Wednesday, 28 June 2017

స్నేహం--दोस्ती


స్నేహం

ఇడుములలో నవ్వువాని నేడ్పించగ  నీ తరమా
అంబునిధిన  అలలనెల్ల అణచివేయ  నీ తరమా
మైమెరుగులగాంచిమనిషిమంచినెంచ నీ తరమా
పరిమళమాస్వాదించక   పూవు  చేర  నీ తరమా
పలుగతుకుల  బాటలోన  బండినడుప నీ తరమా
పలుకు  తేనె లోన  విషము  పసిగట్టగ నీతరమా
పెప్సీ  కోకుల  కెమికల్స్  పేరు  చెప్ప నీ  తరమా
అన్నీ  అనుమానాలే  అవి   తీరగ   నీ   తరమా
చెడుగు మంచి నెంచకనే  చెలిమి చేయ  నీతరమా
తీయనైన  స్నేహమంటె  తెలియ జేయ  నీ  తరమా


दोस्ती
गम में हसने वालों को रुलाया नहीं जाता
लहरों से पानी को हटाया नहीं जाता
होने वाले होजाते हैं खुदी दिल से अपने
किसी को कहकर अपना बनाया नहीं जाता
फूल से पहले खुशबू को तो देखो
करनेसे पहले काम को तो देखो
किसी के रूप में दीवाना न बनो
सूरत से पहले उसके दिल को तो देखो
सम्झादो अपने यादोंको
वो बिन बुलाये पास आया करती है
आप तो दूर रहकर सतातेहो मगर
वो पास आकर रुलाया करती है

चेरुकु राम मोहान् राव्

Friday, 23 June 2017

అనులోమ విలోమ శ్లోకము

అనులోమ విలోమ శ్లోకము

దైవజ్ఞ సూర్య పండితుడనే మహానుభావుడు “రామకృష్ణ విలోమ కావ్యం” అన్న కావ్యాన్ని వ్రాసినాడని ఆరుద్ర గారు తమ సమగ్రాంధ్ర సాహిత్యములో తెలియజేసినారు. ఇందులో, ప్రతి శ్లోకం రామకృష్ణు లిద్దరి గురించి చెప్పటమే అన్నది పేరును బట్టి మనకు అర్థమౌతూనే వుంది. కానీ ఇందులో మొదటి పాదము రాముని గూర్చి అయితే రెండవది కృష్ణుని గూర్చి. అంతకు మించిన ఆశ్చత్ర్య కరమగు విషయమేమిటంటే మొదటి పాదమును త్రిప్పి వ్రాస్తే రెండవ పాదమోస్తుంది. అంటే శ్లోకాన్ని క్రింది చివరి నుండి పై పాదము ప్రారంభము వరకు పై పాదము ప్రారంభము నుండి క్రింది పాదము చివరి వరకు ఎటు చదివినా నుండి క్రిందికి ఎటు చదివినా  చదివినా ఒకే విధంగా ఉంటుంది. ఈ శ్లోకమును చూడండి.
“తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతోలవ్య భవం దయాశ్రీః
శ్రీయాదవం భవ్య లతోవదేవం సంహారదాముక్తి ముతాసుభూతం”

ఇందులో మొదటి పాదాన్ని తిరగేస్తే, రెండవ పాదం వస్తుందని తేలిగ్గా గ్రహించవచ్చు. ఇటువంటి శ్లోకాలతో ఒక కావ్యం రాయటం గొప్ప విషయమనే చెప్పాలి.

ఈ రీతిలో మనము తెలుగులో కూడా పద్యాలను చూడవచ్చు. ఇందులో రస ప్రాధాన్యత తక్కువగా వున్నా కవి చమత్కృతి పాండితీ ప్రతిభ మనకు తెలియ వస్తాయి.

రాయలవారి లోకానుశీలన

వానలు కురిసే వేళ- రాయలవారి సామాజిక స్పృహ!
మ: గురుగుం జెంచెలి తుమ్మి లేఁదగిరిసాకుం దింత్రిణీ పల్లవో
త్కరంముం గూడి పొరంటి నూనియలతో ,కట్టారు కుట్టారు టో
గిరముల్మెక్కి , తమిం బసుల్ బొలముఁబోఁ గ్రేపుల్ మెయింనాక, మే
కెరువుం గుంపటి మంచమెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్డజ్జడిన్ ;
ఆముక్త మాల్యద- చతుర్ధాశ్వాసము134 పద్యం: కృష్ణదేవరాయలు.
రాజుకు ప్రజలే ప్రాణము. రాజు రుజు మార్గములో వుంటే ప్రజలూ అదే మార్గములో వుంటారు. రాజు ప్రజల కష్ట సుఖములు స్వయముగానూ చద్మ వేశామునాను, చారులవలనూ, ముఖ్యాదికారులవలనాను, చెలికత్తెల నుండి రాణులు సంగ్రహించిన విషయములను రాణుల ద్వారానూ సంగ్రహించి ప్రజల కష్టములను తీరుస్తూ ఉంటాడు. ఇక రాయలవారి విషయమైతే చెప్పనవసరము లేదు.
ఆయనా ఏరోజో మారు వేషములో తన ముఖ్య సేవక మిత్రుని తోడు చేసుకొని జనస్రవంతిలో అడుగిడిన రోజు, బహుశ, పడిన వానను ఎంత ఏకాగ్రతతో గమనించి మనకు ఆముక్త మాల్యద ద్వారా అందించుచున్నారో చూడండి.
రాయలసీమ పల్లెలలో జీవించు రెడ్లు ఎక్కువగా భూస్వాములు లేక వ్యవసాయదారులు.హోరున వానలుగురియుచుండ పశువులను పొలమునకు మేతకుఁ దోలి నిశ్చింతగా నింటిలో కంకటిపై (మంచము) శయనించుచున్నారట. వారిభార్యలు అంతకుమున్నే గురుగు, చెంచెలి, తుమ్మి ,లేఁత తగిరిసి ఆకులను, చింత చిగురుతో కలిపి నూనెవేసి యుడికించి వేడి వేడి యాకూరను ఆవిరులు వెదజల్లుచున్న ఆరిగ బియ్యపు టన్నమున వడ్డింప సుష్ఠుగా భోజనమొనర్చి, వెచ్చదనమునకై మేక యెఱువుతో నింపిన కుంపటిని రగిలించుకొని, యాకుంపటిని మంచముక్రిందుగా నుంచి మంచ మెక్కి నిదురింప సాగినారట. పొలమునకు పాడిపశువులను దోలగా నింట నున్న లేఁగ దూడలు శరీరములను నాకుచుండగా నిశ్చింతులై మత్తుగా నిద్రతో జోగు చున్నారట. అవునుమరి! వారికి వారేప్రభువులు వారినడిగెడి వారెవ్వరు? సైరిక జీవనమంత స్వతంత్ర జీవనము మరియొకటి యుండదుగదా!
రాయల సీమలోని రెడ్డి కులజులకు మెట్ట వ్యవసాయము, గొఱ్ఱెల పెంపకము కులవృత్తులు. దానినే యీపద్యమున రాయలు నిరూపించినాడు. పూర్వము నులక మంచములను పేదలు విరివిగా వాడెడువారు.నవారుపట్టెమంచములు నాగరికులైన భాగ్యవంతులకు  మాత్రమే యుండెడివి. వర్షాకాలమున ,చలికాలమున పేదలు వెచ్చదనమునకై కుంపటులను వాడెడివారు. ఆకుంపటులలో పిడకలుగాని ,గొఱ్ఱె పెంటనుగాని, వాడెడివారు.  అందలి ఆనందము వారికే ఎరుక. నేడు మనము ఆ విషయమును పరిశీలించ లేము . వారు అలవాదినవారు కాబట్టి ఆనందించి వుంటారనే అనుకోవలసి వస్తుంది.
ఇదీ శ్రీ కృష్ణరాయ సార్వభౌముని ప్రజా జీవన పరిశీలనము!