Friday, 15 June 2018

సమస్య : గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్


సమస్య : గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

ఈ సమస్యను గూర్చి ఒక మాట ముందు చెప్పవలసియుంటుంది. ఈ సమస్య కందపద్యము యొక్క రెండు లేక నాలుగవ పాదము. దీనిని రెండవపాదములో ఇమిడ్చి పద్యము పూరించలేము. కావున ఇది కందమునకు నాలుగవ పాదమే కావలెను. ఇక ఇది కందపద్యము కాబట్టి యతి ప్రాస నియమములు వుంటాయి. యతి తో సమస్య లేదు కానీ ప్రాస కొంత క్లిష్టమే!  ఇందు బిందు పూర్వక రేఫాయుక్త  డకార ప్రాస దుష్కరమగు ప్రాసయే. నేను 26 వతేదీ జూన్ 2౦16 లో ఈ సమస్యను నాదగు రీతిలో పూరించియుండినాను. దీనికి అవధానుల పూరణలు వున్నట్లు మిత్రులు డాక్టర్ ప్రభాకర రెడ్డి గారు తాము రచించి ప్రెమతో 13 జూన్ 2018 న నాకు పంపిన నాలుగు పుస్తకములలో ఒకటగు సాహితీ 'రసాయనము'నందు  తెలియబరచే వరకు నాకు తెలిసిరాలేదు. ఇందు తత్సమ శబ్దములను యండ్రాముడు, కోదండ్రాముడు అని వాడుత జరిగింది. ఈ ప్రయోగములను వ్యాకరణము ఒప్పుకొనదని పెద్దలు చెప్పగా విన్నాను. ఆ పద్యములను మీకై ఇచట పొందుపరచుచున్నాను. నేను వ్రాసినది చిత్రరూపమున (Image) మీముందుంచబోవుచున్నాను. చదువగలరు.
1. ఉండ్రాని యడవి లోపలి                                                2.ఉండ్రా యోరి దురాత్మక
గుండ్రాయై యున్న మౌని కోమలిపై గో                                    యిండ్రా ప్రాసమ్ము కవుల కీయ్యందగునా
దండ్రాము పదము సోకిన                                                       యండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళువచ్చి గునగున నడచెన్                               గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్                
నా పూరణను చిత్తగించండి
కొండ్రాళ్ళ నడుమ చక్కని
గుండ్రాయిని జూపి మేస్త్రి కూలీలకు తా
తెండ్రా యని చెప్పగనే

గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
చెరుకు రామ మోహన్ రావు



                                                                                         

Wednesday, 13 June 2018

ఉత్తమ పురుషుడు


ఉత్తమ పురుషుడు
సహా ధర్మపత్నిగా స్త్రీ ఏవిధముగా వుండవలెననేకాదు, పురుషుడు ఏవిధంగా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది, కానీ ఎందుకోఈ శ్లోకము అంతగా జనబాహుళ్యం లో లేదు.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
1.కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి
2. కరణేషు దక్షః : కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
3. రూపేచ కృష్ణః: రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి.
4. క్షమయా తు రామః: ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి
5. భోజ్యేషు తృప్తః: భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
6. సుఖ దుఃఖ మిత్రం: సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు

Monday, 11 June 2018

శతభిషం - శత భిషజ - శతతార


శతభిషం - శత భిషజ - శతతార
https://cherukurammohan.blogspot.com/2018/06/blog-post_11.html
శతభిషము అన్న పదమునకు బదులుగా ఈ శతతార అన్న అన్న మాటను విక్రమార్కుని నవరత్నములలో ఒకడగు వరరుచి మొదటిసారిగా వాడినట్లు తెలియవస్తూవుంది. దానినే, అదే రాజాస్థానము లోని కాళిదాసు - 1, రఘువంశ, కుమారసంభవాది కావ్య నాటక రచయిత, 'మండలాభ శతతారక పురైః' అని తా తన కావ్యములయందు ఒకదానిలో వాడినాడు.   ఫలానా కావ్యమన్నది నిర్దుష్ఠముగా నాకు జ్ఞాపకము లేదు.
శత అన్న పదము నూటికి సంకేతమని మనకు తెలిసినదే! శతభిషము అంటే శతతార అంటే నూర్లకొద్దీ తారలను కలిగినది అని అర్థము, నూరు తారలు మాత్రమే అనికాదు. మనపూర్వులు  27 నక్షత్రాలను గుర్తించి వానికి అశ్వని, భరణి, కృత్తిక  మొదలగు 27 పేర్లను పెట్టినారు. ఖగోళ శాస్త్రములో వాణి వర్ణన విస్తారముగా చేసినారు. అవి నిజానికి కొన్ని తారకల సమూహములు.  దేని దేనిలో ఎన్నెన్ని వున్నాయన్నది వారే వాకృచ్చినారు. ఆవిధముగా చెప్పబడినదే శతభిషము.
ఇక్కడ మనము ఒక విషయమును గ్రహించవలసియుంటుంది. మనము మన పూర్వుల వ్రాతలకు కొన్ని కొన్ని అన్వయములను చేసుకొంటున్నాము, ఎందుకని

కారణమేమిటంటే పూర్వులు తరువాతి తరములవారు సులభముగా గుర్తుంచుకొనుటకు గానూ తాము చెప్పదలచినది శ్లోకరూపములో వ్రాసినారు. సాధారణముగా శ్లోకమునకు రెండు పాదములు. మరి తెలుపదలచిన భావమును స్థలాభావము లేకుండా చెప్పుటకు మరియు పాఠకుడు సులభముగా గుర్తుంచుకొనుటకునూ ఈ విధముగా వ్రాయుట జరిగినది. అందుకే ధారణ గలిగినవారు నేటికీ, మహా కావ్యములను కూడా కంఠస్థము చేసియుండుట మనము చూస్తూనే ఉన్నాము. పై పెచ్చు శ్లోకము అంటే చందోబద్ధమై వుంటుంది. కావున అర్థము చెడకుండా తగిన పదమును వారు ఆచితూచి వేస్తారు. కావున విశ్లేషణ తప్పదు. అసలు ఈ విధముగా కంఠస్థము చేసుకొని ఉంచుకొనుట చేతనే వేదశాస్త్రపురాణాదులు భూమిపై నిలచినవి. లేకుంటే అన్నీ అగ్నికి ఆహుతయి ఉండేవి తురుష్క పాశ్చాత్య పాలనలలో!

తిరిగీ విషయమునకు వస్తే శతభిషము కుంభరాశికి చెందినది. దానికి అధిపతి వరుణుడు. ఆతని వాహనము మకరము. ఎందుకంటే ఆకాశములో క్రింద మకర రాశి పైన కుంభరాశి ఉంటుంది. రాసుల పేర్లు చెప్పేసమయమున మకరము తరువాతనే కదా కుంభము వస్తుంది. ఈ కుంభరాశికి అధిపతి వరుణుడు. వరుణునికి క్రింద మకరము వున్నది కావున, వరుణుని వాహనము మకరమైనది. ఒకవేళ అదే కుంభమునకు పైన వుండి వుంటే ధ్వజమై వుండేది.

ఈ 27 నక్షత్రములు సూర్య గతితో సంబంధమున్నవి. ఇవికాక అనంతమగు నక్షత్రములు నింగిలో మనకు కనిపించుతాయి. అందులో దక్షిణార్ధగోళములో కనిపించే ఒక నక్షత్రము అగస్త్య నక్షత్రము. ఇది మన భారతీయ ఋషులు ఆ నక్షత్రమునకు పెట్టుకొన్న పేరు. దీనినే ఆంగ్లములో Canopus అంటారు. ఆవిధముగా దానికి దగ్గరగా కనిపించే ఇంకొక నక్షత్రము ‘ఇంద్రద్యుమ్న’ నక్షత్రము. ఇది చాలా పొడవైన నక్షత్రమని చెబుతారు. బహుశ ఆయన కీర్తి అంతగా విస్తరించినది అన్న మాట అందుకే చెబుతారేమో! ఆంగ్లములో FOMALHAUT అని వ్రాస్తారు FOMALO అని పలుకుతారు. ఇక్కడ మేరు పర్వతమందు ద్రోణము అంటే లోయలో వరుణుని వనము అందు తటాకము అందు ఆయన వాహనము మొసలి వున్నది.

 కృతయుగకాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా పరిపాలిస్తూండేవాడు. ఎన్నో యజ్ఞకార్యాలు కూడా చేయడంతో అతను మరణించిన పిదప స్వర్గము చేరినాడు. ఆయన  స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తూ ఎంతకాలం వుండినాడో అతనికే తెలియదు. ఒకరోజు ఇంద్రద్యుమ్నుని వద్దకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలము ముగిసింది తిరిగీ  భూలోకమునకు వేరొక జన్మతో  వెళ్లవలయు’ నన్నారు.

‘మరి నేను ఇంకా కొంతకాలము ఇచట వుండే అవకాశము లేదా అన్నాడు’ ఇంద్రద్యుమ్నుడు.  అప్పుడు ఇంద్రుడు ‘నీవుచేసిన పుణ్యకార్యములవల్ల ఇంకా నీపేరు భూమిపై తలచుకొనబడుతూ వుంటే నీకు ఇచట ఇంకా వుండే అవకాశము వుంటుంది’ అని అన్నాడు. ఇంద్రుని మాటకు వల్లెయని ఆయన దేవదూతలతో  భూలోకమునకు బయలుదేరినాడు. తన తదనంతరము ఎన్నో మార్పులు వచ్చుటచేత ఇంద్రద్యుమ్నునకు భూలోకము కొత్తగా కనిపించింది. తెలిసిన వారెవరూ కనిపించలేదు. భూలోకవాసులలో  చిరంజీవి మరియు అతి వృద్ధుడగు మార్కండేయునివద్దకువెళ్ళి  తననుగూర్చి అడిగితే ‘నేనపటికి పుట్టలేదేమో! అందుచే నాకు తెలియదు, నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబను అడిగితే  విషయము తెలియగలదు’ అన్నాడు మార్కండేయుడు.

 అందరూ కలిసి ఆ గుడ్లగూబ వద్దకు వచ్చి  అదే ప్రశ్న అడిగితే  ‘మీరెవరో నాకు తెలియదుకానీ నాకన్న వృద్ధుడగు  ‘నాళీకజంఘుడు’ అను కొంగను అడిగితే తెలుసుకొనే అవకాశము వున్నది’ అని చెబుతూ  అందరూ కలిసి ఆ కొంగ దగ్గరకు బయలుదేరినారు. ఇంద్రద్యుమ్నుని అదే ప్రశ్నకు ‘నాకన్న పెద్దయగు ‘ఆకూపారుడు’ అన్న తాబేలు కు తెలియవచ్చు,వెళ్లి అడుగుదాము రండి ’ అనుటచే అందరూ కలిసి నాడీజంఘుని వద్దకు వచ్చినారు. యథాలాపముగా రాజు  ‘నేనెవరో తెలుసా’ అని అడిగినాడు అకూపారుని. అందుకు అకూపారుడు ‘మిమ్ము నేనెలా మర్చిపోగలను. మీరు ఎన్నో యజ్ఞములు చేసి అపారమగు గోదానములు ఇచ్చుటచే లక్షలసంఖ్యలో తోలుకోనిపోబడుచున్న ఆ ఆవుల కాలి గిట్టల తొక్కుడు చేత ఈ కొలను ఏర్పడగా మాకిది వాసయోగ్యమైనది. ఎడతెగని నీటియూట గల్గిన ఈ హ్రదమునొదిలి వేరేచోటికీ వెడలు అవసరము మాకు కలుగలేదు అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని మీ పేరే పెట్టుకొన్నాము. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు. దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లటంజరిగింది. ఆయన తన పుణ్య ఫలము తీరిన తరువాత భూమిపై పుట్టి ప్రజారంజకముగా పాలన సాగించుచూ, ఎదో కారణమున అదే పర్వతమున తపము నాచారించు సమయమున వచ్చిన అగస్త్యునికి సముచిత గౌరవము సేయలేకపోయినందున అగస్త్యుడు "మదముచే కన్నూమిన్ను కానక వ్యవహరించినందుకు మదగజమువై పుట్టుము, నీ పరివారము కూడా ఏనుగులై నీతో ఉండుగాక!"" అని శపించుతాడు. ఆ గజేంద్రుడే మన గజేంద్రమోక్షము లోని గజేంద్రుడు.

ఇపుడు ఈ కథకు మన నక్షత్రమందలమునకు గల పోలిక చూస్తాము. బేయర్ అన్న పాశ్చాత్య శాస్త్రజ్ఞుడొకడు దక్షిణార్ధములోని అంటే మన దక్షిణాపథమునకు ఇంచుమించు 17౦౦ క్రీ.శ. లో వచ్చి ఆకాశమున కొంగను బోలిన నక్షత్ర సముదాయమును జూసి దానికి Gruss అన్న పేరును పెట్టినాడు. Gruss అంటే లాటిను భాషలో కొంగట. అట్లే అతను గుడ్ల గూబ ఆకారమును బోలిన నక్షత్రతతిని జూచి Phoenix అన్న పేరు పెట్టినాడు. క్రీ.శ. 1752 లో Lokeyt అన్న పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు తాబేలు వంటి నక్షత్ర సముదాయమును మన దక్షిణ దేశమున గమనించి దానికి Sculptor అన్న పేరును పెట్టినాడు. ఇపుడు కథలో వచ్చిన ముఖ్యమగు పేర్లతో నక్షత్రములున్నట్లు మనకు పాశ్చాత్యులు చెప్పుటచే, వారు మనకు ఆరాధ్యులగుటచే, రూఢియైనది. కథ జరిగినదా లేదా అన్న తర్కమును వదలి పెద్దలు ఆకాశములో కనిపించే వాస్తవాలతో చెప్పిన కథ మనము మరువము కదా!

భాగవత కథనము ప్రకారము ఈ మకరి బారిన పడి గజేంద్రుడు మోక్షము పొందుతాడు. పైన తెలిపిన ఇంద్రద్యుమ్నుడు అగస్త్యుని శాపముచే మదించిన ఏనుగుల రాజవుతాడు. పైన తెలిపిన అగస్త్య,ఇంద్రద్యుమ్న శతభిష నక్షత్రములున్నపుడు అక్కడ ఈ మత్తగజ నక్షత్రము ఉన్నదేమో! లేక ఇంద్రద్యుమ్న నక్షత్రమే ఆరూపమున ఉన్నదేమో! ఏనుగు శరీరము ఎక్కువ పొడవును కలిగియుంటుంది కదా! అదీ అంతరిక్షములో గజేంద్రుని కథ. నాకయితే ఈ విషయము తారసిల్లలేదు. ఇంకా శాస్త్రజ్ఞులు కనుగొనవలసి ఉందేమో!

స్వస్తి

 

Sunday, 10 June 2018

గీత - అధీత

గీత - అధీత
https://cherukurammohan.blogspot.com/2018/06/blog-post_10.html

               గీత - అధీత- 1వభాగము


భగవంతుడు తన సందేశమును తన అంశజుడగు వేదవ్యాసుని ద్వారా తాను అర్జునునికి తెలిపిన వేదాంత సారమును మనపై మక్కువ ఎక్కువగా కలిగినవాడై తెలియజేసినాడు.   
ఇక్కడ ఒక్క విషయమును తెలుపవలసి వుంటుంది. కృష్ణ శబ్దమునకు అర్థము నలుపు అన్నది మనకందరకు తెలిసినదే! అదే విధముగా అర్జున శబ్దమునకు ఒక అర్థము తెలుపు. ఒక తమాషా అయిన విషయము ఏమిటంటే ఈ రెండూ రంగులు కాదు. మనము వానిని రంగులుగా భావించుకొంటున్నాము. ఏదయినా చీకటి అంటే నలుపు వదిల్తే తెలుపు లోనికి రావలసిందే! అదేవిధముగా వెలుగు అంటే తెలుపు వదిలితే నలుపును చేరవలసినదే! ఈ తెలుపు నలుపే జీవాత్మ పరమాత్మ.
అర్జునునము అన్న పదమునకు కసవు, బంగారు అన్న రెండర్థాలు వున్నాయి. అర్జుని అనగా ఆవు అని ఒక అర్థము. ఇపుడు చూడండి, పరమాత్మ కశ్మల దూషితమగు మనసును తన గీతా బోధనచే సువర్ణము గావించినాడు. పేరు మారలేదు కానీ మనిషిలోని ప్రకృతి మారింది. ఇక అర్జుని అంటే ఆవు అని చెప్పుకొన్నాము.ఆవు పవిత్రతకు దైవత్వమునకు సంకేతమన్నది మనకు తెలిసిన విషయమే! అంటే నారాయణుడు తన గీతా బోధచే  నరుడగు అర్జునునిపై దైవత్వమును ఆపాదించినట్లే కదా! మహనీయులు చెప్పిన ఒక్కొక్క మాటకు ఎన్నెన్ని అర్థములుంటాయో చూడండి. ఇంకొక మాట గమనించండి. గో శబ్దమునకు ఆవు అన్న అర్థమే కాకుండా వేదములు అన్న అర్థము కూడా వున్నది. ఉపనిషత్తులు వేదసారమే కదా! కావున అవి కూడా గోవులే! ఆ గోవుల యొక్క పాలను  పితికి అర్జునుడు అన్న లేగకు అందిస్తున్నాడట. ఈ శ్లోకమును చూడండి.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనః|
పార్థో వత్సః సుధీభోక్తా దుగ్ధం గీతామృతం మహా||
ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారుసర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగాఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచిఒక ప్రక్క అర్జునునికి అందిస్తూనేమరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచినాడట. ఎటువంటి పోలికో గమనించండి. అందుకే కృష్ణుడంటాడు ‘మన వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః’. అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను అని కచ్చితంగా!   ఇనుముతో వస్తువును చేయించదలచినవాడు ఏవిధముగా  ఇనుమును కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడోఅలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించి కార్యోన్ముఖుని చేస్తాడు
ఒక్క మాటలో చెప్పాలంటే ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికములగు తాపత్రయములనడచు పారమార్థిక పదగమ్యసూచిక ఈ భగవద్గీత.
అన్య మతస్తుల మత గ్రంధములవలె కాదిది. అసలు మన సనాతన ధర్మము మతము కాదు, మనకు మత గ్రంధములూ లేవు. అన్య మతస్తుల మతగ్రంధములలో శవముల వద్ద చదివే ఆనవాయితీ ఉన్నదేమో నాకు తెలియదు. కానీ భగవద్గీత శవముల వద్ద చదువవలెనను వేదవాక్కు ఎక్కడా లేదు. అసలు వేదముల వయసు మనకు చెప్పతరము కాదు. పరమాత్మ నిశ్వాసమే వేదము అన్నది ఆర్య వాక్కు. వేదము అనంతము అనాది. గీత ఏమో 16 అక్టోబరు 3544క్రీ.పూ. అంటే ద్వాపరము ముగియుటకు (18 ఫిబ్రవరి 3102 క్రీ.పూ. కలియుగ ప్రారంభము)కొన్ని వందల సంవత్సరములకు పూర్వము నాటిది. మరి వేదము గీత శవముల వద్దచదివేది అని చెప్పలేదు కదా! ఆవిధముగా ద్వాపరములో చదువబడనూ లేదు. ఆత్మ దర్శనము చేయించి పరమాత్మయందైక్యమొనరిప జేసేది భగవద్గీత.
ఇంకొక ముఖ్యమగు విషయము. ఎందఱో మహానుభావులు గీతా మహాత్మ్యమును గూర్చి భగవత్ సాయుజ్యమును గూర్చి తాము పరిశోధించి అనుభవించి ఆనందించి అందలి సారమును అందజేసినారు. నేను వారితో పోల్చితే పిపీలికమునే అంటే చీమనే! అందువల్ల గీతా పఠనము ఆముష్మికమునకే కాదు ఐహికమునకు కూడా ఎంతో అవసరము అన్న విషమును గూర్చి నాకు తెలిసిన వరకు, జ్ఞాపకమున్నంత మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. అసలు వ్యక్తిత్వ వికాసమునకు గీతనొక ప్రామాణిక గ్రంథముగా మనము భావించవచ్చును. అందుకే వ్యాసులవారుభారతములో వున్నది ఎక్కడయినా ఉండవచ్చు గానీ అందులోలేనిది వేరెక్కడా ఉండదు అన్న సవాలును విసరినారు. కార్యశీలతకార్యనిర్వహణ దక్షత అన్న సమస్యలపై పాశ్చాత్యులు ముఖ్యముగా అమెరికా సంయుక్త రాష్ట్రీయులు సందేహ,బాహ్యభౌతిక మరియూ పరిధీగత (superficial, material, external and peripheral levels) కారణములను పరిగణనలోనికి తీసుకొని తగిన సూచననలను అందజేస్తారు. కానీ మన భగవద్గీత అట్లుగాక వృక్ష శాఖలను పరిగణించక వృక్షమూలములకు పోయి అచ్చటినుండి కాండము శాఖోపశాఖలు ఫలములు అన్న తర్కబద్ధ ప్రతిపాదనలతోవివరణాత్మక పరిశీలనలతో మనకు విషయమును తెలుపుతుంది. Think of the roots then think of the fruits. ఈ మూల మంత్రమును మనము ఆచరించితే సత్ఫలితమును అదే తెస్తుంది. పాశ్చాత్య పోకడలను అవలంబించుట చేత క్రమక్రమముగా యాజమాన్య వర్గము కార్మిక వర్గము అన్న చీలికలేర్పడి ఒకరిపైనొకరు ఎత్తులు వేసి జిత్తులు చేసి. కత్తులు దూసే స్థితికి తెచ్చుకొన్నాము. పనిలో పరమాత్మను చూసే సంస్కారము మనది. భగవద్గీత ఇదే చెప్పినది. ఈ దినములలో భగవద్గీత చదివేవారెంతమంది. 
మిగిలినది 
లో.........
గీత - అధీత- 2వభాగము
చాలా కాలము క్రితము నేను ఒకసారి నా మిత్రుని ఇంటికి పోయివుంటే ఆతడు ఒక అతి పురాతన భగవద్గీతను తెచ్చి నాకు చూపించి ‘ఇది మా ముత్తాత కాలమునుండి వస్తూవుంది. పారంపర్యముగా ఒకరినండి ఒకరికి ఇది ప్రాప్తిస్తూ వచ్చింది. ప్రొద్దుటే స్నానము చేసి దేవుని గదిలో వుండే ఈ గీతకు దేవతా విగ్రహములతో బాటూ నమస్కరించి మా పనులకు పోతాము’ అన్నాడు. ‘ఇది తెరిచి ఒక శ్లోకమయినా చదివినావా’ అంటే గీత దేవునితో సమానము తెరువ కూడదు అనిచెప్పి మా పూర్వులంతా అట్లే చేసినారని చెప్పినాడు. నా నోట్లో పచ్చివెలగ పడినట్లైనది. అదే భగవద్గీతను నాటినుండి చదువుతూ వచ్చియుంటే మనము అన్యులపై ఆధారపడనవసరము వుండేది కాదు.
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః I
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతి II
అంటే ఒక ఇంటికి గానీ సంస్థకు గానీ పెద్ద ఏ దారిలో పోతూ వుంటే మిగతా అందరూ అదే దారిలో పోతూవుంటారు. అదేకదా ‘యథా రాజా తథా ప్రజా’ అన్నారు. ఒక నిర్వాహకుని విధిబాధ్యతకర్తవ్యములను మనము ఈ క్రింది విధముగా వర్గీకరించుకొనవచ్చు:
స్వాప్నిక దృష్టిదానిని సాధించుటకు భవిష్యత్ ప్రణాళికావ్యూహమును ఊహించగల బుద్ధి చాతుర్యము దానివల్ల ఏర్పడు నాయకత్వ లక్షణమువినూత్న ఆవిష్కరణలచే క్రొత్తక్రొత్త పోకడలచే  సంస్థాగతశ్రేష్ఠతను అభివృద్ధిచేయుటకు తగిన మేధోవికాసముమానవ వనరులను అభివృద్ధి పరచుట అంటే పరస్పర అవగాహన పరస్పర సహకారము వానివల్ల ఏర్పడే పరస్పర అభిమానము, సంఘీభావముస్ఫూర్తి,  ప్రాతినిధ్యము పరస్పర అనుసంధాన నైపుణ్యము మరియు తమ కార్యాచరణలో ఏర్పడ్డ కంటక పరిశీలన మరియు నివృత్తి , వంటి  విషయములపై చక్కనయిన అవగాహనను ఏర్పరచుకొనుటయే గాక తదీయాచరణమును చక్కనయిన రీతిలో ప్రదర్శించుటకు గీతా గరిత అసమాన రీతిలో సహకరించుతుంది సాధకునికి.
త్రిగుణాత్మకమగు శరీరములో శ్రేష్ఠమగు సత్వగుణ సముపార్జన చేయుట మరియు దానివలన కలుగు లాభములను గూర్చి భగవద్గీత లోని జ్ఞానవిజ్ఞాన యోగము(7వ విభాగము) లో పరమాత్మ చెప్పిన ఈ విషయమును ఎంతో శ్రద్ధతో గమనిమనించలసియున్నది.
ఏచైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే
మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వాహం తెషుతే మయి 7-12
సత్వరజస్తమోగుణములు నా నుండియే ప్రభవించు చున్నవి కానీ ఆ వెలువడిన గుణములలో నేనుకానీ, నాలో అవి కానీ లేవు. అంటే అవి ‘మానవ జన్మి’ లో ప్రవేశించిన పిదప తద్గుణానుగుణముగా ప్రవర్తించుచున్నాడు మానవుడు. అది అతని కర్మఫలమౌతూవుంది. ఈ ఉదాహరణ చూడండి.
నలుపు అన్నది, ముందే, ఏ రంగూ కాదు అనుకొన్నాము. కేశ సంపదను మన ఉదాహరణము కొరకు తీసుకొందాము. ఆ జుట్టును మనము జడగా పేననంతవరకు, జడను అల్లుటకు కావలసిన మూడు పాయలూ అందులోనే వున్నాయి. అసలు వున్నాయి అనుకొంటే వున్నాయి లేవు అనుకొంటే లేవు. ఈ మూడు సత్వరజస్తామో గుణాలు. ఇక జడ పేనటము జరిగితే ఆ జడలో ఏది ఏ పాయయో చెప్పలేము. అంటే ఈ జగత్తులోని జీవ మానవ రాశిలో ఈ సత్వరజస్తమోగుణముల పాళ్ళ యొక్క, వాని కలయికల యొక్క పౌనఃపున్యములు నిజమునకు అనంతము. అసలు ఇందులో కూడా జల, జంతు, తిర్యగ్ వర్గ జీవుల గుణగణములు ఆయా వర్గములకు ఒకే విధముగా వుంటాయి. ఒక్క మానవ వర్గులో మాత్రము ‘పుర్రెకొక బుద్ధి జిహ్వకొక రుచి.’
ఈ వర్గములో మాత్రమే గుణగణములయందు మార్పు ప్రతి వ్యక్తి లోనూ కనిపిస్తుంది. ఇట్లు లేకున్నా లోకము అల్లకల్లోలమే వున్నా అల్లకల్లోలమే! కానీ ఉండుటవల్ల చెడు నుండి మంచికి మంచినుండి ఇంకా మంచికి చేరుటకు మనిషి ప్రయత్నిచగలడు. లేదు, మంచి నుండి చెడ్డ వైపునకు కూడా నడువవచ్చు. అది వారివారి వివేచన, ఆచరణ, పెంపకము మొదలగు ఎన్నో విషయముల మీద ఆధారపడుతాయి అన్నింటికీ మించి పూర్వ జన్మ కర్మఫలము . బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన ‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ’ అన్న మంత్రపు అనుయాయులౌతారు సత్యాన్వేషకులగు సత్వగుణ సంపన్నులు. క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాంనోపకరణైః’ ఉపకరణములు లేకుండానే సత్వగుణ సంపన్నులు క్రియా సిద్ధి అంటే తలపెట్టిన పనిని నెరవేర్చ గలుగుతారు. అతి చిన్న ఉదాహరణ ఏమిటంటే కొయ్య పీటకు మరచీల పైకి లేచినది అనుకొండి ‘Screw driver’ కొరకు ఎదురు చూడక అందుబాటులో వుండే ఏ ఇనుప రేకుతోనో దానిని బిగించుతాము. కావున పని జరుగుటకు పట్టుదల ముఖ్యము పనిముట్టుకంటే! అట్లు కాదనుకొన్నా పట్టుదల వుంటే పనిముట్లు కూడా తమకు తామే అందుబాటులోనికి వస్తాయి.
దీనిని ‘కార్య నిర్వాహక శాస్త్రము’(Management Science)నకు అనుసంధించుదాము. ముగ్గురు వ్యక్తులను పరీక్షింపదలచి ఒక మహత్కార్యమును (Project) వారికి ఇవ్వటము జరిగింది. మొదటివాడు పెద్దగా దానిని గూర్చి ఆలోచించకుండానే మీరిచ్చిన వనరులు ఈ పని చేయించుటకు చాలవు. నేను దీనికి పూనుకోజాలను అన్నాడు. రెండవవాడు మొదలయితే పెడతానుగానీ ఏ కారణము చేతనయినా నిలబడి పోతే నాది జవాబుదారి కాదన్నాడు. అతను చెప్పినట్లే మొదలయితే పెట్టినాడు కానీ అతని కోపమునకు, ముఖ్యముగా, సాటి సహచరులనుండి సరియగు సహకారము లభించలేదు. చెప్పుడు మాటలచేత కూడా చెడిపోయినాడు. అతని పరిస్థితి చివరకు ‘అమ్మా పెట్టదు అడుక్కొ నీ తిననివ్వ’ దన్నట్లు అయింది. ఆతడు మధ్యలో విడిచి పెట్టినాడు. చివరిగా ఆపనిని ఏ వ్యక్తికైతే ఇచ్చినారో, అంటే 3వ వ్యక్తి, ఆతను ఆపనిని ఇచ్చినవారితో ‘ ఆపని సఫలమైతే కలుగు ప్రయోజనము అటు గ్రాహకులకు(Customers) ఇటు దాతకు(Entrepreneur)  మధ్యనున్న తనకు కలుగు ప్రయోజనములు తర్కించినాడు, తన మూక(Group) లో చేరబోయే వారి గుణ దోష పరిశీలన చేసినాడు. తరువాత ఇచ్చిన మహాత్కార్యాచరణకు వలయు ప్రణాళిక(Plan) సిద్ధము చేసుకొన్నాడు. ఆపయిన కార్యమునకు గడంగినాడు. మానవ వనరులన్నీ(Human Resources) సక్రమముగా కుదిరినతరువాత కార్యము సఫలము కావలసినదే కదా! భక్తి శ్రద్ధలలో భగవంతుడుంటాడు.
ఇక ముగ్గురి మనస్తత్వమును కాస్త అవలోకించుదాము. మొదటివానిలో  తామసము అత్యంత అధికము,రాజసము అల్పము, సాత్వికము అత్యల్పము. రెండవ వానిలో రాజసము అధికము తామసము అల్పము, సాత్వికము అత్యల్పము. కానీ మూడవ వానిలో సాత్వికము అధికము, రాజసము అల్పము, తామసము అత్యల్పము. ఈ విధమగు వ్యక్తులలోనే సాధించి తీరవలెనను పట్టుదల వుంటుంది.  మిగతా ఇద్దరిలో ఉండదు. వారిని గూర్చి ఒక చిన్న కథ చెబుతాను.

మరుల 3వ భాగములో కలుద్దాము.
****************************
గీత - అధీత- 3వభాగము
ఒకవ్యక్తి తన 15 అంతస్తుల భవనము పై కప్పుపై  కూర్చొని రోడ్డుపై చీమలవలె పారాడుచున్న వాహనములను చూస్తూ ఉండినాడు. ఆ సమయములో అతని తలపులలో ఏముండినదో ఏమో గానీ ఆతని మిత్రుడు పైకి వచ్చి’ నీభార్య లేచిపోయింది అన్నాడు. అంతే అతను ఆ 15 అంతస్తుల భవనముపై నుండి దూకినాడు. 12 వ అంతస్తు వద్దకు వచ్చిన తరువాత ఆస్పత్రిలో వుండే భార్య ఆస్పత్రి అధికారుల ప్రమేయము లేనిదే ఎట్లు లేచి పోతుంది అనుకొన్నాడు. 9వ అంతస్తు వద్దకు వచ్చిన పిదప కాలు విరిగిన వ్యక్తి లేచిపోలేదు కదా అనుకొన్నాడు . 3 అంతస్తుకు వచ్చిన తరువాత ఆస్పత్రిలో వుండే తన కూతురి సహాయముతో శౌచాలయమునకు పోయి వుంటుంది అనుకొన్నాడు. అంతా జరిగిపోయిన తరువాత అనుకొని లాభము లేదు కదా!
దైవీహ్యేషా గుణమయీ మమమాయా దురత్యయా
మామేవ ఏ ప్రపద్యన్తే మాయామేతాం తరంతితే 7-14
ఈ మూడు గుణముల సంకలనము మాయ. పౌనఃపున్యముల మూలమున ఇది అనంత గుణరాశి యగుచున్నది. ఈ అనంత గుణరాశికి చెందినదే ఈ ప్రకృతి, ఈ జడ జీవములు, మన మమకార వికారములు. మనము క్రియా తత్పరులము కావాలంటే మనతో వున్న వారందరినీ కలుపుకొని పోతూ వుంటే కార్య సిద్ధి కలుగుతుంది. దానికి, మనలో ‘ఇది నా బాధ్యత, నేను చేసితీరాలి అన్న పట్టుదల మనలో వుండాలి. అంటే ‘Ownership’ అన్నమాట. నా మిఉత్రుడు ఒక Asstant general manager ఉండేవాడు. ఒకసారి నేను అతనిని ఆఫీసులో కలియుట జరిగింది. నేను యధాలాపముగా ‘పని ఎట్లుంది?’ అని అడిగినాను. ఆతడు ‘ఆఁ, ఎవరి పని వారిదే. నేను నాపని ఎంతనో అంతే చేస్తాను. 1\2 ఇంచి ఎక్కువ చేయను, 1\2 తక్కువ చేయను అన్నాడు. 5 సంవత్సరముల తరువాత నేను అతనిని మళ్ళీ కలిసి DGM అయినావా అంటే ‘లేదు లేదు పని చేసే వారికి promotion ఇవ్వరు కదా? అన్నాడు.’ ‘ఆరోజు గీత గీచుకొని పనిచేస్తానన్నాడు ఈ రోజు పనిచేసే వాళ్లకు Promotion ఇవ్వరుకదా అంటున్నాడు.’ ఇది మనది, అంటే ownership తీసుకొంటే ఆ పట్టుదల కార్యాచరణ వేరుగా వుంటుంది. అంటే   Ownership తీసుకొంటే owner కాగలము కానీ గీత గీచుకొంటే గీత లోపలే ఉంటాము. ఆ Ownership పొందవలెనంటే తన బలగమును తనతో కలుపుకొని కదలవలసి వుంటుంది. Skill వుంటే చాలదు, Will వుండాలి. Leadership is an influence of personal power not positional power. పనిపై 'ప్రభావము' వుండాలి కానీ 'పరభావము ఉండరాదు. వనములో చేరినా, వనిత జడలో చేరినా మల్లెల వాసన మారదు కదా! ఈ మాటే పరమాత్మ 5 వ అధ్యాయమయిన కర్మసన్యాసయోగములో  ఈ విధంగా అంటాడు. 

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహాస్తినిI
శునిచైవ శ్వపాకేచ పండితః సమదర్శినః II  5-18(శ్లో)
అసలు ఈ విద్యాది విషయాలు ఇటు దుష్టులకు అటు శిష్టులకు ఏవిధంగా సహకరించుతాయో ఒకసారి చూద్దాము.
విద్యా వివాదాయ ధనం  మదాయ!  శక్తి పరేషాంఖలు  పిడనాయ!  
ఖలస్య సాధో విపరితమే తత్! జ్ఞానయ దానాయచ రక్షణాయ!"

దుష్టుల  విద్య  వివాదానికీ,  ధనం మదానికి,  బలం బలహీనులనులను బాదించడానికి  పనికివస్తాయి!  అదే,  సజ్జనుడి  విద్య జ్ఞానార్జనకు,  ధనం  దానానికి, బలం దుర్బల  రక్షణకు ఉపయోగపడుతాయి. విద్య సంపద, బలము అన్నవి గుణములు. చెడ్డవాని చెంత చేరితే  తనకేగాక తానున్న సమాజానికే చేటు తెస్తాయి.గాలి సువాసననూ మోస్తుంది, దుర్వాసనననూ మోస్తుంది. అగ్ని మంత్రయుక్తమగు హవిస్సులనూ గ్రహిస్తుంది, మనుషులనూ మలినాలను కూడా గ్రహిస్తుంది. మన విచక్షణ మన జీవన సంరక్షణ.
 ఇపుడు సంతోషము అన్న అంశమును గూర్చి కాస్త తెలుసుకొందాము. ఆనందాన్ని గూర్చి భగవద్గీత ఏమంటుందో చూద్దాము. ముందుగా ఈ ఆనందము అన్నది ఒకే విధమయినదా లేక విభిన్న ఆనందములున్నవా! అన్న విషయమును పరిశీలించుదాము. ఆనందాలు ఇన్ని అని చెప్పలేము కానీ వర్గీకరణ మాత్రము రెండు విధములుగా చేయవచ్చు. 1. తాత్కాలిక లేక క్షణిక ఆనందము 2. నిరంతర,నిత్య లేక ఆఖండానందము. ఒక కోరిన సినిమా చూచుటయో, కోరిన హోటలులో కోరిన తిండి తినుటయో లేక ఒక సరిపోని వ్యక్తిని అవహేళన చేసియో ఆనందించ వచ్చును. పోయిన సినిమాకే పోతూ ఉండలేము. తిన్న హోటలులో తిన్న తిండే తింటూ ఉండలేము. కావున ఈ విధములగు ఆనందములు క్షణికమైనవే! కానీ ఇందులో నీ ఆనందముకోరకు పరులను బాధ పెట్టుట లేదు. కానీ ఇపుడు నేను తెలిపిన మూడవ ఆనందము పైశాచికము ఇదికూడా క్షణికమే కానీ పరుని బాధలో సంతోషాన్ని పొందుట పైశాచికము కాక మరేమిటి. వ్యక్తి హేళనలో ఆనందము మనము పొందుతున్నాము అనుకొంటే అది భ్రమ. చూసేవారు మనలను ఎవగించుకోనూ వచ్చు, మన స్నేహమునే వదిలిపెట్టనూవచ్చు. కావున శారీరిక మానసిక హింసల చేబట్టి పొందేది ఆనందముగా పరిగణించలేము.  క్షణికానందమునకు మిక్కిలి సన్నిహిత మిత్రము హాస్యము. ఇందు పరహింస లేదు, ఈర్ష్య లేదు, ద్వేషము లేదు. కుళ్ళు లేదు. కుట్ర,కుతంత్రము లేదు. అందువల్ల అవసరమైనపుడు, అవకాశము దొరికినపుడు నవ్వును ఆశ్రయించితే హాయిగా నీవు విశ్రమించవచ్చు.
నవ్వే మనిషికి గుర్తగు
నవ్వే ఆరోగ్యమునకు నాణ్యత పెంచున్
నవ్వే మైత్రికి సఖుడౌ
నవ్వే లేనట్టివాడు నరుడా రామా!
అని నేను వ్రాసుకొని యుండినాను.
కావున నవ్వు హాస్యమునకు సంకేతము. హాస్యము ఆనందమునకు సంకేతము. ఆనందము ఆరోగ్యమునకు సంకేతము. ఈ ఆనందము తాత్కాలికమే! కావున ఇది 'అంతము' కాదు 'ఆరంభమే'. దీని ప్రత్యేకత ఏమిటంటే ఏదో ఒకరోజు నిన్ను ఈ ఆనందమునకన్నా మించినది ఉందా అని యోచిమ్పజేస్తుంది.  నిరంతర, నిరంతరాయ,నిత్యానందము వైపు నిన్ను దారితీయించుతుంది.
 నిత్యానందమును గూర్చి  భగవద్గీత ఏమంటూవుందో చూద్దాము.
రాగద్వేషా వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరాన్
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమథిగచ్ఛతి (2-63)
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠ తే (2-64)
మానవుడు లౌకికమైన ఏవిధమగు ప్రలోభములకు లొంగక, అందని వానికి అర్రులు సాచక, తనకు అందినవి అనుభవిస్తూ పొందే ఆనందము అనిర్వచనీయము. ఈ సుఖశాంతులను తెలుపునదే ‘ప్రసాదము’. ఇది పొందితే ఇక దుఃఖమేదీ! అంటే సంతృప్తే సంతోషమునకు సాధనము. ఉన్నదానితో తృప్తి చెందితే అసలు ఆరోగ్యమును కాపాడుకొన్నట్లే. అందుకే ఈ రెండవ అద్యాయములోని 62, 63 శ్లోకములలో విషయాసక్తి వలన మానవుడు ఎన్ని విధాల పతనము కావలసి వస్తుందో పరమాత్మ తెలుపుతాడు. మరి ఈ మాట సుఖజీవనమునకు సోపానముకాదా! ఈ విధముగా ఐహికమగు అనేక విషయములకు భగవద్గీతను కరదీపికగా గైకోనవచ్చును. ఇక అసలు భగవద్గీతలోనికి మనము ప్రవేశించుదాము.
4వ భాగములో కలుద్దాము.
*****************************
గీత - అధీత-4వభాగము
భగవద్గీతా ప్రవేశము
ఎందఱో మహనీయులు, మహానుభావులు,మహాగురువులు భాష్యము వ్రాసిన భగవద్గీత తిరిగీ నేను విమర్శనాత్మకంగా తెలియబరచే అవసరము గానీ,శక్తి గానీ భగవంతుడు నాకు ఇవ్వలేదు. అయినా ఒక్క విషయము మాత్రము శ్రద్ధాళువులతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నము.
భారత యుద్ధ వార్తలను ధృతరాష్ట్రునకు చెప్పుటకై వేదవ్యాసులవారు సంజయునికి కురుక్షేత్ర సంగ్రామము వీక్షించగల దివ్య దృష్టి నొసంగి నియమించిరి.
ఈ గీతా ప్రవేశద్వారము వద్ద మొదట నిలిచినది ధృతరాష్ట్రుడు .
ధృతముఅంటే ధరింపబడిన అని అర్థము, రాష్ట్రుడు అంటే రాష్ట్రమును కలిగినవాడు అని అర్థము. అంటే చక్రవర్తి యని అర్థము. ఈ పేరుకు ఇంకొక అర్థమూ వుంది. ధృతమన్న మాటకు ఆనందము అని ఒక అర్థము. రాష్ట్రము అన్న మాటకు ఉత్పాతము అని ఒక అర్థము (బ్రౌణ్య నిఘంటువు). అంటే ఉత్పాతములయందు ఆనందమును పోడువాడు అని. చూచినారా పూర్వము పేరు పెట్టుటలోని సార్థకత. ఆలోచిస్తే భారత యుద్ధమునకు ఈ పేరే దారి తీయించిందేమో అనిపిస్తుంది.
ఇక రెండవ వాడు సంజయుడు. సత్+జయుడు సంజయుడౌతుందని అందరికీ తెలిసిన విషయమే. 'ఏకం సత్' అన్నది వేదం వాక్కు. అంటే ఆ సత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ను జయించినవాడే సంజయుడు. అంటే వ్యాసుడు విష్ణువు యొక్క అంశయే కదా. సంజయుడు ఆయన అనుగ్రహము పొందుట అంటే ఆయనను జయించినట్లే కదా.
భారతము ఇతిహాసమని సోదాహరణముగా పండితులచేత నిరూపింప బడినది. ఇది ఇపుడు నిర్వివాదము. అప్పుడు ఇందులోని పాత్రల పేర్లు కథ కొరకు పెట్టినవి కావని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. వారి పేర్లు వారి స్వభావమునకు ఎంత అతికినట్లు సరిపోతూ వుందో పైన దొరికిన రెండు మెతుకులు పట్టి చూస్తే తెలుస్తుంది.
కృష్ణుడు అర్జనునకు చేయు గీతోపదేశమటుంచి ఆ ఉపదేశానికి ఉపోద్ఘాతమునకు , ఒక ఉత్పాతములయందు ఉత్సాహము కల్గినవాడు, ఎట్లు నాంది పలుకుచున్నాడో గమనించండి. భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించిన ఈ శ్లోకముతో మొదలౌతుంది.
శ్లో. ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ
ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే
సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?
ఇందులో ఒక అంతరార్థము వున్నది. అదేమిటంటే యుద్ధము చేయుట సహజమే అయినా, యుద్ధము చేయ నిచ్చగించినవారు, చేయనిర్ణయించుకొన్న ప్రదేశము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. వామన పురాణములో ఈ విధంగా చెప్పబడింది. కురు మహారాజు తన సామ్రాజ్యమునకు సరియగు రాజధానిని సమకూర్చుకొన సంకల్పించి ఎన్నో ప్రాంతములను వెదికి ఈ ప్రాంతమునకు వచ్చి ఈ ప్రాంతపు ప్రత్యేకతలను ఈ క్రింది విధముగా తెలుసు కొన్నాడు.
ఈ ప్రాంతము,బ్రహ్మ ఎన్నో వేల సంవత్సరములు తపమాచరించుటవలన బ్రహ్మ వేదిగానూ, సరస్వతీ నది ఉత్తరవాహినియై ప్రవహించుటవలన ఉత్తరవేదిగానూ మరియు సరస్వతీ యమునా నదుల సంగమము ఇచట ఏర్పడుటవలన  ఈ ప్రాంతము దృష్టావతి గానూ పిలువబడేది. ఈ ప్రాంతము సప్త గుణ సంపన్నమైనదని ఎరింగి ఇచ్చట నగరము నేర్పరచ తన అనుచర గణమునకు నిర్దేశించినాడు కురు మహారాజు. ఈ సప్త గుణములేమిటివన: 1.తపస్సు 2.సత్యము 3.క్షమ 4.దయ 5.శుచి 6.దానము 7. బ్రహ్మచర్యము. ఈ ప్రాంతమును రాజధానిగా ఎన్నుకొన్న తన పరమ భక్తుడైన కురు మహారాజుకు శ్రీ మహావిష్ణువు రెండు వరాలను ప్రసాదించినాడు . 1.ఆ ప్రదేశమికపై కురుక్షేత్రముగా పిలువబడుతుందని
2.అక్కడ మరణించిన వారు స్వర్గవాసులౌతారని.
ఋషులు అనేక క్రతువులను నిర్వహించుట వలనను, వేదవ్యాసులవారు వేదములను ఋగ్ యజుస్సామాధర్వణములుగా విభజించుట వల్లనూ ఈ ప్రదేశమునకు ధర్మక్షేత్రమనే పేరు కూడా స్థిరపడినది. అందువల్లనే ధృతరాష్ట్రుడు 'ధర్మక్షేత్రే' 'కురుక్షేత్రే' వాడినాడని చెప్పవచ్చును.
ఇందులో ఒక గూఢార్థము కూడా ద్యోతకమగుచున్నది. 'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల)
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది. ఆ క్షేత్రము వేరే కాదు ఈ శరీరమే. కర్మ చేత బుద్ధిబుద్ధిచేత ఆలోచనలుఆలోచనలు ఆలోచన చేత ఆచరణలు ప్రచోదితమౌతూ వున్నాయి. ఈ కర్మలు ప్రారబ్ధముసంచితముఆగామి ఆసన్న మూడు విధములని మనకు తెలిసినదే! కానీ చేసే ప్రతి పనికీ ఈ శరీరమే ఉపాధి. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే మమకాః అని వాడియుంటాడు. ఇక పాండవాః అని కూడా ఆయన వాడినాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్ఛత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్ఛత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే అంటే ధృతరాష్ట్రునిచే అసంకల్పితముగా  వాడబడినదేమో!
కావున కురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుంది అని  చెడ్డను పుట్టించిన వ్యక్తి(తండ్రి)యే చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విధానమెట్లుండినది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరి భూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథనము కొనసాగుతూనే వుంటుంది.
కావున ఈ వివరణను సంగ్రహించితే,  'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము . రావణునికి పది తలలు అంటారు. రావణుడు దుర్మార్గుడు కావుననే శ్రీరామచంద్రుడు రావణుని సంహరించినాడు అంటారు. రావణుడు మహా పండితుడు భక్తుడు వేదాంతి. ఈ పలుకులను తానే కూడా చెప్పుకొన్నట్లు కొన్ని రామాయణాలలో వింటాము. అన్నీ అట్లుంచి ఒక వాస్తవాన్ని మాత్రము గ్రహించుదాము. ఆయనకు పది తలలు ఉండుట జగమెరిగిన వాస్తవము. అందులో మొదటి నాలుగు పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములైతే మిగతా ఆరు అరిషడ్వర్గములు. మంచిని మించిన చెడుగు ఆయనలో చేరుట చేతనే ఆయనకు పతనము ఏర్పడినదని తలువ వలసి వస్తుంది.  హిరణ్య కశిపునిగా ఆయన సంచితము (భూతకాలానికి సంబంధించినది) ఆయనకీ దుర్దశ తెచ్చినదని మనకు తెలియ వస్తుంది. అట్లు కాకుంటే వేదవాది అయిన ఆయనకేమిటి మరణము. కానీ అది పరమాత్ముడగు శ్రీరామచంద్రుని చేతిలోనే. కావున మన కర్మ మాత్రమె మనతో వుంటుంది. 'కర్మానుగోగచ్ఛతి ఎకమాత్రాఃఅనికదా పెద్దలవాక్కు. అందుకే భగవద్గీతలోని మొదటి శ్లోకమే సత్కర్మ ప్రాశస్త్యాన్ని మనకు తెలుపుతూ వుంది.
 గీత - అధీత-5వభాగము    
ఇప్పుడు మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయ సంవాద విషయమునందు మనము ధృతరాష్ట్రుడు అడిగిన మొదటి ప్రశ్నను ఒక సంస్థానిర్వాహణా కలాపమునకు అనుసంధించి విశ్లేషించుకొనే ప్రయత్నము చేస్తాము. ‘కురు’ అన్న మాటకు To Transact అన్న అర్థమును తీసుకొనవచ్చును. Transactions అన్న పదమునకు ‘లావాదేవీలు’ అని చెప్పుకొనవచ్చును. అది Market Place అంటే ‘కురు క్షేత్రము’ ఔతుంది. మరి దీనికి laid down principles ను ధర్మము అంటే ఇచట ‘వ్యాపార ధర్మము’ ఔతుంది. అంటే కొన్ని నియమ నిబంధనలను అనుసరించి ఈ లావా దేవీలు జరుగుతూ వుంటాయి. ఈ వ్యాపార ప్రక్రియలో ఒకే విధమగు నియమ నిబద్దను అందరూ పాటించితేఅసలుసమస్య అనేదే  ఉండదు. ‘స్వ’ ‘పర’ అన్న స్పర్ద ఎప్పుడయితే ఏర్పడుతుందో అప్పుడు వైషమ్యాలు మొదలౌతాయి. ఎప్పుడు వైషమ్యాలు మొదలౌతాయో ఎత్తులు జిత్తులు పురుడు పోసుకొంటాయి.
ఇప్పుడు ధృతరాష్ట్రుని విషయములో ఏర్పడినది అదే! ఇంతకాలము తన సామర్థ్యము చేత
ఉన్న సామ్రాజ్యమును (Kingdom) ఏక ఛత్రము క్రింద వుంచగలిగినాడు. పగ్గములు కొడుకు చేతికి వస్తూనే అంతా తనకే కావాలన్నాడు. శత్రుత్వాన్ని కోరి తెచ్చుకొన్నాడు. దీనిని వాణిజ్యమునకు అనుసంధింకొంటే అది ఎంతటి తప్పు పని అన్నది అర్థమౌతుంది.
అందుకే ధృతరాష్ట్రునికి ఈ భయము.
‘ధర్మ క్షేత్రే కురు క్షేత్రే’ ధర్మబద్ధమైన విధి విధానములతో సజావుగా సాగుతున్న విపణిలో స్వార్తపూర్తముగా వ్యవహరించి తన కుమారుడు కోరి శత్రుత్వమును కొని తెచ్చుకొన్నాడు. అట్లని అతను తెలివిలేని వాడు కాదు. యుద్ధమునకు సిద్ధము కావలసిన సమయము ఆసన్నమౌతూనే శత్రువులకన్నా 3 అక్షౌహిణుల సైన్యమునుతానూ ధర్మ వర్ధనుడు కాకున్నాఅదనముగా సమకూర్చుకొన్నాడు. అతను చేసిన తప్పల్లా కేవలము అంగబలమునకు ప్రాధాన్యతనిచ్చి ఆలోచనా బలమును అందిపుచ్చుకోలేక పోయినాడు.
తాను క్రియాశీల నిర్వహణ నుండి తప్పుకొన్నందువల్లకొడుకు చెడ్డవాడైనా అతి వ్యామోహము ఉన్నందువల్ల తన కుమారుని సాఫల్య శాతము తెలుసుకోనవలేనాను ఆశతో సంజయుని (Analyst) ను అడుగుతున్నాడు. ఇక్కడ ‘మమకాః’ అన్న మాటను ‘పాండవాః’ అన్న మాటను తన ప్రశ్న లో వాడినాడు. నిజానికి అందరూ తనవారే. ఆ సామ్రాజ్యములో పాండవులూ వాటాదారులే! కానీ ఇటు తనలోనూ తన కొడుకులోనూ స్వార్థము ప్రబలిపోయింది. స్వార్థము ఎప్పుడు రోషద్వేషమోసాలకు అనులోమానుపాతములో వుంటుంది. అందువల్ల అసలు సామ్రాజ్య పునాదులే బీటలుబారే అవకాశము అధికముగా వుంటుంది. ఉండటమే కాదు అదే జరిగింది. నీతి నియమమును ఆధారముగా చేసుకొని ధర్మబద్ధమగు పునాది కలిగినవారి సామ్రాజ్యము హద్దులనతిక్రమించి విస్తరిల్లుతుంది. కారణము ధర్మము మరియు నీతినియమాలు కూడా అనులోమముగానే వుంటాయి.
తన కుమారుని తప్పిదము అర్థమైపోయింది. అత్యాశ అతనిని అంధుని చేసింది. అందుకే అన్నివిధములా పతనమైనాడు. కాబట్టి ఒక ముఖ్యమైన పని చేయుటకు అంగ,అర్థ బలముతోబాటూ ఆలోచనా బలము అంటే బుద్ధిబలముఅదికలిగిన వారిపై గురుత్వము ఏర్పరచుకొని ముందునకు సాగితే ఆశించిన ఫలితమును అందుకొనే అవకాశము వుంటుంది.
తెరవెనుక ద్రుతరాష్టృనియొక్కతెరముందు దుర్యోధనునియొక్క స్వార్థ పూర్తిత ప్రణాళికతో 18 అక్షౌహిణుల సైన్యమును పొట్టన పెట్టుకొన్నాడు దుర్యోధనుడు. దానికి తెలివిగా వత్తాసు పలికినాననుకొన్నవాడు ధృతరాష్టృడు. అక్షౌహిణి అనగా 
21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు.
ఇటువంటివి 11 కౌరవ పక్షమున, 8 పాండవ పక్షమున యుద్ధము చేయుట జరిగింది.
ఈ 11 అక్షౌహిణుల సైన్యములో కౌరవ పక్షాన మిగిలినది అశ్వథ్థామ, కృపాచార్యుడు మరియు కృతవర్మ. పాండవుల పక్షాన యుద్ధము చేసిన 7 అక్షౌహిణులలో మిగిలినది పంచ పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి. ఒక స్వార్థ ప్రయోజకుని దుర్బుద్ధికి ఎందరు బలియై పోయినారో చూడండి.
 ఎట్టకేలకు పాండవులు గెలిచినాదీనిని నేటి మానవ వనరుల శాస్త్రము (H R Science) Lose-Lose Situation అంటుంది. అదేసంధి కిరాజగు ధృతరాష్టృడు ఒప్పుకొని వుంటే అప్పుడు Win-Win Situation అయివుండేది. అందుకే ఎప్పటికీ పనిచేసి చిన్తిన్చుతకంటే చింతించి పనిచేయుట మేలు.
 మనస్సునకు ఆలోచనాశక్తిచిత్తమునకు చాంచల్యశక్తిబుద్ధికి నిర్ణయాత్మక శక్తి ఉంటుందన్న విషయమును సదాజ్ఞాపకము ఉంచుకొనుట సరియైన వ్యాపారవేత్త లక్షణము. వ్యాపారము (Any sort of Business) మన ప్రవర్తనమన కలుపుగోలుతనము  సాటివారిపై తగినవిధముగా చూపించే ప్రేమాభిమానములపై ఆధారపడివుంటుంది. అసలు కార్యదక్షుడైనవాడు తానూ నాయకుడై(Leader) తన బలగమును (Staff) ను నడిపించవలసి వుంటుంది. ఒక చిన్న పోలికను గమనించండి. ఈ పోలికలోని పసిబాలుని నాయకుని చేయమని నా అభిప్రాయము కానేకాదు. ఆ బాలుడు ఇంటిల్లపాదినీ ఒక్క తాటిపై ఏవిధంగా నడిపిస్తాడో ఆ విధంగా ఒక నాయకుడు మసలవలెనన్నది నా ఉద్దేశ్యము. పరివారమంతా కుటుంబ సభ్యులు అనుకొంటే ఆసేనను తనదారిన తెచ్చుకోగలవాడు ఆ యింట దోగాడే పసిబాలుడు. ఇంటివారంతా ఆ బాలునే అనుసరిస్తుంటారు. తాను చేసే పనిని వారంతా ఆస్వాదిస్తారుఆనందిస్తారుఅభినందిస్తారు. ఒక నాయకుని లక్షణము అదే!  
తరువాత నాకు తోచిన సార్వజనీన సమస్యలకు  భగవద్గీత యందలి పరిష్కారముల గూర్చి  మాట్లాడుకొందాము.
అల్పజ్ఞుడను. తప్పులు క్షమించేది.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాం
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా స్సుఖినోభవంతు
ఈ ఉపోద్ఘాతము  పాఠకులకు నచ్చితే లౌకిక సమస్యలకు భగవద్గీత సలహాలను గూర్చి ఒక్కొక్కటిగా చర్చించుకొందాము.   

స్వస్తి

Friday, 1 June 2018

వాల్మీకి శాస్త్రజ్ఞత


వాల్మీకి శాస్త్రజ్ఞత
వాల్మీకి ఆదికావ్య కర్త, అందుచే ఆదికవి అని మాత్రమే మనకు తెలుసు. రామాయణమంటే రాముడు సీత, లక్ష్మణుడు, భరతశత్రుఘ్నులు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు విభీషణుడు, రావణ కుంభకర్ణులు, కట్టె, కొట్టె, తెచ్చె   అని మాత్రమే అనుకొంటాము. ఇందులో ఎన్నో శాస్త్ర రహస్యములు దాగివున్నవని ఆలోచించము. ఆ దిశగా మనకు చెప్పేవారు కూడా తక్కువే. మనకూ వినే ఓపిక తక్ఇకువే! 
ఇప్పుడు రామాయనమునండలి ఒక ఖగోళ రహస్యమునకు సంబంధించిన విషయమును వాల్మీకి మహర్షి ఎంత నిగూఢముగా మనకు తెలియబరచినాడో తెలుసుకొందాము. అందుకే కాళిదాసువంటి మహాకవులు వాల్మీకి వారిని ఈ విధముగా పొగిడినారు.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం l
ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలంll
రామాయణ కల్పవృక్ష కవితా శాఖల పై వాల్మీకి అన్న కోకిల కూర్చొని 'రామ' రామ' యని కూయు చున్నది.
వాల్మీకి ముని సింహస్య కవితా వన చారిణాl
శ్రుణ్వన్ రామ కథా నాదం కొనయాతి పరాం గతింll
కవన వనములో వాల్మీకి ముని సింహము 'రామ' 'రామ' రామకథా నాదమును ధ్వనింప జేస్తూవుంటే విన్నవారు కైవల్యమును గాంచక ఎట్లుండగలరు. ఇక అసలు విషయమునకు వద్దాము.
బాలకాండ 18 వ సర్గము. 16 వ శ్లోకము ఈ విధముగా వుంది.
గుణవంతో సురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాఃl
జగుః కలం చ  గంధర్వా ననృతుశ్చాప్సారో గణాఃll
దశరథుని నలుగురు పుత్రులూ రూపములోనూ గుణములోనూ నిరుపమానులు. వారు ప్రోష్ఠపద నక్షత్రమువలె అన్యోన్యత కలిగి వుండినారు. వీరి జనన కాలమున గంధర్వులు గానము చేసినారు. అప్సరసలు నాట్యము సల్పినారు. దేవదుందుభులు మ్రోగినాయి. అసలు వాల్మీకి రామాయణము ప్రకారము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ విష్ణ్వంశ  సంభూతులే!  రాముడు కాక మిగిలిన ముగ్మగురూ ఆదిశేష శంఖ చక్ర అవతారములు కాదు. పై శ్లోకములో మనకు కావలసింది ‘రుచ్యా ప్రోష్ఠపదోపమాః’ అన్న పదము మరియు దాని విశ్లేషణ. రుచి అన్న మాటకు ప్రకాశము అన్నది ఒక అర్థము. మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కదా! మరి ఒక నక్షత్రము పేరు చెప్పి, దానివలె ప్రకాశించుచున్నారు  అంటే కొంత ఎబ్బెట్టుగా వున్నట్లు తోచకమానదు కదా!. నలుగురు స్త్రీలను ఉద్దేశించి చెబుతూ, ఆ నలుగురి ముఖములూ చంద్రబింబములవలె వున్నాయి అని అంటే మనసుకు రుచించదు కదా! ఆ విశేషణము ఎదో ఒకరికి ఆపాదిస్మతే చక్కగా ఉంటుంది.  మరి ఇది ఎలా సరిపోతుంది, అన్నది సమస్య. అది ఇపుడు కాస్త ఈ పదప్రయోగను గూర్చి తెలుసుకొనే ప్రయత్నము చేస్తాము. పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రములు రెంటినీ కలిపి  ‘ప్రోష్ఠపద’ అని అంటారు. మరి ఇప్పుడు కూడా రెండేకదా అయినది, వారు అన్నదమ్ములు నలుగురు కదా! అన్న సందేహము వస్తుంది. అక్కడే వున్నది అసలు రహస్యము. పూర్వాభాద్ర రెండు ప్రకాశవంతమగు నక్షత్రములను కలిగియుంటుంది. అదేవిధముగా ఉత్తరాభాద్ర కూడా రెండు తేజోవంతమైన నక్షత్రములను కలిగియుంటుంది. ఈ నాలుగూ నాలుగు చుక్కలు (Points) గా గ్రహించి అవి A,B,C,D అన్న బిందువులుగా భావించి కలిపినట్లు ఊహించితే ఇంచుమించుగా ఒక చతురస్రము (Square) ఏర్పడుతుంది,  అంటే AC, BD ల దూరములో సూక్షమైన తారతమ్యాలు వుంటాయిగానీ AB, BC,CD,DA లు  ఇంచుమించుగా ఒకే దూరాన్ని కలిగివుంటాయి. ఇది  రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నుల అన్యోన్యతను తెలుపుతాయి. మరికాస్త ఆలోచిస్తే A బిందువుగా కలిగిన రాముడు C బిందువుగా కలిగిన లక్ష్మణుని చూస్తూ ఉంటాడు, అంటే లక్ష్మణుడు ఎప్పుడూ రాముని కనుసన్నలలో ఉంటాడు. అదేవిధముగా శతృఘ్నుడు, భరతుని కనుసన్నలలో ఉంటాడు.   మహర్షి ఒకే పదములో  ఖగోళ శాస్త్రమును ఆధారము చేసుకొని అన్నదమ్ముల అన్యోన్యతను ఎంతో నిర్దుష్ఠముగా తెలియజేసిన విధానము. ఎంత గంభీరమైన భావమో గమనించినారో కదా! 
నిరంతర భక్తితత్పరులు భగవంతుని అవిరళానుగ్రహ ప్రాప్తులగు ఆ మహానీయులకే అట్టి భావములు కలుగుట, అట్టి కావ్యములు వ్రాయుట, వానిని ఆచంద్రార్కము నిలిపివుంచుట సాధ్యము. వాల్మీకి మహర్షి పాదపద్మములకు సాష్టాంగ దండప్రణామములు సమర్పించుతూ శెలవు తీసుకొంటాను.
స్వస్తి.