భాషను గూర్చి ఘోష
https://cherukurammohan.blogspot.com/2021/02/blog-post.html
స్వచ్ఛమైన పాలు ఒక పాత్రలో
వున్నాయనుకొందాము. ఒకడు ఆ పాలను చూస్తూనే అన్నీ త్రాగేయాలనుకొన్నాడు. అంతలో ఎవరో
పిలిస్తే అటు వెళ్లి కాసేపు గడిపినాడు. వచ్చి త్రాగుదామనుకొంటే అంతలో అతని
అర్ధాంగి పిలిచి పెరటిలోని కరివేపాకు వెంటనే కోసి ఇవ్వమనింది. ఇచ్చి వచ్చేసరికి కాస్త
ఆలస్యమైనది. అంతలో ఇంటికి ఎవరో అతి ముఖ్యమైన అతిథులు వచ్చినారు. వారితో కూర్చొని
మాట్లాడకుంటే బాగుండదని కూర్చున్నాడు. ఆటంకాలన్నీ తొలగించుకొని వచ్చి చూస్తే
దానిలో ఈగ పడి వుంది. దానిని తీసివేసి కాచమన్నాడు భార్యను. ఆమె కాచితే అవి విరిగి
పోయినాయి.
ఇది ఇప్పటి మన తెలుగు
పరిస్థితి. పాలు తెలుగైతే ఈగ ఇంగ్లీషు. ఆ వ్యక్తి మా తరము వారి ప్రతీక అని
ఉహించుకొంటే వివిధములైన ఆలస్యములు వారి జీవితములో ఏర్పడిన అడ్డంకులు. మా తరములో
కొన్ని అత్యంత అవసరాలకు కూడా సరిపడ డబ్బు వుండేది కాదు. కావున ఉద్యోగము కొరకు
చదువుకొన వలసి వచ్చింది. చదువు ముగియగానే ఉద్యోగము. ఉద్యోగము పెద్దదైతే పదవీ
వ్యామోహము చిన్నదైతే అలవి మాలిన శ్రమ. ఇక ఇంటికివస్తే మనకు ఇష్టమైనవి చదివే
తీరుబాటేదీ. ఇంతలో నవలలు ఒకప్రక్క, డిటెక్టివ్
నవలు ఇంకొకప్రక్క , శృంగార సాహిత్యమనుపేరుతో అసభ్య అసహ్య అశ్లీల అవాంఛిత నవలలు, మాసపత్రికలొకప్రక్క, ప్రొద్దు
పుచ్చుటకు సినిమాలొకప్రక్క, ఇక గ్రంథములు చదువుటకు వేసలుబాటేదీ!
ఒక అదృష్టమేమిటియంటే
ఉత్సాహమున్న వారికి చెప్పేవారు మాకాలములో దొరికేవారు. ఇప్పుడు చెప్పేవారూ వినే
వారూ కూడా కను మరుగే.
ప్రతి వూరిలో సాయంకాలము 8 గంటల తరువాత హరికథో పురాణ పఠనమో అవధానమో (అవధానము,కవి సమ్మెళనము సా. 5 గం. లకు
మొదలయ్యేది.) కవి సమ్మేళనమో ఉండేవి. వినేవారు కూడా అందులోని మధురిమలను ఆస్వాదించే
వారు. ఇప్పుడు వారూ లేరు వీరూ లేరు. అన్నింటికీ మించి ధన పిశాచి మన నెత్తిపై
తాండవమాడుతూవుంది. ‘డబ్బు ముఖ్యమాయ, పిల్లల వద్ద వుండేది ఆయ.
వారిలో సంస్కారము మాయ. పిల్లల భవిత వేపకాయ’
ముద్దు పలుకులల్లి మురిపాన
తినిపించు
మంచి కాలమంత మాయమాయె
అమ్మ యుగము కాదు ఆయమ్మ
యుగమిది
రామ మొహనుక్తి రమ్య సూక్తి.
ఇవి స్పీకింగ్లీష్
వాకింగ్లీష్ ఈటింగ్లీష్ రోజులాయె. దీనికి తోడు పిల్లలకు వెబ్బు లో దొరికే గబ్బు
మీద మొజెక్కువాయె.మా కాలము వారి సంతానమునకే తెలుగు భాష అంతంత. ఇక వారి పిల్లల
కెంతెంత.
ఇదికాక కొందరు మహా
పండితులమనుకొన్నవారు మన మానాన మననుండనీక వ్యావహారిక భాష అంటూ ఇప్పుడు మనము వాడే
తెలుగును ప్రభుత్వమును ఒప్పించి పుస్తకములలో జొప్పించి మనల నొప్పించు చున్నారు.
వ్యావహారికమంటే ఆంధ్ర, కోస్త, గోదావరి, విజయనగరం విశాఖపట్నం, శ్రీకాకులమం, తెలంగాణా ఏ వ్యావహారికము. ‘సర్’ బిరుదాంకితులైన ఈ పండితులు
ఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తుతూ పామర భాష అన్న రంగుపులిమి తెలుగును తేలిక
జేసినారు. భారత భాగవత రామయణ కావ్యములు, కాశీ ఖండము, భీమ ఖండము, మరుత్తరాట్చరిత్ర (కొందరికి
బహుశ నోరు తిరుగక పోవచ్చు),
అష్టదిగ్గజముల ప్రబంధములు అన్నీ బంధించి చెదపురుగులకు
ఆహారముగా ఉంచితే, అరగవేమో అన్న భయముతో అవికూడా తినవేమో! తేలిక తెలుగు, పుస్తకములైతే తెగులు తేలికగా తగులుకొంటుందేమో!
తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, శ్రీపాద కృష్ణ మూర్తి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అజ్జాడ ఆదిభట్ల
నారాయణ దాసు గారు, గడియారం వెంకటశేష శాస్త్రి గారు, పుట్టపర్తి నారాయణా చార్యులవారు, ఇంకా ఎందఱో మహానుభావులు పండిత భాషలోనే వ్రాసినారు. Dr. C.V. సుబ్బన్న శతావధాని గారు చేసిన ఏ అష్టావదానములోని
నిషిద్ధాక్షరి తీసుకొన్నా నిఘంటువు లేనిదే అర్థము బోధపడదు. కష్టమైన పరిశ్రమ
చేసినవాడు సులభమైనవి అవలీలగా సాధించగలడు. మరి సులభమైన పరిశ్రమ చేసేవాడు కష్టమైనవి
చేయగలడా! ప్రౌఢమైన భాషను సరళ తరము చేసి ‘అదిగదిగో మేడ-మేడకున్నది
గోడ- గోడపక్కన దూడ- దూడ పెట్టెను పేడ’ అని కవితలు వ్రాసుకొని మనకు మనమే మురిసి
పోతున్నాము. ఇవి కలకాలము నిలువవు. సాహిత్యమే లేకుంటే భాష లేదు.
ఇక సంపాదనకై, పొరుగు దేశదేశముల పంచలు జేరిన వారి పిల్లలకు మన భాష మన
సంస్కృతి ఎండమావులు మాత్రమే! వెరశి వారి పరిస్థితి:
ఏనాటి అగ్రహారమొ
మానాటికి మాన్యమాయె మా పని
దీరన్
మీనాటి కండ్రిగాయెను
నానాటికి తీసి కట్టు నాగం
భట్టూ!
గ్రాంధిక భాష వుంటే
గ్రంధాలుంటాయి. గ్రంధాలుంటే సంస్కృతి నిలుస్తుంది. సంస్కృతి నిలిస్తే మనకు తెలుగు
వారిగా గుర్తింపు వుంటుంది.
లేకుంటే సద్గ్రంధాలకు బదులు
మనకు మిగిలేది దుర్గంధాలే !
గ్రాంథికమ్ము పూల గంధము
వంటిది
తెరువ సురభి గాలి తేలియాడు
ఎండు గడ్డి గాలి కెగిరి
పోవును గాని
ఎంచ మంచి తావి ఎటులనిచ్చు
స్వస్తి.
👍
ReplyDelete