Tuesday, 15 September 2015

మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (సెప్టెంబర్ 15, 1860 — ఏప్రిల్ 12, 1962),
ఇది జ్ఞాపకముగా కన్నాజీ రావు గారు , విశ్వేశ్వరయ్య గారి జన్మదినమున, వారిని గుర్తుచేస్తూ వేసిన
వారి వ్యంగ్య చిత్రము. గుర్తు చేసిన వారిని అభినందించుతూ , విశ్వేశ్వరయ్య గారిని గూర్చి నాలుగు మాటలు వ్రాస్తూ వున్నాను. చదివేది.
భారతదేశపు ప్రముఖ ఇంజనీరు. బెంగుళూరు నగరానికి 40 మైళ్ళ దూరంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు ఆయన జన్మించాడు. వీరు ములకనాడు తెలుగు వైదిక అనగా స్మార్త బ్రాహ్మణులు.వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరుకు వలస వెళ్ళడం జరిగింది. వీరు చిక్కబళ్ళాపూరు లో ప్రాథమిక విద్య, బెంగుళూరు లో ఉన్నతవిద్య పూర్తి చేసినారు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., పట్టాను పుచ్చుకొన్నతరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు పట్టా పుచ్చుకొన్నారు.
ఆయన తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. విశ్వేశ్వరయ్య గారికి 15 ఏళ్ళ వయసులో తండ్రి కర్నూలులో మరణించాటం జరిగింది.
బొంబాయి ప్రజాహిత కార్య శాఖలో చేరిన తరువాత, భారత నీటిపారుదల సమాఖ్య లో (commission) చేరవలసినదిగా ఆహ్వానమును పొందినారు. ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించినారు. ఒక స్వయంచాలక (automatic) వరద గట్టు (Flood Gate ) వ్యవస్థను ఆయన రూపొందించినారు. 1903 లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పటం జరిగింది. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. తరువాత గ్వాలియర్ వద్ద అలతిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడటం జరిగింది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట భారతదేశంలోనే అతిపెద్దది.
హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో ఆయనది ప్రముఖపాత్ర.
1908లో స్వఛ్చంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివాను గా చేరి సంస్థాన అభివృద్ధికి అపారమైన కృషి చేసినారు. 1917 లో బెంగుళూరు లో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించినారు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది.
మైసూరు దివానుగా ఉండగా ఆయనకు బ్రిటిషు ప్రభుత్వపు నైట్‌హుడ్ (సర్) బిరుదు వచ్చింది. 1955 లో భారత దేశపు అత్యంత గొప్ప పురస్కారం - భారతరత్న - వచ్చింది. కర్ణాటక లోని ఇంజనీరింగు కాలేజీలన్నీ అనుబంధంగా ఉండే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరిట నెలకొల్పారు.
ఆయన జన్మశతి సంవత్సరంలొ బెంగుళూరు లో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది.
స్వార్థమంటే తెలియని ఇటువంటి మహనీయులను గూర్చి తెలుసుకొనుట, దేశమునకు వారు జేసిన
సేవ ను గూర్చి తెలుసుకొనుట నేటి యువతకు అత్యవసరము. ఇటువంటి మహనీయులను తలుచుకోకుంటే మనము కృతఘ్నులు కావలసి వస్తుంది.
రాళ్ళను రత్నాలుగా భ్రమింపజేసే ఈ కాలములో నిజమైన రత్నాలను గూర్చి తెలుసుకొనుట అత్యంత అవసరము.
K for Cartoon..

No comments:

Post a Comment