Saturday, 25 December 2021

మహాభారతములో యుయుత్సుడు

 

 

మహాభారతములో యుయుత్సుడు

https://cherukurammohan.blogspot.com/2021/12/blog-post_25.html

యుయుత్సుడు మహాభారతంలోని ప్రముఖ పాత్రలలో ఒకడు. యీతడు ధృతరాష్ట్రునికి 

వైశ్య వర్ణస్తురాలగు దాసీ కుమారుడు. ఇతను ధర్మపరుడు. మహాభారత యుద్ధపు 

ప్రారంభసమయమున. యుధిష్ఠిరుని పిలుపుతో, అతను కౌరవ సైన్యాన్ని విడిచిపెట్టి

పాండవ సైన్యంలో చేరి వారి తరపున పోరాడుతాడు.

గాంధారి గర్భమున నూరుమంది శిశువుల పిండము ఒకటిగా ఉండినది. గర్భవతిగా 

ఆపిందమును మోయుట బరువై తానూ సహజముగా అనుదినమూ చేసే పతిసేవ 

చేసుకోనలేక పోయినది. అందుచే అంధుడగు తన పతిసేవకొరకు,  ఆమె సేవ కోసం 

ఒక వైశ్య యువతిని దాసిగా ఉంచినది. ధృతరాష్ట్రుడు అట్టితరి  ఆమెకు చేరువ 

కావటము తటస్థించినది. తత్ఫలితముగా  యుయుత్సుడు ఆమెకు జన్మించినాడు. 

అతను ధృతరాష్ట్ర కుమారుడగుటచే దాసీ పుత్రుడైనా. విదురునికి రాచ గౌరవము 

లభించినట్లే, యుయుత్సుడికి కూడా రాచగౌరవము ఇవ్వబడినది.

యుయుత్సుడు కూడా అందుకు తగినట్లుగా, విద్యావంతుడు, బుద్దిమంతుడు మరియు 

అన్నివిధములా యోగ్యునిగా నిరూపించుకొన్నాడు. అతను ఏరోజూ  దుర్యోధనుని 

అనుచిత ప్రవర్తనను ఇష్టపడలేదు. సమయము వచ్చినపుడల్లా  ఆతనిని 

వ్యతిరేకించేవాడు. ఈ కారణంగా దుర్యోధనుడు మరియు అతని ఇతర సోదరులు 

అతనికి తగిన ప్రాముఖ్యత ఇవ్వలేదు, పైపెచ్చు, అతనిని ఎగతాళి చేసేవారు.

యుయుత్సుడు అకారణ అధర్మ మహాభారత యుద్ధమును ఆపుటకు తన స్థాయిలో 

ఎంతో కృషిచేసి విఫలుడైనాడు.

ఆంద్ర మాహా భాగవతము, ప్రహ్లాదచరిత్రమున ఈ దిగువన చెప్పినరీతిగా

అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.

లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు

మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరిక ఫలించదు

కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ 

మైనవి; పిసినిగొట్టు వాడికి సంపదపనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి 

సువాసనలు తెలియనే తెలియవు; అన్నచందమున, అమృతోపమానములగు ఆయన 

మాటలు దుర్యోధనాదుల చెవికెక్కలేదు.

 మహాభారత యుద్ధము ప్రారంభం కానున్న సమయంలో యుయుత్సుడు కూడా 

దుర్యోధనుడి పక్షాన పోరాడేందుకు రంగములోనికి దిగినాడు. కానీ, అదే సమయంలో

యుద్ధం ప్రారంభానికి ముందు, ధర్మతత్పరుడగుయుధిష్ఠిరుడు తనపై నేరము 

ఉంచుకొనకుండా, కౌరవ సైన్యమును ఉద్దేశ్యించుతూ, ఇలా ప్రకటించినాడు - "నాది 

ధర్మపక్షము. ధర్మము కోసం పోరాడాలనుకునే వారు ఇప్పటికీ నా వైపు రావచ్చు. నేను 

అట్టివారికి స్వాగతము పలుకుతాను." ఈ ప్రకటన విని యుయుత్సుడు మాత్రమే కౌరవ 

పక్షం నుండి బయటకు వచ్చి పాండవుల పక్షంలో చేరినాడు. యుధిష్ఠిరుడు ఆతనిని 

ప్రియమార కౌగిలించుకొని స్వాగతము పలికినాడు. కౌరవులు అతన్ని వైశ్యస్త్రీ కొడుకు 

అనీ పిరికివాడు అనీ గేలిచేసినా అతను తన నిర్ణయమును మార్చుకోలేదు.

 

ఇక్కడ ఒక్కమాట యుధిష్ఠిరుని గొప్పదనమును గూర్చి చెప్పవలసియున్నది.

ధృతరాష్ట్ర పుత్రుడయ్యును పాండవ పక్షమున నిలచినది యుయుత్సుడొక్కడే!

అందుచేత ఆతనిని తమతోబాటూ యుద్ధము చేయించ నిచ్చగించినచో ఆతను టా 

అన్నదమ్ములనే చంపవలసిరావచ్చును లేకుంటే వారి చేతిలో తాను మరనిచవచ్చును. 

ధృతరాష్ట్రుని ఏకైక వారసునిగా ఆతనిని నిలుపుటకుగానూ ఈవిధముగా చేసిన 

ధర్మనిష్ఠాగరిష్ఠుడు.

ధర్మజుడు ఆతనిని, యోధుల కోసం ఆయుధాలు మరియు రవాణా సరఫరాలను 

చూసేందుకు నియమించినాడు. అతను చాలా బాధ్యతాయుతంగా ఈ బాధ్యతను 

నిర్వర్తించినాడు. యుద్ధము తర్వాత కూడా అతని పాత్ర ముఖ్యమైనది. మహారాజగు 

యుధిష్ఠిరుడు అతన్ని మంత్రిగా చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడి కోసం విదురుడు 

పోషించిన పాత్ర, యుధిష్ఠరుడి కోసం యుయుత్సుడు పోషించినాడు. ఇది మాత్రమే 

కాదు, యుధిష్ఠిరుడు స్వర్గారోహణ నిర్ణయము తీసుకోన్నప్పుడు, పరీక్షిత్తును రాజుగా 

చేసి, యుయుత్సుని ఆతనికి సంరక్షకునిగా చేసినాడు. యుయుత్సుడు కూడా తన 

జీవితపు చివరి క్షణం వరకు ఈ బాధ్యతను పూర్తి భక్తితో మరియు అంకితభావంతో 

నిర్వహించినాడు.

ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలలో మరియు రాజస్థాన్‌లోని తూర్పు 

ప్రాంతాలలో నివసించే జాట్ ప్రజలు తాము ఆ  మహాత్ముడగు యుయుత్సుని 

వారసులుగా నమ్ముతారు.

స్వస్తి.

Friday, 24 December 2021

శకుని (వ్యాస భారతము లోని శకునిని గూర్చి తెలుసుకోండి)

వారము రోజుల ప్రయత్నము ఈ శకుని వ్యాసము. తెలిసినంతవరకూ తెలియబరచినాను. యువకులు చదివి తెలుసుకొనగలిగితే నా ప్రయత్నము సఫలమైనట్లే. యువతుల కక్కరలేదా అంటారేమో. వాళ్ళే కాబోయే తల్లులు. తప్పక చదివి తీరవలసినవారు . ఇక పెద్దలు తమ పిల్లలతో చదివింప జేసి మన ఇతిహాసమును భవితకందిస్తారని ఆశిస్తాను.

  శకుని

https://cherukurammohan.blogspot.com/2021/12/blog-post_24.html

గాంధార రాజ్యము మహాభారత కాలములో భారత దేశమునకు పశ్చిమమున వున్న రాజ్యము. పుష్కలావతి ,తక్షశిల,పురుషపురములు ఇందలి ముఖ్య పట్టణములు. శ్రీరామ చంద్రుని తమ్ముడు భరతుడు ఈ భూభాగామునేలినట్లు ఐతిహ్యము. మహాభారత కాలానికి సుబలుడు గాంధార రాజు. ఆయనకు అచల,వృక్షక, వృహద్వల, సౌబల అన్న కొడుకులుంటారు. సౌబలుడే శకుని అని పెద్దలనగా విన్నాను. గాంధారి పెద్దది. శకుని అందరికన్నా చిన్నవాడు.

మహాభారత సమయములో, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయవలెననుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది. కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.

ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ములు చిత్రాంగద  విచిత్రవీర్యులకు ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండవచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చితి’నని బంధువుల మధ్య ప్రకటించినాడు. గాంధారి ఆ మాట విని తండ్రి మాటపై గౌరవముతో ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేయుటతో గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది. చక్రవర్తుల సంబంధమగుటచే శకుని హస్తినలోనే నిలిచి పోయెను. ఇంకొక విషయము ఇక్కడ వున్నది . శకుని గాంధారికన్నా చాల చిన్నవాడు. తోడుగా ఉండుటకు కూడా వుండిపోయి ఉండవచ్చును.

ఇక్కడ ఒకచిన్న ప్రస్తాపన. గాంధార రాజైన సుబలుడు ఆస్థాన జ్యోతిష్యులతో తన కుమార్తెకు పెళ్ళయిన తక్షణమే వైద్యము వచ్చునని ఎరిగినవాడై ముందామెను ఒక మేకపోతుకు కట్టి దాని చంపినపిమ్మట ధృతరాష్ట్రునికిచ్చి పెళ్ళిచేసెనని ప్రతీతి. కౌరవ పాండవులు బాల్యమందు మాత్సర్యముచే కౌరవులు 'రండా పుత్రు' లని తిడితే పాండవులు వారిని 'ముండాపుత్రు'లన్నారనీ ఆ కోపముతో వయసు వచ్చిన తరువాత దుర్యోధనుడు గాంధారము పై యుద్ధము ప్రకటించి సుబలుని అతని కుమారులందరినీ చెరసాలలోబంధిస్తే, వారికి వేసే తిండి మెతుకులు అన్నీ కలిపి శకునికి పెట్టి వారు మరణిచినారనీ సుబలుడు చనిపోతూ తన వెన్నెముక లోని ఎముకలతో పాచికలు తయారుచేసుకొని శకునిని వుంచుకొమ్మన్నాడని, దుర్యోధనుని వినాశము కోరినవాడై ఆ పాచికలతో ధర్మరాజును ఓడించి ఆ తరువాత వచ్చే యుద్ధములో దుర్యోధనుని పాండవులు మట్టుపెడతారని ఊహించియే అట్లు చేసినాడని ఒక ప్రచారముంది. దీని మూలములు భారతము నందు కనిపించవు. పైగా సుబలుడు తన పరివారముతో రాజసూయమునకు వచ్చినాడని, యాగము ముగిసిన తరువాత గౌరవంగా అతనిని ధర్మజుడు సాగానంపినాడని భారతమున కలదు. భారత యుద్ధములో సుబలుని వారసులు కౌరవుల పక్షమున పోరాడినారని కూడా యున్నది.

శకుని జన్మనామము సౌబలుడని ముందే చెప్పుకొన్నాము. ఇది కూడా సుబలుని కుమారుడైనందువల్ల నేమో! శకుని గాంధారికన్నా బాగా చిన్నవాడు అని ముందుగానే చెప్పుకోన్నాము. దుర్యోధనునికన్నా బహు కొద్ది సంవత్సరములు పెద్దవాడు అయివుండవచ్చు. అందువల్లనే అతని సహవాసము దుర్యోధనునితో ఎక్కువ బావయైన ధృతరాష్ట్రునితో తక్కువ. బావను చేరి తన మాట వినిపించిన ఉదంతమేదియు భారతమున కానరాదు. సార్వభౌమత్వము పై కామము,తనను అది చేరనందువల్ల క్రోధము అదే సర్వస్వమన్న మోహము తో నున్న దుర్యోధనునకు, మదించిన దుశ్శాసనుడు,తాను పొందిన రాజ్యము దానినిచ్చిన సార్వభౌమునికి తానే సన్నిహితునిగా ఉండాలన్న లోభము కలిగిన కర్ణుడు,తనకు దక్కినస్థానము వేరెవరికీ దక్క కూడదనుకొన్న శకుని దుర్యోధనుని ఆవహించియుండగా అతనికి బంధ విముక్తి బొందె వదిలితేనే కదా. కావున అన్ని విధములైన కుతంత్రములలో మొదలు శకుని పిదప కర్ణుడు ఆపై తందానా తానాకు దుశ్శాసనుడు, చచ్చేవరకు అంటిపెట్టుకొనే ఉండిపొయినారు.

మయ సభలో జరిగిన అవమానమునకు ప్రతీకారముగా జూదమాడి తాను రాజ్యాన్ని సంపాదించి పెడుతానని శకుని దుర్యోధనునితో అంటాడు. సభా పర్వములోని 20,21,22 శ్లోకాలు ఏమితెలుపునంటే 'దుర్యోధనా! జూడమాడుటలో నాకు ఎవరూ సాటి రారు. మీ తండ్రిని ఒప్పించి ధర్మరాజుతో జూదమునకు ఏర్పాటు చేయి.ధర్మజుని రాజ్యలక్ష్మిని సంపూర్తి గా నీకు స్వాధీనమొనర్తు'నని శకుని ఒప్పించినాడు. ఇక్కడే మనకర్థమౌతుంది. శకునికి ధృతరాష్ట్రునివద్ద కానీ, మిగిలిన కురు వృద్ధ ,గురు వృధ్ధ బాంధవుల వద్ద కానీ ఎటువంటి పరపతీ లేదని. దుర్యోధనుడు అందరినీ ఒప్పించుటలో కృతకృత్యుడైనాడు. ఇక శకుని జూదములొ గెలుచుటయే ఆలస్యము.

ఆచార విధానాలు రెండు విధములు. ఒకటి శిష్ఠాచారము రెండవది వామాచారము. ధర్మరాజుది శిష్టాచారమైతే శకునిది వామాచారము. పాచికల విషయములో 'అక్షహృదయ'మను విద్య శిష్టాచారమునకు సంబంధించినదైతే 'పాశాధిష్ఠాత్రి' అనునది వామాచారమునకు సంబంధించిన విద్య. జూదమాడే సమయమునకు ధర్మ రాజుకు 'అక్షహృదయము' తెలియదు కానీ శకునికి 'పాశాధిష్ఠాత్రి' సమగ్రంగా తెలుసు. అందుకే అతను, దుర్యోధనుని చేత, మొదటి సారి మాత్రమే పందెము పెట్టించినాడు. తరువాత వరుస విజయములచేత పందెము పెట్టించే అవసరమే కలుగలేదు శకునికి. ( ఈ విషయమును బ్ర.శ్రీ.వే. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ద్వారా తెలుసుకొన్నది. ) ఇంతటి ఘాతుకమును తలపెట్టిన శకుని ప్రాణములను యుద్ధములో తీసెదనని ప్రతిన పూనుతాడు సహదేవుడు.

ధర్మజుడు ఈ అక్షహృదయమనే విద్యను అరణ్య వాసములో వున్నప్పుడు బృహదశ్వుడు అను మహర్షి అనుగ్రహముతో నేర్చుకొంటాడు కానీ ఆ తరువాత ఈ ఆట ఆడే అవసరము ధర్మరాజుకు ఏర్పడలేదు.

రాయభారము విఫలమగుటతో ఇరువైపులా యుద్ధమునకు సిద్ధమౌతారు. భీష్ముడు శరతల్పగతుడౌతాడు. ద్రోణుడు విగతుడౌతాడు కర్ణుడు సైన్యాధ్యక్షుడౌతాడు. 17వ రోజున యుద్ధము భీకరంగా జరుగుతూ వుంటుంది. ఆ మహాసంగ్రామములో సహదేవుడు శకునికి ఎదురౌతాడు .

శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లగా అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగుతాడు. అది చూసి కౌరవసేనలు పారి పోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు .సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించుతాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించఉతాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించుతాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచి వేస్తాడు. శకుని మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గదను, బల్లెమును ప్రయోగించూతాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలలల ఫలితం చూచితివి కదా! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని అంటూ సహదేవుడు శకుని రధాశ్వములను, కేతనమును, విల్లును ఖండించగా అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరుతాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించి వేస్తాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలిపోతుంది. మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించినాడు.ఆ విధంగా సహదేవుడు తన ప్రతిజ్ఞ నేరవేర్చుకొంటాడు.

స్వస్తి.

Tuesday, 21 December 2021

భారతీయ విశ్వశాస్త్రం మీద పాశ్చాత్యుల వ్యాఖ్యానాలు, అభిప్రాయములు

 

 

భారతీయ విశ్వశాస్త్రం మీద

పాశ్చాత్యుల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు

https://cherukurammohan.blogspot.com/2021/12/blog-post.html

భారతీయ విశ్వశాస్త్రం , సృష్టి జ్ఞానం మాహాద్బుత విషయాలుగా పాశ్చాత్యులు  పరిగణిస్తారు. ఆర్తర్ హోంస్, ఆలన్ వాట్స్, రోజర్ బెర్ట్ స్చౌసన్, డిక్ టెరిసీ, గయ్ సోర్మన్, కౌంట్ మౌరైస్ మేటర్లింక్, కార్ల్ సేగన్ వంటి మేధావులు, శాస్త్రవేత్తలు భారతీయ విశ్వశాస్త్రంపై అభిరుచి పెంచుకుని, అధ్యయనం చేసి, విషయాలను అవలోకనం చేసుకుని, తమదృక్పథాలను , అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించినారు.

ఆర్తర్ హోంస్ (1895 - 1965), డర్హాం విశ్వవిద్యాలయం ఆచార్యుడు, భూగోళజ్ఞుడు, తాను రచించిన "ది ఏజ్ అండ్ ఆర్ట్" (1913 లో) పుస్తకంలో  "పశ్చిమంలో వైజ్ఞానిక పరమగు దృక్పథము కలుగక పూర్వమే, హిందూ మేధావులు, ఆశ్చర్య పరిచే విషయాలు విశదీకరించి చెప్పుటయేకాక, అందులో భూమి వయస్సు, అనంత కాల పరిమాణములు , బ్రహ్మాండముమరియు  సృష్టి స్థితి, లయ గురించి కూలంకషంగా వివరించినారు " అని విడమరిచి చెప్పినారు.

ఆలన్ వాట్స్, సాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఏషియన్ స్టడీస్, అధ్యక్షుడు మరియు  ఆచార్యుడు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రీసర్చ్ ఫెలోగా మన వేదాంతాన్ని పశ్చిమానికి, చాటుతున్న మేటి. ఆయన  "సాపేక్షత" (Theory of Relativity) భారతీయ తత్వ-వేత్తలకి కొత్తేమీ కాదు. "సాపేక్ష సిద్ధాంతము" (Theory of Relativity)వారికి తెలిసికూడా  దానిని  ఆత్మసాధనకు  ఉపయోగించినారు కాని ఆటం బాంబులు తయారు చేయడానికి కాదు " అని నొక్కి చెప్పినారు.

రోజర్ బెర్ట్ స్చౌసెన్ భారతీయ విశ్వశాస్త్రం మీద తన దృక్పదాన్ని ప్రకటిస్తూ "హిందువులు ఈ జగత్తు యొక్క అపారమైన కాలమానాలు విశధీకరించినారు. Saint ఆగస్టైన్ ప్రకారం ప్రపంచం 5000బీ.సీ లో మొదలయ్యింది.ఈ వివరించిన కాలం భారతీయ కాలమానాలతో పోలిస్తే చలా తక్కువ. ఒక్క బ్రహ్మ రోజు

43, 20,000,000 యేళ్ళు; బ్రహ్మ ఆయుర్ధాయం 311040,00,00,00,000 యేళ్ళు అంటే 311 ట్రిలియన్ యేళ్ళు అనగా 3లక్షల 11వేల 40 కోట్ల సంవత్సరములు. ఇది అత్యంత  అసాధారణ విషయము.

ప్రముఖ రచయిత డిక్ టెరిసీ వైజ్ఞానిక, పరిజ్ఞానిక రంగాలలోఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వ్రాసినారు. అందులో "ది గాడ్ ప్రాక్టికల్", "ఇండియన్ కాస్మాలజిస్ట్స్" కూడా ఉన్నాయి. భారతీయ విశ్వశాస్త్రవేత్తల ఆవిష్కరణలను ఉదాహరిస్తూ, భూమి వయస్సు 4 బిలియన్ యేళ్ళ గా ఇచ్చిన వివరణ  నేటి అణు శాస్త్రానికి అనుగుణంగా ఉందని తెలిపినారు . భారతీయ అణు, పరమాణువుల పద్ధతులు, భారత దేశము నుండి పర్షియాకు ,పర్షియా నుండి నుండి పాశ్చాత్య దేశాలకు చేరింది ", అని విశ్లేషించినారు.

అమెరికాలోని స్టాంఫోర్డ్, హూవర్ ఇన్స్టిట్యూషన్ విచ్చేసే ఫ్రాన్స్ దేశ లిబరలిజం నాయకుడు, మేధావి, గై సోర్మన్ " భారతీయ విశ్వశాస్త్ర ప్రతిభ అసాధారణం " అన్న ఖితాబునిచ్చినారు.

1911 లో సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన బెల్జియం కవి కౌంట్ మౌరైస్ మేటర్లింక్ (1862 - 1949) తన పుస్తకం "మౌంటెన్ పాత్స్" లో భారతీయ విశ్వశాస్త్రములోని జగత్సృష్టి విషయాలు అత్యంత ప్రాచీన మైనవనీ, అత్యద్బుత సృష్టిని వర్ణిస్తూ, "ఇది ఏ యూరోపియన్ ఊహకు కూడా అందని విషయము’ అంటూ తన విస్మయమును వ్యక్తము చేసినారు. ఈ పుస్తకములో కర్మను గూర్చి వారు వ్రాసిన విశ్లేషణ చదివితీరవలసినదే!

ఈ విధంగా,  సృష్టి ,కాలము, విశ్వము  మొదలగు ఎన్నో విషయాలను  జగతికి చాటిన  మహాద్బుత మేధావులు. ప్రముఖ విశ్వశాస్త్రవేత్త, అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం ఖగోళ శాస్త్ర ఆచార్యుడు కార్ల్ ఎడ్వర్డ్ సేగన్, భారతీయ విశ్వశాస్త్రాన్ని కొనియాడుతూ " వారి గణితం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఆ కాలంలోనే వారు భూమి వయస్సు, ఈ జగత్తు కాలమానం, దాని అనంత కాల పరిమాణాన్ని విశిదీకరించి చెప్పారు. నేడు ఉపగ్రహాలు పంపి, పరిశోధను చేసి ఈ కాలమానాలనే ద్రువీకరించారు. ఇట్టి అసాధారణ ప్రజ్ఞ, జ్ఞానం అలనాటి భారతీయ శాస్త్రవేత్తలలోసర్వసధారణం".

ఒక స్నేహితుడు ,నీ కుర్చీ టేబులు రేడియో టివి ఇలా ఎన్నో పాశ్చాత్యులు కనిపెట్టినారుకదా వారిని దూషించడ మెందుకు అని అడిగినాడు. బల్లలు కుర్చీలు మన వడ్రంగులు పీటలని బల్లలనీ ఆసనములనీ ఇంకా ఎంతో అందమైన విగ్రహాలని చెక్కి మన తరములకందించిన మహానుభావులు. జగదీశ్ చంద్రబోసు వేదశాస్త్రముల సహాయముతో రేడియో కనిపెడితే ఆ గౌరవము మార్కొనీకి దక్కించినారు పాశ్చాత్యులు. మ్క్యన విజ్ఞాన నిధియగు గ్రంధాలయమును ఒక చదువురాని మొరకు. చాపక్రింద నీరై సంస్కృతమున ఉన్న మన విజ్ఞానమునెల్ల దొంగిలించి మనకు సంస్కృతమే కాక సంస్కృతియే లేకుండా చేయుచున్నవారు పాశాత్యులు. ఈ వాస్తవము గమనిచండి  

ఒక క్రొత్త వస్తువు కనుగొంటే దానిమీద పరిశోధనచేసి ఇంకా ఇంకా క్రొత్త వస్తువులు తయారు చేస్తూనే వున్నారు కదా. తపన ఉత్సుకత ఉన్న మానవుడు ఎదో ఒక క్రొత్త అన్వేషణలో వుండనేవుంటాడు. విదేశీయులు మనపై దండయాత్ర చేయునంత వరకు మనది సంపూర్ణ నాగరికత. ఇప్పటికి మనపైన విజాతీయులు చూపే మాత్సర్యమును  గమనించుతూనేవున్నాముకదా!

ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధతl

క్షురస్య ధారా నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతిll

లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన మార్గం దుర్గమమైంది. అయితే సంకల్ప బలం ఉన్న హృదయానికి సంభవం కానిది ఏముంది?

ఈ కఠోపనిషత్తు వాక్యమును స్వామీ వివేకానంద ఎప్పుడూ గుర్తుచేసేవారు. మేల్కొనండి మన పూర్వులగొప్పదనమును గుర్తించండి, దానిని లోకానికి చాటండి.

స్వస్తి.