Tuesday, 25 July 2017

శ్రీకృష్ణ

శ్రీకృష్ణ
కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి  వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక '' అంటే బ్రహ్మ. '' అంటే అనంతుడు. '' అంటే శివుడు. '' అంటే ధర్మము. '' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.
కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంషమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.
మస్త్య కూర్మ వరాహస్య నారశిమ్హస్య వామనః
రామో రామస్య రామస్య బుద్ధః కల్కి రేవచ
అన్న ప్రచారములోనుండే శ్లోకములో శ్రీకృష్ణ అవతారము కనిపించదు, కానీ రామావతారము వుంది. రాముడు పరోఖముగా, మనము ఎటువంటి నీతి నియమములను పాటించవలెను అని తానే ఆదర్శముగా నిలిచి మనలను అనుసరించమన్నాడు. తన భగవత్తత్వమును ప్రదర్శించలేదు. పైగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులుగా తానే ఉద్భవించుతాడు, కాకపోతే నిష్పత్తులు మారుతాయి.  అంటే పైన తెలిపినవి అన్నీ అంశలే. ఈ కృష్ణావతారము అలాంటిది కాదు. విష్ణువు దశావతారములలోని ఒక్కొక్క  అవతారములో ఒక్కొక్క దుష్టశక్తిని దునుమాడుతూ వచ్చినాడు. ద్వాపరములో త్రుణావర్తుడు, శకటాసురుడు, పూతన వంటి రాక్షసులు వున్నా వారు కంస, జరాసంధాది మానవ రాజన్యులకు లోబడి పనిచేసినవారే! అంటే ద్వాపరము లో అసుర గణములకు బదులుగా అసుర గుణములు భూమిపై వ్యాప్తిలోనికి వచ్చినాయి. అధర్మము ప్రబలింది, అజ్ఞానము వ్యాపించింది. అందువల్ల శ్రీకృష్ణుడు భూమిపై అవతరించవలసివచ్చినది. అసలు వ్యాసులవారే 'కృష్ణస్తు భగవాన్ స్వయం' - అని  అన్నారు. వాల్మీకి ఆ మాట అనలేదు. రాముడూ ఆమాట చెప్పలేదు. అందుకే పైన తెలిపిన శ్లోకములో శ్రీకృష్ణుడు లేడు. శ్రీకృష్ణుడికి కంస జరాసంధ శిశుపాల, నరకాసురాదులందరూ ఒక విధముగా బంధువులే!  అయినా ధర్మ సంస్థాపన కొరకు, సాధువులను రక్షించుట కొరకు ఆయన ఉద్భవించినాడు. మిగతా ఎవతారములలోలేని విశిష్ఠత ఈ అవతారమునకు మాత్రమే వుంది. ఈ అవతారములో మాత్రమె 'కృష్ణం వందే జగద్గురుం' అన్నారు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన. ఆయనే భగవద్గీతలో చేబుతాడు 'యోగక్షేమం వహామ్యహం' అని. యోగం అంటే లేనిదీ లభించుట క్షేమం అంటే ఉన్నది నిలుపుకొనుట. ఇటువంటి ఉపదేశాలు మనకు విష్ణువు బోధించినట్లు ఇతర అవతారములలో అగుపించవు. ఆసలు ఈ విహయమును గమనించండి. విష్ణు సహస్ర నామమావళిని భీష్ముడు ధర్మజునకు బోధించితే శ్రీకృష్ణుడే స్వయంగా  ధర్మ రాజునకు శివసహస్రనామావళిని బోధించుతాడు. ప్రభాస తీర్థములో (నేటి సోమనాథ్)శివ దీక్ష శివ పూజ నిర్వహించుతాడు. శివ పూజా ప్రాశస్త్యం బోధించాడు. పైగా ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించుతాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెబుతాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. అంతేకాక శ్రీకృష్ణుని భంగిమ, ముఖ్యముగా మోవికి మురళిని ఆనించియుండేది, నటరాజ తాండవము లోని పాద భంగిమ యొక్క కుంచిత పాదమును గుర్తుకు తెస్తుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు (శివసహస్ర నామాలలో ఒకపేరు).
సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీతలు భ్రమర గీతలు. కృష్ణుని భంగిమ విష్ణువు ఆవాసము క్షీరసముద్రమని మనము వింటాము,అంటాము. క్షీర సముద్రము, ఇక్షుసముద్రము, అన్న పేర్లు సంకేతములు. రంగు మాత్రమే పరిగణనలోనికి తీసుకోవలెను కానీ రుచికాదు. ఆవిధముగా క్షీరసముద్రమును మనము ఆధునిక పరిభాషలోని Milky Way గా తీసుకొనవచ్చు. ఆయన సృష్టికోసం  విశ్వాన్ని సృష్టించినాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు , అతల, వితల,సుతల, తలాతల, రసాతల  పాతాళ మనే 7అధోలోకాలు సృష్టించినాడు. సృష్టి కొనసాగింపునకు సత్యలోకములో  బ్రహ్మను సృష్టించినాడు. ఇక్కడ మనము తెలుకొనవలసిన ముఖ్యమగు విషయము ఒకటి వుంది. ఈ బ్రహ్మలోకంపైన వైకుంఠం, కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులు, శివపార్వతులూ, రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వరుసగా వారి వారి లోకాలలో ఉంటారు. సంఖ్యులు ప్రకృతి పురుషుడు అని చేసిన ప్రతిపాదనకు పుష్టిని కూర్చుటయే సరస్వతీబ్రహ్మ, లక్ష్మీనారాయణ, సాంబశివ ( స+అంబ+శివ) తత్వము. ఆవిధముగా గోలోక నివాసులు రాధా కృష్ణులు. 'గొ' అన్న శబ్దమునకు గల అనేకార్థములలో కిరణములు, వేదములు, వృషభ జాతి అన్న అర్థములు వున్నాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు భూమిపైన గోలోకమునే   ప్రతిష్ఠించినాడు. రేపల్లెలో ఆలమందలతోనే కదా ఆయన అనుబంధము. బ్రహ్మవైవర్త పురాణములోని కృష్ణ ఖండములో ఈ వివరాలను మనమ తెలుసుకొనగలము.
శ్రీ కృష్ణునికి మానినీ చిత్తచోరుడనే ఒక ప్రథ అన వచ్చు అపప్రథ అనవచ్చు. మగవారికనా ఆడువారిలో చంచల స్వభావమేక్కువ అని పెద్దలు చెబుతారు. అందుకే స్త్రీ కి చంచల అన్నపేరు కూడా వుంది. ఈ చంచల స్వభావము కలిగినది చిత్తము అంటే మనసు. శ్రీకృష్ణుడు మనసు దొంగాలించినాడు అంటే వేరెవ్వరికీ అణుమాత్రముకూడా చోటు లేక తానె నిండియున్నాడని అర్థము. మరి వారే అట్లుంటే ఇక మగవారిని గూర్చి తలువనే అక్కరలేదు. గోకులము వదలి అన్న బలరామునితో కూడి, అక్రూనితో మధుర వేడలినతరువాత ఆయన కార్యకలాపములు మారిపొయినాయి.  పైగా గోకులములో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు తక్కిన వారంతా స్త్రీలే! బృందావనములో వల్లభాచార్యుల వారిని చూడ దలచి సాధ్వి మీరాబాయి సందేశమునంపితే ఆయన ఆడువారిని చూడనంటాడు. అప్పుడు ఆమె జవాబుగా బృందావనములో కృష్ణుడు ఒక్కడే పురుషుడు అని పంపుతుంది. తన తప్పు తెలుసుకొని వల్లభులవారు మీరాబాయిని కలుస్తారు.
ఈ విధముగా ఆయన మానినీ చిత్తచోతుడైపోయినాడు.
ఇంకొక విచిత్రమైన విషయము ఏమిటంటే అసలాయనకు కృష్ణ అన్న నామకరణము ఎవరు చేసినట్లు? చెరసాలలో బారసాల జరుగలేదు కదా! నందవ్రజములో గర్గమహాముని వస్తే ఆయనకు బాలుని చూపితే ఆయన ఈ బాలుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఈతనిని కృష్ణ అన్న పేరుతో పిలవండి అనిచేప్పినారు. ఈ ప్రకారముగా ఆయన గూర్చి ఏమి చెప్పుకొన్నా విచిత్రమే! పైగా అతిచిన్నవయసులోనే మహాబలవంతులగు రాక్షసులను చంపడము వేరు ఏ అవతారమునందునూ జరుగలేదు.
కృష్ణునికీ కాత్యాయనీ వ్రతానికీ గోపికావస్త్రాపహరణానికీ సంబంధం ఏమిటి అన్నది ఒకసారి చూస్తాము. వ్రజభూమిలోగోపికలు నందకిశోరుడే భర్తకావాలని కాత్యాయనీవ్రతంచేస్తారు. కాళిందిలో(యమునలో) స్నానంచేసి అమ్మవారిని పూజిస్తారు. తమ వస్త్రాలు ఒడ్డునే ఉంచి నదిలోదిగుతారు. స్నానంచేస్తూండగా కృష్ణుడు వచ్చిఆ వస్త్రములు అపహరించి ఆప్రక్కన ఉన్న వృక్షంపైన ఎక్కి వాళ్ళను పిలుస్తాడు. మీరు వస్త్రాలు లేకుండా వ్రతభంగం చేసినారు. (నదీ స్నానమునాచారించునపుడు వస్త్ర ఆచ్చాదన లేకుండా స్నానము చేయకూడదు.) పైకి వచ్చి నమస్కారంచేయండి. అనిచెబుతాడు. కథ తెలిసినదే. గోపికలు జీవాత్మలు. అజ్ఞానం వస్త్ర రూపంలో వారిని కప్పి యుంచింది. అజ్ఞానపు తెరతొలగిస్తే అంతా పరమాత్మస్వరూపమే. చెట్టుపైనా క్రిందనూ ఉన్న వస్తువు ఒకటే. వ్రతఫలం అప్పటికప్పుడు పురుషరూపంలో కాత్యాయనియే ఐన కృష్ణ దర్శనం లభించింది. వారి అజ్ఞానపు తెరలు తొలగినవి.
పైన తెలిపిన విషయములనుబట్టి శ్రీకృష్ణుడు సకలదేవతా స్వరూపమని, కేవలము విష్ణ్వంష కాదని తెలియవస్తుంది. ఈపరమాత్మ తత్వము ఎతయినా చెప్పుకొంటూ పోవచ్చు. అసలు గోలోక వాసి మరియు రాదా సమేతుడగు  శ్రీ కృష్ణుని ఎతోమంది ఎన్నోవిధములుగా తమ మతమునకు మూలపురుషునిగా చేకొన్నారు.
మహారాష్ట్రమున జ్ఞానేశ్వర్, నామదేవ్, జనాబాయి, ఏక్ నాథ్, మరియు తుకారాం తతతమ పంథాలో శ్రీకృష్ణుని సాధించిన మహాభక్తులు. మీరాబాయి సరేసరి.  చైతన్య మహాప్రభు యొక్క గౌడీయ సాంప్రదాయమును ISCON వారు ప్రపంచాదేశాలలోనే ఎంతో ప్రాచుర్యమునకు తెచ్చినారు. కలిసంతారణ ఉపనిషత్తు లోని హరే కృష్ణ (1) హరేకృష్ణ(2) కృష్ణ కృష్ణ హరే హరే(3) హరేరామ(4) హరేరామ(5) రామరామ హరే హరే(6) అన్నది వీరి మహా మంత్రము. వియత్నాం, కంబోడియ, థాయ్ లాండ్ లో కృష్ణభక్తిని విస్తారముగా మనము చూడవచ్చు.
ఈ విధముగా శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపునిగా కాకుండా గోలోక వాసియగుచు కృష్ణునిగానే కొలువబడినాడు.




Wednesday, 19 July 2017

గోమాత గొప్పదనము (రాజీవ్ దీక్షిత్ కోర్టు కేసు)

గోమాత గొప్పదనము (రాజీవ్ దీక్షిత్ కోర్టు కేసు)
అసలు విషయమును గూర్చి తెలుపుటకు ముందు అందుకు నడుముకట్టి ప్రజలను చైతన్యవంతులను చేయ సమకట్టి తన జీవితమునే త్యాగము చేసిన మహానుభావుడు రాజీవ్ దీక్షిత్ (రాజీవ్ గాంధీగా పొరబాటు పడేరు సుమా!).  తన ప్రసంగాల ద్వారా కొత్తతరం భారతీయులలో దేశభక్తిని నింపి, నూతన శక్తిని ప్రేరణను ఇచ్చి, భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేసిన రాజీవ్‌ దీక్షిత్‌ (నవంబర్ 30, 1967 - నవంబర్ 30, 2010), దేశ భక్తి, వైదికశాస్త్రానురక్తి, పాశ్చాత్య భావదాస్య విముక్తి, మూర్తీభవించిన  మహోజ్వల శక్తి. ఈయన 1967 నవంబర్ 30 , మిథిలేష్ కుమారి,రాథేశ్యాం దీక్షిత్  దంపతుల కుమారునిగా వారి స్వగ్రామం ఉత్తర్ ప్రదేశ్ లోని నాహ్ గ్రామంలో జన్మించినాడు. తల్లితండ్రుల సంరక్షణలో మాధ్యమిక విద్యను కొనసాగించిన తరువాత 1994లో  లోని ఐ.ఐ.టి. అలహాబాదు (ప్రయాగ) లో బి.టెక్ చదివినారు. తరువాత ఐఐటీ కాన్పూర్ లో శాటిలైట్ కమ్యూనికేషన్‌లో యం.టెక్‌ చేశారు. తరువాత ఫ్రాన్స్‌లో టెలికమ్యూనికేషన్‌లో పిహెచ్‌.డి. చేసినారు. అటుపిమ్మట  మనగుండెలలో నిలచిపోయిన  భారతీయ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె.అబ్దుల్‌కలామ్‌ గారితో కలిసి సి.ఎస్‌.ఐ.ఆర్‌.లో శాస్త్రవేత్తగా కలిసి పనిచేసినారు. భారతదేశానికి ఎలా నూతన శక్తిని ఇచ్చినారో, అదే విధంగా తన ప్రసంగాల ద్వారా కొత్తతరం భారతీయులలో దేశభక్తిని నింపి, నూతన శక్తిని, ప్రేరణను ఇచ్చి, భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేసిన రాజీవ్ దీక్షిత్ ను అభినవ వివేకానందుడనవచ్చు.
స్వదేశీ చికిత్స పేరుతో చరకుడు,'వాగ్భటుడు' మొదలైన మహనీయులు రాసిన ఆయుర్వేద రహస్యాలను సామాన్య జన బహుళ్యంలో ప్రచారం చేసి, అల్లోపతిలో లక్షలు పోసినా నయం కాని అనేక వ్యాధులకు సులువైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు 'రాజీవ్‌ దీక్షిత్‌'. రోగాలను నయం చేసుకోవడమే కాదు, రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పినారు. అత్యంత విచారకరమయిన విషయము ఏమిటంటే ఆయన 43 సంవత్సరములకే అనుమానాస్పద పరిస్థితిలో మరణించడము. నేటికీ అది దేవరహస్యమే!
ఇక అసలు విషయమునకు వస్తాము. 1998 సంవత్సరమునకు ప్రభుత్వముచే గుర్తింపబడిన గోవధ్యశాలలు 3600 ఉండినవి అని ఒక అంచనా. అక్రమశాలలయితే 36,000 పైచిలుకేనని, ఈమొత్తము వధ్యశాలలలో
2, 50, 00, 000 గోసంతతిని హతమారుస్తారని (గూగుల్ నుండి సేకరణ) తెలియవస్తూ వుంది.
విషయమిదయితే, 1998 లో అఖిల భారత్ గొ సేవక్ సంఘ్ రాజీవ్ దీక్షిత్ ఇంకా కొందరితో తన స్వస్థలమైన వార్ధా లో స్థాపించగా దానికి మరొక సంస్థ అహింస ఆర్మీ ట్రస్ట్ అన్న పేరుతో జతయై అత్యున్నత న్యాయస్థానములో Case వేసినారు. తరువాతి కాలములో వీరితో గుజరాత్ ప్రభుత్వము కూడా చేరినది.
వధ్యశాలలు నడిపేవారు ఆవిధముగా ఎందుచేయకూడదు అని Counter వేసినారు.
మాంసాహార విక్రేతలు చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులను  ఈ కేసులో పెట్టుకున్నారు.  వారిలో కొంతమంది న్యాయవాదులు 35 లక్షల ఫీజు తీసుకునేవారున్నారు. మాంసాహారుల తరఫున కేసును వాదించిన వారిలో శ్రీ సోలి సోరాబ్జీ, ఫీజు ఇరవై లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ ఇరవై రెండు లక్షలు, శ్రీ మహేష్ జేత్మలానీ 32 - 35 లక్షల దాకా తీసుకునే అగ్రగాములున్నారు. వీరంతా మాంసాహారుల తరఫున కేసును వాదించారు.
ఇక మన శ్రీ రాజీవ్ భాయికు న్యాయవాదిని పెట్టుకొనడానికి తగినంత డబ్బు లేదు. హేమాహేమీలు మాంసాహారుల తరఫున వాదిస్తున్నారు. తన తరఫున వాదించటానికి అంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత " కోర్టు మీకు న్యాయ సహాయంఇస్తే ?" అని అడిగినప్పుడు " అది ఆనందమే కానీ, మా కేసు మేము వాదించుకొనడానికి అనుమతించాలని" శ్రీ రాజీవ్ భాయి కోరారు. అలా అనుమతిస్తునే, కోర్టు శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించింది.  ఇక కేసు కొనసాగింది.
వాట్సప్ లో జాజిశర్మగారికి  వచ్చిన ఆంగ్ల పాఠానికి వారు చేసిన స్వేచ్ఛానువాదం చదవండి.

వారి వ్యర్ధవాదనలేమిటో చూద్దాం.
మొదటి వ్యర్ధవాదన:  గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.
రెండవ వ్యర్ధవాదన:  గోవులకు, ఇతర జంతువులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేదు. అవి ఆకలితో చచ్చేకన్నా వాటిని చంపటం మంచిది.
మూడవ వ్యర్ధవాదన:  మనదేశంలో మనుష్యులకే చోటు లేదు. పశువులను ఎలా పోషిస్తాం.
నాలుగవ వ్యర్ధవాదన:  మనకు అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతుల వలన వస్తుంది.
ఐదవ వ్యర్ధవాదన:  మాంసాహారం తినడం మతపరమైన హక్కు .
ఈ వ్యర్ధవాదనలు చేసిన వారిలో ముస్లీం మతము లోని "ఖురేషీ" అనే వర్గము వారు ఎక్కువ హింసకు పాల్పడేవారే. వారే ఈ వ్యర్ధ వాదనలు చేసిన ప్రప్రధములు. 
ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనముతో , నిగ్రహముతో అన్ని వివరాలతో గణాంకములతో సహా కోర్టు వారి ముందుంచారు.
ఆ వ్యర్ధవాదనలకు శ్రీ రాజీవ భాయి సమాధానాలు ఏమిటో ఒకటి తరువాత ఒకటి చూద్దాం ( చదువుదాం ) పదండి.
గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.
 ఈ వ్యర్ధవాదనను శ్రీ రాజీవ్ భాయి గణాంకాలతో కోర్టువారికి ఇలా వివరించారు.
   ఒక గోవును చంపితే ఎంత మాంసం వస్తుంది, ఎంత రక్తం, ఎన్ని ఎముకలు అనే గణాంకాలతో ఈ వివరణ సాగింది.
 ఒక ఆరోగ్యం గా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇక 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/- . ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-
ఈ వ్యర్ధ వాదనను శ్రీ రాజీవ్ భాయి తన గణాంకాలతో శక్తివంతంగా ఎలా  తిప్పికొట్టారో చదవండి. ఆ గణాంకాలు ఇలా ఉన్నాయి.
ఒక ఆరోగ్యమైన గోమాత రోజుకి  పదికిలోల గోమయం, ( ఆవుపేడ ), మూడు లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారు అవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు " ఇది ఎలా సాధ్యం " అని అడిగారు. ఆయన తన వాదనను నిరూపించటానికి కొంత సమయం కావాలన్నారు.
దానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారు చేసి కోర్టువారికి చూపించి, I R C  శాస్త్రవేత్తలను పిలిపించి తను గోమయంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువును పరీక్షింపచేశాడు. కోర్టువారి ఆధ్వర్యంలో ఆ శాస్త్రవేత్తలు సేంద్రీయ ఎరువును పరీక్షచేసి ఈ సేంద్రీయ ఎరువు అత్యుత్తమ ఎరువుగా నిర్ధారించారు. ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావలసిన 18 సూక్ష్మపోషకాలు అన్నీ చ్ ఆ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన , మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం మూడు ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా పదిరెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను ఒప్పుకున్నది.
ఈ వ్యాసంలో గోవధ అనే పదం  అనేకమార్లు తప్పనిసరిగా వాడాల్సినందుకు బాధపడుతున్నాను. గోమాత నన్ను, చదివిన మిమ్ములను క్షమించుగాక !  --జాజిశర్మ
శ్రీ రాజీవ్ భాయి తన వాదనను కొనసాగిస్తూ, కోర్టుకి అభ్యంతరం లేకపోతే, తను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోమయము నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ, తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా చేస్తున్న తమ కృషిని చూడమని అహ్వానించారు.
తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో ఆరు రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయము తెచ్చి పెడుతుంది.  ( ౩౩ కిలోల ఆవు పేడ నుండి  330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా ! 330 X Rs.6/- ).  పైగా ఈ గోమయం వేసే మాతలకు ఆదివారాలు కానీ, శెలవులు కానీ లేవు కదా ! ఈ లెక్కన గోమాత వలన  ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/- ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం.
రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయాన్ని, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక గోమాత తన జీవిత కాలంలో వచ్చే ఆదాయము దాదాపు Rs.1,31,40,000/- ( అక్షరాల ఒక కోటి ముప్పై ఒక్క లక్షల నలభై వేలు ) దాటిపోవడం చూచి ఆశ్చర్యచకితులయ్యారు.
వేల సంవత్సరాల పూర్వం మన పురాణాలలో గోమయంలో "లక్ష్మి" నివసిస్తుంది అని పూర్వీకులు ఎందుకు ప్రవచించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు.
ఇది మన పురాణగంధ్రాలను హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు వంటబట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన పురాణాలు "గోమయం లో "లక్ష్మి" నివాసముంటుంది అంటే , వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారు అని నవ్విన వారి మొహాలు "తెల్లబోయి" నొళ్ళు వెళ్ళబెట్టారు.
ఇఖ "గోమూత్రము" మీద శ్రీ రాజీవ్ భాయి తన వాదన అద్భుతమైన రీతిలో కొనసాగించారు.
  " ఒక గోవు రోజుకి 2 లేక 2.25  లీటర్ల దాకా మూత్రము విసర్జిస్తుంది. ఈ గోమూత్రం అనేక రకాల వ్యాధులకు ,   మధుమేహము, క్షయ, కీళ్ళ వాతము, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగుకు సంబంధించిన వ్యాధులు మొదలైన  48 రకాలైన  రోగాలన్నీ సమూలంగా నిర్ములించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపుతున్నాయి. ( చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా చెప్పాడు. )

గణాంకలు సమర్పిస్తూ, శ్రీ రాజీవ్ భాయి ఇలా చెప్పారు. ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం "పేటెంటు" కూడా చెయ్యబడింది. గోమూత్రానికి మూడు పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేసుకుంటున్నది. 

అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం ( వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన  గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/- , వార్షిక ఆదాయం
రూ.3000/- X 365 = రూ.10,95,000/- , ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 ( అక్షరాల రెండు కోట్ల పంతొమ్మది లక్షల రూపాయలు ) .గోమూత్రము వలన కోట్ల ఆదాయం.

ఇదే గోమయం  " మిథైన్ " అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో పచానానికి వాడుకోవచ్చును.మన ద్విచక్ర  వాహానాలను నడుపుకోవచ్చును. మన కార్లు కూడా ఈ వాయువును ఉపయోగించి నడుపుకోవచ్చును.

ఈ వాదన  ధర్మాసనం లోని ఒక న్యాయధీశుడు నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి " మీరు అనుమతిస్తే, మీ  కారుకు మిథైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీరే పరీక్షించండి. మీ కారు మీరే డ్రైవ్ చెయ్యండి. " అని తన వాదన పటిమ చూపించారు. ఆ న్యాయాధీశుడు  అనుమతించి, తన కారును మూడు నెలలు మిథైన్ వాయువు తో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు యాబై, నుండి అరవై పైసల కంటే ఎక్కువ ఖర్చు  కాకుండా చూచి ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు నాలుగు రూపాయలు ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.
ఆ న్యాయధీశుడు సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నాడు.

శ్రీ రాజీవ్ భాయి గణాంకాలు అక్కడితో ఆగలేదు. రోజు వచ్చే  పది కిలోల గోమయం తో ఎంత మిథైన్ వాయువు తయారు అవుతుందో , అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొడుపు చేస్తుందో చెప్పి ధర్మాసనమునకు తన గణాంకాలు సమర్పించాడు. దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన  దాదాపు ఒక లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమవుతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనఖర్లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనఖర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది తల్లి గోమాత వలన సాధ్యం. ఆ మాత "శ్రీలక్ష్మి "యే !!

   ఈ వాదన విని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి, ఉప్పెనలా శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన  గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనను "సత్యము" అని అంగీకరించి, " గోమాతను సంరక్షించడమే " దేశానికి ఆర్ధికంగా మంచిదని, గోమాత వలననే భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు.
సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, మాంసాహారుల తల బొప్పికట్టి, దిక్కు తోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోంది అని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్లాది రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు.
అప్పుడు మాంసాహారులు తమ తురుపు ముక్క వేశారు. అది " గో మాసం తినడం వారి ఇస్లాం  మతపరమైన హక్కు " అనే వాదన లేవదీశారు.  శ్రీ రాజీవ్ భాయి "అయితే, ఎంత మంది ఇస్లాం పాలకులు ఈ మతపరమైన హక్కును వాడుకున్నారు? ఈ మతపరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.
అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు. " ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు  గో మాంసము తినడం మీద ఏమి చెప్పాయో ? ఆ హక్కు అనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని " ఈ కమిటీ ని ఆదేశించారు.
ఈ కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, తేల్చి చెప్పినది.
 " ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు "బాబర్ " ఆయన తన  "బాబర్ నామా" లో గోవధ నేరమని, ఆలాంటి నేరం తను చనిపోయినా  ఈ దేశంలో  జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు.
ఇక్కడ దక్షిణాపధం లో టిప్పు సుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసే వాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలా మంది ఈ శిక్ష లో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి , గోవధ కు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు".
. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయివాదన కు మరింత పుష్టి వచ్చింది.
 " గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు.
తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీంకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా , హదీద్ లు , " గోవును రక్షించ మని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి " అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అమాయక ప్రాణి అని , పత్రివారు దాని పట్ల దయ గలిగి ఉండాలి అని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో " గోవును వధించిన వాడికి నరకం లో కూడా స్థానం లేదు " అని చెప్పారు.
తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు , గోవధ ను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాంమత హక్కు ఎలా అవుతుంది.  ఈ మాంసాహారులను, మక్కా, మదీనా లలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు." అని ముగించారు.
మాంసాహారులు మాన్పడిపోయారు.  సుప్రీంకోర్టు మాంసాహారులను , పదే పదే  అడిగింది.  వారు ఇస్లాం లో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు.
సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం  ఈ అత్యంత కీలకమైన కేసులో  26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది,
ఈ తీర్పును మీరు సుప్రీంకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును.
.తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది తన తీర్పులో ఇలా పేర్కొంది.
  "  గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము,   గోవును రక్షించడం  రాజ్యాంగ ధర్మముగా భావించాలి. మనం మన రాజ్యాంగములో , " రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగము వ్రాసుకున్నాము. ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది. "
సుప్రీంకోర్టు తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గో సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి  ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది.
చివరగా శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం. శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోమాసం పోతతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. అదే మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసిన ఘటన, గో సంరక్షణతో మొదలయ్యింది.
గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం . అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరము కాదు.
వందే గోమాతరం.  శ్రీ రాజీవ్ భాయి ! తమకు  భారత జాతి యావత్తూ ఋణపడింది.
ఇది ఓపికగా చదివిన మీకు ధన్యవాదములు.

స్వస్తి

Tuesday, 18 July 2017

ధనుర్మాసం – ప్రాధాన్యత

ధనుర్మాసం – ప్రాధాన్యత :
సనాతన దరమే సంబరాల పుట్ట. భక్తీ ప్రపత్తులను పూల తట్ట. అర్థవంతమైన పండుగల గుట్ట. కృష్ణగీతను తేనే తెట్ట. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు పరమాత్మ. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించుటచే ఇది ధనుర్మాసమౌతూవుంది. దీని ప్రశస్తి క్లుప్తముగా తెలుసుకొందాము.
ధనుస్సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక.
ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు. ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ. ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కలదు.
వైష్ణవాలయాలకు భక్తులు శుచి శుభ్రతలు కలిగినవారై తెల్లవారు ఝామున వెళ్లి , ముందురోజు పూజారికి 'తళిహ' (అంటే స్వామికి మనము కోరిన నైవేద్యమొనరించుటకు  గానూ వస్తు సంభారములు ముందురోజే ఇచ్చి లేక తగిన డబ్బు ఇచ్చి , ఉప్పుపొంగలో, చెక్కెర పొంగలో, పుళియోగిరమో(పులిహోర) చేయ తెలిపితే, మనము చేరు సమయానికి ఆయన సిద్ధముగా చేసియుంచి పరమాత్మకు నైవేద్యమిడి మనకు ప్రసాదమును అందజేస్తాడు. ఇంటిల్లపాది దానిని భుజించి ఎంతో సంతృప్తులౌతారు. అసలు చలి పొద్దున్న వేడి వేడి ఉప్పుపొంగలి తింటూవుంటే మనసు ఆనందమయమై నిజంగానే భగవంతుని దర్శించుకొంటుంది.
స్వస్తి.

Sunday, 16 July 2017

కార్య శూరత (Management Science)


నేడు పుట్టగొడుగులుగా మన మధ్యకొస్తున్న అనేకానేకములగు మానవ వనరుల మరియు మానవ సంబంధముల సంస్థలను(Human Development, Man Management Organisations) మనమెన్నో చూస్తున్నాము. ఎన్నో విషయాలలో వారు తమ మేదోవర్గపు సలహాలతో ఆచరణలో ఉంచిన నియమావళి సత్ఫలితములనివ్వక, అమెరికానే ఆర్ధిక సంక్షోభములో అతలాకుతలమై పోయింది. మన వేద శాస్త్రములను ఆకళింపు చేసుకొన్న శ్రీల ప్రభుపాదులవారు మన ఇంధనశక్తి (positive Energy = శక్తి సంకలనము) ని ఏవిధముగా పెంపొందించగలుగవచ్చునో ఎంత పరిశీలనాత్మకముగా చెబుతున్నారో చూడండి.

ఈ శ్లోకమును అభయ చరణారవింద భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వామీ వారిది అని పైనే తెలియబరచినాను.

उत्साहन् निश्चयत धैर्यात
तत् तत् कर्म प्रवर्तनात
संगत्यागत सतोवृत्तिः
षड्भिर् भक्तिः प्रसिद्यते

ఉత్సాహాన్ నిశ్చయత్ ధైర్యాత్
తత్తత్ కర్మ ప్రవర్తనాత్
సంగత్యాగాత్ సతోవృత్తిః
షడ్భిర్ భక్తిః ప్రసిద్యతే

1. ఉత్సాహము 2. పట్టుదల 3. ధైర్యము 4. కర్మానుసార సమయస్ఫూర్తి 5. అయోగ్యుని విడుచుట 6. యోగ్యుని అనుసరించుట అన్న ఈ ఆరు గుణములను పుణికి పుచ్చుకొంటే ఎపనినయినా సాధించ వచ్చును. పని మంచిదయితే ఫలితము భగవంతుడు కూరుస్తాడు అన్న నమ్మకముతో మనము పని చేయవలసి వుంటుంది.

ఇప్పుడు ఈ ఆరు విషయాలను గూర్చి కొద్దిగా విశ్లేషించుకొందాము.
1. ఉత్సాహము : ఏదయినా ఒక పనినిని తలపెట్టితే ప్రోత్సాహమిచ్చేదే ఉత్సాహము.దానినే ఆంగ్లములో Motivation అంటారు.అందుకే మన పెద్దలు 'మనసుంటే మార్గముంటుంది' అంటారు.
2. పట్టుదల: పట్టుదల వున్నవాడు తాననుకొన్నది సాధించుటకు ఎంతయినా కృషి చేస్తాడు. అందుకే 'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్నారు. 'సాధనతోనే ధరన పనులు సమకూరుతాయి.
3. ధైర్యము: ఒక రాజు ఎదో తప్పిదము చేయుటతో అష్ట లక్ష్ములు ఆతనిని విడిచి పెట్టి పోతూవుంటే ఆతను పట్టించుకోడు. ఒక ధైర్య లక్ష్మి పోతూవుంటే మాత్రము ఆ తల్లి చేయి పట్టుకొని మాత నీవు ఒక్కదానివి నాతో వుంటే చాలు. నీవులేకపోతే ఇక నేను లేను అంటాడు. అంతే కదా! ధైర్యము లేకపోవుట అంటే భయమునకు మనిషి ఆలవాలమైనట్లే! బీరువు చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే కదా భర్తృహరి కూడా 'ఆరంభింపరు నీచమానవులు..' అని అంటూ ' ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్దార్థము ఉజ్జగించరు' అన్నాడు. కావున ఎవరికయినా తలపెట్టిన పనిని పూర్తి చేయాలంటే అత్యంత అవసరము ధైర్యము. ధైర్యమును గూర్చి వ్రాసిన ఈ క్రింది పది వాక్యములలో మొదటిది తప్ప మిగతావి నేను వ్రాసినవి. ఒక్కసారి గమనించండి.
1. ధైర్యే సాహసే లక్ష్మి
2. ఆపదలోసాహాసం అత్యుత్తమ సహవాసం
3. ఎదలో ధైర్యము వుంటే అదురెక్కడ బెదురెక్కడ
4. ధైర్యము లేకుంటే దయనీయమే!
5. మానవత్వమున ధైర్యము మణి పొదిగిన ఆభరణము
6. ధైర్యమొక్కటున్న నీవు ధరణినేలగలవన్నా
7. ధైర్యమున్న చాలునులే దుఃఖమంత దూరములే
8. పట్టు విడకు నీ సాధన ఫలియించును శుభ కామన
9. ధైర్యమున్న బాహుబలి లేకుంటే విధికి బలి
10. ధైర్యము ధనువైతే నిశితబుద్ధి నీ శరము
కావున కార్యార్థికి  ధైర్యము యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదో దీనిని బట్టి అర్థము చేసుకొన వచ్చు.

4. కర్మానుసార సమయస్ఫూర్తి : సమయస్ఫూర్తి లేకుంటే మనము లేము మనుగడ లేదు.ఒక మరచీలను కొయ్య నుండి విడదీయాలంటే Screwdriver కావాలన్నది అందరికీ తెలిసిన విషయమే! అవసరమేర్పనపుడు Screwdriver లేదని ఊరకుండిపోము కదా! ఎదో ఒక రేకును తీసుకొని దానిని వూడదీయ ప్రయత్నమూ చేస్తాము. రాయల ఆస్థానమునకు పోతూ ద్వారపాలకుడు తిమ్మయ్య కప్పుకొన్న శాలువను తీసుకోనవలెనని అష్ట దిగ్గజములలో నలువురు అనుకొంటారు. మొదటి ముగ్గురు ఎవరయినా నాలుగవ వాడు తెనాలి రామలింగడు. మొదటి ముగ్గురూ తిమ్మప్పను గూర్చి చెప్పిన మూడు పాదములు ఆతనికి తమ ఉద్దేశ్యము తెలియజేయలేక పోయినాయి. రామలింగడు మాత్రము 'నాకీ  పచ్చడమె చాలు నయముగ నిమ్మా!' అని తన సమయస్పూర్తిని ప్రకటించి శాలువా పొందినాడు. ఇక్కడ రామలింగని సమయస్పూర్తి రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి ఆ నలుగురిలో తానూ చివరిగా నిలువడం. ఎందుకంటే పద్యమునకు నాలుగు పాదములు కదా! నీశాలువ నాకీ అని మొదటి ముగ్గురూ అనలేరు అంటే తరువాతి వారు పద్యాన్ని పూర్తి చేయరు. ఇక నాకెందుకులే అనుకొంటారు. అదీ విషయము. కావున మన మాట సూటిగానూ సున్నితము గానూ ఉంటూ సమయస్ఫూర్తి కలిగి ఉండవలెను.

5.అయోగ్యుని వదలుట : కుక్క తోక పట్టుకొని గోదావరినీదుట సాధ్యమా! కావున నీ కార్యాచరణలో అయోగ్యుని వుంచుకొనుటచే పని పూర్తికాక పోవుటయేగాక చేతగానివాడన్న పేరు ఆ కార్యాచరణ దళపతి కూడా మూటకట్టుకోనవలసి వస్తుంది. కావున ఇక్కడ పని పూర్తియగుట మాత్రమే ముఖ్యము. ఇది ధనుర్విద్యా ప్రదర్శనలో అర్జనుని గురివంటిది, కావున nee దృష్టి నుండి అతనిని తొలగించుకొనుట తప్ప వేరొక మార్గము వేడుక వీలు లేదు. తస్మాత్ జాగ్రత.

6. యోగ్యుని అనుసరించు: చిత్తశుద్ధితో యోగ్యుని అనుసరించినా అనుకరించినా నీ కార్యము నెరవేరినట్లే! యుద్ధము చేయను అని ఖండితముగా కృష్ణుడు చెప్పినా, తమసైనికబలగము 7:11 నిష్పత్తిలో వున్నా కృష్ణుని కోరుకొని అర్జనుడు మహాభారత యుద్ధమే గెలిచినాడు. ఈ ఉదాహరణ చాలదా కార్యశూరునికి!
మన ధర్మములో లేని మర్మము లేదు. ఆ కాలమునకు పాశ్యాత్య జాతులలో నాగరికత లేదు కావున వారు ఇంతటి జీవన శైలిని , నీతి నియమములను పాటించలేక పోయినారు. ఈ నాడు వారిదే మేధస్సని, వారిదే నాగరికత యని గంగను వదలి మురికి గుంటలో ఈదులాడు చున్నాము. మీలో ఎవరయినా నన్ను ఈ మాట అడుగవచ్చు.  వారిది (1896 - 1977) 20వ శతాబ్దమే కదా అప్పటికి పాశ్చాత్యులు ఎంతో నాగరికులైయున్నారు కావున వీరు వారి నుండియే నేర్చుకొని యుండవచ్చుకదా యని. కానీ వారు 1950 లోనే సన్యాస దీక్ష తీసుకొని జీవితమును వేదాధ్యయనము భక్తితత్వ ప్రచారములోనే జీవితమును గడిపినారు. వారి ధీజలధి  లో ప్రభవించిన ఒక స్వర్ణ కమలమే ఈ శ్లోకము.

మన దేశ, శాస్త్ర, ఋషిగణ, మహిమాన్వితులను గుర్తించి అట్టి మహనీయుల బాటలో నడవండి.
స్వస్తి.

Saturday, 15 July 2017

చెరుకు రసాలు

చెరుకు రసాలు
తొండమయ్య
దండమయ్య
మంచినియ్య
కొలుతునయ్య

పలుకులమ్మ
నలువకొమ్మ
రసనచెమ్మ
నేలవుకమ్మ
తల నిండా జడలు
బూదిపాలు ఒడలు
కాలునికే హడలు
ఆర్తికి తా సడలు
కలిగిన రాగము
కలిసిన యోగము
కలుగును భోగము
కలియగ సాగుము

నాటి బొగ్గు
తేలె నిగ్గు
ముందు తగ్గు
పిదప నెగ్గు

చిగురు పంటికాపు
రెప్ప కంటికాపు
భర్త ఇంటికాపు
సంతు భవితకాపు

మనిషి తెలుపు
మనసు నలుపు
తెరువు తలుపు
తిరుగు మలుపు

ధరలు దండె
చెమట పిండె
కడుపు మండె
గుండె ఎండె
గుడిలో గంట
పడతికి జంట
చేనుకు పంట
లేదా తంట
నారి ఇంటికి
నారి వింటికి
నారి*ఒంటికి 
తార మింటికి 
(నారి= న+అరి అంటే శత్రువులు లేకుండుట. 
అరిషడ్వర్గములను అదుపులో ఉంచుకొంటే చాలు) 
సూక్ష్మ వీక్షణము
శిష్ట రక్షణము
దుష్ట శిక్షణము 
నీదు లక్షణము
మంచిని పొగడము 
చెడుగును తెగడము
మానము జగడము
మానిన పగడము
జారిన చెడ్డీ 
పగిలిన బుడ్డీ
విరిగిన నడ్డీ
ఎందుకు రెడ్డీ



Friday, 14 July 2017

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ


గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
https://cherukurammohan.blogspot.com/2017/07/blog-post_14.html
ఒక సారి కంచి మహాస్వాములు నడిచే దైవమునగు శ్రీ శ్రీ శ్రీ  చంద్రశేఖర యతీంద్రులు శ్రీశైలమునకు బయలుదేరి వస్తూ వున్నారు..
 కర్నూలునకు  దగ్గరగు  ఒక ప్రాంతం లో  స్వామి వారిని పూర్ణ కుంభముతో  అహ్వానము పలికి సభ ఎర్పాటు చేసినారు. స్వామి వారు బహుభాషా ప్రావీణ్యులు. స్వామివారు  వేద సంరక్షణ, భారతీయ వైభవం గురించి తెలుగులో  అనుగ్రహభాషణమునిచ్చి తీర్థ ప్రసాదలతో ఆశీర్వదించి మళ్ళీ యాత్ర  మొదలు పెట్టినారు. 73 ఏళ్ళ పీఠ నిర్వహణలో తమ ప్రయాణములను కాలినడకనే సాగించిన మహనీయుడు ఆయన. అప్పుడే వర్షం  మొదలయ్యింది.  స్వామివారి అడుగులు ఆగలేదు. వారికి ఎదురు చేప్పే ధైర్యమూ ఎవ్వరికీ లేదు.  స్వామి వారి మీద భక్తితో శిష్యులు పల్లకి ఎక్కమని విన్నవించినారు. అందుకు స్వామి వారు నవ్వుతూ "మీరు తడుస్తూ ఉంటె నేను పల్లకి లో ఎలా రాగలను?"  అంటూ ముందునకు సాగినారు. ఆవిధముగా కొంత దూరము నడచిన పిదప  ఒక పల్లెటూరు  వచ్చింది. ఆ ఊరి జనాలందరు స్వామి వారికి సాష్టాంగ నమస్కారలుచేసి స్వామి వారిని అక్కడ బస చెయమన్నారు. వారి గురుభక్తికి సంతసించిన స్వామివారు సరేనన్నారు.
ఆ ఊరిలో పండుగ వాతావరణము నెలకొనింది.
తెల్లవారింది. చంద్రమౌళీశ్వరుని నిత్య సేవన జరుగవలసి వున్నది. అందుకు గానూ పూలయితే సమకూర్చినారు కానీ   బిల్వ దళములు సమకూర్చలేక పోయినారు పరివారము.   బిల్వ దళములు లేకుండ పూజ పూర్తి కాదు. స్వామివారి అర్చనకు అవాంతరము ఏర్పడుచున్నదని శిష్యులంతా  కంగారుపడుతున్నారు. స్వామి వారు స్నానాది కార్యములను ముగించి, పూజకు  కూర్చుని   బిల్వ దళాలు ఎక్కడ అని అడిగినారు. శిష్యులు భయపడుతూ తమకు దొరకలేదని విన్నవించుకొన్నారు.   అప్పటికే  10.30 అయ్యింది .స్వామి పూజకు కామాక్షి అమ్మదే బాధ్యత అన్నట్లు  మౌనంగా ధ్యాన మగ్నులైవుండిపోయినారు. ఎవరి చింతలో వారున్న సమయములో ఆఇంటి అరుగు పై ఒక బుట్టలో బిల్వదళములనుంచిన వ్యక్తిని గమనించినవారుగారు. పరివారము స్వామివారికి విషయము చెప్పి బిల్వమిచ్చుటతో నిత్యపూజ నిరాఘాటముగా జరిగిపోయింది.  మరుసటి  రోజు కూడా అదే వరుస. ఎవరు పెడుతున్నారో వారిని గమనించి తమ వద్దకు తెమ్మన్నారు స్వామివారు. యధావిధిగా ఒక గోపాల బాలుడు బుట్ట పెట్టి వెంటనే వెనుదిరిగి పోయేలోపల  శిష్యులు పిల్లవాడిని  గమనించి ఆతనికి నచ్చజెప్పి స్వామివారి వద్దకు రమ్మన్నారు. ఆ పిల్లవాడు స్నానం చేసి  మంచి బట్టలు వేసుకొని స్వామి వారి దర్శనమునకు వస్తాననిచెప్పి ఇంటికి వెళ్లి పరిశుభ్రుడై వచ్చినాడు. అప్పటికి పూజ ముగుసి భోజనాదులు అయిపోయినాయి. పరివారము ఆ బాలుని స్వామివద్దకు తోడుకొని పోగా, స్వామివద్ద,  భయపడుతూ నిలబడినాడు విధేయతతో ఆ బాలుడు. స్వామి ఆ అబ్బాయి పేరు అడగగా "పురంధర కేశవులు" అన్నాడు.  స్వామి అంతటితో ఆగకుండా "మీ తలిదండ్రులను గూర్చి తెలుపుము" అన్నారు. అందులకా బాలకుడు " మా అమ్మ నా 2 ఏళ్ళ వయసులో చనిపోయింది మా నాన్న నన్ను పెంచటం జరిగింది. ఆయన నాలో బాల్యము నుండి, భక్తి భావము ,పెద్దలఎడ గౌరవము, పురంధర, త్యాగరాజస్వామి  కీర్తనలు, ఇంకా ఎన్నెన్నో నెర్పినాడు.  నాకు పురంధర అని పేరు కూడాపెట్టినాడు. ఆయనతో పశువుల కాచుటకు పోవు సమయమున కొండకు దగ్గరగా  దారిలో వున్న బిల్వవృక్షమును చూపి "దీనిని మారేడు చెట్టు అంటారు. ఈ చెట్టుకు మూడు ఆకులు ఒకటిగా కలిసి వుంటాయి. దానిని దళము అంటారు. విడిగా ఒకే ఆకు ఉండదు. ఇది శివ పూజకు ఎంతో ముఖ్యమయినది అని చెప్పేవారు." 

మా తండ్రిగారు కూడా మరణించి 2 సంవత్సరములైనది. నాకిప్పుడు 12 సంవత్సరములు" అన్నాడు.  స్వామి వారు పిల్ల వాడి వినయానికి భక్తికి పొంగి పోయి "నాయనా నీకేమయినా నన్ను కోరవలెనని వుందా"  అన్నారు.   పిల్లవాడు "స్వామి మా నాన్నగారి కోరిక ఒకటుంది". మా తండ్రి నాతో " నాయనా ఈ దారి మహాపురుషులు శ్రీశైలమునకు వెళ్లేదారి. వారు ఈదారిన వచ్చినపుడు మరువక వారిని సేవించు అన్నాడు. వారికి నిరుపేదలమైన మనము ఇవ్వగలిగినది ఈ బిల్వదళములే! వారు ఒకవేళ ఈ వూళ్ళో బస చేస్తే  వారికి  నిత్యం ఈ దళములను పూజకు గానూ ఇవ్వమన్నారు. ఆయన ఆదేశము, నా మదిలోని కోరిక ఇప్పటికి నెరవేరినది స్వామీ! "మీరు నన్ను కోరమన్నారు కావున నేను  మీతో రెండు కోరికలు విన్నవించుకొంటాను"అన్నాడు. స్వాములవారు కూడా ప్రసన్నులయి వల్లె యన్నారు. అప్పుడు ఆబాలుడు ఇట్లన్నాడు "ఒక్కటి మీ దగ్గర నాకు వచ్చిన పురంధర,త్యాగరజ స్వామి కీర్తనలు ఇక్కడ మీరు ఉన్నంత కాలమూ నాచే వినిపించనివ్వండి." అన్నాడు. స్వామి వారు సంతొషించి అలాగేనని ఇంకొక కొరిక ఏమిటని అడిగినారు. ఆబాలుడు " అది మీరు ఇచట నుండి బయలుదేరే సమయములో అడుగుతా"నని  అని సాస్టాంగ దండప్రణామము నాచరించి అప్పటికి శెలవు  తీసుకొన్నాడు.  స్వామి అచట మొత్తము 21 దినములు బసచేసినారు. 22 వ రోజున స్వామి బయలూదేరు సమయమున తన పరివారముతో ఆ బాలుని పిలుచుకొని రమ్మన్నాడు. వారు ఆ బాలుని తోడుకొని వస్తే స్వామి ఎంతో వాత్సల్యముతో  "ఆ రెండవ కొరిక  ఏమిటి" అని అడిగునారు.  ఆ బాలుడు కూడా ఎంతో వినయముతో "స్వామి మీరు తప్పక ఇస్తానంటేనే చెబుతా"నన్నాడు. స్వామి వారు నవ్వి అలాగే అనగా ఆ బాలుడు " స్వామి నాకు మరు జన్మ లేకుండ మోక్షం ఇప్పించండి అని అడిగాగినాడు. స్వాములవారు ఆ బాలుని  భక్తికి పొంగిపోయి 'ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు' అని ఆశిర్వదించి ఆచటినుండి బయలుదేరినారు.   
కాల చక్రము ఎవరికొరకూ ఆగదు కదా!  40 సంవత్సరములు యిట్టే గడచిపొయినాయి. ఒకసారి కంచి మఠం లో ఉన్నట్టుండి స్వాములవారు మధ్యానం 2 కు తటాలున లేచి వెంటనే  కామక్షీదేవి  గుడి పుష్కరిణికి వెళ్లి శిరస్నానమునాచరించుతూ ఎవో మంత్రాలు జపిస్తూ 6 సార్లు మునక వేసినారు. శిష్యులకు ఎందుకిదంతా స్వామివారు చేస్తున్నారు అన్నది తెలిసిరాలేదు.  జంకుతూ స్వామిని "ఈ సమయములో మీరు ఎందుకు రావలసి వచ్చినది, ఎందువల్ల శిరస్నానమునాచరించినారు"  అని అడుగగా  పాత శిష్యులను కొందరిని చూపిస్తూ  " వీరికి గుర్తుంటుంది, 40 సంవత్సరముల క్రితం కర్నూలు దగ్గర పల్లెటూరులో 'పురంధర కెశవులు' అన్న 12 సంవత్సరముల బాలుడు  పూజ కొరకు బిల్వదళాలు మనమున్నన్ని రోజులూ తెచ్చిఇచ్చినాడు. ఆతడు ఇపుడు  52 ఏళ్ళ వయసులో  వ్యాధిగ్రస్తుడై మరణించినాడు. అప్పుడు మోక్షం కావాలని కోరియుండినాడు కదా! అతనికి ఇంకా 6 జన్మల కర్మ శేషమువున్నా  చంద్రమౌళిశ్వరుడు కరుణించి ఇప్పుడే మోక్షం ఇచ్చినాడు అన్నారు. అందరు స్వామి వారి జ్ఞాపక శక్తికి, ఆయన మహత్తుకు,దయకు నివ్వెరపోయినారు.
అందుకే సద్గురువు దొరకవలెనన్నా పూర్వపుణ్య ఫలము ఉండవలెనని పెద్దలు చెబుతారు.
గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేనమః
స్వస్తి