Wednesday, 31 March 2021

నేటి తెలుగు – లఘు టిప్పణి

 

నేటి తెలుగు లఘు టిప్పణి

https://cherukurammohan.blogspot.com/2021/03/blog-post_31.html


ఇది 1 ఏప్రిల్ 2015 నాటి మాట.

ఈ రోజు vvs శర్మ గారు ఒక చిన్న మాట - సామవేదం  వారి  నోట వచ్చినది 

ప్రకటించినారు.

దానికి వారి మాటలు , నామాటలు జోడించి ఈ క్రింద ప్రచురించు  చున్నాను.

ప్రశ్న  : "గురువుగారు! అచ్చ తెలుగంటే ఏమిటి?"

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు : "ఇప్పటి తెలుగు వారికి అర్థంకానిది నాయనా!"

Vvs శర్మ గారి మాట: తమిళులు రైల్లో పక్కవారికి తమిళం వస్తుందని తమిళంలో 

పలకరిస్తారు. తెలుగు వాళ్ళు పక్కవాళ్ళకి రాదు అని ఊహించుకుంటారు. మద్రాసులో 

అరవం నేర్చుకున్నారు, హైద్రాబాదు వెళ్ళి నాలుగు ఉర్దూ పదాలు నేర్చుకున్నారు. 

కాన్వెంటుకి వెళ్ళీ బట్లరు ముక్కలు ఒంట పట్టించుకున్నారు. సినిమాలుచూచి సుత్తి, కేక

కొత్త జాతీయాలు సృష్టించారు. ఆత్మ న్యూనతాభావం (inferiority complex) 

అనుకుంటాను. ఆత్మ విశ్వాసం ఉండాలి. భాషపై అభిమానం ఉండాలి. ఇవి ఇంట్లో 

నేర్పాలి.

నాలుగు  నా  మాటలు  : శర్మగార్లుభయులు చెప్పిన మాటలు అక్షర సత్యములు. 

కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రములలో వారి వారి మాతృభాష తప్పనిసరి. మన 

పూర్వులు కొందరు తమ పేరుపలుకుబడి కొరకు కంకణము కట్టుకొని, ఆంగ్లేయ 

ప్రభువుల ప్రాపు గోరి,  మరీ వాడుకభాష అన్న పేరుతో ఈభాషను నాశనముచేయుటకు 

నాంది పలికినారు. అసలువారు కూడా తమ చేతనయినంత నాశనము చేసినారు. 

అందులకు గానూ బ్రిటీషు దొరలతో Sir అన్న బిరుదును కూడా పొందినారు. 

మరియొకరు Madras University SEnate Member అయినారు. ఇవి చాలదన్నట్లు 

దివంగతులయికూడా, ఇప్పటి తెలుగు, వారు పెట్టిన భిక్ష అన్న ఒక అభిప్రాయమును 

కలుగజేసి గౌరవమును పొందుచున్నారు. ఈ రోజు భారత, భాగవత, రామాయణ, 

కావ్యములను చెదలు పట్టినాయా లేదా అని చూచుకొనే అవకాశము కూడా లేకుండా 

చేసినారు.  Vvs శర్మగారుచెప్పినట్లుగా దిశానిర్దేశము లేని యువత తాము మాట్లాడేదే 

తెలుగన్న భ్రమలో పడినారు. తప్పు ఒకరిది కాదు. కానీ మహా పండితులైవుండికూడా 

తెలుగు వినాశనమునకు నడుము కట్టుకొని మరీ వాడుక భాష అన్న విషబీజము 

నాటిన వారిని తెలుగునాడు క్షమించుతుందో లేదో చదువరులవితరణకు వదులుచున్నాను.

నిజానికి మనము పెద్దగా పట్టించుకోని  కేరళ రాష్ట్రములో తెలుగుపై, కర్నాటక 

సంగీతము పై మక్కువ ఎక్కువ. సంస్కృతము వారి సంస్కృతిలో ఒక భాగము. 1980, 90 

దశకములలో వారి చలన చిత్రములలో సందర్భోచితముగా త్యాగరాయ కీర్తనలు యథాతథముగా వాడేవారు. సంస్కృతములో నయితే ఎన్నో పాటలు రచించి గానము చేసినారు. అట్టి రచయితలలో యూసుఫ్ అలి కెచేరి అన్న ముస్లిం రచయిత కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో సంస్కృత గీతములు వ్రాసినాడు. మళయాళ సినిమా రంగములో అవి నేటికీ సుప్రసిద్ధములు. నేటి తమిళ సంగీత కళాకారులు తమిళ సాహిత్యము పై మక్కువ ఎక్కువ చూపుచూ, కర్నాటక సంగీతమునకే నవ రత్నఖచిత మకుటాయమాన మగు తెలుగును తుంగల ద్రొక్కుట ప్రారంభించినారు. నేటికీ కన్నడ, మళయాళ కళాకారులే కర్నాటక సంగీత త్రిమూర్తుల కీర్తనలను శ్రద్ధతో ఆలపించుచున్నారు. తెలుగులోని సంగీత రత్నములు రాలిపోగా ఒక ముగ్గురు నలుగురు అశాదీపమును జగతికి కనిపింపజేయుచున్నారు. ఒక మళయాళ చలన చిత్రములోని ఈ పాటను గమనించండి.

జానకీ జానే రామా! జానకీ జానే

కదన నిదానం నాహం జానే

మోక్షకవాదం ణాహం జానే

జానకీ జానే రామా రామా రామా

జానకీ జానే రామా!

 ఈ సంస్కృత గీతము ‘ధ్వని’ (1988) అన్న మళయాళ చిత్రములోనిది. ఈ శ్రీరామ పరమైన గీతమును వ్రాసినది యూసుఫ్ అలి కెచేరి, బాణీ కట్టినది సుప్రసిద్ధ హిందీ చలనచిత్ర సంగీత దర్శకుడు నౌషాద్ మరియు పాడినది యేసుదాసు మరియు మన సుశీలమ్మ (వేరు వేరుగా పాడినారు). కర్ణపేయమైన ఇటువంటి పాట మనకు కలలోని మాట. ఎందుకంటే సంస్కృతము అంటే బూతుమాటల సముదాయ మనియే కదా మన అర్థము. అందువల్ల సంస్కృతము జోలికి పోము.

అసలు తిరిగీ తెలుగు విషయమునకు వస్తే, ఈ దిగువ తెలిపిన తెలుగు పదాలకు 

అర్థముతెలిసిన వారు బహు తక్కువ అని నా అభిప్రాయము. తుటుము, గమి, అన్నవి 

గుంపునకుపేర్లు. వెలిచెనుఅంటే వెడల గొట్టెను అని అర్థము. తెక్కలికాడు అంటేదొంగ 

అనిఅర్థము. వదచక్కేలిక అంటే కుబేరుడు, తమ్మిచూలి అంటే బ్రహ్మ, సోకుదయ్యము 

అంటే గాలి, పక్కిడాల వేల్పు అంటే విష్ణువు, పాపతాల్పు అంటే శివుడు,. ఈవిధంగా ఈ 

కాలము వారికి అర్థము కాని ఎన్ని పదములైనా చెప్పవచ్చును. ఇదీ అచ్చ తెలుగు.

మరి తత్సమశబ్దములతో కూడిన తెలుగు తెలుసునా అంటే అదీ అంతంతే. ఇక తత్సమ 

శబ్దముల విషయానికి వస్తే లేలిహాన, జిహ్మగ అన్నవి పాములకున్నఅనేకమయిన పేర్లలో 

రెండు మాత్రమే. చంచుక, సారిక, సుచీముఖ అన్నవి పక్షుల పెర్లగు తత్సమ శబ్దములు. 

మనకు తెలుసునా అన్నది ఆత్మ విమర్శ చేసుకొనవలసిన విషయము. కులీన, సువినీత, 

మహాజన ఇవి గౌరవనీయుడయిన వ్యక్తిని సంబోధించు తత్సమ శబ్దములు. మనకు 

తెలుసునా అన్నది మనము ఆత్మావలోకనము చేసుకొనవలసిన విషయము.

ఈస్థితిలో నన్నయ , తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథ, పెద్దన, విశ్వనాథ, గడియారం, 

పుట్టపర్తి,  మొదలయిన మహానుభావుల గ్రంథాలు తాకుటకు కూడా యోగ్యత కలదా! 

అని కూడా మనల మనము ప్రశ్నించుకోవలసిన దయనీయమైన పరిస్థితిమనది. ఏమిచేస్తాము.

గొరగంగా మిగిలింది జుట్టు.

విడువంగా మిగిలింది కట్టు

చెరపంగా మిగిలింది బొట్టు

చెప్పంగా మిగిలింది గుట్టు

దొరకంగా మిగిలింది పట్టు

మాడంగా మిగిలింది అట్టు

ఉతకంగా మిగిలింది మట్టు

వదలంగా మిగిలింది జట్టు

ఊడంగా మిగిలింది కుట్టు

కొట్టంగా మిగిలింది చెట్టు

నోటిలో మిగిలింది షిట్టు

ఈ పద్యమును కూడా ఒక మారు చిత్తగించండి.

ఏనాటి అగ్రహారమొ

మా నాటికి మాన్యమాయె మాపని దీరన్

మీ నాటి కండ్రిగాయెను

నానాటికి తీసి కట్టు నాగం భొట్టు

ఈ విధముగా తెనుగును రేవుకు చేర్చుటకు ఎందఱో మహనీయుల అవిరల కృషి 

దాగియున్నది. కర్ణుని చావుకు అర్జునుడొకడే కాదు కారణము. శ్రీకృష్ణుడు చెప్పిన 

ఈమాట వినండి.

నరవర నీచే నాచే

వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్

ధరచేత భార్గవునిచే

నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్

స్వస్తి.


No comments:

Post a Comment