Tuesday, 10 December 2019

ప్రతి పర్వం రసోదయం-ఒక చాటువు


ప్రతి పర్వం రసోదయం

https://cherukurammohan.blogspot.com/2019/12/blog-post.html
అనగా అనగా ఒక రాజు. ఆ రాజుఆశ్రయం కోరి ఒక కవి వచ్చినాడు. సామర్థ్యము కలిగినవానికే రాజువద్దకు వెళ్ళే ధైర్యము ఉంటుంది. అట్లుకాకపోతే అర్థించి రాజు యొక్క అనుగ్రహము పొంది తృణమో పణమో తీసుకొని పోతారు. ఈ కవి కొంత సత్తా ఉన్నందువల్ల కావచ్చు రాజు పరీక్షకు నిలచినాడు.
రాజుగారు ఆ కవిని  ఈవిధముగా అడిగినాడు “ ఓ కవీ! భారతాన్ని, చెరుకుగడని, సముద్రాన్ని ఒకే విధముగా ఒకే శ్లోకములో  వర్ణించుము” అని. అప్పుడు ఆ కవి “ఓ రాజా! ఒకే పాదంలో మూడింటిని వర్ణిస్తాను” అని చెప్పి (పై శ్లోకంలో నాల్గవ పాదం) “ ప్రతి పర్వ రసోదయం” అని వర్ణించినాడు.
భారతం, ఇక్షుఖండంచ
సముద్రమపి వర్ణయ
పాదే నైకేన వక్ష్యామి
ప్రతిపర్వ రసోదయం
అంటే:
భారతంలో భాగాలను ‘పర్వములు’అంటారు ( భారతం పదునెనిమిది పర్వాలను కలిగియుంది.) ఇక 'ఇక్షువు' అంటే చెరుకుగడ. చెరుకు కణుపులను సంస్కృతంలో పర్వములని అంటారు. అలాగే పర్వము అంటే పండుగ అని కూడ అర్థముంది. పర్వదినాలు అన్న మాట మనము వాడేదే కదా! ఆకవి "అయ్యా మీరు చెప్పిన మూడింటి రుచీ ఒకే పాదములో చెబుతాను" అని అన్నాడు.
ఇప్పుడు పర్వముతో ఏ విధముగా రసోదయమైనదీ చూదాము. భారతంలో ఏ పర్వము చదివినా రససిద్ధి కలుగుతుంది అంటే రసోదయమౌతుంది. అలాగే చెరుకుగడ ప్రతి కణుపులోను చక్కని రసం ఊరుతుంది. చెరుకు రుచిని గూర్చి నేను చెప్పనవసరము లేదు. కాబట్టి ఇక్షుపర్వముతో కూడా రసోదయమైనట్లే కదా! అట్లే సముద్రుడు ప్రతి పర్వదినానికి ( పున్నమి రోజులలో) కెరటాలతో ఎగిసి ఎగిసి పడి ఆనందిస్తాడు. మరి సముద్రునిలో రసోదయమైనట్లే కదా! ఎంత గొప్ప వర్ణనో  గమనించినారుకదా! 
కవి చమత్కారము అంటే అదే!


No comments:

Post a Comment