Wednesday, 23 August 2023

త్రైలింగ స్వామి

https://cherukurammohan.blogspot.com/2023/08/blog-post_23.html

 మన తెలుగువాడై యుండికూడా తెలుగువారిచే అధికముగా గుర్తించబడని త్రైలింగ స్వామిని గూర్చి ఈ విశ్వనాథ జ్యోతిర్లింగము అన్న శీర్షిక క్రింద వ్రాయుట అసంగతముగా నేను అనుకోనుటలేదు. ఎందువల్ల అంటారేమో ఈయన , మహా మహిమాన్వితుడై , మహామహులచే మహానీయు డనిపించుకొని విశ్వనాథునిలో లీనమైన వారు.(సినిమాలలో చూపే విధముగా కాదు). వారి పాదదోయికి సాష్టాంగ ప్రణామముల నాచరించూదాము.

మనకు ప్రేమానంద తెలుసు, నిత్యానంద తెలుసు, బాలసాయి తెలుసు, అసారాం తెలుసు,పీర్ బాబా తెలుసు కానీ నిజమైన యోగుల గూర్చి తెలియదు. ఎందుకంటే ప్రచార సాధనాలకు కావలసిన మసాలాలు నిజాయితీ లో  వుండవు. ఒక స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి,స్వామి శివానంద,లాహిరీ మహాశయులు ఈ విధంగా చెప్పుకొంటూపోతే చేంతాడంత అయ్యే ఈ మహనీయుల గూర్చి మన వార్తా పత్రికలలో, దుర్దర్శనులలో(దూర దర్శనులలో) బహు తక్కువగా వింటాము. ఈ జాబితాలోఒక మహారత్నమే త్రైలింగ స్వామి. ఇప్పుడు, మన తెలుగు వాడయి వుండి మనలో ఎక్కువమందికి తెలియని,తెలిసినా తలువని,తలచినా  తెలుపని ఆ మహనీయుని గూర్చి తెలుసుకొందాము.

పుట్టింది తెలుగు నాట నయినా ,ఆయన జీవితములో అధిక శాతము కాశీ లోనే గడిచింది .ఆయన చూపించిన మహిమలు పొందిన సిద్దులు, దివ్య విభూతులు అనేకం,అపారం, అనంతం .ఆయన అసలు పేరు శివ రామయ్య. విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామము లో జన్మించినారు. తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి, సంపన్న బ్రాహ్మణ కుటుంబము. ఆయన జననం  19 -12 -1607   తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుండి ఐహిక వాంఛల  మీద కోరిక లేదు. నలభై ఏళ్ళకు తండ్రి, యాభై రెండో ఏట తల్లి చని పోవడం జరిగింది. శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళ దాకా గడిపి హటాత్తుగా స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో వున్న బస్తర్ చేరి అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్థానికి వెళ్ళి ఆయనతో సన్యాస దీక్ష గడించి గణపతి స్వామి అనే దీక్షా నామమును స్వీకరించినాడు. గురు సమక్షం లో పదేళ్ళు సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు. సిద్ధులు పొందిన కాలమునుండి ఆయన దిగంబరుడే! ఆయనకు అప్పుడు 78 సంవత్సరాలు వయసు. గురువు పరమపదించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరినాడు. అచ్చట ఆయన చూపిన  లీలలకు ఆశ్చర్య చకితులై ఆయనను అపర రామలింగేశ్వరుడేయని  కొనియాడినారు అక్కడివారు. అక్కడి నుండి నేపాల్ చేరి అక్కడ అడవి లో తపస్సు చేసుకొంటూవుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగా చేష్టలుడిగి కూర్చొని వుండి పోయింది. రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి  పులిని చంపటానికి ప్రయత్నిస్తే వలదన్నాడు ఆయన. నేపాల్ రాజుకు ఆవిషయము తెలుపగా ఆయన వచ్చి సాష్టాంగ దండ ప్రణామమునాచరించి అనేక కానుక లిస్తే వలదని  జంతు హింస చేయ వద్దన్న హితవు చెప్పి అక్కడి నుండి టిబెట్, తరువాత మానస సరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలము తపస్సు చేసి అటుపిమ్మట  నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ”ఖాఖీ బాబా”అనే అహోరాత్రాలు తపస్సు చేసే ఒక మహాయోగిని దర్శించినాడు. ఒక రోజు  తెల్లవారు ఝామున నర్మదా నది లో నీటికి బదులు పాలు ప్రవహిస్తున్నట్లు ఈయన దానిని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూసి ఆయన మహిమ ను గుర్తించడం జరిగింది. ఆవిషయము స్వామికి తెలిపితే తనను వదలి వెళ్ళిపోతాడని మిన్నకుండినాడు. అయినా ఈయన ఒక చోటునుండే వాడు కాదు గదా! 1733 లో  ప్రయాగ చేరినారు .తపో నిష్ఠలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పడవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్ఞ చేయడమే కాకుండా,అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే  . స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించినాడు. ఆశ్చర్య పడటము శిష్యుని  వంతైనది.

ఊరూరు తిరుగుతూ వీరు 1737 లో తన 130వ ఏట కాశీ చేరడము జరిగింది. 

అంతే! తాను, జీవాత్మను పరమాత్మ సాయుజ్యము చేర్చేవరకు అంటే 150 సంవత్సరములు కాశీ లోనే గడపడము జరిగింది. ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహము. గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరముతో దిశమొలతో. మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, బాన కడుపుతో కాశీ నగర వీధుల్లో సంచరించే వాడు. క్షురకులెవరైనా తనకు క్షురకర్మ చేస్తే చేయించుకొనేవాడు. గంటల కొలదీ గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు లేదంటే గంటల కొద్దీ నీటిలోనే మునిగియుండే వాడు. ప్రాణాయామమంటే శ్వాస నియంత్రణ. రేచక (గాలిని బయటికి వదలడం), పూరక (లోనికి పీల్చడం), కుంభక (లోపలి ప్రాణ వాయువును అలానే నిలిపి ఉంచడం ) హృదయాన్ని పరిపుష్టం చెయ్యడానికి, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేయడానికి ప్రాణాయామం ఉపకరిస్తుంది. ఇందులో ఆ మహనీయుడు పరాకాష్ట నందుకోగలిగినాడు కాబట్టి ఆయనకు ఆ విద్యలు సిద్ధించినాయి. కుష్టు రోగులకు సేవ చేసి వారిని ఆదరించినాడు స్వామి. వేద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతానాథ బంధోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరినాడు. కొంత కాలము తరువాత అక్కడినుండి దశాశ్వమేధ ఘాట్ కు తన మకామును మార్చినాడు ఆ మహనీయుడు.  ఒక మరాఠీగృహిణి రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తూ ఈ దిగంబర స్వామిని చూసి ఏవగించు కొనేది .ఆమె భర్తకు రాచపుండు. ఆవిడ శ్రేయోభిలాషులెందరో ఆమెను దిగంబరస్వామి శరణు వేడమన్నారు. తాను ఏవగించుకొనే వ్యక్తిని శరణు కోరడము ఆమెకు మింగుడు పడలేదు. భర్త వ్యాధి ముదర జొచ్చింది. గత్యంతరాలన్నీ తలుపులు మూసివేయడముతో స్వామిని శరణు కోరక తప్పలేదు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడింది. దయామయుడైన ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది.

కాశీ మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గావుండేవారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించినారు. వారు ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టినారు. తెనుగు దేశము అంటే త్రిలింగ దేశమే కదా! అప్పటి నుండి ఆయనకు ఆపేరే స్థిరపడి పోయినది. 1800  లో తన స్థావరమును దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవానికి మార్చినారు.

మిగిలినది మరొక మారు.....

త్రైలింగ స్వామీ - 2

ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు యోగ సమాధిలో ఉండటమే! అందుకే ఆయనను ”మౌన బాబా ”అన్నారు .ఆనోటా ఈనోటా స్వామివారి మహాత్మ్యము ప్రాకి కాశీ రాజును చేరింది. ఆయన గంగా నదిలో వున్నారని తెలిసి తన పడవలో ఆప్రాంతము చేరినారు. స్వామిని గుర్తించి పడవలోనికి సాదరముగా ఆహ్వానించినారు. స్వామి అందులో కూర్చున్న తరువాత వారితో ముచ్చటిస్తూ బ్రిటీషు వారు తన గొప్పదనమునకు బహుమతిగా ఇచ్చిన ఖడ్గమును స్వామికి చూపింప దలచి ఆయన చేతికందివ్వబోతే అది జారి గంగలో పడిపోయింది. వెంటనే అంత లోతుకు దిగి దానిని తెచ్చేవారు సులభముగా దొరకరుకదా! వారు వచ్చేవరకు కత్తి గంగలో వున్న చోటనే ఉండిపోవదు కదా! ఖిన్నుడయిన రాజును చూసి స్వామి పడవలో కూర్చొనియుంటూనే తన చేతిని గంగలోపలికి పోనివ్వజేసినాడు. ఆచేయి ఎంత లోతుకుపోయినదో మనకు తెలియదు కానీ అది బయటికి మాత్రం రెండు ఒకే విధమైన కత్తులతో వచ్చింది. తన కత్తిని తీసుకొమ్మని రాజును అడిగితే ఆయన అది గుర్తించలేకపోయినాడట. స్వామి రాజుకత్తిని రాజుకు ఇచ్చి రెండవ కత్తిని తిరిగీ గంగలో పారవేసినాడట.

దిగంబరంగా తిరగటం కొంత మందికి నచ్చక స్వామిపై  కేసు పెట్టినారు ఆయన గొప్పదనము తెలియని కొందరు మూర్ఖులు. కోర్టు లో కేసు నడిచింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని న్యాయాధీశుని ఉత్తరువు. రాజు తలచితే దెబ్బలకు కొదువా! స్వామిని తక్షణము న్యాయస్థానములో ప్రవేశ పెట్టినారు. ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివరించినా ఆయన పెడచెవిని పెట్టటము జరిగింది కారణము అతను ఆంగ్లేయుడు. స్వామి శుద్ధ శాఖాహారియని తెలిసిన ఆ న్యాయాధిపుడు  మాంసము స్వామి తింటే శిక్షించను అన్నాడు.  స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. జవాబు వచ్చేలోపలే  తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని ఆ మహానుభావుడు తినివేయుట జరిగినది. విడ్డూరమైన విషయము ఏమిటంటే  దుర్గంధమునకు బదులు సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. మతి పోయింది న్యాయాధీశునకు! స్వామి మహిమను గ్రహించిన న్యాయపతి వారు దిగంబరముగా తిరగవచ్చునన్న తీర్పును ఇచ్చివేయడము జరిగింది.

ఒక సారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తూవుంటే మర్మాంగాన్ని గుంజినాడు. అది అలాగే కొన్ని గజాలు సాగింది. వాడు భయ పడి పారి పోయినాడు. దుండగులు కొందరు ఆయనకు సున్నపు తేటనిచ్చి పాలు అని చెప్పినారు. స్వామి ఎటువంటి తటపటాయింపు లేకుండా శుభ్రంగా త్రాగినాడు. ఆ దుండగుని కడుపు మండనారంభించింది. వాడు తప్పు తెలుసుకొని స్వామి పాదాలపై వాలినాడు. స్వామి వానితో " ఇప్పుడు తెలిసినదా నీవు నేను వేరుకాదని" సైగలతో అన్నారు. దుండగీడు చెంపలు వేసుకొని స్వామికి సాగిలబడి మ్రొక్కి క్షమాపణ చెప్పుకొని అచటనుండి నిష్క్రమించినాడు. స్వామి మింగిన దానిని మూత్ర రూపమున విసర్జించినారు.

శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్ తో కలిసి మౌన  స్వామిని దర్శించినారు .ఆయనకు స్వామివారు  నశ్యం వేసుకొనే కాయ అంటే పొడుంకాయ కానుకగా ఇచ్చినారట. పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పినారట స్వామి. పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరూ మహా పురుషులే.పరమ హంసలే. ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంతగా గౌరవించినారంటే మన త్రైలింగ స్వామి ఎంతటి మహిమాన్వితుడో మనకు అర్థమౌతుంది. స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పినారట పరమ హంస.

వేరొకమారు  అర్ధ మణుగు పాయసము అంటే 5.6 కిలోల పాయసము వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించినారటమరొక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్ లో ఉన్న  స్వామి దగ్గరకు  వచ్చినారు .ఇద్దరూ గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు. కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరూ మాయమైనారు. అరగంట తర్వాత స్వామి మాత్రమే తిరిగి వచ్చినారు. తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చినట్లు సైగలతోనే చెప్పి స్వామి అందరి సందేహాల్ని తీర్చినారు . అంటే ఆయన అష్టసిద్ధులు గడించిన మహిమాన్వితుడు అన్న విషయము మనకు అర్థమౌతుంది.

వారణాశికి వచ్చిన మరొక మహనీయుడైన లాహిరీ మహాశయుని గూర్చి త్రైలింగ స్వామివారు నాలుగు మాటలు చ్వెప్పుటకు తమ మౌనము వీడినారు. వారి శిష్యులు వెంటనే " స్వామీ! సర్వ సంగ పరిత్యాగులై పరమేశ్వరానుగహము బడసిన మీరు ఒక సామాన్య సంసారి కొరకు మౌనము వీడుటయా!" అన్నారు. అందుకు స్వామివారు ఈ విధంగా తమ శిష్యులకు శెలవిచ్చినారు " ఏమాత్రము నొప్పి కలిగించకుండా తల్లి పిల్లి తన కూనలను ఎక్కడ వుంచితే అక్కడ యిమిడి పోతాయి. లాహిరీ మహాశయులు కూడా అటువంటి యొక పిల్లికూన వంటివారు. తల్లి ఆదేశము ప్రకారము ఆయన సంసారమన్న స్థావరములో ఇమిడి పోయినారు. నేను సర్వసంగ పరిత్యాగినై సాధించినది వారు సంసారములో వుంటూనే సాధించ గలిగినారు. వారిని గూర్చి మాట్లాడుట నాకు అమ్మ యొసగిన వరము" అన్నాడు. ఇప్పుడు నేను వ్రాసిన వారి మహాత్మ్యములను గూర్చి కూడా అనేక విధములుగా వారిని గూర్చి లోకులు చెప్పుకొంటారు. కానీ వారి మహత్తును గూర్చిన అనుమానము మాత్రము ఎవ్వరికీ లేదు.

పంచ గంగా ఘట్టం లో చిన్న భూగృహం నిర్మింపజేసుకొని  32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26 -12 -1887 న సర్వజిత్తు నామ  సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం  స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషము. పతంజలి యోగములో విభూతి పాదములో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగములో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు. ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో వ్రాసినారు .కాని మన తెలుగు వారి దృష్టి దాని మీదికి పోలేదు. 280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై  ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన  ముద్రాలంకారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించ టానికి.

త్రైలింగ స్వామినేనమః

 


Saturday, 19 August 2023

శివప్రదోషస్తోత్రము

రేపు మహా శివరాత్రి. ఆ సందర్భముగా ఒక పర్యాయము శివ ప్రదోష స్తోత్రమును మనసారా పఠించూదాం. శివానుగ్రహమును పొందుదాం.

శివప్రదోషస్తోత్రము

https://cherukurammohan.blogspot.com/2023/08/blog-post_19.html

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వేll

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌ll

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాఃll

హర హర మహాదేవ శంభో శంకరకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వేll

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌ll

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాఃll

హర హర మహాదేవ శంభో శంకర

పై స్తోత్రము నేను వ్రాసినది కాదు ఎవరు వ్రాసినదీ తెలియదు.


సంస్కృతవిద్య - ఆంగ్లవిద్య

సంస్కృతవిద్య - ఆంగ్లవిద్య

https://cherukurammohan.blogspot.com/2023/08/blog-post.html

(ఆంగ్లేయుల కాలములో వారు మన విద్యావిధాన్యము నాశనము చేయుటకు మునుపు  ఉన్న మన పరిస్థితి)

 సంస్కృత విద్యకు దూరమయి చెప్పలేనంత విజ్ఞానమును దూరము చేసుకొన్నాము. ఆంగ్లమును అంది పుచ్చుకొనుటచే వారి సాంప్రదాయములకు దగ్గరయి మన సంస్కృతికి దూరమయినాము. ఒక విషయమును శ్రద్ధగా గమనించండి. సంస్కృతమునకు మనము ఎంత దూరమయినా, తెలుగులో మనము దాదాపు 40% సంస్కృత పదములనే వాడుచున్నాము. సంస్కృతము దైవ భాష. ఆంగ్లములోని that, go, it, father, mother, brother, daughter, orange(నారంగ), punch(పంచ అనగా పిడికిలి), man(మను) ఈవిధముగా ఎన్నయినా చెప్పుకోవచ్చు. అయినా మనకు సంస్కృతము, ఆంధ్రము వద్దు. ఆంగ్లమే ముద్దు. పోనీ అదయినా సరిగా వచ్చునా అంటే సందేహమే!

1984 ఏప్రిల్ 3 న collectrate చెంగల్పట్ Chairman Board of Revenue Madras Presidency కి వ్రాసిన లేఖలో,  Madras Presidency లో  551 పాఠశాలలు కలవు. విద్యార్థుల సంఖ్య వర్ణముల వారీగా ఈ విధముగా ఉన్నది. 1. బ్రాహ్మణులు – 688, శూద్ర – 4800. ‘సంస్కృతము సకలభాషలకు తల్లి’ అని ఏ శ్రీనాథుడో కృష్ణదేవరాయలో  చెబితే మన తలకెక్కదు, మనము నెత్తిన పెట్టుకొని ఊరేగే పాశ్చాత్య్లలో ఒకడగు SirWilliam Jones – High Court Judge Calcutta చెప్పినాడు ‘Sanskrit is the mother of all Languages’ అని. ఇక్కడ ఒక మాట చెప్పవలసి వస్తుంది. జోన్స్ గారి సేవాసముదాయములో ఒకరు ఒకరోజు కాళీదాసు విరచిత ‘అభిజ్ఞాన శాకుంతలము’ అన్న నాటకములోని కొన్ని ముఖ్య ఘట్టములు వినిపించినాడు. అత్యంత ప్రభావితుడైన జోన్స్ పండితుడు పట్టుబట్టి సంస్కృతము నేర్చుకొని ‘అభిజ్ఞాన శాకుంతలము’ మనసు పెట్టి చదివినాడు. అందు 4వ ఆశ్వాసము చదివిన రోజు రాత్రంతా మేలుకోనియే ఉండిపోయినాడట. ఆయన అంతేవాసి ఆ అర్ధరాత్రమున కారణమడిగితే, ఈ కావ్యములోని రచనా విధానము ఉపమాలంకార ప్రయోగములు మానవ మాత్రులకు సాధ్యమా!’ అని ఆశ్చర్యమును వ్యక్తము చేసినాడట.

బాణ భట్టు గారి ‘హర్షచరిత్రము’ చదివిన పండితాగ్రేసరులమాట ‘బాణోచ్చిష్టం జగత్సర్వం’ అని.  ఇవి సంస్కృత కావ్యాలు. మనకు సంస్కృతము రాదు. అంతటి మహా కావ్యములు చదువలేక పోయినందుకు ఇసుమంత కూడా శిగ్గుపడము.

200 సంవత్సరములకు పూర్వము చదివిన వారి సంఖ్య Madras Presidency లో 97% ఉండేది. పరిపాలన పరజాతీయులచేత పడగానే వారిభాషను రాజభాష చేసి చదువుకొన్న మన పూర్వుల అక్షరాస్యతను తుంగల ద్రొక్కి మనవారికి ఆంగ్లము తెలియదు కావున మన పూర్వుల అక్షరాస్యతను ‘0’ చేసినారు. తిరిగీ 97% తెచ్చుకొనుట’కు ఎన్ని వందల వత్సరములు పడుతుందో గమనించండి. అసలు వారు సంస్కృతము నుండి సంగ్రహించిన పడజాలమును అతి క్లుప్తముగా మీముందు ఉంచుచున్నాను చూడండి.

Mother-Matter-Matru From Sanskrit

Father- paster - pitar- pitru Sanskrit

Brother - Biradar - Bhraatar Sanskrit

Daughter - Duhitar Sanskrit

Dhoti Fro Dhouti Sanskrit

Sanskrit बन्धन bandhana, "a bond" Eng

from Hindi baniyaa ultimately from Sanskrit वणिज  Banyan (Eng)which means "a merchant"

Brinjal from Portuguese bringella or beringela, from Persian بادنجان badingān, probably from Sanskrit vātiṅgaṇa.

Cheetah which is from Sanskrit चित्रस chitra-s "uniquely marked".

Copra from sanskrit karpara meaning skull, refers to hard and white substanace with in coconut.

Crimson which is ultimately from Sanskrit कृमिज krmi-ja literally: "red dye produced by a worm".

Datura ultimately from Sanskrit धत्तूर, a kind of flowering plant.

Ginger from Sanskrit श्रङ्गवेर, from śrnga "horn" + vera- "body",

ఈ విధముగా ఆంగ్లములోనూ అన్య భాషలలోనూ సంస్కృతమునుండి తీసుకొనబడిన పదములు పుంఖానుపుంఖములు.

ఇక కాల్డ్ వెల్ మహాశయులు సంస్కృతమునకు మరియు దక్షిణాది ఆషలకు చేసిన అన్యాయములగూర్చి పరిశీలింతము. ద్రవిడము అను శబ్దము సంస్కృత జన్యము. కాల్డ్వెల్  దయవలన ద్రావిడ భాషలయిన దక్షిణ భారత, కాదు కాదు భారతదేశపు దక్షిణ ప్రాంతపు భాషలను ఒక చట్రములో బిగించి వానిపై ప్రచ్ఛన్నముగా తమిళమునకు అగ్ర తాంబూలము నోసగినారు. కాల్డ్వెల్ ను అనుసరించిన మన తెలుగు విద్వాంసులు క్రొత్త బాణీని పట్టుకొని కృత్రిమముగా ఏర్పడిన ద్రావిడముమునకు తెలుగు కన్నడ మళయాళములను సామంత భాషలుగా చేసినారు. మళయాళములో అక్షర సంపద ఎక్కువ. పైగా ఆ భాషలోనున్న  సంస్కృత పదజాలము, తమిళ పడజాలమునకన్నా ఎక్కువ. తమిళభాషకు తదనంతర భాషయైనందువల్ల కొన్ని పోకడలను గ్రహించియున్దవచ్చును. అయినాను వారి సంస్కృతి తమిళ సంస్కృతికి భిన్నముగా ఉంటుంది. ఇక వారి తీరు తెన్నూ తెలుగు కన్నడిగులతో కలువాడు. కానీ తెలుగు కన్నడములలో కూడా సంస్కృత పదములు విశేషముగా, అశేశాముగా కనిపించుతాయి. నాలుగు భాషలలోనూ దేని వ్యాకరణము దానిదే! ఈ వ్యాకరనములన్నింటికీ పాణిని 

అసలు తెలుగు యొక్క ప్రాచీనతను గూర్చి నేను గతములో సుదీర్ఘ వ్యాసమును వ్రాసియుండినాను. అసలు మహాశయుల అష్టాధ్యాయియే మూలకమని చెప్పనగును,  తమిళులు చెప్పుకొనే సంఘ సాహిత్యములోనే ఎన్నో తెలుగు పదములు ఉన్నాయి. ఇరుగు పొరుగు ప్రాంతీయభాషలయిన తరువాత కాలక్రమములో పదాలు, ఇటుఅటు జరిగే అవకాశము ఉంటుంది. 

తెలుగు విషయానికొస్తే అసలు తెలుగునకు మాత్రమే ఆంధ్రము తెలుగు అన్న రెండు పేర్లున్నాయి. శుద్ధ తెలుగులో అసలు మాట్లాడితే ఆక్షరము ముక్క గూడా ఎవరికీ అర్థము కాదు. ఈ అచ్చ తెనుగు పద్యమును ఒకపరి పరికించండి. 

ముక్కంటి యరపది మోముల వేలుపు, మినుసిగదయ్యంబు మిత్తిగొంగ

గట్టువిల్తుఁడు గఱకంఠుఁ మిక్కిలి, కంటిదేవర బేసికంటివేల్పు

వలిమలల్లుఁడు మిన్నువాలతాలుపు కొండ, వీటిజంగము గుజ్జువేల్పుతండ్రి

వలరాజుసూడు జక్కులఱేనిచెలికాఁడు, బూచులయెకిమీఁడు పునుకతాల్పు

 

తే. విసపుమేఁతరి జన్నంపు వేఁటకాఁడు

బుడుతనెలతాల్పు వెలియాల పోతురాజు

తోలుదాలుపు ముమ్మొనవాలుదాల్పు

నాఁగ భవదాఖ్య లొప్పు (నంధకవిపక్ష)   (ఆంధ్రనామ సంగ్రహము)

ముక్కంటి=మూడు నేత్రములుగలవాడు, అరపదిమోములవేలుపు= ఐదుముఖములు గల దేవుడు, మినుసిగదయ్యంబు=ఆకాశము జుట్టుగా గలదేవుడు, మిత్తిగొంగ=మృత్యువునకు శత్రువు, (మిత్తి-ప్రకృతి,మృత్యువు), గట్టువిల్తుడు= మేరుపర్వతము ధనుస్సుగా గలవాడు, కఱకంఠుఁడు=నల్లని కంఠము కలవాడు, మిక్కిలి కంటిదేవర=హెచ్చునేత్రములు గల దేవుడు, బేసికంటివేల్పు=మూడునేత్రములు గలదేవుడు, వలిమలల్లుడు=మంచుకొందయొక్క (హిమవంతుని) అల్లుడు, మిన్నువాకతాలుపు=(మిన్ను=ఆకాశము, వాక=నది) ఆకాశగంగను శిరసున ధరించువాడు, కొండవీటిజంగము=కైలాసపర్వతము నివాసముగాగల భిక్షుకుడు, గుజ్జువేల్పుతండ్రి=పొట్టిదేవర యగు విఘ్నేశ్వరుని జనకుడు, వలరాజు సూడు= మన్మధునికి శత్రువు, జక్కులఱేని చెలికాడు=(జక్కులు=యక్షులు, వారికి ఱేడు కుభేరుడు, అతనికి స్నేహితుడు) కుబేరునికి మిత్రుడు, బూచులయెకిమీడు=పిశాచములకు అధిపతి, పునుకతాల్పు=కపాలధారి, విసపుమేతరి=విషము తిన్నవాడు, జన్నంపువేటకాడు=దక్షునియజ్ఞము ధ్వంసము చేసినవాడు, బుడుతనెలతాల్పు= బాలచంద్రుని శిరమున దాల్చినవాడు, వెలియాలిపోతురౌతు=తెల్లనియాబోతు నెక్కు యోధుడు, తోలుదాలుపు= పులితోలుచర్మమును) ధరించువాడు, ముమ్మొనవాలుదాల్పు=మూడుమొనలుగల ఆయుధమును (త్రిశూలమును) ధరించినవాడు, నాగన్ =అని ఈ ఇరువదిరెండును, అంధకపక్ష=అంధకాసురునికి శత్రుడా, భవత్ ఆఖ్యలు ఒప్పును= నీ పేళ్ళనదగును) (ఈ పద్యములో 22 ను ఈశ్వరుని పేర్లు). పదములు అర్థము కానివారి సౌలభ్యము కొరకు ప్రతిపదార్తములను మీ మున్డున్చినాను.

 శ్రీనాథుడు, శ్రీకృష్ణ దేవరాయలు, నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రులు, బ్ర.శ్రీ వే, శ్జరీ చిలుకూరు బ్టానారాయన రావు గారు,వల్లభుల పురుషోత్తం గారు ఈ విధముగా ఎందరో సంస్క్రుతమును ఆంధ్రమునకు మాతృకగా పేర్కొన్నారు. 

అసలు ఆంధ్రులెవరు అన్న అంశమును గూర్చి ఎంతో విస్తారముగా గతములో వ్రాసియుండినాను. కొందరు చెప్పెవిధముగా వారు శపింపబడిన విశ్వామిత్ర సంతానము మాత్రము  కాదు. ఎంతో సంస్కృతి కలిగిన వీరి ఆంధ్ర  భాష సంస్కృత జన్యము.

ఈ విధముగా

ఆంధ్రము గోలుపోయి మన అమ్మకు జేసితిమెగ్గు గాంచగా

సాంద్రత గల్గినట్టి ఘన సంస్కృత సంస్కృతి వీడి నేడు ఈ 

రంద్ర విశేషమౌ కృతక రంజన హీన విదేశాభాషయౌ

మంద్రత గల్గు నాంగ్లమును మచ్చిక జేసిరి పశ్చిమాధముల్

 స్వస్తి.