Sunday, 25 August 2019

వైద్యో నారాయణో హరి:


వైద్యో నారాయణో హరి:
https://cherukurammohan.blogspot.com/2019/08/blog-post_60.html
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరేl 
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి:ll 
శరీరం అశాశ్వతం. దీనికి జరామరణాలు సహజం. ప్రాణాలు ఉన్నకాలంలో శరీరాన్ని బాధలపాలు చేసేవి వ్యాధులు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నది పెద్దలమాట. మనం చేసిన పాపాలకు ప్రతిరూపాలుగా రోగాలు మనను ముసిరి ముప్పుతిప్పలు పెడతాయి. రోగానికి ధన్వంతరిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు. ఎన్నో ఔషధాలను తయారుచేసి మాన వాళికి అందించాడు. ఆ విధంగా నారాయణుడు ధన్వంతరి రూపు దాల్చి  వైద్య నారాయణుడైనాడు. ఆయన జగ త్తునకే వైద్యుడు. ఆయన సృష్టించి ఇచ్చిన దివ్య ఔషధం గంగాజలం. ఇప్పుడు కాలుష్యం బారిన పడినా గంగ లోని మౌలిక లక్షణాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సజీవంగానే ఉంటాయి. దాన్ని అసలు  కలుష్యము నుండి  కాపాడుకోగలిగితే  నిజానికి దేశాన్నే ఆరోగ్యముగా ఉంచినవారమౌతాము. ప్రాణమే పోతుంది అన్న క్షణంలో గంగా జలం తాగి లేచి కూచున్న వారెందరో మన సామాజిక అనుభవములో అగుపించుతారు. గంగాజలము  అందుబాటులో లేనివారు ఇప్పటికీ తులసీతీర్థం ప్రాణము పోయే సమయములో రోగికి పోయడము చూస్తూనేవుంటాము. బ్రతకలేదు అంటే ఋణము తీరింది అనిగానీ భగవంతుని అనుమతి లేదు అనిగానీ తలువవలసి ఉంటుంది.
అసలు వ్యాధి అన్నది ఏ పూర్వజన్మ వశాత్తో సంక్రమించితే దానిని తొలగించుకొనుటకు వైద్యశాస్త్రములో ఏమి చెప్పబడిందో ఒకసారి గమనించండి.
“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్ఛాంతిః ఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

అంటూ శారీరక,మానసిక రుగ్మతలకు ఉపశాంతిగా ఔషధులు,దానాలు,జపాలు,హోమాలు చేయుట ద్వారా తగ్గించుకొనవచ్చునని చెప్పబడినది. కలిమాయలకాలవాలమైన ఈ కాలములో కనికరించి మంచి చేసే మనిషి దొరికితే తప్పకుండా హోమము కూడా సత్ఫలితమును ఇస్తుంది. కొంత అసంగతమని పాఠకునికి అనిపించినా కొంచెము హోమ సమిదేలను గూర్చి తెలియజేస్తాను.  హోమములో నవగ్రహములలో ఒక్కొక్క గ్రహమునకు ప్రీతికరమైన ఒక్కొక్క సమిధ ఉపయోగించుట వలన ఒక్కొక్క రోగము నివారించబడుతుంది.

హోమ ధూమము కంటిని  కప్పుట వలన కంటిలో ఉన్న నలతలన్నీ కన్నీటి రూపములో వెళ్లిపోతుంది. హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే వేరు వేరు సత్ఫలితాలు సమకూరుతాయి.

రవి:-తెల్లజిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది.తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి. కోపము యొక్క తాపము తగ్గుతుంది. తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం తెల్లజిల్లేడుకు  కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుందని ఆయుర్వేద వైద్యులు చెప్పేవారు..

చంద్రుడు:-మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు.ఆలోచనావిధానంలో మార్పులు వస్తాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు,గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు,గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది అని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతూవుంటారు.

కుజుడు:-చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుందంటారు. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం,కోపస్వభావాలు తగ్గుతాయని చెబుతారు.

బుధుడు:-ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాదులు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పూల్లతో గాని,వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి. ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయి అన్నది విజ్ఞుల వాక్కు.

గురువు:-రావి సమిధలతో హోమంచేస్తే సంతాన ప్రాప్తి జరుగుతున్దంటారు. ఈ ధూమము శరీరములో చేరి భార్యాభర్తల దోషములను భారించుతుందని చెబుతారు .రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి. నోటిపూత పోతుంది. రావి చెక్కకాషాయాన్ని రోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

శుక్రుడు:-మేడి చెట్టు సమిధలతో హోమంచేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంద సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు ఉంటారని అంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది అని వైద్య శాస్త్రమున చెప్పబడినది. దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుందంటారు.

శని:-జమ్మి సమిధలతో హోమంచేస్తే అప మృత్యు భయం తొలగి పోతుందణి శాస్త్ర వచనము. దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. జమ్మిచెట్టు గాలి శరీరానికి కలిగిన ఇబ్బందులు తొలగించుతుంది. ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసినచో దీర్ఘకాల అస్వస్థతలు తొలగిపోతాయి.

రాహువు:-గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి,చర్మంపైన ఉన్న కురుపులపై పెట్టిన ఎడల చర్మరోగాలు నివారించబడతాయి. దెబ్బతగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.

కేతువు:-ధర్భలతో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.

జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి అని చెబితే ఇంట్లో స్థలం లేదని దేవాలయంలోనో, మరెవరైనా ఇంట్లోనో హోమాలను చేయించుట కూడా కద్దు.  ఈ విధముగా చేయుటవల్ల గ్రహ బాధలు తొలగిపోవు. ఇబ్బంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే హోమం చేస్తే మంచి ఫలితము దక్కుతుంది. హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. హోమము ప్రత్యక్షముగా
మనకారోగ్యమును,  పరోక్షంగా నవగ్రహాల అనుగ్రహమును మనకు అందించుతాయి.
తిరిగీ అసలు విషయానికొస్తే ..........
రోగపీడల నుంచి జీవజాతులను కాపాడి ఆనంద తీరాల వైపు నడి పించగల మహనీయ మూర్తి విష్ణుమూర్తి. ఒకరిని బతికించాలన్నా, సంహరించాలన్నా విష్ణుమూర్తి సంకల్పించుకోవాల్సిందే! అందుకే గీత లో కూడా అధర్మవర్తనులైన రాజలోకాన్ని చంపినట్లు భగవంతుడు చెబుతాడు. అదే ధోరణి అన్నిటా వర్తిస్తుంది. రోగకారకుడు, రోగ నిర్మూలకుడు కూడా ఆయనే! అందుకే ‘నాహం కర్త హరి: కర్త’ అన్న శాస్త్ర వాక్యమును అక్షరాలా మనము పాటించితే భూమిపై ఉన్నా భూమి దాటుకున్నా ఆనందముతోనే ఉండగలము. కర్త నారాయణుడు. ఆయన అనుగ్రహంతో చికిత్సకు, వైద్య ప్రక్రియకు పూనుకునేవాడు వైద్యుడు. పూర్వము నారాయణుని ప్రతినిధిగా వ్యవహరించేవాడు వైద్యుడు, ఇప్పుడు పార్టీ ఫిరాయించి యముని మినిస్ట్రీ లో చేరినాడు.యముని ప్రభుత్వమునకు కలిపురుషుడు Chief Secretary అయినాడు. అందుకే ఈ నూతన నారాయనుడైన వైద్యునిచేతిలో రోగి హరీమంటున్నాడు.    ఈ విషయము అందరు వైద్యులకు వర్తించదు. లోకములో విధి బాధ్యత కర్తవ్యముగా నెంచి చికిత్స చేసే వైద్యులు కూడా ఉన్నారు. ఎటొచ్చీ మేకకు Butcher ఎవరు Vet. Doctor ఎవ్వరు అన్నది నిర్దుష్టముగా తెలియవలసిన అవసరము ఎంతో వున్నది.
ఆది వైద్యుడు ధన్వంతరి రూపుడైన విష్ణువే కావచ్చు కానీ  వైద్యవిద్యకు ఆద్యుడు బ్రహ్మ. ఆయన దక్షప్రజాపతికి దాన్ని అందించినాడు. ఆయన ఆశ్వనీదేవతలకు అందించినాడు. వారు ఇంద్రుడికి అప్పగించినారు. ఆయన భరద్వాజ మహర్షికి ఇచ్చినాడు. ఆ మహర్షి ఆత్రేయ మహర్షికి ఇచ్చినాడు. ఆయన పునర్వసుకు, ఆయన అగ్నివేశుడికి ఇచ్చినాడు. ఆ తర్వాత ఈ విద్యలో విశేష పరిశోధనలు చేసినవాడు చరకుడు. ఆయన సాంఖ్య, వైశేషిక, న్యాయ శాస్త్రాల నుంచి సాంకేతిక పదాలను స్వీకరించి వైద్యం ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆది దైవికాలకు భిన్నమైనదికాదని ఇది కూడా ఒక వైదిక కార్యమేనని నిరూపించినాడు. ఈ రోజులలో డాక్టర్లు చదువుకుంటున్న అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, క్లినికల్‌ మెడిసిన్‌ వంటి పలు అంశాలను చర కుడు ఆనాడే స్పృశించినాడు. ఆ తర్వాత వచ్చిన వాడు శుశ్రుతుడు. ఆయన శుశ్రుత వ్రాసినాడు. ఈయనను మొదటి శస్త్ర చికిత్సకునిగా పాశ్చాత్యులు కూడా గుర్తించినారు.
మనకు సనాతన వైద్యవిద్యగాఅందివస్తున్న ఆయుర్విద్యను ఉపవేదంగా  గుర్తించి మన పెద్దలు దానిని ఆయుర్వేదమన్నారు. ఈ విద్యకు అథర్వణ వేదం తల్లి. ఈ వేదం నుండి పుట్టిన గర్భోపనిషత్తు కూడా ఆయుర్వేదమునకు ఉపాంగమైయున్నది.
చాణుక్యుని నీతిశాస్త్రము ఈ విధముగా అంటూవున్నది:
ధనిక: శ్రోత్రియో, రాజా, నదీ, వైద్యస్తు పంచమ:
పంచ యత్ర నవిద్యంతే తత్ర వాసం న కారయేత్‌
ధనికుడు, బాగా చదువుకున్నవాడు, రాజు, నది, వైద్యుడు- ఈ అయిదుగురు లేని ఊళ్ళో ఉండకు అని దాని అర్థం. ఇదే క్రమం కాకపోయినా, ఒక్క రాజును వదలి, దాదాపు ఇలాంటి మాటే అన్నాడు సుమతీ శతకకారుడగు మన బద్దెన కవి
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు ఎడతెగకపారు యేరును, ద్విజుడున్‌
చొప్పడిన నూర నుండుము
చొప్పడకున్న ఊరు చొరకుర సుమతీ!
నేటి వైద్యుల పరిస్థితికి నేను వ్రాసిన  ఈ శ్లోకము అద్దము పడుతుంది గమనించండి.
రోగార్తస్య భిషక్ దేవో రోగాంతేచ భిషక్ నరఃl
మూల్య పత్ర ప్రదానేన వైద్యో భవతి రాక్షసఃll
వ్యాధిగ్రస్థునికి వైద్యుడు దేవునివలె కనిపించుతాడు. రోగము ఉపశమించిందంటే ఆదిదేవుడు, రోగము కుదిరిన వానికి సాధారణ మానవునిగా కనిపించుతాడు. అదే వైద్యునికి డబ్బు ముట్టజెప్పేటపుడు, వైద్యుడు రక్కసునిగా అగుపించుతాడు.
నిజమే కదా!
స్వస్తి.


No comments:

Post a Comment