https://cherukurammohan.blogspot.com/2024/06/blog-post.html
ఇది Myind Media, Inerne Radio కోసం చి.కుం.సౌ. పద్మినికి నాకు జరిగిన సంవాదము (Interview). ప్రశ్నలు ఆమెవి, జవాబులు నావి.
ప్రశ్నోత్తర పంథాలో వున్న ఈ విషయమును నిదానముగా చదివేది. నిడివి ఎక్కువ ఉన్నదని like కొట్టి చదువుట మాన వద్దు. చదివిన తరువాత మీ కోపములో కొంత మాత్రము తగ్గినా నా వ్రాత బాగుంది అనుకొంటాను. (తల వ్రాత కాదు)
మీ నప్పుదల కన్నా మీఅభిప్రాయముముఖ్యము
1. కోపమునకు మూల కారణమేమి?
నిత్యజీవితంలో ఒత్తిడి పెరిగి పోతోంది. గృహజీవితంలో కోపతాపాలెక్కువౌతున్నాయి. ఆ కోపం యొక్క ప్రభావం ఆరోగ్యం మీద పడుతోంది. దాంతో హృదయ సంబంధమైన రుగ్మతలు, మానసిక సంబంధమైన రుగ్మతలూ పెరుగుచున్నాయి. కాసేపు ఆలోచించండి!
సాధారణంగా ఆఫీసు వాతావరణం, చేస్తున్న కృషిని మెచ్చుకోక పోవడం, ఆఫీసులో తనకంటే ఇతరులకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తున్న భావన మొదలైన అంశాలెన్నో ఈ రకమైన మానసిక వత్తిడికి కారణమవుతున్నాయి. ఒక వ్యక్తికి తాను చేస్తున్న పని పట్ల సంతృప్తి (Job Satisfaction) లేనప్పుడు అది అతడి పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఆ వ్యక్తి తన ఉన్నతాధికారులనుండి మందలింపులు, చివాట్లు తినాల్సి వస్తుంటుంది. దీనితో ఆ వ్యక్తి ఇంకా నిస్పృహకు గురియౌతాడు. అతడి పని తీరు మరింతగా దెబ్బ తింటుంది. చేస్తున్న పనిపై ఎలాంటి ఉత్సాహాన్ని చూపించడు. ఏదో పని చేయాలి కనుక తప్పనిసరై చేస్తున్న పరిస్థితి ఉత్పన్నమవుతుంది. పనిభారంతో కలిగే మానసిక వత్తిడి అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించదు. మన సాధారణ ఆరోగ్యం, ఆఫీసు బైట మన స్నేహసంబంధాలు, వ్యక్తిత్వం మొదలైనవి ఈ ఒత్తిడిని మనం ఎలా తట్టుకోగలుగుతున్నా మనే అంశాన్ని నిర్ధారిస్తాయి. పనిభారంతో కలిగే ఈ మానసిక ఒత్తిడికి నిర్దుష్టమైన నిబంధనలేమీ లేనందున కొన్ని చిన్నచిన్న సూచనలను పాటిస్తే దీనిని మనం సమర్థవంతంగా ఎదుర్కొనడం కష్టమేమీ కాదు. వత్తిడి అనవసరమైన కోపానికి దారి తీస్తుంది. అనవసరమైన కోపము అనర్థానికే దారితీస్తుంది.
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
అన్నారు పెద్దలు.
2. కోపాన్ని గురంచి మన ఇతిహాసాలలో ఏదయినా ప్రస్తాపన ఉందా!
రాముడు కోపము కావలిసినపుడు తెచ్చుకొంటాడు. సముద్రుని విషయంలో అదే చేస్తాడు. సముద్రుని సేతుబంధనకు వసతి కల్పించమంటే మౌనము వహిస్తాడు సముద్రుడు. అది కూడా మూడు రాత్రులు. తన కార్యము ఆలస్యమగుటవల్ల రాముడు కోపమును, సముద్రునిపై తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన లక్ష్మణుని తో ఈ విధముగా అంటాడు :
ప్రశమశ్చక్షమా చైవ ఆర్జవం ప్రియవాదితా
అసామర్థ్యంఫలన్త్వేతే నిర్గుణేషు సతాం గుణాః
సత్పురుషులు మంచి గుణములు కలిగియుందురు. ఓరిమి,ఇంద్రియ నిగ్రహము,మనోవాక్కాయ కర్మలలో ఋజుత్వము, ప్రియ భాషణమును కలిగి యుందురు. అది వారి సహజ గుణము. కానీ గుణహీనులు సజ్జనుల మంచితనమును చేతగానితనముగా భావిస్తారు. చూసినావా ఈ సముద్రుని గర్వము
ఆత్మా ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకం
సర్వత్రో త్సృశత దండంచ లోక స్సత్కురుతే నరం
న సామ్నాశక్యతే కీర్తి రణ సామ్నాశక్యతే యశః
ప్రాప్తుం లక్ష్మణ లోకే స్మిన్జయోవా రణ మూర్ధని
క్రోధము లేకుండా ఎదుటివారి తప్పులను ఓర్చుకొనుచూ వారి మనసును అనుసరించి కపటము లేక ప్రియముగా మాట్లాడువానిని నీచులు అసమర్థుడని భావింతురు. ఎవడు తనను తానూ పోగడుకొనుచూ, పరుల నిందించుచూ,
ఆవిధముగా వారిని తన కపటము మరియు వంచనకు గురిచేయుచూ నుండునో వానిని లోకము గౌరవించును. గొర్రె నమ్మేది గోసాయిని కాదు కసాయినే కదా ! సముద్రమును ఇంకింపజేసి దాటి ఈ సముద్రుని పోగరణచెదను . ఈ నీచుని వద్ద ఓరిమి చూపుట అవివేకమంటాడు శ్రీ రామ చంద్రుడు.
శ్రీ మహాభారతం లోని కథ
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టు నీడన కూర్చుని వేదం వల్లె వేస్తున్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీద నున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది.
అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూస్తాడు.
అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి ప్రాణాలను వదుల్తుంది. ఆ తరువాత ఆ బ్రహ్మచారి రోజూమాదిరే గ్రామంలోనికి భిక్షాటనకు పోతాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడుగుతాడు. ఆ ఇల్లాలు పతివ్రత. తన భర్త భోజనం అయిన పిదప భిక్ష తీసుకొని బయటకు వస్తుంది. “స్వామీ! వచ్చుటలో ఆలస్యమైనది క్షమించండి” అంటుంది. కౌశికుడు మండిపడి కోపంగా చూస్తాడు ఆమె వైపు. అప్పుడామె “స్వామీ! అనవసరంగా కోపం తెచ్చుకోకండి. తపోధనులకు
కోపం తగదు అని యంటూ ఈ విధముగా చెబుతుంది.
కం:- క్రోధము తపముంజెఱచును,
క్రోధము అణిమాదులైన సిధ్ధులఁ జెరచున్;
క్రోధము ధర్మక్రియలకు
బాధకమగు, క్రోధిగా తపస్వికిఁ జనునే!
ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి” అని కూడా అంటుంది. కౌశికుడు దిగ్భ్రాంతి చెంది ఆ విషయము ఆమె కేలాగు తెలిసిందని యడుగుతాడు. భార్యగా తన ధర్మాన్ని తాను నిర్వర్తించుటయే అని చెబుతూ “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకొంటె ఆ విషయాన్ని చక్కగా ఎరుక పరుస్తాడని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుని ఇంటిని కనుగొని అక్కడికి చేరుతాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. కౌశికుని చూచిన వెంటనే ధర్మవ్యాధుడు “అయ్యా! రండి. తమరిని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించుతాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోవుట కౌశికుని వంతు ఔతుంది. అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి తన తల్లిదండ్రులసేవకు వేళయినదని
చెప్పి వెళతాడు ధర్మవ్యాధుడు. అది ముగించి కౌశికుని వద్దకు వస్తాడు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధముగా అంటాడు. “ఆర్యా! ఏ పనినైనా నిష్కామ హృదయంతో, ధర్మమును అనుసరించి చేస్తే అది పరమాత్మునికి ప్రీతికరమౌతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం పురోగమిస్తుంది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మన కనీస కర్తవ్యం. అట్ల చేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు.
మాతాపితరుల సేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”. అని ఎంతో సౌమ్య స్వభావుడై హితవు పలుకుతాడు. ఈ హితబోధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవు తీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగుతాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించుతాడు.
ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష”అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్వి మీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయినాడు. పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో కానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది. స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగినాడు. మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు.
జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపించటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పినాడు.
పూర్ణే వర్షసహస్రే తు కాష్ఠభూతం మహామునిమ్ ।
విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాంతరమావిశత్ ॥
ఇది శ్రీమద్వాల్మీకి విరచిత రామాయణములోని బాలకాండలో మనము చూడ వచ్చు. 'బ్రహ్మర్షి’ పట్టమును పొంద నిరంతర కృషి చేయుచున్న “మహర్షి” విశ్వామిత్రుడు బ్రహ్మాదేశానుసారము ఇంకనూ ఇంద్రియ నిగ్రహముకై సాధన కొనసాగించి వేయి సంవత్సరములు ఘోరతపమాచరించ పూనుకుంటాడు. ఆతని నియమ,నిష్ఠా నిరతులను పరీక్షింపదలచిన దేవతలు రంభను ఆ మహర్షి కడకు పంపుతారు. రంభ వయ్యారాలను చూసి మహర్షి ఏ మాత్రమూ చలించడు గానీ తనను పరీక్షించుటకై వచ్చినదన్న కోపముతో ఆమెను శపించుతాడు. మరుక్షణమే కోపించుట అవివేకమని తానూ ఇంకా కోపమును జయించ లేదని తెలుసుకుంటాడు.
ఆమెకు శాప నివారణోపాయమును చెప్పి పంపుతాడు కానీ, తిరిగీ తానూ ద్విగుణీకృతమైన పట్టుదలతో మరల తపస్సుకు పూనుకుంటాడు.
3. విదుర నీతి, సుభాషితాలలో కూడా కోపము యొక్క ప్రస్తాపన వస్తుందంటారు. అవునా?
భర్తృహరి సుభాషితాలలో కూడా యిదేమాట అంటాడు.
క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి
త్రము దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి
త్త, ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్య మీక్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునఁ దత్కవచాదులేటికిన్? |చ|
కోపము నుబ్బును గర్వము,
నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,
కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా.
భారతం. ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం…32.
భర్తృహరి ఈ విధముగా అంటాడు.
“మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వో దుర్వచనం తథా
క్రోధశ్చ దృఢవాదశ్చ పరవాక్యేష్వనాదరః”
“గర్వము, చెడుమాటలు మాట్లాడుట, కోపము, పిడివాదము, ఇతరుల భాషణమునందు అనాదర భావము అను ఐదు మూర్ఖుల లక్షణములు"అని ఈ శ్లోకానికి భావం.
4. క్రోధాన్ని గూర్చి భగవద్గీతలో కూడా చెప్పినారంటారు?
నిజమే. భగవద్గీత లో చెప్పిన మాట వాస్తవము.
ఒక అజ్ఞాత కవి తన మాటలలో ఈ విధంగా చెప్పినాడు.
లొభాత్ క్రోధః ప్రభవతి లొభాత్ కామః ప్రజాయతే
లొభాత్ మోహశ్చ నాశశ్చ లొభాః పాపస్య కారణం
- అజ్ఞాత
లోభము క్రోధ కారణము. లోభము కామ ప్రేరకము. లోభము మోహ నాశములకు నాంది. లోభము సకల పాపములకు కారణము. పేద తనకు ఇంకాస్త వస్తే బాగుండునని కోరుటలో తప్పు లేదు కానీ దాని ఇంకా కావాలనుకొనుట అత్యాశే కదా ! ఆశకలిగిన వాడు ఇతరులకేమిస్తాడు. మరి ఉండి ఇవ్వలేనివాడు లోభియే కదా ! లోభము ఇంకా కావాలన్న కోరికను కలిగిస్తే అది క్రోదానికి పుట్టినిల్లవుతుంది. 'క్రోధో వైశ్వానరో ' అన్నారు పెద్దలు. కోపము అగ్ని సమానము అది తానూ కాలుతుంది ఎదుటివారిని కాలుస్తుంది. కోపము చివరికి ఇవ్వగలిగినది బూడిదే! అంటే వినాశనమే కదా! ఇప్పటివరకూ లోభము వాళ్ళ జేసినవన్నీ పాప హేతువులే . కాబట్టి లోభి మూట కట్టుకొనేది పాపము తప్ప వేరేమీ లేదు. ఇక్కడ గమనిచ వలసినది ఏమిటంటే లోభి కేవలము లోభిగా వుండిపోలేడు. ఎందుకంటే కోపము దానికి ఆత్మ. అందుకే ఈ కోపాన్ని గూర్చి పరమాత్మ గీతలో ఈ విధముగా చెబుతాడు.
క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి 63 – 2 ఇది గీతా వాక్యము.
కోపమన్నదొక కొరివి చూడమది
సమ్మోహాగ్నిని సంతరించును
సమ్మోహముచే స్మృతి విభ్రంశము
స్మృతి గతి తప్పిన బుద్ధి నాశనము 63 -- 2
అరిషడ్వర్గాలలో మొదటిది కామమైతే రెండవది క్రోధమే! మయ సభను చూచినది మొదలు తన వధ వరకు దుర్యోధనుడు తన మనసున అది తనకు కావలె నాన్న కోరికతో మొదలుపెట్టి తన మరణము కొనితెచ్చుకొనే వరకు పై మానసిక ప్రకంపనలన్నీ పొందుట గమనించవచ్చు.( కానీ నిజానికి దుర్యోధనుడు మయసభలో స్థలమని భ్రమించి నీట గుంటలో పడినపుడు ద్రౌపది నవ్విన వారిలో లేదని సభాపర్వము 47 - అధ్యాయము 6 లో చూడనగును.)
5. కోపమును గూర్చి మీ మాటగా ఏదయినా చెబుతారా?
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీ ముందుంచుతాను. ఒక Paper Board 1000 రూపాయల విలువగలది కొన్నామని ఊహించుకొందాము. దాని పైన అడ్డముగా 8 నిలువుగా 11 సరళ రేఖలు గీచి
10X7 గళ్ళను తయారు చేస్తాము. ఇప్పుడు అడ్డముగా 10 గళ్ళు నిలువుగా 7 గళ్ళు వుంటాయి. 10 కోపమోచ్చే సన్నివేశాలను 7 వారములోని ఏడు రోజులను తెలుపుతాయి. కోపము వచ్చినపుడల్లా ఒక నల్ల Marker Pen తో X ఒక్కొక్క గడిలో గీచుతూ పోయినామనుకొండి. వారాంతానికి ఆ Board మరియు దానిని అంటించిన గోడ ఎంత అసహ్యముగా కనిపించుతాయో గమనించండి. ఇక్కడ గళ్ళను ఏర్పరచే గీతలు నీలో కలిగే ఉద్వేగ పరంపరలు. ఆ Paper Board నీ మనసు, దానిని అంటించిన గోడ నీవే! ఇప్పుడు ఒక్క విషయము యోచించు. ఆ 'X' లేకపోతే గళ్ళవసరములేదు, గళ్ళవసరము లేకుంటే గీతలవసరము
లేదు. గీతల అవసరము లేకుంటే Paper Board అవసరము లేదు. ఆ Paper Board అంటించే అవసరమే లేకుంటే గోడ ఎంత అందముగా వుంటుందో చూసుకో! మరి 'గోడ' అంటే నీవే కదా! కాబట్టి లోభము,మోహము, కోపము నీ దరికి రానివ్వకుంటే నీలో పరమాత్మను ప్రతిష్ఠించుటకు సిద్ధమైనావని భావించు. అంతకు మించిన ఆనందము వేరేమున్నది చెప్పగలవా ?
అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జంతోః కర్మయద్యద్కరోతిసః
అన్ని సమయాలలొ ఉత్సాహముగా ఉండుట శ్రేయస్కరము. ఉత్సాహము వుంటేనే ఎంతటి కఠినమైన పనులైనా చెయవచ్చును. ధర్మశాస్త్ర కర్త యైన యజ్ఞవల్క్య మహర్షి ఈ క్రింది విధముగా చెబుతున్నాడు:
వీణా వాదన తత్వజ్ఞః శృతిజాతి విశారదః
తాళజ్ఞాచ్చ ప్రయత్నేన మొక్షమార్గం సగచ్చతి
వాదనను శృతి, జాతి (తాళదశ ప్రాణములలో నొకటి) తాళజ్ఞత కలిగిన గాయకుడు ప్రయత్నించితే శాంతిని, ఆనందానుభూతిని పొంది మొక్షమార్గమున, కైవల్యమునందుదురు. అంటే రసానుభూతిని పొంది తన్మయుడైన శ్రోత గూడా కైవల్యము పొందక తప్పదు.
కావున ఆత్మానందము చేత తన్మయతను పొందే సంగీతమును శ్రోతను మోక్ష పథమున కైవల్యమును చేర్చును.
మరి కోపము యొక్క క్రూరత ఇది చదివిన తరువాత కొంచెమయినా ఆకళింపు చేసుకొనియుంటే దానిని క్రమక్రమముగా తగ్గించుకుంటూ వస్తారని నమ్ముతున్నాను. అసలు నమ్మక నేను చేయగలిగినది కూడా ఏమీ లేదు.
స్వస్తి.
No comments:
Post a Comment