాసు మనకాదర్శ ప్రాయుడు. మహాపండితుడు, సకల శాస్త్రవేత్త, మహాకవి అయిన కాళీదాసు విషయములో  పేరు తప్ప మనకేమీ తెలియదు. తెలుసుకొనుటకు ఉత్సాహమూలేదు, సంస్కృతమూరాదు. నేర్చుకోవాలన్న తపన లేదు. సంస్కృతము వరకెందుకు మనకు సరిగా తెలుగే రాదు. మాతృ భాషయే సరిగా రాదన్న బిడియము లేదు.

సాధికారికముగా English New Year’s Day అన్నది మన పండుగ కాదు, ఆమాటకొస్తే అది పండుగే కాదు, అందులో అసలు పండుగ చేసుకొనే విధానమే లేదు అని నెత్తిన నోరుపెట్టి కొట్టుకొన్నా చేస్తే తప్పేమి అనే వాళ్ళను మనము ఎంతోమందిని చూస్తున్నాము. ఇటువంటి ఆలోచనా విధానమే పరమతస్థులు మన సాంప్రదాయములతో ఆడుకొనే అవకాశమును కల్పించుచున్నాము.

తమిళనాడులోని ఒక క్రైస్తవ సంఘము చేసిన నిర్వాకము ఇందుతో జతపరచిన చిత్రములో చూడండి. సనాతన ధర్మ అనుయాయులగు తలిదండ్రుల సంతానమగు వారెవరికయినా అది చూస్తే ఆవేశము అవధులు దాటక మానదు. కానీ ‘ ఆవేశము అనర్థదాయకము.’ ‘ఆలోచన సమర్థనీయము.’ మా జీవితము ఈ ధర్మముతోనే ముగుస్తుంది. మరి నేటి యువతీయువకులు వారిసంతానమును గూర్చి ఆలోచించితేనే  ఆవేదన పెల్లుబుకుతుంది.

ఇక్కడ ఇంకొక్క విషయమును చెబుతాను. Costanzo Beci అను 18 వ శతాబ్దములో తమిళనాడులో ఏర్పడిన ఒక మత సంస్థ ‘పెరియనాయగి’ అన్న మన గౌరీమాత పేరును తమ ‘మేరీ మాత’కు తగిలించుకొన్నారు. కాలాంతరములో ఈ పేరు మన అమ్మవారిది అని మరచిపోయి అది మేరీ మాతదే అన్న ఒక దౌర్భాగ్య స్థితికి చేరుకొన్నాము. అసలు వారి ‘మేరీమాత’ క్రైస్తవ పరమగు సిద్ధాంతము ప్రకారము ‘Holy Trinity’ లో కూడా లేదు. అసలు ఉన్నా లేకున్నా మనకు సంబంధములేదు. దీనిని బట్టి వారికి ఎంత సాంప్రదాయ దారిద్ర్యము వుందో అర్థము చేసుకొనేది. లౌకికమయిన మతాంతరీకరణల గూర్చి ఆలోచించుతున్నారే గానీ పారమార్థికముగా ఎంత వెనకలబడియున్నారో గమనించండి. ఇది ఇట్లుంటే ఐరోపా ఖండములోని ఫ్రాన్సు, స్పెయిను, జర్మని, ఇంగ్లాండు, ఇటలీ మొదలగు దేశాలు అన్నీ కలిసి ఐరోపా ఖండమే ఇస్లాం ఖండముగా మారిపోవనుందట. 'Everyone will be Muslim because of our stupidity': Catholic leader says Europe will become an Islamic

State because of the migrant crisis. కారణము ఒక్కటే వలస వచ్చిన ముస్లిములు 5,6 మంది పిల్లలను ఉత్పత్తి చేస్తూ వుంటే క్రిస్టియన్లు 2 లేక మహా అంటే ముగ్గురిని ఉత్పత్తి చేస్తున్నారు. అసలు ఈ మాట ఒక ఇమాం కూడా చెప్పి ఈ విషయమును బలపరచినట్లు WhatsApp లో గాంచివుండినాను.

ఇది మనకు వర్తించదా! తమ మాతృ భూమిలో తమ ఉనికికే ప్రమాదము రాబోతూవుంటే క్రిస్టియనులు మనదేశములోని అమాయకులకు ఎర వేస్తున్నారు. ఇప్పటికయినా మన ఉదార లౌకిక వాదులు కన్ను తెరుస్తారోలేదో! ఈ మాట చెబుతూ వుంటే నాకు భాగవతమున ప్రహ్లాద చరిత్రములోని లోని ఈ పద్యము గుర్తుకొస్తూ వుంది.

అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.

లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు; కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ మైపోతాయి; పిసినిగొట్టు వాడికి సంపద పనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారము లైనవి, వ్యర్థము లైనవి. అని భావిస్తాను. ఇక్కడ విష్ణుభక్తికి , శంకర భక్తికి జోడుగా లేక తోడుగా దేశ భక్తి, మన ధర్మముపై భక్తిని అన్వయించవలసి వుంటుంది. చెవిటి వాని వద్ద శంఖమునూదితే ఎందుకు ఎంక (ఎముక) కోరుకుతున్నావన్నాడట. వయసు మీరిన మేము మాత్రము సలహాకే పనికి వచ్చేది. పిల్లి మేడలో గంట కట్టగలిగినవారు పిల్లలే!

స్వస్తి.