Tuesday, 13 December 2016

అజామీళుడు

అజామీళుడు
https://cherukurammohan.blogspot.com/2016/12/blog-post.html

ఈ కథ నాకు మా అమ్మమ్మ నన్ను తన వడిలో కూర్చోబెట్టుకొని చెప్పినది. పెద్దయి భాగవతము చదివిన పిదప నేటి బాలలకు పెద్దలు చెబుతారనే ఆశతో వ్రాసినాను.
అజామీళుడు
పూర్వ కాలమందు కన్యాకుబ్జ మను నగరమున చతుర్వేద పండితుడైన ఒక విప్రుడుండెను. అతని పేరు సత్య వ్రతుడు అతనికి తగిన హేమవతి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలునికి అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు అతి గారాబము వలన పెద్దలను కూడ ధిక్కరించి దుష్ట సహవాసములు చేయుచు, బ్రాహ్మణ ధర్మములు పాటించక, విద్య నభ్యసింపక కాలము గడుపుచుండెను. యౌవనము రాగా కామంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞోపవీతము త్రెంచి, మధ్యము చేత మత్తుడై ఒక ఎరుకల స్త్రీ ని వలచి, యింటికి రాకుండా, ఆమె తోడనే ఉండిపోయెను. అతి గారాబము గుడ్డిది. అదుపు తప్పినా అబ్బాయి తాడు తెగిన గాలిపటమే కదా ! ఆజామీళుడు కుల భ్రష్ఠుడు కాగా, వాని బంధువులు అతనిని విడిచి పెట్టిరి. ఆజామీళుడు పక్షులను, జంతువులను వేటాడుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ ఎరుకలసాని చనిపోయెను. ఆ మెకు అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా అజామీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. మరుల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ' నామ స్మరణ తనను పాప రహితుని చేయునని మాత్రము ఆతనికి తెలియదు. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజామీళునకు రోగగ్రస్తుడై చావునకు సిద్దపడెను.
కొడుకు పై ప్రేమతో నారాయణా నారాయణా అంటూ ప్రాణముల నాతడు విడిచెను. భయంకరాకారులైన యమ భటులు ప్రత్యక్షమైరి కానీ అజామీళుని నోట ' నారాయణా' శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ఠమునకు తీసుకొని పోవ వచ్చితిమి'యని చెప్పి, అజామీళుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కోరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొడ౦గిరి.
'ఓ యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూతలారా! మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, వాయువులు,రాత్రి౦బవళ్లు సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.
వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును, గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు, పర స్త్రీ లను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను- కుల వృతిని తిట్టి హింసి౦చు వారున్నూ, జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెళ్ళిళ్ళు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడై వావి వరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు? ‘అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయు వారును, జప దాన ధర్మములు చేయు వారును- అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానము చేయు వారును, అనాధ ప్రేత సంస్కారములు చేయు వారును, తులసి వనము పెంచు వారును, తటాకములు త్రవ్వి౦చు వారును, సదా హరి నమ స్మరణ చేయువారు మరణ కాలమందు ' నారాయణా'యని శ్రీ హరిని తెలిసిగాని తెలియక గాని మరే రూపమున గాని స్మరణ చేసిన వారు పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనను మరణకాలమున" నారాయణా"అని పలికి వైకుంఠ వాసమునకు అర్హత సంపాదించెను.
సంస్కృత భారతములో వ్యాసులవారు ఏమంటున్నారో చూడండి. వ్యాస'భాగవతం' లోని షష్ఠమ స్కందంలో సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళన మేవవా |
వైకుంఠ నామగ్రహణం అశేషాఘహరం విదుః ||
పతితః స్ఖలితః చిన్నహ సందశ్తః తప్త ఆహతః |
హరిరిత్యవశేనాః పుమాన్ నార్హతి యాతనాం ||

అనగా, ఎవరికైనా పెట్టిన పేరు పెట్టి పలికినా, పరిహాసంగా పలికినా, వెక్కిరిస్తూ హేళనగా పలికినా, ఊత పదంగా పలికినా, యే విధంగా అయినా భగవన్నామమును ఉచ్చరిస్తే పాపాలన్నీ సమసి పోతాయి. ఎత్తు పై  నుండి పడినప్పుడు కాని, ఎముకలు విరిగినప్పుడు కాని, పాము, తేలు లాంటివి కరచినప్పుడు కాని, వళ్ళు కాలినప్పుడు కాని, జ్వర తీవ్రతలో కాని, అమ్మ, నాన్నా అని అరచే బదులు శ్రీహరినామావళిని ఉచ్ఛరిస్తే, అదే  ఔషధమై పని చేస్తుంది. అందుకే వ్యాసులవారు మనకు విష్ణుసహస్రనామావళిని ఎంతో మమకారముతో అందించినారు. 

ఈ సందర్భములో పోతన్న విష్ణుదూతలతో ఈ పద్యమును చెప్పించినాడు.
6-117-ఉ.
 ఈతఁడు కోటిసంఖ్యలకు నెక్కుడు పుట్టువులందుఁ జెంది యా
యాతము లైన పాప నివహంబుల నన్నిటిఁ బాఱఁ దోలెఁ బ్ర
ఖ్యాతమతిన్ మహా మరణ కాలమునన్ హరిపుణ్యనామ సం
భూత సుధామయాద్భుత విభూతిక రాక్షర సంగ్రహంబునన్.
మఱియు వినుండు, జన్మంబు శాంత ఘోర మూఢ గుణంబులచేత నైనను, సుఖదుఃఖ గుణంబులచేత నైనను, ధార్మికాది గుణంబులచేత నైనను, సకల భూతంబులుఁ ద్రైవిధ్యంబు నే ప్రకారంబునం బొందు, నా ప్రకారంబున జన్మాంతరంబునం బొందుచుండు; దేవుండైన యముండు సర్వ జీవాంతర్యామియై ధర్మాధర్మయుక్తం బయిన పూర్వ రూపంబుల మనస్సుచే విశేషంబుగఁ జూచుచుండి, వాని కనురూపంబులఁ జింతించుచుండు; అవిద్యోపాధి జీవుండు తమోగుణయుక్తుం డై ప్రాచీన కర్మంబులచేత నేర్పడిన వర్తమాన దేహంబు, నే నని తలంచుచుండి, నష్ట జన్మ స్మృతి గలవాడై పూర్వాపరంబు లెఱుంగం జాలకుండు; మఱియుఁ గర్మేంద్రియంబులచేతఁ గర్మంబులం జేయుచుండి, జ్ఞానేంద్రియముల చేతఁ దమోవిషయంబు లయిన శబ్ద స్పర్శ రూప రస గంధంబుల నెఱుంగుచుండి, పదియాఱవది యైన మనంబుతోఁ గూడి, పదియేడవవాఁ డగుచుండి, షోడశోపాధ్యంతర్గతుం డై యొక్కరుం డైన జీవుండు, సర్వేంద్రియ విషయ ప్రతిసంధానంబు కొఱకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవిషయంబులఁ బొందుచుండి, షోడశ కళలు గలిగి, లింగ శరీరం బనం బరఁగి గుణత్రయకార్యం బను నిమిత్తంబున హ ర్ష శోక భయంబుల నిచ్చుచున్న సంసారంబు ధరియించుచుండు; విజిత షడ్వర్గు డైన దేహి కర్మంబు లొల్లని బుద్ధి నెఱింగియు, వినియుఁ, గర్మంబులు జేయుచుండి, తన సంచార కర్మంబునం జుట్టుకొన్న పసిడికాయ పురువునుం బోలె నిర్గమోపాయం బెఱుంగక నాశంబు నొందుచుండు, వర్తమాన వసంతాది కాలంబు, భూత భావి వసంతాది కాల యోగ్యంబైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబు నెట్లు జేయు, నట్లు భూత భావి జన్మంబులకు ధర్మాధర్మంబులు నిదర్శనంబులు జేయుచుండు; ఒక్క నరుండు నొక క్షణంబును గర్మంబు జేయకుండువాఁడు లేఁడు; పూర్వసంస్కారంబులం గల గుణంబులచేతఁ బురుషుం డవశుండు గావున బలిమిఁ గర్మంబులు చేయింపంబడుచుండు; అవ్యక్తనిమిత్తంబు నొంది తదనురూపంబు లయిన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతా పితృ సదృశంబు లగుచుండు; ఇట్టి విపర్యయంబు పురుషునికిఁ బ్రకృతి సంగమంబునం గలుగుచుండు; ఆ ప్రకృతి పురాణపురుషుం యయిన యప్పరమేశ్వరుని సేవించినం దలంగుచుండు.


అజామీళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది " ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. మహా పాపిని యైన కుమారుని యందున్న ప్రేమతో 'నారాయణా' యనుట తప్పించి నేను ఏ పుణ్యము చేయలేదు. అంత మాత్రమునకే నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను!' అని అనెను. యమ దూతలు నిరాశతో వెనుదిరుగగా విష్ణు దూతలు ఇకనైనా నారాయణ నామ సంకీర్తన తోనే అకుంఠిత మగు వికుంఠము చేరు వరకు ఎన్ని జన్మలు ఎత్తినా జీవితము గడుపమని చెప్పుచూ అతనిని తీసుకొని వైకుంఠమునకు జనిరి.


పై కథను నేను ప్రకటించిన పిదప చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చి తమ ఆమోదమును తెలిపినారు. ఇరువురు మాత్రము తమ అభిప్రాయమును ఈ విధముగా వ్రాసినారు.

This is wrong story, you please read Pothannagaru/Vyasa bhagavatam, kindly don't post this kind of wrong stories without having full knowledge...

 Dear Sir,
If we tell the stories of this type to children, they try to commit all sins thinking that they would get rid of all the sins by reciting NARAYANEEYAMU MANYRM. This is no good for society. With every respect t you I request you to tell the stories which teach fear to commit any harm to society or any individual. This is very very necessary to the present society.
Regards,
పై రెండు అభిప్రాయములను తెలిపిన వారల పేర్లు తెలుపుట లేదు, అది సంస్కారవంతము కాదు అని అనిపించుటచే. మొదట వ్రాసిన వ్యక్తి ఆ కథ నేను బుద్ధి హీనత చే సక్రమముగా చెప్పలేదు అని వ్రాసినారు. నిజమునకు అజామీళుడు నూనూగు మీసాల నూత్న యవ్వనములో ప్రవేశించి యుండగా ఆయన తండ్రి దర్భలు సమిధలు తెచ్చుటకు అడవికి పంపుతాడు. అక్కడ ఆయన తన జీవితములో మొదటిసారిగా ఇరువురు ఆటవికుల కామకేళీ కలాపము చూస్తాడు. మనసు వాంఛకు బానిసౌతుంది. తానూ దుర్జాతునిగా మారి పోతాడు . పోతన చాలా పద్యములలో అజామీళుని యవ్వన ప్రాప్తి, రతికేళిలనుగూర్చి కొంత వివరముగా వ్రాసినారు. ఇక్కడ అది మొత్తము అప్రస్తుతము కావున ఉదాహరణకు నాకు వలసిన మేరకు మాత్రమే తీసుకున్నాను.
6-95-వ.
అంత ననంగబ్రహ్మ తంత్రమునకు వసంతుడొనర్చు నంకురార్పణారంభంబునుం బోలె లలిత కిసలయ విసర ప్రసార భాసుర బహు పాదపాది పురోపవన పవన జనన ప్రభావ పరికంపిత విటవిటపీ జన హృదయ ప్రఫుల్ల పల్లవ భల్లంబును, అనూన ప్రసూన నిర్భర గర్భావిర్భూత సురభి పరాగపటల పటఘటిత నభోమంలంబును, నమంద నిష్యంద మరంద బిందు సందోహ కందళిత చిత్త మత్త మధుప సంకుల ఝంకార ముఖరిత సకల దిశావలయంబును, నిరంతర ధారాళ రసభరిత పరిపక్వ ఫలానుభవ ప్రభావ సమ్మోదవాద శుక ప్రముఖ పతంగ కోలాహలంబునునై, మధుమాసంబు సర్వ జన మనోహరంబునునై, నిఖిల వనపాదపంబుల నలంకరించె; అయ్యవసరంబున నజామీళుండు పితృనిర్దేశంబునం గుశ సమిత్పుష్ప ఫలార్థంబు వనంబున కరిగి, తిరిగి వచ్చు సమయంబున, నొక్క లతాభవనంబున
ఒక గణిక (వేశ్య) ను తన విటునితో మైమరచి సంగమించుట గాంచినాడు. మరి చిన్న పిల్లలకు ఈ మాట చెప్పుట మంచిదా లేక భాగవతములో లేకున్నా అజామీళుడు చిన్న తనము నుండియే దుర్వర్తనుడైనాడనుట మంచిదా! ఇక అజామీళుడు ఆ సన్నివేశమును ఏ విధముగా చూచినాడు అని పోతన వర్ణించినాడో గమనించండి. గమనించి తెలుపండి ఇటువంటివి పిల్లల కొరకు వ్రాస్తే సాంప్రదాయ బద్ధులు శాపనార్థాలు పెట్టకుండా ఉంటారా!




6-98-శా.

హాలా ఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో
ఖేలాపాలన యోగ్య భ్రూవిభవతోఁ గీర్ణాలకాజాలతో
హేలాలింగన భంగి వేషవతితోఁ నిచ్ఛావతీమూర్తితోఁ
గేళిం దేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూత రోమాంచుఁడై
నేను ఇటువంటి వర్ణనలు కథలో వ్రాసి చెప్పుట మంచిదా! కథలో నేను అజామీళుడు బాల్యము నుండియే తప్పుదారి పట్టినాడు అని తెలుపుటచే తల్లులు తమ పిల్లలకు ఈ కథ చెప్పునపుడు మీరు ఇటువంటి పనులు చేయ కూడదు అని చెప్పగలరు. నేను భాగవతములో వున్నది ఉన్నట్లు వ్రాస్తే ఆ విషయములను పిల్లలకు చెప్పుటకు వీలవుతుందా! మన దేశములోని వివిధములయిన రామాయణములలో పాత్రలు సన్నివేశములు వాల్మీకమును అనుసరించియే ఉన్నాయా!
అసలు వ్యాసులవారు కనబరచిన సన్నివేశములు కొన్ని వాల్మీకి రామాయణములో లేనివి. తులసీ రామాయణము అంతే! కంబ రామాయణమూ అంతే. పురాణములలో కూడా రామకథలో మార్పులు కనబడుతాయి. ఏ మార్పులు వున్నా రాముడు సీత రావణుడు హనుమత్సుగ్రీవాది బలగము, మేఘనాథ కుంభకర్ణాది రావణ బలగము, రామంకితుడైన  విభీషణుడు మారరు. మరి వారినందరినీ తప్పుపట్టగలమా! ఇందులో మళ్ళీ నా తప్పు వెదుక ప్రయత్నించవద్దు. నేను పైన తెలిపిన మహనీయుల పాద ధూళికి కూడా సమానము కాను. నా ఆలోచన అంతా మంచిని పంచడము మంచిని పెంచడము. అంతవరకే. పిల్లలకు బాల్యమునుండి ఇతిహాస పురాణ గాథలను చెప్పకపోతే, వారు పాఠశాలకు పోయినప్పటి నుండి పరమత పాఠములు నేర్చుకొనవలసి వస్తుంది. పిల్లలకు ఇప్పటి నుండి ఒక పునాది ఏర్పరచితే పెద్దయిన పిదప చదివి తెలుసుకోగలుగుతారు. పిల్లల మెదడు ఖాళీ ఇంటితో సమానము. పెద్దలుగా మనము ఏవిధముగానైతే నూతన దంపతులకు సంసారమునకు  తగిన వస్తువుల నిచ్చి సంసారమును ఏర్పరచుతామో అదే విధముగా  బాలురకు తగిన విధముగా, ‘తగిన విధముగా’ అన్న ఈ మాటను మరువవద్దండి, అవసరమైతే కథను మార్చియైనా సరే బాలురకు అనుకూలముగా చెప్పవలసియుంటుంది. అసలు  చి. వనదీప్ మరియు కాశీపతి శాస్త్రి గారి విశ్లేషణ చూసి పైన తేలిపిన మొదటి వ్యక్తి తన మాటలను వెనక్కు తీసుకొన్నాడు. అంటే తీసివేసినాడు ప్రకటనా ఫలకము పైనుండి. రెండవ వ్యక్తి పై ఇరువురి మాటలకు ప్రభావితుడై తన అభిప్రాయమును మార్చుకొన్నాడు. కొంత పని భారము మరియు Type చేయుట నాకు కష్టమగు పని యగుట చేతను కాస్త ఆలస్యముగా జవాబు వ్రాస్తూవున్నాను.
చక్కగా విశ్లేషించిన కాశీపతిగారి అభిప్రాయమును యథాతథముగా మీమున్దున్చుచున్నాను.



Chinthalapalle Kasipathi అజామీళుడి విషయం
సాధారణంగా లోకంలో ప్రసిద్ధిగావున్న విశ్వాసం యేమిటంటే, ‘జీవితంలో ఎన్ని దుష్కర్మలను చేసినప్పటికీ అంత్యకాలంలో నారాయణా!అని అంటే ఆ దుష్కర్మల ఫలములన్నీ నశించి మోక్షం లభిస్తుందిఅన్నది. కానీ యిది వాస్తవంగాదు. అంత్యకాలంలో నారాయణాఅని ఉచ్చరించడగలుగడం, అందుకు తగిన మన: పక్వత లభించడం అంత సులభం కాదు. ఈ మనో పక్వత అనేక జన్మలలో చేయబడిన సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది. మోక్షం అన్నది కేవలం ఒక్క జన్మ అంత్యంలో నారాయణనామోచ్ఛరణచే లభించగలిగినది కాదు. దీనినే భగవాన్ గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతేఅని అంటున్నారు. గీత (7-19).

గీతలో అర్జునుడు ఈ విధంగా భగవాన్ ను ప్రశ్నిస్తాడు, ‘కృష్ణా! నీవు చెబుచున్న ఈ సాధన, మనసు చాలా చంచలమైనది గావడంచే నాచే అనుష్ఠించుటకు వీలు పడటంలేదు!ఎలా? అర్జునుడి అభిప్రాయంతో ఏకీభవించిన భగవాన్ అర్జునా వాస్తవమే! చిత్తం చాలా చంచలమైనదే. అందులో సంశయంలేదు. కానీ దానిని నిగ్రహించడం అభ్యాస, వైరాగ్యాలచే వీలవుతందిఅని అంటారు.

అప్పడు అర్జునుడు కృష్ణా! మనసు చాలా చంచలమైనది కాబట్టి ఈ విధంగా సాధన చేస్తున్నవాడు, యెప్పడో బలహీనమైన క్షణంలో చిత్త స్థైర్యతను కోల్పోవడానికి ఆస్కారముంటున్నది గదా! ఆ విధంగా చిత్త స్థైర్యతను కోల్పోయినవాడు, పతనమగుచున్నాడుగదా! వాడు ఐహిక సుఖాలను పరిత్యజించి నిన్ను పొందవలెనన్న తీవ్రమైన పట్టుదలతో సాధన చేస్తున్నాడు. ఇప్పుడు వాడు మనో స్థైర్యతను కోల్పోవడంచే రెండింటికి చెడిన రేవడి కావడం లేదా?’ అని ప్రశ్నిస్తాడు.

అందుకు భగవాన్, ‘అర్జునా! అటువంటి యోగ భ్రష్టుడికి యిహంలోగానీ, పరంలోగానీ నాశనం కలుగడం లేదు. నన్ను పొందవలెనుఅన్న సత్సంకల్పంతో వాడు తన సాధనను ప్రారంభించాడు. అటువంటి వాడికి యెన్నటికి నాశనం లేదు. వాడు తప్పక తన గమ్యమును చేరుకొంటాడు. ఈ జన్మలో వీలవనప్పటికీ భవిష్యత్తులో వాడు అందుకు అనువైన జన్మనే పొందుచున్నాడు. ఆ జన్మలో వాడు తన పూర్వ జన్మలలోని సాధనా సంస్కారముచే, అనుకొన్నది సాధించుచున్నాడు.

అజామీళుడి విషయంలో కూడా జరిగినది యిదే, ‘అతడు, అనేక పూర్వజన్మలలో యెంతో మహత్తరమైన సాధనను చేసివున్నాడు. ప్రస్తుత జన్మలో యేదో బలహీనమైన క్షణంలో యింద్రియ సుఖాలచే ఆకర్షింపబడి పతనమైనప్పటికీ, పూర్వ జన్మల సంస్కారంచే తన కొడుకును నారాయణా!అని సంభోదించాడు. అది చాలు, పరమాత్మ కరుణించి అతడిని మళ్ళీ సన్మార్గములో వుంచడానికి! పరమాత్మ అదే చేశాడు. అతడికి నరకమును తప్పించాడు. అతడు తన చేసిన పొరబాటును గుర్తించి పశ్చత్తాపపడే విధంగా చేశాడు. దానితో అతడు సాధనను పునః ప్రారంభించి, భగవదనుగ్రహంచే ఈ మాఱు యెటువంటి తప్పిదముగానీ లేకుండా దానిని నిర్విఘ్నంగా కొనసాగించి తన లక్ష్యమును పొందాడు.

శ్రీ మధుసూధన సరస్వతి తమ గీతాభాష్యంలో క్రింది శ్లోకమును వ్యాఖ్యానిస్తూ అజామీళుడి కథను ఉదాహరణంగా తీసుకొంటున్నారు:

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్య: సమ్యగ్వ్యవసితో హి సః || గీత 10-30

మిక్కిలి చెడు నడవడిగలిగినవాడైనప్పటికీ అన్య చింతనలేక నన్ను ఆరాధంచుచున్నవాడిని సాధువుగానే (అంటే మంచి మార్గములోనే) వుంటున్నట్టు యెంచవలెను. ఎందుకంటే వాడు (సమ్యక్) యథార్థమైన నిశ్చయచిత్తంతో వుంటున్నవాడు.

అంటే, వాడి బాహ్య ప్రవర్తన చూస్తున్నవారికి దురాచారముగా కనిపించినప్పటికీ వాడు మనసులో సదా ఆ పరమాత్మనే ధ్యానించుచూ వేఱువిధమైన చింతనలేక యుంటున్నవాడు. అందుకే భగవాన్ అతడిని సాధువుగానే పరిగణించవలెనని అంటున్నారు.

తరవాతి శ్లోకంలో భగవాన్ నా యందు అనన్యమైన భక్తిని కలిగివుండటంచేవాడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని (మోక్షమును) పొందుచున్నాడని చెబుచున్నారు.

పైన నాచే చెప్పబడినది శ్రీమద్భగవద్గీత యింకా శ్రీమద్భాగవతం వీటి ఆధారంగా నాకు అనిపించినది.

అజామీళుడు అనేక పూర్వజన్మలలో భగవద్ ప్రాప్తి కొఱకు సాధన చేసియున్నాడు. అత్యంత నిష్ఠాగరిష్టుడైన అజామీళుడు యెటువంటి పరిస్థితిలో స్త్రీ వ్యామోహమునకు గుఱి కాబడినవాడో భాగవతంలో స్పష్టముగా యివ్వబడినది. స్థలాభావముచే యిక్కడ దానిని వివరించట అసాధ్యం. కానీ భగవంతుడి మాయను దాటడం బహుదుర్లభము గదా! అందుకే అతడు మోహమునకు వశుడయ్యాడు. కొడుకును చివరి క్షణంలో నారాయణాఅని సంబోధించనంత మాత్రముచే, అతడిలో పూర్వ జన్మ పుణ్యవాసనలన్నియు ఒక్కసారిగా బహిర్గతమైనవి. భగవంతుడు జీవుడిని యెంత మోహములో పడవేసినప్పటికీ, తనను ఆశ్రయించినవాడిని దారినుండి మళ్ళించి పెడత్రోవ పట్టించడు. మళ్ళీ అతడిని సక్రమ మార్గములో వుంచవలసిన బాధ్యతనుకూడా తానే తీసుకొంటాడు. అతడిలో తాను చేసిన తప్పిదమునకు పశ్చాత్తాపపడే విధంగా చేస్తాడు. అతడిని ధర్మాత్ముడిని చేస్తాడు. చివరికి అతడు అనుకొన్నదానిని సాధించటకు సహకరిస్తాడు. అదే భగవంతుడి కరుణా హృదయం. ఇందుకు అజామీళుడి కథ ఉదాహరణం. అజామీళుడి గుఱించి లోకంలో అనేకులకు మంచి అభిప్రాయము లేదు. అందుకే నా commentsతో అతడిపైవున్న దురభిప్రాయము తొలగిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీనిని అందఱికీ అర్థమయ్యే విధంగా చేయడమే నా ఉద్దేశ్యము. మన పురాణముల ఔన్నత్యమును యదార్థమైన కోణంలో ఈ కాలం వారికందఱికీ తెలియజేయడమే నా ఉద్దేశ్యము మీ postను విమర్శిస్తూ comment చేసినవారినికూడా నేను అభినందించుచున్నాను. ఎందుకంటే అటువంటి అభిప్రాయము బహిర్గతమైనప్పుడే నావంటి వాళ్ళకు విశ్లేషించి యదార్థమైన విషయమును తెలియపఱచడానికి అవకాశము లభిస్తుంది. ఈ ప్రయత్నంలో మిమ్ములను నొప్పించివున్నట్టైతే నన్ను క్షమించండి. 
కాశీపతి శర్మ గారూ మీరు చక్కగా తెలియజేసినారు . ధన్యోస్మి


స్వస్తి.

No comments:

Post a Comment