Sunday, 15 December 2013

ప్రొద్దుటూరు



ప్రొద్దుటూరు:
 
https://cherukurammohan.blogspot.com/2013/12/blog-post_15.html
నా స్వస్థలము కడప జిల్లా. నా బాల్యమంతా ప్రొద్దుటూరు జమ్మలమడుగులలో గడిచిపోయింది . 
నాకు తెలిసిన నాలుగు మాటలు ఈ రోజు ప్రోద్దుటూరును గూర్చి వ్రాయవలెననిపించినది. కొన్ని రోజుల క్రితం జమ్మలమడుగు వద్ద గల గండికోటను గూర్చి తెలిపినాను. ప్రాంతీయాభిమాన మనుకోకుండా నాకు తెలిసిన ఒక ప్రాంతాన్ని గూర్చి వ్రాస్తున్నానని భావించ ప్రార్థన . 

శ్రీరామచంద్రుడు, రావణవధానంతరము, సీతా లక్ష్మణ హనుమంతులతో అయోధ్యకు పోతూ సూర్యోదయకాలానికి ఒక ప్రాంతములో దిగవలసి వచ్చింది. సూర్యోదయ సమయములో దిగుట వలన ఆ ప్రాంతానికి 'బ్రధ్న పురి ' అన్న నామకరణము చేసినాడు. అచట శివుని ధనుస్సగు పినాకము బోలె వంపుసొంపుల సోయగాలతో ప్రవహిచే నది ఆయనకు గోచరించుటవల్ల  అక్కడ దిగవలసి వచ్చింది. ఎందుకంటే స్నాన సంధ్యానుష్ఠానములకు నదీ తీరము శ్రేష్ఠము . ఆ నదిని పినాకిని అంటారని ఆయన తెలుసు కొన్నాడు. అసలు పినాకి అంటే శివుడు. శివుని భార్య శివాని అయినట్లు పినాకి భార్య పినాకిని అవుతుంది. అంటే ఆ తీర్థము గంగాదేవియొక్క ఒక పాయ అనేకదా. ఇక అంతకంటే ప్రశస్థమైన స్థలము వేరొకటుందని తలచి రాములవారు అక్కడ దిగటము జరిగినది. నదీ స్నానానంతరము సంధ్యా వందనము ముగించి, బ్రాహ్మణుడైన రావణుని జంపుట వలన కలిగిన బ్రహ్మ హత్యా పాతకమును తొలంగజేసుకొననెంచి శివార్చనకు ప్రయత్నించగా అక్కడ శివలింగము ఆయనకు ఆ ప్రాంతములో కనిపించ లేదు. అందుకు ఆయన సుముహుర్తము దాటక ముందే కాశీ నుండి ఒక శివలింగమును హనుమ తో తెమ్మని పురమాయించి, ఆయన ముహుర్త సమయము లోపల రాలేక పోయినందున తానే ఇసుకతో లింగమును చేసి దానిని ప్రతిష్ఠించి శివార్చనము చేసి తన బ్రహ్మ హత్యా పాతకమును తొలగింప జేసుకొన్నాడు. ఇప్పటికీ ఆ లింగముపై వ్రేలిముద్రలు అగుపించుతాయి. దీనిని ముక్తి రామేశ్వరమని దక్షిణ కాశి అని రామలింగేశ్వరమని కూడా అంటారు కానీ ఇప్పుడు మాత్రము రామేశ్వరముగానే స్థిరపడిపొయినది. ఇది అక్కడి స్థల పురాణము. 

'బ్రధ్నము' ప్రకృతి 'ప్రొద్దు' వికృతి. అందువల్ల రానురానూ బ్రధ్నపురి ప్రొద్దుటూరు అయినది. ఇది నదికి ఉత్తరముగా వున్నది. అందుకేనేమో ఆ పరమేశ్వర కృపాకటాక్ష వీక్షణములకు గురియై ఐశ్వర్య వంతముగా, కరువు ప్రాంతమైన రాయలసీమలో, అలరారుచున్నది. ఆ పినాకినీ నదినే నేడు పెన్న అంటారు. అసలు ఈ పెన్న 'పినాకినీ' 'పాపఘ్ని' నదుల సంగమము. ఆ పినాకి గంగాతోనే వుండి ఆమెను పినాకినిని చేస్తే మరి పరమేశ్వరినైన నా పరిస్థితి ఏమిటని అనుకొన్నదో ఏమో గోదావరి వద్ద గల పెనుగొండలో కన్యకగా పుట్టిన పరమేశ్వరి ఈ వూరిలో 102 గోత్రముల ఆర్యవైశ్యులకు అష్టైశ్వర్యముల గూర్చుచూ అమ్మవారిశాలలో అమరింది. అమ్మవారిశాల లో లభించే ప్రాచీన దస్తావేజుల ప్రకారము అమ్మవారిశాల యొక్క చరిత్ర ఈ ప్రకారంగా వుంది. 

పర్లపాడు వాస్తవ్యుడు, పడిగసాల గోత్రజుడు ఐన కామిశెట్టి చిన్నకొండయ్య కు కలలో కన్యకా పరమేశ్వరి కనిపించి తనకు ఆలయము నిర్మించమని కోరుటతో మనమీరోజు ఈ అమ్మవారిశాలను చూడగలుగుచున్నాము. ఆయన మద్రాసుకు పోయి వ్యాపారము అపారముగా చేసి ఆర్జించిన ధనముతో ఆ పని చేయగలిగినాడు. ఆ తల్లి ఈ ఆర్యవైశ్యులకు అండయై ,కైదండయై, వసివాడని పూదండయై నేటికినీ ఈ పట్టణమున విలసిల్లుతూవుంది.ఈ పట్టణములోని వైశ్యులు ఎంత బ్రాహ్మణ విశ్వాసపరులో అంతటి మానవతా వాదులు. ఎందరో వేద శాస్త్రపండితులకే కాక సంస్కృతాంధ్ర భాషా పడితులనాదరించి వారికి నిలువనీడ ఏర్పరచి తమ ఔన్నత్యము చాటుకొన్నారు. మహనీయులు లబ్ధ ప్రతిష్ఠులు అయిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, ఎల్లమరాజు శ్రీనివాసరావు గారు వీరి సత్కారములు ఆదరణ పొందిన వారే. వీరు ఎన్నో దశాబ్దములు కుల విచక్షణ లేకుండా విద్యార్థులకు భోజన వసతి సౌఖర్యములు ఏర్పరచిన వదాన్యులు.  మే 19,1929 మహాత్మా గాంధి ప్రొద్దుటూరుకు వచ్చి అమ్మవారిశాల వేంచేసి వైశ్య వర్గముచేత సన్మానించబడి, గౌరవముతో వారిచ్చిన 116 బంగారు కాసులను (ఇప్పటి తూకములో 230 గ్రాములు ) గ్రహించి ప్రొద్దుటూరుకు 'బంగారు ప్రొద్దుటూరు' అన్న గౌరవ నామము నొసంగినారు. ఇక్కడ అమ్మవారు కళామయి మరియు వాత్సల్యమయి. ఆ తల్లి కి ఆభరణాలు తొడుగులే కాక బంగారు రథము కూడా వున్నది. ఈ ఊరిలో వైశ్యకుల పతాకమునెగురవేసిన వారిలో  కొప్పరపు సుబ్బారావు గారు అగ్రగణ్యులు. 

ఇక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన 'అగస్తీశ్వర ఆలయము' ప్రసిద్ధ దేవాలయము. సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు వైష్ణవులై యుండి (వైష్ణవులు శివుని దర్శించనుగూడా దర్శించరు) కూడా ప్రతిదినము శుచిగా అగస్తీశ్వరునికి ప్రదక్షిణములు గావించి స్వామి ఎదురుగా వుండే చెట్టు క్రింద కూర్చొని అసమాన ప్రఖ్యాతి గాంచిన 'శివతాండవము'ను రచించినారు. వీరినిగూర్చి ఒక సందర్భమున విశ్వనాధ'వారే "మిక్కుటముగా మేము ఇరువురమూ సమానులమే అయినా కొన్ని విషయాలలో వారు నాకన్నా మిన్న" అన్నారు. వేరు యేకవి పండితునికైనా శిలావిగ్రహ మున్నదో లేదో నాకు తెలియదు గానీ వీరికి మాత్రము ప్రొద్దుటూరు నడి బొడ్డున,  ఏ రాజకీయ నాయకుడు నోచుకోనంత, నిలువుటెత్తు విగ్రహమును ఏర్పాటు చేసినారు. 

ఈ వూరు కవిపండిత నిలయము. శివభారత కర్త అద్వితీయ జ్యోతిశ్శాస్త్ర మరియు సంస్కృత పండితుడు, అవధాని, మొదటి తెలుగు ప్రపంచ సభకు వెళ్ళిన అవధాని పితామహ బిరుదాంకితుడు శ్రీ C.V. సుబ్బన్న గారి గురువు  'బ్ర.శ్రీ.వే.గడియారం వెంకట శేష శాస్త్రి గారు', రాణాప్రతాపచరిత్ర వ్రాసిన దుర్భాక రాజశేఖర శతావధానిగారు, C.V. సుబ్బన్న శతావధానిగారు , రాజన్న కవి గారు, నరాల రామిరెడ్డి గారు, గంటి కృష్ణవేణమ్మ గారు, అవధానం చంద్రశేఖర శర్మ గారు (ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మరియు అవధాని), బహు గ్రంథ కర్త శ్రీయుతులు Dr. ప్రభాకర రెడ్డి గారు (children specialist) మొదలుగాగల విద్వచ్ఛిరోమణులను కన్నదీ గడ్డ. వేద విద్వాంసులకు ఒక కాలములో కాణాచి. వేదమూర్తులు శతవర్ష జీవితులు  కీ. శే. తిప్పాభట్ల వెంకటసుబ్బయ్య గారు వారు బ్రతికినంత కాలమూ కొన్ని వందల వేదవిద్య చదువ వచ్చిన పేద విద్యార్థులకు అందరికీ  తనయింట భోజనము పెట్టించి చదువు చెప్పి పంపినారు. వేదవిద్య వారివద్ద సాకల్యముగా నేర్చుకొన్న శాకల్య సుబ్రహ్మణ్యంగారు, వెల్లాల వెంకట శేషయ్య గారు మిక్కిలి ప్రసిద్ధులు. నేడు అట్టివారెవరూ లేక ఆ వూరు వెలవెల బోవుచున్నది. 

ఇక్కడ ముఖ్యంగా ఒక్క మాట చెప్పుకోనవలె మాన్యులు A.K. ముని గారి గురించి.  పేరు అవధానం కృష్ణముని. వారు చదివినది 8వ తరగతి వరకు. గణితము,ఆంధ్రము, సంస్కృతము, ముఖ్యంగా ఆంగ్లములో అపారపాండితీ ప్రకాండుడు. గాంధీ గారు కస్తూరిబాయి తో కలిసి, పైన తెల్పిన సమయములో, ప్రొద్దుటూరు వచ్చినపుడు బస చేసింది వీరి ఇంటిలోనే. వారి పాండిత్యమునకు గాంధీజీ అబ్బురపడినారట. మదరాసు లోనే వారిని గూర్చి వినుతవల్ల వారి యింటిలో దిగినాడట.  వీరికి 1. నవనవోన్మేష ప్రజ్ఞా ధురీణ 2కవి పండిత విమర్శకాగ్రేసర 3. ఆనంద కుమార అనే బిరుదులుండేవి. నెహ్రు బ్రతికియున్న కాలములో ఆయన పుట్టిన రోజున అత్యంత క్లుప్తముగా ఆయనను గూర్చి వ్రాసిన వారికి రూ.5,116 లు 'మద్రాసు ప్రెస్ గిల్డ్ ( ఎవరు అన్నది నాకు ఇదమిధ్ధముగా తెలియదు.)వారు ప్రకటించితే ఆయన 'Nation's Exalted Hero Rules Us' అని వ్రాసి ఆ బహుమతిని పొందినారు. 1950 దశకములో ఆ మొత్తము ఎంత పెద్దదో చదువరుల ఊహకు విడిచిపెట్టుచున్నాను. ఆయన కుమారుడు శ్రీయుతులు పద్మశ్రీ A.S.రామన్(అవధానం సీతా రామశాస్త్రి. )గారు ILLUSTRATED WEEKLY OF INDIA కు మొట్టమొదటి సంపాదకుడు. 
(ఈ పేరాలో కనబరచిన విషయాన్ని నాకు అగ్రజతుల్యులైన నంద్యాల సుబ్బరామ శర్మ, ప్రొద్దటూరు,గారి నుండి గ్రహించినాను.)

ఇంకొక విషయం. సాధారణంగా వైశ్యులలో రాజకీయాలు యూనియన్లు మొదలగు వానికి ఆదరణ తక్కువ. అందుకు విరుద్ధముగా వల్లంకొండు సదానందీశ్వరయ్య గారు విద్యార్థి దశలోనే వామపక్ష భావములకు ఆకర్షితుడగుటయే కాక SBI లో చేరి క్రొత్త యూనియన్ ఏర్పరచుటకు శ్రమించిన వారి లో ముఖ్యుడై  పిదప officer's association లో ప్రముఖ బాధ్యతలు నిర్వహించి ఆపై pensioner's association కు vice president గా తన సేవలందించిన,ఇంకా,వయసు మీద పడుటవల్ల, సామాన్య సభ్యునిగా సేవలందించు చున్న ఈయన 1989 లో USSR ఆహ్వానము పై May Day Celebrations కు వెళ్ళి వచ్చిన ఘనుడు. 

స్థానం నరసింహారావు గారు ' మీరజాల గలడా' అన్న పాటను ఈ వూరిలో కృష్ణ తులాభారము నాటకము వేయవచ్చి సాయంసమయములో మిత్రులతో వ్యాహ్యాళికి వెళ్ళినపుడు పెన్నా నది ఒడ్డున వ్రాసినారని ఇక్కడివారు చెబుతారు. మొదటి సారిగా ఆవూరి వేదిక పైననే పాడినారట. 

చివరిగా ఇంకొక్క విశేషము చెప్పి చాలించుతాను. ఈ వూరికి ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత వుంది. ఇక్కడ బంగారు వెండి ప్రత్తి నునెల వ్యాపారము అమితము. ఈ ఊరిని గూర్చి తెలిసిన వారు దీనిని రెండవ బొంబాయిగా చెప్పుకొంటారు. ఇక్కడి వైశ్యులు ఒక మానవ శృంఖలముగా నేర్పడి వ్యాపారములో ప్రపంచ ప్రసిద్ధులైన మార్వాడీలను ఈ వూరిలో అడుగు పెట్టనివ్వలేదని అంటారు. ఇది నేటికినీ గమనించవచ్చు. 

చలన చిత్రములలో చూపించు నటుల రీతిగా  ఈ సీమలో కక్షలు కార్పణ్యాలు కుళ్ళు కుట్ర ద్వేషము పగ 
లేవు. రెండు వర్గాల మధ్య ఒక వేళ పగ వున్నా అది ఆయా వర్గ సభ్యుల మధ్యనే పరిమితము. నాకు స్వయానా పిల్లనిచ్చిన మామ గారైనా శ్రీయుత నంగనూరిపల్లె క్రిష్టిపాటి వెంకట రామయ్య గారు మంది మార్బలముతో వర్గము కలిగి యుండుటయే కాక తన విరోధుల చేత కూడా మన్నన పొందిన వారు. ఆయన 45 సం. క్రితము సాధారణ మరణమే తప్ప వేరు విధముగా పరమపదమునందలేదు. 

సభ్యులు చాలా మందికి అక్కడి దేశకాల పరిస్థితులు తెలియవని తలచి నాకు చేతనైన రీతి లో విశధముగా వ్రాసినాను. తప్పక,తప్పని తలవరని తలుస్తాను. 
ప్రొద్దుటూరు గురించి నా మాటలలో ...
బంగరు వెండి వస్తువుల, బట్టల గుట్టల, పత్తి, నూనెలన్
రంగుల నేత వస్త్రముల  రంజగు దోశెల నాణ్యమందునన్
ఏగతి పోటి చేయనగు నేపురమైనను గాని పేటతో
చాగురె ప్రొద్దుటూరు గన చారు తరంబు పురంబు లన్నిటన్

గంటి కృష్ణవేణి గరితను ఎరిగించె
కొరటమద్ది వారి గొప్ప తెలిపె
సుబ్బారావు గారి సౌజన్యమును పంచె
ప్రొద్దుటూరు గాదు ముద్దుటూరు
దుర్భాక  జవ్వాది ధూప మాఘ్రాణింప
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
గడియారమను పేర కస్తూరి వాసనల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
పుటపర్తి పేరుతో పునుగు తావులనెల్ల
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
సుబ్బన్న యత్తరు సౌగంధ వీచికల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు 
చంద్రశేఖర చందన చర్చితమ్ము
రామిరెడ్డియు రాజన్న రంజితమ్ము
వణిజ ప్రముఖాగ్రణీ సంఘ విలసితమ్ము
బరగ పేటగ  జగతిన పరిచితమ్ము 

స్వస్తి.

Monday, 9 December 2013

గండికోట 
'బాలనాగమ్మ' సినిమా గుర్తున్న వారికి మాయల మరాఠీ, లేక మాయల ఫకీరు గుర్తుంటాడు. అతను గండికోట ప్రాంతములో ఉండేవాడని కథలో వినిపిస్తుంది. ఆటను వుండినాడో లేదో గానీ గండికోట మాత్రం వుంది. అక్కడ కోట కూడా వుంది. ధ్వంసమైన రాజభవనాలు దేవాలయాలు కలిగివుంది. 
మొక్కవోని మసీదులను నిలుపుకొని వుంది . రంగనాథ,మాధవరాయ దేవాలయములు ఎంతో  పేరుపొందినవి, తప్పక చూడదగినవి. భోగపుసాని భవనము పావురాల గోపురము, ధాన్యాగారము, రక్తపు మడుగు, జుమ్మా మసీదు నేను బాల్యమున చూసినవి. ఇప్పుడది టూరిస్ట్ స్పాట్ అయినదని విన్నాను. శత్రువులను చంపిన కత్తులు కడుగుటవల్ల అమడుగులో నీరు ఎప్పుడూ ఎర్రగా ఉండేవి. దేవాలయాలు ధ్వంసమైనా శిల్పకళ చూసి తీరవలసినదే! ఇక జుమ్మా మసీదు గోడలు పాలరాతి గోడలు లాగా చాలా నునుపుగాను తెల్లగాను వుంటాయి. మెట్లపై, పై అంతస్తు చేరుటకు ఎక్కుతూ, దృష్టి పైవైపుకు సారించితే ఇంకొక అంతస్తుకు మెట్ల బాట ఉందన్న భ్రమ కలిగించుతుంది. నిజాని కటువంటిది లేదని నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయి వుంటుంది. గండి కోట లోయ 
చూడవలసిన దృశ్యము. ఆ అందము నా మాటల కందదు. మైలవరం డాము ఇక్కడికి 3 కిలోమీటర్లే. గండికోట ప్రాజెక్ట్ ఎందఱో రాయలసీమ వాస్తవ్యులు కన్న కల. కలను కల్లగా జేసిన ఘనత నాటి 
పాలకులదే. ప్రాజెక్ట్ 'ఢాం' అనింది  గానీ ప్రక్కన dam మిగిలింది. నాకు తెలిసిన మేరకు గండి కోటను గూర్చి నాలుగు మాటలు చెబుతాను. గండికోట  కడప  జిల్లా  జమ్మలమడుగు తాలూకాలో పెన్నా  నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా 
ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, శత్రుదుర్భేద్యంగా వుంటుంది. 

 యన్.టి.ఆర్ నటించిన పాత చిత్రం " గండికోట రహస్యం " సినిమా గుర్తుకొస్తూ వుందా..! నిజమే చాలా మందికి ఈ " గండికోట " పేరు చెప్పగానే అదేదో యన్.టి.ఆర్ సినిమా ఉంది కదా అని అనిపిస్తుంది...! నిజముగా  " గండికోట ఉన్నది కానీ గండికోటకు 'గండికోట రహస్యానికి ఉండేది "తాతా చారికి పీర్ల పండగకు" మరియు "అబ్దుల్ ఖాదరు కు అమావాస్యకు” వుండే సంబంధమే! ఒక్క కడప వాసులలో కొందరికి తప్ప మిగతా తెలుగునాడు లోని తెలుగు ప్రజలెవ్వరికీ తెలియదు.., మన ప్రభుత్వ ఘనకార్యం అది, నిజంగా దౌర్భాగ్యమే...! ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన 
ఒక ప్రాంతం గురించి.. అదీ మనల్ని మనం పరిపాలించుకున్న మన పాలకులు, రాజులు గురించి తెలిపే ఒక ప్రక్రియ గాని చేపట్టలేదు మనల్ని పరిపాలించిన ప్రభుత్వాలు, కనీస ఒక పర్యాటక కేంద్రముగా కూడ నోచుకోలేదు. ఒక చారిత్రాత్మక కట్టడం అలా మరుగున ఉన్నది... ! ఈ ఘనత వహించిన పాలకులు కేవలం ఏడెనిమిది  సంవత్సరాల క్రితం నిద్రనుండి మేల్కొని ఇప్పుడు అక్కడ టూరిజం వారిచే కొన్ని వసతులు, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినారట. ఇలాంటి విషయాలలో పక్కనున్న 
కర్నాటక రాష్ట్రం ఎంత ముందంజలో వుందో చూసి మనం చాలా నేర్చుకోవాలి. విజయనగర సామ్రాజ్య  స్థాపకుడు బుక్క రాయలు క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించినాడు. ఆతని తరువాత ఎందఱో రాజులు ఆ 
కోటనేలినారు కానీ  చివరి పాలకుడైన చినతిమ్మానాయుని కాలములో అది ముస్లిముల వశమయ్యింది.

మీర్ జుంలా పారశీక (ఇరాన్) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. గోలకొండ రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి 
భారతదేశము చేరినాడు. స్వయముగా వజ్రాల వ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడైనాడు. తదుపరి గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగినాడు . విజయనగర సామ్రాజ్యములో వజ్రాల గనులున్న రాయలసీమపై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రము తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడున్నాడు. ఎన్నోరోజులు భీకరయుద్ధము జరిగినను కోట వశము కాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలువారినాయి . క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చి కోటగోడలు బద్దలు చేయుటలో కృతకృత్యుడైనాడు . యుద్ధము మలుపు తిరిగింది. యుద్దము ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర వ్యాపారి టావెర్నియర్ గండికోటలో నున్న మీర్ జుంలాను కలిసినాడు . ఆ సందర్భమున తిమ్మానాయుని శౌర్యపరాక్రమము గురించి విని తన పుస్తకములో ఎంతో గొప్పగా పొగిడినాడు. తిమ్మానాయుని బావమరిది శాయపనేని నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాసినాడు. చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ , అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణమునకు కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరిస్తుంది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేసినారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకి చనిపోయినారని చెబుతారు. హతాశుడైన చినతిమ్మ రాయబారమునకు తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందము. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషమునిప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకప్పగించి రాజ్యము దాటిస్తాడు. నాయునికి విషప్రభావము వల్ల మరణము ప్రాప్తిస్తుంది . మీర్ జుంలా గండికోటలోని మాధవస్వామి ఆలయము ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మిస్తాడు . దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించుతాడు. కోటను ఫిరంగుల తయారీకి స్థావరము చేస్తాడు. గండికోటపై సాధించిన విజయముతో మీర్ జుంలా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అవుతాడు. బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయ నాయుడు తమిళదేశానికి తరలించబడతాడు. గండికోట లోని అరువదియారు ఇంటిపేర్లు గల కమ్మ వంశములవారు చెల్లాచెదరై 
పోయి పలు ప్రాంతాలలో స్థిరపడతారు. వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పోతారు. వీరికే 
'
గంపకమ్మవారు', 'గండికోట కమ్మవారు' అను పేరులు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెడతాడు. వీరి వారసులు మధుర సమీపములోని కురివికులం, నాయకర్పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులైనారు. మూడు శతాబ్దములు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయములు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు 
అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు. ఇప్పటికి గండికోటలో ఒక చిన్న గ్రామం ఉన్నది, మూడు వందల ప్రజలు నివాసము ఉంటున్నారు. ఇక్కడ చూడదగ్గ శిల్పకళాసంపద చాలానే ఉన్నది, మాధవస్వామి దేవాలయం ఎత్తైన గోపురముతో నలువైపులా ద్వారాలతో తూర్పుముఖమై ఉంటుంది, లోపల నైఋతిమూల ఎత్తైన శిలాస్తంభములతో మధ్య ఉన్నతమైన వేదికతో నున్న కళ్యాణమండపము, ఆగ్నేయ మూల పాకశాల, అలంకారశాల, ఉత్తరమున ఆళ్వారుల ఆలయము, దాని ప్రక్కన మరొక కళ్యాణమండపము ప్రాకారము వెంబడే లోపలవైపుగా 55 స్తంభముల వసారా కలదు ఆలయము గర్భగృహము, మూసిన అర్థమండపము, నాట్యమండపము ఉన్నాయి. ఈ మండపాలలో 
శిల్పకళ కళ్ళు చెదిరేలా ఉంటుంది, అందుకే ఆ ఫ్రెంచ్ ట్రావెలర్ ఈ గండికోటను రెండవ హంపిగా కొనియాడారు. మాధవస్వామి ఆలయగోపురము నాలుగు అంతస్తుల కలిగి ఉన్నది. ఈ ఆలయాన్ని హరిహర బుక్క రాయులు నిర్మించినారు. రఘునాధా అలయము  ధాన్యాగారమునకు  ఉత్తరముననున్న  ఎత్తైన గుట్టపై ఉన్నది. ఈ ఆలయ  ప్రాకారము లోపల కళ్యాణ మంటపము ఉన్నది ఈ మండపానికి నాలుగు వైపుల నున్న స్తంభాలమీద రతి భంగిమల శిల్పాలు చెక్కి ఉన్నారు, ఇక గర్భగుడి చుట్టూ ఉన్న మండపంలో చూడదగ్గ ఎంతో 
శిల్పకళా సౌందర్యమున్నది.

గండికోట లోపల వెలుపల మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయి, ఇక కోటలోపల " రాయల చెరువు " ఉన్నది ఇక్కడ నుండే కోటలోపల వ్యవసాయ క్షేత్రములకు నీరు, అలాగే ప్రజలందరికీ త్రాగునీరు అందించేవారు. ఇవి కాక పెన్నానది చేసిన గండికోట 5 కిలోమీటర్ల పొడవునా లోతుగా ప్రవాహముంటుంది నిజంగా అది అందరు చూడవలసిన ప్రకృతి తయారు చేసిన సహజ కందకం, దాదాపుగా 1000 అడుగుల వెడల్పుతో 500 అడుగుల లోతుతో ఏర్పడిన ప్రవాహమది. సంక్షిప్తంగా ఇది గండికోట చరిత్ర..


ఎలా చేరుకోవాలంటే ... 
గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. జమ్మలమడుగు నుంచి బస్సు సౌకర్యం కలదు .