Wednesday, 4 March 2020

నేతి వడ్డన-ఒక చాటువు


నేతి వడ్డన-ఒక చాటువు
ఆనంద తాండవ పురే ద్రవిడస్య గేహేl
చిత్రం వశిష్ట వనితా సమం ఆజ్య పాత్రంl
విద్యుల్లతేన పరిణుత్యతి తత్ర దర్వి l
దారాంబు లోకయతి కస్య నయోగి సిద్ధాఃll
చిదంబరేశ్వరునిది ఆనందతాండవము. అందుచే చిదంబరమునకు ఆనందతాండవ పురము అన్నది మరియొక పేరు. అవి భోజనవిక్రయశాలలు లేని రోజులు. అతిథి కొరకై గృహస్తు వీధుల కూడలిలో వేచి ఆయనను సాదరముగా ఆహ్వానించి ఇంటికి గొంపోయి ఆయన తృప్తి మేరకు కొసరి కొసరి వడ్డించి తినిపింపజేసే రోజులవి. ఆ ఊరికి క్రొత్తగా వచ్చిన బ్రాహ్మణుని ఒక గృహస్తు తనయింటికి భోజనమునకు సాదరముగా అహ్వానించినాడు. సంతోషముతో ఆ అగుంతకుడు ఆ గృహస్తును అనుసరించినాడు. ఇంతవరకు అంతా సవ్యముగానే జరిగింది.
కాళ్ళు కడుగుకొని వచ్చి అతిధి ఆసనము అలంకరించినాడు. అరటియాకు కడిగి, వేసి వండిన వంటకము వడ్డించినది ఆ ఇల్లాలు. ఆ ఇల్లాలి చేతిలోని నేతిపాత్రాయే కనిపించీ కనిపించనంతగా ఉంది. వడ్డన ముగిసిన తరువాత అభికరణము అంటీ అన్నముపై నేతిచుక్క రాల్చి ఇక భోజనము చేయండి అనుట సాంప్రదాయము.  ఇక భోజనము ఆరంభించండి అని ఆ ఇల్లాలు, అతిథితో  అనుటతో ఆతంతు ముగిసింది అని ఊహించినాడు అతిథి. నిజానికి అతనికంటికి ఆ రాలినచుక్క కనిపించలేదు. ఆ బ్రాహ్మడు  అన్నములో పప్పు కలిపి నెయ్యి వడ్డించమని అడిగినాడు. మిళ్ళె నేతిపాత్ర అడుగునకు ఠంగుమన్న శబ్దముతో తాకించి ఉరుము శబ్దమును గుర్తు చేసిన ఆయువతి ఆ మిళ్ళెను వ్రేళ్ళతో అత్యంత లాఘవముగా కదిలించి నేతి చినుకును రాల్చింది. అతిధికి ఉరుము వినిపించింది మెరుపు కనిపించింది, కానీ అన్నము మేతుకులపై నేతి చినుకులు మాత్రము అగుపించలేదు. భోజనము ముగిసిన పిదప తన ఊరు వెళ్లి ఆ బాపడు తన మిత్ర బాంధవులతో పై ఉదంతమును, ఇల్లాలి చాకచాక్యమును పైవిధముగా వర్ణించి చెప్పినాడు.
వర్ణనా చాతుర్యమును గమనించండి ఎంత గొప్పగా ఉన్నదో!
స్వస్తి.

1 comment: