Showing posts with label పెద్దలను పండితులను జ్ఞానము గలవారిని గౌరవించ వలెను. Show all posts
Showing posts with label పెద్దలను పండితులను జ్ఞానము గలవారిని గౌరవించ వలెను. Show all posts

Saturday, 29 September 2018

చాటువెంత నీతి చాటె చూడు (బక మరాళ సంవాదము)


చాటువెంత నీతి చాటె చూడు (బక మరాళ సంవాదము)
https://cherukurammohan.blogspot.com/2018/09/blog-post_29.html
నేను మీకు చెప్పబోయే చాటువును గూర్చి నా మాటగా ఈమాట చెబుతున్నాను.
చక్కనైన మాట చదివిన విన్ననూ
చక్కబడును బుద్ధి సవ్యముగను
చద్దియన్నమునకు చల్ల చేర్చిన రీతి
చాటువెంత నీతి చాటె చూడు
ఒక చెరువులో కొన్ని కొంగలు(సంస్కృతములో బకము అంటే కొంగ అని అర్థము.) ఉండినాయి. వాటి వద్దకు ఒకరోజు ఒక హంస వచ్చింది. వాటి మధ్య జరిగిన సంభాషణకు అక్షర రూపమే ఈ చాటు పద్యము. రసవిహీనుల మధ్య ఒక పండితుడు, చెడ్డవారి మధ్య మంచివాడు చేరితే ఎంత అవహేళనకు గురియౌతాడో తెలియజెప్పే చాటువిది.

ఎవ్వడవీవు కాళ్ళు మొగమెర్రన? హంసమ! ఎందునుందువో?
దవ్వుల మానసంబునను! దాన విశేషములేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగమన్న 'నహహా' యని నవ్వె బకంబులన్నియున్
హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరములో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణము తో మెరిసే మవ్వపు పద్మములు అంటే కోమలమైన పద్మములు, మేలిమి ముత్యములు వుంటాయి. నత్తగుల్లలు, కప్పలు వెదకినా దొరకవు. మామూలు చెరువులలో ఉంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకు శ్రేష్ఠమైన పద్మముల, ముత్యముల గురించి తెలియదు కదా!
బుద్ధిహీనులు ఎదుటివారి గొప్పదనము గానక ఎంత హీనముగా ప్రవర్తించుతారు అన్నదే ఈ చాటువు తెలిపే బకమరాళ సంభాషణ. దిగువన గమనించండి.
కొంగలు ---“ ఎవరు నీవు? నీ కాళ్ళు ముఖము ఎర్రగా వున్నాయి ఎందుకు?
హంస: “నేను హంసను!”
కొంగలు: “ఎక్కడ నుండి వచ్చినావు?”
హంస: “చాలా దూరములో వున్న మసనస సరోవరము నుండి వచ్చినాను!”
కొంగలు: “అక్కడి విశేషాలేమిటి?”
హంస: “అచ్చట బంగారు వర్ణము గల తామర పువ్వులు, మంచి ముత్యములు లభించుతాయి.
కొంగలు: “అక్కడ నత్తలు ఉంటాయా?”
హంస: “అవేమిటో నాకు తెలియదు!”
కొంగలు: “నత్తలు తెలియవా?”
హంసలు: “నాకు తెలియదు!”
కొంగలు: “నత్తలు తెలియవా?” అని పకపక నవ్వినాయట.
ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే ఎన్నో విషయాలను, విశేషాలను, అనుభవాలను, తెలిసిన వారు లేక పండితులు లేక అనుభవమున్న పెద్దలు, చెప్పినా అల్పులకు వానిని గ్రహించవలసిన చింతన ఉండకపోగా అన్నీ తెలిసిన తమకా ఈ మూర్ఖులు చెబుతున్నారు అనుకొంటారు. ఈ విషయము తెలిసి కూడా విజ్ఞులు తాము ప్రయత్న లోపము చేయరు. భీష్మద్రోణాది మహనీయులు దుర్యోధనుని దుష్ట బుద్ధి తెలిసికూడా తమ ప్రయత్నమును తాము చేయుట మానలేదు కదా!
ఈ భావమునే శ్రీ నాథుడు తన ‘భీమేశ్వర పురాణము’ లో కుకవి నింద చేస్తూ 
అడవి కాకులు జేరి బిట్టరచునపుడు 
ఒదిగి రాయంచ యూరక యుంట లెస్స 
సైపలేకున్న ఎందేని చనుట యొప్పు
తెలిసి యద్దాని వాతెర తెరువరాదు
అని మందలిస్తాడు. అంటే చెడ్డవారి మధ్య ఓ మంచివాడు వున్నపుడు వారి వెక్కిరింపు మాటలకు మౌనముగా ఉండటమో లేక అక్కడినుండి వెళ్లిపోవడమో ఉత్తమమని ఉపదేశమిస్తూవున్నాడు కవి సార్వభౌముడు. కావున ‘మనకన్నా విద్య, విజ్ఞానము, వయస్సు అధికముగా ఉన్నవారిని ఎప్పుడూ ఎగతాళి చేయ కూడదు.’ ఎంతటి యోగ్యమైన మాటో కదా! ఈ దిగువన పద్యములో నా అనుభవమును పొందుపరచినాను. గమనించగలరు.
చెవిటి వానియొద్ద చేరి శంఖము నూద
ఎముక గొరుకుచుంటివేల యనును
మూర్ఖ మతుల నడుమ మూర్ధన్యుడిట్లురా
రామమోహనుక్తి రమ్యసూక్తి!
ఈ పద్యమును కూడా శ్రద్ధతో చదివి అభ్యసించండి.
పెద్ద వారితోడ పేరుగల వారితో
బుధులతోడ  భూరి ధనదు తోడ
ఆప్తజనుల మరియు ఆచార్య గురులను
గడుసుదనము మాని గౌరవించు
ఇక వేమనగారు అలతి పదాలతో ‘జ్ఞాన,విద్యా వయోధనులకు’ ఎంత చక్కటి సలహా ఇస్తున్నారో చూడండి.
అనువు కానిచోట అధికులమనరాదు
కొంచేముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచెమైయుండదా
విశ్వదాబిరామ వినుర వేమ!

ఇది ఎవరికైనా ఎంతో ఆచరణ యోగ్యమైన మాట. తప్పక చదవండి. చదివి ఆచరించండి.

స్వస్తి