భగవద్గీతలోని
పదమూడవ అధ్యాయమగు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని మొదటి శ్లోకము ఈ విధముగా
వుంటుంది.
ఇదం
శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో
వేత్తి తమ్ ప్రాహుఃక్షేత్రజ్ఞ ఇతి తద్విదః
క్షేత్రము
అంటే శరీరము. క్షేత్రజ్ఞుడు తానేనని పరమాత్మ వెంటనే రెండవ శ్లోకములో తెలుపుతాడు.
ప్రతి జీవి శరీరము ఒక క్షేత్రమయితే క్షేత్రజ్ఞుడు పరమాత్మ అయితే ఆయన ప్రతి
జీవిలోనూ,
ముఖ్యముగా ఆవిషయమును గ్రహించగలిగిన మానవునిలో ఆత్మయై ఉన్నాడన్న
విషయము మనకు తెలుస్తుంది.ఇదే విషయాన్ని పరిపరి విధములుగా విశదీకరించి ప్రవచనకారులు
చెబుతూ వుంటారు.జనసామాన్యమును రుజుమార్గములో నడిపింప కంకణము కట్టుకొన్న వారి ప్రతి
మాట బహిర్గతమగుటకు ముందు ఆత్మకు సమర్పించుకోనవలసి వుంటుంది. పులుపుకు ఉప్పు,
చేదుకు తీపి ఎట్లు వ్యతిరిక్తముగ ఉన్నవో అట్లే శరీరములో కామమునకు
దానము, కోపమునకు దయ, లోభమునకు ఔధార్యము,
మోహమునకు వైరాగ్యము, మదమునకు వినయము, మత్సరమునకు ప్రేమ అను వ్యతిరిక్తగుణములు కలిగి మంచిని పంచవలసియుంటుంది.
నేను
చెప్పదలచుకొన్న విషయమునకు పైన చెప్పినది ఉపోద్ఘాతమే! ఒక 3
సంవత్సరముల క్రిందటి మాట. పేర్లు తెలుపుట సభ్యత కాదు కావున నేను తెలుపుట లేదు. ఒక
వ్యక్తి ఒక ప్రవచనకారుని వద్ద శిష్యునిగా వుండి, నాకు
తెలియని కారణముల వల్ల వేరొకరి శిష్యుడయినాడు. అది తనకు తానే నాతో చెప్పిన మాట.
కొంత కాలము తరువాత అతను 'గురువుగారు గోశాల ఏర్పాటు
చేస్తున్నారు, దానికి ఆర్ధిక సహాయము చేయమని నన్ను అడిగినాడు.
జవాబుగా నేను ' నాయనా నాలాంటివారు ఆ మహానుభావునికి ఇచ్చేటంత
వసతి లేనివారు, రాజు తలచుకొంటే అన్నట్లు ఆయన ఎ
వ్యాపారవేత్తనో, పారిశ్రామిక వేత్తనో, ప్రభుత్వ
ప్రధాన యంత్రాంగాధికారినో అడిగితే ధనము ఆయన వద్దకు వరదయై వచ్చి చేరుతుంది అని
చెప్పినాను.ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది ఏమిటంటే, ఆ వ్యక్తి
నాకు తెలియజేసినట్లే ఇంకా ఎంతో మందికి పంపి ఉంటాడు కదా! ఆ విధముగా పంపబడినవారిలో ఆ
ప్రవచనకారునికి ముఖ్యుడగువాడు వుండే అవకాశము వుంది. అట్లుకాకున్నా ఇటువంటి
విషయములు దావానలమై ఆతనికి చేరే అవకాశము వుంది. మరి ఇన్ని ప్రసార మాధ్యమములు
ఉండికూడా ఆయన అటువంటి వారిని నమ్మవద్దు అని ఇచ్చిన ప్రకటన నేను చూచుట
తటస్థించలేదు.
దాదాపు
ఒక 8,10,
నెలల క్రితము మన దేశ సైన్యమునకు మద్దత్తుగా ఒక సన్నిహితుడు సైన్యము
యొక్క చిహ్నమును నా WhatsApp కు అనుసంధించినాడు. ఆతరువాత
కొన్ని రోజులకు ఆ ప్రవచనకారుని భక్తగణము ఒక WhatsApp సమూహమును
తయారుచేసి, వారు నన్ను విశ్రాంత సైనికాధికారిగా తలచి,
తమకు తామే నన్ను అందులో చేర్చుకొని, ఆ ప్రవచన
కారుడు మహిమాన్వితుడైపోయినాడు, ఆయన సాక్షాత్తు దైవస్వరూపమే!
అందువల్ల సతీసమేతుడగు ఆయన ఛాయా చిత్రమును పూజగదిలో వుంచుకొని ప్రార్థించితే
ధనవంతునివి కాగలవు అనే వార్త పంపినారు. నేను స్పందించలేదు. తరువాతిరోజు
సతీసమేతుడగు ఆయన చాయాచిత్రమును పంపి ఆ పాదాలను సేవించితే అన్నికష్టాలూ వెనువెంటనే
తొలగిపోతాయి అన్న సందేశమును పంపినారు. అది చూసి నేను ఆ సమూహమును వదలిపెట్టినాను,
తక్షణమే!
ఆయన
వ్రాసిన ఒక పుస్తకములో రుద్రము లోని ప్రార్థనా శ్లోకములోని ' ఏకం
ఈశం అనిశం' నకు బదులుగా 'మీనం మేషం
మహిషం' అనియుండుట నేను చూచుట తటస్తించినది. ఆయన గొప్పవాడు.
విషయ పరిజ్ఞానము అధికముగా వున్నవాడు. సంఘములో అధికముగా గుర్తింపబడిన
ప్రతిభావంతుడు. పుస్తకము యొక్క proof ను ఆయన చూడకుండినా ఆయన
శిష్యులలో విషయ పరిజ్ఞానము గలవారు చూసియుంటారుకదా! పోనీ పుస్తకము వెలికి వచ్చిన
తరువాతనయినా ఎదో ఒక భక్తుడు వారికి తెలియజేసే అవకాశము లేకపోలేదు కదా! ఇది పొరబాటు
అని వారు కానీ వారి ప్రతినిధి కానీ చెబితే బాగుండేదికదా!
ఇవి
చాలా కాలము క్రితము జరిగినవి. ఈ రోజు యెందుచేత చెప్పవచ్చినానంటే నేను పైన తెలిపిన
సంఘము వంటిది,
ఆయన మహిమలను గూర్చి ఆస్య గ్రంధిలో ఒక 3 రోజుల
క్రితము ప్రచురించియుండినారు. ఇది రానురాను చిలువలు పలువలై అమాయకులు ఎర ఔతారను
ఉద్దేశ్యముతో వ్రాసినాను. నేను వారి కున్నంత విజ్ఞత కలిగినవాడిని కాదు. ఆయనవేద
పురాణ శాస్త్రేతిహాసములు తెలిసినవానిగా గుర్తింపబడినవాడు, ఆ
విధముగా సంఘములో గౌరవ ప్రతిష్ఠలు గలవాడు కావున భగవద్గీతలో చెప్పినట్లు
యద్యదాచరతి
శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స
యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||
3-21 ||
ఆయన
చెప్పినది వేదం చేసినది మోదం. సాధారణ జనులు ఆయనను భగవదంశగా నమ్మి పాటించే అవకాశము పుష్కలము.
ఇప్పటికే చాలా మంది బాబాలతో స్వాములతో నిండిన ఈ సమాజమునకు ఇంకొకరిని చేర్చి సాధారణ
జనులను అయోమయము లోనికి నెట్ట వద్దు అన్న ఉద్దేశ్యముతో ఈ నాలుగు మాటలు వ్రాసినాను.
భక్తజనాళి ప్రత్యక్షముగా ఆయన మహిమలు చూసే అవకాశము కలిగినపుడు వారే ఆయనకు భక్తులౌతారు, ప్రచారకర్తలౌతారు.
ప్రసార మాధ్యమాలధికముగావున్న ఈ కాలములో ప్రచార మాధ్యమాలు పెద్దగా అవసరముండదు.
దీపమును ఎక్కువసేపు చేతులతో కప్పియుంచలేము కదా!
అతి సర్వత్ర వర్జ్యేత్
సర్వేజనాస్సుఖినోభవంతు.
సర్వేజనాస్సుఖినోభవంతు.
No comments:
Post a Comment