ఆంద్ర మహా భారతము-విరాట
పర్వములో
ఒక పద్యము
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు...
తిక్కన
భారతంలోని విరాట పర్వంలోని పద్యమిది. అజ్ఞాత వాసగ్రస్తులైన పాండవులు విరాట రాజు
కొలువు చేరి వివిధ ఉద్యోగములలో తమ తమ ప్రతిభానుసారముగా చేరిపోతారు. విరాట
పర్వము అన్న పేరు ఈ విధముగా ఆ విభాగమునకు
వచ్చినదని తలుస్తారు. నాకు ఇందులో మరియొక విశేషము అగుపించుచున్నది. మహాభారతములోని
18 పర్వములలో ఇది ‘విరాట్’ పర్వము. ఇది అత్యున్నతము అత్యుత్తమము అయినది. క్షామ
కాలములో వానలు కురియుట మొదలుకొని, అనేకములగు మానజీవితములోని బాధలకు, విరాట పర్వ పఠనము’
పరిష్కారమని పెద్దలు చెబుతారు.అందుకే ఇది ‘విరాట్ పర్వము’ అయ్యింది. ఇందులోని, ఈ
క్రింద కనబరచిన పద్య విమర్శ మన ప్రస్తుత కార్యము. ముందు పద్యమును చదువుదాము.
ఎవ్వాని
వాకిట నిభమద పంకంబు
రాజభూషణ
రజోరాజి నడగు
ఎవ్వాని
చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై
వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని
కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత
సంపద లీనుచుండు
ఎవ్వాని
గుణలత లేడువారాశుల
కడపటి
కొండపై గలయ బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు
ఇక
పద్యార్థమునకు పోదాము.
ఎవ్వాని
వాకిట - ఎవని వాకిట్లో,
ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన,
పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న
ఆభరణాల, రజోరాజిన్ - రజము అంటే ధూళి రాజి అంటే గుట్ట రజోరాజి
అంటే గుట్టగా పడుతున్న ధూళి చేత, అడగు - అణగు (అణిగిపోతుందో)
అతని
వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల
అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో
కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది.
ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.
ఎవ్వాని
చారిత్రము - ఎవని చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై,
వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము
లేదా పద్ధతి (అంటే ధర్మజుడు వినయమునకు ఒరపురాయి లేక గీటురాయి
అని అర్థము) , కఱపు – నేర్పునో.
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క గొప్పతనమును
లోకమున చాటుతుందో
ఎవ్వని
కడకంట - ఎవని కనుకొలకుల,
నివ్వటిల్లెడు - వ్యాపించే లేదా అతిశయించే, చూడ్కి
- చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు,
ఈను చుండు – ప్రసాదించుతుందో (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవని
కడకంటి చూపు గొప్ప సంపదలను ప్రసాదిస్తుందో
ఎవ్వాని
గుణలతలు - ఎవని గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి
కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా
ప్రాకుతున్నాయో
ఇక్కడ
గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి.
అంటే ఎవని గుణములు ఈ భూమండలము దాటి నభోమండలమును అనగా స్వర్గాది లోకములను
చేరుచున్నాయో,
అతడు,
భూరి
ప్రతాప - అధికమైన ప్రతాపమను, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర
విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే పెను చీకటిని
(పారద్రోలి), వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క
కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు
- పాదములు కలిగినవాడు.
అతను
తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారమును పారద్రోలినవాడు, అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు
ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. ఆవిధముగా గర్వోపశమనము గలిగినతరువాత, వాఋ
ఆయన పాదములనంటి మ్రొక్కుటచే కిరీటములలో పొదగబడిన
మణిగణ దీప్తిచె విరాజిల్లు పాదములు గలవాడై ఉంటాడు.
ఈ
కొండవీటి చాంతాడు సమాసం ఎందుకో ఒకసారి తడిమి చూద్దాము. ఇందులో అందమంతా, ఏవిధముగా
అయితే కిరీతములకు మణులను తాపినట్లు తిక్కన గారు ఈ సుదీర్ఘ సమాసములో అక్షర మణులను తాపినారు. ఆ
విధమగు పొహళింపు, ఆయనకు దక్క అనితర సాధ్యము. సాధారణ వాక్యములలో చెప్పునపుడు వచ్చే విభక్తి
ప్రత్యయాలు సమాసములలో అదృశ్యమైపొతాయి. క్రియలు విశేషణములుగా మారిపోతాయి. "మహా
ప్రదీప దూర విఘటిత గర్వాంధకారము" - మామూలు భాషలో చెప్పాలంటే "మహాజ్యోతి
చేత గర్వమనే చీకటి దూరంగా కొట్టబడింది" అని చెప్పాలి. సమాసంలో అన్ని పదాల
అవసరం ఉండదు. పటిష్ఠమైన సమాస గ్రధనం వల్ల సాధించే క్లుప్తత యిది. కవిత్వం
తెలిసినవాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది.
తర్కించి
చూడగా మ్నాత్రమే ఇతను ఎవరు అన్నది బోధ పడగలడు. ఇన్ని విశేషణములు కలిగినవాడు కేవలము మానవుడని అనుకొనదగునా! మానవుడే ఆయెను పో
సాధారణమైన మనిషి కాగలడా! ఎవరీతను? ధర్మ నందనుడు అంటే యమ ధర్మ రాజు అంశచే జనియించిన వాడు. పాండవ జ్యేష్ఠుడు. ఇక్కడ
ధర్మజుడు ఎంత ఉదాత్త చరితుడో ఈ పద్యము ద్వారా మనకు తెలియబరచుచున్నాడు తిక్కన.
సాధారణంగా
ఎక్కువమందికి ధర్మరాజును గూర్చి తెలిసినది తక్కువ. కారణము ఏమిటంటే మనది వినికిడి
భారతము కాబట్టి ఎక్కువగా భీమార్జునులను గూర్చి వారి శౌర్య పరాక్రమములను గూర్చి వింటాము.
కానీ యీ పద్యాన్ని చదివిన తరువాత "ఆఁ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!"
అని ఎవరూ అనుకోక మానరు. ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన
అలంకారాన్ని ప్రయోగించినాడు తిక్కన. దానికి దీటైన నడక. ధర్మరాజు వైభవాన్ని మనకు
కళ్ళకు కట్టినట్టు చూపించినాడు. రెండవపాదంలో అతని స్వభావాన్నీ, ప్రసిద్ధినీ
వర్ణించినాడు. మళ్ళీ మూడవపాదములో అతని
సంపద్విభవముల గూర్చి తెలుపుతూ నాల్గవపాదములో అతని కీర్తి ప్రసిద్ధులను
కీర్తించుతాడు. ఇంతగా కీర్తించిన పిదప ఆయన అసలు సిసలైన గుణాన్ని ఎత్తుగీతిలో మూడు
పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసములో దట్టించి చెబుతాడు. అది ఏమిటి అంటే అతని ప్రతాపము. అదేకదా క్షత్రియులకు అలంకారమగు
అతి ముఖ్య గుణము. ఇక్కడ మనము పైన చెప్పుకొన్న మాటను చెప్పి పద్యమును ముగించుతాడు.
ఇదీ
తిక్కన పద్య రచనా శిల్పనైపుణ్యము. ఆయన ఈవర్ణనకు ఎన్నుకొన్నది సీస పద్యము. అట్టి
పద్యమును ఎన్నుకొనుటకు ముఖ్యకారణము ధర్మజునిలో తాను తలచిన విశేషణములన్నీ ఒకే పద్యములో ఇమిడ్చి ఎత్తుగడ మొదలుకొని ఆసాంతమూ ఏవిధముగా నడిపించి ఎట్లు ముగించితే అది చదివేవారి వినేవారి హృదయాంతరాళాలలో
ముద్రపడిపోతుందో ఆ విధముగా నడిపించినాడు తిక్కన.
ఆయన శబ్దాలంకారములకు అధికమగు ప్రాదాన్యతనివ్వాడు. ప్రాధాన్యత అంతా రసపుష్టికే!
అచ్చతెలుగు పదాలకు ఆయన అక్షర భాండాగారము. అట్లని సంస్కృత, తత్సమ శబ్దములు వాడడా
అంటే సమయోచితముగా వాడి సందర్భమునకు నాటకీయత సృష్టించుతాడు. ఉదాహరణమునకు ఇదే విరాట
పర్వములో ఉత్తర గోగ్రహణమ్మున ‘భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలమ్ము.....’ అన్న
పద్యము ఒక ఉదాహరణ మాత్రమే! అదే అంకములో పద్యము బృహన్నలచే పలికిన్చునపుడు ‘ప్రాణములు
తీపన మున్ వినవే బృహన్నలా...’ అని అనిపించుతాడు. ‘నర్తన శాల’ చలన చిత్రములో ఘంటసాల
గారు ఆలపించినపుడు అసలు తన కలలోనో ఊహలలోనో తిక్కనతో మాట్లాడి ఈ విధముగా
ఆలపించినాడేమో అనిపిస్తుంది. అంతటి
మహాకవియగు తిక్కన యీ పద్యమును అంత గొప్పగా ఒక అసామాన్య శిల్ప
కారుని వలె మలచినాడు కాబట్టే పద్యము అంత ప్రసిద్ది పొందినది.
మనము
ముందే చెప్పుకొన్నాము, నర్తనశాల చిత్రమును చూసినవారు యిది బృహన్నల ద్రౌపదీ భీములతో
చెబుతున్న పద్యమని అనుకుంటారు. అందులో
దర్శకుడు అటువంటి ఒక సన్నివేశమును సృష్టించి, అందుకు తగిన విధముగా ఆ రీతిన చిత్రీకరించినారు.
వాస్తవానికిది భారతములో బృహన్నల చెప్పినది కాదని ముందే చెప్పుకొన్నాము. ఈ పద్యమును
చెప్పినది ద్రౌపది.
ఇపుడు
ద్రౌపది యొక్క గుణమును గూర్చి తెలుసుకొందాము. శ్రీ కృష్ణుని రాయభారమునకు పంపు
సమయములో ద్రౌపది తనను గూర్చి తానె ఈ విధముగా చెప్పుకొంటుంది.
వరమున
బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు బాండు భూ
వరునకు
గోడలైతి జనవంద్యుల బొందితి , నీతి విక్రమ
స్థిరులగు
పుత్రులం బడసితిన్ ,
సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ!
యిన్ని ట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్.
ద్రౌపది
తన సౌశీల్యమును గూర్చి తానే చెప్పుకొనే ఈ పద్యములో అక్షరమక్షరమూ స్వభావోక్తే కానీ
అణుమాత్రము కూడా అతిశయోతి లేదు. ఈ పద్యమును గమనించితే కఠిన సమాసమే లేకుండా ఇది
నడుస్తుంది. పాఠకునికి లేక శ్రోతకు ఆమె గుణముల లోని అక్షరమక్షరమూ తెలియవలెనను
నెపముతో సరళమైనభాష లో శ్రీకృష్ణునికి చెప్పించినాడు. వేరొక విధముగా గమనించితే, ద్రౌపది
కృష్ణునికి పాండవులంతా తమ అభిప్రాయములను తమదైన శైలిలో చెప్పినారు. ఇపుడు ద్రౌపది
వారి పోకడలకు భిన్నముగా తన మనసులోని ఆణువణువూ అర్థము చేసుకోను విధముగా ద్రౌపది
చెప్పింది. వివరణాత్మకముగా పరిశీలించితే ద్రౌపది మహాభారతంలో మనకు పట్టువీడని పడతిగా పైకి కనిపిస్తుంది. కాని,
ఆమె - అత్యంత అరుదైన సౌందర్యరాశి, సద్గుణశీల,
సూక్ష్మగ్రాహి, సహనశీలి, చమత్కారి, అభిమానవతి, పౌరుషంతో
కూడిన నీతి గల్గినది. అధర్మం పాలిట కాళరాత్రి. ధర్మాధర్మ విచక్షణశీల. ధర్మసంస్థాపనకు
మార్గదర్శి, క్షమ ద్రౌపది. మహాభారత సంగ్రామానికి కారణభూతి.
నారీలోకానికి శిరోమణి, గృహస్థ్ధధర్మానికి నిలువెత్తు సాక్ష్యము,
భర్తల అనురాగము పొందటంలో అద్వితీయ స్త్రీరూపము. ఇచ్ఛా జ్ఞాన క్రియారూపమైన
త్రివిధ శక్తుల సమాహారము ద్రౌపది. తిక్కన మహాకవి ఘంటమనే ఉలి చెక్కిన స్త్రీశక్తిస్వరూపిణి
ద్రౌపది. ఇంతటి మహాఖ్యాతి పొందిన వినయగుణశీల ద్రౌపది.
పై
పద్యములో అంత స్వాభిమానిగా అగుపించే ద్రౌపది, భర్తయే కానీగాక, ధర్మరాజును గూర్చి
అంతా పొగడుతుందా అంటే అక్కడే ఉంది చమత్కారము. ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ
భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. ఆమె ఇచ్ఛా జ్ఞాన క్రియారూపమైన త్రివిధ శక్తుల
సమాహారమని ముందే చెప్పుకొన్నాము. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన
నప్పుడు పొగుడుతుంది.
ఇపుడు
ఈ పద్యమునకు సంబంధించిన సందర్భమును పరిశీలించుదాము. సైరంధ్రి రూపములో ఉన్న ద్రౌపదికి
కీచకుని చేత ఘోరమైన పరాభవాన్ని పొందుతుంది. కామాంధుడైన కీచకుడు ద్రౌపది
వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని
వెంబడిస్తూ అక్కడికి వచ్చి నిలుస్తాడు. అప్పుడామె విరటుని నిలదీస్తుందిఆ
దారుణానికి పరిష్కారము చెప్పమని. దూరమునుండి యిది గమనించుచున్న భీముడు కోపము
పట్టలేక పక్కనున్న చెట్టును పెరికే ప్రయత్నము చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న
ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపది తో ‘నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే
వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడుచున్నావు అంటాడు.
నిండు సభలో మిక్కుటమగు స్వాభిమానము కలిగిన గృహిణిని ఇట్టి మాటంటే సహించగలదా?
కానీ ద్రౌపది ఆవేశమునకు లోనుకాలేదు.
తనలోని విచక్షణకు తలుపు తెరచింది. సభా మర్యాద, పాతివ్రత్యమూ
మాట అటుంచి ఆవేశము చెలియలికట్ట దాటితే తమ నాటకము బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యవలసి
వస్తుంది. నాట్యకత్తెలా తైతక్కలాడుచున్నావు అన్న మాటను పట్టుకొని తన చాకచ్యవంతమైన మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క
పోటుపొడిచి వెళ్ళిపోతుంది. ఆమె అన్న మాట పద్య రూపములో ఇది:
"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి
యట్ల పిన్నవారు
గాన, బతుల విధమ కాకయె
శైలూషి
గాననంగ
రాదు కంక భట్ట
అట్లగుటం
జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున
జూదరియాలికి గఱువతనంబెక్కడియది"
"అయ్యా కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ
వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడుట ఎందుకు?
స్వతహాగా నా భర్తగొప్ప నటుడు. (శైలూషుడు అంటే నటుడు) అంతేకాదు పెద్ద
జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?"
అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలో చూడండి. ఇదండీ తిక్కన
గారి నాటకీయత. అందుకే ఆయనను ‘కవిబ్రహ్మ’ అన్న బిరుదము ఆయన కవితా శక్తికి అద్దము
పట్టింది.
ఇదంతా
ఈవిధముగా జరిగిపోయిన పిదప,
తనలో రగులుతున్న బాధను తీర్చుకొనేందుకు , భీమసేనునికి
చెప్పుటకు వస్తుంది. కీచకుడు తనని చేసిన అవమానాన్ని వివరంగా చెపుతుంది. తన
దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది. "మీ యన్న పెద్దతనము జూచితి నేమందు ననిల తనయ"
అంటుంది. "ఇంతా జరిగిన తరువాత, మీ అన్నగారు చూపించిన పెద్దతనం చూచినావుగదా,
ఇంక నేనేమనగలను?" అని నిలదీస్తుంది.
నన్నా కీచకుడవమాన పరచినపుడు, ధర్మరాజు ఎలా
చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీముడు ద్రౌపదికి సర్ది చెప్పే
ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజే కనక ఆపకపోయి ఉంటే తానా కీచకుని విరటుని అక్కడే చంపేవాడినని అంటూ, అదే
జరిగితే తిరిగీ వనవాసానికి వెళ్ళవలసి వచ్చేదనీ, అప్పుడందరూ తమ
ఇరువురినే తప్పుబట్టే వారనీ చెపుతాడు. అంచేత ధర్మరాజుని మెచ్చుకోవాలి కాని పరుష
వాక్కులు పలుకకూడదు అంటాడు. అప్పుడు ద్రౌపది తన ఆవేశము అనర్తదాయకమని గ్రహించి, భీమునితో
ధర్మరాజు గొప్పదనం తనకు తెలియక కాదు అంటుంది. అంతేకాక అప్పుడు ధర్మరాజు గుణగణములను
పొగడుట మొదలుపెడుతుంది. ఆ వరసలో చెప్పిన
పద్యమే ఇది.
ధర్మరాజుని
పొగిడి ఊరుకోదు. అంతటివానికి యిన్ని కష్టాలు వచ్చాయే అని వాపోతుంది. ఆ తర్వాత
వరుసగా భీమసేనణ్ణి, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనీ పేరుపేరునా
పొగుడుతుంది. వారికొచ్చిన కష్టాలకి బాధపడుతుంది. చివరికి తనంత దానికి వచ్చిన
కష్టాలని చెప్పుకుంటుంది. మనకు ఇందులో ఆమె లౌక్యము కూడా ప్రస్ఫుటమౌతుంది.
ఇందఱకు
నిన్నిభంగుల నిడుమ గుడువ
వలసె
ధర్మతనూభవు వలన జేసి
దాయ
లొడ్డిన మాయజూదంపుటురుల
బడి
కులంబున కతడిప్పాటు దెచ్చె
ఇదీ
ద్రౌపది వాక్పటిమ. ఇదీ ద్రౌపది దృఢమైన సంపూర్ణమైన వ్యక్తిత్వ చిత్రణ!
ఇంచుమించు
ఇదంతా సంస్కృత భారతంలో కూడా ఉన్నదే. కాని తిక్కన దాన్ని మరింత నాటకీయంగా
తీర్చిదిద్దాడు. సంస్కృతంలో ద్రౌపది వచ్చీ రాగానే తన గోడంతా వినిపించేసి, పాండవులందరి
గొప్పతనాన్నీ వర్ణించేసి వాళ్ళిన్ని కష్టాలు పడుతున్నారే, దీనంతటికీ
కారణం ధర్మరాజే అని ముగిస్తుంది. భీముడు ఆ తర్వాత మాట్లాడతాడు. కాని తెలుగు
భారతంలో ద్రౌపది భీముల మధ్య మాటలు నాటకంలో సంభాషణల్లా సాగుతాయి. అది తిక్కన
రచనలోని నేర్పు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ద్రౌపది ధర్మజుని ఎంత మెచ్చుకొన్నా చివరకు తప్పు
మాయా ద్యూతపు ఉరులలో చిక్కుకొన్న ఆయనదే తప్పని తెలుస్తుంది.
మహనీయుల
కావ్యముల మాన్యతను గుర్తించండి. భారతము వంటి మహాకావ్యమును వ్రాసిని వ్యాసుని,
ఆంధ్రీకరించిన కవిత్రయమును పాదాభివందనము చేస్తూ శెలవు తీసుకొంటున్నాను.
మన
దృష్టిలో సంఘసంస్కర్తలను నుద్ర వేయించుకొన్న మహనీయులు కొందరు తెలుగు గొప్పదనమును
సర్వనాశనము చేసినారు. కనులు తెరువండి వాస్తాన్ని గమనించండి, తెలుగు గొప్పదనమును
జగతికి చాటండి. తెలుగును పునః ప్రతిష్ఠించండి.
ఆంధ్రభారతము
తలమసనికము. అది శిరౌధార్యము.
స్వస్తి.
మంచివిశ్లేషణ చేసి మనతెలుగు ను శ్లాఘించిన మీకు వందనములు అభినందనలు.
ReplyDeleteధన్యుడను
Delete