ముస్లీముల ‘కాబా’ గా మార్చబడిన ఆ కట్టడము ఒకనాటి మఖేశ్వరాలయము. అందు గోడకు అరబ్బీ భాషలో ' (షా) శాయర్ - ఉల్ - ఓకుల్' అంటే దాని అర్థము 'చిరఃస్మరణీయము"అని, ఒక బంగారు రేకు పై వ్రాయబడిన కవిత తగిలింపబడి ఉండెడిదట. ఇప్పటికి కూడా అది టర్కీ దేశపు రాజధానియైన ఇస్తాంబుల్ నగరములోని 'మాక్తాబ్ -ఏ - సుల్తానియా' అన్న జగత్ప్రసిద్ద గ్రంథాలయము నందున్నదని ప్రసిద్ధ చరిత్రకారుడు P.N. ఓక్ గారు Was the Kaaba Originally a Hindu Temple? అన్న గ్రంధములో తెలిపినారు. మఖేశ్వరాలయమున ఉన్న ఆ కవిత ' అబూ అమీర్ ఆసామి' అన్న 'హారూన్-అల్-రషీద్' ఖలీఫా గారి ఆస్థాన కవీశ్వరుడు, ఇస్లాంకు ముందు వ్రాసిన కవిత్వము ఇది. తరువాత బనీ- ఉమ్- మయ్యా వంశపు అంతము వరకు, అక్కడినుండి హారూన్ గారి కాలము వరకు 3 భాగములుగా సంకలనము చేసి ఆయన తిరిగీ సంపుటీకరించినాడు. అందులోని 315 వ పుటలో ప్రమర వంశజుడైన విక్రమాదిత్యుని గూర్చిన ప్రశంస వున్నది. ఈ 'శాయర్ - ఉల్ - ఓకుల్' కలిగియున్నది ఆ విక్రమార్కుని ప్రశంసయే! ఈ కవిత లోని భావము ‘లోక కల్యాణమును పరమావధిగానెంచి అరబ్ దేశీయులలో భక్తీ భావమును పెంచిన విక్రమాదిత్యుని శాసన కాలములో నుండిన ప్రజలెంత అదృష్టవంతులు ' అని సాగుతుంది. వేదవీర్ ఆర్య గారు సాధికారికముగా రచించిన 'Chronology of ancient India ~ Victim of concoctions and distortions" చదివితే మనకు ఈ విషయము తెలియగలదు.
"ఉజ్జయిని పాలకుడగు గంధర్వసేనుని కుమారుడగు విక్రమాదిత్యుడు క్రీ.పూ. 1 శతాబ్దమునకు చెందినవాడు. నవరత్నములు ఈయన ఆస్థానము లోనివారే!. ఈనాటికీ 5 లక్షల పైచిలుకు గ్రామాలలో పాటించే విక్రం సంవత పంచాంగము ఈయన కాలము నుండియే ఆరంభమైనది. ఇది ఆయన పాలనా కాలములో శకులను జయించిన పిదప క్రీ.పూ.57 న మొదలయినది.
విక్రమార్కుని కాలములో బాబిలోన్ పర్షియా తుర్క్మినిస్తాన్, అరేబియా ఆది దేశాలలో ఎన్నో దేవాలయాలు కట్టుట సంభవించినది. అరేబియాలో మక్కా వద్ద అల్ మనత్, అల్ ఉజా మరియు అల్ లత్ అన్న ముగ్గురు స్త్రీ దేవతల గుళ్ళు ఉండేవి. ఇవి మన లక్ష్మి పార్వతీ సరస్వతుల ప్రతీకలు. కానీ వారు వీరిని అక్క చేల్లెళ్ళుగా తలచి పూజించేవారు. అంటే హిందూధర్మము విక్రముని కాలమంతా మిక్కుటముగా శోభిల్లుచుండినదన్నమాట. అసలు వారు విక్రముని దైవ ప్రతినిధిగా ఆరాధించేవారు. ఇస్లాము ఆ దేశమున అడుగుపెట్టుటతో హైందవము అంతరించుట మొదలైనది.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము చెప్పుకొనవలసియున్నది.
దిల్లీ లోని మేహ్రోలి ప్రాంతములో కుతుబ్ మీనార్ వున్నది. దానికి అత్యంత సమీపములో ఒక విష్ణ్వాలయము ధ్వజస్థంభము ఉన్నది. ఇక్కడ ఒక్కమాట మీ దృష్టికి తెస్తాను. కుతుబుద్దీన్ ఐబాక్ ఈ కుతుబ్ మీనార్ కట్టించినాడు లేక కట్టించ మొదలుపెట్టినాడు. తరువాతి రాజగు ఇల్టిమష్ దానిని పూర్తి చేసినట్లు చెబుతారు. ఈ రోజుకు కూడా ఆ కట్టడమును విమర్శనా దృక్పథముతో చూస్తే తెలుస్తుంది అది మహమ్మదీయ సుల్తానులు కట్టించినది కాదని.
కారణాలు గమనించండి:
1. ఆ ప్రాంతము పేరు మేహ్రోలి. ఇది ‘మిహిరావళి’ యొక్క రూపాంతరము. మిహిరుడు అను నిజనామము కలిగిన వరాహమిహిరుని పేరుతో ఏర్పడిన ప్రాంతము. అంటే ఆ కాలముననే తన మిత్రబంధువులతో ఆయన కోరిక మేరకు విక్రమార్కుడు కట్టించినట్లు మనకు తెలియవస్తుంది. ఆయన ఖగోళశాస్త్రమునందు మేరుసమానుడు కాబట్టి ఆ ప్రాంతములో కుతుబ్ మీనార్ అన్న ఆధునిక నామము కల్గిన కట్టడము కట్టించుట జరిగినది. ఆయన ఖ్యాతితో పోల్చినపుడు ఆ నక్షత్రశాల (నేటి కుతుబ్ మీనార్) తక్కువే కాబట్టి, అది కూదాస మిహిరావలిలో ఒక భాగమే కాబట్టి దానికి ప్రత్యేకముగా పేరు ఉంచలేదు.
2. ఆ కట్టడమును నేడు గమనించినా కూడా గోడలపై అక్కడక్కడ ఖురాన్ వాక్యాలు చొప్పించినట్లు తెలియవస్తుంది. పైగా ఆ ప్రాంతములో\ప్రాంగణములో ఎన్నో హైందవ దేవతా విగ్రహములను నేటికి కూడా మనము చూడవచ్చును.
3. ఈ కట్టడమును ఆనుకొని విష్ణుమందిరము ఉండుటచే, ఆ కట్టడము కుతుబుద్దీన్ కానీ ఇల్టిమష్ గానీ కట్టించినది కాదని మనము సులభముగా గ్రహించవచ్చు. కోరికోరి మహమ్మదీయులు దేవాలయము ప్రక్కన తమ కట్టడములను కట్టించారు గదా!
4. ఆ కట్టడమును ఒక ఖగోళ శాస్త్రజ్ఞుని సహకారముతో పరిశీలించితే అది తత్సంబంధమైన కట్టడమని మనము సులభముగా గ్రహించవచ్చును.
5. ఇక ఆ విష్ణ్వాలయము నందలి త్రుప్పు పట్టని ఉక్కు ధ్వజస్తంభమును గమనించితే అది ఏ కాలమునాటిది అని ఈ కాలమునకు కూడా చెప్పలేకున్నారు నేటి Scientists. అది నిస్సందేహముగా క్రీస్తు పూర్వముదని ప్రముఖ Scientists ద్రువపరచినారు కూడా.
6. ఆ స్థంభముపై ఒక శాసనము మనకు అగుపించుతుంది. అందు బాహ్లిక (ఈ శబ్దాన్ని కొందరు బాల్హిక అని పలుకుట కద్దు, మనము చిహ్నము అని వ్రాసి చిన్హము అని పలుటాము కదా! ఆవిధంగా) రాజును ఓడించి ఆతనితో సంధి కుదుర్చుకొని ఆతని కుమార్తెను విక్రముడు వివాహము చేసుకొన్నట్లు వున్నది. ఆ ‘బాల్హిక్’ వేరేదియో కాదు, నేడు పశ్చిమ ఏషియా లోని ‘బాల్క్’ అన్న ప్రాంతమే అది.
మరి ఇన్ని వాస్తవాలను పక్కకు నెట్టి మనలను అంధకారములో ఉంచి లేక ముంచి తమకు తోచినది చెప్పి నమ్మించే చరిత్రకారుల పుకారులను నమ్మి మన దేశచరిత్ర ఆకారము అదియేనని నమ్మి మనమే వికారము చేసుకొనుచున్నాము.
విక్రముడు చేసిన అత్యంత ఘనమైన కార్యములను మరికొన్ని చూద్దాము. పర్షియా (నేటి ఇరాన్) లో ముఖ్యముగా విస్తృత రమణీయ రహదారులను నిర్మించుటయే గాక స్పష్టమైన వార్తా గ్రాహక విధానమును (Postal System) ఏర్పరచినాడు. అసలు ఇరానీయులు మానుండి విడిపడిన సంతతిగా ప్రకటించినాడు. 1,700 మైళ్ళ దూరము గల రాజమార్గమును నిర్మించి వార్తా సేకరణ సులభతరము చేసిన మహానుభావుడు ఆయన. అసలు ఈ విధానమును నేటికినీ US Postal Service అనుసరించుతూవున్నదని తెలివస్తూ వున్నది. క్రీస్తు శకము 102 తరువాతనుండి
భారతీయ పాలకులు దీనిపై పట్టు కోల్పోయినట్లు తెలియవచ్చుచున్నది. (సేకరణ www.booksfact.com/ నుండి)
మిగిలినది మళ్ళీ ఒకసారి........
సామ్రాట్ విక్రమాదిత్య – 6
మహాత్ముడు కాళిదాసు తన జ్యోతిర్విదాభరణములో తాను భావి తరాలకు విక్రముని ఔన్నత్యమును తెలియజేయుటకే ఈ విషయముల తెలియజేయుచున్నట్లు 4 వ సర్గ లోని 89 వ శ్లోకములో తెలియజేస్తాడు. పైగా ఆయన విక్రముని, ‘శక మారకుడగుటచే ‘శక కారకు’డైనాడు అని వర్ణించినాడు. 22 భాగములుగా విభజింపబడిన జోతిర్విదాభరణమును ప్రమరవంశజుల ప్రజారంజక పరిపాలనమును, విక్రముని ఔన్నత్యమును చాటుటకే వ్రాసినట్లు 4వ సర్గ లోని 89వ శ్లోకములో తెలియజేస్తాడు. ఆయన ఈ కావ్యమును కలి 3068 వైశాఖములో(ఇంచుమించు ‘మె’ లో) మొదలు పెట్టి ( 33 క్రీ.పూ.) అదే సంవత్సరము కార్తీకములో (ఇంచుమించు నవంబరులో) పూర్తి చేసినట్లు తెలియజేసినాడు. ఈ కావ్యములు 22 విభాగములు 1474 శ్లోకములు ఉన్నట్లు చెప్పుకొన్నాడు. ఆ కావ్యము ద్వారా ఇంకా ఈ క్రింది విషయములు మనకు తెలియవస్తాయి.
1. ఆయన రాజ్యము 180 జ్యోతిష యోజనముల (అనగా 1800 మైళ్ళ) విస్తీర్ణము కలిగినట్లు తెలియవస్తూవున్నది.
2. ఆయన కాలములో భారత వర్షము వైదిక ధర్మముతో అలరారు చుండినది.
3. ఆయన ఆస్థానములో నవరత్నములు కాక ఇంకా మణి, అంగుదత్త, జిష్ణు, త్రిలోచన, హరిస్వామి (ఈయన శుక్ల యజుర్వేదమునకు భాష్యము వ్రాయుటయే కాక విక్రమార్కుని కాలములో దాన ధర్మాధ్యక్షునిగా కూడా ఉండినాడు, శతపథ బ్రాహ్మణమునకు ఈయన భాష్యము కూడా వ్రాసినాడు), సత్యాచార్య, శృతసేన, బాదరాయణ, మణిత్థ, కాక ఇంకా ఎందఱో జ్యోతిష్యులు ఉండేవారని తెలియవచ్చుచున్నది.
4. ఆయన ఏలుబడి క్రింద 800ల మంది సామంతులు, ఒక కోటి మంది సైన్యము, 16 మంది మహా పండితులు, 16 మంది జ్యోతిష్యులు, 16 మంది వైద్యులు, 16 మంది భట్రాజులు(భట్టువులు), 16 మంది వేద పండితులు ఉండేవారని పై గ్రంధము ద్వారా తెలియవచ్చుచున్నది. (22-11)
5. 22-12 శ్లోకము ద్వారా ఆయన సైన్య బలగములో 4 లక్షల నౌకలు కూడా ఉండేవని తెలియవచ్చుచున్నది. ఈ వాస్తవములను గమనించినపుడు ఈ భారత భూమిని కలియుగములో పాలించిన చక్రవర్తులలో ఇంతకన్నా మిన్నయైన వారు లేరని తెలియవచ్చుచున్నది.
6. పైన తెలిపిన పండితులలో శ్రీకృష్ణ మిశ్ర తన ‘జ్యోతిష ఫల రత్నమాల’ లో తాను రాజ పోషణలో 70 సంవత్సరములున్నట్లు చెప్పుకొన్నాడు. (10 వ శ్లోకము జ్యోతిష ఫల రత్న మాల) అంటే క్రీస్తు శకమునకు అన్వయించుకొంటే క్రీ.పూ. 57 నుండి క్రీ.శ. 13 వరకు ఆయన వున్నట్లు తెలియవచ్చుచున్నది. దీనిని బట్టి విక్రమార్కుడు కూడా కనీసము అంత కాలము రాజ్యము చేసినట్లేకదా!
7. తన సామ్రాజ్యమును సుస్థిరము చేసుకొన్న తరువాత నేపాళమునకు వెళ్లి అక్కడ అంశువర్మ అను అత్యంత యోగ్యునికి పట్టముకట్టగా, విక్రముని పేరుతో శకమును, నేపాళమున క్రీ.పూ. 57న ఏర్పాటు చేసినాడు. (This information is published in the Indian Antiquary Vol. XIII. Pages 411 onwards.)
8. ఆయన ప్రాంతములను పాళెములగా విభజించి పాళెగాళ్ళను ఏర్పరచి గ్రామ వ్యవస్థను క్రమబద్ధము చేసినాడు.
కల్హణుని ‘రాజతరంగిణి’ ద్వారా కాశ్మీరు రాజ్యపు 82వ రాజగు హిరణ్యకుని మరణానంతరము వారసులు లేని కారణముగా అమాత్య సంఘము విక్రమ చక్రవర్తిని ఆహ్వానించి సమర్థుడైన వ్యక్తికి పట్టము కట్టమన, ఆయన తన సామంత రాజ్యమైన కాశ్మీరము అరుదెంచి మాతృగుప్తునికి రాజ పట్టాభిషేకము చేసి అక్కడి పరిస్థితులను చక్కబరచినాడు. (రాజతరంగిణి 3 – 125)
పైన ఉదహరించిన గ్రంధములే కాక ఈ దిగువ కనబరచిన జైన గ్రంధములలో కూడా మనము విక్రముని ప్రస్థాపన చూడవచ్చును.
1. ప్రభాచంద్రుని ‘ప్రాభావక చరిత్ర (క్రీ.శ.1127)
2. సోమప్రభుని కుమారపసల ప్రతిబోధ (క్రీ.శ.1184)
3. కాలకాచార్య-కథ(క్రీ.శ. 1279 కు మునుపు)
4. మేరుతుంగ ప్రబంధ చింతామణి (క్రీ.శ.1304)
5. జినప్రభ సూరి విరచిత వివిధ తీర్థ కల్ప (క్రీ.శ.1315)
6. రాజ శేఖరుని ప్రబంధ కోశ(క్రీ.శ.1348)
7. దేవా మూర్తి విరచిత విక్రమ చరిత్ర (క్రీ.శ.1418)
8. రామచంద్ర సూరి విరచిత పంచదండ ఛాత్ర ప్రబంధ(క్రీ.శ.1433)
9. సుభాషిలుని విక్రమ చరిత్ర(క్రీ.శ.1442)
10.అనేకానేక ‘పట్టావళులు’ (పట్టావలులు అంటే ప్రసిద్ధ జైన సన్యాసుల చరిత్రలు)
ఇంకొక ముఖ్యమైన విషయమును తెలియజేస్తాను. ఉనికిని కోల్పోయిన అయోధ్యను గుర్తించినవాడు. మహాభారత యుద్ధములో శ్రీరాముని సూర్య వంశ జాతుడగు ‘బృహద్బలుడు’ భీషణ మహాభారత సంగ్రామములో కౌరవులకు మద్దతుగా యుద్దముచేసి అసువులు బాసినాడు. ఆవిధముగా ఆతడు అయోధ్యను రాజదానుగా చేసుకొని పాలించిన చివరిరాజు అయినాడాతడు. ఆయన తదనంతరము అయోధ్యను తాకి తలచిన వారు లేరు విక్రముడు పరిపాలించే సమయము వరకు. శివ కేశవా భేదము లేని విక్రముడు ప్రపంచమునకే ఆదర్శమూర్తియైన ధర్మ మూర్తి రామచంద్ర మూర్తి అయోధ్యను కనుగొని పునః ప్రతిష్ఠింప దలచి అందు రాముని జ్ఞాపకార్థము ఆలయములను నిర్మింపదలచి ఆ పనికి చిత్తశుద్ధితో గడంగినాడు. నాటి శకులచేత మరుభూమిగా మార్చబడి ఉనికి కోల్పోయిన ప్రయాగను కనుగొని తద్వారా సరయూ నస్దిని అయోధ్యను గుర్తించగలిగినాడు. ఆనవాలే లేని ఆప్రాంతమునకు ఒక గుర్తును కూడా ఏర్పరచుకోన్నాడట. కానీ ఆయన ఉజ్జయిని చేరిన తరువాత అతిముఖ్య రాజకీయ కార్యకకార్య కలపములలో మునిగి ఆ విషయము మరచిపోయినాడు. ఆవిధముగా ఆయన ఉంచుకొన్న గురుతు కూడా కనుమరుగై పోగా, పట్టువదలని విక్రమార్కుడు తన ఆస్థానమునకు వచ్చిన ఒక మహాయోగిని ఆశ్రయించినాడు. ఆయన మహానీయుదగుటచే ఒక ఆవును గుర్తించి దానిని తన దూడతో వదిలివేసి దానిని అనుసరించమన్నాడు. అట్లు చేయబడిన ఆ ఆవు పితికే ప్రమేయము లేకుండానే తన పొదుగునుండి పాలను స్రవింపజేస్తుందో దానిని అయోధ్యగా గుర్తించమని చెప్పినాడు. అదేవిధముగా జేసి విక్రముడు అయోధ్యను గుర్తించి అక్కడ కొన్ని ద్ఫెవాలయములను కట్టించినాడు. ఆయన తదనంతరము అంత ప్రతిభావంతుడగు రాజు లేకపోవుట చేతనూ, బౌద్ధ ప్రభావము అధికమగుట చేతను ఆదేవాలయములు నామ రూపములు లేకుండా బౌద్ధ చైత్యములు వెలసినాయి.
ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు. ప్రసిద్ధ చరిత్రకారుడగు ‘Cunningham’ గారు చెప్పిన మాటలు. శంఖున పడితేనే తీర్థమన్నట్లు మనకు ‘విస్సన్న చెప్పినదే వేదము, జేమ్సు చెప్పినదే చరిత్ర’ కదా! 7వ శతాబ్దములో యువాన్త్సువాంగ్ అయోధ్యను దర్శించు సమయానికి విక్రముడు కట్టించిన దేవాలయాలు నిర్మూలనము కాగా బౌద్ధ ఆరామములు అక్కడ వెలసినట్లు చెప్పినాడు.
ఈ విధముగా క్రీ.పూ. 101 లో పుట్టి క్రీ.పూ. 82 నుండి క్రీ.శ. 19 వరకు పాలించిన సామ్రాట్ విక్రమాదిత్యుడు దైవానుగ్రహముతో, అనన్య సామాన్యమైన పరిపాలనతో, పాలితుల ప్రేమతో, దేశమును పరిపాలించిన మహనీయుడు. ప్రపంచ చరిత్రలోనే కలియుగమున ఇంత గొప్ప చక్రవర్తిని చూడము. అవక్ర పరాక్రముడైన విక్రముని చరిత్రనువక్రీకరించి తమ కుత్సితము కుళ్ళు కుతంత్రముతో చరిత్రలో విక్రమునికి స్థానమే లేకుండాచేయుటయేగాక భారతభూమికి అనేక కళంకములను ఆపాదించినారు పాశ్చాత్య చరిత్రకారులు, వారి భారతీయ అనుయాయులు, వామపక్ష చరిత్రకారులు మరియు మహమ్మదీయు చరిత్రకారులు.
ఇప్పటికైనా యువత కళ్ళుతెరచి వాస్తవములను గమనించి మన పూర్వుల ఔన్నత్యమును జగతికి చాటి పుణ్యము కట్టుకొంతారని ఆశిస్తున్నాను.
ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి
Awake ! Arise! Stop not till the goal is reached. Path is as sharp as razor’s edge and hard to go by.
లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన మార్గం దుర్గమమైనదే అయినా సంకల్ప బలం ఉన్న హృదయానికి సంభవం కానిది ఏమున్నది.
ఈ వ్యాసము వ్రాయుటకు వాస్తవ విషయములను సేకరించుటకు నాకు 3 సంవత్సరముల కాలము పట్టినది. అంటే 3 సంవత్సరములూ ఈ పని పైన మాత్రమే ఉన్నానని కాదు. తగిన సమాచారము దొరుకుటకు ఎంతో శ్రమ పడినాను అని తెలియజేస్తున్నాను. చదవండి. దేశానికి గల ఔన్నత్యమును లోకానికి చాటి చెప్పండి.
మనము ఎవరికన్నా తక్కువకాదు. ఈ వాస్తవాన్ని గుర్తించండి.
భారత భూమిపై శకుల పాలననంతము జేయనెంచి, భా
గీరతి భర్త యానతిన గ్రీష్మ ప్రచండ ప్రతాప పూషగా
వైరి సమూహమున్ దునిమి వైదిక ధర్మము ధాత్రి నింపుచున్
పారము లేని ప్రేమ నెడబాయక ఏలితివయ్య విక్రమా!
స్వస్తి.
No comments:
Post a Comment