Friday, 29 April 2022

శ్రీలంకలో ఆంధ్రులు

 

శ్రీలంకలో ఆంధ్రులు

 https://cherukurammohan.blogspot.com/2022/04/blog-post.html

శ్రీలంక పేరు వినగానే మనకు ముందుగా తమిళులు గుర్తుకు వస్తారు. అయితే  లంకను ఏలిన రావణాసురుడు మహాపండితుడు మరియు తెనుగునకు మొదటి వ్యాకరణకర్త అని  జనశ్రుతి. శ్రీలంకలో తొలి రాజ్యం స్థాపించింది మాత్రం తెలుగువాడు. అక్కడి ఆఖరి రాజ్యమూ తెలుగు వారిదే. శ్రీలంక జనావాసములలో తెలుగు వారున్నారు. ‘వెంకటరంగమ్మ దేవిచివరి రాణి మరియు ఆమె భర్త విక్రమ రాజ సింహ చివరి రాజు. తమిళులు నేను చదివి తెలుసుకొన్నమేరకు కడుపు చేత పట్టుకొని ఉపాధికి తరలివచ్చినవారే కానీ ఇచట రాజ్యములనేలలేదు.

బృహత్ కథ వ్రాసిన గుణాఢ్యుడు తెలుగు వాడనీ, మెదక్ జిల్లాకు చెందిన కొండాపూర్ లో వ్రాసినాడన్నది జనవాక్యం. ఇందు వాస్తవము కలదు. తెలుగు రాజయిన శాతవాహనుని ఆస్థానములో ఒక తెలుగు నాటికి చెందిన పండితుడు ఉండుట ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు.

ఈ ఆంధ్రకవి గుణాఢ్యుడు వ్రాసిన గాథా సంపుటి బృహత్కథ. ఆ బృహత్కథలో ఆంధ్రులు సింహళ రాజధానితో బాగా వర్తక సంబంధాలు కలిగి ఉన్నట్లు స్పష్టమౌతున్నది. నాటి ఆంధ్రుల ఓడరేవయిన తామ్రపర్ణి రేవులో శ్రీలంక ఓడలు దిగేవట. సింహళం నుండి లవంగపు చెట్టు యొక్క పట్ట (దాల్చీనీ), కొబ్బరి, లవంగాలు, కర్పూరము, లక్క, మిరియాలు, పచ్చ రత్నాలు దిగుమతి అయితే ఆంధ్రులు బంగారము, రంగులు, పోకలు, యాలకలు, లోహపుసామానులు, వస్త్రాలు శిల్పకళకు వలయు సామానులు సింహళానికి ఎగుమతి చేసేవారు. ఆ కాలములో ఆంధ్రులూ సింహళలూ బౌద్ధులు. ఆంధ్రుడైన శ్రీనాగార్జున బోధి సత్వుడు బౌద్ధము లోని మహాయాన శాఖకు ఆద్యుడు. నాగార్జునుడు సింహళంలో కొంతకాలం నివసించి మహాయానమును వ్యాపింపజేసినాడని  తెలియవస్తూ ఉన్నది. ఆ విధముగా ఆతని మహాయాన శాఖ సింహళమున అత్యధికముగా వ్యాపించింది. ఈ విషయమును గమనించండి. ధాన్యకటకం లోనూ, ఇక్ష్వాకులు రాజధాని అయిన నాగార్జున కొండ అనబడు విజయపురి లోనూ, సింహళుల సంఘారామాలు ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. సింహళము నందలి స్తూపములు, ఆంధ్రుల స్తూపములూ ఒకే రూపంలో ఉన్నవి. పవిత్రమైన బుద్ధుని దంతము ఆంధ్రదేశంనుండియే సింహళము వెళ్ళినది.

సింహళ దేశంలో ప్రాచీన శిల్పం జాగ్రత్తగా గమనిస్తే, సింహళ మహారాజులు అప్పటికే ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శిల్పులను సింహళం తీసుకువెళ్ళి ఉంటారని తెలుసుకొనవచ్చును. పల్లవభోగంలో (పల్నాడు) దొరికే పాలరాయి గంధపు చెక్కపై శిల్పం మలచినట్లు మలచుటకు అనువైన మెత్తనిరాయి. అలాంటిరాయి సింహళంలో దొరకలేదు. ఆంధ్రదేశంనుండి ఆరాయిని కొనిపోవడం కష్టం. కాబట్టి ఆంధ్రదేశము నుండి వెళ్ళిన శిల్పులు అలాంటి రాయిని సింహళంలో వెదికినారు. సింహళం రాజధాని అయిన అనూరాధాపురం చుట్టు నల్లరాయి కావలసినంత ఉంది. అయినా ఆ శిల్పులు దానితో శిల్పం మలచడానికి ఇష్టంలేక పల్నాటిరాయిని పోలిన ఒక విధమైన పటికపు రాయిని అనూరాధాపురానికి కొదిమైళ్ళ దూరంలో కనిపెట్టి ఆరాతిని విరివిగా వారి శిల్పానికి ఉపయోగించినారు. అనురాధాపురంలో దర్శనమిచ్చే ప్రాచీన బుద్ధ విగ్రహాలన్నీ ధాన్యకటకాది ఆంధ్రబౌద్ధ శిల్ప క్షేత్రాలలో దొరికే బుద్ధవిగ్రహాలకు ప్రతిరూపాలు.

చోళులు క్రీ.శ.16వ శతాబ్దములో అనూరాధాపురం నాశనం చేసి ‘పాలనారువా’లో రాజ్యం స్థాపించినారు. వారు నిర్మించిన దేవాలయమూ, శిల్పములూ అచ్చట  ఇంకా ఉన్నాయి. మధ్యయుగంలో చివర సింహళానికి స్కంధపురం రాజధాని. ‘కంది కోట’ అని కూడా దీనిని పిలిచేవారు. బహుశ కడపజిల్లా జమ్మలమడుగు తాలూకాలిని ‘గండికోట’కు దీనికి సంబంధము కూడా ఉండియుండవచ్చు. గండికోటను పాలించినది కూడా నాయక రాజులే! మీర్ జుమ్లా గోల్కొండ నవాబు తరఫున యుద్దముచేసి మోసముతో ముఖ్యమైన నాయకులను మట్టుపెట్టిన తరువాత, వారు దక్షిణమునకు వలసపోయినారని చరిత్ర చెబుతూవున్నది. అట్లు వెళ్ళిన వారు ఏ తిరునెల్వేలి ప్రాంతములోనో ఏకత్రితులయి శ్రీలంకకు సైనికాధికారులుగా సైనికులుగా వలసపోయి ఉండవచ్చును. తామున్న ఆప్రాంతమునకు తమ ప్రాంతీయాభిమానముచే ఆపేరు పెట్టుకొని యుండవచ్చును. ఆనగరానికి నేటిపేరు క్యాండి. ఆరాజులు దండెత్తివచ్చి పోర్చుగీసువారితో యుద్ధాలు చేసేటప్పుడు తంజపురి ఆంధ్రనాయక రాజులూ, మధుర ఆంధ్రనాయకులు శ్రీ లంక రాజులకు సహాయం చేసినారు. చివర సింహళరాజులు, ఇల్లటం వెళ్ళిన మధుర ఆంధ్ర నాయకరాజ వంశంవారు. వారు తీసుకొనివెళ్ళిన, నృత్యశిల్ప, చిత్రలేఖన సంప్రదాయాలు ఇంకా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారి సింఘాలీ భాష పాలిభాష జన్యము. పాళీ ప్రాకృత భాషాజన్యము. తెలుగు కూడా ప్రాకృత జన్యమే! ఆ విధముగా తెలుగునకు, లిపి మరియు భాష, సింహళ భాషకు కొంత సారూప్యము కలదు. మరి ఆంద్ర రాజులు ఎందఱో ఆ దేశమును ఏలినారు కదా!

కాండీ నగరంలో, ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన  బౌద్ధ ప్రార్థనా స్థలాలలో ఒకటైన శ్రీ దళాద మలిగావా ఉంది. దీనిని1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

శ్రీలంక దేశంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతములను ప్రధానముగా తెలుగు రాజులు పాలించినారు. అనేకులగు తెలుగు అధిపతులు, సైనిక మరియు ఇతర సిబ్బందిని హిందూ దేశ దక్షిణ ప్రాంతము నుండి ఈ ద్వీపానికి తీసుకువచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ వారు సాధించిన విజయాల గురించి ఎటువంటి ఆధారములూ  ఇప్పటివరకూ అందుబాటులోనికి రాలేదు. అయితే, ముఖ్యంగా కీర్తి శ్రీ రాజాసింహ (రాజా సింఘే)  హయాము నుండి విలువైన సమాచారాన్ని పొందగలుగుచున్నాము. .          

ఈ విషయంపై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కీర్తి శ్రీ రాజాసింహ విజయ  రాజవంశములోని చివరి రాజు. రాణి విజయనగర రాజుల వంశం నుండి వచ్చింది. కీర్తి శ్రీ రాజాసింహ (1747-1780) జాతీయ అధోకరణం మరియు క్షీణత యొక్క ఆటుపోట్లను అడ్డుకున్నారు మరియు మతపరమైన పునరుద్ధరణను కూడా తీసుకువచ్చినారు. స్వయంగా పండితుడైన అతని సోదరుడు, రాజాధి రాజ సింహ, కీర్తి శ్రీ వారసుడు, మరియు అతని కాలంలో ఉన్నత స్థాయి కాకపోయినా సాహిత్య ప్రభంజనం ఉంది మరియు అతని పాలన 1798 వరకు కొనసాగింది. అతని వారసుడు శ్రీ విక్రమ రాజ సింహ (1798- 1815).  దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన రాజవంశంలో చివరిది ఈ రాజవంశము. బ్రిటీష్ వారు రాజు మరియు అతని రాణిని పట్టుకుని తంజావూరుకు బహిష్కరించారు. కండీ చివరి రాజు ప్రత్యక్ష వారసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నరసింగరావుపేటలో నివసిస్తున్నట్లు సమాచారము.

మిగిలినది మరొకమారు .................

శ్రీలంకలో ఆంధ్రులు- 2వ భాగము

 

తెలుగు రాజుల పాలనలో తెలుగు కళలు మరియు సంస్కృతి విలసిల్లినప్పటికీ, వారి పాలన కాలమున కల్లోలముల కారణంగా వారి పరిపాలన గుర్తింపదగ్గ ముద్ర వేయలేకపోయిందేమో! ఈ కాలంలో శ్రీలంకకు వలస వచ్చిన తెలుగు ప్రజలు ఎక్కువగా భారతదేశంలోని దక్షిణ జిల్లాలైన తంజావూరు, సేలం, మదురై మొదలైన ప్రాంతాల నుండి వచ్చినారు. అపుడు తెలుగు నాయక రాజుల పరిపాలన ఉండినది.

కాలక్రమేణా మరియు అధికారాలలో మార్పులతో, శ్రీలంకలోని తెలుగు శ్రామికులు, తమిళులతోనూ ఉన్నత వర్గము వారు సాహిత్యపరంగా కొంతవరకు, ప్రధానంగా క్యాండీ మరియు అనురాధపురలోని సింహళీయ సమాజంతో కలిసిపోయినారు. అయితే, వారిలో చాలా కొద్ది మంది మాత్రమే దూరంగా ఉంటూ తమ వాణిజ్య మరియు వృత్తిపరమైన కార్యకలాపాలను చిన్న స్థాయిలో, ఎక్కువగా కొలంబో, క్యాండీ, ఉత్తర మరియు తూర్పు ప్రావిన్షియల్ పట్టణాలలో, కొనసాగించినారు.

ఇచ్చటి తెలుగు సమాజం అసమానతలు తమ మధ్య ఉన్నప్పటికీ, మనుగడ కోసం పోరాడి, నేటికీ క్యాండీ, జాఫ్నా, బట్టికలోవా వంటి కొన్ని ప్రాంతాలలో, వారు పరిమిత స్థాయిలో తమ గుర్తింపును నిలుపుకున్నారని గమనించడం హర్షణీయం. వ్యాపారం మరియు తక్కువ ఆదాయ వృత్తులలో వారి కార్యకలాపాలను కొనసాగిస్తునే ఉన్నారు.          

శ్రీలంక యొక్క ప్రస్తుత పతాకము శ్రీ విక్రమ రాజసింహ యొక్క రాజచిహ్నమును  కలిగియుంది అని పైన చెప్పుకొన్నాము. సెప్టెంబరు 1945లో ఈపతాకమును శ్రీలంక జాతీకేతనముగా స్వీకరించాలని స్టేట్ కౌన్సిల్‌కు చేసిన ప్రసంగంలో ప్రతిపాదించబడింది, ఇపుడదియే అనుసరించబడుచున్నది.

కాండీ సరస్సు , కాండీలోని భవనమునకు ఎదురుగా ఉన్న ఒక కృత్రిమ సరస్సు, శ్రీ విక్రమ రాజసింహ చేత ప్రారంభించబడింది.

శ్రీ దళా మాలిగావా యొక్క పత్తిరిప్పువా లేదా అష్టభుజి, క్యాండియన్ సింహళీ వాస్తుశిల్ప సారము అనదగ్గ ఈచిహ్నమును సృష్టించుటయేగాక దీనిని దీనికి శ్రీలంక ప్రాతినిధిగా గుర్తించబడినది. దీనిని క్రీ.శ. 1802లో రాజు శ్రీ విక్రమ రాజసింహ సూచనల మేరకు శిల్పకళా పారంగతుడు మరియు ప్రధాన రాజ శిల్పి యగు దేవేంద్ర మూలాచారి నిర్మించినారు.

శ్రీ విక్రమ రాజసింహ వేలూరు కోటలో రాజ ఖైదీగా ఉన్న సమయంలో, అతను అతి తక్కువ రాజ భరణమును అందుకొనేవాడు., అతని వారసులు భరణమును  1965 వరకు శ్రీలంక ప్రభుత్వం నుండి పొందుతూనే ఉన్నారు. ముత్తు మండపం అనేది చివరి దక్షిణ భారతదేశం అయిన శ్రీ విక్రమ రాజసింహ సమాధి చుట్టూ నిర్మించిన స్మారక చిహ్నం. కాండీ యొక్క మూల పాలకుడు. పాలార్ నది ఒడ్డున ఉన్న ఇది వెల్లూరు పట్టణానికి ఉత్తరాన కేవలం ఒక కి.మీ. దూరములో ఉన్నది.

శ్రీ విక్రమ రాజసింహ పాలనలో, తానూ తెలుగువాడయ్యును,కాండీలో తమిళమును ఆస్థాన భాషలలో ఒకటిగా నియమించబడినది - ఇది శ్రీలంక యొక్క ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన ఒక చారిత్రక వాస్తవం.

2018లో, రాజు శ్రీ విక్రమ రాజసింహ నిజ జీవిత కథను వర్ణించే గిరివస్సిపుర అనే సింహళ చిత్రం నిర్మించబడింది మరియు విడుదల చేయబడింది. [15]

శ్రీలంకలో అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యధిక రాబడి కలిగిన ఆలయం శ్రీదళాద మాలిగావా. దీనికి కారణం ఆ ఆలయంలో బుద్ధుడి దంతం భద్రపరచి ఉండడమే. ఆ ఆలయం గోడల మీద ఉన్న రాకుమారి హేమమాలి, ఆమె భర్త దంతకుమారుడి నిలువెత్తు పెయింటింగ్ ఆకట్టుకుంటుంది; హేమమాలి– కళింగరాజు గుహసివ కుమార్తె. క్రీస్తుశకం మూడో శతాబ్దినాటి మాట.. పాళిగ్రంథం దలద వంశం ఈ కథనంతా వివరంగా తెలియజేస్తోంది. బుద్ధుడి నిర్యాణం తరవాత ఆయన ఎడమ వైపు దంతాన్ని ఖీమథెరా అనే భిక్షువు సేకరించి, దాన్ని కళింగరాజు బ్రహ్మదత్తుడికి బహుమతిగా అందజేసినాడు. బుద్ధుడి దంతానికి గౌరవంగా ఆ రాజు స్థూపాన్ని నిర్మించగా ఆప్రాంతము క్రమముగా దంతపురిగా మారినదని చారిత్రక కథనాలు తెలియజేస్తున్నాయి. దంతపురం ఎక్కడ అనేదానిపై అనేక పరిశోధనలు జరిగినాయి. మన పురాతత్వవేత్తలు నేటి శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస సమీపంలోని దంతపురమే అదని రూఢి చేసినారు. శిథిలావస్థలో ఉన్న కోట గోడలను ఈనాటికీ అక్కడ చూడవచ్చు.

మిగిలినది మరొకమారు .........

శ్రీలంకలో ఆంధ్రులు- (౩వ) చివరి భాగము

ఆ దంతమును కలిగిన వ్యక్తి ఆ దేశమును దంతము తనవద్దనున్నంతకాలము రాజ్యము ఏలుతాడన్న ఒక నమ్మకము ఉండేది. అందువల్ల ఆ దంతం కోసం రాజుల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. దంతాన్ని రక్షించేందుకు గుహశివుడు ఓ పథకం యోచించించి తన కూతురు, అల్లుడికి దానిని అప్పగించినాడు. హేమమాలి తండ్రి ఆదేశం మేరకు దంతాన్ని తన కొప్పులో దాచుకుని, భర్తతో పాటు అతి సామాన్యుల్లా వేషం వేసుకుని శత్రువుల బారిన పడకుండా నౌకలో శ్రీలంకకు చేరుకుంటారు. దంతము శత్రువులనుంది కాపాడుకొంటూ చివరకు క్యాండి లో శ్రీదళాద మాలిగావా చేరుకొంటుంది.

క్యాండీని పరిపాలించిన ఆఖరు ప్రభువుల్ని ‘వడగర్లు’ అని పిలిచేవారట. అంటే ఉత్తరం నుండి వచ్చిన వాళ్లని అర్థము. వారు మధురై నాయక రాజవంశీయులు. వారి మాతృభాష తెలుగు. దాదాపు 200 ఏళ్ల పాటు వీరు క్యాండీని పరిపాలించారు. అప్పట్లో కండికోట అనేవారట. దీనికి కడప దగ్గరున్న గండికోట పేరుతో దగ్గర సంబంధం కన్పిస్తోంది. వెంకటరంగమ్మకి సావిత్రమ్మ అని మరో పేరూ ఉందట. అలాగే సింహాసనం అధిష్టించక ముందు విక్రమ రాజసింహ పేరు కన్నస్వామి నాయకుడు. క్యాండీని పరిపాలించిన సింహళ రాజులు తంజావూరు, మధురై రాకుమార్తెలను వివాహం చేసుకునే ఆచారాన్ని పాటించేవారట.

సింహళ రాజు నరేంద్ర శింహుడు పిల్లలు లేకుండానే మరణించుటచే ఆ రాజు పట్టపు రాణి తమ్ముడు విజయ రాజ సింహ, చక్రవర్తిగా రాజ్యాన్ని చేపట్టినాడు. అలా క్యాండీ 1739లో మధురై నాయక రాజుల పరిపాలనలోకి వచ్చింది. విజయరాజ సింహ తరవాత అధికారంలోకి వచ్చిన కీర్తిశ్రీ రాజసింహ క్యాండీలోని కోటను, శ్రీ దళాద మాలిగావా గర్భగుడిని నిర్మించినాడు. తన 35 ఏళ్ల పాలనలో కీర్తిశ్రీ డచ్ కోటల మీద దండయాత్ర చేసి క్యాండీ రాజ్యాన్ని ఎంతో పటిష్టం చేసినాడు. గుర్రపుస్వారీ చేస్తూ కింద పడి కీర్తిశ్రీ 1782లో మరణించినాడు. ఆ తరవాత కూడా మరో ఇద్దరు నాయక వంశస్థులు క్యాండీని పరిపాలించినారు. 1815లో ఈ కోటను ‘క్యాండీ కన్వెన్షన్’ ప్రకారం బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు.

రాజు విక్రమరాజ సింహను, రాణి వెంకటరంగమ్మను కొంతకాలం కొలంబోలో బందీలుగా ఉంచి, ఆ తరవాత నేటి తమిళనాడులోని రాయవెల్లూరుకు తరలించినారు. మార్గమధ్యంలోనే రాణి ప్రాణాలు కోల్పోయింది అని చెబుతారు. రాజు రాయ వెల్లూరు కోటలో బందీగా ఉంటూ అక్కడే ప్రాణాలు విడిచినాడు. వారి సమాధులు నేటికీ అక్కడ ఉన్నాయి. క్యాండీలో నేటికీ తెలుగు జాతి ఘన చరిత్ర పదిలంగా ఉంది. ఆ విషయం మన దాకా చేరకపోవడమే శోచనీయం.

శ్రీలంకలో తొలి రాజ్యాన్ని స్థాపించిన వాడు విజయుడు. క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందినవాడు. అతడు నిర్మించిందే అనురాధపుర. శ్రీలంక ప్రాచీన రాజధాని నగరం అది. ఆ విజయుడు కళింగానికి అంటే నేటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింగపురం వాడని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ ఊరు పేరు మీదే సింహళ జాతి పేరు కూడా ఏర్పడిందని అంటారు. ఇప్పుడు ఆ దేశంలో కళింగ అనగానే ఒరిస్సా అంటారు కానీ, ఒకప్పుడు కళింగ అంటే మూడు భాగాలు.. ఉత్తర కళింగము, మధ్య కళింగము, కళింగము. ఉత్తర కళింగమే నేటి ఒరిస్సా. గంజాం నుంచి గోదావరి వరకూ ఉన్న ప్రాంతమంతా మిగతా రెండు భాగాలు.

శ్రీలంకలోని నాగారీకులలోనూ  తెలుగు వారు గోప్పసంఖ్యలో అనురాధపురా,

సీగిరి (సీ గిరి అనగా. శ్రీ పర్వతం అనగా మనకు నాగార్జునకొండ వలె), డంబుల్లా లాంటి పర్యాటక పర్యాటక  ప్రదేశాలలో పాముల్ని, కోతుల్ని ఆడిస్తూ కొందరు కన్పిస్తారు. ఆడవాళ్లు చేయి చూసి జోస్యం చెబుతుంటారు. వీళ్లందరి మాతృభాష తెలుగే. వీరిని, అహికుంటికలు {పాములనాడించేవారు} రామకుళవరలు ( కోతుల నాడించేవారు) వాగైలు(సోది చెప్పేవారు}అని అంటారు. పదివేల మంది దాకా వీరి జనాభా ఉంది. వీళ్లు ‘తెలుంగు జాతి’, ‘మన జాతి’ అని చెప్పుకుంటారు. దీవరగమ్మ, కుడాగమా, పుత్తళం, చీమలగస్స తదితర ప్రాంతాల్లో వీరి గ్రామాలు కన్పిస్తాయి. కన్పించిన ప్రతి చోటా వీళ్ల దగ్గరికి వెళ్లి ‘మీరు తెలుగా’ అంటే వెంటనే ‘అవు అక్కా’ అని బంధుత్వాన్ని కలుపుకున్నారు. లచ్చిమి, వెంకటక్క, సరోజ, మసక్క, మసన్న, సుబ్బడు, ఎర్రన్న, సోము.. ఇలా ఉన్నాయి వాళ్ల పేర్లు. పాములోళ్లు ‘తేబల’, ‘దుగుడీ’ తెగల వాళ్లు. ఉపతెగలూ లేకపోలేదు. కోతులోళ్లలో ‘పసుపులేటి’, ‘పాయసం’ లాంటి ఇంటి పేర్లు ఉన్నాయి. ఈ ఇంటి పేరున్న వాళ్లు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో కన్పిస్తారు. కానీ పాములోళ్ల ఇంటి పేర్లున్న వాళ్లు భారత నేలల్లో కన్పించడం లేదు. అలాగే వాళ్ల భాషలో మన మూడు మాండలిక పదాలు కన్పించడం విశేషం. అంటే వాళ్లు అక్కడి మూల జాతుల వాళ్లని చెప్పొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు తీర్మానించినారు. పంతొమ్మిది వందల అరవైల నుంచే వీళ్లు గ్రామాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటున్నారు. వీళ్ల కోసం ప్రత్యేక స్మశానాలు లేకపోవడంతో బౌద్ధానికో, క్రిస్టియానిటీకో మారుతున్నారు. మరణానికి భయపడి మతం మారడం ఎంతో శోచనీయం. కాలక్రమేణ ఈ తెగలు కూడా కనుమరుగైపోతాయి. telugu పైన, తెలుగువారిపైన, మన ధర్మమూ పైన మనవారికి మక్కువ తక్కువ. పోతే పోనీలే అన్న వ్యర్థ వేదాంతులు మనవారు.

బ్రిటీష్ వారి హయాంలో తేయాకు తోటల్లో కూలిపనుల కోసం వెళ్లిన తెలుగువాళ్లూ శ్రీలంకలో ఎక్కువే. నేడు వీరి జనాభా ఎనిమిదిన్నర లక్షల వరకు ఉంటుంది. మా భాషకు గుర్తింపు లేకుండా పోయిందని, మమ్ము పట్టించుకొనేవారు లేరని  కొలంబోలో ఉన్న తెలుగు జాతీయులు వాపోతున్నారు. ఇక్కడ ‘తెలుంగు నగర్’, ‘అల్లంపల్లి’ లాంటి తెలుగు ఊర్లు కన్పిస్తాయి. కొలంబోలో ఒకప్పుడు తెలుగు మాతృభాషగా గల వడ్డర్లు మూడులక్షల మంది ఉండేవారట. అంతా చెల్లాచెదరైపోయారు. ‘అఖిల శ్రీలంక తెలుగు కాంగ్రెస్’ పేరున ఓ రాజకీయపార్టీ కూడా ఉంది. వీళ్లు కోరుతున్నది ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలంబోలో తెలుగు వారి కోసం ఓ ఆడిటోరియం కట్టించి తెలుగు అభివృద్ధికి తోడ్పడాలని. ఇటీవల టూరిస్టులుగా ఆ దేశం వెళ్లిన తెలుగువాళ్లని పలుకరించడానికి పాములోళ్లు వెళితే, వీరిని చూసి అడుక్కునేవాళ్లుగా భావించి ఈసడించుకున్నారట. ‘మేమూ మీ తోబుట్టువులమే అని భావించండి. మా వేషభాషలని చూసి దూరం చేసుకోకండి’ అని వాళ్లు కోరుతున్నారు. మన బాగుకే గతి లేదు వారి బాగు మనమేమి చూస్తాము.మన వారిది ఎంత హీన స్వభావమో అర్థము చేసుకోండి.

నేడు రాజకీయంగా గిరి గీసుకున్న రెండు రాష్ట్రాలలోనే కాదు, అనాదిగా వింధ్య దిగువన నుండి శ్రీలంక వరకూ అనేక ప్రాంతాల్లో మన తెలుగువాళ్లు ఉన్నారు. ఆమాటకొస్తే బీహారు ఒరిస్సా, గుజరాత్, మరాట్వాడా ఉత్తర ప్రదేశ్ లలో కూడా మనవారున్నారు, ఇప్పటికీ మన ఉగాది లాంటి పండుగలను అనుసరించుతారు. వాళ్ల తెలుగు మనలా ఉండకపోవచ్చు అంతాత్రాన మనము అధికులమూ కాదు వారు అధములూ కాదు.  ఆమాటకొస్తే వారిలో కొందరు నేటికీ, మనకు చేతకాని, తెలియని గ్రాంధికమైన తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. రాకపోకలు లేని కారణంగా వాళ్ల భాష 16వ శతాబ్ది దగ్గరో, 18వ శతాబ్ది దగ్గరో ఆగిపోయి ఉండవచ్చు. ఆ మాత్రాన వాళ్లు మన అన్నదమ్ములు కాకపోరు. దేశమేదైనా, రాష్ట్రమేదైనా, ప్రాంతమేదైనా, వృత్తులేవైనా తెలుగు మాతృభాషగా ఉన్నవాళ్లందరం ఒక్కటే అన్నది గుర్తుంచుకుందాం.

మన తెలుగు తల్లికి నమస్కారము.

స్వస్తి.

Sudhakar Yv
You are really a walking encyclopaedia that too you are from Banking industry 🙏

No comments:

Post a Comment